28, ఏప్రిల్ 2010, బుధవారం

ఏనుగు ఏనుగే ... పీనుగు పీనుగే !!

























క్షుత్షామో2పి ,జరాకృశో2పి, శిధాలం ప్రాయో2పి, కష్టా ధశా
మాపన్నో2పి, విపన్నదీధితరపి, ప్రాణేషు నశ్యోత్ష్వపి
మత్తేభేంద్ర విభిన్న కుంభ విశిత గ్రాసైక బద్ధసృ్పహ:
కిం జీర్ణం తృణయత్తిమానమహతా మగ్రేసర: కేసరీ

గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన విశీర్ణమైన, నా
యాసమునైన, నష్టరుచియూనను ప్రాణభయార్తమైన,ని
నిస్రా సమదేభ కుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కసరి జీర్ణ తృణంబు మేయునే?


తిండి లేక చిక్కి పోయినా, ముసలిదయి పోయినా, బాధలలో ఉన్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, ఏనుగు కుంభ స్థలాన్ని చీల్చి అక్కడి మాంసాన్నే తింటుంది తప్ప , సింహం మిగతా చెత్త తినదు. వేరే గడ్డి కరవదు.

మరి, కుక్క సంగతి చూడండి ...


లాంగూల చాలన మధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుక్తే

వాలము ద్రిప్పు, నేలబడ వక్త్రము కుక్షియుఁజూపు క్రిందటం
గాలిడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్ర శుం
డాలము శాలితండులగుడంబులు చాటు వచశ్శతంబు చే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిఁగ జూచు మహోన్నత స్థితిన్


యజమాని పడేసే ఎంగిలి కూడు కోసం కుక్క ఎన్ని వికార చేష్టలయినా చేయడం మనకి తెలిసిందే
కదా ?
యజమాని ఎదుట తోక ఆడిస్తుంది. నేల మీద పడి దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేల
కెలుకుతుంది. తిండి కోసం ఎన్ని వికార పోకడలయినా, పోతుంది. దాని నైజమే అంత కద !! భద్ర గజం అలా కాదు. మురిపించుకుని, బుజ్జగింపు మాటలు చెబితే కాని తినదు.

సింహం సింహమే ! ఏనుగు ఏనుగే !! కుక్క కుక్కే కదా !!!

24, ఏప్రిల్ 2010, శనివారం

చిన్నారి పొన్నారి తండ్రీ ... ...


శిశువు గురించి శ్రీ జాషువా కవి చాలా మంచి పద్యాలు వ్రాసారు. చాలా మందికి ఇవి పరిచిత పూర్వాలే అయి ఉండ వచ్చును. తెలియని వారి కోసం యీ టపా ...

గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

జాషువా పద్యాలకి వివరణ అక్కర లేదు. అయినా, కొద్దిపాటి వివరణ ...
పాట పాడితేనే కాని నిద్దుర పోడు. తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుకలాగా ఒరిగి పోతాడు. ఆ లేత వయసులోనే కండలు తిరిగిన పిల్ల వస్తాదులా ముద్దొస్తాడు. ఎంత భాగ్యవంతుడో ! ఉయ్యేల దిగకుండానే అన్ని పనులూ జరిపించుకుంటాడు. ఉ ఊ అనే రెండక్షరాలు నేర్చిన వింత చదువరి. సతిని తాకని సాంబ శివుడిలా ఉంటాడు. కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పర దేశి. తన యింటికి కొత్త యజమాని. ఈ భూమి మీదకి ఏ రాచ కార్యం చేడానికి వచ్చేడో కదా ? కొంచెం నడక రానీ, అప్పుడు అడుగుదాం. ముందు ముందు వయసు వచ్చేక ఎలాగ ఉంటాడో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం ఈ చిన్నారి శిశువుకి ఏ పాపం తెలియదు !!

