31, జులై 2010, శనివారం

ఏవి తల్లీ , నిరుడు కురిసిన హిమ సమూహములు ?


యెర్రి నా యెంకి

‘ యెనక జన్మము లోన
యెవరమో’ నంటి !
సిగ్గొచ్చి నవ్వింది
సిలక - నా యెంకి !

‘ముందు మనకే’ జల్మ
ముందోలె’ యంటి

తెల్ల తెల బోయింది
పిల్ల - నా యెంకి !

‘యెన్నాళ్ళొ మన కోలె
యీ సుకము’లంటి !

కంట నీ రెట్టింది
జంట - నా యెంకి !

( కీ.శే. నండూరి వేంకట సుబ్బా రావు - ఎంకి పాటలు )

ఈ పాటలో ఉన్న అపు రూపమయిన తాత్త్వికత చాలా రోజులకి మళ్ళీ గుర్తుకు తెచ్చుకునేలా చేసింది. మరో సారి పాటని మీతో పంచు కోవాలని ....

29, జులై 2010, గురువారం

ఆరు ముఖాలూ , ఆరు ముద్దులూ ....


బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖి శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచు కొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !’ అని దీని అర్ధం.

‘వెళ్ళి గంగలో దూకు ’ అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు మద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?


28, జులై 2010, బుధవారం

కోపం తన్నుకొస్తోందా ; పది లెక్క పెట్టండి ....


సహసా విదధీత న క్రియా, మవివేక: పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:

ఈ శ్లోకం ఏం చెబుతోందంటే , ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !

ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఓ కథ ప్రచారంలో ఉంది.
అదేమిటంటే ...
కిరాతార్జునీయమ్ కావ్యం రచించిన భారవి గురించిన కథ. భారవికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, అతని తండ్రి మాత్రం ఎప్పుడూ అతని గొప్పతనాన్ని అతని ఎదుట పొగుడుతూ ఒక్క మంచి మాట కూడా అనే వాడు కాదుట ! దీనితో భారవికి కోపం వచ్చి , తండ్రిని అంతం చేయాలనుకున్నాడుట. ఆలోచించి ఓ రాత్రి ఇంట్లో అటక మీదికి ఎక్కి , ప్రక్కనే ఓ బండ రాయి పెట్టుకుని అదను కోసం చూస్తూ కూర్చున్నాడుట. ఇంతలో తల్లిదండ్రుల సంభాషణ అతని చెవిని పడింది.

తల్లి : ‘‘ మన భారవిని లోకమంతా అంత గొప్ప కవి అని పొగుడుతూ ఉంటే, మీరు మాత్రం ఒక్కసారీ మెచ్చు కోవడం లేదు ! వాడెంత బాధ పడుతున్నాడో తెలుసా ? ...’’

తండ్రి : ‘‘ అమాయకురాలా ! మన భారవి నిజంగా చాలా గొప్ప కవి. అతని కవిత్వం మహాద్భుతం. అందరూ పొగుడుతున్నట్టుగా తండ్రినయిన నేను పొగడ కూడదు. అది వాడికి క్షేమకరం కాదు.అందుకే పొగడడం లేదు. తండ్రి పొగడ్త బిడ్డలకి ఆయుక్షీణం అంటారు. అంతే కానీ వాడన్నా , వాడి కవిత్వమన్నా నాకెంత ఇష్టమో తెలుసా ? ...’’

దీనితో భారవి గుండె బరువెక్కింది. కిందకి దిగి వచ్చి, తన అపరాధాన్ని మన్నించమని తండ్రిని వేడుకుని, తనకి తగిన శిక్ష వేయమని కోరేడు.

పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. దానితో తండ్రి భారవిని ఒక యేడాది పాటు అత్త వారింటిలో గడపి రమ్మని శాసించాడు.

శిక్ష వేయమంటే తండ్రి వరమిచ్చాడనుకుంటూ పొంగి పోతూ భారవి భార్యా పిల్లలతో పాటు అత్త వారింటికి చేరాడు.

తొలి రోజులు బాగానే గడిచాయి. అత్త వారింట భారవికి మంచి మర్యాదలే జరిగాయి. కాని రోజులు గడిచే కొద్దీ అతనికి ఆ ఇంట గౌరవాదరాలు తగ్గి పోయాయి. అంతా చాలా హేయంగా చూడ సాగారు. భారవికి భరించ లేనంత అవమానంగా ఉంది. కానీ ఏడాది శిక్షాకాలం గడపాలి కనుక, పంటి బిగువున కాలం గడపసాగేడు.

ఇలా ఉండగా అతని భార్య శుక్రవారం వరలక్ష్మి నోము నోచుకుంటాననీ, దానికి ఏర్పాట్ల కోసం కొంత డబ్బు ఇమ్మనీ అడిగింది.

భారవి దగ్గర చిల్లి గవ్వ లేదు. ఆలోచించి, తను వ్రాసిన కిరాతార్జునీయమ్ కావ్యం లోని ఒక శ్లోకం ఉన్న తాటాకును తీసి భార్యకు ఇచ్చి ఏ ధనవంతుని దగ్గరయినా దానిని కుదువ పెట్టి డబ్బు తెచ్చుకో మని చెప్పాడు. ఆమె దానిని ఓ ధనవంతుని ఇంట కుదువ పెట్టి అతడిచ్చిన పైకంతో నోము నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది.

