10, ఆగస్టు 2010, మంగళవారం

వరమాల ఎవరి మెడలో ?


నైవ వ్యాకరణఙ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం,

దూరాత్సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాల వచ్ఛాంధసాత్,

మీమాంసానిపుణం నపుంసక ఇతి ఙ్ఞాత్వా నిరస్యాదరాత్,

కావ్యాలంకరణఙ్ఞ మేవ కవితాకన్యా వృణీతే స్వయమ్

కవితా కన్యకు వెలకట్టగల రసఙ్ఞు లెవరు ?

కవితా కన్యకు ప్రియు లెవరు ?

వ్యాకరణ వేత్తలా ? తార్కికులా ? ఛాందసులా ? మీమాంసకులా ? కావ్యాలంకరణ వేత్తలా ?

ఎవరినామె వరిస్తుంది? ఎందు చేత? ఇవీ ప్రశ్నలు. ఇవిగో జవాబులు:

కవితా కన్యకు వ్యాకరణవేత్త తండ్రివంటి వాడు. అతడామె గుణ దోషములను విచారించి, చక్కగా తీర్చి దిద్దుతాడు. తండ్రిలాంటి వ్యాకరణవేత్తను కవితా కన్య అభిలషించే ప్రశ్నే లేదు.

ఇక తార్కికుడో ? అతడామెకు సోదరతుల్యుడు. ఆమె అతనిని అంగీకరించదు. ఛాందసుడు - అంటే వేదవేత్త. లౌకిక ఙ్ఞాన శూన్యుడు. వేదాధ్యయన జడుడు. కనుక ఆమె అతనిని అంగీకరించదు. మత్త గజంనుండి దూరంగా జరిగి పోయినట్టుగా ఆమె అతనిని సమీపించదు.

మీమాంసా నిపుణుడో ? అతడు నపుంసకుడని తలచి వానినుండి దూరంగా జరిగి పోతుంది.

వైయాకరణులు , తార్కికులు , ఛాందసులు , మీమాంసకులు ... వీళ్ళందరూ కవిత్వ విషయంలో ఏకపక్షంగా ఉండే వాళ్ళే. వాళ్ళ శాస్త్రం ప్రకారం ఆమె గుణగణాలను మదింపు చేసే వారే. ఎవరికీ కవితా రసాన్ని ఆస్వాదించే లక్షణం లేదు. లక్ష్య లక్షణ యుక్తంగా ఉందా లేదా అనే తప్ప, వారెవరూ రసాస్వాదనా దృష్టి పరులు కాజాలరు.

అందు చేత కవితా కన్య వారిని అనాదరిస్తుంది. వారి నుండి దూరంగా తొలిగి పోతుంది.

మరి, ఎవరినయ్యా ఆమె వరిస్తుంది ?

కావ్యాలంకరణవేత్తను మాత్రమే ఆమె వరిస్తుంది. అలంకార శాస్త్రఙ్ఞులు మాత్రమే కవితకు వెలకట్టి రసాస్వాదన చేయగల వారు. వారు రసఙ్ఞులు. అందు వల్ల వారే కవితా కన్యకు ప్రియులు.

రసఙ్ఞత ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక, ఈ పద్యం కూడా చూదాం ...

చదువది యెంత గల్గిన రసఙ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్ధకంబు; గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్

పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చునుటయ్య భాస్కరా !

ఎంత చదువుకున్నా , రసఙ్ఞత ఉండాలయ్యా. అది లేనప్పుడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్ధం .రసాప్వాదన చేసే మనసు ఉండాలి. లేనప్పుడు ఎంత చదివీ ఏం లాభం ? నలపాకంలాగ ఎంత మంచి కూర ఘుమఘుమలాడేలా చెయ్యి, కాని దానికి రుచిని తెచ్చే ఉప్పు వెయ్యడం మానీసేవనుకో, ఆ కూరకి మరి రుచేం ఉంటుంది చెప్పు ?

ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా

విలిఖితాని సహే చతురానన !

అరసికేషు కవిత్వ నివేదనం

శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!

ఓ బ్రహ్మ దేవుడా ! ఎన్ని కష్టాలయినా నా నుదుటన రాయి. భరిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం ముమ్మాటికీ రాయవద్దయ్యా.

అని కవిగారు వేడుకోవడం తెలిసినదే కదా ?

కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు

కోమలులు సౌరెక్కునా? ... ... ... అని గురజాడ తృణీకరించినదీ ఇలాంటి అరసికులనే.

అరసికులలో మరో రకం జాత్యంధకారులు. వీరు కులాన్నిబట్టి కవితకు వెలకడతారు.

నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు, రే

ఖా కమనీయ వైఖరులు గాంచి, ‘భళీ!భళి!యన్న వాడె, ‘మీ

దే కులమన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవు చో

బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్

నా కవిత్వాన్ని చదివి బాగుందని మెచ్చుకుంటూనే, నా కులం ఏదని అడిగి తెలుసుకుని, చివాలున లేచిపోయి నన్నూ, నా కవిత్వాన్నీ అనాదరించే వారూ ఉన్నారు. అప్పుడు నా గుండెలో బాకు దించినంతగా బాధ కలుగుతుంది. అని బాధతో పలికాడు కవి జాషువా.

