27, జనవరి 2011, గురువారం
పద్య వినోదం
10, జనవరి 2011, సోమవారం
ఎంత కష్టం ! ఎంత కష్టం !
‘’ హాయిగా ఇంత వండి పడేసి, మొగుడు ఆఫీసుకి వెళ్ళాక, తిరిగి యింటికి తగలడే వరకూ నీకు పనేం ఉంటుంది చెప్పు? ఏ పత్రికో పట్టుకుని ఆ వెర్రి మొర్రి సీరియల్సూ గట్రా చదవుతూ పడుకోవడమో, లేదంటే, పిచ్చి పిచ్చి టీ.వీ జీళ్ళ పాకం సీరియళ్ళు చూస్తూ గడపడమో తప్పితే ?’’
ఈ రకమయిన మాటలు ఇదే మోతాదులో కాక పోయినా, కొంత మాటల మేకప్ వేసుకుని దాదాపు ప్రతి యింటా విన బడుతూనే ఉంటాయి.
’ మీరేం చేస్తున్నార’ ని ఎవరయినా అడిగితే ఎందుకో తెలీదు కానీ , కొంచెం అనవసరంగా మొహమాట పడి పోతూ ’ జాబేమీ చేయడం లేదండీ, హౌసు వైఫుని’ అని జవాబిచ్చే సగటు ఆడవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం.
జాబ్ చేసే ఆడవారికి తామేదో తీసి పోయి నట్టుగా పాపం , కించ పడుతూ మాట్లాడుతూ ఉండే వారూ కనిపిస్తారు. ఈ వేగవంతమయిన రోజులలో ఉద్యోగం ఆడవాళ్ళకి కొంత వెసులు బాటుని కలిగించేదే కానీ అదనపు సదుపాయం మాత్రం కాదని నాకనిపిస్తూ ఉంటుంది. ఆర్ధిక స్వేచ్ఛ వలన ఆడవాళ్ళకి అదనపు గౌరవంతో పాటు అదనపు సమస్యలూ తెచ్చి పెడుతూ ఉండడం కూడా కొన్ని ఇళ్ళలో కనిపించే విషాదం.
సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, ఇళ్ళలో ఆడవాళ్ళు చేసే అవధానం ఎలాంటిదో శ్రీమాన్ గరిక పాటి నరసింహా రావు అవధాని గారు చెప్పిన ఒక ప్రసిద్ధ మైన ఆశు పద్యం తెలియని వారి కోసం చెప్పుకుందాం.
అష్టావధానం లో సమస్యా పూరణం, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటానాదం ,పురాణ పఠనం,అప్రస్తుత ప్రసంగం మొదలయిన ఎనిమిది అంశాలు ఉంటాయి కదా. ఈ అంశాల ఎన్నికలో అవధాని అభిరుచిని బట్టి కొన్నిటి స్థానంలో వేరే అంశాలూ చేర్చబడుతూ ఉంటాయి. ఏమైనా అంశాల సంఖ్య ఎనిమిదికి మించదు. ఘంటా నాదం బదులు పుష్ప గణనం, కానీ చదరంగ క్రీడ కానీ ఉండవచ్చును. కొందరు అవధానులు ఈ ఎనిమిది అంశాలలో న్యస్తాక్షరిని చేర్చి అవధానం చేస్తూ ఉంటారు.
పృచ్చకులు నిర్వహించే సమస్య మొదలగు వాటి గురించి క్లుప్తంగా చెప్పు కుందాం,
1. సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక ఛందస్సులో ఒక పద్యం యొక్క నాలుగవ పాదం చెబుతాడు.అతను ఇచ్చిన పాదం కొంత అసంబద్ధంగానో, అసంగతంగానో, అశ్లీలార్ధ ద్యోతకంగానో కనిపించ వచ్చును.హేతు బద్ధంగా అనిపించక పోవచ్చును. కానీ, అవధాని పద్యం యొక్క మీది మూడు పాదాలు చెప్పడంతో ఆ అసంగత్వం ఏదేనా ఉంటే, తొలిగి పోయి చక్కని భావ యుక్తమయిన పద్యం తయారవుతుంది. ఇది సమస్య.
ఉదాహరణకి : ఒక పృచ్ఛకుడు ‘‘ ఈతాకుల గుడిసె లోన ఇనుడు దయించెన్’’ అనే సమస్య ఇచ్చాడు. ఇది పద్యంలోని నాలుగో పాదం. తూర్పు కొండల్లో ఉదయించాల్సిన సూర్యుడు ఈతాకుల గుడిసెలో ఉదయించడ మేమిటి ? అవధాని గారి పూరణతో పద్యంలో ఆ సందిగ్ధత తొలిగి పోతుంది. చూడండి:
సీతా పతి పూదోటకు
ఏతా మెత్తంగ వలయు వేకువ జామున్
తాతా ! తొంగున్నావా ?
ఈతాకుల గుడిసె లోన ఇనుడుదయించెన్.