ఇలా ఉండగా, ఆ ధనవంతుడు ఆమె ఇచ్చిన శ్లోకం వ్రాసి ఉన్న తాటాకుని ఎక్కడ పెడదామా అని ఆలోచించి , చివరకి తన కత్తి ఒరలో దానిని కత్తితో పాటు భద్రంగా ఉంచి , గూట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి పోయి, చాలా ఏళ్ళకి ఇంటికి వచ్చేడు.




వస్తూనే తన రాకతో భార్యకి విభ్రమం కలిగించాలనే చిలిపి ఆలోచనతో ఇంటి వెనుక వేపు ద్వారం లోనుండి ఇంట్లోకి ప్రవేశించాడు.
అక్కడ తమ పడక గదిలో భార్యతో పాటు మరో యువకుడు కూడా సన్నిహితంగా ఉండడం గమనించి, కోపంతో ఊగి పోయాడు. భార్యనీ , ఆ యువకుడినీ చంపెయ్యాలని అనుకుని క్రోధంతో గూటి లోనుండి కత్తిని తీసాడు. సర్రున కత్తి లాగుతూ ఉంటే దానితో పాటు ఓ తాటాకు కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా అని ఆసక్తిగా చదివాడు.

అదే, మీద చెప్పిన శ్లోకం !

ఒక్కక్షణం తటపటాయించేడు. ఇంతలో భార్య లేచి, భర్తని చూసి ఆనందంతో పలకరిస్తూ ఆ యువకుడిని పరిచయం చేసింది. ఆ యువకుడు వారి కుమారుడే. ఆ ధనవంతుడు విదేశాలకు వెళ్ళే సమయంలో అతని భార్య నెల తప్పింది. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టాడు. క్రోథావేశంలో ఆ సంగతి కూడా విస్మరించి నందుకు ఆ ధనవంతుడు చాలా సిగ్గు పడ్డాడు.

పెను ప్రమాదం నుండి తన భార్యనీ , కుమారుడినీ కాపాడినందుకు , తను క్రోథావేశంతో నేరం చేయకుండా రక్షించినందుకు అతనికి ఆ శ్లోక రచయిత భారవి పట్ల అపారమయిన గౌరవాదరాలు కలిగి, మరుచటి దినమే ఆ మహా కవిని దర్శించుకుని గొప్ప కానుకలు సమర్పించుకున్నాడు.
భారవి శిక్షా కాలం కూడా ఆ దినంతో ముగియడంతో అతను ఆ అపూర్వ ధన రాసులతో, భార్యా బిడ్డలతో తిరిగి తన తల్లిదండ్రుల చెంతకు ఆనందంగా చేరాడు.

చక్కగా ఆలోచించి చేసే పనికి ఏ ఆటంకమూ రాదు. వేయి విధాలుగా ఆలోచించి కార్యాలు చేయని వాడు గొప్ప ఆపదల పాలవుతాడు. ఆలోచించి చేసే వాడిని లక్ష్మి వరిస్తంది. అని ఈ శ్లోకార్ధం నిత్య సత్యం కదూ !

అందుకే కదా, కోపం తన్నుకొస్తూ ఉంటే , పది అంకెలు లెక్క పెట్టమని మని పెద్దలు చెప్పారు ....
రెడీ ... ఒన్ ... టూ ... త్రీ ... ఫోర్ ....!!

25, జులై 2010, ఆదివారం

విజయ నగరం జిల్లా రచయితలు.

Kadhaki Namaskaram

వాళ్ళని మరి మార్చ లేం !


దుర్జనేన సమం వైరం , ప్రీతించాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

దుర్జనులతో విరోధమూ వద్దు.స్నేహమూ వద్దు. బొగ్గులు చల్లగా ఉన్నప్పుడు చేతులను మసి చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడు చేతులను కాలుస్తాయి. అది బొగ్గుల నైజం. దుష్టుల స్వభావమూ అంతే. మైత్రి లోనూ విరోధం లోనూ కూడా అపకారమే చేస్తారు సుమా !