అరసికులను మరింత ఘాటుగా తిట్టిన కవి గారూ ఉన్నారు. చూడండి ...

నక్కలు బొక్కలు వెదుకును

అక్కరతో నూరపంది అగడిత వెదకున్

కుక్కలు చెప్పులు వెదుకును

తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్

ఎంత ఉక్రోషపడితే ఇంత ఘాటయిన తిట్టు వస్తంది చెప్పండి ?

రస సిద్ధి కల కవులకీ, అల్ప కవులకీ తేడా ఎప్పుడూ ఉంటుంది.

శ్లోకం చెబుతే భోజుడు తగిన కానుకలు ఇస్తాడు కదా అనే దురాశతో ఓ కవి శ్లోకం రాయాలని ప్రయత్నించి కొంత వరకూ ఏదో గిలికి, ఆపైన చేత కాక డీలా పడ్డాడు. వాడి అవస్థ చూసి, కాళిదాసు జాలి పడి తక్కినది పూర్తి చేసి ఇచ్చేడు.. ఇంకే ముంది !! ఆ పిల్ల కాకి ... కాదు కాదు ... ఆ పిల్ల కవి దానిని రాజు గారికి వినిపించాడు. చూడండి ...

భోజనం దేహి రాజేంద్ర !

ఘృత సూప సమన్వితమ్.

ఇంత వరకూ కవిగారి పైత్యం. ఓ రాజా నాకు నెయ్యీ ,పప్పుతో మంచి భోజనాన్ని ఇవ్వవయ్యా అని దీని అర్ధం

మాహిషం చ శరచ్చంద్ర

చంద్రికా ధవళమం దధి:

ఇది కాళిదాస పూరణ.

శరత్కాలపు వెన్నెల లాంటి తెల్లని గేదె పాలతో చేసిన గడ్డ పెరుగుతో భోజనం సమకూర్చవయ్యా అని పూర్తి చేసాడు కాళిదాసు. అప్పటికి కదా, పిల్ల కవి గారి కపిత్వం కవిత్వం అయి శోభించింది. భోజుడు కవితా రసగుణగ్రహణ పారీణుడు కనుక, ఈ శ్లోకంలో కాళి దాసు చేయి పడిందని పోల్చుకుని, కవికి తిని బతకమని ( మరెప్పుడూ కవిత్వం జోలికి వెళ్ళ వద్దని హెచ్చరించే ఉంటాడు, బహుశా) కొంత ధనమిచ్చి, కాళిదాసుకి గొప్ప సత్కారం చేసాడు.

జయన్తి తే సుకృతినో:

రస సిద్ధా: కవీశ్వరా:

నాస్తి తేషాంయశ: కాయే

జరామరణజం భయమ్

రస సిద్ధులయిన కవులు పుణ్యాత్ములు. వారికి జరామరణ భయాలు లేవు. వారు యశ:కాయులు. వారికి జయము కలుగు గాక !

స్వస్తి.

9, ఆగస్టు 2010, సోమవారం

ఏది సత్యం ? ఏదసత్యం ? ఓ మహాత్మా , ఓ మహర్షీ !


కో లాభో గుణి సంగమ: కిమ సుఖం ప్రాఙ్ఞేతరై స్సంగతి:
కా హాని స్పమయచ్చుతి: నిపుణతా కా ధర్మతత్త్వే రతి:
కశ్శూరో విజితేంద్రియ: ప్రియతమా కా2నువ్రతా కిం ధనం
విద్యా కిం సుఖ మప్రవాసగమనం రాజ్యం కిమాఙ్ఞాఫలమ్

ఈ శ్లోకంలో కొన్ని మంచి ప్రశ్నలూ, వాటికి ప్రత్యుత్తరాలూ ఉన్నాయి. అన్నీ ఆచరించ తగినవే. అనుభవ సిద్ధులు చెప్పినవే. జీవిత సారమంతా కాచి వడ బోసి నిగ్గు తేల్చిన నిజాలే. చూడండి..

ఏది లాభకరం?
మంచి వారితో సాంగత్యం.

ఏది సుఖకరం కాదు?
మూర్ఖులతోడి చెలిమి.

ఏది ఆత్మహాని?
ఇచ్చిన మాట నిలబెట్టుకో లేక పోవడం

ఏది నిపుణత?
ధర్మం తు.చ తప్పక పాటించడం

ఎవడు శూరుడు?
ఇంద్రియాలను జయించిన వాడు

ఎవతె ప్రియమైన చాన ?
అనుకూలవతి అయిన భార్య

ఏది వెలలేని సంపద?
విద్య

ఏది సుఖం?
దేశాలు పట్టి పోకుండా ఉన్న చోటనే ఉండడం

ఏది రాజ్యం?
తన మాట ఎంత వరకు చెల్లుబాటు అవుతుందో, అంత మేర తన రాజ్యమే.