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర


తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో అన్నం , నీరు లేకుండా గడిపి, ప్రయాణం చేసి వచ్చిన బాట సారి. చిమ్మ చీకటిగా ఉండు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణ స్వరూపుడు. నునుపైన చెక్కిళ్ళలో బోసి నవ్వులలో ముద్దులు కురిపించే మోహనాకారుడు. తరగని తల్లి పాలు అనే మధు ధారలను తన అన్నంగా తచ్చుకున్న అతిథి.బట్ట కట్టుకోడు. సిగ్గు పడడు. నేల తల్లి అనే బడిలో చేరి ఇంకా వారం అయిందో, లేదో, మా ప్రకృతి కాంత వీడికి ఆకలీ నిద్రా నేర్పించింది.


ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

పడుకున్న ఊయ్యేల తొట్టి వాడికి ఏం ఉపదేశం చేస్తందో కానీ, ఒంటరిగా ఊ కొడుతూ ఉంటాడు. తల్లితో ఏ జన్మల సంబంధమో కాని ఏడ్చి సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఆ దేవ దేవుడు అతనితో ఏ సల్లాపాలు చేస్తాడో తెలియదు భలే భలే అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటాడు
ఈ మూడు రోజులలో ఎప్పుడు నేర్చుకున్నాడో వెర్రి తండ్రి ఛీ ఫో అని సరదాకి అంటే ముఖం చిన్న బుచ్చు కుంటాడు. ఆ బుగ్గల లేతదనం తగ్గి, చదువు సంధ్యలు నేర్చకున్నాక ‘ నా బంగారు కొండ , నా రతనాల కొండ ’ అని తల్లి ముద్దుగా అంటూ ఉండే మాటలు నిలుపుకుంటాడో లేదో , చూదాం !

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు

దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?


తన చేతి గిలక పండుకి ముచ్చటలు చెబుతూ ఉంటాడు. అది తిరిగి పలక లేదని కోపం వచ్చి విసిరి కొడతాడు. పొరుగింటి ఆడవాళ్ళు చేర దీస్తే వెళ్ళడాని యిష్ట పడడు. తన పర భేద భావం వీడికి అప్పుడే తెలిసి పోయింది. తేనె అంటే ఇష్టం రుచుల భేదం గ్రహించేస్తున్నాడు. పెద్ద చప్పుడుని వింటే చాలు భయంతో తల్లిని గట్టిగా కరుచుకు పోతాడు. ఇతనికి అరిషడ్వర్గాలు అనే ఆరుగురు శత్రువులలో ( కామం, క్రోధం, లోభం, మోహం, మదం , మాత్సర్యం) ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారు అప్పుడే వీడి మనసులో చేరుకున్నారు కదా ? వీడి జాతకంలో గొప్ప కీర్తిమంతుడవుతాడని ఉందో, బొత్తిగా అప్రతిష్ఠ పాలవుతాడని రాసి ఉందో కదా !!

ఎంత చక్కని పద్యాలో చూసారు కదూ ? !!

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మసి బొగ్గులు


దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

ఈ చిన్న శ్లోకంలో ఎంత గొప్ప విషయం కవి చెప్పాడో చూడండి ...

చెడ్డ వాళ్ళు బొగ్గుల లాంటి వారుట ! వాళ్ళు శత్రుత్వంలో ( వేడిగా ఉన్నప్పుడు) మన చేతులు కాలుస్తారుట.

స్నేహంలో ఉన్నప్పుడు ( అంటే చల్లగా ఉన్నప్పుడు) మన చేతులని మసి చేస్తారుట !

మైత్రిలోనూ, వైరం లోనూ వాళ్ళు మనతో ఒక్కలాగే ప్రవర్తిస్తారన్న మాట.

అంచేత చెడ్డ వారితో స్నేహం వద్దు సుమా.

11, ఏప్రిల్ 2010, ఆదివారం

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....


చెప్పఁదగుఁగవిత రసముల్
జిప్పిల, నప్పప్ప ! భళి భళీయన. లేదా
యెప్పుడుఁజేయక యుండుటకవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే కదా. మన కవులు రస బంధురమయిన గొప్ప కవిత్వం చెప్పడంతో పాటు , కవిత్వం గురించి, కవిత్వం గొప్ప తనం గురించి కూడా మంచి కవిత్వం చెప్పారు. అలాంటి సందర్భాలను కొన్నింటిని చూదామా ?


