మన సాహితీ సంపద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన సాహితీ సంపద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

గెటే నృత్యం చేసాడంటే, చేయడూమరి !!


మహా కవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక రచనలలో ఒక అపూర్వ కళాకృతి. మహోన్నతమైన రచన. గెటే పండితుడు ఈ నాటకాన్ని చదివి ఆనందం పట్ట లేక, నృత్యం చేసాడుట ! (ఇక్కడ చూడండి)

మానవ జీవితంలో సుఖ దు:ఖాలు, కష్ట సుఖాలు, హిత అహితాలు, కలిమి లేములు, మంచి చెడ్డలు, స్నేహ విరోధాలు, చీకటి వెలుగులు, విషాద వినోదాలూ .. ఇలా చెప్ప లేనన్ని
ద్వంద్వాలు తారస పడుతూనే ఉంటాయి. నిత్య నైమిత్తిక జీవితంలో వాటికి తుల్య ప్రాధాన్యమిచ్చి
జీవనయానం సాగించాలి. ఈ అర్ధాన్ని బోధించే చక్కని శ్లోకం ఒకటి అభిఙ్ఞాన శాకున్తమ్ నాటకంలో చతుర్ధాంకంలో ఉన్నది. చూడండి...

సందర్భం క్లప్తంగా:

దుష్యంత మహారాజు కణ్వాశ్రమంలో శకున్తలను గాంధర్వవిధిని వివాహం చేసుకుని, ఆమెకు తన నామాంకితమైన అంగుళీయకాన్ని బహూకరించి, త్వరలో రాజలాంఛనాలతో రాచనగరుకి రప్పించుకుంటానని మాట యిచ్చి, రాజధానికి వెళ్ళి పోయాడు.

రాజునే తలుచుకుంటూ పరాకు పడిన శకుంతల ఆశ్రమానికి ముక్కోపి ముని దుర్వాసుడు రావడం గమనించనే లేదు. అతిథి సేవలో లోపం కలిగింది. ముని కోపించి,ఎవనిని తలుచుకుంటూ తన రాకను గమనించ లేదో, ఆతడు ఆమెను మరిచి పోవుగాక ! అని శాపమిచ్చాడు. పాపం. కడు ముద్దరాలు శకుంతల ఆ సంగతీ గమనించ లేదు. చెలికత్తె ప్రియంవద ముని రాకను, శాపమిచ్చిన వైనాన్నీ గమనించి, మునిని వేడుకుని ప్రసన్నుని చేసుకుంది. ముని శాపవిమోచన మార్గాన్ని ప్రసాదించాడు. అభిఙ్ఞాన దర్శనం చేత శాపం తొలిగి పోగలదని చెప్పాడు. దుష్యంతుడిచ్చిన అంగుళి శకుంతల వద్ద ఉన్నది కనుక, అప్పటికి చెలికత్తె ప్రియం వద స్తిమిత పడింది. తర్వాత శకుంతల అత్తవారింటికి ఇరువురు కణ్వ శిష్యులు, చెలికత్తెలు అనసూయ ప్రియంవదలు, గౌతమి వెంటరాగా బయలు దేరడం, నదిని పడవలో దాటుతూ ఉండగా నదీ జలాలలో అంగుళి జారి పోవడం, దుష్యంతుడు అభిఙ్ఞానం ( గుర్తు) లేనందు వలన ఆమె ఎవరో గుర్తు రాక తిరస్కరించడం జరిగింది.

అత్తవారింటికి బయలు దేరిన శకుంతలకు ఎరురు కానున్న కష్టాలను, అనంతర కాలంలో అవి తొలిగి పోయి ఆమెకు కలగనున్న శుభాలను స్ఫురింప చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన శ్లోకం చతుర్ధాంకంలోనే కాళిదాసు రచించాడు. చూడండి:

నాల్గవ అంకంలో కణ్వ శిష్యుడు నిద్ర లేచి, ఒక వంక అస్తమిస్తున్న చంద్రుడిని, ఒక వంక ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రభాత వేళని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది.

యాత్యేకతో2స్త శిఖరం పతిరోషధీనా
మావిష్కృ తో2రుణ పురస్సర ఏకతో2ర్క:
తేజో ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్
లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.

ఒక వేపు చంద్రుడు అస్తగిరికి పోతున్నాడు.
ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా ఉదయిస్తున్నాడు.
ఆహా! రెండు దివ్య తేజస్సులు ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా.
ఒక తేజస్సు అంతర్హితమవుతూ ఉంటే, ఒక తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది. ఏక కాలంలో కనిపిస్తున్న ఈ సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు తెచ్చేదిలాగ ఉన్నది కదా !

ఇదీ ఈ శ్లోక భావం.

కష్ట సుఖాలు కావడి కుండలు. అందు చేత కష్టం వస్తే క్రుంగి పోనూ కూడదు. సుఖం వస్తే పొంగి పోనూ కూడదు.

ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన ఈ శ్లోకానికి కందుకూరి వీరేశలింగము గారి అనువాదం కూడ చూడండి:

ఒక దెస నస్త శైలమున కోషధినాధుడు పోవుచున్న వాఁ
డొక దెస భాస్కరుం డుదయ మొందె ననూరు పురస్సరంబుగా
నొక సమయంబునందె వ్యసనోదయముల్ గనె రెండు తేజముల్,
ప్రకట సుఖంబు దు:ఖమును బ్రాణులకిట్లని తెల్పు కైవడిన్


మూల శ్లోక హృదయాన్ని అనువాద రచన ఎంత గొప్పగా వ్యక్తం చేసిందో కదూ !

ఇప్పటికి స్వస్తి.




14, ఆగస్టు 2010, శనివారం

పూల బాసలు ...


తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది.
ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అందాలు పేర్చి అందించిన ఆ అదృశ్య హస్తం ఎవ్వరిదా అని విస్తు పోతాం!
పూలు పలకరిస్తాయి. పూలు ఊసులు చెబుతాయి. కొన గోటితో త్రంచ బోతే విలపిస్తాయి. తల్లి కొమ్మనుండి, తండ్రి రెమ్మ నుండి , నిర్దయగా వేరు చేయ బోతే, వద్దని వేడుకుంటాయి. దీనంగా అర్ధిస్తాయి.

అలాంటి పువ్వులను గురించి కొన్ని కబుర్లు ఇవాళ చెప్పుకుందామా?

