16, అక్టోబర్ 2010, శనివారం

గోవు మా లచ్చిమికి కోటి దండాలు

























ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక సంక్రాంతి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ యిది.
ప్రచురణ : ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక తే 23 - 1 - 1981 దీ సంచిక.

ఇక కథ చదవండి ...








కథా నేపథ్యం ఈ క్రింద చదవండి. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక రచయితల సెమినార్ లో చదివిన వ్యాసమిది. ఇందులో ఈ కథను నేనెందుకు వ్రాసాను? కథా నేపథ్యం ఏమిటి ?అనే వివరాలతో పాటు, అప్పట్లో ఈ కథ మీద సాగిన చర్చకు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో నేనిచ్చిన ప్రత్యుత్తరం యిందులో పొందు పరిచాను.

ఇక చదవండి ...




15, అక్టోబర్ 2010, శుక్రవారం

శివార్పణం - గుణ నిధి కథ


మహా శివరాత్రి సందర్భంగా నవ్య వార పత్రిక వారు వెలువరించిన శివ రాత్రి ప్రత్యేక సంచిక
( తే 17 - 2 - 2010 ది ) లో ఈ కథ ప్రచురితం.

14, అక్టోబర్ 2010, గురువారం

ఆహా ! ఏమి రుచి !! ( చల్ది బువ్వ )



కన్యా శుల్కం రెండో అంకం లో మొదటి సారిగా బుచ్చమ్మని చూస్తాడు గిరీశం. బచ్చమ్మ ప్రవేశిస్తూనే తమ్ముడు వెంకటేశంతో, ‘‘ తమ్ముడూ, అమ్మ కాళ్ళు కడుక్కోమంచూందిరా’’ అంటుంది. అదే మొదటి సారి గిరీశం బుచ్చమ్మని
చూడడం.
ఆమెని చూస్తూనే గిరీశానికి మతి పోతుంది. తనలో హౌ బ్యూటి ఫుల్ ! క్వైటనస్సెక్టెడ్ ! అనుకుంటాడు. బస్తీలో మధుర వాణిని విడిచి వచ్చేక ఇక్కడ కృష్ణా రాయ పురం అగ్రహారంలో ఇంత అందం ఉంటుందని అతను అనుకో లేదు. అందుకే, ‘‘ పల్లెటూర్లో వూసు పోదనుకున్నాను కానీ, పెద్ద కాంపేసుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం ’’ అనుకుంటాడు.

బుచ్చమ్మ గిరీశాన్ని ‘‘ అయ్యా, మీరు చల్ది వణ్ణం తించారా?’’ అనడుగుతుంది.

గిరీశం తడుము కోకుండా ‘‘ నాట్ది స్లైటస్టబ్జక్షన్ ’’ అని తలూపుతాడు. అంతే కాదు, ‘‘ అనగా, యంత మాత్రం అభ్యంతరం లేదు.’’ అని అనువాదం కూడా వెలగ బెడతాడు. అంతటితో ఆగ కుండా

‘‘ వడ్డించండిదిగో వస్తున్నాను.’’ అని చెప్పి, ‘‘ తోవలో యేటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను’’ అని కూడా బుకాయిస్తాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజుల్లో పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా ఇళ్ళలో అంతా ఉదయాన్నే చల్ది అన్నాలు తినేవారు. టిఫిన్లూ గిఫిన్లూ తెలియవు.

చల్ది , చల్లంది , చల్దన్నం ఈ పేర్లతో పిలిచే ఆ తరవాణీ అన్నం మహా రుచిగా ఉంటుంది. గ్రామీణులు సల్లంది అని అంటారు.

చలి + అది = చల్ది. చల్లనిది అని అర్ధం. చల్లని అన్నం అన్నమాట. ఇక్కడ చకారం తాలవ్య చకారం. దంత్య చకారం కాదు. ఈ చల్దన్నం కోసం ప్రతి ఇంట తరవాణి కుండలు ఉండేవి. తరవాణి అంటే పుల్లని నీళ్ళు అని నైఘంటికార్ధం. ఏతావాతా తేలిందేమిటంటే, చల్లంది అంటే, పులిసిన అన్నం అని అర్ధం !

మా ఇళ్ళలో పిల్లలందరకీ ఉదయాన్నే చల్దన్నాలు పెట్టే వారు. తెల్ల వారకుండానే లేచి స్నానాలు చేసి, మడి కోసం ప్రత్యేకంగా కుట్టించిన పట్టు లాగులు (చెడ్డీలు) తొడుక్కుని మరీ పిల్లలం ఒక పంక్తిని కూచుంటే కానీ మాకు చల్దన్నాలు వడ్డంచే వారు కాదు.

మా ఊర్లో ఉదయాన్నే వీధుల్లోకి తామరాకులు అమ్మకానికి వచ్చేవి. నూకలో, బియ్యమో యిచ్చి మా నాయనమ్మ ఆ తామరాకుల కట్టలని కొనేది. వాటిలో వడ్డించిన చల్దన్నం ఎంత రుచిగా ఉండేదో మాటల్లో వర్ణించడం కష్టం. ఆ తర్వాత రోజుల్లో అరిటాకులూ, తర్వాత తెల్లని పింగాణీ కంచాలూ వచ్చేయి. స్టీలు కంచాలు వచ్చే వేళకి ఇంట్లో చల్దన్నాల స్థానాన్ని టిఫిన్లు ఆక్రమించాయి.

ఉదయాన్నే ఆ తరవాణితో కూడిన చల్దన్నం తింటే ఎండ పొద్దెక్కాక ఎంత వేళకీ కానీ అసలు ఆకలనేదే తెలిసేది కాదు. ఆ రుచికరమయిన చల్దన్నం తినడానికి కమ్మగా ఉండడమే కాక, కడుపులో హాయిగా తేలిగ్గా ఉన్నట్టుండేది. అన్న సారం వొంట బట్టేక, కొంచెం మత్తుగా కూడా ఉండేది. నిద్ర ముంచు కొచ్చేది.

మా ఇంట్లో కాఫీల యుగం ప్రారంభ మయేక, అప్పుడప్పుడు ఆ కాఫీ రుచి మరిగి, మా పిల్లలం మాకూ కాఫీలు కావాలని గోల చేసే వాళ్ళం.

మా నరసింహం బాబాయి మాకు నడ్డి మీద ఒక్కటిచ్చుకుని, ‘‘ అన్నాలు తినే వాళ్ళకి కాఫీలు లేవర్రా !’’ అని ఓ తిరుగు లేని అలిఖిత శాసనం వినిపించే వాడు. నేను ఓ సారి అతనా మాట అనగానే ఉడుక్కుని, ‘‘ అక్కడికి, కాఫీలు త్రాగే వారంతా అన్నాలు మానేస్తున్నట్టు !’’ అని గొణిగాను. నా సణుగుడు వినిపించి మా నరసింహం బాబాయి నా నడ్డి ఫెడీల్మనిపించడం జరిగింది లెండి.

సరే, ఇంత రుచికరమయిన చల్ది అన్నం గురించి, అంతే రుచికరమయిన ఒక శ్లోకం మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. చూడండి:

వసంత నవ మల్లికా కుసుమపుంజవ న్మంజులం,
ససర్షపరసాలకం లికుచనీర వృగ్నార్ధకం,
వరాంగ్యుపరికేళిజ శ్రమ నివారణే కారణం,
జలోదన ముపాస్మహే జలజ బాంధవ ప్యోదయే.

వసంత కాలంలోని క్రొత్త మల్లి పువ్వు లాగ మంజులంగా ఉంటుంది. ఆవ తోడి మామిడి కాయ నంజుడుతో, అంటే, ఆవకాయ నంచుకుంటూ, లేదా, నిమ్మ రసంలో ఊరబెట్టిన అల్లపు ముక్కలతో, అంటే అల్లం పచ్చడితో నంచుకుంటూ చల్ది అన్నాన్ని ఉదయాన్నే తింటున్నాను. (మనోజ కేళి వలన కలిగిన) నా శ్రమ అంతా నివారించ బుడుతోంది కదా ! అని దీని భావం.