గుడి కూలును, నుయి పూడును
వడి నీటను చెఱువు తెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యమె సుమ్మీ
కుడి యెడమల నరసి చూడ గువ్వల చెన్నా.
సప్త సంతానాలలో ఏవీ శాశ్వతంగా నిలిచేవి కావని చెబుతూ, ఎన్నటికీ చెడనిది పద్యమే సుమా అని చెప్పడం జరిగింది.యొప్పు సుమీ, సుకవి యెంతయుచితఙ్ఞుఁడొకో
( రాజ శేఖర చరిత్ర . మాదయ గారి మల్లన.)

కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య సత్కథ
ల్వావిరి పుట్టు రత్నము లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వవృత్తములు సానల దీరిన జాతి రత్నముల్
గావున నిట్టి మిశ్ర కథగా నొనరింపుము నేర్పు పెంపునన్.

( వసు చరిత్ర . రామ రాజ భూషణుడు)


తా రసపుష్ఠిమైఁ బ్రతి పదంబున జాతియు వార్తయున్ జమ
త్కారము నర్ధ గౌరవముఁగల్గ ననేక కృతుల్ ప్రసన్న గం
భీర గతిన్ రచించి మహి మించినచో నిఁక శక్తు లెవ్వ ర
య్యా ! రఘునాథ భూప రసికాగ్రణికిన్ జెవి సోకఁజెప్పఁగన్
(విజయ విలాసము . చేమ కూర వేంకట కవి.)


చెప్పఁగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్.

( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)

కవిత్వం చెబితే కర్పూరం కుప్పలుగా పోసినట్టు ఉండాలట. కుంకుమ మీద మీద కప్పినట్టుండాలట. పూల పొట్లం విప్పినట్టుండాలిట ! ఎంత గొప్ప కోరికో కదూ ?

కవియల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాజి గణుతింపంగాఁ
గవి నేను రామకృష్ణుఁడఁగవి యను నామంబు నీటి కాకికి లేదే ?

( తెనాలి రామలింగ కవి పేర వినిపించే చాటువు.)
కవి అంటే పెద్దన, తిక్కనాదులూ , తనూనట. మిగతా కవులు కుకవులట. కవి అనే పేరు నీటి కాకికి కూడా ఉందికదా అని వేళాకోళం చేసాడు.

గడియకు నూఱు పద్యములు గంటము లేక వచింతుఁదిట్టగాఁ
దొడగితినా పఠాలుమని తూలి పడంగుల శైలరాజముల్
విడిచి యనుగ్రహించి నిఱు పేద ధనాధిపత్యులుఁజేతు, నే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే ?

ఈ తిట్టు కవి గడియకు నూఱు పద్యాలు అవలీలగా చెప్పగలడట. తిట్టినా అంతే. కుల పర్వతాలు కదిలి పోవలసినదే. అనుగ్రహించితే కటిక పేద వాడిని సైతం ధనవంతునిగా చేయ గలడట ....

నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచ మొప్పు త
ప్పరయు రసఙ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే ?

(అల్లసాని పెద్దన)
కవి గారికి కవితా రచన చేయడానికి ఎన్ని సదుసాయాలు కావాలో చూడండి ...
ధూర్జటి కవిత్వానికి అతులిత మాధుర్యం చేకూరడానికి కారణం తెలుసు కదా ?


స్తుతమతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
యతులిత మాధురీ మహిమ ! హా ! తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితాజనతా ఘనతాపహారి సం
తత మధురోధరోదిత సుధారస ధారలు గ్రోలుటం జుమీ !

కవి గారి కవితకి అంత మాధుర్యం అబ్బడానికి నిత్యం సౌకుమార్యం కల కన్నియల అధర మాధుర్యాన్ని చవి చూస్తూ ఉండడమేనట.

పలుకగ వలె నవరసములు,
కులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
నళుకక యటు గాకున్నం
బలుకక యుండుటయె మేలు బహుమానముగన్

( రఘునాథ రాయలు. రామాయణం)
చెప్తే నవరసాలూరు కవిత చెప్పాలి. లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. అదీ సంగతి. తెలిసిందా ?


రెండర్ధంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
కుండుం, దద్గతి కావ్య మెల్ల నగునే నొహో యనంజేయదే
పాండిత్యంబున? నందునుం దెనుఁగుగబ్బంబద్ధుతంబండ్రు , ద
క్షుండెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషా కృతిన్.