8, ఆగస్టు 2010, ఆదివారం

బావా బావా పన్నీరు ! బావని పట్టుకు తన్నేరు !!


ఓ మరదలు పిల్ల చదువు కున్నదే కాక, కవిత్వం కూడా చెబుతుంది. బావ గారు సాహిత్య గంధ శూన్యులు. నామీద కవిత్వం చెప్పవూ ? అని మరదలుని బ్రతిమలాడేడు. బావ గారి ముచ్చట తీర్చడం కోసం ఆ కొంటె పిల్ల ఏం చెప్పిందంటే ...

అందమున చూడ రాము బంటైన వాడు
నాగరికతను జము వాహనమునకీడు
శుచికి హేమాక్షుఁజంపిన శూరు జోదు
వసుధలో లేడు మా బావ వంటి వాడు !!

మా బావ అందంలో రామ బంటుతొ సమానం. ( కోతి)
నాగరికతలో యముని వాహనంతో సమానం ( దున్న పోతు)
శుభ్రతలో హిరణ్యాక్షుని చంపిన వాడితో సమానం ( వరాహావతారం. పంది)

మా బావలాంటి వాడు లోకం లోనే లేడు !
మరదలు చెప్పిన పద్యం విని ఆ బావ గారు మురిసి పోయి ఉంటారు ...

వాళ్ళంతే, మరి ...





























ప్రియ: ప్రజానాం దాతైవ నపున:ద్రవిణేశ్వర:
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి:

వారిదము (మేఘము) వారిధి (సముద్రము)
వారిదం ఎప్పుడూ నీటిని ఇస్తుంది. దానికి తీసికోవడం తెలియదు.
వారిధికి ఎప్పుడూ తీసి కోవడమే తెలుసు. దానికి ఇవ్వడం తెలియదు.

కొందరంతే కదా, పుచ్చు కోవడమే తెలుస్తుంది కాని ఇవ్వడం తెలియదు. ఎప్పుడూ ఇతరుల సాయం పొందడమే కాని వారికి ఇతరులకి ఒక్క సారయినా సాయం చేయాలనిపించదు.

7, ఆగస్టు 2010, శనివారం

శేషం కోపేన పూరయేత్ !!


ఫ్రశ్నించడం మానవ నైజం, అది నైజమే కాదు; హక్కు కూడా. నిలబెట్టి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది? ప్రశ్నించడం లోనుండే కదా, ప్రగతి ప్రభాత కిరణాలు పొడసూపేది?

కాదంటే ఎలా ? కోపగిస్తే ఎలా ? ఎందుకు? అనడిగే వారుంటేనే కదా, ఎందుకో తెలిసేది ?

అలా అడిగిన సందర్భాలు కొన్నింటిని ఇక్కడ చూదాం ...

అన్నమయములైన వన్ని జీవమ్ములు
కూడు లేక జీవ కోటి లేదు
కూడు తినెడి కాడ కుల భేద మేలకో?
కాళికాంబ ! హంస ! కాళికాంబ !

(కాళికాంబ శతకం - పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి)

లోకాన జీవ రాసులన్నీ తిండి తిని బతికేవే. తిండి లేక పోతే జీవ కోటి ఉనికే లేదు. మరి, మన మానవులలో తిండి తినేటప్పుడు కుల భేదం ఎందుకు చూపుతారో, తెలియదు.

ఎక్కడి మంత్రతంత్రము లవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషంబులవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక, పూర్వ కృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్ట కూటికిది వేషమయా శరభాంక లింగమా !

మంత్రాలంటావు , తంత్రాలంటావు ! అన్నీ ఒట్టి అబద్ధాలు. చక్రాలు వేస్తావు.భవితవ్యాన్ని చెబుతానంటావు. పాచికలతో పరమార్ధం తెలిసి పోతుందంటావు. జ్యోతిషం చెబుతావు, జరిగినదీ, జరగబోయేదీ .. అంతా ట్రాష్. హేతువులంటావు, ప్రశ్నలు అడిగితే కనులు అరమోడ్చి, ఎక్కడికో వెళ్ళి పోయినట్టు అభినయించి, ఠక్కున భూత భవిష్యద్వర్తమానాలకు చెందిన వాటి గురించి జవాబులు చెబుతానంటావు. ఇదంతా మోసం. దగా. కుట్ర. మనం చేసుకున్న ధర్మాల పుణ్యమే సత్యం (?) ఈ మంత్రాలూ, తంత్రాలూ, చక్రాలూ, పాచికలూ, ప్రశ్నలు వేయడాలూ, జ్యోతిషాలు చెప్పడాలూ, అన్నీ కొంత మంది పొట్ట పోసుకోవడం కోసం వేసే వేషాలు తప్ప మరొకటి కాదు. అది నిజం. అంటాడు శరభాంకుడు.