ఆవకాయ, లేదా, అల్లం పచ్చడి మొదలయినవి నంచుకుంటూ తెలతెల వారుతూ ఉండే తరవాణి లోంచి తీసి పెట్టిన చల్దన్నం తినడం కన్న స్వర్గం మరొకటి లేదని తెలుసుకోవాలి.

చల్దన్నం గురించి చెప్పుకుంటూ శ్రీకృష్ణుడు బాల్యంలో గోపాలురతో కూడి చల్దులారగించిన మధుర ఘట్టాన్ని తలుచు కోకుండా ఉండ లేం కదా !

చూడండి, భాగవతంలో బమ్మెర పోతన శ్రీకృష్ణుని బాల్య చేష్టలు వర్ణిస్తూ, పశువులను మేపుకుంటూ, నెచ్చెలి కాండ్రతో చల్దులు ఆరగించే సన్నివేశాన్ని మనోహరంగా రచించాడు.

గోపాలురు బాల కృష్ణునితో పాటు ఊరి చివర పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చి వేస్తోంది. అందరకీ ఆకలి వేస్తోంది. ఇక రండర్రా, చల్దులు తిందాం, అని గోపాలుడు గోపాలురను కేకేసి ఎలా పిలుస్తున్నాడో చూడండి :

ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార ! చల్ది గుడువన్ రమ్య స్థలంబిక్కడీ
దండన్ తేగలు నీరు ద్రావి యిరువందం బచ్చికల్ మేయుచుం
దండబై విహరించు చుండగ నమంద ప్రీతి భక్షింతమే

ఎండలో మ్రగ్గి పోయారు. ఆకలితో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడమెందుకు? ఓ బాలకులారా, రండి ! మనం చల్దులు తినడానికి ఇక్కడ ఈ చోటు చాలా మనోహరంగా ఉంది. ఇక్కడ లేగ దూడలు నీళ్ళు త్రాగి, ఈ చుట్టు ప్రక్కల గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ అందమయిన స్థలంలో చల్దులు తిందామా?

గోపాలుని పిలుపుతో గోపాలురంతా బిలబిలా అక్కడికి చేరారు. కృష్ణుని చుట్టూ వలయంగా కూర్చుని చల్దులు ఎలా తిన్నారో చూడండి:

జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁగూర్చుండి వీక్షింపుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు, లతల్ , చిక్కంబులున్, బువ్వు లా
కులు కంచంబులుగాభుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా !

పద్మంలో ఉండే కర్ణిక (బొడ్డు) చుట్టూ ఉండే రేకుల లాగ, కృష్ణుని చుట్టూ వలయాకారంగా అతనినే చూస్తూ కూర్చున్నారు గోపాలురు. తర్వాత, ఇళ్ళ నుంచి తెచ్చుకున్న చిక్కాలు విప్పి, చల్దులు తినడం మొదలెట్టారు. శిలలు, చిగుళ్ళు, గడ్డి, లతలు, చిక్కాలు, పువ్వులు, ఆకులు మొదలయిన వాటిని కంచాలుగా చేసుకుని గోపార్భకులు చల్దులు ఆరగించారు.

ఇలా చల్దులు తినే ఆ పిలకాయల సరదాలూ, కోణంగితనాలూ పోతన ఎంత మనోఙ్ఞంగా వర్ణించాడో చూడండి:

మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు
నూరు గాయలు దినుచుండు నొక్క
డొకని కంచము లోని దొడిసి చయ్యన మ్రింగి
చూడు లేదని నోరు సూపు నొక్క
డేగురార్గుర చల్దు లెలమిఁబన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక
డిన్నియునుఁదగ బంచి యిడుట నెచ్చెలి
తనమనుచు బంతెన గుండు లాడు నొకడు

కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల
మేలి భక్ష్య రాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు

మాటి మాటికి వేలు ముడిచి ప్రక్క వారిని ఊరిస్తూ ఒకడు ఊరగాయలు తింటూ ఉంటాడు.
ప్రక్క వాడి కంచం లోనుండి కొంత చల్ది లాక్కుని గుటుక్కున మ్రింగి వేసి, అబ్బే, నేను తిన లేదు కావాలంటే చూసుకో ! అని, నోరు చూపిస్తాడు ఒకడు.
పందెం కట్టి ఐదారుగురి చల్దులను కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు.
ఇంకొక గోప బాలకుడు, ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహ లక్షణం అంటూ నచ్చ చెబుతూ తింటున్నాడు.
అదిగో, చూడు ! కృష్ణుడు, అంటూ చూపు మరలించి, ప్రక్క వాని కంచం లోని చల్దులలో మేలైన భక్ష్య రాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు వేరొకడు .ఒకడు నవ్వుతాడు. మరొకడు నేస్తులను నవ్విస్తున్నాడు. ఇంకొకడు ఏవో ముచ్చటలు చెబుతున్నాడు. మరొకడు మురిసి పోతున్నాడు.

ఇలా నెచ్చెలి కాండ్రతో చల్దులు కుడిచే గోపాలుడు ఎలా ఉన్నాడంటే,

కడుపున దిండుగాఁగట్టిన వలువలో
లాలిత వంశ నాళంబుఁజొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద
డాపలి చేత మొనయ నునిచి.
చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు
వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి

సంగిడీల నడుమఁజక్కనఁగూర్చుండి
నర్మ భాషణముల నగవు నెఱపి,
యాగ భోక్త కృష్ణుఁడమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

కృష్ణుడు నడుము చుట్టూ దట్టీ కట్టు కున్నాడు. దానిలో తన వేణువును ఏటవాలుగా దూర్చాడు. కొమ్ము బూరా, చేతి కర్ర - ఈ రెండింటినీ జారి పోకుండా ఎడమ చంకలో ఇరికించి పట్టు కున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్ది ముద్ద ఎడమ చేతిలో పట్టు కున్నాడు. ఇంటి దగ్గర అల్లరి చేసి కొసరి కొసరి కట్టించు కొని, వచ్చిన ఊరుగాయ ముక్కలను కుడి చేతి వ్రేళ్ళ సందులో ఇరికించి పట్టుకున్నాడు.సంగడీల నడుమ కూర్చున్నాడు. చక్కగా వారినందరినీ నవ్విస్తున్నాడు. అతడు యాగ భోక్త. అట్టి నల్లనయ్య బాల్య క్రీడలతో ఒప్పుతూ నెచ్చెలి కాండ్ర మధ్య కూర్చుని చల్దులు ఆరగిస్తూ ఉంటే, నింగిని దేవతలందరూ నివ్వెర పోయారు. ఆ దేవ దేవుని శైశవ క్రీడలను తన్మయులై చూస్తున్నారు.

ఇదీ చల్ది కథ. చల్దన్నం గురించి ఇంత ఉందా చెప్ప డానికి ?! అంటే, ఉంది మరి !

తవ్విన కొద్దీ తరగని నిధి కదా, మన సాహితీ సంపద !

స్వస్తి.







13, అక్టోబర్ 2010, బుధవారం

అదీ, అలా ఉండాలి !


కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలంటారు.
ఆధునిక కవి కూడా కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలీ ... అని తెగేసి చెప్పాడు.

ఈ శ్లోకం చూడండి:

దధతో యుధ్యమానస్య, పఠత: పులకో2థ చేత్
ఆత్మనశ్చ పరేషాం చ , తద్దానం సౌరుషమ్ స్మృతమ్ .