అలరు, కుసుమము, నన, విరి, పుష్పము, పూవు, ప్రసవము, ప్రసూనము, ఫల్యము, లతాంతము, సుమము, సూనము, సౌమనస్యము ...వీటన్నింటికీ పువ్వు అనే అర్ధం
( ఇంకా ఉన్నాయి లెండి !)
పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు స్వీకరిస్తాయి. అందుకే కవి ‘ పూల కంచాలలో రోలంబులకు, రేపటి భోజనము సిద్ధ పరచి పరచి ... ’ ఆ దేవ దేవుడు ఎంత అలసి పోయాడో అని బెంగ పడతాడు.
విరహతాపాన్ని పెంచి, స్త్రీపురుషులను ఏకశయ్యానువర్తులుగా చేసే మన్మథుడికి కుసుమాయుధుడు, పుష్పబాణుడు, అలరు విల్తుడు ... ఇలాంటి పేర్లు ఉన్నాయి. పూల బాణాలు ధరించిన వాడు అని వాటి అర్ధం,
మదనుడు పంచ బాణుడు. ఐదు రకాల పూలను బాణాలుగా ఉపయోగించే వాడు. ఆ అయిదు రకాలూ ఏమిటో తెలుసా?
అరవిందము, అశోకము , చూతము , నవ మల్లిక, నీలోత్పలం.
సరే, పూలు పలకరిస్తాయి అనుకున్నాం కదూ? ... చూడండి :

పూల బాసలు తెలుసు యెంకికీ, తోట
పూల మనసు తెలుసు యెంకికీ!
పూల మొక్కల నీటి జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది !
పూల బాసలు తెలుసు యెంకికీ ...అని, నండూరి వెంకట సుబ్బారావు గారు ఎంకి పాటల (కొత్త పాటల) లో పూల బాసల గురించి చెప్పారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో తనని త్రుంచబోయిన వాని గుండె కరిగి పోయేలా విలపిస్తూ తన గోడు చెప్పుకున్నది. మా ప్రాణము తీతువా ! అని బావురుమన్నాయి. తల్లి ఒడిలో చిగురుటాకుల శయ్య మీద హాయిగా నిదురించే మమ్ము చిదిమి, అమ్ముకుంటావా? మనసు లేని నీ పూజ లెందుకోయి ? అని అడిగాయిట, పూలు...
మా ఆయువు నాలుగు గడియలే కదా, ఆయువు కలిగినంత దాక మా తీవ తల్లి చేతులలో హాయిగా ఊయలలూగుతూ మురిసి పోతూ ఉంటాము. ఆయువు తీరాక ఆ తల్లి పాదాల చెంతనే రాలి పోతాము
మా పూల సువాసనలతో గాలి పరిమళిస్తుంది. తుమ్మెదలకు తేనెల విందు చేస్తాము. మీ వంటి వారి కన్నులకు కనువిందు చేసి హాయిని కలిగిస్తాము. అలాంటి మమ్మలని చిదిమి వేయడం తగునా ? తల్లీ బిడ్డలని వేరు చేస్తావా ?
మమ్ములను త్రుంచడం వల్ల నీ చేతులు మా రక్తధారలతో తడిసి పోతాయి. అలాంటి నెత్తురు పూజని పరమేశ్వరుడు స్వీకరించడు సుమా!

నువ్వే కాదయ్యా, మీ ఆడువారూ మాకు హాని చేయడంలో ఏమీ తక్కువ తిన లేదు ...

ఊలు దారాలతో గొంతుకురిబిగించి,
గుండె లోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ! దయ లేని వారు మీ ఆడువారు !

మా నెత్తురులతో చేసిన అత్తరులను మీ కంపు గొట్టు దేహాల మీద అలము కుని శయ్యల మీద వెద జల్లు కుని రాత్రంతా దొర్లుతారు. సిగ్గు లేదూ?

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి, నశించి పోయె , మా
యౌవన మెల్ల కొల్ల గొని ఆ పయి చీపురు తోడ చిమ్మి, మ
మ్మావల పార బోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా?

అని పూలు చీవాట్లు పెట్టాయి ....

గౌతమీ కోకిల బిరుదాంకితులు వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి కాంక్ష కవితా ఖండికలో పూల మనోభావాలు ఎలా ప్రతి ఫలించాయో, చూడండి ... మచ్చుకి ఒకటి రెండు పద్యాలు ...

పేదల రక్త మాంసములఁబెంపు వహించి, దయా సుధా రసా
స్వాద దరిద్రు లైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదర వోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నాయెదన్

పేదల రక్తమాంసాలతో బలిసి, దయ ఒక్కింత కూడ లేకుండా, మతోన్మాదాన్ని ఎక్కువ చేస్తూ, దేవుడి పేరుతో నిలబెట్టిన రాతి బొమ్మల మెడలలో పూజకై నిలిచి, వాడి పోయే ఆ పాడు బ్రతుకు నాకు వద్దు.

కానుకనై ధరాధిపుల కాళ్ళ కడం బొరలాడి వాడి పో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వార తోరణా
స్థానము నందురింబడఁగ జాలను, దోసిట పేరి ఘోర కా
రా నరకమ్ము నందుసురు రాల్పగ లేను నిమేష రక్తికై

మీ క్షణికానందం కోసం - రాజుల కాళ్ళ దగ్గర కానకనై పొర్లి వాడి పోవడం నాకు సమ్మతం కాదు.
ధూళి ధూసరితమైన ద్వారాలకు తోరణాన్నయి ఉరి వేసు కోవడం నాకు నచ్చదు.
మీ చేతుల కారాగారంలో మ్రగ్గి పోలేను.

మరి పువ్వు ఏమి కోరుకుంటున్నది? ... చూడండి ...

నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృ దేశ సే
వా చరణమ్ము నందసువు లర్పణఁజేసిన పార్ధివ
శ్రీ చెలువారు చోటఁ దదసృగృచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలి పోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్

దేశం దాస్యంలో మ్రగ్గి పోవడం సహించ లేక, ధేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి పార్ధివ శరీరాలు ఉండే సమాధుల మీద వాసనలు వెదజల్లుతూ వికసించి, అక్కడే, ఆ పవిత్రమైన మట్టి లోనే వాడి వత్తలై పోవడం నాకు చాలా ఇష్టం ...

ఎంత గొప్ప భావనో కదూ , యిది?

మరి కొన్ని పూల ముచ్చట్లు చూడండి ...

పూల కయ్యాలు:

అరణపు కవి నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లో పారిజాతపుష్పం కోసం ఎంత రచ్చ అయి పోయిందో మీకు తెలిసినదే కదా!
తగవుల మారి నారదుడు ఒకే ఒక్క పారిజాతం తెచ్చి ,శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దానినతడు దేవేరి రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి సత్యభామకి తెలిసి పోయింది. ఇంకేముంది ! ఆవిడ అలగడం, పతి నుదుటున తన్నడం, అతడామెను బుజ్జగించి, దేవేంద్రుని ఎదిరించి మొత్తం పారిజాతవృక్షాన్నే దేవ లోకం నుండి పెకలించుకుని వచ్చి సత్య ఇంటిలో పెరటి చెట్టుగా నాటడం ... చక చకా జరిగి పోయాయ్ ...
ఆ పారిజాతం మహిమ ( నారదుని మాటల్లోనే ) ఎలాంటిదంటే,

పరిమళము సెడదు, వాడదు
పరువము దప్పదు పరాగభర భరితంబై
నిరతము జగదేక మనో
హరమగు నీకుసుమ రాజమంబుజ వదనా.