ధూమ కేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా !

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా ...

అంటూ తోక చుక్క కనిపించడం అనర్ధదాయకంగా భావించడాన్ని గురజాడ నిరసించాడు.
అదంతా కవుల కల్పన అన్నాడు. తోక చుక్క భూమికి దూరపు చుట్టం అని చెప్పాడు. దారిన పోతూ చుట్టపు చూపుగా చూసి పోయే తోక చుక్క గురించి ఆందోళన ఎందుకని అడిగేడు.

తుదకు, వర్ణ భేదాలు చెరిగి పోయి, మతము లన్నీ మాసి పోయి,తెలివి ఒక్కటే నిలిచి వెలుగుతుందనీ, ఎల్ల లోకం ఒక్క ఇల్లవుతుందనీ ఆశించేడు. కవి కామన ఇంకా సుదూర తీరం లోనే ఉన్నట్టుంది. అదలా ఉంచండి ...
ప్రశ్నించే సోక్రటీస్ ను, కందుకూరిని, రాజారామ మోహనుడిని, త్రిపురనేనిని ... ఇలా చాలా మందిని ఒక్క సారి స్మరించుకుని, మరి రెండు మూడు సంధించిన ప్రశ్నాస్త్రాలను కూడా చూదాం,

పశుశ్చే న్నిహిత: స్వర్గం , జ్యోతిష్ఠోమే గమిష్యతి,
స్వపితా యజమానేన, తత్ర కస్మా న్న హింస్యతే

స్వర్గం లభించాలని, యాగ పశువులను బలి చేస్తున్నావు. అవి నేరుగా స్వర్గానికే పోతాయని దబాయిస్తున్నావు. మరయితే, నోరు లేని ఆ జీవాలను బలి పేరిట చంపడం కన్నా, యాగంలో స్వయంగా నీ తండ్రి గారినే బలి ఇవ్వరాదూ ? చక్కా, సరాసరి స్వర్గానికి పోతాడు కదా ? అలా ఎందుకు చేయవయ్యా ?

స్వర్గ: క ర్తృ క్రియా ద్రవ్య , వినాశో యజ్వనాం,
తతో దావాగ్ని దగ్ధానాం , ఫలం స్యాద్భూరి భూరుహామ్

యఙ్ఞం లో సమిధలు, ఆజ్యం లాంటి హోమ ద్రవ్యాలను ఎన్నింటినో వ్రేల్చుతావు. అవి హుతమై, మీది కెగిసి, నీకు స్వర్గాన్ని ఇస్తాయంటావు ? తెలిక అడుగుతానూ , అలా చేయడం వల్ల నీకే స్వర్గం వస్తే, అడవిలో కార్చిచ్చు
చెల రేగినపుడు ఎన్నో చెట్లు అగ్నికి ఆహుతయి పోతూ ఉంటాయి. వాటన్నింటికీ అదే స్వర్గ ఫలం వస్తుందంటావా?

మృతానామపి జంతూనాం , శ్రాద్ధం చే తృప్తి కారణమ్
నిర్వాణస్య ప్రదీపస్య, స్నేహ: సంవర్ధయేచ్ఛిఖామ్

చచ్చిన వారికి పిండాలు పెట్టి, శ్రాద్ధ కర్మలు చేస్తే ఆ మృతులకు తృప్తి కలుగుతుందంటావు. మరయితే, ఆరి పోయిన దీపం నూనె పోయగానే వెలిగించకుండానే వెలగాలి కదా ?

(మీది మూడు శ్లోకాల కర్త కృష్ణ మిశ్రుడు - ప్రబోధ చంద్రోదయం)

ఇది చార్వాకం. వీటికి మన వాళ్ళు ఘూటుగానే జవాబులు చెప్పారనుకోండి ... ఏమయినా, నిలదీసి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది?

జవాబులు చెప్పలేని చిక్కు ప్రశ్నలే అడిగాడనుకో, ఈ సూత్రం ఎలానూ ఉంది:
శేషం కోపేన పూరయేత్ ! ... ... ...




6, ఆగస్టు 2010, శుక్రవారం

మా ఇంటి కొస్తే నాకేం తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావ్ ?


పుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం నేచ్ఛంతి మానవా:
న పాపఫల మిచ్ఛంతి , పాపం కుర్వంతి యత్నత:

మనుషులెంత గడుసరి వారో చూడండి. పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు.
నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! ఎంత విపరీతమో చూడండి

దీనిని గడుసుదనం అనాలో, స్వార్ధం అనాలో మనమే నిర్ణయించుకోవాలి.

మా ఇంటి కొస్తే నాకేం తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావ్ ? అనడం లాంటిదే
కదూ ఇది !

దేశం నాకేమిచ్చింది ? అనుకోడం మాని, దేశానికి నేనేమి ఇచ్చాను ? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని పెద్దలు ఘోషించేది ఇందుకేనండీ బాబూ ! ...