శ్రీరాముల వారి పూల తోటను చూసు కుంటూ ఉండే తోట మాలి తన ఈతాకుల గుడిసెలో పడుకుని ఉన్నాడు. తెల్ల వారింది. తాతను నిద్ర లేపుతూ మనుమరాలు కాబోలు, అంటోంది:
‘‘ తాతా, సూర్యుడు ఉదయించాడు. రాముల వారి పూల తోటకు ఏతాం ఎత్తి నీళ్ళు పట్టాలి. ఇంకా నవ్వు నీ ఈతాకుల గుడిపెలో పడుకుని లేవ లేదా?’’ అని అవధాని గారి చక్కని పూరణతో పృచ్ఛకుడు సమస్య ఇచ్చి నప్పటి అసంబద్ధత తొలిగి పోయింది కదూ?
2. నిషేధాక్షరి: పృచ్ఛకుడు ఏదో ఒక అంశం యిచ్చి కోరిన ఛందస్సులో అవధాని పద్యం చెప్పడం మొదలు పెడుతూ పాదం తొలి పదంలో తొలి అక్షరాన్ని పలుకుతాడు. వెంటనే పృచ్ఛకుడు తర్వాతి పదాన్ని నిషేధిస్తాడు. అంటే అవధాని ఇక ఆ అక్షరాన్ని ఉపయోగించ కూడదన్న మాట. దానికి బదులు మరో అక్షరాన్ని వేసు కోవాలి. ఉదాహరణకి అవధాని శ్రీరాముని మీద పద్యం చెప్పడానికి సిద్ధ పడి శ్రీ అని అన్నాడను కోండి, పృచ్ఛకుడు ర అనే అక్షరాన్ని నిషేధిస్తాడు. దానితో అవధాని ర అనే అక్షరానికి బదులుగా మరో అక్షరం వాడాలి. ఇలా పృచ్ఛకుడు ప్రత్యక్షర నిషేధం కానీ, తాను కోరిన చోట నిషేధం కానీ విధిస్తూ ఉంటాడు. నిషేధించిన అక్షరాన్ని వదిలి అవధాని వేరే అక్షరాన్ని ప్రయోగిస్తూ , మొత్తానికి అర్ధవంతమయిన పద్యం చెప్పాలి. అవధానంలో అవధాని ప్రతిభకు నిషేధాక్షరి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి.
3. దత్త పదిలో పృచ్ఛకుడు తనకు తోచిన నాలుగు పదాలు చెబుతాడు. వాటిని వరుసగా ఒక్కో పాదంలో ఉపయోగిస్తూ, అర్ధవంతమయిన చక్కని పద్యం అవధాని చెప్పాలి.
చూడండి, ఒక దత్తపది. ఒక పృచ్ఛకుడు పాలు, పెరుగు, నేయి, నూనె అనే పదాలు ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ భారతార్ధం వచ్చే లాగున ఒక పద్యం చెప్పమన్నాడు.
అవధాని గారి పూరణ చూడండి:
పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధ మింక.
నాలుగు పాదాల లో పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలూ వచ్చేయి కదా. ఇక భావం చూడండి:
దుర్యోధనుడు పాండవులకు రాజ్య భాగం ఇవ్వడు. దుర్మార్గం వాడిలో మరీ పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడా చూడం .వాడిలో మూర్ఖత్వం ప్రబలి పోయింది. ఇక యుద్ధం తప్పదు.
4. వర్ణన: పృచ్ఛకుడు కోరిన అంశం గురించి, కోరిన ఛందస్సులో కోరిన వర్ణన చేస్తూ అవధాని పద్యం చెప్పాలి.
ఇవి సాధారణంగా దేవతా వర్ణనలో, ప్రకృతి వర్ణనలో అయి ఉంటాయి.
5. .ఆశువు: అవధాని పృచ్ఛకుడు అడిగిన విషయం మీద చక్కని పద్యం చెప్పాలి. అడిగే వాడు పకోడీ మీద పద్యం కావాలన వచ్చు. కంప్యూటరు గురించి కావాలన వచ్చు దేని గురించయినా పద్యం చెప్పమన వచ్చు. అతనిష్టం. అవధాని ఆశువుగా, ధారాశుద్ధితో మొత్తం పద్యం చెప్పాలి.
6. ఘంటా నాదం (లేదా) చదరంగం (లేదా) పుష్ప గణన (లేదా) తేదీ, వారాల లెక్క :
(a) ఘంటానాదం: అవధానం జరుగు తున్నంత సేపూ ఒక వ్యక్తి ఠంగ్ మని ఒక్కో గంట కొడుతూ ఉంటాడు. అవధానం చివరలో అతడు ఎన్ని గంటలు కొట్టేడో అవధాని లెక్క తప్ప కుండా సరిగ్గా చెప్పాలి.
(b) చదరంగం: ఒక ప్రక్క ఇతర పృచ్ఛకులకు పద్య పాదాలు అవీ చెబుతూనే అవధాని ఒక వ్యక్తితో చదరంగం ఆడాలి. గెలవక పోయినా ఫరవా లేదు కానీ, ఓడిపో కూడదు.
(c) పుష్ప గణన: ఇది కూడా ఘంటా నాదం లాంటిదే. గంటలకు బదులు ఇక్కడ పూల లెక్క ఉంటుంది.
ఒక వ్యక్తి పూల రాశి లోనుండి ఒక్కో పువ్వునూ తీసి ప్రక్కన పెడుతూ ఉంటాడు. అవధాని ఆ పూల సంఖ్య సరిగ్గా చెప్పాలి.
