
12, సెప్టెంబర్ 2010, ఆదివారం
హిత వచనమ్ డాట్ కామ్

11, సెప్టెంబర్ 2010, శనివారం
త్వమేవా2హమ్

వినాయక చవితి శుభాకాంక్షలు.
ఉదయాన్నే వొచ్చేడు నా కాషాయ మిత్రుడొకడు. ఇదేం పిచ్చిరా బాబూ ! ఇదేం గోల! ఊరంతా ఎక్కడ చూసినా వినాయక ఉత్సవాలే, దారి పొడుగునా వినాయక పెండాల్ లే కనిపిస్తున్నాయి. ఒక దానిని మించిన ఎత్తులో ఒకటి ఉంటున్నాయి వినాయక విగ్రహాలు. మైకులు చెవులు చిల్లులు పడేటట్టుగా హోరెత్తించేస్తున్నాయి. ఆ రంగులు పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తుందని మొత్తుకుంటున్నా వీరికి చెవి కెక్కదు. వీళ్ళ దుంప తెగ !
అవేం విగ్రహాలు ! ఒక్కో చోట ఒక్కో రకం వినాయక ప్రతిమ కనిపిస్తోంది. ఎవడికి తోచినట్టు వాడు చేయిస్తున్నాడు. ఆధునిక వినాయకుడట ! ఆల్ట్రా మోడరన్ వినాయకుడట. వీళ్ళకి మతులు కానీ పోతున్నాయా? అని ఆవేశ పడి పోయాడు.


మైకుల హోరు తగ్గించి, శబ్ద కాలుష్యం అరికట్టాలనీ, వినాయక ప్రతిమల తయారీలో పర్యావరణానికి హాని కలిగించే రంగుల వాడకం కూడదనీ చెబుతున్న దానిలో విప్రతిపత్తి లేదు. కాని, రకరకాల ఫోజులలో వినాయక ప్రతిమలు చేయిస్తూ గణపతి దైవాన్ని అపహాస్యంపాలు చేసేస్తున్నారనే విషయంలో నా అభిప్రాయం వేరుగా ఉంది.
విఘ్నాలు పోగొట్టి మనందరకీ సకల శుభాలూ కలిగిచే వినాయకుడంటే మనందరకీ చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే,
ఆ తొండం, ఆ బాన పొట్ట, ఆ కుబ్జ రూపు ... ఇవేవీ మనకి తోచవు. ఒక దేవతా మూర్తిగా భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూనే వినాయకుడిని మనం ఒక ఆత్మీయ మిత్రునిగా, మనలో ఒకడిగా భావిస్తాం కాబోలు. అందుకే ఏ దేవుడికీ లేని విధంగా వినాయకుడికి పూజలు చేసే వేళ వినాయక రూపాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా రూపొందించుకుంటున్నాం.
ఒక్కో చోట ఒక్కో ఆకారంలో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఈ ఉత్సవ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కపు విందు చేస్తూ ఉంటాయి. అపరిమితమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.
వినాయకుడు ఫేంటూ చొక్కా వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ల్యాప్ టాప్ ముందు కూచున్న తీరు చూసి మురిసి పోతాం