18, జులై 2010, ఆదివారం

కుక్క , యువకుడు , ఇంద్రుడు


కాచం మణిం కాంచన మేకసూత్రే , గ్రధ్నాతి ముగ్ధేతి కిమత్ర చిత్రంఅశేషవిత్ పాణిని రేకసూత్రే , శ్వానం యువానం మఘవాన మూచే
ఒక ముద్దరాలు దండ గుచ్చుతోంది. అది చూసి , ఒక పెద్ద మనిషి ఇలా అడిగాడు : ‘‘ ఓ అమాయకురాలా ! అదేం అలా చేస్తున్నావు ? గాజు పూసను , మణిని , బంగారాన్ని ఒకే దారంలో గ్రుచ్చుతున్నావు . వింతగా ఉంది. ఇది తెలివి తక్కువ పని కాదూ ? ..’’
అందుకా ముద్దరాలు వినయంగా ఇలా జవాబు చెప్పింది: ‘‘ అయ్యా, మహా పండితుడు పాణిని మహా శయుడు సంస్ఝ్జృత భాషలో వ్యాకరణ గ్రంధం కౌముది ( పాణినీయం) వ్రాస్తూ , తద్ధిత ప్రకరణంలో, కుక్కను , యువకుని, ఇంద్రుని ఏక సూత్రంలో చెప్ప లేదూ ? శ్వయువమఘోనామ తద్ధితే అని కదా ఆ సూత్రం ! ... అఖండ మేధావి పాణిని అలా చేసినప్పుడు మా బోంట్ల సంగతి అడగడం ఎందుకులే ...’’ అంది.
పాణిని కుక్క , యువకుడు , ఇంద్రుడు - ఈ పదాల తద్ధిత ప్రత్యయాలు ఏర్పడే విధం గురించి చెప్పిన వ్యాకరణ సూత్రం ఉటంకిస్తూ ఆ కడు ముద్దరాలు చమత్కారంగా చెప్పిన సమాధానం ఇది.
మేం విజయ నగరం ప్రాచ్య కళాశాలలో చదువుకునే రోజులలో పాణిని సూత్రాలను మా వ్యవహారాలకు అనుగుణంగా సరదాగా చెప్పుకునే వాళ్ళం. ఉదాహరణకి, అజాద్యతష్టాప్ అనే పాణిని సూత్రం ఎవరయినా అప్పడగ బోతూ ఉంటే ఈ సూత్రాన్ని నవ్వుతూ వల్లె వేసే వాళ్ళం. ఇది అప్పడగడానికి మేం పెట్టుకున్న సంకేతం అన్న మాట !

17, జులై 2010, శనివారం

ఒక పీడ కల









































కింవాససైవం న విచారణీయం ,
వాస: ప్రధానం ఖలు యోగ్యతాయా:
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్ర:

‘నాకు బట్టల మీద అంత శ్రద్ధ లేదండీ, అయామ్ వెరీ సింపుల్. ’ అంటారు కొందరు కించిద్గర్వంగా. మేచింగుల కోసం , బట్టల సెలక్షన్ కోసం ఆడవాళ్ళు వెచ్చించే సమయం అంతా యింతా కాదు. గణితం వేస్తే గుండె

తరుక్కు పోతుంది. కొందరు మగవాళ్ళూ దీనికి మినహాయింపు కాదు. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఆ మధ్య నా కొచ్చిన గమ్మత్తయిన కల గురించి చెబుతాను వినండి. ఆ కల రావడం నిఝ్ఝంగా నిఝం సుమండీ ...
ఏదో ఓ మహా పట్టణంలో రోడ్డు మీద నడుస్తున్నాను. ఓ బట్టల షాపు ముందు పేద్ధ బోర్డొకటి కనిపించింది. దానిమీద ఏం రాసుందో నాకు మెళకువ వచ్చేక కూడా అక్షరం పొల్లు పోకుండా గుర్తుంది. చూడండి ...

రండి ! రండి !

దయ చేయండి. మా వద్ద చిరిగినవీ, లెక్క లేనన్ని మాసికలు వేసినవీ, అట్ట కట్టి అలుగ్గుడ్డలా ఉన్నవీ, వెలిసి పోయినవీ, చీకి పోయినవీ, మీరే లెక్క పెట్టడానికి విసుక్కునేటన్ని జేబులు కలవీ అయిన రక రకాల కొత్త జీన్ ఫేంట్లు సరి కొత్త స్టాక్ వచ్చింది. త్వర పడండి. జీబురు గడ్డం వాళ్ళకీ, తల మాసిన వాళ్ళకీ , నిక్క బొడుచుకున్న తల వెండ్రుకలు కలవారికీ ప్రత్యేక డిస్కౌంటు కలదు. ఆలసించిన ఆశా భంగం

మరో క్షణంలో అక్కడ చేరిన వేలాది మంది కుర్రాళ్ళని కంట్రోలు చేయ లేక పోలీసులు లాఠీ చార్జి చేయడం, వింత చూస్తున్న నా నుదుటి మీద కూడా ఓ దెబ్బపడడంతో మెళకువ వచ్చింది.

ఇది సరదాకి రాసింది కాదు. నమ్మక పోతే నేనేం చేయను ? త్వరలో ఇలాంటి (పీడ) కలలు
మీకూ రావాలని ఉడుకుమోతుతనంతో శపించడం తప్ప ?

ఇక, శ్లోకం చూదాం ...

ఎలాంటి బట్టలు కట్టుకుంటేనేం అని అనుకోడం తగదు సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే, లోకం లో ఒక మనిషి యోగ్యతను అతను వేసుకున్న బట్టలను బట్టే నిర్ణయించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

క్షీర సాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహా లక్ప్మితో పాటు, కాలకూట విషం కూడా పుట్టిందని తెలిసిన విషయమే కదా ? అయితే, సముద్రుడేం చేసాడో చూడండి ...
పీతాంబరధారికి ( మహా విష్ణువుకి ) తన కూతురు రమని ఇచ్చేడు. దిగంబరుని (శివుడిని ) చూసి ఈ మొఖానికిది చాలునులే అన్నట్టుగా కాలకూట విషాన్ని ఇచ్చేడు.