(d) తేదీ వారాల లెక్క: పృచ్ఛకుడు ఏడాది, నెల, తేదీ చెప్పి, ఆ రోజు ఏ వారమో చెప్ప గలరా ? అనడిగితే తడుము కోకుండా అవధాని ఆ వారం పేరు సరిగ్గా చెబుతాడు.
7. పురాణపఠనం: పృచ్ఛకుడు కోరిన గ్రంధం లోనుండి కోరిన భాగం లోని పద్యాలు చదివి,పురాణం చెప్పడం.
8. అప్రస్తుత ప్రసంగం: అవధానం జరుగుతున్నంత సేపూ, అవధాని గారి ఏకాగ్రతను చెడ గొడుతూ ఒక పృచ్ఛకుడు చమత్కారవంతమైన సంభాషణ తనకు తోచిన రీతిని చేస్తూ ఉంటాడు. అవధాని అతనికి తగు రీతిలో , అతనడిగిన దానికి దీటుగా బదులు చెబుతూ ఉండాలి.
అష్టావధానంలో చోటు చేసుకుంటూ ఉండే మరో అంశం వ్యస్తాక్షరి అని చెప్పు కున్నాం కదూ. ఇదెలా చేస్తారంటే, పృచ్ఛకుడు అనుష్టుప్ శ్లోకంలో ఉండే సంఖ్యానుగుణంగా గడులు గీసుకుని సిద్ధంగా ఉంటాడు. అవధానం మొదలయ్యేక, పృచ్ఛకుడు తనకు నచ్చిన అంశం మీద ఒక శ్లోకం చెప్పమంటాడు. సాధారణంగా ఇది కూడా ఏ దేవతా ప్రార్ధనో అవుతుంది. అయితే, శ్లోకమంతా ఒకే సారి కాకుండా, తనకు నచ్చిన గడి సంఖ్య చెప్పి, ఆ గడిలో ఉండ తగిన అక్షరం చెప్పమని అవధానిని అడిగి, అతను చెప్పిన అక్షరాన్ని ఆ గడిలో వ్రాసుకుంటాడు.అవధానం పూర్తయే లోగా మొత్తం అన్ని గడులూ అవధాని అప్పుడూ అప్పుడూ చెప్పిన అక్షరాలతో నిండి పోతాయి. అవధానం చివరలో ఆ అక్షరాలన్నీ కలిసి ఒక పూర్తి అర్ధవంతమయిన శ్లోకం అవుతుంది..
అవధానం లోని అంశాల గురించి ఇక్కడ నేను వ్రాసినది సర్వ సమగ్రం కాక పోవచ్చును. కొంత అస్పష్టత ఉండ వచ్చును. నా తెలియమి కూడా కారణం కావచ్చును. కానీ నాకు తెలిసినంతలో అవధానం లోని అంశాలను వివరించాను. పెద్దలు సరి చేస్తే సరి దిద్దుకుంటాను.
అవధాని పృచ్ఛకులకు ఒకే సారి నాలుగు పాదాలూ చెప్పనవసరం లేదు. చెప్పడు కూడా. ఆవృత్తికి ఒక పాదం చొప్పున చెబుతాడు, అవధానం ముగిసే సమయానికి పద్యం నాలుగు పాదాలూ పూర్తవుతాయి.
ఆ తరువాత అంశం, ధారణ. అవధాని ఒక్కో పాదం చొప్పున అన్ని ఆవృత్తాలలో చెప్పిన మొత్తం పద్యాలు తిరిగి ఆయా అడిగిన వారికి (పృచ్ఛకులకు) ధారగా అప్ప చెబుతాడు. ఎక్కడా తడుము కోరాదు. ఏం చెప్పానని అడుగ రాదు. మొదట చెప్పిన దానికి భిన్నంగా చెప్ప రాదు. ధారణ విజయవంతంగా చేస్తే అవధానం విజయవంతంగా పూర్తయినట్టు లెక్క ! మరో విషయం, మొత్తం అవధాన సమయం నాతి దీర్ఘంగా ఉండ కుండా చూడడం కూడా అవధాని ప్రతిభకు పట్టం కట్టేదే.
ఇంత కష్టసాధ్యమైన అవధానం మన ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా చేస్తూ ఉంటారో ఈ పద్యంలో చూడండి:
అడుగడుగున నిషేధాఙ్ఞ జారీ చేయు
భర్త నిషేధాక్షరార్తిఁదోప
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ
మాసమ్ము గడప సమస్య కాగ
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు
దత్తుండు దత్త పదమ్ము కాగ
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి
వర్ణనీయాంశమై వరలు చుండ
పాలు కూరలు పళ్ళ బండ్ల వారల రాక
ఆశు ధారా కవిత్వార్ధ మనఁగ
అత్తయ్య వేసెడి అక్షింత లవి యన్ని
పాత పురాణంపు పఠన మనఁగ
చీటి మాటికి వచ్చు సెల్లు సందేశాలు
వ్యస్తాక్కరమ్ముల వరుస గాగ
విసుగు తెప్పించెడి వీర ధారా వాహి
అధిక ప్రసంగమై అడ్డు పడఁగ
దినము దినమిట్లు వనితలు తిప్పలు పడి
పూట పూటకు అవధాన పూర్ణ బుద్ధి
తనరు చుండంగ పురుషావధాను లేల?
వర సహస్రావధానులీ పడతు లెల్ల !