(పింగళి సూరన. రాఘవ పాండవీయం ద్వ్యర్ధి కావ్యం,)

రెండర్ధాల పద్యం రాయడమే కష్టం. మొత్తం కావ్యం అంతా అలా రాయాలంటే సాధ్యమా ?
భారత రామాయణాలని ఓహో అనే లాగున ద్వ్యర్ధి కావ్యంగా రాసి చూపిస్తున్నాను. చూడండి తమాషా అని కవి ఎంత ధీమాగా చెబుతున్నాడో కదూ ?


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా ?
అని ప్రతిన పూని మహా భాగవత రచన చేసాడు పోతన కవి.

ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !!!

ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా రాయి. సహిస్తాను. కానీ, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం రాయకు. ముమ్మాటికీ రాయకు.

అరసికులకు కవిత్వం వినిపించవలసి రావడం ఎంత బాధాకరమో కవి వాపోతున్నాడు. గమనించారా?

నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు రే
ఖా కమనీయ వైఖరులు గాంచి, భళి! భళీ!! యన్నవాడె, ‘ మీ
దేకుల’’ మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్.

( జాషువా కవి)

అంత వరకూ కవిత్వాన్ని అహో, ఒహో అంటూ తెగ మెచ్చుకుని , కులం పేరడిగి, తెలుసుకొని చీదరించుకునే నీచుల గురించి జాషువా కవి ఎలా వాపోయాడో ఈ పద్యంలో చూసారు కదూ?

పాతదంతా మంచిదనీ, కొత్తదతా తిరస్కరించదగినదని అనుకో రాదని కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో హెచ్చరించాడు.


పురాణమిత్యేవ న సాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్యవద్యం
సంత: పరీక్ష్యాన్తరత్ భజంతే
మూఢ పర ప్రత్యయ నేయ బుద్ధి :
దీనికి వేలూరి శివరామ శాస్త్రి గారి అనువాద పద్యం కూడా చూడండి.


రమ్య మెప్పుడు గాదు పురాణమనుచు
గొనబు గల్గిన దనరాదు క్రొత్తదనుచు
పండితుండొండు దానిని భజన సేయు
మూఢుడితరుల వచించు బుద్ధి నొప్ప.

అందుకే ఆధునికులలో గురజాడ ...

పాత కొత్తల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటా వీవు, నీవిక
చెచ్చకుంటే మించి పాయెను

అని తిరస్కరిస్తూ ...

ఆకులందు అణగిమణగీ
కవిత కోకి పలుక వలెనోయ్
ఆపలుకులను విని
దేశమందభిమానములు
మొలకెత్తవలనోయ్

అని చెప్పాడు. అడుగు జాడ గురజాడది. అది భావికి బాట.


కుక్కపిల్లా, అగ్గిపుల్లా,సబ్బుబిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ
కవితా మయమేనోయ్ అన్నీ ...

అంటూ చెప్పిన శ్రీ.శ్రీ గారు కాదేదీ కవితకనర్హం అని పేర్కొన్నారు.
ప్రపంచమొక పద్మవ్యూహం అంటూ, కవిత్వమొక తీరని దాహం అని కూడా చెప్పారు.కదూ?

బాలగంగాధర తిలక్ కవిత్వం ఒక ఆల్కెమీ ... దాని రహస్యం కవికే తెలుసునని చెప్ప లేదూ?
కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అనడానికి అనంతమైన ఉదాహరణలు ఉన్నాయి.

దాదాపు ప్రాచీన, ఆధునిక కవులందరూ కవిత్వం మీద కవిత్వం చెప్పిన వారే. మచ్చునకు కొన్ని ఉదాహరణలు చూపించానంతే ...
బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి) నుండి ‘నా కవిత్వం ’ అనే తిలక్ కవితతో ముగిస్తాను ....

నా కవిత్వం


నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనిక వాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజి పువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథ: పతంగాలూ
ధర్మ వీరుల కృత రక్తనాళాలూ
త్యాగ శక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతా
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.










31, మార్చి 2010, బుధవారం

ఆశ ... దోశ ... అప్పడం ... వడ ....