లోకం ఇలా ఉందండీ బాబూ , ఏం చేస్తాం !

మహాత్మా గాంధీ ఓ సారి రౌండ్ టేబిలు సమావేశానికి గావంచా కట్టుకుని పై మీది కండువాతో వెళ్తే అక్కడ వాళ్ళతనిని పోల్చుకో లేక లోపలకి పోనివ్వకుండా తరిమేసారుట.
అప్పుడు గాంధీజీ మంచి సూటు బూటు వేసుకుని వస్తే ఆదరంగా లోపలికి పంపించేరుట. సరే, లోపలికి వెళ్ళాక, విందు మొదలయితే, గాంధీజీ ఆహార పదార్ధాలను తినడం మానేసి తొడుక్కున్న ఖరీదయిన కోటు మీద వేసుకోడం మొదలెట్టారుట. ఇదేం పిచ్చి పని అని అందరూ విస్తుపోతే ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపింది నా కోటుకే కాని, నాకు కాదు కదా ! దాని విందు నేనెలా తింటాను ? అనడిగారట. అక్కడి అధికారులకి కొంచెం ఆలస్యంగా ట్యూబు లైటు వెలిగి, మహాత్ముని క్షమాపణలు వేడుకున్నారుట. ఈ కథ నిజమో కాదో కాని, చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టరు (ఆటలాడించడం మానీసి మరీ ) కథలు కాకరకాయలు చెప్పేటప్పుడు దీనిని మాకు చెప్పారు. శ్లోక సందర్భానికి సరి పోతుందనిపించి చెప్పానంతే ...



16, జులై 2010, శుక్రవారం

తిరగ బడు ! ( విప్లవం కాదు).

ఈ శ్లోకంలో చమత్కారాన్ని చూడండి ...

సాక్షరా విపరీతాశ్చేత్ , రాక్షసా ఏవ కేవలం
సరసో విపరీతో2పి , సరసత్వం న ముంచతి.

అక్షరాస్యులు విపరీతులయితే , అంటే దుర్మార్గపు వర్తనులయితే , రాక్షసులవుతారు. వారి చదువు చట్టుబండలై , మహా దూకుడుకుగా తయారవుతారు.

అంతే కదా, సాక్షరులు అంటే అక్షరాస్యులు. శ్లోకంలో సాక్షరా అనే పదాన్ని తిరగేసి చదవండి రాక్షసా
( రాక్షసులు) అని రావడం లేదూ !

అయితే, సరసుల (పండితులు ) తలక్రిందులయినా , అంటే , ఎట్టి పరిస్థితిలోను కూడా , తమ సరసత్వాన్ని వీడరు.

శ్లోకంలో రెండో పాదం మొదటి పదం చూడండి. దానిని సరస: , విపరీత: అపి అని చదువుకోవాలి.

ఇప్పుడు చూడండి ... సరస అనే పదం వెనుక నుండి చదివినా మారడం లేదు. కదూ ?

చదవేస్తే ఉన్న మతి పోతుంది కొందరికి. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతారు. కొందరు మాత్రం ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదన్న మాట సంగతి.

2, జులై 2010, శుక్రవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 6


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిర్ణయించుకున్నాక, పాండవులు ఒక్కొక్కరూ మారు వేషాలలో వచ్చి, విరటుని కొలువులో చేరారు.

ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా కంకు భట్టు , వలలుడు ,బృహన్నల , దామగ్రంథి ,తంత్రీ పాలుడు అనే పేర్లతో విరటుని కొలువులో ప్రవేశించారు. (ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కి చూడండి.)

ఇక, మిగిలింది ద్రౌపది. ఆమె సైరంధ్రీ వేషంలో మాలినిగా విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ కొలువులో వచ్చి చేరింది.

ఆమె తన దేశాచారం ప్రకారం కేశపాశం అంతా విప్పుకుని, కొప్పుగా అమర్చడానికి అనువుగా జడను అల్లుకున్నది. కొప్పు కొద్దిగా కుడి వైపునకు ఒరిగే విధంగా అమర్చుకుంది. కొద్దిగా మాసిన చీర కట్టుకుంది. ముతక నార బట్టతో స్తన మండలాన్ని కప్పుకుంది.

ఆమె తన ఆకారంలో దాసీత్వ లక్షణాన్ని ఉట్టి పడేటట్లు చేసికొంది. దాసీ భావాన్ని స్థిరంగా మనసులో నిలుపు కొన్నది. ఆవిధంగా విరటుని రాచ నగరు లోనికి ప్రవేశించింది.

అలా పైరంధ్రీ వేషంలో వస్తున్న ద్రౌపది మేఘం క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన చంద్ర కళలా ఉంది. మంచు కప్పడం చేత వన్నె తగ్గిన పద్మంలా ఉంది. పొగ క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన దీప శిఖలా ఉంది. దుమ్ము పడగా నిగ నిగలు తగ్గి, లావణ్యం కొరవడిన తీగ లాగ ఉంది. మొత్తానికి ఈ వేషంలో ఆమె రూపం లోని సహజంగా ఉండే ఉజ్వలత్వం మరుగున పడింది.