5, ఆగస్టు 2010, గురువారం

గెలుపు కథ




ఈ కథ తే 20- 8-1969 దీ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక జన్మ దిన ప్రత్యేక సంచికలో శ్రీ బాపు గారి బొమ్మలతో ప్రచురించ బడింది. మిత్రుడు పతంజలి ఈ కధంటే చాలా సరదా పడేవాడు. 2010 లో ఈ ఆగష్టు నెలలో మరో సారి దానిని తలుచుకుంటూ ... ( ఈ నెల 20వ తేదీకి ఈ కథకి 42 వ పుట్టిన రోజు. )




ఈ కథకి బాపు వేసిన బొమ్మ ఇది ....











4, ఆగస్టు 2010, బుధవారం

విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం


శ్రీ ముద్దు వెంకట రమణా రావు విశ్రాంత నేత్ర వైద్య నిపుణులు.

వీరికి తెలుగు, సంస్కృత సాహిత్యాల పట్ల ప్రగాఢ మైన అభిమానం,అభిరుచి. సంగీతంలో కూడ మంచి ప్రవేశం ఉంది. ఎనభై సంవత్సరాల వయసులో కూడ ఉరక లేసే ఉత్సాహంతో సాహితీ సేద్యం చేస్తున్నారు. వివిధ సాహిత్య సంస్థలతోనే కాక, సంగీత సమాఖ్యలతో కూడ సన్నిహితంగా మెలుగుతూ ఆయా సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

కీ.శే. యం. లక్ష్మణ మూర్తి, సూర్యకాంతం దంపతులు వీరి తల్లిదండ్రులు.

11-09-1930 వ తేదిన ఒరిస్సా గంజాం జిల్లా కాశీనగరంలో పుట్టిన వీరు వైజాగ్ ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి యం.బి.బి.యస్ , యం.యస్.డి.ఒ పట్టాలు పొంది, పి.జి. డిప్లమో చేసారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసారు.

అరవైయ్యవ దశకంలో ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి వంటి పత్రికలలో కొన్ని చక్కని కథలు వ్రాసిన ఈ నేత్ర వైద్యులు వృత్తి రీత్యా సమయాభావం వలన అడపా దడపా రచనలు చేస్తున్నా, వాటిని పత్రికలలో ప్రచురించ లేదు. ఉద్యోగ విరమణ చేసాక, తమ చిన్న నాటి ఆత్మీయ మిత్రులు శ్రీ గొర్తి సత్యనారాయణ గారు ఇచ్చిన ప్రేరణతో ఇటీవల తమ రచనలతో వరుసగా ఐదు చక్కని పుస్తకాలను వెలువరించారు.

అవి:

రమణీయం

సంధ్యారాగం

ఉదయ కిరణాలు

కమనీయం

మహనీయం

భావుకతకూ, లోకవృత్తాలను సహేతుకంగా విమర్శించే డాక్టరు గారి నిపుణతకూ,విస్తారమైన వారి అధ్యయన సాధికారతకూ, నిదర్శన ప్రాయంగా నిలిచే ఈ పుస్తకాలను మీకు ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను.


1.రమణీయం

ఇదొక అపురూపమైన సాహితీ కదంబమాల అని చెప్పుకో వచ్చును. ఇందులో 48 కవితలు , 8 అనువాద గేయాలు, 07 సాహితీ వ్యాసాలు, వివిధ అంశాల మీద వ్రాసిన వ్యాసాలు 11 , ఇంకా 03 గల్పికలు,08 కథలు పొందుపరిచారు. అంతే కాక వారి అన్న గారి సమస్యాపూరణలు, పద్య రచనలు కూడ చేర్చి వారి పట్ల తమ ఆదర భావాన్ని ప్రకటించుకున్నారు.

వీరి కవితా ధారకి ఉదాహరణ ప్రాయంగా మచ్చుకి:

ఆకలి దప్పుల నల్లలాడిననే

అన్నోదకముల విలువలు తెలియును

సోపాన పంక్తుల నెక్కిననే కద

సౌధోపరి సౌందర్యము కనవిందగు ... అంటూ సాగే సాధన అనే గీతం,

సుభగ శరీర సురభిళా

సుగుణ సౌశీల్యా విరళా

సౌందర్యజిత చంద్రకళా

విరహిణీ, కాంతామణీ, ఊర్మిళా ! ... అంటూ సాగే ఊర్మిళ పద్యాల ఖండ కావ్య రచనా ...

మధుర రసాల వనమనోఙ్ఞమ్ము

కదళీ నారికేళ కేదారమ్ము

కుల్య తటినీ తటాక వికసిత

కుముదవనజ పుష్ప వన నికాయమ్ము ... అని కోనసీమ అందాలను తనివితీరా వర్ణించిన పద్యాలూ ... ఎంతగానో అలరిస్తాయి. అందమయిన పదాల పొందిక, చక్కని మధురమయిన శైలీ విన్నాణమూ, ఈ పద్యాలను, కవితలను ఎంతో రసవంతములుగా అందించేందుకు కవికి ఉపకరించిన ఉపకరణాలు.

