13, సెప్టెంబర్ 2010, సోమవారం

జాణవులే, నెరజాణవులే !!


విజయ నగరం కోట ఇదే.

ఉత్తరాంధ్రలో విజయ నగర ప్రభువులు అభినవ ఆంధ్ర భోజులు. వారి పోషణలో ఎందరో కవి పండితులు అపూర్వమైన గ్రంధ రచనలు చేసి మహత్తరమయిన సాహిత్య పోషణ చేసారు. అలాంటి దిగ్గంతులలో ఒకరిని ఈ టపాలో స్మరించుకుందాం ...

ఆనంద వర్ధనుడు సంస్కృత భాషలో వెలయించిన ఆలంకారిక గ్రంథము ధ్వన్యాలోకము. కావ్యాత్మ ఏది అని ప్రశ్నించి, కావ్యమునకు ఆత్మ ధ్వని అని ఒక అపూర్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.ధ్వని గర్భితమైన రచన కావ్య సౌందర్యాన్ని ఇనుమడింప చేయడమే కాక, కావ్యానికి పరిపుష్ఠినీ, ఉత్తమ స్థానాన్నీ కల్పిస్తుంది. సమర్ధుడైన కవి తన వక్తవ్యాంశాన్ని కేవలం వాచ్యంగా చెప్పడు.ధ్వని తో స్ఫురింప చేస్తాడు.అవాంతర భేదాలతో విస్తరించి ఉన్న ఈ ధ్వని

శాస్త్రాన్ని గురించి గురు ముఖత: గ్రహించడమే మేలు గహన సదృశంగా తోచే ఈ మహత్తర

ఆలంకారిక గ్రంథానికి పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఆంధ్ర ధ్వన్యాలోకము అనే పేరుతో చక్కని అనువాదం చేసారు.

శ్రీ శాస్త్రి గారు విజయనగర వాస్తవ్యులు. అక్కడి ప్రభుత్వ మహా రాజ సంష్కృత కలా శాలలో విద్యాభ్యాసం చేసి , అక్కడే ఆంధ్ర భాషా ప్రధానాధ్యాపకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగీత సాహిత్యాలలో దిట్ట.

ఇందులో ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకనంతో పాటు, ధ్వన్యాలోకన వ్యాఖ్యాతలలో ఒకరైన

అభినవగుప్తపాదుల వారి లోచన వ్యాఖ్యను కూడ అనువదించడం జరిగింది.మాతృక లోని లక్ష్య శ్లోకాలను దీనిలో సరళ సుందరమయిన తెలుగు పద్యరూపంలో మనకి అందించడం జరిగింది

.

శాస్త్రి గారు చదివినదీ, ఉద్యోగ విధులు నిర్వర్తించినదీ విజయనగరం లోని ఈ కాళాశాలలోనే !

అసలు ఏమిటీ ధ్వని?

అర్ధం ఎప్పుడూ శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అలా గోచరించే అర్ధం వాచ్యం అయితే

చదవగానే, లేదా వినగానే స్ఫురించే అర్ధమే కాక వేరొక అర్ధం స్ఫురించడమే ధ్వని. దీనికే వ్యంగ్యం అని నామాంతరం. ధ్వని గర్భిత రచనకి ఎప్పుడూ ఉత్తమ స్థానం లభిస్తుంది..

ధ్వని గర్భితాలయిన రెండు చిన్న పద్యాలను చూదాం ....

కనులు కాన రాని కటిక చీకటి రేయి

వలస పోయె మగడు, వంటి దాన !

దొంగ లెవ్వరయిన దోతురేమో సుమ్ము

కంట గనుము, ప్రక్క యింటి వాడ !

ఒక ఊరిలో ఒక నెరజాణ ఉంది. ఆమె బయటకి కడు ముద్దరాలిలా కనిపిస్తుంది. ఆమె నాథుడు ఏవో పనుల మీద దేశాంతరం పోయి చాలా దినాలయింది. ఆమె వయసు ఊరు కోవడం లేదు. శరీరం సహకరించడం లేదు. మతి లయ తప్పుతున్నది. పురుష స్పర్శ కోసం దేహం తహ తహలాడి పోతున్నది. ఎలా? ఎవ్వరకీ అనుమానం రాకుండా పొరుగింటి యువకుడిని ఉద్దేశించి ఇలా అంది:

అయ్యో, చీకటి పడింది. కళ్ళు పొడుచుకున్నా కనబడడం లేదు. నా భర్త దేశాంతరాలు వలస పోయాడు. ఇప్పటిలో రాడు. నేనా, వంటరి దానిని ! అదను చూసి దొంగలెవరయినా దోచుకుంటారేమో భయంగా ఉంది. మా ప్రక్క ఇంటి వాడివే కదా, నన్నూ, మా యింటినీ ఓ కంట కాస్త కనిపెడుతూ ఉండు సుమీ !

ఇదీ పద్యం. వాచ్యంగా చూస్తే ఒక దీన మైన అభ్యర్ధన తప్ప ఇందులో మరేమీ గోచరించదు.ఎక్కడా అనౌచిత్యం, అశ్లీలం కనిపించదు.

కొంచెం లోతుగా చూస్తే మాత్రం ఆ నెరజాణ గడుసుతనం, మాటకారితనం, మనసులోని మర్మం అన్నీ ప్రకటితమవుతాయి.