అలాంటి వేషంతో వస్తున్నద్రౌపదిని చూసి, పుర జనులు తమలో తాము యిలా అనుకున్నారు:

‘‘ ఈమె రోహిణి కాని , అరుంధతి కాని అయి ఉండాలి. అంతే కాని , మానవ కాంత మాత్రం కాదు. తన రూపలావణ్యం చేత చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతే కాదు, అందరి మన్ననలు పొందుతోంది. మంగళ ప్రదమయిన ఆ శరీర కాంతి చూస్తే సందేహం కలుగుతోంది. ఏ లోకం లోనయినా , యిటువంటి అపురూప రూపవైభవం కలవారు ఉంటారా ?’’ అనుకుంటూ బిలబిలా ఆమె దగ్గరకి వచ్చి చేరారు. ‘‘ నీవెవరు ? ఏ పని మీద ఎక్కడికి పోతున్నావు?’’ అని అడిగారు. అప్పుడు ద్రౌపది సుముఖత, సద్భావం వెల్లడి అయేవిధంగా ఇలా అంది:

ద్రౌపది:

‘‘నేను సైరంధ్రిని. నాకు కూడూ గుడ్డా చాలును. ఎవరు నన్ను దయతో పోషిస్తారో వారి దగ్గర పనులు చేస్తాను ’’

ఆమె మాటలు విని అక్కడి వారు ఆశ్చర్య పోయారు. వారికి కొంచెం సందేహం కూడ కలిగింది, ‘‘ ఈమె కడుపు కూటికి ఎక్కడయినా ఉంటానంటున్నది. ఇది నమ్మదగిన మాటేనా?’’ అనుకుంటూ ఆమెని చూస్తూ చుట్టుముట్టారు.

ఆసమయంలో -

విరాట మహా రాజు పట్టమహిషి సుధేష్ణ తన అనుగు చెలికత్తెలతో అంత:పురం మేడ పైభాగంలో విహరిస్తోంది. ఆ మేడ కిటికీల గుండా సైరంధ్రి పుర వీధిలో రావడం గమనించింది. ఆత్మగతాన యిలా అనుకుంది,

సుధేష్ణ : ( తనలో)

‘‘ఈమె ఎక్కడి నుండి వస్తున్నదో ? ఎక్కడికి వెళ్తున్నదో కదా? ఒంటరిదానిలా ఉంది. ఈమెలో అందం ,ఔన్నత్యం కనిపిస్తున్నాయి. అయినా, ఒక సేవకురాలిలాగా వినయంగా వంగి మాట్లాడుతోంది. నగర ప్రజలు కూడ ఎంతో వింతగా ఆమెను చూస్తూ ఉన్నారు. తొందరగా వెళ్ళి ఆమెను వెవటబెట్టుకుని రండి ’’ అని చెలులను పురమాయించింది. సుధేష్ణ యిలా చెప్పడంతో ఇద్దరు ప్రౌఢాంగనలు బయలు దేరి ద్రౌపది దగ్గరకి వెళ్ళి ‘‘ విరాట మహా రాజుల వారి పట్ట మహిషి సుధేష్ణా దేవి దయతో నిన్ను తన దగ్గరకి తీసికొని రమ్మని మమ్ములను పంపించింది, రా ’’ అని పలికారు. అప్పుడు ద్రౌపది మేలి ముసుగు సవరించుకుంది. వినయమే స్త్రీ రూపం ధరించిందా అన్నట్టుగా ఆ చెలుల వెంట అంత:పురం లోనికి బయలు దేరింది.

ద్రౌపది పాదాలు ఎర్రగా ఉన్నాయి. అందు చేత ఆమె నడుస్తున్నంత మేరా కుంకుమ పోసి నట్టు ఎర్రబడి పోతోంది. ఆమె శరీరం మిలమిలలాడి పోతోంది. అందు చేత ఆమె వస్తూ ఉంటే గోడలూ, అరుగులూ మణులు పొదిగినట్టుగా ప్రకాశిస్తున్నాయి. ఆమె కళ్ళు ఒక వింత కాంతితో మెరిసి పోతున్నాయి. ఆ చూపులు పూలు చల్లినట్టుగా ఉన్నాయి. ఆమె జుట్టు నల్లగా నిగ నిగలాడి పోతోంది. అందు చేత గదుల

పై భాగాన నల్లని పట్టు చాందినీ కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆమె అడుగిడగానే విరటుని అంత:పురమంతా ఒక కొత్త కాంతితో మెరిసి పోయింది. ఈ విధంగా ద్రౌపది నెమ్మదిగా సుధేష్ణ ఉన్న మేడ మీదకి ఎక్కి వచ్చింది.

అలా వస్తున్న ద్రౌపదిని విరాటుని దేవేరి చూసింది. ఆమె ముఖంలో ఒక విధమయిన గౌరవభావం కదలాడింది. సాదరంగా చేతులు ముందుకు సాచింది. కనీకనబడనట్టుగా దంతకాంతులు వ్యాపిస్తూ ఉండగా ద్రౌపదిని ప్రేమగా దగ్గరకి రమ్మని పిలిచింది. ద్రౌపది మెల్ల మెల్లగా ఆమె దగ్గరకి చేరి నిలబడింది. సుధేష్ణ ఒక సారి ఆమెను ఆపాదమస్తకం పరిశీలించింది. కుతూహలంతో యిలా అడిగింది:

సుధేష్ణ :

‘‘ తల్లీ, నీకులమేమిటి ? నీవు ఎవరిదానవు? ఏ పని మీద ఎక్కడికి వెళ్దామని బయలు దేరావు? మాకు అంతా వివరంగా చెప్పు.’’