ఆ పువ్వుని తనకివ్వక తన సవతి రుక్మిణికి యిచ్చినందుకు కోపించి, ఒళ్ళూ మీదా కానక అలక పానుపు మీద పరుండి, అనునయించ బోయిన మగని కాలితో తన్నిందిట సత్య.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్లయగు ; నాధల్నేరముల్సేయఁబే
రలుకం జెంది కాంత లుచిత వ్యాపారమల్నేర్తురే ?

తన తప్పు సైరింపుమని ఆమె పాదాల కడ తల పెట్టిన నాధుని తలని సత్య ఎడమ పాదంతో తన్నిందిట ! ప్రియ నాధులు తప్పులు చేస్తే, అలక చెందిన ఆడువారు ఉచితానుచితాలు చూడరు కదా ? ... అని, కవి సమర్ధన.

ఈ పద్యం చూడండి:

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ?

భాగవతంలో పోతన గారి పద్యం ఎంత మనోహరమైనదో చూడండి.

నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ ? ... ... అని గోపికలు పూలతో చేసే సంభాషణ ప్రసిద్ధమే కదా.

పూలు కూడా ఊసులాడుతాయని దీని వలన తెలుస్తోంది కదూ?

మహా భారతంలో మరో పూల కయ్యం మీకు తెలిసినదే కదా?
ద్రౌపది ముచ్చట పడిందని, భీముడు సౌగంధికాపహరణం చేయడం, ఆ క్రమంలో హనుమతో చిన్న పాటి కయ్యం, తర్వాత ఆ పువ్వుల కోసం కాపలాదారులతో చేసిన యుద్ధం ... అదో పెద్ద కథ. పూల కధ.

మరొకటి రెండు పూల ముచ్చట్లు .....

పూల చెండుతో ఫ్రియుడొకటంటే, పేము కర్రతో తా రెండనే గడుగ్గాయలూ ...
రాచరికపు రోజులలో గడసరి విటులతో పుష్ప లావికల సరసోక్తులూ ...
చెప్పాలంటే చాలా ఉన్నాయి ....
చెవిలో పువ్వు పెట్టడం ... వంటి నానుడులూ ...
పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మడం వంటి సామెతలూ ...

ఇలా చెప్పుకుంటే పూల బాసలు అనంతం కదూ!

పువ్వులనీ, పసి బిడ్డల బోసి నవ్వులనీ, ఇంద్రధనుస్సులనీ, పురి విప్పిన నెమలి పింఛాలనీ,
చిగురించిన కొమ్మలనీ, రెమ్మలనీ, తలిరాకు తల్పాన మెరిసి పోయే తుహినకణాలనీ, చంద్ర కిరణాలనీ , కోకిలల గొంతులనీ, పిట్టల కువకువలనీ, అందమైన వేకువలనీ, చల్లని సాయంత్రాలనీ, జలపాతాలనీ, ... ఇలా ఎన్నో అందాలని ప్రసాదించిన ఆ దయామయుడికి నమోవాకములతో ..

ఇప్పటికి స్వస్తి.

`









10, ఆగస్టు 2010, మంగళవారం

వరమాల ఎవరి మెడలో ?


నైవ వ్యాకరణఙ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం,

దూరాత్సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాల వచ్ఛాంధసాత్,

మీమాంసానిపుణం నపుంసక ఇతి ఙ్ఞాత్వా నిరస్యాదరాత్,

కావ్యాలంకరణఙ్ఞ మేవ కవితాకన్యా వృణీతే స్వయమ్

కవితా కన్యకు వెలకట్టగల రసఙ్ఞు లెవరు ?

కవితా కన్యకు ప్రియు లెవరు ?

వ్యాకరణ వేత్తలా ? తార్కికులా ? ఛాందసులా ? మీమాంసకులా ? కావ్యాలంకరణ వేత్తలా ?

ఎవరినామె వరిస్తుంది? ఎందు చేత? ఇవీ ప్రశ్నలు. ఇవిగో జవాబులు:

కవితా కన్యకు వ్యాకరణవేత్త తండ్రివంటి వాడు. అతడామె గుణ దోషములను విచారించి, చక్కగా తీర్చి దిద్దుతాడు. తండ్రిలాంటి వ్యాకరణవేత్తను కవితా కన్య అభిలషించే ప్రశ్నే లేదు.

ఇక తార్కికుడో ? అతడామెకు సోదరతుల్యుడు. ఆమె అతనిని అంగీకరించదు. ఛాందసుడు - అంటే వేదవేత్త. లౌకిక ఙ్ఞాన శూన్యుడు. వేదాధ్యయన జడుడు. కనుక ఆమె అతనిని అంగీకరించదు. మత్త గజంనుండి దూరంగా జరిగి పోయినట్టుగా ఆమె అతనిని సమీపించదు.

మీమాంసా నిపుణుడో ? అతడు నపుంసకుడని తలచి వానినుండి దూరంగా జరిగి పోతుంది.

వైయాకరణులు , తార్కికులు , ఛాందసులు , మీమాంసకులు ... వీళ్ళందరూ కవిత్వ విషయంలో ఏకపక్షంగా ఉండే వాళ్ళే. వాళ్ళ శాస్త్రం ప్రకారం ఆమె గుణగణాలను మదింపు చేసే వారే. ఎవరికీ కవితా రసాన్ని ఆస్వాదించే లక్షణం లేదు. లక్ష్య లక్షణ యుక్తంగా ఉందా లేదా అనే తప్ప, వారెవరూ రసాస్వాదనా దృష్టి పరులు కాజాలరు.

అందు చేత కవితా కన్య వారిని అనాదరిస్తుంది. వారి నుండి దూరంగా తొలిగి పోతుంది.

మరి, ఎవరినయ్యా ఆమె వరిస్తుంది ?

కావ్యాలంకరణవేత్తను మాత్రమే ఆమె వరిస్తుంది. అలంకార శాస్త్రఙ్ఞులు మాత్రమే కవితకు వెలకట్టి రసాస్వాదన చేయగల వారు. వారు రసఙ్ఞులు. అందు వల్ల వారే కవితా కన్యకు ప్రియులు.

రసఙ్ఞత ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక, ఈ పద్యం కూడా చూదాం ...

చదువది యెంత గల్గిన రసఙ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్ధకంబు; గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్

పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చునుటయ్య భాస్కరా !

ఎంత చదువుకున్నా , రసఙ్ఞత ఉండాలయ్యా. అది లేనప్పుడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్ధం .రసాప్వాదన చేసే మనసు ఉండాలి. లేనప్పుడు ఎంత చదివీ ఏం లాభం ? నలపాకంలాగ ఎంత మంచి కూర ఘుమఘుమలాడేలా చెయ్యి, కాని దానికి రుచిని తెచ్చే ఉప్పు వెయ్యడం మానీసేవనుకో, ఆ కూరకి మరి రుచేం ఉంటుంది చెప్పు ?

ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా

విలిఖితాని సహే చతురానన !

అరసికేషు కవిత్వ నివేదనం

శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!

ఓ బ్రహ్మ దేవుడా ! ఎన్ని కష్టాలయినా నా నుదుటన రాయి. భరిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం ముమ్మాటికీ రాయవద్దయ్యా.

అని కవిగారు వేడుకోవడం తెలిసినదే కదా ?

కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు

కోమలులు సౌరెక్కునా? ... ... ... అని గురజాడ తృణీకరించినదీ ఇలాంటి అరసికులనే.

అరసికులలో మరో రకం జాత్యంధకారులు. వీరు కులాన్నిబట్టి కవితకు వెలకడతారు.

నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు, రే

ఖా కమనీయ వైఖరులు గాంచి, ‘భళీ!భళి!యన్న వాడె, ‘మీ

దే కులమన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవు చో

బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్

నా కవిత్వాన్ని చదివి బాగుందని మెచ్చుకుంటూనే, నా కులం ఏదని అడిగి తెలుసుకుని, చివాలున లేచిపోయి నన్నూ, నా కవిత్వాన్నీ అనాదరించే వారూ ఉన్నారు. అప్పుడు నా గుండెలో బాకు దించినంతగా బాధ కలుగుతుంది. అని బాధతో పలికాడు కవి జాషువా.

అరసికులను మరింత ఘాటుగా తిట్టిన కవి గారూ ఉన్నారు. చూడండి ...

నక్కలు బొక్కలు వెదుకును

అక్కరతో నూరపంది అగడిత వెదకున్

కుక్కలు చెప్పులు వెదుకును

తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్

ఎంత ఉక్రోషపడితే ఇంత ఘాటయిన తిట్టు వస్తంది చెప్పండి ?

రస సిద్ధి కల కవులకీ, అల్ప కవులకీ తేడా ఎప్పుడూ ఉంటుంది.

శ్లోకం చెబుతే భోజుడు తగిన కానుకలు ఇస్తాడు కదా అనే దురాశతో ఓ కవి శ్లోకం రాయాలని ప్రయత్నించి కొంత వరకూ ఏదో గిలికి, ఆపైన చేత కాక డీలా పడ్డాడు. వాడి అవస్థ చూసి, కాళిదాసు జాలి పడి తక్కినది పూర్తి చేసి ఇచ్చేడు.. ఇంకే ముంది !! ఆ పిల్ల కాకి ... కాదు కాదు ... ఆ పిల్ల కవి దానిని రాజు గారికి వినిపించాడు. చూడండి ...

భోజనం దేహి రాజేంద్ర !

ఘృత సూప సమన్వితమ్.

ఇంత వరకూ కవిగారి పైత్యం. ఓ రాజా నాకు నెయ్యీ ,పప్పుతో మంచి భోజనాన్ని ఇవ్వవయ్యా అని దీని అర్ధం

మాహిషం చ శరచ్చంద్ర

చంద్రికా ధవళమం దధి:

ఇది కాళిదాస పూరణ.

శరత్కాలపు వెన్నెల లాంటి తెల్లని గేదె పాలతో చేసిన గడ్డ పెరుగుతో భోజనం సమకూర్చవయ్యా అని పూర్తి చేసాడు కాళిదాసు. అప్పటికి కదా, పిల్ల కవి గారి కపిత్వం కవిత్వం అయి శోభించింది. భోజుడు కవితా రసగుణగ్రహణ పారీణుడు కనుక, ఈ శ్లోకంలో కాళి దాసు చేయి పడిందని పోల్చుకుని, కవికి తిని బతకమని ( మరెప్పుడూ కవిత్వం జోలికి వెళ్ళ వద్దని హెచ్చరించే ఉంటాడు, బహుశా) కొంత ధనమిచ్చి, కాళిదాసుకి గొప్ప సత్కారం చేసాడు.

జయన్తి తే సుకృతినో:

రస సిద్ధా: కవీశ్వరా:

నాస్తి తేషాంయశ: కాయే

జరామరణజం భయమ్

రస సిద్ధులయిన కవులు పుణ్యాత్ములు. వారికి జరామరణ భయాలు లేవు. వారు యశ:కాయులు. వారికి జయము కలుగు గాక !

స్వస్తి.

8, ఆగస్టు 2010, ఆదివారం

బావా బావా పన్నీరు ! బావని పట్టుకు తన్నేరు !!


ఓ మరదలు పిల్ల చదువు కున్నదే కాక, కవిత్వం కూడా చెబుతుంది. బావ గారు సాహిత్య గంధ శూన్యులు. నామీద కవిత్వం చెప్పవూ ? అని మరదలుని బ్రతిమలాడేడు. బావ గారి ముచ్చట తీర్చడం కోసం ఆ కొంటె పిల్ల ఏం చెప్పిందంటే ...

అందమున చూడ రాము బంటైన వాడు
నాగరికతను జము వాహనమునకీడు
శుచికి హేమాక్షుఁజంపిన శూరు జోదు
వసుధలో లేడు మా బావ వంటి వాడు !!

మా బావ అందంలో రామ బంటుతొ సమానం. ( కోతి)
నాగరికతలో యముని వాహనంతో సమానం ( దున్న పోతు)
శుభ్రతలో హిరణ్యాక్షుని చంపిన వాడితో సమానం ( వరాహావతారం. పంది)

మా బావలాంటి వాడు లోకం లోనే లేడు !
మరదలు చెప్పిన పద్యం విని ఆ బావ గారు మురిసి పోయి ఉంటారు ...

3, ఆగస్టు 2010, మంగళవారం

ఎందుకయ్యా, వెక్కి వెక్కి ఏడిచేవూ ?!

యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.




2, ఆగస్టు 2010, సోమవారం

గ్యారంటీ లేదు !!


మన పూర్వ కవులలో కొందరికి చిత్ర కవిత్వమన్నా , బంధ కవిత్వమన్నా కొంచెం మోజు జాస్తి. అది వారి ప్రైవేటు హా బీ . దానిని తప్పు పట్ట లేం. వ్వక్తుల ప్రైవేటు లైఫు వారి వారి స్వంతం. వీటిని సాము గరిడీలతో పోల్చి, పెదవి విరిచే వారూ ఉన్నారు. వాటిలో కవిత్వం అనే దినుసు కోసం వెతకడం అంత అవసరం లేదు. ఉండ వచ్చును. ఉండక పోవచ్చును. గ్యారంటీ లేదు. అది మన భాగదేయం మీద, లేచిన వేళా విశేషం మీద ఆధార పడి ఉంటుంది. ఏమయినా , అనంతమూ , అపురూపమూ , అపూర్వమూ అయిన మన కవితా స్రవంతిలో వాటిని అంతర భాగాలుగానే గుర్తించాలి కాని, కోపగించుకో కూడదు, మరి.

ఏకాక్షర నిఘంటు సాయంతో, ప్రయాస పడి అర్ధాన్ని సాధించ గలిగే ఓ రెండు పద్యాలను చూదాం.