చీకటి పడిందయ్యా. నా మగడు ఊర లేడు. నేనో, ఒంటరి దానిని. మగ తోడు కావాలనిపిస్తున్నది. రాకూడదూ? అని పిలుపు ! భర్త లేడని చెప్పడం వలన మరేమీ భయపడ వలసిన పని లేదని ధ్వని. కటిక చీకటి అనడం వలన ఎవ్వరూ చూడ లేరులే అని సూచన. వంటరి దానను అనడం వలన ఇంటిలో మన కలయికకు ఎవరూ అడ్డంగా లేరులే అనే భరోసా, దొంగ లెవరయినా దోచేస్తారేమో అనడం వలన, నువ్వు తక్షణం రాక పోతే మరెవరయినా వొచ్చి, నా పొందు స్వీకరించే భాగ్యం పొంద గలరు సుమా అనే బెదిరింపు. కంట కనుము అని అనడం వలన, నా అంత అంద గత్తె పిలుస్తూ ఉంటే జాగు చేయక వెంటనే ఓ చూపు చూడవయ్యా అని కవ్వించడం. ప్రక్క యింటి వాడ ! అనడం వలన నువ్వు చాలా కాలంగా మా ప్రక్క ఇంటి లోనే ఉంటున్నావు కనుక ఈ అదృష్టం నీకే అభిస్తోందయ్యా అని ఊరించడం ..... ఇదీ ధ్వని !

మరో పద్యం, శాస్త్రి గారి అనువాదం:

ఒడలెరుఁగ దిచ్చట శయించు చుండు నత్త,

నేనొ, యిచటఁబరుండుదును, నీవొ, రేయి

నంధుడవు ! పాంథ ! దివసకమందె, దీని

చక్కగాఁజూడు పడకు మాశయ్యలందు

ఇదీ పద్యం. ఈ నెరజాణ పరిస్థితీ అలాంటిదే. మగడు ఊర లేడు. చాలా రోజులయింది.

విదేశగతుడై. తానా ,యవ్వనవతి. దేహం మగతోడు కావాలంటోంది. ఉప్పూ కారం తినే వయసాయె!

సరే, ఇంటికి ఓ అతిథి వచ్చేడు. చూడ చక్కగా ఉన్నాడు. ఈవిడ గారి కన్ను వాడి మీద పడింది. ధ్వని గర్భితంగా సంకేతం వినిపించింది.

ఓ బాటసారీ, ఇదిగో చూడు. మా అత్త వొళ్ళూ మీదా కానకుండా ఇక్కడ పడుకుని ఉంటుంది. ఆవిడ గారికి ఓ సారి నిద్ర పడితే మరి అంతే . ఒళ్ళెరుగదు. నేను ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటూ ఉంటాను. నువ్వు చూడబోతే రేచీకటి గాడిలా ఉన్నావు. రాత్రి వేళ మంచి నీళ్ళు త్రాగడానికో, మరేదో అవసరానికో లేస్తావు. నీకు రేచీకటిలా ఉంది. ఎవరెక్కడ పడుకుంటారో ఇప్పుడే చెబుతున్నాను. ఈ పగటి వెలుతురు లోనే చక్కగా చూసి గుర్తు పెట్టుకో. మా పడకల మీద పడకు సుమీ !

వాచ్యార్ధంలో ఇందులో ఎంచడానికేమీ లేదు. నెరజాణ గడుసుతనమంతా తన కోరికను ధ్వన్యంతరంగా చెప్పడం లోనే ఉంది.

ముందుగా రాత్రి వేళ అత్త ఎక్కడ పడుకుంటుందో చెప్పింది. ఆవిడ ఒళ్ళెరక్కుండా పడుకుంటుంది కనుక మనకింక భయమేమీ లేదని సూచించింది. తను ఏ మంచం మీద పడుకుని ఉంటుందో చక్కగా సూచన చేసింది. రేచీకటి గాడివనడంలో, ఆ రాత్రి ఇంట్లో దీపం లేకుండా అంతా చీకటిమయం చేసి ఉంచుతానని చెప్పకనే చెప్పింది. ఎవరెక్కడ పడుకుంటారో పగటి వేళ వెలుతురు ఉండగానే చక్కగా చూసి గుర్తు పెట్టు కోమని హెచ్చరించింది.

ఇక , పడకు మా శయ్య లందు అనడం వల్ల రాత్రి తన పడక మీదకి రమ్మని ధ్వని ఎలా కుదురుతుంది?

అని సందేహం రావచ్చును.

మా పడకల మీద పడ వద్దు అని వాచ్యంగా నిషేధించింది. పడకలు అని బహువచనం వాడడం వలన ఆ నిషేధం అన్వర్ధము కదా ?

అత్త పరుండే శయ్య మీద కాకుండా తాను ఒక్కతె పరుండే పడక మీద పడవచ్చుననే ధ్వని ఇందులో ఉంది. వాచ్య రూప నిషేధంలోనే విధి రూప అంగీకారం ఉంది.

ఇదీ ధ్వని.

మరో ఉదాహరణ కూడ చెబుతాను.

ఒక అటవీ ప్రాంతలో ఒక ప్రేమ జంట కులాసాగా తిరుగుతూ ఉంది. అక్కడి పూల పొదలే వారి పడకటిల్లు. మంచి యుక్త వయసులో ఉన్నారు. కామోపభోగాలు చక్కగా అనుభవిస్తున్నారు.

ఒక బ్రాహ్మణుడు పూజకు పువ్వులు కోసుకోవడం కోసం రోజూ వాళ్ళండే పొదల దగ్గరకి వస్తూ ఉన్నాడు. వారి ఏకాంతానికి ఇది భంగకరంగా పరిణమించింది. ఇటు వేపు రావద్దయ్యా అని చెప్పాలంటే భయం. ఆ సద్బ్రాహ్మణుడికి అలా చెప్పే ధైర్యం వారికి లేదు.తమ కలయికకు ఆటంకం కలిగిస్తున్న అతని రాకను నివారించాలి. తనంతట తానుగా ఆ బ్రాహ్మణుడు మరి అటు వేపు రాకుండా చేయాలి.