.
మోటారు బైకు నడిపే వినాయకుడూ, జైజవాన్ లా ముస్తాబయిన వినాయకుడూ, రకరకాల పండ్లతో చేసిన వినాయకుడూ, క్రికెట్ లాంటి ఆటలు ఆడే వినాయకుడూ, రక్షక భటుని వేషంలో ఉండే వినాయకుడూ, ఇలా ఒకటేమిటి? ఎన్ని రకాల ఫోజులలోనో వినాయక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి,
వినాయకుడి విషయంలో ఇదేదో తీరని అపచారం జరిగి పోతున్నదని ఊరకే గుండెలు బాదుకోనవసరం లేదని
నా అభిప్రాయం.
వినాయకుడంటే జనాలకి భక్తితో పాటు ఒక దగ్గరితనం కూడా ఉంది.తమనీ, తమ వృత్తులనీ, తమ జీవితాన్నీ ,జీవితావసరాలనీ, తమ ఆలోచనలనీ, తమ ఆనందాలనీ, తమ నైమిత్తిక సమమస్యలనీ, తమ అభిరుచులనీ, అభీష్టాలనూ. తమకు చెందిన సమస్త వస్తు సముదాయాన్నీ తమతో పాటు తమ ఇష్ట దైవం వినాయకుడివిగా భావించి , తమను తాము ఆ గణపతితో అన్ని విషయాలలో ఐడింటిఫై చేసుకోవడం వల్ల గణపతిని ఒక దేవుడి కన్నా, ఒక ఆత్మీ బంధువుగానో, చెలికానిగానో చూస్తూ ఉండడం వలన ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వినాయక ప్రతిమలు చేయిస్తున్నారు అని నా భావన. కనుక, ఇదేమంత తీవ్రంగా ఆక్షేపించ వలసిన విషయం కాదనుకుంటాను
.ఇది, విశాఖపట్నంలో ఉండే మామరదలు స్వాతి స్వయంగా తను తయారు చేసిన మట్టి వినాయకుడు. బాగుంది కదూ ! వీలయినంత వరకూ ప్రతి ఒక్కరూ ఇలా మట్టి వినాయకుడిని తయారు చేసుకుని పూజ చేస్తే పర్యావరణ కాలుష్యం బెడద ఈ పండుగ సందర్భంగా కొంతయినా తగ్గుతుంది. అంతే కాక, మనం స్వయంగా చేసుకోవడంలో ఉండే ఆనందం కూడా అనుభవించ వచ్చును. ఏమంటారు?
మా ఇంట వినాయక పూజ ఫొటోలు చూడండి.
సరే, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని స్తుతించే ఒక చక్కని పద్యం చూదాం ....
అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధము లాను వేళ బా
ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపఁబోయి యా
వంకఁగుచంబుఁగాన కహి వల్లభ హారముఁగాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁగొల్తు నభీష్ట సిద్ధికిన్
( అల్లసాని పెద్దన. మను చరిత్రము)
బాల గణపతి తల్లి పార్వతమ్మ ఒడిలో చేరాడు. చనుబాలు త్రాగుతున్నాడు.పసితనపు చెయిదము చేత తొండంతో అవతలి కుచాన్ని పట్టు కోవాలని చూసాడు. అర్ధ నారీశ్వరత్వం వల్ల అటు వేపు తల్లి స్తనం వానికి దొరక లేదు.
సరి కదా, పాముల హారాన్ని చూసి, దానిని తామర తూడు అనుకుని పట్టుకో బోయాడు ! గజాస్యుడు కదా మరి ! తామర తూడు పట్ల ఆకర్షితుడు కావడం సహజమే మరి ! అట్టి వినాయకుడిని నా కోరికలు నెరవేరాలని సేవిస్తాను
అని పెద్దన గణపతి స్తవం కమనీయంగా చేసాడు, తన మను చరిత్రములో.
అందుకే,
పెద్దన గారి మను చరిత్ర కల్పాంతముల దనుక మను చరిత్ర !!.
అవిఘ్నమస్తు..
స్వస్తి.
8, సెప్టెంబర్ 2010, బుధవారం
సతాయింపు వారి సహజ గుణము !

7, సెప్టెంబర్ 2010, మంగళవారం
ఆట పాటల మేటి
.jpg)
6, సెప్టెంబర్ 2010, సోమవారం
పోనిద్దురూ ...!!

5, సెప్టెంబర్ 2010, ఆదివారం
గురు పూజోత్సవం సందర్భంగా నా కథ - గురు దక్షిణ.
గెటే నృత్యం చేసాడంటే, చేయడూమరి !!

26, ఆగస్టు 2010, గురువారం
కత్తి మీద సాము ...

25, ఆగస్టు 2010, బుధవారం
భగవంతుడు భక్త సులభుడు !!


21, ఆగస్టు 2010, శనివారం
శాంతము లేక, సౌఖ్యమూ లేదూ ...

తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:
న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.
కోపం మంచి వాళ్ళకి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులని బాధిస్తుంది.
చందనం చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒక్కలాగే దహించి వేస్తంది కదా?
కోపం అగ్ని లాంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతంగా ఉండండర్రా అని చెబుతూ ఉంటారు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
అని బద్దె భూపతి చెప్ప లేదూ?
క్రోధమ తపముంజెఱచును
క్రోధమ యణిమాదులైన గుణములఁబాపున్
క్రోధమ ధర్మ క్రియలకు
బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికి జన్నే?
(నన్నయ . భారతం)
కోపం వలన తపస్సు చెడి పోతుంది. అణిమాది సిద్ధులు పనికి రాకుండా పోతాయి. కోపం ధర్మ విధులకు ఆటంకం కలిగిస్తుంది. మునులకు కోపం తగదు.
చీటికీ మాటికీ వెర్రి కోపంతో ఊగి పోతూ శాపాలిచ్చే దూర్వాస ముని తెలుసు కదా? దాని వలన అతని
తపో ఫలితమంతా హరించుకు పోయేది.
కీచకుడు ద్రౌపదిని చెరబట్టాలని తమకంతో వెంట తరిమాడు. ఆమె విరటుని కొలువు లోనికి ప్రవేశించింది. ఆమెను తరుముతూ వచ్చేడు కీచకుడు. అక్కడే ఉన్నవలలుడు అనే పేరుతో విరటుని కొలువులో వంటల వాడిగా ఉన్న భీముడికి కోపం నసాళానికెక్కింది. అమిత క్రోధా వేశంతో ఊగి పోయేడు. అక్కడ ఉన్న ఓ ఫలవృక్షాన్ని పెకిలించి, దానితో కీచకుని అంతం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అంత పనీ చేసే వాడే, కంకుభట్టుగా విరటుని కొలువులో ఉన్న ధర్మ రాజు గూఢ భాషణంతో వారించ బట్టి సరి పోయింది. లేక పోతే, అఙ్ఞాత వాసం భగ్నమై, కథ మళ్ళీ మొదటి కొచ్చి ఉండేది.
వలలుండెక్కడఁజూచె? నసేవ్యక్ష్మాజముల్ పుట్టవే?
ఫలితంబై వర శాఖ లొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగాఁ
గల యీ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికిన్ !
ఈ వంటల వాడు వలలుడు ఈ ఫలవృక్షాన్ని ఎక్కడ చూసాడయ్యా ! ఒట్టి మూర్ఖుడిలా ఉన్నాడే? చక్కగా పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి, అందరికీ నీడని ప్రసాదిస్తూ సేద దీర్చే ఈ పండ్ల చెట్టు ఇతనికి వంట కట్టెల కోసం కావలసి వచ్చిందా? వేరే చోట ఎక్కడా ఎండి పోయిన పనికి రాని చెట్లే లేనట్టు వీడి కన్ను దీని మీద పడ్డదేమయ్యా. పండ్ల చెట్టుని ఎవరయినా వంట చెఱకు కోసం తెగ నరుకుకుంటారా?
ధర్మ రాజు మాటలలోని అంతరార్ధం గ్రహింపునకు వచ్చేక భీమ సేనుడు అప్పటికి శాంతించేడు. ఆ తర్వాత వడ్డీతో సహా తన కసి తీర్చుకున్నాడనుకోండి.
కోపం వస్తే వారించడానికి అందరకీ అలాంటి అన్నగార్లు దొరకొద్దూ?
అన్నగారంటే అన్నగారా ! ధర్మ రాజు గుణ గణాలను వర్ణిస్తూ విజయ విలాసంలో చేమకూర వేంకట కవి ‘‘ కోపమొకింత లేదు, బుధ కోటికి కొంగు పసిండి, పత్యమా రూపము, తారతమ్యము లెఱుంగని స్వతంత్రుడు ... యిత్యాదిగా వర్ణించాడు.
అందు చేత కోపం తగ్గించు కోవడం మంచిది. కోపం వల్ల ఎంత వినాశం జరిగిందో చెప్పడానికి మన పురాణాలలోనూ, కావ్యాలలోనూ , ప్రబంధాలలోనూ అసంఖ్యాకమైన వృత్తాంతాలున్నాయి.
అవన్నీ నేను చెప్పడం మొదలు పెడితే చదవడానికి విసుగు వేసి మీకు కోపం రావచ్చు.
చివరగా రెండు చిన్న జోకులు:
అప్పా రావు: ఎందుకురా, అంత కోపంగా ధుమ ధుమలాడి పోతున్నావు?
పాపారావు: ఆ శాంతారావు గాడిని కోపం తగ్గించుకోరా నాయనా, అని చిలక్కి చెప్పినట్టగా ఎంత చెప్పినా వినడే ! వొళ్ళు మండి పోయిందనుకో, చెడామడా దులిపేసాను...
మరొకటి:
భర్త: మా ఆవిడకి వొళ్ళెరుగని పిచ్చి కోపమనుకో. ప్రతి దానికీ ఒకటే అరుస్తూ ..
భార్య: ఆఁ ... ప్రతి దానికీ ఊరికే అరుస్తూ ఉంటాను. గోల చేస్తాను. అదేగా మీరు చెప్నబోయేది? (అంటూ గయ్యిమంది)
20, ఆగస్టు 2010, శుక్రవారం
మన ఓటు మంచికే !