దానమంటూ చేస్తే ఎలా చేయాలయ్యా, అంటే, ఇచ్చే వాడికీ, పుచ్చుకునే వాడికీ, ఇతరులకీ కూడా ఆ దాన వైభోగం చూసి గగుర్పాటు కలగాలి ! ఇంకోలా చెప్పాలంటే తల దిమ్మెత్తి పోవాలి దానం చేడమంటే ఇలాగుండాలి అని ఒక మేలు బంతిలాగ ఉండాలంతే. కుర్రకారు భాషలో చెప్పాలంటే కెవ్వున కేక పెట్టించాలన్న మాట.

అలాగే, యుద్ధం చేస్తే ఆ రణనైపుణ్యం తనకీ, శత్రువుకీ, చూసే వారికీ కూడా ఆశ్చరానందాలను కలిగించేలా ఉండాలి.

అలాగే, దేనినయినా చదివితే చదువరులకు మైమరుపు కలిగించాలి.

అలా ఉండని ఆ దానమూ, ఆ పౌరుషమూ, ఆ పఠనమూ ఒట్టి దండగ మాలి పనులు.

ముందుగా ఒళ్ళు జలదరించే దాన విశేషం గురించి చూదాం ...

వామనుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని కేవలం మూడడుగు నేల దానమడిగాడు. సరే ఇస్తానని ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు బలి. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డు తగిలాడు. అడిగింది ఎవరను కున్నావ్? అడిగింది ఏమిటనుకున్నావ్? అంటూ హెచ్చరించాడు.

మహా దాత బలి వెనక్కి తగ్గ లేదు. ఇలా అన్నాడు. భాగవతంలో పోతన వ్రాసిన గొప్ప పద్యాలలో ఇదొకటి.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జములపైఁగపోల తటిపైఁబాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే !?

ప్రియ సతి లక్ష్మీ దేవి శరీర భాగాలను నూతన మర్యాదతో తాకిన ఆ చేయి ఇప్పుడు దానం స్వీకరించడానికి క్రింద ఉంది. దానమిచ్చే నా చేయి ఇప్పుడు మీద ఉంది. ఇంత కంటె భాగ్యం వేరే ఏముంది? ఈ రాజ్యాలూ గీజ్యాలూ ఎల్ల కాలం ఉండి పోతాయా ? దేహం నశించ కుండా శాశ్వతంగా నిలిచి పోతుందా?

ఎంత గొప్ప దానశీలత్వమో కదూ ! దానం అంటే అలా ఉండాలి.

వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా , సహజ కవచ కుండలాలను ఇచ్చిన కర్ణుడూ. తన శరీర భాగాన్నే కోసి ఇచ్చిన శిబి, తన వెన్నెముకను ఒక మహత్తర దేవ కార్యం కోసం అర్పించిన దధీచి, చాలా దినాలు క్షుద్బాధను అనుభవించి, తరువాత క్షుధార్తుడయిన తనకు లభించిన ఓగిరాన్ని కూడా అర్ధికి ఇచ్చి వేసిన రంతి దేవుడూ .... వీళ్ళూ దాతలంటే. దానం చేయడమంటే అలాగుండాలి.

ఇక యుద్ధం సంగతి చూదాం.

శ్రీనాథుడు చెప్ప లేదూ?

ఎవ్వనితో నెచ్చోటన్
చివ్వకు చేసాచ వలదు. చే సాచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగ పగ సనన్ తీర్పదగున్

ఎవరితోనూ ఎక్కడా కూడా యుద్ధానికి తలపడనే వద్దు. ఒక వేళ యుద్ధం చేయవలసిన అక్కర పడితే మాత్రం పగ వాడి అంతు చూడనిదే వదల వద్దు సుమా ! చుట్టు ప్రక్కల ఎవరికీ పరిహాస పాత్రమయ్యే లాగున మాత్రం రణం చేయ వద్దు.
యుద్ధ రంగంలో పగవారికి వెన్ను చూపడం కన్నా హీనం మరొకటి లేదు.

ఉత్తర కుమారుని యుద్ధ ప్రాగల్భ్యం తెలిసినదే కదా ?

యుద్ధం చేయకుండా మగిడి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి, రోసి, అతని తల్లి, భార్య వానికి పౌరుషం కలిగించేలాగున ప్రవర్తించారుట. తానమాడడానికి మరుగు, పసుపు ముద్ద సిద్ధం చేసి అవమానించారుట. భోనాల వేళ విరిగిన పాలు పోసారుట. ఎన్నడూ లేని ఈ అనాదరణకి విస్తు పోయి ఖిన్నుడయిన తిక్కనకు తల్లి సమాధానం చూడండి:
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్?
ముగురాడవార మైతిమి !
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ ?!

అసదృశముగ నరివీరుల
మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
గసవున్ మేయగఁబోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.

యుద్ధంలో పగ వారితో పోరాడ కుండా వారికి వెన్ను చూపి పారి వచ్చిన వాడికి మగతనం ఉండదు కదా నాయనా ! వీరత్వం ఉన్న వారు అలాంటి పందలను మెచ్చుకోరు. ఇప్పుడు ఇంట్లో నీతో కలిపి ముగ్గురం ఆడువారమైనాము కదా ?
ఆడుదానివలె తడికె చాటున ఆ పసుపు రాసుకుని తానమాడి రావయ్యా అని వెటకారం.

పగ వారిని వీరోచితంగా ఉక్కడగించి రానట్టి పిరికి పందని చూసి, పశువుల మనసులు విరిగి పోయాయి. అవి ఇచ్చిన పాలు కూడా విరిగి పోయాయి. ఈవేళకి విరిగిన పాలతో భోజనం కానిద్దూ ! అని అవహేళన.

ఇక, పఠనయోగ్యాలయిన గ్రంథాల గురించి.

మంచి పుస్తకం చదివితే, చదవడం పూర్తయాక కూడా అది మనల్ని వెంటాడి వేధించాలి. ఆలోచింప చేయాలి. అలజడి కలిగించాలి. ఆహా !అనిపించాలి. కానప్పుడు కాల హరణం తప్ప ప్రయోజనం ఉండదు.

అదండీ సంగతి !

స్వస్తి.

12, అక్టోబర్ 2010, మంగళవారం

అరుదైన ఆనవాళ్ళు ...

మాసి పోయిన సామ్రాజ్యాలకు చిరిగి పోయిన జెండా చిహ్నం.
అంతరించిన నాగరికతలకు శిధిల కట్టడాలే సాక్షీభూతాలు.

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళానికి దాదాపు 20 కి.మీ. దూరంలో గార మండలం గార గ్రామానికి
దగ్గరలోశాలిహుండం అనే ఒక బౌద్ధ సంఘారామం శిధిల కట్టడాలు కనువిందు చేస్తూ ఉన్నాయి.వంశధార నది ప్రక్కనే దాదాపు 2000 సం.ల నాటి ఈ ఇటుకలతో నిర్మించిన కట్టడాలు దాదాపు శిధాలావస్థకు చెంది పోయాయి.బౌద్ధుల ప్రార్ధనలకు, విద్యాభ్యాసానికీ వినియోగించిన ఈ మహా చైత్యం వర్తులాకారంలో నిర్మించబడి ఉంది. చుట్టూ బౌద్ధ సన్యాసులు నివసించడానికి ఉపయోగించిన వర్తులాకారపు విహారాలు ఉన్నాయి. ఈ సంఘారామం మొత్తం నిర్మాణమంతా ధాతుగర్భ నిర్మితమని చెబుతారు. అంటే, బుద్ధుని శారీరక అవశేషాల మీద నిర్మించబడిన కట్టడం అని అర్ధం. బౌద్ధంలో ఈ చైత్యం హీనయాన మత శాఖకు చెందినదని పరిశోధకుల అంచనా. ఇక్కడ లభించిన విగ్రహాలు మున్నగు అవశేషాలతో ఇక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.ఒక చిన్న గుట్ట మీద ఈ స్తూపం వుంది.
ఈ ప్రక్కగా ప్రవహించే వంశధార నది, చుట్టూ పచ్చని పంట పొలాలు, దూరంగా సముద్రంలో కలుస్తున్న వంశధార నది, చూపరులకి ఆహ్లాదం కలిగిస్తాయి.