అందుకే ధ్వని గర్భితంగా అతనితో వినయంగా ఇలా చెప్పారు:

ఓ బ్రాహ్మణుడా ! నువ్వు రోజూ పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ Iఉన్నావు, ఇక్కడ రోజూ నిన్ను ఓ కుక్క అల్లరి పెడుతోంది కదా ? ఇక్కడ తిరిగే ఓ పెద్దపులిని చూసి, మరి ఆ కుక్క నీ జోలికి రాదు. ఇక్కడి నుండి ఉడాయించింది,. నువ్వు ఇక మీదట ఎప్పటి లాగే రోజూ నిర్భయంగా పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ ఉండ వచ్చును. మరేమీ భయం లేదు.

కుక్కకే భయపడే ఆ బ్రాహ్మణుడు మరి పులి పేరెత్తితే ఇక ఆ ఛాయలకు వస్తాడా చెప్పండి?

అంతే ! ఇక, అటు వేపుగా ఆ వెర్రి బ్రాహ్మణుడి పత్తా లేదు !

ఆ యువతీ యువకులకి పండుగే పండుగ !

స్వస్తి.

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

హిత వచనమ్ డాట్ కామ్


సాధారణంగా ప్రసంగవశాత్తు మనం మన పెద్దల నుండి విన్న నానుడులో, సామెతలో, పద్య పాదాలో, శ్లోక చరణాలో సందర్భవశాత్తు ఉటంకిస్తూ ఉంటాం.అలా ఉటంకించే వాటిలో సద్య పాదాల, శ్లోక చరణాల చివరి పంక్తులు మాత్రమే చెబుతూ ఉంటాం. వాటి పూర్తి పాఠం మనలో కొందరకి తెలియక పోవడం కద్దు. అలాంటి వాటి పూర్తి పాఠాలను కొన్నింటిని ఇక్కడ చూదాం.

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తరుచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ శ్లోకం పూర్తి పాఠం ఇది:

అపి స్వర్ణమయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

తమ్ముడా లక్ష్మణా ! ఈ రావణ లంక మొత్తం బంగారుమయం అయితే కావచ్చును. కానీ నాకిక్కడ ఉండడం సమ్మతం కాదు. ఈ వైభోగాలేవీ నాకు రుచించడం లేదు. మన బంధుగణాన్నీ,అయోధ్యాపురినీ వెంటనే చూడాలని ఉంది. ఎందుకంటే, కన్న తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

మరొకటి:
నాస్తి జాగరతో భయం అంటూ ఉంటారు కదా, దీని పూర్తి పాఠం చూడండి:

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం

చక్కగా వ్యవసాయం చేస్తే కరువు కాటకాలంటూ ఉండవు. నిత్యం జపతపాలు చేస్తూ ఉంటే అన్ని
పాపాలూ పోతాయి. మౌనంగా ఉండడం వల్ల ఎవరితోనూ జగడం అన్నదే ఉండదు. మెలకువగా, జాగ్రత్తగా ఉంటే భయమన్నదే ఉండదు.

మరొకటి:

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే దాని పూర్తి పాఠం చూడండి:

విద్వత్త్వంచ నృపత్వంచ
నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే

పండితుడు, రాజు వీరికి పోలికే లేదు. రాజు కేవలం తన దేశంలోనే , అంటే తన రాజ్యం లోనే
గౌరవించబడతాడు. ఇక పండితుడో? లోకమంతటా గౌరవాదరాలు పొందుతాడు.

దేనికయినా మరీ ఓవరయి పోతూ ఉంటే అతి సర్వత్ర వర్జయేత్ అని హెచ్చరిస్తూ ఉంటాం,దీని పూర్తి పాఠం చూడండి:

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

కన్నూ మిన్నూ కానకుండా దానాలూ ధర్మాలూ చేసుకుంటూ పోతే నాశనమై పోతాం సుమా.అందుకు భారతం లోని కర్ణుడే తార్కాణం. ఇంద్రుడు కపటోపాయంతో కవచ కుండలాలు దానమడిగితే మరో ఆలోచన లేకుండా వాటిని దానం చేసీసేడు. అవి లేనందు వలన యుద్ధంలో మరణించాడు. అలాగే మరీ అంత దురాశా పనికి రాదు. తమదీ, పాండవులదీ కూడా రాజ్యం తనకే దక్కాలనే పేరాశతోనే కదా, దుర్యోధనుడు పేచీల మీద పేచీలు పెట్టి, కడకు భరత యుద్ధంలో దుర్మరణం పాలయ్యేడు. అలాగే మితి మీరిన కామంతో రావణుడు సీతాపహరణం చేపి రఘురాముని చేతిలో మరణించాడు. అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు
సుమా !
అందుకే చెప్పేరు, ఎప్పుడూ అతి వద్దు. మితి ముద్దు. అని.

మరొకటి చూడండి:
చెబితే వింటాడూ? వాడి కెంత తోస్తే అంత! అనుభవిస్తాడు వెధవ ! బుద్ధి: కర్మాను సారిణీ అని, మన వాళ్ళు ఊరికే అన్నారా? అనడం వింటూ ఉంటాం. దాని పూర్తి రూపం చూడండి.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగానుసారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.

ఇంకొకటి చూదామా?