అనువాద గేయాల విభాగంలో ...

ముందుగానే తెలిసి ఉంటే

చివరగా మనము చినుకు లోన

కలిసి నడిచే భాగ్యమదియని

ముందుగానే తెలిసి వుంటే

వాన లోనే రాత్రి అంతయు

వదలకుండగ నీ కేలు పట్టి

హృదికి హత్తుకు గడిపియుందును ... అని సాగే మధురమయిన అనువాద రచనలు ఉన్నాయి.

కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి, గరిమెళ్ళ , పాల్కురికి సోమన మున్నగు వారి గురించే కాక, మేఘసందేశం, కళల ప్రయోజనం, దళిత కవిత్వం మొదలయిన వాటి మీద విశ్లేషాణాత్మక వ్యాసాలు సాహితీ వ్యాస విభాగంలో కనిపిస్తాయి.

వీరి గల్పికలు, కథలు కూడ చదివించే రచనలు. కథా రచయితగా వీరి సామర్ధ్యాన్ని చాటేవిగా ఉన్నాయి.

శ్రీ ముద్దు నరసింహ మూర్తి , స్వర్గీయ సీతా లక్ష్మి దంపతులు.

శ్రీ రమణారావు గారు తమ రమణీయం గ్రంధంలో తమ అన్నగారయిన నరసింహ మూర్తి గారి పద్య రచనలు కూడ కొన్ని చేర్చి ప్రచురించారు.

తెలుగు భాషాభిమానం, కవిత్వాభిమానం గల వీరి సోదరులు వ్రాసిన కొన్ని

సమస్యాపూరణ పద్యాలు, మరి కొన్ని ఆంగ్ల సామెతలకు తెలుగులో పద్యానువాదాలు ఇందులో అలరిస్తున్నాయి.


ఈ పుస్తకం వారి జననీ జనకులకి అంకితం చేసారు.

ఇక, రెండో పుస్తకం ...




2.సంధ్యారాగం

ఇది వివిధ విషయాల మీద తన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ, తన భావాలను చదువరులతో పంచుకోవాలనే ఆకాంక్షతో వ్రాసిన 56 వ్యాస రచనల సంపుటి.

ఇందులో తెలుగు సాహిత్యం,విదేశీ సాహిత్యం, సంగీతం , చరిత్ర, పర్యటన, వైద్యం, గురించిన వ్యాసాలతో పాటు కొన్ని ఇతర అంశాల గురించినవ్యాసాలు,

7 వ్యాస సదృశ గల్పికలూ చోటు చేసుకున్నాయి.

వీటిలో కుమార సంభవం, శతక రచనలు, బాపు రెడ్డి కవిత్వం, శోభిరాల కావ్య సంపద, వంశధార కథలు, కథా వార్షికలు 2004, 05 ల మీద సమీక్షా వ్యాసాలు మొదలైనవి ఉన్నాయి.

విదేశీ సాహిత్యం గురించిన వ్యాసాలలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిసిజమ్ , ఫ్రెంచి సాహిత్య పరిచయం చోటు చేసుకోగా, సంగీత విభాగంలో పాశ్చాత్య సంగీతాన్ని గురించీ , సంగీత రావు గారి గురించి వ్రాసినవి ఉన్నాయి.

పర్యటన, వైద్య విభాగాల్లో చేర్చిన వ్యాసాలు వారి అనుభవ సారంగానూ. వారి యాత్రా ప్రియత్వాన్నీ వ్యక్త పరిచేవిగానూ ఉన్నాయి.


రచయిత ఈ పుస్తకాన్ని ఆది దేవుడు సూర్య నారాయణ మూర్తికి అంకితం చేసారు.


3.ఉదయ కిరణాలు

వచన రచనా విభాగంగా వెలువరించిన ఈ పుస్తకం కూడ 45 వ్యాసాల సంకలనమే.

ఇందులో రఘు వంశం , సౌందరనందనం , పౌలస్త్య హృదయం , దీపావళి, ఫిరదౌసి, బసవ రాజు అప్పారావు, మొదలయిన వ్యాస శీర్షికలతో ఆయా కవుల రచనల గురించి పరిచయ పూర్వక విశ్లేషణాత్మక వ్యాసాలు కనిపిస్తాయి. తెలుగు కవులనే కాక, ఈ విభాగంలో షేక్స్పియర్, ఇలియట్ వంటి వారిని గురించిన వ్యాసాలూ ఉన్నాయి. ఇవి కాక, వేదాంతం, మతం , వాణిజ్యం, స్త్రీ స్వేచ్ఛ , గ్లోబలైజేషన్, చారిత్రక ప్రదేశాల పరిచయం, దర్శనీయ క్షేత్రాలు ,మనోవిశ్లేషణ ... యిలా భిన్న భిన్న అంశాల గురించి అలవోకగా వ్రాసిన లఘు వ్యాసాలు మనలని అలరిస్తాయి.