శాలి హుండం అంటే ధాన్యపు గాదె అని అర్ధం.

సచ్చని అందమయిన ప్రకృతి ఒడిలో శాలిహుండం పురా వైభవాలను నెమరు వేసుకుంటూ సేద తీరుతున్నట్టుగా ఉంటుంది.

అంతే కాదు, ఆ అందాలు చూస్తూ ఉంటే, మనం కూడా ఒక అలౌకికానందానుభూతికి లోనై పరవశించి పోక తప్పదు.

శాలిహుండం గురించి డా. ముద్దు వెంకట రమణా రావు తమ ఉదయ కిరణాలు పుస్తకంలో వ్రాసిన చిన్న వ్యాసంలో మరి కొన్ని వివరాలు లభిస్తాయి. చూడండి.

ఇక ఆ అందాల లోకంలో విహారం చేయండి మరి ....

























10, అక్టోబర్ 2010, ఆదివారం

అమ్మని చూస్తున్నట్టే ఉంది ...




దాదాపు మూడు నెలల క్రిందట రావు బాల సరస్వతి పాడిన ఒక పాట గురించి ఎవరికయినా తెలుస్తే చెప్ప గలరా ? అని బ్లాగు మిత్రులకు మెయిల్ చేసి, అడిగాను.

వెంటనే వలబోజు జ్యోతి, ఇనగంటి రవిచంద్ర, పరుచూరి శ్రీనివాస్, సౌమ్య, ఆది లక్ష్మి, స్వరం, తాడే పల్లి బాల సుబ్రహ్మణ్యం గారలు స్పందించారు.

జ్యోతి గారు పాట సాహిత్యాన్ని అందించగా, రవి చంద్ర, పరుచూరి గారలు ఆడియో లింక్ కూడా దయతో అందించి నాకు చాలా సంతోషం కలిగించారు.
శ్రీ పంతుల గోపాల కృష్ణా రావు గారు కూడా ఈ సాహిత్యం నాకు లభించేలా సహకరించారు.

వీరందరికీ నా హృదయ పూర్వకమయిన ధన్యవాదాలు తెల్పు కుంటున్నాను.

ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు ( ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.










మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.


అందులో మా అమ్మ తరచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను. అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల సరస్వతి పాడినట్టుగా గుర్తుంది.

రిటైరయ్యేక, అరవైయ్యవ యేట కంప్యూటరు నేర్చుకుని ... నెట్లో బాల సరస్వతి గురించి వెతికాను. చాలా ఉంది. కాని, నాకు కావలసిన ఈ పాట సాహిత్యం మాత్రం దొరక లేదు. ( లేదా, నేను ఓపికగా వెతక లేక పోయానో, యేమో )

అప్పుడు నాకీ పాట పూర్తి పాఠం కావాలని ఒక మెయిలు పెడితే, దయతో , మీద పేర్కొన్న వారు వెంటనే స్పందించారు.
మరో మారు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అరవయ్యవ యేట అందిపుచ్చుకున్న ఈ ఆధునిక సాంకేతిక విఙ్ఞాన ఫలితాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాను.

ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.

దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.

అందుకే, ఇదంతా టపాగా వ్రాయాలా , వద్దా అని, మూడు నాలుగు నెలలుగా తటపటాయించి, ఇక ఈ వేళ నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.

సాహిత్యం ఇది:

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే

మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II


చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా

చుక్కల్ల రేడమ్మా ... సఖియా

మరుని శరముల చేత మనసు నిలువక నేను

మల్లె మొల్ల మొగలి మాలతి మందార

మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--

పేరేమిటని వాని ప్రశ్నించినానే

మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...

(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)


ఆడియో వినండి మరి ....




ఈ విడ మా అమ్మ , పార్వతమ్మ (ఈ ఫొటోలో మా అమ్మ వెనుక నిలబడిన వ్యక్తి మా అన్నగారు శ్రీ పంతుల గోపాల కృష్ణా రావు గారు. సాహిత్యాభిమాని. మంచి విశ్లేషకులు. ఇటీవల పద్య రచన మీద ప్రీతితో చక్కని కంద పద్యాలు సరళమైన శైలిలో వ్రాస్తున్నారు.)


నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!

* * * *


అమ్మ పోయేక, వచ్చీ రాని రాతలతో నా పందొమ్మిదవ ఏట ఒక నవలిక రాసి పత్రికలో ప్రచురించాను. వీలుంటే, అది కూడా చూడండి. ఇక్కడ నొక్కండి.

మా ఉరవ కొండ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా.

స్వస్తి.



9, అక్టోబర్ 2010, శనివారం

స్నేహమేరా జీవితం


స్నేహ మేరా జీవితం
స్నేహ మేరా శాశ్వతం ...

పాట పల్లవి బాగుంది. నీ స్నేహితులని చూసి నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చును అంటారు.

అందు చేత మంచి వారితో స్నేహం చేయాలి. అప్పడు మనకి మేలు కలుగుతుంది. చెడు స్నేహాలు ఎప్పుడూ కీడునే కలిగిస్తాయి.

క్షీరేణాత్మ గతోదకాయ హి గుణా దత్తా: పురాతే2ఖిలా:
క్షీరోత్తాప మవేక్ష్య తేన పయసా స్వాత్మాకృశౌ హుత:
గంతుం పావక మున్మనస్త దభవ దృష్ట్వాతు మిత్రాపదాం
యుక్తం తేన జలేన శ్యామతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ

పాలతో కలిసాయి నీళ్ళు. ఆ నీటికి కూడ పాల గుణమే వచ్చింది. ఏవి పాలో, ఏవి నీళ్ళో తెలియనంతగా చక్కగా కలిసి పోయాయి ఆ రెండూనూ.

పాలు సలసలా మరగడం చూసి, మిత్రునకు వచ్చిన కష్టం చూసి, ఓర్చుకోలేక బాధతో నీరు అగ్నిలో దుమికింది. మిత్రుడు తన కోసం అగ్నిలో దుమకడం చూసి, అతనికి వచ్చిన ఆపద చూసి కలవర పడి క్షీరం కూడా అగ్నిలో దుమికింది. అంటే, నీళ్ళతో కలిసిన పాలు, పొంగి, అగ్నిలో పడడం జరిగిందన్న మాట. అయితే, నీటితో కలిసిన పాలు అగ్నిలో పడడం వలన
అగ్ని చల్లారి పోయింది. మహాత్ముల మైత్రి ఇలాగే ఉంటుంది మరి.!

పద్యం చూడండి:

క్షీరము మున్ను నీటి కొసఁగెన్ స్వగుణంబులు దన్నుఁజేఱుటన్
క్షీరము తప్త మౌటఁగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వార సుహృద్విపత్తిఁగని వహ్నిఁజొరం జనె దుగ్ధ , మంతలో
నీరముఁగూడి శాంతముగ నిల్చు, మహాత్ముల మైత్రి యీ గతిన్.

చెడ్డ వారితో స్నేహం పనికి రాదు సుమీ ! ఎందుకంటే,

పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినమ్
వర్జయేత్తాదృశమ్ మిత్రం విషకుంభ పయో ముఖమ్

ఎదుట పొగుడుతారు. వెనుక గోతులు త్రవ్వుతూ మన పనులు చెడ గొడతారు. అలాంటి పయోముఖ విషకుంభాల వంటి మిత్రులను వెంటనే విడిచి పెట్టాలి. పాల కడవల వంటి విషపు కుండల వంటి వారు సుమా !