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి పుట్టి ఉండడం ఎప్పుడూ జరిగి ఉండ లేదు. అలాంటి బంగరు లేడిని ఎన్నడూ చూడనూ లేదు. విననూ లేదు. కాని, ప్రియసతి సీత అడిగింది కదా అని,ముందు వెనుకలు ఆలోచించకుండా బంగారు లేడిని తీసుకుని రావడానికి విల్లంబలు ధరించి రాముడు పరిగెత్త లేదూ? ఆ పిదప రావణుడు సీతను అపహరించడం, రాముడు పడిన వేదన, రావణ వధ ఎన్న ఇడుముల పాలయ్యాడో కదా? చెడి పోయే కాలం వస్తే అలాంటి విపరీతమయిన బుద్ధులే పుడతాయి మరి !

చివరగా మరొకటి ...

చెప్పింది చెప్పినట్టు వెంటనే ఎప్పుడూ చేయవు కదా, ప్రతీ దానికీ ఊరకే తటపటాయిస్తావు.ఆలస్యాదమృతం విషం రా నాయనా ! అని కోప్పడుతూ ఉంటాం. దాని పూర్తి పాఠం చూడండి మరి:

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యవ్వనమ్
కాలక్షేపం న కర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని వేడి వేడిగా తినక పోతే అది జీర్ణమై చావదు. చల్లారిన భోజనం విషతుల్యం.అలాగే, యవ్వన వతులైన ముదితలు వారి యవ్వనం కోలు పోయాక అందగించరు. ప్రతీదీ తరువాత చూదాం లే అని, తాత్సారం చేయడం కూడా మంచిది కాదు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారి పోతుంది సుమా!

ఇప్పటికివి. మరి కొన్ని తదుపరి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం.

సంస్కృత శ్లోకాలే కాదు, మన కవిత్రయం వారి భారతం లోనూ. పోతన గారి భాగవతం లోనూ, రామాయణం లోనూ, ఇతర ప్రసిద్ధ కావ్యాలు, ప్రబంధాలలోనూ ఇలాంటివి చాలా కొటేషన్లు కనిపిస్తూ ఉంటాయి.

వీలుని బట్టి వాటిని మన హిత వచనమ్ డాట్ కామ్ లో చూదామా?

స్వస్తి.

11, సెప్టెంబర్ 2010, శనివారం

త్వమేవా2హమ్


వినాయక చవితి శుభాకాంక్షలు.

ఉదయాన్నే వొచ్చేడు నా కాషాయ మిత్రుడొకడు. ఇదేం పిచ్చిరా బాబూ ! ఇదేం గోల! ఊరంతా ఎక్కడ చూసినా వినాయక ఉత్సవాలే, దారి పొడుగునా వినాయక పెండాల్ లే కనిపిస్తున్నాయి. ఒక దానిని మించిన ఎత్తులో ఒకటి ఉంటున్నాయి వినాయక విగ్రహాలు. మైకులు చెవులు చిల్లులు పడేటట్టుగా హోరెత్తించేస్తున్నాయి. ఆ రంగులు పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తుందని మొత్తుకుంటున్నా వీరికి చెవి కెక్కదు. వీళ్ళ దుంప తెగ !

అవేం విగ్రహాలు ! ఒక్కో చోట ఒక్కో రకం వినాయక ప్రతిమ కనిపిస్తోంది. ఎవడికి తోచినట్టు వాడు చేయిస్తున్నాడు. ఆధునిక వినాయకుడట ! ఆల్ట్రా మోడరన్ వినాయకుడట. వీళ్ళకి మతులు కానీ పోతున్నాయా? అని ఆవేశ పడి పోయాడు.



మైకుల హోరు తగ్గించి, శబ్ద కాలుష్యం అరికట్టాలనీ, వినాయక ప్రతిమల తయారీలో పర్యావరణానికి హాని కలిగించే రంగుల వాడకం కూడదనీ చెబుతున్న దానిలో విప్రతిపత్తి లేదు. కాని, రకరకాల ఫోజులలో వినాయక ప్రతిమలు చేయిస్తూ గణపతి దైవాన్ని అపహాస్యంపాలు చేసేస్తున్నారనే విషయంలో నా అభిప్రాయం వేరుగా ఉంది.

విఘ్నాలు పోగొట్టి మనందరకీ సకల శుభాలూ కలిగిచే వినాయకుడంటే మనందరకీ చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే,

ఆ తొండం, ఆ బాన పొట్ట, ఆ కుబ్జ రూపు ... ఇవేవీ మనకి తోచవు. ఒక దేవతా మూర్తిగా భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూనే వినాయకుడిని మనం ఒక ఆత్మీయ మిత్రునిగా, మనలో ఒకడిగా భావిస్తాం కాబోలు. అందుకే ఏ దేవుడికీ లేని విధంగా వినాయకుడికి పూజలు చేసే వేళ వినాయక రూపాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా రూపొందించుకుంటున్నాం.

ఒక్కో చోట ఒక్కో ఆకారంలో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఈ ఉత్సవ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కపు విందు చేస్తూ ఉంటాయి. అపరిమితమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.

వినాయకుడు ఫేంటూ చొక్కా వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ల్యాప్ టాప్ ముందు కూచున్న తీరు చూసి మురిసి పోతాం

.