రరో రరే రర రురో
రరూ రూరు రురోరరే
రేరే రీరా రార రరే
రారే రారి రిరా రిరా

ర = రామ శబ్దంలో గల రేఫ వలన
రో = భయము కలిగి
అర = వేగంగా పరిగెత్తు
రురో: = లేడికి ( లేడి రూపములో ఉన్న మారీచునికి)
అరే: = శత్రువైన శ్రీరాముని
రేరే (ర+ఈ+రే) = కౌస్తుభాన్ని ధరించి ఉన్న
ఉరోరరే = వక్షము నందు
రీరారా = విలాసవంతమయిన
ఊరూరు = గొప్ప ఊరువులచే
ఉ = లక్ష్మి , సీత
అరరర = తన నివాసమైన లంకకు ఎత్తుకు పోయిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూమికి కంటకుడిగా మారిన రావణునికి
రి = నాశనము కలిగించినదై
అరిరా = చెలి కత్తెలను
రా = పొందినది

శ్రీరాముని భార్య యగు సీతా దేవి లంకలో రావణుని నాశనం తెలియ జేసే త్రిజట వంటి చెలి కత్తెలను పొందినది. లంకలో రాక్షస స్త్రీల నడుమ లంక నాశనం కానున్నదని, రామ రావణ యుద్ధాన్ని కలగని చెప్పి, హెచ్చరించి నది , సీతా దేవిని సగౌరవంగా చూసినదీ త్రిజట అనే రక్కసి మాత్రమే కదా.

కవి అంత మహా లంకా నగరంలోనూ , లంకా నాశనాన్ని సూచించినది ఒకే ఒక్కతె అని తెలియ జేస్తూ ఏకాక్షర సహిత పద్య రచన చేసాడు కాబోలు.

మరో పద్యం ఇలాంటిదే, కొరికి చూడండి ...

మామా మోమౌ మామా
మామా ! మిమ్మొమ్ము మామ మామ మేమా
మే మొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా !

మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖముగా గల
మా = మా యొక్క
మా = బుద్ధి
మిమ్ము = మీకు
ఒమ్మున్ = అనుసరించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏము = మేము
ఒమ్మము = ఇష్ట పడము
మీ = మీ యొక్క
మై = శరీరము
మేము +ఏమే = మేమే కదా
మమ్ము = మమ్ములను
ఏముము +ఓముము = కాపాడుము. కాపాడుము.
ఇమ్ము +ఔము = (మాకు) అనుకూలుడవై వర్తించుము.

చంద్రుని వంటి ముఖము గల ఓ దేవా ! మా బుద్ధి నీకు అనుకూలించును. అనగా సదా నీయందే నిలిచి ఉండును. మా అంహంకారములను విడిచి , మేము నిన్ను సేవించుకొందుము. మా పట్ల ఆనుకూల్యతతో మమ్ములను నిత్యం కాపాడుము.

ఇదండీ సంగతి. వీటిలో కవితా దినుసుకు గ్యారంటీ లేదని ముందే విన్నవించాను కదా.


31, జులై 2010, శనివారం

ఏవి తల్లీ , నిరుడు కురిసిన హిమ సమూహములు ?


యెర్రి నా యెంకి

‘ యెనక జన్మము లోన
యెవరమో’ నంటి !
సిగ్గొచ్చి నవ్వింది
సిలక - నా యెంకి !

‘ముందు మనకే’ జల్మ
ముందోలె’ యంటి

తెల్ల తెల బోయింది
పిల్ల - నా యెంకి !

‘యెన్నాళ్ళొ మన కోలె
యీ సుకము’లంటి !

కంట నీ రెట్టింది
జంట - నా యెంకి !

( కీ.శే. నండూరి వేంకట సుబ్బా రావు - ఎంకి పాటలు )

ఈ పాటలో ఉన్న అపు రూపమయిన తాత్త్వికత చాలా రోజులకి మళ్ళీ గుర్తుకు తెచ్చుకునేలా చేసింది. మరో సారి పాటని మీతో పంచు కోవాలని ....

29, జులై 2010, గురువారం

ఆరు ముఖాలూ , ఆరు ముద్దులూ ....


బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖి శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచు కొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !’ అని దీని అర్ధం.

‘వెళ్ళి గంగలో దూకు ’ అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు మద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?


29, మే 2010, శనివారం

అంకెల మర్మం ....


ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి,
మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి,
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు
విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు



ఈ పద్యం శ్రీమదాంధ్ర మహా భారతము ఉద్యోగ పర్వం లోనిది. తిక్కన రచన.

సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహా రాజ చెవిని పడ లేదు. రాజు వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడం లేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు. ఆ సందర్భంగా విదురుడు కురు మహా రాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి ....

ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతోంది ....

ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.

పెద్దలు ఈ పద్య భావాన్ని ఇలా విడమరిచి చెప్పారు. చూడండి ...

ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం ( ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత ( ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ ( త్వక్కు, చక్షువు,శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి, సంధి, విగ్రహము, యానము,ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము లను తెలుసుకుని, సప్త వ్యసనాలను ( స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము ) విడిచి పెట్టి ఎవడయితే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు.

దీనికి మన పెద్దలు ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలు కూడ చేసారు.

ఈ పద్యానికి ఇంకో విధమైన అర్ధం యిలా చెప్పారు ...
బుద్ధిని కలిగి ఉండి, వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ వానప్రస్థ, సన్యానములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి,పాదము,,వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన,యాజన. అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములు అనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు.

కొన్ని పదముల వివరణలు :

మంత్రము = ఆలోచన
ఉత్సాహమ = ప్రయత్నము
సామము = అనుకూల వర్తనము
భేదము = ఉపాయము. ఇరువురి స్నేహము చెఱచుట
దండోపాయము = శిక్షించుట
త్వక్కు = చర్మము
చక్షువు = నేత్రము
శ్రోత్రము = చెవి
జిహ్వ = నాలుక
ఘ్రాణము = ముక్కు
తగని వెచ్చము = దండగమారి ఖర్చులు చేయడం
యజనము = భుజించు
యాజనము = భుజింప చేయుట


ఇంత చెప్పినా, అంధ రాజుకి కళ్ళు తెరుచుకో లేదు. అంధ రాజు కదా మరి ..



26, మే 2010, బుధవారం

తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో రాసిన పిడికెడు కవితలు ...






చా.సో గా మనకి తెలిసిన మహా కథా రచయిత చాగంటి సోమయాజులు ( తెలుగు కథకి తూర్పు దిక్కు ) పిడికెడు కవితలు కూడ రాసేరు. ఆతర్వాత కథా రచన మీదనే దృష్టి పెట్టి కవితలు రాయడం తగ్గించారు. లేదా మానీసేరు. రాసినవి చాల కొద్ది పాటి కవితలే అయినా, అవి కవితాభిమానులను ఎంతగానో అలరించాయి. చా.సో కవితలు 1940 ప్రాంతాలలో భారతి, నవ్య సాహిత్య పరిషత్తు వారి ప్రతిభ, అభ్యుదయ రచయితల తెలుగు తల్లి, ఢంకా, కొన్ని దీపావళి ప్రత్యేక సంచికలలోనూ ప్రచురింపబడ్డాయి. కల్పన, అడుగు జాడ గురజాడది, ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు వేసిన కవితా సంకలనం లోను చోటు చేసుకున్నాయి.

ఏమయినా, చా.సోని అభిమానించే సాహిత్యాభిమానులు వారి కవితలు కూడ చదివే ఉంటారు. చదవని వారి కోసం ఈ టపా ....