సైరంధ్రి:

‘‘ నేను సైరంధ్రీ జాతి దానను. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. ఒకానొక కారణం వలన మా విరోధులు అహంకారంతో నా భర్తల ఎదుటే నన్ను జుట్టు పట్టుకుని లాగి అవమానించారు. నా భర్తలతో కలసి అడవికి వెళ్ళాను. అక్కడ కందమూలాలు తిని కాలక్షేపం చేసాను. బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంక, నాకొక నియమం ఉంది. ఆనియమం ఇంకా ఒక్క ఏడాది మాత్రం ఉంది. నీవు ధర్మపరురాలవని విన్నాను. నీదగ్గరే ఉండాలని వచ్చాను. నావ్రతసంపూర్తి ఇక్కడే చేసుకుంటాను. నా చేతనయిన పనులు చేస్తాను’’

సుధేష్ణ :

‘‘ దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు - వీరికి చెందిన కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును. ఈ నగరానికి రావడానికి కారణం ఏమిటో అబద్దమాడకుండా చెప్పు.’’

ద్రౌపది : ( మందహాసం చేస్తూ )

‘‘ నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్య భామ దగ్గర, ఆ పిమ్మట ద్రౌపది దగ్గర పని చేసే దానిని.

పరిచారికలు చేసే పనులన్నీ నాకు తెలుసును. ఆపనులన్నీ నేను చేసినవే. వాటిని చేయడంలో నాకు చాల సమర్ధత ఉంది. అమ్మా, విను. ద్రౌపది నన్ను ప్రాణప్రదంగా చూసుకునేది. అంతెందుకు? నన్ను తనతో సమానంగా చూసుకునేది.

నీవు కూడ అలాగే చూడాలని కోరుతున్నాను. నీచములయిన పనులకు నేను తగను. ఈ విషయం ముందుగా నీవు తెలుసుకోవాలి. గౌరవమయిన పద్ధతిలో నన్ను స్వీకరించు. నా సైరంధ్రీ జాతి ఆచారానికి విఘాతం కలగని విధంగా నన్ను ఏలుకో.

కలపాలు ( చందనాది సుగంధ ద్రవ్య విశేషాలు) కలపడం నాకు బాగా తెలుసును. రకరకాలయిన తిలకాలు దిద్దడమూ తెలుసును. వింత వింతలుగా పూలమాలలు కట్టడం, ముద్దుగా కొప్పులలో ముడవటం, దండగుచ్చటం అన్నీ నాకు బాగా తెలుసును.’’

ఆమాటలకు సుధేష్ణ ఆశ్చర్యపోతూ ఇలా అంది:

సుధేష్ణ:

‘‘ అమ్మాయీ ! నీ రూపాన్ని చూసి మా రాజు ఆకర్షితుడయి ఉవ్విళ్ళూరడం ఖాయం ! అటువంటిది, నీ చేత నేను ఎలా పనులు చేయించుకుంటాను చెప్పు? మగ వాళ్ళ సంగతి అలా ఉంచు ఆడవారు కూడా నీ అందం చూసి కళ్ళు మరల్చ లేక పోతున్నారు కదా? ఇంకా వేరు మాటలు ఎందుకు?

నిన్ను భరించడం చాల కష్టం తల్లీ ! నీరక్షణ పీత గర్భంలాంటిది ! నిన్ను చేరదీసి, నా వినాశనం నేనే కొనితెచ్చుకున్నట్టవుతుంది. అది తెలివయిన పని కాదు.’’

(ఎండ్రకాయ (పీత) ప్రసవించే సమయంలో పిల్లలు తల్లి గర్భం చీల్చుకుని పైకి వస్తాయి. తల్లి చనిపోతుంది. అందు చేత పీత గర్భం క్షేమకరం కాదు)

అని పలికిన మహారాణితో ద్రౌపది ఇలా అంది.

ద్రౌపది (సైరంధ్రి):

‘‘ అమ్మా, నీవనుకున్న విధంగా ఎన్నటికీ జరుగదు. నా భర్తలు సామాన్యులు కారు. ఉపాయశీలురు. మిక్కిలి బలవంతులు. గొప్ప పరాక్రమం కలవారు. ఒక్క నిమేష కాలమయినా, నావిషయంలో వారు పరాకుగా ఉండరు. నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు.

నన్ను ఎవడయినా నీచ బుద్ధితో చూస్తే నా భర్తలు ఆ నీచుడిని ఆ రాత్రే కడతేరుస్తారు. హరిహరాదులు అడ్డం వచ్చినా సరే యిదితప్పదు. వారెంత బలమూ, పరాక్రమమూ ఉన్న వారయినా నా భర్తల చేతిలో హతం కావలసిందే.