మోటారు బైకు నడిపే వినాయకుడూ, జైజవాన్ లా ముస్తాబయిన వినాయకుడూ, రకరకాల పండ్లతో చేసిన వినాయకుడూ, క్రికెట్ లాంటి ఆటలు ఆడే వినాయకుడూ, రక్షక భటుని వేషంలో ఉండే వినాయకుడూ, ఇలా ఒకటేమిటి? ఎన్ని రకాల ఫోజులలోనో వినాయక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి,

వినాయకుడి విషయంలో ఇదేదో తీరని అపచారం జరిగి పోతున్నదని ఊరకే గుండెలు బాదుకోనవసరం లేదని

నా అభిప్రాయం.

వినాయకుడంటే జనాలకి భక్తితో పాటు ఒక దగ్గరితనం కూడా ఉంది.తమనీ, తమ వృత్తులనీ, తమ జీవితాన్నీ ,జీవితావసరాలనీ, తమ ఆలోచనలనీ, తమ ఆనందాలనీ, తమ నైమిత్తిక సమమస్యలనీ, తమ అభిరుచులనీ, అభీష్టాలనూ. తమకు చెందిన సమస్త వస్తు సముదాయాన్నీ తమతో పాటు తమ ఇష్ట దైవం వినాయకుడివిగా భావించి , తమను తాము ఆ గణపతితో అన్ని విషయాలలో ఐడింటిఫై చేసుకోవడం వల్ల గణపతిని ఒక దేవుడి కన్నా, ఒక ఆత్మీ బంధువుగానో, చెలికానిగానో చూస్తూ ఉండడం వలన ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వినాయక ప్రతిమలు చేయిస్తున్నారు అని నా భావన. కనుక, ఇదేమంత తీవ్రంగా ఆక్షేపించ వలసిన విషయం కాదనుకుంటాను

Hand made Ganapathi.JPG

.ఇది, విశాఖపట్నంలో ఉండే మామరదలు స్వాతి స్వయంగా తను తయారు చేసిన మట్టి వినాయకుడు. బాగుంది కదూ ! వీలయినంత వరకూ ప్రతి ఒక్కరూ ఇలా మట్టి వినాయకుడిని తయారు చేసుకుని పూజ చేస్తే పర్యావరణ కాలుష్యం బెడద ఈ పండుగ సందర్భంగా కొంతయినా తగ్గుతుంది. అంతే కాక, మనం స్వయంగా చేసుకోవడంలో ఉండే ఆనందం కూడా అనుభవించ వచ్చును. ఏమంటారు?

మా ఇంట వినాయక పూజ ఫొటోలు చూడండి.


సరే, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని స్తుతించే ఒక చక్కని పద్యం చూదాం ....

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధము లాను వేళ బా

ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపఁబోయి యా

వంకఁగుచంబుఁగాన కహి వల్లభ హారముఁగాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁగొల్తు నభీష్ట సిద్ధికిన్

( అల్లసాని పెద్దన. మను చరిత్రము)

బాల గణపతి తల్లి పార్వతమ్మ ఒడిలో చేరాడు. చనుబాలు త్రాగుతున్నాడు.పసితనపు చెయిదము చేత తొండంతో అవతలి కుచాన్ని పట్టు కోవాలని చూసాడు. అర్ధ నారీశ్వరత్వం వల్ల అటు వేపు తల్లి స్తనం వానికి దొరక లేదు.

సరి కదా, పాముల హారాన్ని చూసి, దానిని తామర తూడు అనుకుని పట్టుకో బోయాడు ! గజాస్యుడు కదా మరి ! తామర తూడు పట్ల ఆకర్షితుడు కావడం సహజమే మరి ! అట్టి వినాయకుడిని నా కోరికలు నెరవేరాలని సేవిస్తాను

అని పెద్దన గణపతి స్తవం కమనీయంగా చేసాడు, తన మను చరిత్రములో.

అందుకే,

పెద్దన గారి మను చరిత్ర కల్పాంతముల దనుక మను చరిత్ర !!.

అవిఘ్నమస్తు..

స్వస్తి.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

సతాయింపు వారి సహజ గుణము !


ద్వా విమౌ పురుషౌ లోకే, శిరశ్శూల సమౌ మతౌ,
గృహస్థశ్చ నిరారంభో, యతిశ్చ సప్రతిగ్రహ:

లోకంలో ఇద్దరి వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు మనకు తల నొప్పిగా పరిణమిస్తారు.
ఎవరయ్యా వాళ్ళు, అంటే,

ఏపనీ చేయని ఇంటి యజమాని ఒకడు.

రెండో వాడు సన్యాసం తీసుకుని కూడా గృహస్థుల దగ్గర డబ్బు ఆశించే యతి.

వీళ్ళిద్దరితో తల నెప్పి ఇంతా అంతా కాదు. శ్లోకంలో శిరశ్శూల సమౌ అనే పదం వీళ్ళు మనకి తల నెప్పితో సమానం అని చెబుతోంది.

నిజమే కదూ, ఏపనీ చేయకుండా, నిర్వ్యాపారంగా ఇంట కూర్చుని తింటూ, అలాగని ఊరు కోకుండా ప్రతి దానికీ సతాయిస్తూ ఉండే మగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో తల నెప్పి కాక మరేమిటి?

ఇక, సన్యాసం తీసి కొన్న యతులు మన మతులు పోగొట్టే వైభోగాలు అనుభవిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం కదా? కాషాయం కట్టి, సర్వం పరిత్యజించామని చెప్పుకునే వాళ్ళు కూడా, ధనం కోసం పీడించడం సతాయింపు కాక మరేమిటి చెప్పండి ?