.ఆడ వాళ్ళు అవధానంలో అవధాని గారు చేసే పనులన్నీ తమ నిత్య జీవితమనే అవధానంలో ఎలా చేస్తున్నారో చూడండి.
మొగుడు ప్రతీ దానికీ అడ్డు పడుతూ అది వద్దు, ఇది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు అంటూ తల తినేస్తూ ఉంటాడుట. దీనిని నెట్టుకు రావడమే ఆడ వారు చేసే నిషేధాక్షరి .
చాలీ చాలని జీతం రాళ్ళతో, లేదా బొటా బొటీ డబ్బులతో నెల గడపడమే వారికి సమస్య.
అదీ ఇదీ సర్దవే అమ్మా, అంటూ వెంట పడే కాన్వెంటు పిల్లలను ముస్తాబు చేసి, బడికి పంపడమే దత్తపది.
ఇంట్లో బుజ్జి పాపాయిలు ఉంటే నిత్యం వారిని ముద్దాడుతూ, వారికి సేవలు చేయడంతోనే సరి పోతుంది. అదే వర్ణన.
పాలబ్బాయ్, కూరలబ్బాయ్ సండ్ల బళ్ళ వాళ్ళతో చేసే సంభాషణే ఆశువు
ఇక ఇంట్లో అత్త గారు కనుక ఉంటే ఆవిడ గారు వేసే అక్షింతలు, వినిపించే పాత పురాణం అంతా యింతా కాదుట. అదే పురాణపఠనం
ఈ మధ్యలో సెల్ ఫోను రింగవుతూ ఉంటుంది. ఆ బాధ మరీ వర్ణనాతీతం ఇల్లలికి. అది వ్యస్తాక్షరి.
విసుగు తెప్పించే బుల్లి తెర ధారావాహికలు అధిక స్రసంగాలు.
ఇలా రోజూ తిప్పలు పడే వనితలు గొప్ప అవధాన విద్య ప్రదర్శిస్తున్నారు. సహస్రావధానులైన పడతులుండగా, ఇక పురుషావధాను లెందుకండీ ...
నిత్యావధానులైన ఆడవారికి నమోవాకాలు .
తల్లుల కష్టం వెల కట్ట లేనిది. వెల కట్ట రానిదీనూ.
వారికి ఆది వారమూ లేదు, శలవు దినమూ ఉండదు. కదూ?
రిటైర్మెంటు అసలే లేదు.
7, జనవరి 2011, శుక్రవారం
మీకు చేత కాదూ ?
5, నవంబర్ 2010, శుక్రవారం
పేకాట పద్యాలు
గుఱ్ఱం జాషువా చీట్ల పేక శీర్షిక క్రింద వ్రాసిన పేకాట పద్యాలు చూడండి ...
నాలుగు రంగుల వాలజూపుల సాని
అతికాల భుక్తికి నాటపట్టు
గెలిపించి యోడించు కులుకు నవ్వుల పిల్ల
కలహమ్మునకు నిండు కారణమ్ము
వ్యసన వల్లికలకు బలమైన చేయూత
తొలఁగించు కొనరాని జెలగపట్టు
ప్రొద్దెఱుంగని మోహమునకుఁజింతామణి
నలునిల్లు గూల్చిన నంగనాచి
నెత్తి గొరిగి పంపు నెల్లూరి నెఱజాణ
కితవ, జాండములకు బ్రతుకు దెరువు
త్రాగుడునకుఁ గొంత దగ్గఱ చుట్టమ్ము
చేతి డబ్బు పోక చీట్ల పేక !
ఇస్పేటు,ఆఠీను, కళావరు, డైమండ్ ఈ నాలుగూ నాలుగు రంగులలో ఉంటాయి పేక ముక్కలు. ఈ వాలు చూపుల పేక సాని కూడా అన్ని రంగులు, అన్ని హొయలు కలిగినది
.
వేళాపాళా లేని తిండికి పేకాట ఆటపట్టు. పేకాటలో కూర్చుంటే నిద్రాహారాలు గుర్తనకు రావు.
ఓ సారి గెలిపిస్తుంది. మరో తూరి ఓడిస్తుంది. అలా గెలుపోటములతో కులుకు నవ్వుల పిల్ల పేకాట.
తగువులకు పూర్తి కారణం ఇదే. పేకాటలో వచ్చే పేచీలకు కొదవ ఉండదు. వ్యసన మనే లతకు బలమైన చేయూత. వ్యసనాలను పెంచి పోషిస్తుంది.
ఒక సారి పేకాట వ్యసనంగా మారితే, ఆ వ్యసనం జలగలాగా మరి వదలదు.
రేయి పవళులు తెలియ నివ్వ కుండా సుబ్బి శెట్టి సాని చింతామణి వ్యామోహంలో నిండా మునిగి పోయి నట్టు, పేకాటలో కూచున్న వారికి రాత్రీ లేదు, పగలూ లేదు. నలుడంతటి వాడు కూడా ఈ వ్యసనం వల్లనే కదా, ఇల్లు గుల్ల చేసుకున్నాడు?
నెల్లూరి నెఱజాణలాగా తల గొరిగి (అంటే, గుండు చేయించి అని కాదు కానీ, ఉన్నదంతా ఊడ్చుకుని అన్న మాట) మరీ పంపిస్తుంది. పేకాటలో కుదేలయి పోతే , నెత్తిన గుడ్డ వేసుకో వలసినదే కదా?