అశ అనేది ఉండడం ఎవరికయినా సహజమే. కాని, అత్యాశ మాత్రం పనికి రాదు.
దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు

ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం రాజ్యస్థ: స్వర్గమీహతే

వంద కలవాడు వేయి కావాలని కోరుకుంటాడు. వేయి కలవాడు లక్ష కావాలని అభిలషిస్తాడు. లక్షాధికారి
రాజ్యం (అధికారం) కావాలని ఉవ్విళ్ళూరుతాడు. పోనీ, అంతటితో ఊరుకుంటాడా అంటే, ఉహూఁ .... ప్రభుత్వం సిద్ధించిన పిమ్మట స్వర్గం ప్రాప్తించాలని కలలు కంటాడు. ఆశకి అంతు లేదు కదా ?

భాగవతంలో వామన చరిత్రలో పోతన గారి పద్యం ఒకటి చూడండి ...


ఆశాపాశము దాఁగడున్నిడుపు , లేదంతంబు రాజేంద్ర! వా
రాశి ప్రావృ త మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులున్నర్ధ కా
మాశన్ బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే ?

మహా సామ్రాజ్యం చేకూరినప్పటికీ వైన్యుడు, గయుడు మొదలయిన పూర్వ రాజులు ఖేద పడ లేదా ?అర్ధకామాశను విడువ గలిగారా?

పసిడి కంకణం మీద పేరాశతో పులి నోటికి చిక్కిన బాపడి కథ చిన్నప్పుడు చదువుకో లేదూ ?

రాజ్య కాంక్షతో అయిన వారినే చంపిన దుర్మార్గులు చరిత్రలో ఎందరు లేరు? అశ ఎంత చెడ్డది ?

అలాంటి వారి గురించి ధూర్జటి చెప్పిన పద్యం కూడా చూడండి ...

ఒకరింజంపి సదస్థులై బ్రతుక తా మొక్కొక్కరూహింతురే
లొకొ ? తామెన్నడుఁజావరో ? తమకు బోవో సంపదల్ ? పుత్ర మి
త్ర కళత్రాదుల తోడ నిత్య సుఖమందంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నడుం కట కటా ! శ్రీ కాళ హస్తీశ్వరా !

బంగరు లేడి లోకంలో ఉండడం దుర్లభం అని తెలిసి కూడా సీతా దేవి దానిని కోరడం , రాముడు ఆమెను విడిచి తెస్తానని వెళ్ళడం ఏం చోద్యం !

కనకమృగము భువిని కద్దు , లేదనకయె , తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివి లేని వాడు దేవుడెట్లాయెరా , విశ్వదాభి రామ వినుర వేమ.

వేమన పద్యమే మరొకటి ...

నీళ్ళ లోన మీను నెరమాంసమాశించి . గాలమందు చిక్కు కరణి భువిని
ఆశ దగిలి నరుడు నీలాగు చెడి పోవు విశ్వదాభిరామ వినుర వేమ,

నీళ్ళలో చేప గాలానికి కట్టిన ఎరకి ఆశ పడి గాలానికి చిక్కి ఛస్తోంది. ఆశ కి తగిలిన మానవుడూ అలాగే నశిస్తాడు సుమా.

ఆశయా బద్ధతే లోకే ... అన్నారు పెద్దలు. అత్యాశ కూడదని చెప్పడమే లక్ష్యం.

30, మార్చి 2010, మంగళవారం

చెప్తే వినాలి ...

సంతస్తాయసి సంస్థితస్య పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ జుషా మేవం విధా వృత్తయ :

నీరము తప్త లోహమున నిల్చి యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు , నా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్

బాగా కాలిన లోహం మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.

అలాగే, మనం అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.

దుర్జనులు ఎప్పుడూ పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని ఆదరించం కదా ?

28, మార్చి 2010, ఆదివారం

అవును కదూ ?

ఆరంభ గుర్వీక్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృధ్ది ముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా, ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం


మొదల చూసిన కడు గొప్ప పిదప కుఱుచ
ఆది కొంచెము తర్వాత నధిక మగుచు
తనరు దిన పూర్వ పర భాగ జనిత మైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి


కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తర్వాత తగ్గి పోతుంది .
మంచి వారితొ స్నేహం మొదట తక్కువగా ఉండి పిదప పెరుగుతుంది.