వీళ్ళలో కొందరికి కట్న కానుకలు కావాలి. పాద పూజలు కావాలి. పూల దండలు కావాలి. ఎర్ర తివాచీ ఆహ్వానాలు కావాలి. ఏసీ కార్లూ, గదులూ కావాలి. విమాన ప్రయాణాలు కావాలి. విదేశాలలో లభించే సకల వైభోగాలూ కావాలి.

కుదిరితే కప్పు కాఫీ లాగ, అందమైన అమ్మాయిలూ, సినీ తారలూ కావాలి ...

అబ్బో, ఆశా పాశము కడున్ నిడుపు. లేదంతంబు ....

పనీ పాటు చేయని వాళ్ళంటే, కేవలం రిటైరయిన వాళ్ళూ, వృద్ధులూ మాత్రమే అనుకో నక్కర లేదండీ. మంచి వయసులో ఉండే మగానుబావులు కొందరిలోనూ ఈ పని గండం గాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ సతాయింపు అనుభవించే ఇంట్లోని వ్యక్తులకే ఎరుక.

శ్లోకంలో పురుషుల గురించే చెప్పారు కనుక ఆడవారికి మినహాయింపు ఉందనుకో నక్కర లేదండోయ్.

పని చేస్తూనో, చేయకుండానో, , చేస్తున్నట్టు నటిస్తూనో, సతాయించే తల నెప్పి లలనలకు
తక్కువేం లేదు.

ఏతావాతా ఈ సతాయింపు గాళ్ళు తల నెప్పి మాత్రలూ, మందులూ తయారు చేసే కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లుగా చక్కగా పనికొస్తారు.

అయితే, అందుకూ సతాయిస్తారేమో, కదూ !

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఆట పాటల మేటి


ఆట పాటల మేటి, హరి కథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు విజయ నగర ప్రభువులు ఇచ్చిన ఒక సమస్యను ఈ విధంగా పూరించారు. చూడండి:

సానుల యొద్ద నిచ్చకము సల్పుచు లొంగుచునుంట కర్షమౌ
దానము సేయ కుంటకు వృధా దినముల్సరి పుచ్చుకుంటకున్
ఙ్ఞానియు జాణయైన తన నాథుని గన్గొను నప్డు కు
న్మానము ప్రేమ లజ్జయును మాటికి బోరగ బ్రీతి మీరెడున్.

నారాయణ దాసు గారి గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

దాసు గారి జీవిత చరిత్ర నా యెరుక చదవడం ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది.
హరి కథనే కాదు, అవసర పడితే గిరి కథ కూడ చెప్పటల దిట్ట దాసు గారు.

దాసు గారు గజ్జె కట్టి, విజయ నగరంలో గుమ్చీ అరుగు మీద, మూడు కోవెళ్ళ దగ్గర గొంతెత్తి
శంభో నినాదం చేసారంటే, మైకులు లేని ఆ రోజులలో ఊరు ఊరంతా మారు మ్రోగి పోయేదని చెబుతారు.

నేను తెలుగు పండితునిగా నియామకపు ఉత్తర్వులు అందుకుని తొలి సారిగా ఉద్యోగ జీవితంలో నిడగల్లు అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాయనయ్యాను. ఆ ఊరు మా స్వగ్రామం పార్వతీ పురానికి కేవలం 8 కి,మీ. దూరంలో ఉంది. బస్సు దిగేక 4 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ఇప్పుడు బస్సు సౌకర్యం వచ్చిందనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, ఆ నిడగల్లు గ్రామానికి దాసు గారు జన్మించిన అజ్జాడ అగ్రహారం చాలా దగ్గర. దాసు గారి జన్మస్థలాన్ని ఒకటికి రెండు సార్లు దర్శించుకునే అదృష్టం నాకు లభించింది. అంతే కాదు, విజయనగరంలో
ఐదేళ్ళ పాటు మహా రాజా ప్రభుత్వ సంస్కృత కలాశాలలో చదువుకునే రోజులలో నిత్యం దాసు గారి దివ్య గళంతో పునీతమైన గుమ్చీని, మూడు కోవెళ్ళని దాటుకుంటూ వెళ్ళే వాడిని.
అను నిత్యం నేనూ, మా మిత్రులూ అక్కడికి రాగానే దాసు గారిని తలుచుకుంటూ పరవశించి పోయే వాళ్ళం.

అప్పటి మా మిత్రులలో మంగిపూడి వేంకట రమణ మూర్తి దాసు గారి పరోక్ష శిష్య సరంపరలో ఒకడిగా హరి కథలు నేర్చుకుని, హరిదాసుగా మంచి పేరే సంపాదించుకున్నాడు.

ఈ సందర్భంగా నారాయణ దాసు గారి గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను ఓ సారి గుర్తు చేసుకుందాం:

1.
ఎవరీ ముగ్ధ మనోఙ్ఞ దర్శనుఁడెవండీ శారదా మూర్తి ! యీ
నవ శృంగార రసావతారుడెవరన్నా ! శ్రీమదజ్జాడయే
యవునా ! ఆ దరహాస!మానడకతీ!రాఠీవి!యాదర్ప! మా
కవితా దీప్తి! యనన్య సాధ్యములురా! కైమోడ్పులందింపరా!

2.
పండించె నీ కాలి గండ పెండెరము రం
గారు ముంగారు బంగారు పంట
నర్తించె నీ కీర్తి నవనవస్ఫూర్తి యా
సేతు శీతాచలక్ష్మాతలాన
జోహారులందె నీ సాహిత్య నందిని
కదలించి సహృదయ హృదయములను
గంభీరమయ్యె నీ శంభో నినాదంబు
దిగ్దిగంతాల బ్రతి ధ్వనించి

కాంతు లీనెను రాజ సభాంతరాల
నీ జయశ్రీ దృగంత నీరాజనాల
యక్షగాన కళా మహాధ్యక్ష పదవి
అక్షరంబయ్యె నీ పట్ల నాది భట్ల !