ఈ పేకాట వ్యసనం మద్యపాన వ్యసనానికి కూడా దగ్గరి చుట్టం. ప్రక్కన మద్యం సీసాలు, గ్లాసులు పెట్టుకుని పేకాట ఆడే జల్సారాయళ్ళు ఎందరో ! చేతి చమురు వదిలి పోయేలా చేస్తుంది, ఈ పేకాట
.
జోకరుగానిఁ దోడుకొని, చుక్కల చక్కదనంబు మీఱ, ‘‘ మూ
డాకులయాట, యెత్తిళులు, నడ్డు, షర’’ త్తని మ్రోయుచున్న యో
పేక బొజంగి ! నన్ను వలపింపకు, మింతట బుద్ధి వచ్చె, నీ
యాకులపాటులో కలుగు నాకుల పాటుఁదలంప సిగ్గగున్.
జోకరు, చుక్కలు, వీటితో కలగలిపి, ఆడే మూడు ముక్కలాట, ( దీనికే కొంపలు ముంచే కంపీ అని ముద్దు పేరు కాబోలు)యెత్తురుపు, అడ్డాట, షరదాట ...వీటితో ఒప్పుతూ ఉండే ఓ విటురాలా, పేక సానీ, నన్ను వలపించ వద్దు. నన్ను నీవలలో పడేలా చేయకు. నాకు బుద్ధి వచ్చింది. పేకాట వ్యసనం వల్ల కలిగే చీకాకు తలుచుకుంటే వొళ్ళు కలవరపాటు చెందుతోంది.
అంగీకార నినాదముల్ పటుతర వ్యాహారముల్, భ్రూకుటీ
భంగాక్షేపణముల్, పరస్పర జయ వ్యామోహ వాద ధ్వనుల్
సంగీతంబులు, కూనిరాగములు, నీలల్, దీర్ఘనిశ్వాసముల్
నింగిన్ దాకుచునుండు, నీదు కేళీతరంగ మధ్యంబునన్.
పేకాటలో కూర్చున్నాక, ఇక మొదలవుతాయి, రకరకాల హావభావ చేష్టలూ, వికారాలూ, విన్యాసాలూనూ. సరేనని ఒప్పుకోవడం, కాదని దెబ్బలాడడం, కను బొమలు ముడి వేసి ఆక్షేపణలు తెలియ జేయడం, ఒకరి గెలుపుని ఒకరు హర్షిస్తూ బాగుంది !బాగుంది ! అనడం.మధ్య మధ్య నోటికొచ్చిన సాటలు పాడడం ( బూతు పాటలయితే మరీ రంజుగా ఉంటాయంటారు, పేకాట రసిక శేఖరులు), లేదా, కులాపాగా కూని రాగాలు తీయడం, ఒక్కో సారి హఠాత్తుగా ఈల పాట రఘురామయ్యలుగా మారి పోతూ వారెవ్వా ! అంటూ ఈలలు వేయడం, మరొకప్పుడు వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ( ముక్క కలవనప్పుడు మరీనూ) ఉండడం,.. మిన్నంటే ఈ చర్యలన్నీ పేకాట మధ్యలో పేకాట రాయళ్ళు చేసే విన్యాసాలు చూసి తీరాల్సిందే కానీ చెప్ప నలవి కావు..
నిఱుపేదన్ గరుణించి పాపమని కానీ, ధర్మ మర్పింపఁ జి
ల్లర లేదంచుఁ దొలంగ లుబ్ధుఁడు, సముల్లాసంబుతో మేటి తెం
పరియై, నూటికి నూరు లొడ్డి విరమింపండక్కటా ! పేక సుం
దరి ! నీ ముక్కలు మోహనాస్త్రములు, చింతాసఔధసోపానముల్.
అయ్యో, పాపం కడు నిరు పేద అని జాలి పడి ఒక్క ఎర్ర ఏగానీ ఇవ్వడానికి చేతులు రావు, కానీ, వందకి వందా ఒడ్డి పేకాటలో ఎంత పోగొట్టు కున్నా, విడువ కుండా ఇంకా ఆట ఆడుతూనే ఉంటారు, కొందరు (పేక) పట్టు వదలని విక్రమూర్ఖులు.) ఓ పేక సుందరీ, నీ పేక ముక్కలు సమ్మోహనం కలిగించే మోహనాస్త్రాలు కదా? చింతాసౌధానికి దారి తీసే మెట్ల దారి కదా?
అనుంగు బిడ్డఁడు బావిలోఁ బడె నన్నా ! లేచి రమ్మన్నఁ’ దె
చ్చున దీ మార్గమెకా యటంచు వచియించున్ జూదగా’ డందు, రిం
దున సందేహము లేదు, కేవలము మందుండై విషగ్రస్తుఁడై
తనరున్, రంగ మలంకరించిన మహాతత్వఙ్ఞుఁడున్, వ్రేల్మిడన్.
పేకాటలో కూర్చున్న వారికి ఒళ్ళూ మీదా తెలియదు. ముద్దుల కొడుకు బావిలో పడి చచ్చేడయ్యా, ఆ ముక్కలు అలా పారేసి, వేగం రావయ్యా, అని పిలిచినా, పేకాట వదలి లేవడు.పైపెచ్చు, శవాన్ని ఈ దారంటే తెస్తారు కదా, అప్పుడు చూదాం లే అంటాడు. సందేహం లేదు. వట్టి మూర్ఖుడు.మత్తుడు.భవభంధాలను తృణప్రాయంగా చూసే మహా తత్వవేత్త కాబోలు
.