19, ఆగస్టు 2010, గురువారం
ఏ నిముషానికి ఏమి జరుగునో ... ...

మరు నిముషంలో ఏమి జరుగుగుతుందో మనకి తెలియదు. క్షణం మనది కాదు.
ఈ శ్లోకం చూడండి:
కాంతం ప్రాహ కపోతికా22కులతయా కాంతాంతకాలో2ధునా
వ్యాధో2ధో ధృతచాప పాణిత శర: శ్యేన: పరిభ్రామ్యతి
ఇత్థం సత్య2హినా స దృష్ట ఇషునా శ్యేనో2పి తేనాహత:
తూర్ణం తౌ తు యమాలయం పరిగతౌ దైవీ విచిత్రాగతి:
ఓ చెట్టు మీద పావురాల జంట కులాసాగా కాపురం చేస్తున్నది. ఇంతలో ఆడు పావురం మగనితో అంది కదా: ‘‘ ఓ ప్రియుడా ! మనకి లోకంలో ఇక నూకలు చెల్లిపోయేలా ఉంది. అంత్య కాలం దగ్గర పడినట్టుగా ఉంది. అదిగో, అలా చూడు ! బోయ ఒకడు బాణాన్ని ఎక్కు పెట్టి మన వేపే గురి చూస్తున్నాడు. పైన డేగ ఎగురు తోంది. ఇవే మనకి చివరి ఘడియలు ’’
ఆ కపోత మిధునం ప్రాణాల మీద ఆశ వదులుకుని ఊపిరి బిగ పట్టి మృత్యువు ఆసన్నమయిందని నిర్ణయించుకుని విషాదంతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నది.
ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది !
ఒక పాము జరజరా ప్రాకి వచ్చి, వేట గాడిని కరిచింది. వాడి బాణం గురి తప్పింది. తిన్నగా వెళ్ళి పైన ఎగురుతున్న డేగకి తగిలి, అది మరణించింది. పాము కాటుకి వ్యాధుడూ మృతి చెందాడు.
చూసారు కదా? కొద్ది క్షణాల తరవాత దొరక బోయే ఆహారాన్ని తలచుకుంటూ సంతోషంగా ఉన్న డేగ, బోయ ఇద్దరూ అకాలమృత్యు వాత పడ్డారు. చావు తథ్యమనుకున్న పావురాల జంటకి ఆ గండం గడిచింది.
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ .... అని లవకుశ సినిమాలో కవి ఈ తత్వం బాగా వంట పట్టించుకునే ఆ చరణం రాసాడు కదూ.
జీవితం క్షణ భంగురం అనే విషయం విస్మరించి అశాశ్వతాలయిన విషయాలను శాశ్వతాలని అనుకోవడం తగదు.
ఏవీ మన వెంట రావు.
చూడండి:
ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే , నారీ గృహ ద్వారి, జన:శ్మశానే
దేహాశ్చితాయాం, పర లోక మార్గే కర్మానుగ: గచ్ఛతి జీవ యేక:
మనం జీవిత కాలంలో సంపాదించుకున్న ధనమంతా, మరణానంతరం మన వెంట రాదు.భూమి మీదనే ఉండి పోతుంది పశు సంపద కూడా పశువుల శాలలోనే ఉండి పోతుంది తప్ప కనీసం మన పార్ధివ శరీరాన్ని చూడడానికయినా రాదు. ఎంతో ప్రియమైన భార్యా మణి కూడా ఇంటి ద్వారం వరకూ తప్ప కనీసం శ్మశానం వరకూ కూడా రాదు. బంధు మిత్రులు పరేత నిలయ ప్రాంతం వరకూ మాత్రమే వస్తారు. మన వెంట కడదాకా రారు.
పిచ్చి మమకారంతో , గంధాదులు అలముకుని, ఎంతో జాగ్రత్తగా, మురిపెంగా , అపురూపంగా, చూసుకున్న మన దేహం చితి వరకూ మాత్రమే కదా వచ్చేది?