3.
చిఱు తాళముల జత చే ధరించిన చాలు
లయ తాళములు శుభోదయము పలుకు
కాలి గజ్జె లొకింత ఘల్లుమన్నను చాలు
భరతమ్ము నీ ముందు శిరసు వంచు
వీణతంత్రులు ముని వ్రేళ్ళు సోకిన చాలు
సంగీత వాహిని పొంగి పొరలు
గంటంబుఁబూని క్రీగంటఁగాంచిన చాలు
కవిత నీ యెదుట సాక్షాత్కరించు

నేటి కథకులందు నీ పేరు చెప్పక
గజ్జె కట్టు వాడు కాన రాడు
తెలుగు వెలుగు దేశ దేశాన నింపిన
హరి కథా పితా మహా ! నమోస్తు !

4.
ఎవడురా! యచట తెండింకొక్క గ్లాసంచు
అమృత రక్షకులకు నాఙ్ఞ యొసఁగి
సుధ కంటె మా హరి కథ లెస్స యని బృహ
స్పతి తోడ నర్మ భాషణము నెఱపి
ఏవమ్మ వాణి ! యేదీ వీణ ! సరి క్రొత్త
తీవలా ! యని గిరాందేవి నడిగి
ఆగవే రంభ ! ఆ హస్త మట్టుల గాదు
త్రిప్పి పట్టు మటంచు తప్పు దిద్ది

ఏమయా ! క్రొత్త సంగతు లేమటంచు
బ్రహ్మమానస పుత్రుని పలుకరించి
ఆది భట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగునిందందు స్వర్గ మందిరములందు !

ఆ దివ్య మహస్సుకి నమోవాకములర్పిస్తూ ....

స్వస్తి.



6, సెప్టెంబర్ 2010, సోమవారం

పోనిద్దురూ ...!!


ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా:
ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాం
గిరిశిఖరగతా2పి కాక పంక్తి:
పులినగతై ర్న సమత్వమేతి హంసై:

లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు.మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు.
కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి.
మరి హంసలో ? నేల మీద నదీ పులినతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !

ఇదీ ఈ శ్లోకార్ధం.

నిజమే కదా, ఉన్నతులు నిగర్వులై, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇడుములు పడుతూ ఉండడం, కుసంస్కారుల చేత నిదాదరణ. తిరస్కారాలు పొందుతూ ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాం.

అలాగే, అధములు ఆడంబర జీవనం గడపడమూ మనకి తెలిసినదే. నిజానికి ఈ పాడు లోకంలో అలాంటి వారికే మన్నన ఎక్కువగా ఉండడం బాధాకరం. కాని, అది లోక రీతి.

ఏం చేస్తాం చెప్పండి?
యస్యాస్తి విత్తం స నర: కులీన: స పండిత: స:శ్రుతవాన్ గుణఙ్ఞ:
స ఏవ వక్తా సచ దర్శనీయ: సర్వే గుణా: కాంచన మాశ్రయన్తి.

ఎవడు ధనవంతుడో వాడు కులీనుడు. పండితుడు. వివేకి. ధన్యుడు. నేర్పరి. ఆహా, అన్ని గుణాలూ బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా !

అయితే, కాలాంతరంలో నయినా ఎవరి విలువలు ఎలాంటివో విశదం కాక తప్పదు. కాకులు కొండ కొనన ఉన్నా, హంసలతో సరి కావు కదా !

పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొన కొమ్మలనుండగ గ్రింద గండభే
రుండ మదేభసింహ నికురంబములుండవె? చేరి భాస్కరా !

చెట్టు క్రింద గండ భేరుండాలు, మదించిన ఏనుగులు, సింహాలు ఉంటూ ఉండగా, ఒక కోతి మాత్రం చెట్టు కొమ్మల చివరన ఎక్కి కూర్చున్నదట. అంత మాత్రం చేత, ఆ మృగములకు వచ్చిన తక్కువతనం ఏమీ లేదు.
అలాగే, మహా పండితులందరూ నేల మీద సుఖాసీనులై ఉంటే, ఒక అల్పుడు ఉన్నతాసనం ఎక్కి కూర్చుంటే ఆ పండితుల గొప్పతనమేమీ తరిగి పోదు.

మణిలాగ కనిపించినంత మాత్రం చేత గాజు పూస మణి కాజాలదు. గాజు గాజే.మణి మణే కదా !

అలాగే, వసంత కాలం వచ్చినప్పుడు కదా, కాకి ఏదో, కోకిల ఏదో తెలియవచ్చేది ?!


5, సెప్టెంబర్ 2010, ఆదివారం

గురు పూజోత్సవం సందర్భంగా నా కథ - గురు దక్షిణ.


ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. నేను తెలుగు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో 35 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ చేసాను.

1980 లో నేను వ్రాసిన ఈ కథను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీముందు ఉంచుతున్నాను.
తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయునికి ఒక వ్యక్తి సమర్పించిన గురు దక్షిణ ఎలాంటిదో ఈ కథలో చూడ వచ్చును.
సంక్లిష్టమైన మానవ మనస్త్తత్వాన్ని ఇందులో చిత్రీకరించడానికి ప్రయత్నించాను.

బడి నేపథ్యంలో నేను రాసిన కొన్ని కథలలో ఇది ఒకటి. ఈ కథ 1980 లో ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురితం.