గెలుపా ! యూయెల సంశయంబునకు మఒగ్గెన్, బేస్తులా రెండు రూ
కలపై చిలక్కు కుదేళు లిచ్చు కొననింకం బావులా కాని గా
వలె, నీ ఘోర విపత్తు మస్తమున సంప్రాప్తించెనా ! వాఁడు ’వి
హ్వల నాగేంద్రము పాహి !పాహి !‘ వఱకై యబ్జాక్షుఁడున్ రావలెన్.
గెలుపు కలిగేలా లేదు. బేస్తులు రెండు రూకలకు మించి పోయేలా ఉంది. కుదేలు ఇచ్చు కోవాలంటే పావలా ఐనా కావలె. ఎంత ఆపద వచ్చిందిరా నాయనా.ఈ ఆపద గట్టెక్కించడానికి అలనాడు గజరాజునికాపాడిన శ్రీ మహా విష్ణువే రావాలి కదా. ( ఈ పద్యం లోని పేకాటకి చెందిన సాంకేతిక పదజాలం నాకు బొత్తిగా తెలియక పోవడం వల్ల భావం తోచిందేదో రాసేను.మన్నించాలి,)
పేకయాటలోని పింఛనీదారుండు
చుట్ట త్రాగు కొనుచుఁజూడ వచ్చి
‘‘చెఱచి’’ తనుచు ముక్కు చిట్లించు కొని పోవు
పేకయాట, గుండె పీకులాట.
ఈ పద్య భావం కూడా అందడం లేదు. పేకాట వొట్టి గుండె పీకులాట అనేదే తెలుస్తోంది.
అర్ధమైనంత వరకూ, పేకాట జరిగే చోటుకి ముసలాళ్ళు చుట్టలూ అవీ త్రాగుతూ వచ్చి, కాసేపు ఎవడి ప్రక్కనో చేరి ఆట చూసి, ‘‘ పాడు చేసావోయ్’’ అని విసుక్కుని వెళ్ళి పోతూ ఉంటారు అని కాబోలు.
పేకాట గాళ్ళ ప్రక్కన చేరే వారికి మనం ఏ ముక్క కొట్టినా నచ్చదు.మనం శుద్ధ తెలివి తక్కుగా ఆడుతున్నామని వారి ప్రగాఢ విశ్వాసం. ఊరికే విసుక్కు పోతూ ఉంటారు.వాళ్ళ ఆలోచన మనకి తట్టక పోవడం మన తప్పా, చెప్పండి?
ఇవండీ, పేకాట పద్యాలు.
దపావళి పండుగ పూట, సరదాగా పేకాట ఆడుకుందా మనుకుంటూ ఉంటే, ఇలాంటి టపా పెట్టావేమిటయ్యా, అని కోపగించు కుంటారేమో !
మరందు చేత అందరకీ ...
.
3, నవంబర్ 2010, బుధవారం
వద్దు బాబోయ్ !!
30, అక్టోబర్ 2010, శనివారం
నీది కానిది నీకేమి ఇవ్వ గలను తల్లీ !
14, అక్టోబర్ 2010, గురువారం
ఆహా ! ఏమి రుచి !! ( చల్ది బువ్వ )
6, అక్టోబర్ 2010, బుధవారం
పెద్దలకు మాత్రమే.
13, సెప్టెంబర్ 2010, సోమవారం
జాణవులే, నెరజాణవులే !!
ఉత్తరాంధ్రలో విజయ నగర ప్రభువులు అభినవ ఆంధ్ర భోజులు. వారి పోషణలో ఎందరో కవి పండితులు అపూర్వమైన గ్రంధ రచనలు చేసి మహత్తరమయిన సాహిత్య పోషణ చేసారు. అలాంటి దిగ్గంతులలో ఒకరిని ఈ టపాలో స్మరించుకుందాం ...
ఆనంద వర్ధనుడు సంస్కృత భాషలో వెలయించిన ఆలంకారిక గ్రంథము ధ్వన్యాలోకము. కావ్యాత్మ ఏది అని ప్రశ్నించి, కావ్యమునకు ఆత్మ ధ్వని అని ఒక అపూర్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.ధ్వని గర్భితమైన రచన కావ్య సౌందర్యాన్ని ఇనుమడింప చేయడమే కాక, కావ్యానికి పరిపుష్ఠినీ, ఉత్తమ స్థానాన్నీ కల్పిస్తుంది. సమర్ధుడైన కవి తన వక్తవ్యాంశాన్ని కేవలం వాచ్యంగా చెప్పడు.ధ్వని తో స్ఫురింప చేస్తాడు.అవాంతర భేదాలతో విస్తరించి ఉన్న ఈ ధ్వని
శాస్త్రాన్ని గురించి గురు ముఖత: గ్రహించడమే మేలు గహన సదృశంగా తోచే ఈ మహత్తర
ఆలంకారిక గ్రంథానికి పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఆంధ్ర ధ్వన్యాలోకము అనే పేరుతో చక్కని అనువాదం చేసారు.