అలాగే,

దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాస కారణమ్
మధు తిష్ఠతి జిహ్వాగ్రే హృది హాలాహలమ్ విషమ్

ఎంత తియ్యగా మాట్లాడుతున్నా సరే, చెడ్డ వారిని నమ్మ కూడదు. వారి నాలుకల మీద అమృతం ఉంటుంది. మనసులో మాత్రం విషం ఉంటుంది.

దుర్జన: పరిహర్తవ్యో విద్యయా2లంకృతో2పిసన్
మణినా భూషిత: సర్ప: కిమసౌ న భయంకర:

ఎంత విద్యావంతులయినా సరే, చెడ్డ వారితో స్నేహం మానేయాలి. ఎందుకంటే, పడగ మీద మణి ఉన్నంత మాత్రం చేత పాము భయంకరమైనది కాకుండా పోదు కదా ?

మంచి వాళ్ళతో మైత్రి చిరకాలం నిలుస్తుంది. చెడ్డ వారితో స్నేహం కలకాలం నిలవదు.
ఎలాగంటే,

మృద్ఘటవత్ సుఖ భేద్యో దుస్సంధానశ్చ దుర్జనో భవతి
సుజనస్తు కనక ఘటేవ దుర్భేద్య శ్చాసు సంధేయ:

మట్టి కుండ సులభంగా పగిలి పోతుంది. తిరిగి అతికించడం సాధ్యం కాదు. చెడ్డ వారితో స్నేహం అలాంటిదే. త్వరగా చెడి పోతుంది. తిరిగి కలియదు.

మంచి వారితో మైత్రి అలా కాదు. బంగారు కుండని పగుల కొట్టడం ఎంతో కష్టం. కాని అతకడం తేలిక. సాధ్యపడుతుంది కూడా. అలాగే మంచి వారితో స్నేహం ఎన్నటికీ చెడి పోదు.


మంచి మిత్రుని లక్షణాలు ఎలాంటివంటే,

అఘము వలన మరల్చు, హితార్ధ కలితుఁ
జేయు, గోప్యంబు దాచుఁ బోషించు గుణము
విడువఁడాపన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుడీ లక్షణముల మెలఁగుచుండు.


మనలని తప్పులు చేయకుండా సరైన మార్గంలో నడిచేలా చూస్తాడు. మంచి చేస్తాడు. మన రహప్యాలు వెల్లడి చేయకుండా గోప్యంగా ఉంచుతాడు. మన మంచి గుణాలని మెచ్చుకుంటాడు. ఆపదలో మన వెంటే అంటిపెట్టుకుని ఉంటాడు. దూరంగా పారి పోడు.అవసరానికి ఆదుకుంటాడు. మంచి మిత్రుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు.

దుర్జనేన సమం వైరం, ప్రీతిం చాపి న కారయేత్
ఉష్ణోదహతి చాంగార:, శీత: కృష్ణాయతే కరమ్

చెడ్డ వాళ్ళతో విరోధమూ వద్దు. స్నేహమూ వద్దు. రెండూ మంచిది కాదు.
బొగ్గులు చల్లగా ఉన్నాయి కదా అని ముట్టుకుంటే చేతులకు మసి అంటుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తాకితే చేతులు బొబ్బలెక్కుతాయి కదూ?

అందు చేత ఎలాంటి వారితో స్నేహం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి.



స్వస్తి.

7, అక్టోబర్ 2010, గురువారం

ఇలా ఉండడం మన వల్ల కాదు బాబూ !!


ఎవరయినా తిడితే , వొళ్ళు మండి పోతుంది. వారిని మళ్ళీ తిట్టాలనిపిస్తుంది. చెడామడా దులిపేయాలనిపిస్తుంది.
తిడితే ఊరుకుంటామా చెప్పండి?

దూషణ భూషణ తిరస్కారములు దేహమునకే కాని, ఆత్మకు కావు అనుకునే మహానుభావులూ
ఉంటారు. తిట్ల దండకం తవ్వి పోస్తున్నా, చిద్విలాసంగా నవ్వుతూ, అయితే ఏమిటిటా ! అంటూ
నవ్వ గలగడం చాలా కష్టం సుమా ! అలా ఉండగలిగే వారు అయితే యోగులేనా కావాలి. లేదా మందబుద్ధులేనా కావాలి. కాదంటే బధిరులేనా కావాలి.

ఈ శ్లోకం చూడండి ...

మన్నిందయా యది జన: పరితోష మేతి
నన్వ ప్రయత్న జనితో2య మనుగ్రహో మే,
శ్రేయోర్ధినో హి పురుషా: పరతుష్ఠి హేతో:
దు:ఖార్జితాన్యపి ధనాని పరిత్యజంతి.

నన్ను తిట్టడం వలన జనాలకి ఆనందం కలుగుతోందా !? ఆహా ! ఎంత అదృష్టవంతుడిని !నా భాగ్యం ఎంత గొప్పది ! నా మీద అప్రయత్నమైన అనుగ్రహం చూపించడమే కదా, నన్ను నిందించడమంటే. ఈ విధంగానయినా నన్ను పట్టించుకుంటున్నారంటే నాకు అంత కన్నా ఇంకేం కావాలి? లోకంలో చాలా మంది ఎంతో డబ్బు తగలేసి, ఇతరులకు సంతృప్తిని కలిగించి మరీ వారి కి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.

మరి నాకో? ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఇతరులకు ఆనందాన్ని కలిగించే భాగ్యం దక్కుతోంది. నన్ను తిట్టడం వలన వారికి అట్టి ఆనందం కలుగుతూ ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి !

పాజటివ్ పబ్లిసిటీ కంటె నెటిటివ్ పబ్లిసిటీ వేగిరం వస్తుందని మనకి తెలిసిందే కదా. ( అయితే, అది ఉండడం, ఊడడం వేరే సంగతి)

మీది శ్లోకంలో చెప్పినట్టుగా సంబర పడి పోయే వారిని ఎవరు మట్టుకు ఏమనగలరు చెప్పండి?
ఇంత సహనమూ, సౌజన్యమూ ఉండాలంటే ఎంత చిత్త సంస్కారం కావాలో ఆలోచించండి.

ఎదుటి వారి భావ ప్రకటనను గౌరవించడానికి ఎంతో మానసిక ఔన్నత్యం కావాలి కదూ!

ఈ సందర్భంలో ఒక మంచి కొటేషన్ గుర్తుకొస్తోంది:

నీ అభిప్రాయంతో నేను వంద శాతం అంగీకరించడం లేదు. కాని , నువ్వు స్వేచ్ఛగా నీ అభిప్రాయాన్ని తెలియజేసుకునే నీ హక్కు కాపాడడం కోసం నీ తరఫున నేనూ పోరాడుతాను.




6, అక్టోబర్ 2010, బుధవారం

పెద్దలకు మాత్రమే.


చెప్పదగుఁ గవిత రసముల్
జిప్పిల నప్పప్ప ! భళి భళీ !యన, లేదా,
యెప్పుడుఁజేయక యుండుట
యొప్పు సుమీ ! సుకవి యెంత యుచితఙ్ఞుఁడొకో !

మాదయ గారి మల్లన రాజ శేఖర చరిత్రలో చెప్పిన పద్యమిది.చెబితే రసవంతమైన చక్కని కవిత చెప్పాలి. లేదా కవిత్వం జోలికి పోకుండా ఉండాలి. అంతే కానీ చచ్చూ పుచ్చూ కవిత్వాలు వద్దర్రా అని ఖండితంగా చెప్పాడు.

కవిత్వం అంటే, లేత అరిటాకు మీద వెన్నెల ప్రసరించి నట్టుగా తళుక్ మనేలా ఉండాలి.

పురి విప్పిన నెమలి గోడ మీద నుండి చెంగున దూకి నట్టు గుండె ఝల్లు మనేలా ఉండాలి.

అనే వారు మా గురు దేవులు శ్రీ మానా ప్రగడ శేషశాయి గారు.

కవిత్వం ఎలా ఉండాలో చాలా మంది చాలా రకాలుగా చెప్పారు.