చా.సో రాసిన కొద్ది పాటి గొప్ప కవితల నుండి మీ కోసం ఒక కవిత ....

కాందిశీకుడు

బతకాలని వెళ్ళావు
బాంబుల్లో పడ్డావు
బతికొచ్చినావ
నా నాయనా !

నిరుడెల్లి పోనావు
నేడొచ్చినావు
నడిసొచ్చినావ
నా నాయనా !

కొండలెక్కొచ్చినా
కానల్లొ నడిచినా
కట్టెతోటొచ్చావ
నా నాయనా!

మారు రైతుకు పోయె
మన సాగు భూమిరో
మారు మనుముకు పోయె
నీ బిడ్డ తల్లిరో
నా నేమి సేతురా
నా నాయనా !

నిన్ను నమ్ముకు మేము
నిలబడీ ఉన్నాము
నిప్పు నేకున్నాము
నీ కేటి పెట్టేది
నా నాయానా !


ఈ కవిత సెప్టెంబరు 1945 తెలుగు తల్లి పత్రికలో ప్రచురితమైంది. తర్వాత 1962 లో అడుగు జాడ గురజాడది కవితా సంకలనంలో పునర్ముద్రించబడింది

చా.సో ఈ కవితను 1942 ప్రాంతాలలో రాసి ఉండ వచ్చును.

చా.సో గారి మరిన్ని కవితల కోసం విశాలంధ్ర వారు ప్రచురించిన చా.సో కవితల సంపుటిని చూడొచ్చును. 1996 లో ప్రచురింప బడిన ఈ కవితా సంకలనం ప్రతులు చా.సో కథల పుస్తకం లాగే ఇప్పుడు లభిస్తుందో లేదో, తెలియదు.

చా.సో కథలనీ, కవితలనీ మళ్ళీ ఎవరయినా ప్రచురిస్తే బావుణ్ణు.






10, మే 2010, సోమవారం

కమనీయ ఖండ కావ్యం - కాటూరి వారి ‘ పౌలస్త్యహృదయం ’.

కాటూరి వేంకటేశ్వర రావు గారి ఖండ కావ్యము -

‘పౌలస్త్యహృదయం








శ్రీమహా విష్ణువు వైకుంఠంలో కొలువు తీరి ఉండగా సనకసనందనాదులు శ్రీవారి దర్శనార్ధం వచ్చేరు. ద్వార పాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. మునులు కోపించి, వారిని రాక్షసులుగా పుడుదురుగాక ! అని శపించారు. విష్ణువు మునులకు దర్శనమిచ్చి, జయ విజయులకు అమోఘమైన మునుల మాటలు తథ్యములని చెప్పి, వైరభక్తితో వారు కాలాంతరమున తనతో ఐక్యం కాగలరని వరం ప్రసాదించాడు. అలా జన్మించిన రాక్షప వీరులే హిరణ్యాక్ష హిరణ్య కశిపులు , రావణ కుంభ కర్ణులు , శిశుపాల దంతవక్తృలు . ఈ కథ అందరికీ తెలిసిందే కదా ?

శ్రీరాముడు రావణసంహారార్ధం లంకా నగరం చేరుకునేందుకు సముద్రతీరం చేరుకున్నాడు. వారధిని కపి సేన నిర్మించనారంభించింది.
అక్కడ లంకలో రావణుడు ఎన్నడూ లేనిది సాగరుడు రవంత సంభ్రముడై ఉండడాన్ని గమనించి, అతనితో పలికిన పలుకులివి.

కాటూరి వేంకటేశ్వర రావు గారు ‘‘ పౌలస్త్య హృదయం ’’ కావ్య ఖండికలో ఈ ఘటన అపూర్వంగా చిత్రీకరించారు. మరిచి పోతున్న ఆ మంచి రసవంతములైన పద్యాలను మిత్రులతో మరొక్క మారు పంచుకోవాలని ఇది రాస్తున్నాను ....

ఆ ఖండ కావ్యంలోని పద్యాలను అక్కడక్కడ ఉటంకిస్తూ వచన రూపంలో అందిస్తున్నాను ....

సముద్రుడు ఆనాడు అల్లకల్లోలంగా కనిపిస్తున్నాడు. ఏదో భయోద్వేగంతో నురగలు క్రక్కుతున్నాడు. అది చూసి రావణుడు సాగరుని ఉద్దేశించి ఇలా అంటున్నాడు :

నురుగుల్ గ్రక్కుచు నూర్పు సందడుల
మిన్నుల్ ముట్ట నొక్కుమ్మడిన్
బరుగుల్ ద్రొక్కుచు శీర్ణ కేశముల
నుద్బాహుండవై వచ్చుత
త్తఱమున్ గాంచిన నుత్తలంపడెడిఁ
జిత్తంబీ భయోద్వేగమె
వ్వనిచే నీ కొనగూడె నర్ణవ పతీ !
వాక్రుచ్చవయ్యా వెసన్.

మిన్నంటేలా నురగలు క్రక్కుతూ పరుగులు పెడుతూ తత్తరపాటుతో వస్తున్నావేమయ్యా ? ఎవరి చేతనయ్యా, నీకీ భయోద్వేగం కలిగింది ? ఓ సాగరా ! వేగిరం చెప్పవయ్యా ...

కేవలం కను బొమల కదలిక చేతనే మూడు లోకాలకీ విలయాన్ని చేకూర్చ గల వారలమే !నా అండ నీకుండగా ఎందుకయ్యా ఇంత భయం ?

నాకూ నీకూ భయం అనే మాట ఎన్నడూ విన లేదే ? ఇవాళ నీ విలా వణికి పోతూ ఉండడానికి కారణం కనిపించడం లేదు. సూర్యుడు ఎప్పటిలాగే వెలుగుతున్నాడు. గాలి మునపటిలాగే వీస్తున్నది. ప్రళయ కాల గర్జనలు వినిపించడం లేదు. తారకలు రాలడం లేదు. చంద్ర రేఖ నా చేయి జార లేదు. నీ ఉదరంలో బడబాగ్ని చల్లార లేదు. ఎందుకీ భయమయ్యా , రామ చంద్రుని ధనుష్టంకారం నిన్ను భయకంపితుని చేసినదా యేమి ?

ఏమేమీ ! మళ్ళీ చెప్పూ, రామ చంద్రుడు లంకకి దండెత్తి వస్తున్నాడా ! మరింకేమీ ... భయం విడిచి పెట్టు. రామచంద్ర ప్రభువుకి త్రోవ విడిచి పెట్టు ...అతనికీ అతని తమ్ముడు లక్ష్మణుడికీ, సూర్య తనయుడు సుగ్రీవునకూ, హనుమకీ ఇతర వానర సేనకీ దారి విడువ వయ్యా ...

ఎన్నాళ్ళకు ! ఎన్నాళ్ళకు !
కన్నులు వింశతియు నాకుఁగల్గిన ఫలమా
సన్నమయి వచ్చె ! భుజగ
ర్వోన్నతి చరితార్ధమగు ముహూర్తము వచ్చెన్


నాటికి నేఁడా? తలపున
నాటెను సామికి వికుంఠ నగరోదితమౌ
మాటలు : దీర్ఘ విలంబము
వాటించి విభుండు నన్ను వంచించెఁగదే !