రచయిత ఈ పుస్తకాన్ని తమ ఆత్మీయ బాల్య మిత్రులు శ్రీ గొర్తి వెంకట సత్య నారాయణ మూర్తి గారికి అంకితం చేసారు.


4.కమనీయం

ఇది కవితా సంపుటి. 73 కవితలతో ఈ కవితా సంపుటి వెలువరించారు.ప్రతి కవిత లోనూ వారి కవితా తత్వం, రసభావ బంధురమయిన వారి మనోఙ్ఞమైన శైలి, భాషా విషయకంగా వారి ప్రతిభా సంపద గోచరిస్తూ ఉంది. ఛందో గంధంతో పరిమళించే వారి కవితలు ధారా శుద్ధితో ప్రశంసనీయంగా ఉన్నాయి.

కవి గారు ఈ కవితా సంపుటిని వారి సోదరి, స్వర్గీయ ముద్దు(చుండూరు) శకుంతలకు అంకితం చేసారు.

మచ్చుకి ఒకటి రెండు కవితలు ...

నవాబుల దర్బారు హాలులా

నగరం వ్యాపించివుంది

భారతి మేఖలాపతకంలా ప్రకాశించు నగరం

తెలుగు తల్లి నుదుట తిలకం

తెలుగు చరిత్రకు స్వర్ణ ఫలకం

( భాగ్య నగరం)

ద్వేష దౌర్జన్యపూరిత తీవ్రవాద

కంటకావృత శిధిల మార్గాన నేల

శాంత్యహింసా సుహృజ్జీవ సాధు భావ

సత్య సౌలభ్య పథమున సాగి పొమ్ము

(అనుసరణీయం)

తల్లి వడి లోన వెచ్చగ తనువు మరచి

శాంత్యమాయక భావాల స్వాదు రసము

నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ

చింత లెఱుగని పొన్నారి చిట్టి పాప

(నిద్ర)


5 మహనీయం

ఆ కావ్య సంపుటిలో పద్య విభాగంలో 64 ఛందోసుందరమయిన పద్యరచనలు, గేయ కవితా విభాగంలో 61 గేయాలూ , అనువాద కవితల విభాగంలో 9 అనువాద కవితలూ చేర్చి ప్రచురించారు.

ఈ కవికి మిక్కిలి ప్రీతి పాత్రమైన ప్రకృతి వర్ణన, ఋతు వర్ణనలు ఇందులో సజహజంగానే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే యాత్రాప్రియులైన వీరు దేశ దేశాలు తిరిగి, తాను చూసిన అందమయిన ప్రదేశాలనీ , ఆ అందాలనీ కూడ మనతో పంచుకోవడం కనిపిస్తుంది.

ఇవే కాక, వివిధ కవుల గురించిన మనోహరమయిన పద్యాలు, కావ్య ప్రశంసలు, భగవదారాధనలు, జాతీయ భావనలు, రాష్ట్ర గానాలూ. సంగీతకారుల ప్రశంసలూ, ... ఇలా ఒకటేమిటి, వైయక్తిక పులకరింతల పలవరింతలూ, అనుభవాల గిలిగింతలూ, తల పోతల కలబోతలూ ... ప్రతి కవితలోనూ అందంగా అక్షరీకరించి మనకి అందించారు.

మచ్చునకు ఒకటి రెండు ...

ఉత్పలమాలికాభరణుజ్జ్వల నీల శరీర తేజుడున్

సత్పరిపాలకాశ్రయుడు, శర్వవిరించి మహేంద్రపూజ్యభా

స్వత్పరిపూర్ణ సద్గుణుడు, సర్వ జగత్పరిపాలకుండు, మా

ఉత్పల వారికిచ్చుత శుభోన్నత జీవన శాంతి సౌఖ్యముల్

(ఉత్పల కవివర్యునికి సమర్పించిన శుభ కామన... ఉత్పల అనే శీర్షికతో ఛందస్సుందర మయిన పద్య కుసుమాలు.)

గ్రంధకర్త ఈ కావ్య సంపుటిని నిత్య కల్యాణ శోభితుడు కొండలరాయునికి అంకితం చేసారు.

ఈ ఐదు పుస్తకాలూ రచయిత ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృ తిక సమాఖ్య, శ్రీకాకుళం వారి సహకారంతో ప్రచురించారు.

(త్వరలో వెలువడనున్న వీరి రచనలు: ఒక కవితా సంపుటితో పాటు

వెన్నెల వెలుగులు ( సాహిత్య వ్యాసాలు) , ఇంగ్లీషు – తెలుగు మెడికల్ డిక్షనరీ.)

ఇప్పటికి ప్రచురితములయిన ఈ ఐదు పుస్తకాలు చదవాలన్నా, రచయిత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరినా, క్రింది చిరునామాలకు సంప్రదించాలి:

డా. యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ.,

రిటైర్డ్ సివిల్ సర్జన్,

ప్లాట్ నెంబర్: 11, శ్రీ కోలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం 532001

ఫోన్: (08942)223243.