బైచరాజు వేంకట కవి మాత్రం కాస్త ముందుకు పోయి ఇలా చెప్పాడు:

ఘనతర ఘూర్జరీ కుచయుగ క్రియ గూఢము కాక, ద్రావిడీ
స్తన గతిఁ దేట గాక, యరచాటగు నాంధ్ర వధూటి చొక్కపుం
జనుగవ బోలి గూఢమును చాటు దనంబును గాక యుండఁజె
ప్పిన యదిపో కవిత్వమనిపించు, నగించు నటుగాక యుండినన్.

కవిత్వం ఘూర్జరీ వనితల స్తన ద్వయం లాగా మరీ అంత గూఢంగా ఉండి పో కూడదుట.అలాగని ద్రవిడ స్త్రీల కుచ మండలం వలె మరీ బహిరంగమూ కాకూడదట.

మరెలా ఉండాలయ్యా కవిత్వం ? అంటే, ఆంధ్ర స్త్రీల చనుగవ వలె అంత గూఢమూ, అంత బాహిరమూ కాకుండా, కనీ కనిపించనట్టుగా , కవ్వించే లాగున ఉండాలని పచ్చిగా ఈ కవి గారు శలవిస్తున్నారు. అలా చెబుతేనే అది కవిత్వమనిపిస్తుందని దబాయిస్తున్నారు. లేక పోతే నవ్వులపాలయి పోతుందని బెదిరిస్తున్నారు.

హవ్వ !ఇలా చెబుతే కాని కవిత్వం ఎలా ఉండాలో తలకెక్కి చావదు కాబోలు!

కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే . ఓపిక చేసుకుని ఈ టపా చూడండి.

2, అక్టోబర్ 2010, శనివారం

పొటిగరాప్పంతులు (జూ) తో మాటా మంతీ. ...

ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు.
కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా?
సాన్దీ గిరీశమూ కలిసి తీయించుకున్న ఫొటోల డబ్బులు వసూలు చేసుకుని రమ్మని వాడిని పంతులు పంపిస్తాడు.
నేను కలిసింది ఆ పొటిగరాప్పంతులు గారి మనవడిని. పొటిగరాప్పంతులు, జూనియర్ నన్న మాట.
‘‘పొటిగరాప్పంతులూ ఎలా ఉన్నావెలా ఉన్నావ్’’ అనడిగేను.
‘‘ ఏం ఉండడంలే, ఏదో, యిలా ...’’ అన్నాడు.
‘‘ అదేం ? ’’
‘‘ మా తాత గారు కాలం చేసే వరకూ గిరీశం గారి బాకీ కోసం మనుషులని పంపించీ, తను కాళ్ళరిగేలా తిరిగీ కూడా ఆ బాకీ రాబట్టుకో లేక పోయేరు. వారి తదనంతరం మా తండ్రి గారూ . తర్వాత నేనూ, కనీసం గరీశం గారి మనవళ్ళెవరయినా కనిపించక పోతారా, వారి తాత గారివ్వాలిసిన బాకీ తీర్చక పోతారా అనే ఆశతో ఇలా విజనగరం వీధులంట తెగ తిరుగుతున్నాను..‘‘
‘‘ ఎవరూ కనిపించ లేదూ?’’
‘‘ కనిపించకేం. కానీ అందరూ ఆ తాత గారి చందమే‘‘
‘‘అదేమిటి?’’
‘‘ అందరూ దాదాపు గిరీశం గార్లాంటి వాళ్ళే తయారయేరు. సానుల్తో ఫొటోలు దిగడం, డబ్బుల కోసం మనిషిని పంపిస్తే ఏవో మాయ మాటలు చెప్పి తప్పించు కోవడం ... పైగా గాయత్రి మీద ప్రమాణాలు చెయ్యడమొకటీ ... బిజినెస్సు దివాళా తీసిందనుకో’’ అన్నాడు విచారంగా.
పాపం. అనుకున్నాను. పొటిగరాప్పంతులు పంపిన మనిషికి టోకరా ఇచ్చి, గిరీశం , శిఫ్యడు వేంకటేశంతో ఆ బడుద్ధాయికి చదువు చెప్పే నెపంతో ఉడాయించడం ..... క్రిష్ణరాయపురం అగ్రహారం వెళ్ళి, అగ్ని హోత్రావధాన్లు ఇంట తిష్ఠ వేయడం..... అన్నీ గుర్తొచ్చాయి,
‘‘ సరే కానీ, విజయ నగరం అందాలు చూపించే ఫొటోలు ఏవయినా ఉంటే ఇద్దూ, మా బ్లాగు మిత్రులకి చూపిస్తాను’’ అనడిగేను.
‘‘ బ్లాగా ? అంటే ...? ’’ అనడిగేడు అనుమానంగా.
‘‘ దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ, ముందు ఫొటోలుంటే ఇవ్వు’’
‘‘సరేలే, నీ ఏడుపేదో నువ్వుఏడువ్. ఏవో కొన్ని ఫొటోలున్నట్టున్నాయి. ఇస్తాను తీసికెళ్ళి ఎలా తగలడతావో నీ ఇష్టం.
ముందు నాకో మాంఛి చుట్ట పీక ఉంటే ఇలా పారెయ్‘‘
‘‘ చుట్ట లేదు కానీ, కింగ్ సైజు ఫిల్టరు సిగరెట్టుంది, కాల్చు’’ అంటూ ఓ సిగరెట్టూ, అగ్గి పెట్టె అందించాను.
చీదరగా ముఖం పెట్టాడు పంతులు.
‘‘ చుట్ట లేదూ? గురజాడ వారు మా గిరీశం నోటంట చుట్ట మాహాత్మ్యం గురించి ఎంత గొప్పగా చెప్పారో అప్పుడే మరిచి పోయేరా వెధవ కక్కకట్టల్లారా.... ’’ అంటూ అయిష్టంగానే సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి వదిలేడు.
‘‘ మరి నేనడిగిన ఫొటోలో?’’
‘‘ నీ అమ్మ కడుపు కాల. వదలేలా లేవురా. సరే నా దగ్గర కొన్ని ఫొటోలేవో ఉన్నట్టున్నాయి. ఇస్తాను. అప్పటి విజయనగరం కాదురా తండ్రీ. చాలా మారి పోయింది. పండు ముత్తయిదువులా ఎంత బాగుండేదని ... ఇప్పటి రూపంలో మన విజయ నగరాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కు పోతుందిరా బాబూ ....నువ్వే చూడు ...’’ అంటూ కొన్ని ఫోటోలు అందించేడు.
ఆత్రంగా వాటినందుకుని, గబగబా చూసేను. ‘‘ అవునూ, ఇంకా చాలా స్థలాలకి చెందిన ఫొటోలు ఉండాలే , ఏవీ,
చా.సో గారి హవేలీ , మచ్చ కొండా, కొట లోని రౌండ్ మహల్, మోతీ మహల్, పెద్ద చెరువు గట్టు మీద రాజుల విగ్రహాలూ, ఏనుగుల తోటా, నారాయణ దాసు గారూ, ద్వారం వారూ, కోడి రామ్మూర్తి గారూ నివసించిన ఇళ్ళూ, వ్యాయామశాల, పూల్ బాగ్, , బాబా మెట్ట , దివాన్ గారి మేడ, రాజారావు మేడ, అంబటి సత్రం, అయ్య కోనేరు గట్టున వెలసిన వేంకటేశ్వర స్వామి వారి చిన్న గుడీ. చిన్న ఆంజనేయ స్వామి వారి కోవెలా, లంక వీధి, కానుకుర్తి వారి సత్రం, అయోధ్యా మైదానం,, రాజు గారి సాని సింహాచలం మేడ ... ఇవన్నీ ఏవీ ? ’’ అడిగేను.
‘‘ నీ ముఖం తగలెయ్య. పైసా విదల్చకుండా ఫొటోలన్నీ దొబ్బుకు పోతూ, మళ్ళీ అవి లేవు, ఇవి లేవు అంటూ సణుగుడొకటా.? ఇప్పటికి ఉన్నవి తీసికెళ్ళు. ఈ సారి మిగతావి దొరికితే ఇస్తానులే. సరే కానీ, ఈ సారి వచ్చి నప్పుడు మంచి చుట్టల కట్ట తేవడం మాత్రం మరిచి పోవద్దు సుమీ....ఇక వెళ్ళు ఆ గిరీశం ఎలానూ ఇక దొరకడు. కనీసం వాడి మనవలో, మునిమనవలో కనిపిస్తారేమో చూడాలి. మా తాత గారు తీసిన పుటిగరాపుల బాకీ వసూలు చేసుకోవద్దూ? అసలప్పుడే మా తాత గారు సౌజన్యారావు పంతులు గారిని కలిసి ఆ గిరీశం మీద దావా పడేద్దామనుకున్నారట కానీ, విశాఖ పట్నం వెళ్ళి రావడానికి ఛార్జీలు లేక ఉండి పోయార్ట. .. సరేలే, వెళ్ళిరా ...’’ అంటూ జనంలో కలిసి పోయేడు.
ప్రవాహంలా సాగి పోతున్న అ జన వాహినిలో ఈ జూనియర్ పుటిగరాప్పంతులుకి వందలాది, వేలాది గిరీశంలాటి వాళ్ళు కనిపిస్తారు.
గిరీశం నేర్పించి పోయిన టక్కరి విద్యలు ఉపయోగించి పంతులుని లాఘవంగా బురిడీ కొట్టించి చక్కా పోతారు.
పంచె కట్టు మానీసి, ఫేంటూ చొక్కాలతో లుబ్ధావధాన్లూ, కరటక శాస్త్రీ , అగ్ని హోత్రావధాన్లూ వగైరాలు కాని ,
వాళ్ళ లాంటి వారు కానీ, కూడా కనిపించ వొచ్చును.
సౌజన్యారావు పంతులు కనిపించడు. కనీసం అలాంటి మహానుభావులూ కనిపించరు.
ఇక మధుర వాణి సంగతంటారా? అక్కడే కాదు యావద్దేశంలోనూ, ఆ మాట కొప్తే యావత్ ప్రపంచం లోనూ పొటిగరాప్పంతులకే కాదు, అసలు ఎవరికీ మరి కనిపించదు. ఎందుకంటే ఆవిడ గురజాడ వారి కాళ్ళొత్తుతూ
ఏ స్వర్గంలోనో అంత గొప్ప పాత్రగా తనని తీర్చి దిద్దిన ఆ మహా రచయిత ఋణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ....
మరింక పుటిగరాప్పంతులు (జూ) ఇచ్చిన ఫొటోలు చూడండి .......
మహా రాజా వారి కోట. ఇందులోనే రౌండ్ మహల్, మోతీ మహల్ వగైరా భవనాలు ఉన్నాయి. ఇప్పుడీ కోట లోని భవనాలన్నీ రాజుల వితరణ త తో విద్యాసంస్థలకు నెలవులయి విలిసిల్లుతున్నాయి.