కుజనులతొ మైత్రి ఉదయకాలపు నీడ లాగున, సజ్జనులతొ మైత్రి సయంకాలపు నీడ లాగున ఉంటాయి .

10, మార్చి 2010, బుధవారం

ఇచ్చుటలో ఉన్న హాయీ ....

ప్రియ:ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వర:

అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి :

మబ్బు ఎప్పుడూ నీటినే యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !

ఎంత మంచి శ్లోకమో చూసారు కదూ ?

ఇవ్వడంలోని గొప్పతనం అలాంటిది మరి...

ఇవ్వడంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ

బాదాబ్జంబులపై కపోల తటిపైఁబాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !

వామన చరితంలోని ఈ పద్యం బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన

పద్య రత్నాలలో యిదొకటి !

9, మార్చి 2010, మంగళవారం

అల్లుడా ! మజాకానా !!

సదా వక్ర: సదా క్రూర: సదా పూజామపేక్షతే

కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమ గ్రహ:

ఎప్పుడూ కుటిలంగానే ఆలోచిస్తూ ఉంటాడు. తనని అందరూ నిత్యం గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు.

అమ్మాయి కొంగు ఒక్క క్షణం సేపు కూడా వదలడు. ఎవరయ్యా ? దశమ గ్రహంగా పిలవబడే అల్లుడు !

అప్పొసింగిన వాడును, అల్లుడ, ద్దె

యింటి యజమానుడు, జీతమిచ్చు వాడు

కుల వినోదియు, పన్నులు కూర్చు వాడు

పుస్తె కట్టని మగడు పో పురుషులకు !

ఆడ పడుచు అర్ధ మొగుడని మనం విన్నదే కదా ? ఆ పద్యంలో మగాళ్ళకి మొగుళ్ళ గురించి చెబుతున్నాడు కవి.

వెలయాలు, శిశువు, అల్లుడు

నిలయేలిక, యాజకుండు, నేవురు ధరలో

కలిమియే లేమియు దలపరు

కలియుగమున కీర్తి కామ కాటయ వేమా !

ఉందా, లేదా అని చూడకుండా పీడించే వాళ్ళ జాబితా చూడండి ... మీది పద్యంలో చెప్పిన ఐదుగురూ వీర లెవెల్లో పీడించడమే పనిగా పెట్టుకునే వాళ్ళుట ...

మోడరన్ అల్లుళ్ళ గురించి పాత కాలపు కవి వాపోయిన విధంబెట్టిదనిన ...

నీటయిన యింగ్లీషు మోటారు సైకిలు

కొని పెట్ట వలెనను కూళ యొకడు

రిస్టు వాచియు, గోల్డు రింగును, బూట్సును

సూట్లు కావలెనను శుంఠ యొకడు

బియ్యే, బియల్ వరకయ్యెడు ఖర్చు

భరియింప వలెనను దరిధ్రుడొకడు

భార్యతోడను చెన్న పట్టణంబుననుంచి

చదివింప వలెనను చవట యొకడు

సీమ చదువులు చాల సింపిలు, నన్నట

కంప వలెననుచు నడుగు నొకడు

ఇట్లు కొసరు కింద నిష్టార్ధముల్ వరులు

దెలుపు చున్న వారు తెల్లముగను

మరో శ్లోకం చూడండి ...

జామాతరో, భాగినేయా, మాతులా దారబాంధవా

అగ్నాతా ఏవ మాతులాం భక్షయంత్యాఖువత్ సదా

దార బాంధవులు నిత్యం మన సంపాదనని ఎలుకల్లా తినేస్తారుటండీ ...

అలుని మంచితనంబును

గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్

పొల్లున దంచిన బియ్యము

తెల్లని కాకులును లేవు తెలియగ సుమతీ !

శ్వశుర మందిర నివాస: స్వర్గతుల్యో నరాణాం

యది భవతి వివేక: పంచభిషడ్దినైర్వా

దధి మధు క్షీర లోపో మాసమేకం నరాణాం

తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ:

అత్తవారిల్లు అయిదారు రోజులు స్వర్గ తుల్యమే. పంచ భక్ష్య పరమాన్నాలూ అమరుస్తారు ... పాత బడితే పాద రక్ష ప్రయోగమే సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు.