లేదా,

శ్రీ రామిశెట్టి, ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర ప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య,

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం,

శ్రీకాకుళం 532001

ఫోన్ (08942)278572

ఈ పుస్తకాలు విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను, బుక్ సెంటర్ (విశాఖ పట్నం) . నవోదయ బుక్ హౌస్, కాచి గూడ, హైదరాబాద్ వారి దగ్గర లభిస్తాయి.

3, ఆగస్టు 2010, మంగళవారం

ఎందుకయ్యా, వెక్కి వెక్కి ఏడిచేవూ ?!

యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.




2, ఆగస్టు 2010, సోమవారం

గ్యారంటీ లేదు !!


మన పూర్వ కవులలో కొందరికి చిత్ర కవిత్వమన్నా , బంధ కవిత్వమన్నా కొంచెం మోజు జాస్తి. అది వారి ప్రైవేటు హా బీ . దానిని తప్పు పట్ట లేం. వ్వక్తుల ప్రైవేటు లైఫు వారి వారి స్వంతం. వీటిని సాము గరిడీలతో పోల్చి, పెదవి విరిచే వారూ ఉన్నారు. వాటిలో కవిత్వం అనే దినుసు కోసం వెతకడం అంత అవసరం లేదు. ఉండ వచ్చును. ఉండక పోవచ్చును. గ్యారంటీ లేదు. అది మన భాగదేయం మీద, లేచిన వేళా విశేషం మీద ఆధార పడి ఉంటుంది. ఏమయినా , అనంతమూ , అపురూపమూ , అపూర్వమూ అయిన మన కవితా స్రవంతిలో వాటిని అంతర భాగాలుగానే గుర్తించాలి కాని, కోపగించుకో కూడదు, మరి.

ఏకాక్షర నిఘంటు సాయంతో, ప్రయాస పడి అర్ధాన్ని సాధించ గలిగే ఓ రెండు పద్యాలను చూదాం.

రరో రరే రర రురో
రరూ రూరు రురోరరే
రేరే రీరా రార రరే
రారే రారి రిరా రిరా

ర = రామ శబ్దంలో గల రేఫ వలన
రో = భయము కలిగి
అర = వేగంగా పరిగెత్తు
రురో: = లేడికి ( లేడి రూపములో ఉన్న మారీచునికి)
అరే: = శత్రువైన శ్రీరాముని
రేరే (ర+ఈ+రే) = కౌస్తుభాన్ని ధరించి ఉన్న
ఉరోరరే = వక్షము నందు
రీరారా = విలాసవంతమయిన
ఊరూరు = గొప్ప ఊరువులచే
ఉ = లక్ష్మి , సీత
అరరర = తన నివాసమైన లంకకు ఎత్తుకు పోయిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూమికి కంటకుడిగా మారిన రావణునికి
రి = నాశనము కలిగించినదై
అరిరా = చెలి కత్తెలను
రా = పొందినది

శ్రీరాముని భార్య యగు సీతా దేవి లంకలో రావణుని నాశనం తెలియ జేసే త్రిజట వంటి చెలి కత్తెలను పొందినది. లంకలో రాక్షస స్త్రీల నడుమ లంక నాశనం కానున్నదని, రామ రావణ యుద్ధాన్ని కలగని చెప్పి, హెచ్చరించి నది , సీతా దేవిని సగౌరవంగా చూసినదీ త్రిజట అనే రక్కసి మాత్రమే కదా.

కవి అంత మహా లంకా నగరంలోనూ , లంకా నాశనాన్ని సూచించినది ఒకే ఒక్కతె అని తెలియ జేస్తూ ఏకాక్షర సహిత పద్య రచన చేసాడు కాబోలు.

మరో పద్యం ఇలాంటిదే, కొరికి చూడండి ...

మామా మోమౌ మామా
మామా ! మిమ్మొమ్ము మామ మామ మేమా
మే మొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా !

మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖముగా గల
మా = మా యొక్క
మా = బుద్ధి
మిమ్ము = మీకు
ఒమ్మున్ = అనుసరించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏము = మేము
ఒమ్మము = ఇష్ట పడము
మీ = మీ యొక్క
మై = శరీరము
మేము +ఏమే = మేమే కదా
మమ్ము = మమ్ములను
ఏముము +ఓముము = కాపాడుము. కాపాడుము.
ఇమ్ము +ఔము = (మాకు) అనుకూలుడవై వర్తించుము.

చంద్రుని వంటి ముఖము గల ఓ దేవా ! మా బుద్ధి నీకు అనుకూలించును. అనగా సదా నీయందే నిలిచి ఉండును. మా అంహంకారములను విడిచి , మేము నిన్ను సేవించుకొందుము. మా పట్ల ఆనుకూల్యతతో మమ్ములను నిత్యం కాపాడుము.

ఇదండీ సంగతి. వీటిలో కవితా దినుసుకు గ్యారంటీ లేదని ముందే విన్నవించాను కదా.