శ్రీ శాస్త్రి గారు విజయనగర వాస్తవ్యులు. అక్కడి ప్రభుత్వ మహా రాజ సంష్కృత కలా శాలలో విద్యాభ్యాసం చేసి , అక్కడే ఆంధ్ర భాషా ప్రధానాధ్యాపకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగీత సాహిత్యాలలో దిట్ట.
ఇందులో ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకనంతో పాటు, ధ్వన్యాలోకన వ్యాఖ్యాతలలో ఒకరైన
అభినవగుప్తపాదుల వారి లోచన వ్యాఖ్యను కూడ అనువదించడం జరిగింది.మాతృక లోని లక్ష్య శ్లోకాలను దీనిలో సరళ సుందరమయిన తెలుగు పద్యరూపంలో మనకి అందించడం జరిగింది
.
అసలు ఏమిటీ ధ్వని?
అర్ధం ఎప్పుడూ శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అలా గోచరించే అర్ధం వాచ్యం అయితే
చదవగానే, లేదా వినగానే స్ఫురించే అర్ధమే కాక వేరొక అర్ధం స్ఫురించడమే ధ్వని. దీనికే వ్యంగ్యం అని నామాంతరం. ధ్వని గర్భిత రచనకి ఎప్పుడూ ఉత్తమ స్థానం లభిస్తుంది..
ధ్వని గర్భితాలయిన రెండు చిన్న పద్యాలను చూదాం ....
కనులు కాన రాని కటిక చీకటి రేయి
వలస పోయె మగడు, వంటి దాన !
దొంగ లెవ్వరయిన దోతురేమో సుమ్ము
కంట గనుము, ప్రక్క యింటి వాడ !
ఒక ఊరిలో ఒక నెరజాణ ఉంది. ఆమె బయటకి కడు ముద్దరాలిలా కనిపిస్తుంది. ఆమె నాథుడు ఏవో పనుల మీద దేశాంతరం పోయి చాలా దినాలయింది. ఆమె వయసు ఊరు కోవడం లేదు. శరీరం సహకరించడం లేదు. మతి లయ తప్పుతున్నది. పురుష స్పర్శ కోసం దేహం తహ తహలాడి పోతున్నది. ఎలా? ఎవ్వరకీ అనుమానం రాకుండా పొరుగింటి యువకుడిని ఉద్దేశించి ఇలా అంది:
అయ్యో, చీకటి పడింది. కళ్ళు పొడుచుకున్నా కనబడడం లేదు. నా భర్త దేశాంతరాలు వలస పోయాడు. ఇప్పటిలో రాడు. నేనా, వంటరి దానిని ! అదను చూసి దొంగలెవరయినా దోచుకుంటారేమో భయంగా ఉంది. మా ప్రక్క ఇంటి వాడివే కదా, నన్నూ, మా యింటినీ ఓ కంట కాస్త కనిపెడుతూ ఉండు సుమీ !
ఇదీ పద్యం. వాచ్యంగా చూస్తే ఒక దీన మైన అభ్యర్ధన తప్ప ఇందులో మరేమీ గోచరించదు.ఎక్కడా అనౌచిత్యం, అశ్లీలం కనిపించదు.
కొంచెం లోతుగా చూస్తే మాత్రం ఆ నెరజాణ గడుసుతనం, మాటకారితనం, మనసులోని మర్మం అన్నీ ప్రకటితమవుతాయి.
చీకటి పడిందయ్యా. నా మగడు ఊర లేడు. నేనో, ఒంటరి దానిని. మగ తోడు కావాలనిపిస్తున్నది. రాకూడదూ? అని పిలుపు ! భర్త లేడని చెప్పడం వలన మరేమీ భయపడ వలసిన పని లేదని ధ్వని. కటిక చీకటి అనడం వలన ఎవ్వరూ చూడ లేరులే అని సూచన. వంటరి దానను అనడం వలన ఇంటిలో మన కలయికకు ఎవరూ అడ్డంగా లేరులే అనే భరోసా, దొంగ లెవరయినా దోచేస్తారేమో అనడం వలన, నువ్వు తక్షణం రాక పోతే మరెవరయినా వొచ్చి, నా పొందు స్వీకరించే భాగ్యం పొంద గలరు సుమా అనే బెదిరింపు. కంట కనుము అని అనడం వలన, నా అంత అంద గత్తె పిలుస్తూ ఉంటే జాగు చేయక వెంటనే ఓ చూపు చూడవయ్యా అని కవ్వించడం. ప్రక్క యింటి వాడ ! అనడం వలన నువ్వు చాలా కాలంగా మా ప్రక్క ఇంటి లోనే ఉంటున్నావు కనుక ఈ అదృష్టం నీకే అభిస్తోందయ్యా అని ఊరించడం ..... ఇదీ ధ్వని !
మరో పద్యం, శాస్త్రి గారి అనువాదం:
ఒడలెరుఁగ దిచ్చట శయించు చుండు నత్త,
నేనొ, యిచటఁబరుండుదును, నీవొ, రేయి
నంధుడవు ! పాంథ ! దివసకమందె, దీని
చక్కగాఁజూడు పడకు మాశయ్యలందు
ఇదీ పద్యం. ఈ నెరజాణ పరిస్థితీ అలాంటిదే. మగడు ఊర లేడు. చాలా రోజులయింది.