8, మార్చి 2010, సోమవారం

తినడం మానెయ్యొద్దు

దోషభీతే రనారంభ: తత్కాపురుషస్య లక్షణం
కైర జీర్ణ భయాత్ భ్రాత: భోజనం పరిహీయతే ?
తప్పునకు భయపడి ఏ పనీ చేక పోవడం మంచిది కాదు. అరగదని చెప్పి , అన్నం తినడం మానేస్తామా చెప్పండి

15, ఫిబ్రవరి 2010, సోమవారం

పేరు చెబితే చాలదు ...

శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖా :
యస్తు క్రియవాన్ పురుష: స విద్వాన్
సు చింతితం ఔషధ మాతురాణాం
నా నామ మాత్రేణ కరోతి శాంతి :

బాగా ఆలో చించి నిర్ణయించిన ఔషధమే అయినా, దాని పేరు చెప్పినంత మాత్రాన రోగం పోదు కదా ? శాస్త్రాలు చదివినా, క్రియాశేలురు కాక పోతే మూర్ఖులుగానే మిగిలి పోతారు.

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

వాక్యం రసాత్మకం కావ్యం ...

నిరవద్యాని పద్యాని యద్యనాధస్య కా క్షతి:
భిక్షుణా కక్ష నిక్షిప్త కిమిక్షుర్నీరసో భవేత్ ?


కవి దరిద్రుడయినా, ధనికుడయినా, కవిత్వం రసవంతంగా ఉంటే చాలు. బిచ్చగాని చేతి చంకనున్నంత మాత్రాన చెఱకు గడకు తీపి తరిగి పోదో దు కదా !

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శివార్పణం - కథ



హర హర ! మహా దేవ !!





తల పైని చదలేటి యలలు తాండవమాడ
నలల త్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముమైన ముంగురులు చెఱలాడ
కను బొమ్మలో మధుర గమనములు నడయాడ
కను పాపలో గౌరి కసి నవ్వు బింబింప
కను చూపులను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవ కంట గటి నిప్పులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ
అమిత సంరంభ హాహాకారములు రేగ

ఆడెనమ్మా శివుడు !
పాడెనమ్మా భవుడు !

కిసలయ జటాచ్ఛటలు ముసురు కొని వ్రేలాడ
బుసలు గొని దల చుట్టు భుజగములు బారాడ
మకర కుండల చకాచకలు చెక్కులబూయ
అకళంక కంఠ హారాళి నాట్యము సేయ
ముకు జెఱములో శ్వాసముల దదడింపంగ
బ్రకట భూతి ప్రభా వ్రజమాచరింపంగ
విటల తటమున చెమట నిండి వెల్లువ గట్ట
తకఝణత యను తాళమానము తోడ
వికచ నేత్రస్యంది విమల చూపుల తోడ

ఆడెనమ్మా శివుడు !!
పాడెనమ్మా భవుడు !!

మహా శివ రాత్రి శుభాకాంక్షలు .. ఈ పర్వ సందర్భంగా సరస్వతీ పుత్ర పుట్ట పర్తి నారాయణాచార్యుల వారి ప్రసిద్ధ కావ్యం శితాండవం నుండి మీది మీగడ తరకలు ...

8, ఫిబ్రవరి 2010, సోమవారం

పులి జూదం







అశ్వం నైవ గజం నైవ
వ్యాఘ్రం నైవచ నైవచ
అజా పుత్రం బలిం దద్యాత్
దైవో దుర్బల ఘాతక:


గుఱ్ఱాన్నీ, ఏనుగునీ బలి యివ్వరు. బలం లేని మేకనే బలి యిస్తారు. దేవుడు దుర్బలులనే శిక్షిస్తాడు కదా !
చరిత్ర గతిని పరిశీలిస్తే , యిది నిజమే అనిపిస్తుంది కదూ ! ఈ పర పీడన పరాయణత్వం అంతటా కనిపిస్తూనే ఉంటుంటుంది.

‘‘ బలవంతులు దుర్బల జాతిని
బలహీనుల కావించారు
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం ?