గెటే నృత్యం చేసాడంటే, చేయడూమరి !!


మహా కవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక రచనలలో ఒక అపూర్వ కళాకృతి. మహోన్నతమైన రచన. గెటే పండితుడు ఈ నాటకాన్ని చదివి ఆనందం పట్ట లేక, నృత్యం చేసాడుట ! (ఇక్కడ చూడండి)

మానవ జీవితంలో సుఖ దు:ఖాలు, కష్ట సుఖాలు, హిత అహితాలు, కలిమి లేములు, మంచి చెడ్డలు, స్నేహ విరోధాలు, చీకటి వెలుగులు, విషాద వినోదాలూ .. ఇలా చెప్ప లేనన్ని
ద్వంద్వాలు తారస పడుతూనే ఉంటాయి. నిత్య నైమిత్తిక జీవితంలో వాటికి తుల్య ప్రాధాన్యమిచ్చి
జీవనయానం సాగించాలి. ఈ అర్ధాన్ని బోధించే చక్కని శ్లోకం ఒకటి అభిఙ్ఞాన శాకున్తమ్ నాటకంలో చతుర్ధాంకంలో ఉన్నది. చూడండి...

సందర్భం క్లప్తంగా:

దుష్యంత మహారాజు కణ్వాశ్రమంలో శకున్తలను గాంధర్వవిధిని వివాహం చేసుకుని, ఆమెకు తన నామాంకితమైన అంగుళీయకాన్ని బహూకరించి, త్వరలో రాజలాంఛనాలతో రాచనగరుకి రప్పించుకుంటానని మాట యిచ్చి, రాజధానికి వెళ్ళి పోయాడు.

రాజునే తలుచుకుంటూ పరాకు పడిన శకుంతల ఆశ్రమానికి ముక్కోపి ముని దుర్వాసుడు రావడం గమనించనే లేదు. అతిథి సేవలో లోపం కలిగింది. ముని కోపించి,ఎవనిని తలుచుకుంటూ తన రాకను గమనించ లేదో, ఆతడు ఆమెను మరిచి పోవుగాక ! అని శాపమిచ్చాడు. పాపం. కడు ముద్దరాలు శకుంతల ఆ సంగతీ గమనించ లేదు. చెలికత్తె ప్రియంవద ముని రాకను, శాపమిచ్చిన వైనాన్నీ గమనించి, మునిని వేడుకుని ప్రసన్నుని చేసుకుంది. ముని శాపవిమోచన మార్గాన్ని ప్రసాదించాడు. అభిఙ్ఞాన దర్శనం చేత శాపం తొలిగి పోగలదని చెప్పాడు. దుష్యంతుడిచ్చిన అంగుళి శకుంతల వద్ద ఉన్నది కనుక, అప్పటికి చెలికత్తె ప్రియం వద స్తిమిత పడింది. తర్వాత శకుంతల అత్తవారింటికి ఇరువురు కణ్వ శిష్యులు, చెలికత్తెలు అనసూయ ప్రియంవదలు, గౌతమి వెంటరాగా బయలు దేరడం, నదిని పడవలో దాటుతూ ఉండగా నదీ జలాలలో అంగుళి జారి పోవడం, దుష్యంతుడు అభిఙ్ఞానం ( గుర్తు) లేనందు వలన ఆమె ఎవరో గుర్తు రాక తిరస్కరించడం జరిగింది.

అత్తవారింటికి బయలు దేరిన శకుంతలకు ఎరురు కానున్న కష్టాలను, అనంతర కాలంలో అవి తొలిగి పోయి ఆమెకు కలగనున్న శుభాలను స్ఫురింప చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన శ్లోకం చతుర్ధాంకంలోనే కాళిదాసు రచించాడు. చూడండి:

నాల్గవ అంకంలో కణ్వ శిష్యుడు నిద్ర లేచి, ఒక వంక అస్తమిస్తున్న చంద్రుడిని, ఒక వంక ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రభాత వేళని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది.

యాత్యేకతో2స్త శిఖరం పతిరోషధీనా
మావిష్కృ తో2రుణ పురస్సర ఏకతో2ర్క:
తేజో ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్
లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.

ఒక వేపు చంద్రుడు అస్తగిరికి పోతున్నాడు.
ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా ఉదయిస్తున్నాడు.
ఆహా! రెండు దివ్య తేజస్సులు ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా.
ఒక తేజస్సు అంతర్హితమవుతూ ఉంటే, ఒక తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది. ఏక కాలంలో కనిపిస్తున్న ఈ సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు తెచ్చేదిలాగ ఉన్నది కదా !

ఇదీ ఈ శ్లోక భావం.

కష్ట సుఖాలు కావడి కుండలు. అందు చేత కష్టం వస్తే క్రుంగి పోనూ కూడదు. సుఖం వస్తే పొంగి పోనూ కూడదు.

ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన ఈ శ్లోకానికి కందుకూరి వీరేశలింగము గారి అనువాదం కూడ చూడండి:

ఒక దెస నస్త శైలమున కోషధినాధుడు పోవుచున్న వాఁ
డొక దెస భాస్కరుం డుదయ మొందె ననూరు పురస్సరంబుగా
నొక సమయంబునందె వ్యసనోదయముల్ గనె రెండు తేజముల్,
ప్రకట సుఖంబు దు:ఖమును బ్రాణులకిట్లని తెల్పు కైవడిన్


మూల శ్లోక హృదయాన్ని అనువాద రచన ఎంత గొప్పగా వ్యక్తం చేసిందో కదూ !

ఇప్పటికి స్వస్తి.