ఈ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొదటి అంకం లోని మొదటి స్థలం ఇదే. బొంకుల రాయడు గరీశం బొంకుల దిబ్బ దగ్గరే నాటకంలో తొలి సారిగా కనిపిస్తాడు..ఇప్పుడీ ఖాళీ జాగాలో కూరగాయల మార్కెట్టు ఉంది.

దీనిని మూడు లాంతర్ల జంక్షన్ అంటారు. నిజానికిది నాలుగు రోడ్ల కూడలి కాదు. ఇక్కడ మూడు రోడ్ల కూడలి ఉంది. ఒకటి కస్పా బజారు మీదుగా కోట వేపు వెళ్ళే రోడ్డు కాగా, దానికి ఎదురుగా అంబటి సత్రం, పూల్ బాగ్లకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇక, మూడులాంతర్లకి ఎదురుగా పోయే రోడ్డు లో మొదట్లోనే అమ్మ వారి గుడీ, అది దాటేక గంట స్థంభం వస్తాయి. ఆ దారి తిన్నగా రైల్వే స్టేషన్కి దారితీస్తుంది. గంటస్థంభం నుండి మధ్యలో ఎడమ వేపు తిరిగితే పెద్ద చెరువు, రాజుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఈ మూడు లాంతర్లు మూడు సింహం బొమ్మలు. వాటి మీద ఒకప్పుడు చవురు దీపాలను వెలిగించే వారుట. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ దీపాలూ ఉండేవి. ఇప్పుడా దీపాలూ లేవు. ఆ వెలుగులూ లేవు. ఒకప్నపుడు రోడ్డుకి ఎత్తుగా మూడు మెట్లతో ఉండే ఈ కట్టడం , రోడ్డు మందంగా బలియడం వల్ల కురచగా మారి పోయింది.
మహా కవి గురజాడ . ఈ విగ్రహం గురజాడ స్మారక గ్రంథాలయం ఆవరణలో ఉంది.
ఇదే అయ్య కోనేరు. కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలో పొటిగరాప్పంతులు మనిషి గిరీశం నుండి అతనూ మధురవాణీ తీయించుకున్న ఫొటోల బాకీ డబ్బులు అడగాడానికి వస్తే, గరీశం వినబడనట్టు నటిస్తూ, ‘ అయ్యకోనేటికి తోవ ఇదే’ అంటాడు కదూ? ఆ అయ్య కోనేరు ఇదే.
విజయనగర ప్రభువులు పితృకర్మలు ఇక్కడ చేసే వారట. 1980 వరకూ అనుకుంటాను, దానికి చెందిన శిధిల కట్టడాలు ఇక్కడ కనిపించేవి.
ఈ కట్టడాన్ని గుమ్చీ అంటారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఇక్కడ హరి కథలు చెప్పే వారు.
విజనగర రాజుల పరమత సహనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ దర్గా కోటకు అతి సమీపంలో కస్పా బజారుకి వెళ్ళే దారిలో ఉంది.
ఇది కోటకీ, బొంకుల దిబ్బకీ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముద్దుగా ప్యారిస్ కార్నర్ అని పిలుచుకుంటూ
రోజూ సాయంత్రాల వేళ కవులూ, రచయితలూ కబుర్లతో సందడి చేస్తూ ఉండే వారు.

ఈ మూడు కోవెళ్ళ లోనే దాసు గారు తరచుగా హరి కథలు చెప్పే వారు.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల. ఇక్కడ వేద పాఠశాల, భాషా ప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వ్యాకరణ విద్యాప్రవీణ కోర్సలు నిర్వహించే ప్రాచ్య కళాశాల, ఉన్నత పాఠశాల, ఉన్నాయి. దేశం గర్వించే మహా పండితులు మెసలిన చోటు,
ఇది విజయనగర ప్రభువులు నిర్మించి అవిఘ్నంగా నిర్వహిస్తున్న విద్యార్ధి ఉచిత భోజన శాల.
సింహాచల దేవస్థానం చౌలటరీ అంటారు. ఏళ్ళ తరబడి రోజూ వందలాది విద్యార్ధులకి ఉచితంగా కమ్మని భోజనాన్ని సమకూరుస్తూ వారి విద్యాభ్యాసం కుంటు పడకుండా కాపాడుతున్న చల్లని తల్లి.

విజయగరం ప్రభుత్వ మహా రాజ సంగీత కళాశాల.
ద్వారం నాయుడు గారి లాంటి సంగీత దిగ్దంతులు నడయాడిన చోటు. ఘంటసాల సంగీత సాధన జరిగింది ఇక్కడే.

అయ్య కోనేరు తూర్పు గట్టున వెలసిన పెద్ద ఆంజనేయ స్వామి వారి కోవెల.