నర జాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం ... ’’ అని శ్రీ.శ్రీ అన లేదూ ?


భాస్కర శతకంలోని పద్యం అదే చెబుతోంది కదూ !

తగిలి మదంబుచే నెదిరిఁదన్ను నెఱుంగక దొడ్డ వారితోఁ
బగఁగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు ; టింతెఁగాక, తా
నెగడి జయింప నేరడిది నిక్కము ; తప్పదు ; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా !


తన బలమేమిటో గ్రమించుకో లేక, ఎదిరి బలాన్ని ( శత్రువు బలాన్ని) అంచనా వేసుకోకుండా, బలవంతుడితో ఢీకొట్టి పోరుకి సిద్ధ పడిన వాడు చెడి పోతాడనడంలో సందేహం లేదు...
లోకంలో కొండని మదంతో ఢీ కొట్టిన పొట్టేలు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా ! కొండ అలాగే ఉంటుంది. పొట్టేలు మాత్రం ఛస్తుంది.

ఈ చెప్పిన విషయాలు కొంత నిరాశా వాదాన్ని ప్రోది చేస్తున్న వేమో అనుకునే పని లేదు. వ్యష్టి శక్తి సమిష్టి శక్తిగా రూపు దాల్చడం జరుగని రోజులవి. అయినా, దోపిడీ వర్గ స్వభావాన్నీ, బలాన్నీ చక్కగానే అంచనా వేసాయనే చెప్పాలి.
చీమలు పెట్టిన పుట్టలు పాముల ఆక్రమణకి లోను కావడం ఈ దోపిడీనే తెలియ జేస్తుంది.

అయితే, మన బద్దెన కవి హెచ్చరిక చేయనే చేసాడు కదూ ! ...


బలవంతుఁడ నాకేమని
బలువురితో నిగ్రహించి పలుకుట మేలా ?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతఁజిక్కి చావదె సుమతీ !

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

అధికారాంతమునందు చూడవలె ....







ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే


ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !

త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !


ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !


నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !


6, ఫిబ్రవరి 2010, శనివారం

చిలుకా పలకవే ....





సద్విద్యా యది కా చింతా
వరా కోదర పూరణే
శుకోప్యశన మాప్నోతి
రామ రామేతి చాబ్రువన్


ఎంత చక్కని శ్లోకమో చూడండి ...
రామ రామ అనే రెండు మాటలు నేర్చిన చిలుకే తన తిండిని తాను సంపాదంచుకో గలుగుతోంది. హాయిగా బ్రతుకుతోంది.
మరి, బాగా చదువుకున్న వారికి ఎందుకంత బెంగ ?

బాగుంది కదూ ! ఇలాంటి చక్కని శ్లోకాల నీ, మంచి పద్యాలనీ ఇక నుండీ ఈ టపాలో మీరు చూడ వచ్చును ...

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చదరంగం - వడ్ల గింజల లెక్క !





చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగం గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా ! అనే లెక్క గురించి మనకి తెలిసిందే కదా ? పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో యీ లెక్కనీ, దాని జవాబునీ యిచ్చాడు . చూదామా ...

మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్

ఇదీ లెక్క. దీనికి జవాబు :

శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్


ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి.
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...

శరములు = సాయకములు = ఐదు
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.

ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది !

ముందు మీరు ప్రయత్నించండి.
లేదా,


జవాబు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడాల్సిందే.మరి మీ యిష్టం !

18446744073709551615


4, ఫిబ్రవరి 2010, గురువారం

జఠరాగ్ని - కథ

భోజన ప్రియత్వం మీద రాసిన ఈ కథ ఆంధ్రభూమి దిన పత్రిక నేటి కథ శీర్షికలో ప్రచురణ జరిగింది. బాగా తిన గలిగే రోజులలో లేమి కారణంగా సరైన తిండి దొరక్క పోవడం, కలిమి కలిగిన దినాలలో ఆరోగ్య కారణాల చేత తిండి తిన లేని అశక్తత .., కొందరిలో చూస్తూ ఉంటాం కదూ ! ఈ జీవిత వైచిత్రిని కథా వస్తువుగా స్వీకరించి రాసిన చిన్న కథ యిది !
Posted by Picasa