నన్ను నీచ బుద్ధితో చూసే ఆనీచులకు వందల కొద్దీ బంధువులు ఉండవచ్చును. వాళ్ళు గొప్ప పరాక్రమం కలిగిన వారు కావచ్చును. మదాంధులు కావచ్చును. శక్తి సంపదతో భయంకరులు కానోపును. ఏనుగుల వలె ఉండవచ్చును. అయినా సరే, నా భర్తలు కీళ్ళకు కీళ్ళు విడదీసి వారిని చంపి వేస్తారు. అందు వలన మగవారు నా వేపు తేరిపారి చూడడానికి కూడ భయపడుతారు.

అంతే కాదు. నా మనసు అటువంటి వారికి గోచరించదు. నా పెద్దల శిక్షణ, ఆచారం అలాంటివి. కనుక, ఇటువంటి అల్పమయిన మాటలు మాట్లాడ వద్దు. మనసులో ఇంకేమీ పెట్టుకోకు. నా మీద సందేహం వద్దు. నన్ను నీ సేవకురాలిగా స్వీకరించు. నాగరికమూ, ఉదాత్తమూ అయిన పనులు , నీకు నచ్చిన పనులు, నీకు నచ్చిన పద్ధతిలో భయభక్తులతో చేస్తాను.నా చేతలు పెద్దలు కూడ మెచ్చుకుంటారు. అందరూ ప్రశంసించేలా నా ప్రవర్తన ఉంటుంది.

నన్ను నీచకార్యాలకు పంపని వారిని, ఎంగిలి కూడు నాకు పెట్టకుండా నన్ను గౌరవంతో చూసుకునే వారిని నా భర్తలు కూడా ఎంతో ఆదరంతో చూస్తారు.’’

సైరంధ్రి పలికిన ఈ మాటలతో విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ సంతోషించింది. ఆ మాటలతో ఆమె మనసు కుదుట పడింది. ఆమెను తన వద్ద సేవకురాలిగా చేర్చుకుంది. సైరంధ్రి కూడ అంత:పుర మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించ సాగింది.

ఈ విధంగా పాండవులయిదుగురూ., వారితో పాటు ద్రౌసది మారు వేషాలతో, మారు పేర్లతో విరటుని కొలువులో చేరారు. దీనితో లోగడ ఓ అష్టావధానంలో అవధాని సమస్యను పూరించినట్టు - కుంజర యూథం దోమ కుత్తుకను చొచ్చినట్టయింది !!

తదుపరి హిత వచనమ్డాట్ కామ్ లో మరి కొన్ని ...

స్వస్తి.

1, జులై 2010, గురువారం

సరస్వతీ నమస్తుభ్యమ్




నా చిన్ని పుస్తక సంచయం నుండి కొన్ని పుస్తకాలు .....


కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 5


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువువలో గడపడానికి పాండవులు ఒక్కరొక్కరూ చేరు కున్నారు. ఇంతకు ముందు ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు విరటుని కొలువు లోనికి ఎలా ప్రవేశించారో చూసాం కదా ? ( ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కండి)

చివరి వాడు సహ దేవుడు. అతడు విరటుని కొలువులో ప్రవేశించిన విధం చూడండి ...సహ దేవుడు గోపవేషంలో పసుల కాపరిగా విరట రాజు కొలువులో చేరడానికి తంత్రీపాలునిగా ప్రవేశించాడు.

అతని రూపం ఎలా ఉందంటే, బయటకి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఆంతర్యంలో మాత్రం పరాక్రమం తేజస్సు ఉట్టి పడుతున్నాయి. ఆ చంద్రుడే మానవాకారంతో వచ్చాడా ? లేదా, అగ్ని దేవుడే ఈ మానవాకారం దాల్చాడా ? అన్నట్లగా ఉన్నాడు.

ఒక ప్రక్క పశువులను కట్టే పలపుల మోపు, మరో ప్రక్క పెయ్య దూడల త్రాళ్ళు ధరించి పసుల కాపరి వేషంలో ఉన్నాడు. ఆహార్యమూ, అభినయమూ కూడ అలాగే ఉన్నాయి. చేతిలో నునుపైన పసుల కాపరి కర్రనొకదానిని పట్టుకుని ఉన్నాడు. అతడి సుందరాకారం విరట రాజుని ఎంతగానో ఆకర్షించింది. చుట్టూ ఉన్న ప్రజల చూపూ అతడి మీదే . చూపు త్రిప్పుకో లేక పోతున్నారు. తామర రేకుల వంటి ఆ కళ్ళలో చలాకీతనం తొంగి చూస్తోంది. అతడి చూపులో ఏదో సంభ్రమం కనిపిస్తోంది. కొద్దిగా భయపడుతున్నట్టుగా కూడ ఉన్నాడు. తడబడే చూపులతో ప్రజలను చూస్తూ సహదేవుడు మెల్లగా అక్కడకి వచ్చాడు.

వచ్చి, విరాట దేశాధీశునకు వినయంగా నమస్కరించాడు , తర్వాత యిలా అన్నాడు.