నా ప్రభువుకి నేను ఇప్పుడా గుర్తు కొచ్చాను ? నా రామచంద్రుని కనులారా ఇంతకాలాని చూసుకో గలిగే భాగ్యం కలిగింది కదా ? ఇరువది కనులున్నందుకు ఫలితం నాకీనాడు కలిగింది కదా ! నా భుజ గర్వం చరితార్ధమయ్యే రోజు ఇప్పటికి తస్థించింది కదా.


నా రాముడు నన్నెంత వంచన చేసాడయ్యా ? ఎన్ని అకృత్యాలు చేసాను ? పాతాళ రాజుని అణగద్రొక్కాను. ఇంద్రుని జయించాను. వెండి కొండని, కైలాస పర్వతాన్ని అల్లల్లాడ చేసాను. ఇంత విశ్వ క్షోభం చేసినా నా రాముడు నన్ను సంహరించడానికి రాడేమీ?

శివ ధునువు విరిచాడని వినగానే, అది నా మాధవుని పనే అని తెలుసుకున్నాను. రోజొక ఏడాదిగా ఎన్నో ఘోర కార్యాలు చేసాను.సీతాపహరణం చేసి రామునికి తీవ్రమైన ద్రోహం చేసాను.
అప్పటికీ, దండకారణ్యమంతా దేవి జానకి కోసం పిచ్చి వాడిలా తిరిగాడు. చెట్లనీ, కొండలనీ, పశుసక్ష్యాదులనీ అడిగాడు. ఊరికే విలపించాడు. ఈ ఘోర కృత్యం నేను చేసి ఉంటానని నా విభుడు నన్ను మరిచి పోయాడు కదా !

జటాయువు నోట జానకి జాడ తెలుసుకుని క్రోధంతో ఎలుగెత్తి ‘ రావణా !’ అని నా రాముడు
నన్ను సంహరిస్తానని ప్రతిన చేసినప్పుడు కదా, నాకు మనశ్శాంతి దొరికింది !

పదుగురులోన నన్ గుఱుతు పట్టునొ, లేదొ, యటంచు సర్వ భూ
విదిత పరాక్రముండనయి, వీఱిడి సేతలు పెక్కు సేసితిన్
బదుగురు ‘ వీడు రక్కసు’డనన్ వెడనిందల కగ్గమైతిఁదా
మది మదినుండి నన్ మఱచె, మాధవుడెంతటి క్రూర చిత్తుడో !

అందరిలోనూ నన్ను గుర్తు పడతాడో లేదో అని, లోకాలన్నింటికీ తెలిసిన గొప్ప పరాక్రమవంతుడనయినా, నా రాముడు గుర్తించడం కోసం ఎన్నో పిచ్చి చేష్టలు చేసాను. అందరి చేతా రాక్షసుడననిపించుకుని నిందలు మోసాను.ఐనా, నా రాముడు నన్ను ఇంత వరకూ గుర్తించనే లేదు. ఎంత క్రూరుడో కదా !

రాముడు నన్ను గుర్తు పడతాడు కదా అని ఆశతో తప్ప - మునులను హింసించడం నాకు యిష్టమా చెప్పండి ? ఆడువారిని చెఱచడానికి నేను పశువునా ? నువ్వే చెప్పు ! ఇలా తన సేవకుని బాధించడం ప్రభువికి వినోదం కావచ్చు. ఇంత చేసినా , నాకు మాట దక్క లేదు. మాధవుడు నాకు మంచిని దక్కనీయ లేదు. ఓ సాగరా ! ఏం చెప్పమంటావయ్యా ? తల్లి జానకమ్మని అపహరించక నాకు తప్ప లేదయ్యా !!


స్వామి ద్రోహము కూడ నేర్పెఁదుదకున్ , వైకుంఠుఁడౌరౌర ! తా
నేమో, నాకిడు బాస లోఁదలపఁడాయెన్ గ్రుడ్డి లోకమ్ము త
న్నే మెచ్చెన్, దొసగెల్లఁజాల్పు దలలన్ నిల్పెన్, మహాంభోనిధి
స్వామీ ! మర్త్యుల రాజనీతి నిపుణత్వంబెల్ల విన్నావుగా ?

నాకు నా స్వామి చివరకు స్వామి ద్రోహం చేయడం కూడా నేర్పించాడయ్యా. నాకానాడు ఇచ్చిన మాట తలచనే తలచడు. లోకం గుడ్డిది. అతనినే నమ్ముతుంది. నన్నేమో నిందిస్తుంది. సాగరా ! ఈ మనుషుల నైజం చూసావు కదా ?

నేనేం ఉట్టి కట్టుకుని ఉండి పోతానా ? నాకెందుకు లోక భీతి ? ఆ మంచితనమేదో అతనికే దక్కనీ ! అతడు నన్ను తెలుసుకుంటే నాకదే చాలును.

అంతా తెలిసి కూడ ఏమీ తెలియని వాని వలె ఉంటాడు హరి. తెలిసీ తెలియక నేను మాత్రం జానకీ మాతని అపహరించి మోస పోయాను.

ఇంట (వైకుంఠలో) ఉండేటప్పుడు నా హరికి ఈ మాయ వర్తనలేవీ తెలియవు. దర్శనమిచ్చి, తరింప చేసే వాడు. అదేమిటో, భూలోకానికి దిగి మాయదారి వాడయిపోయినాడు !

తన దగ్గరకి నేను చేరే దారులన్నీ మూసివేసినా, ఓర్చుకున్నాను. ఈ రావణుని పాద ధూళి ముద్రలు కానుపించని తావు లేకుండా, అంతా ఆక్రమించాను కదా, మరి నన్ను చంపడానికి రాకుండా నా ప్రభువు ఎందుకు ఆలస్యం చేసాడో కదా ?

వైర భక్తితో నా ప్రభువుని చేరుకోవాలని ఎంత చేసినా ఫలితం దక్కడం లేదు ... సరే, తన మాయలు నేను చెల్లనిస్తానా ? రావణుడంటే ఏమనుకున్నాడో ...


రావణుఁడన్న కాళ్ళబడు రాయియుఱప్పయుఁగాదు, జాలిమై
గావఁగ నాతి కోతియునుఁగాకియు గ్రద్దయుఁగాదు, లోక వి
ద్రావణుఁగ్ర వీర చరిత ప్రథితుండతి మానియౌ దశ
గ్రీవుడు పోరిలోఁబొడిచి గెల్చును, చచ్చునుఁగాక, వేడునే ? !

రఘువీరుని శౌర్య పరాక్రమాలన్నీ మారీచుడు, శూర్పణఖ, హనుమ, జానకి మున్నగు వారి వలన ముందే
విన్నానులే !