విదేశగతుడై. తానా ,యవ్వనవతి. దేహం మగతోడు కావాలంటోంది. ఉప్పూ కారం తినే వయసాయె!
సరే, ఇంటికి ఓ అతిథి వచ్చేడు. చూడ చక్కగా ఉన్నాడు. ఈవిడ గారి కన్ను వాడి మీద పడింది. ధ్వని గర్భితంగా సంకేతం వినిపించింది.
ఓ బాటసారీ, ఇదిగో చూడు. మా అత్త వొళ్ళూ మీదా కానకుండా ఇక్కడ పడుకుని ఉంటుంది. ఆవిడ గారికి ఓ సారి నిద్ర పడితే మరి అంతే . ఒళ్ళెరుగదు. నేను ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటూ ఉంటాను. నువ్వు చూడబోతే రేచీకటి గాడిలా ఉన్నావు. రాత్రి వేళ మంచి నీళ్ళు త్రాగడానికో, మరేదో అవసరానికో లేస్తావు. నీకు రేచీకటిలా ఉంది. ఎవరెక్కడ పడుకుంటారో ఇప్పుడే చెబుతున్నాను. ఈ పగటి వెలుతురు లోనే చక్కగా చూసి గుర్తు పెట్టుకో. మా పడకల మీద పడకు సుమీ !
వాచ్యార్ధంలో ఇందులో ఎంచడానికేమీ లేదు. నెరజాణ గడుసుతనమంతా తన కోరికను ధ్వన్యంతరంగా చెప్పడం లోనే ఉంది.
ముందుగా రాత్రి వేళ అత్త ఎక్కడ పడుకుంటుందో చెప్పింది. ఆవిడ ఒళ్ళెరక్కుండా పడుకుంటుంది కనుక మనకింక భయమేమీ లేదని సూచించింది. తను ఏ మంచం మీద పడుకుని ఉంటుందో చక్కగా సూచన చేసింది. రేచీకటి గాడివనడంలో, ఆ రాత్రి ఇంట్లో దీపం లేకుండా అంతా చీకటిమయం చేసి ఉంచుతానని చెప్పకనే చెప్పింది. ఎవరెక్కడ పడుకుంటారో పగటి వేళ వెలుతురు ఉండగానే చక్కగా చూసి గుర్తు పెట్టు కోమని హెచ్చరించింది.
ఇక , పడకు మా శయ్య లందు అనడం వల్ల రాత్రి తన పడక మీదకి రమ్మని ధ్వని ఎలా కుదురుతుంది?
అని సందేహం రావచ్చును.
మా పడకల మీద పడ వద్దు అని వాచ్యంగా నిషేధించింది. పడకలు అని బహువచనం వాడడం వలన ఆ నిషేధం అన్వర్ధము కదా ?
అత్త పరుండే శయ్య మీద కాకుండా తాను ఒక్కతె పరుండే పడక మీద పడవచ్చుననే ధ్వని ఇందులో ఉంది. వాచ్య రూప నిషేధంలోనే విధి రూప అంగీకారం ఉంది.
ఇదీ ధ్వని.
మరో ఉదాహరణ కూడ చెబుతాను.
ఒక అటవీ ప్రాంతలో ఒక ప్రేమ జంట కులాసాగా తిరుగుతూ ఉంది. అక్కడి పూల పొదలే వారి పడకటిల్లు. మంచి యుక్త వయసులో ఉన్నారు. కామోపభోగాలు చక్కగా అనుభవిస్తున్నారు.
ఒక బ్రాహ్మణుడు పూజకు పువ్వులు కోసుకోవడం కోసం రోజూ వాళ్ళండే పొదల దగ్గరకి వస్తూ ఉన్నాడు. వారి ఏకాంతానికి ఇది భంగకరంగా పరిణమించింది. ఇటు వేపు రావద్దయ్యా అని చెప్పాలంటే భయం. ఆ సద్బ్రాహ్మణుడికి అలా చెప్పే ధైర్యం వారికి లేదు.తమ కలయికకు ఆటంకం కలిగిస్తున్న అతని రాకను నివారించాలి. తనంతట తానుగా ఆ బ్రాహ్మణుడు మరి అటు వేపు రాకుండా చేయాలి.
అందుకే ధ్వని గర్భితంగా అతనితో వినయంగా ఇలా చెప్పారు:
ఓ బ్రాహ్మణుడా ! నువ్వు రోజూ పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ Iఉన్నావు, ఇక్కడ రోజూ నిన్ను ఓ కుక్క అల్లరి పెడుతోంది కదా ? ఇక్కడ తిరిగే ఓ పెద్దపులిని చూసి, మరి ఆ కుక్క నీ జోలికి రాదు. ఇక్కడి నుండి ఉడాయించింది,. నువ్వు ఇక మీదట ఎప్పటి లాగే రోజూ నిర్భయంగా పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ ఉండ వచ్చును. మరేమీ భయం లేదు.
కుక్కకే భయపడే ఆ బ్రాహ్మణుడు మరి పులి పేరెత్తితే ఇక ఆ ఛాయలకు వస్తాడా చెప్పండి?
అంతే ! ఇక, అటు వేపుగా ఆ వెర్రి బ్రాహ్మణుడి పత్తా లేదు !
ఆ యువతీ యువకులకి పండుగే పండుగ !
స్వస్తి.