ఇక, పర లోక మార్గాన మనని వెన్నంటి వచ్చేది ఎవరయ్యా అంటే, మనం చేసిన కర్మ మాత్రమే
పుణ్య కర్మలు చేయడం వలన పుణ్య లోకాలకీ, పాప కర్మలు చేయడం వలన పాప లోకాలకీ పోతాం.
స్వర్గ నరకాల సంగతి ట్రాష్ అనుకున్నా, మంచి పనులను చేయాలనే భావనలో తప్పు లేదు కదూ?
ధర్మాన్ని ఆచరించడం కూడా ఎలాగంటే,
అజరామరవత్ ప్రాఙ్ఞొ విద్యా మర్ధం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు, మృత్యునా ధర్మ మాచరేత్
తెలివైన వాడు ముసలితనం, చావు లేని వాని వలె విద్యను సముపార్జిస్తూ, ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి.
మృత్యువు జుత్తు పట్టి లాగుతున్నట్టుగా భావించి ( అంటే, మరు క్షణంలోనే చావు తప్పదనుకుంటూ) ధర్మాన్ని ఆచరించాలి.
అంటే రేపు, మాపు అంటూ వాయిదాలు వేయకుండా తక్షణమే ప్రారంభించి ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి.
చెప్పొచ్చావులే, గొప్ప ! ఇంతకీ, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలేమిటయ్యా, అని, నన్ను ఎవరయినా నిలదీసే ప్రమాదాన్ని శంకించి, చెబుతున్నాను:
తన యెఱిగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక పంకమున బడున్ !
(నన్నయ )
తనకి తెలిసిన దానిని గురించి చెప్పమని ఎవరయినా అడిగితే చెప్పని వాడు, నిజం పలుకని వాడు ఘోరమైన నరకకూపంలో పడతాడని భారతం చెబుతోంది. అందుచేత, ఎందుకయినా మంచిదని ( ఎవరూ అడగక పోయినా) నాకు తెలిసినదీ ( ఏదో , సముద్రంలో నీటి బొట్టంత) , విన్నదీ, కన్నదీ, చదివినదీ, తెలిసినదీ, తెలుసుకున్నానని అనుకున్నదీ, అర్ధమయినదీ. అర్ధమయిందనుకున్నదీ చెప్పడం నా ధర్మం కనుక చెబుతున్నాను.
ఇక, ఈ టపా చదివి, పోనిద్దూ, అని ఊరుకోకుండా, బాగుందనో, బాగు లేదనో, కామెంట్ రూపంలో వెల్లడి చేయడం మీ కనీస ధర్మంగా భావించండి. ఆ ధర్మాన్ని ఆచరించి, పుణ్యలోకాలలో ( రంభా, ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఘృతాచి ... ) సీటుని అడ్వాన్సుగా బుక్ చేసుకోండి. ఆపైన మీ యిష్టం. మళ్ళీ, చెప్ప లేదంటనక పొయ్యేరు ....
( ఈ రాతని లైట్ తీసుకోండేం?)
18, ఆగస్టు 2010, బుధవారం
వేటి వలన ఏవి శోభిస్తాయి ?

17, ఆగస్టు 2010, మంగళవారం
ఇవి ఉంటే అవి అక్కర లేదు !!

ముఖే ముఖే సరస్వతీ ...

పాట పరిమళించింది.
15, ఆగస్టు 2010, ఆదివారం
అమ్మా, నీకు వందనం

స్వాతంత్ర్యం వచ్చినా
14, ఆగస్టు 2010, శనివారం
బక్క రైతుల బతుకు గోస - దుక్కి

పూల బాసలు ...

13, ఆగస్టు 2010, శుక్రవారం
ఏవి అసలైన పూజా పుష్పాలు?

11, ఆగస్టు 2010, బుధవారం
ముఠా కవులు