వసవల్చు చెక్కిళ్ళ వయసున లజ్జమై
మునియాఙ్ఞ్ల దాటకఁదునుము సొగసు
జునపాలు వ్రేలు నీడున శైవ చాపమ్ము
విఱిచిన శృంగార వీ ర మహిమ
పసుపు బట్టల నిగ్గు పస భార్గవ క్రోధ
సంధ్య మాయించిన శౌర్య సార
మాలిఁబాసిన క్రొత్త యలతమై వజ్రసా
రుని వాలి నొక కోలఁదునుము సటిమ

వింటియే గాని, ఇన్నిటికంటె, రాచ
పట్టము దొరంగి, నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము
వింటి : సామికే తగుననుకొంటె కాని.

అన్నీ విన్నానులే. శివ ధనువు విరవడం, పరశు రాముని నిలవరించడం, వాలిని ఒకే కోలతో వధించడం అన్నీ విన్నాను. అన్నింటికన్నా, రాచ వలువలు విడిచి నార చీరలు ధరించి వనవాసం చేసిన ఆ గుండె నిబ్బరాన్ని గురించి విన్నాక, నా స్వామికి తగిన వాడిని నేనే అనుకున్నాను.


తోయధీ ! ఎంత భాగ్యవంతులయ్యా, మీరు ! ఆ ముగ్ధ మోహనుని రూపం కనులారా చూడ గలిగేరు... నేనందుకు నోచుకో లేదు.

తోయధీ ! ధన్యుడవు నీవు, తొల్లి మత్స్య
కమఠ రూపత నీదె నీ గర్భము హరి
నేడు వెండియు తరింప నున్నాడు నిన్ను
నెల్లి నినుఁజేరి పవళించు నేమి యెఱుఁగ
నట్టులు తరంగలాలితుండగుచు శౌరి.


ఓ సముద్రుడా ! నువ్వెంత ధన్యుడవయ్యా. లోగడ హరి- మత్స్య . కూర్మ రూపాలలో నీ గర్భంలోనే అవతరించి, నిన్ను తరింప చేసాడు. ఇప్పుడు మళ్ళీ నిన్నే ధన్యుడిని చేస్తున్నాడు. ఆ పిమ్మట తిరిగి నిన్నే చేరి, అలల మీద చల్లగా ఊగుతూ ఏమీ ఎరుగనట్టుగా పాలకడలి మీద శయనిస్తాడు.

మీలాంటి వాళ్ళే చరితార్ధులయ్యా. కాదనను. కానీ, తన మోము ముద్దాడిని తండ్రి కంటె, చనుద్రావించిన తల్లికంటె, తనలో సగమయిన సీత కంటె, సేవలు చేసిన తమ్ముడు లక్ష్మణుని కంటె, ఈ లోకకంటకుడైన రావణునకే స్వామి వశుడు సుమీ, తెలుసా !

ఆలోచించి చూస్తే, ఇప్పుడనిపిస్తోంది. తల్లి జానకిని అపహరించి ఎంత మంచి పని చేసానో కదా ! ఇంత అపరాధం స్వామికి చేయక పోతే అతని దర్శనం నాకెలాగ అవుతుంది చెప్పు ?


యుద్ధాలు నా రామునికి కొత్తా ఏమిటి ? మధు కైటభులని వధించ లేదో? వరాహ నారషింహావతారాలు ఎత్తి దుష్టులను పరిమార్చ లేదో ? నేడు పురుషోత్తమునిగా అవతరించి రావణ వధకి పూనుకున్నాడు.

ఎన్నో వీర కృత్యాలు చేసాను. కాని, నా రామునితో వైరం నేడు గదా సంభవ మవుతోంది. ఇది నాకు నిజంగా పండుగే కదా !

లేదు పతంగ వాహనము, కరంబులఁబాంచజన్య కౌ
మోదకులున్, సుదర్శనము పూనడు , రావణు గెల్వ వచ్చె దా
మోదరుడెంత నేరుపరియో ! పది జంటల చేతులార ! ఆ
కైదువులాజి వేళ హరి కైకొను మాడ్కి పరాక్రమింపుడీ .


పతంగ వాహనము లేదు. పాంచజన్య కౌమోదకాదులు లేవు, సుదర్శన చక్రం ధరించ లేదు. రావణుడిని గెలవడానికి వస్తున్నాడు. నా రాముడు ఎంత వీరుడో కదా ! ఓ పది జతల చేతులారా !
హరి సమర్పితములుగా యుద్ధంలో మీరు పరాక్రమించండి.


ఒంటి విలుకాడవై నన్ను నోర్చు తెగువ
వలదురా ! రాఘవా ! రాఘవా ! దశాస్యు
నక్కటా ! క్రూర విక్రము, స్వాత్మ హనన
పాతకుని చేకుముర ! నీ పాదమాన !

రామా, నీ పాదాలు పట్టుకని వేడుకుంటానయ్యా, ఒంటరి విలుకాడివిగా నాతో యుద్ధానికి రాకయ్యా. అంత తెగువ నీకు వలదు సుమా. క్రూరుడైన ఈ రావణుని తనని తానే సంహరించుకునే పాతకునిగా చేయకయ్యా.

పొమ్ము నెచ్చెలి ! రామ మూర్తికి నెదురేగి
పుట్టు ముత్తియముల మ్రుగ్గు వెట్టి
అత్యున్నతమ్మును, నతి గభీరమ్మైన
గర్భ వీచిమ తల్లి గద్దె వెట్టి
రమ కంటె, కౌస్తుభ రత్నమ్ముకంటె , గా
రామైన మణుల దర్శన మొసంగి,
లంకకుఁబంపు , పౌలస్త్యుండు సిరి కొల్వు
చవిక యౌ వక్షమ్ము చంద్రహాస

దారిత మొనర్చి , ఆ గంటు దారి వెంట
హృదయమున్ జొచ్చి, యేకాంత మిచ్చగించి
స్వాగతముఁబల్కునని విన్నపమ్ము సల్పు
మచటనే పునర్దర్శన మగుత మనకు.


నేస్తమా ! సముద్రుడా ! వెళ్ళి రావయ్యా. రామ చంద్ర మూర్తికి ఎదురేగి, జాతి ముత్యాల ముగ్గులు పెట్టు. గంభీరమైన సాగర తరంగ వీచికల గద్దెమీద కూర్చో పెట్టు. రమ కంటె , కౌస్తుభ రత్నం కంటె కూడ విలువైన మణులను కానుకగా సమర్పించు. లంకానగరానికి సగౌరవంగా పంపించు.
ఈ రావణుడు గుండె నిండా అతని రూపమే కలిగి ఉన్నాడని చెప్పు. ఆ ప్రభువునకు స్వాగతం పలుకుతాడని విన్నవించు. తిరిగి మనం కలిసేది అక్కడేనయ్యా ....


ఇదీ కాటూరి వారి రసవత్తరమైన ఖండ కావ్యం.
ఇదొక రసఝరి. తేనె వాక. అద్భుత కళాకృతి.

ఈ ఖండ కావ్య పఠనం ఒక అపూర్వానందానుభూతిని కలిగిస్తుంది. రసమయ సాహితీ సాగరాన ఓలలాడిస్తుంది.

స్వస్తి.