సహదేవుడు:

‘‘ రాజా ! నీ ఆలమందను కాపాడడానికి నన్ను అధికారిగా నియమించు. నా పర్యవేక్షణలో పశువులకు ఏ రోగాలూ అంటవు. ఇతరులెవరూ నీ ఆలమందను వశపరచుకో లేరు. వాటికి అలసట అసలు ఉండదు. దాహంతో బాధ పడవు.

రాజా ! నన్ను నీ కొలువులో పసుల కాపరిగా కనుక నియమిస్తే నీ పశువులు ఎప్పుడూ తప్పి పోవడం జరుగదు. క్రూర జంతువుల బారిన పడవు. సమృద్ధిగా పాడి లభిస్తుంది. పాడి తగ్గి పోవడం జరుగదు. తోటి పసుల కాపరులు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకుంటావు. అంత బాగా ఆలమందను కాపాడుతాను. నన్ను ఏలుకో.’’

విరటుడు:

‘‘ఇవేం మాటలు? నీలో పశుల కాపరితనం మచ్చుకయినా కనబడడం లేదు. రాజసం ఉట్టిపడుతోంది. నీ శరీరం చక్కగా ఉంది. నీలో గాంభీర్యం ఉంది. కాంతివంతమయిన దేహంతో ఒప్పుతున్నావు. బాగా ఆలోచిస్తే నువ్వు సూర్య వంశపువాడివిగా తోస్తున్నది. లేదా, చంద్ర వంశస్థుడివయినా కావచ్చును. అంతే తప్ప కేవల పసుల కాపరివి అనిపించడం లేదు.

నీకిష్టమయిన పదవిలో కుదురుకో. నా రాజ్యాన్ని అంతా చక్కబెట్టు. నయ నీతి పరాక్రమాలు ప్రదర్శించగల సమర్ధత నీకు ఉంది. అయినా కూడా ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరు కోవడం ఎందుకు చెప్పు ?’’

హదేవుడు: ( రాజుకి మ్రొక్కి)

‘‘ రాజా ! నేను హీనకులజుడని. ముందెప్పుడూ నాగరికపు పనుల తీరు ఎరిగిన వాడను కాను. గతంలో మేము కౌరవులకు సేవకులం. పశు గణాన్ని కాపాడే వాడిని. పశువులను కాపాడడం తప్ప వేరే విధంగా బ్రతకడం నాకు తెలియదు. ఇంతకు ముందు ధర్మ రాజు యొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండే వాడిని. ఆ విధంగా ఆ మహారాజు మన్ననకు పాత్రుడనయ్యాను. నా పేరు తంత్రీ పాలుడు. నా హస్తవాసి మంచిది. అందు చేత దూడలు బాగా ఏపుగా పెరుగుతాయి. అతి తక్కువ కాలం లోనే నీ ఆలమందను రెట్టింపు అయ్యేలా చేస్తాను.ఆబోతు మూత్రం వాసన చూసినా, పైగాలి వీచినా సరే, గొడ్డుటావులకు సైతం చూలు నిలవడం ఖాయం. అలా పశువులను కాపాడుతాను. పశువులకు సాధారణంగా వచ్చే ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్తే దగ్గరకి రావు. పశువులలో రకాలన్నీ నాకు బాగా తెలుసును. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మాత్రం నీ మనసునకు నచ్చే విధంగా నడుచుకుంటాను. నా వలన నీకేమయినా ప్రయోజనం ఉందనుకుంటే మరోమాట లేకుండా నన్ను నీ కొలువులో పశుల కాపరిగా నియమించు’’

విరటుడు:

‘‘ సరే. నీకు అదే మంచిదనిపిస్తే అలాగే. నీకు ఇష్టమయితే వేరే పెద్ద పనులను చేయ వచ్చును. లేదంటే నా గోసంపదను శ్రద్ధతో తగిన విధంగా రక్షించు.’’ అని పలికి సహ దేవుడిని విరాటుడు తన కొలువులో పశుగణాలను సంరక్షించే అధికారిగా నియమించాడు.

ఈ విధంగా ధర్మ రాజు , భీముడు, అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా విరటుని కొలువులో కంకుభట్టు , వలలుడు , బృహన్నల , దామగ్రంథి , తంత్రీ పాలుడు గా అఙ్ఞాత వాసం ఒక ఏడాది పూర్తి చేసుకునే నిమిత్తం మారు వేషాలతో కుదురుకున్నారు.

అఙ్ఞాత వాస కాలంలో తమలో తమకు వ్యవహార నిమిత్తం రహస్యంగా పిలుచుకోడానికి తగిన విధంగా రహస్యనామధేయాలు పెట్టుకున్నారు. అవి: జయుడు (ధర్మ రాజు) జయంతుడు (భీముడు) , విజయుడు (అర్జునుడు) , జయత్సేనుడు ( నకులుడు) , జయద్బలుడు ( సహ దేవుడు )

ద్రౌపదికి మాత్రం సంకేత నామమంటూ ఏమీ లేదు.

ద్రౌపది సైరంధ్రీ వేషంలో విరటుని దేవేరి సుధేష్ణ ను మెప్పించి ఆమె వద్ద పనికి కుదురుకున్నది. ఆ వివరాలు - ద్రౌపది విరటుని కొలువులోకి ఎలా ప్రవేశించిందో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి

.