కోట వెనుక భాగం. కందకం

రాజా వారి డిగ్రీ కళాశాల. గురజాడ చదివినదీ, ఉద్యోగం చేసినదీ ఇక్కడే
గంటస్థంభం. విజనగరానికి ఇది తలమానికం.
పెద్ద చెరువు. వేలాది ఎకరాల నేలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఓ సారి తమ విజయనగర అనుభవాలను స్మరించుకుంటూ , విజయగరంలోని ఒక్కో ప్రదేశాన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు:
‘‘విజయనగరంలో నాకన్నీ ఇష్టం. చివరకి పెద్ద చెరువులో దోమలు కూడా. ’’ అని.
ఈ పెద్ద చెరువు దగ్గర దోమల మందిరం అని ఒకటుండేది. అక్కడ దోమలు ఎక్కవగా ఉండే రోజులలో దాదాపు ఒక నెల రోజుల పాటు పాఠశాలలకి ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే వారుట.
శ్రీ పైడితల్లి అమ్మ వారి గుడి. విజయనగర రాజుల ఇల వేలుపు. ఏటా విధిగా జరిగే అమ్మ వారి పండుగలో సిరిమానోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ.
అమ్మ వారికి చెందిన తొలి గుడి విజయ నగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. వనం గుడి అని ఆ గుడికి పేరు.
కన్యాశుల్కం, ముత్యాల సరాలు, తెలుగు తొలి కథ దిద్దుబాటు మొదలయిన గురజాడ రచనలు జాతి నోముల ఫలంగా వెలుగు చూసిన చోటు ఇదే.
విద్యార్ధి భోజనశాల
గుమ్చీ ఈ ప్రక్కగా వెళ్తే శంకర మఠం వస్తుంది. కౌముదీ పరిషత్తు తొలి రోజుల కార్యక్రమాలు అక్కడే జరిగేవిట.


ఇవీ జూనియర్ పొటిగరాప్పంతులు నాకిచ్చిన ఫొటోలు. మరోసారి అతను మిగతా ప్రదేశాల ఫోటోలు ఇచ్చాక మీముందు పెడతాను.
ఈ లోగా అతని కోసం మంచి చుట్టలు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేయాలి. మరి ఉంటాను.

























13, సెప్టెంబర్ 2010, సోమవారం

జాణవులే, నెరజాణవులే !!


విజయ నగరం కోట ఇదే.

ఉత్తరాంధ్రలో విజయ నగర ప్రభువులు అభినవ ఆంధ్ర భోజులు. వారి పోషణలో ఎందరో కవి పండితులు అపూర్వమైన గ్రంధ రచనలు చేసి మహత్తరమయిన సాహిత్య పోషణ చేసారు. అలాంటి దిగ్గంతులలో ఒకరిని ఈ టపాలో స్మరించుకుందాం ...

ఆనంద వర్ధనుడు సంస్కృత భాషలో వెలయించిన ఆలంకారిక గ్రంథము ధ్వన్యాలోకము. కావ్యాత్మ ఏది అని ప్రశ్నించి, కావ్యమునకు ఆత్మ ధ్వని అని ఒక అపూర్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.ధ్వని గర్భితమైన రచన కావ్య సౌందర్యాన్ని ఇనుమడింప చేయడమే కాక, కావ్యానికి పరిపుష్ఠినీ, ఉత్తమ స్థానాన్నీ కల్పిస్తుంది. సమర్ధుడైన కవి తన వక్తవ్యాంశాన్ని కేవలం వాచ్యంగా చెప్పడు.ధ్వని తో స్ఫురింప చేస్తాడు.అవాంతర భేదాలతో విస్తరించి ఉన్న ఈ ధ్వని

శాస్త్రాన్ని గురించి గురు ముఖత: గ్రహించడమే మేలు గహన సదృశంగా తోచే ఈ మహత్తర

ఆలంకారిక గ్రంథానికి పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఆంధ్ర ధ్వన్యాలోకము అనే పేరుతో చక్కని అనువాదం చేసారు.

శ్రీ శాస్త్రి గారు విజయనగర వాస్తవ్యులు. అక్కడి ప్రభుత్వ మహా రాజ సంష్కృత కలా శాలలో విద్యాభ్యాసం చేసి , అక్కడే ఆంధ్ర భాషా ప్రధానాధ్యాపకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగీత సాహిత్యాలలో దిట్ట.

ఇందులో ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకనంతో పాటు, ధ్వన్యాలోకన వ్యాఖ్యాతలలో ఒకరైన

అభినవగుప్తపాదుల వారి లోచన వ్యాఖ్యను కూడ అనువదించడం జరిగింది.మాతృక లోని లక్ష్య శ్లోకాలను దీనిలో సరళ సుందరమయిన తెలుగు పద్యరూపంలో మనకి అందించడం జరిగింది

.

శాస్త్రి గారు చదివినదీ, ఉద్యోగ విధులు నిర్వర్తించినదీ విజయనగరం లోని ఈ కాళాశాలలోనే !

అసలు ఏమిటీ ధ్వని?

అర్ధం ఎప్పుడూ శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అలా గోచరించే అర్ధం వాచ్యం అయితే

చదవగానే, లేదా వినగానే స్ఫురించే అర్ధమే కాక వేరొక అర్ధం స్ఫురించడమే ధ్వని. దీనికే వ్యంగ్యం అని నామాంతరం. ధ్వని గర్భిత రచనకి ఎప్పుడూ ఉత్తమ స్థానం లభిస్తుంది..

ధ్వని గర్భితాలయిన రెండు చిన్న పద్యాలను చూదాం ....

కనులు కాన రాని కటిక చీకటి రేయి

వలస పోయె మగడు, వంటి దాన !

దొంగ లెవ్వరయిన దోతురేమో సుమ్ము

కంట గనుము, ప్రక్క యింటి వాడ !

ఒక ఊరిలో ఒక నెరజాణ ఉంది. ఆమె బయటకి కడు ముద్దరాలిలా కనిపిస్తుంది. ఆమె నాథుడు ఏవో పనుల మీద దేశాంతరం పోయి చాలా దినాలయింది. ఆమె వయసు ఊరు కోవడం లేదు. శరీరం సహకరించడం లేదు. మతి లయ తప్పుతున్నది. పురుష స్పర్శ కోసం దేహం తహ తహలాడి పోతున్నది. ఎలా? ఎవ్వరకీ అనుమానం రాకుండా పొరుగింటి యువకుడిని ఉద్దేశించి ఇలా అంది:

అయ్యో, చీకటి పడింది. కళ్ళు పొడుచుకున్నా కనబడడం లేదు. నా భర్త దేశాంతరాలు వలస పోయాడు. ఇప్పటిలో రాడు. నేనా, వంటరి దానిని ! అదను చూసి దొంగలెవరయినా దోచుకుంటారేమో భయంగా ఉంది. మా ప్రక్క ఇంటి వాడివే కదా, నన్నూ, మా యింటినీ ఓ కంట కాస్త కనిపెడుతూ ఉండు సుమీ !

ఇదీ పద్యం. వాచ్యంగా చూస్తే ఒక దీన మైన అభ్యర్ధన తప్ప ఇందులో మరేమీ గోచరించదు.ఎక్కడా అనౌచిత్యం, అశ్లీలం కనిపించదు.

కొంచెం లోతుగా చూస్తే మాత్రం ఆ నెరజాణ గడుసుతనం, మాటకారితనం, మనసులోని మర్మం అన్నీ ప్రకటితమవుతాయి.

చీకటి పడిందయ్యా. నా మగడు ఊర లేడు. నేనో, ఒంటరి దానిని. మగ తోడు కావాలనిపిస్తున్నది. రాకూడదూ? అని పిలుపు ! భర్త లేడని చెప్పడం వలన మరేమీ భయపడ వలసిన పని లేదని ధ్వని. కటిక చీకటి అనడం వలన ఎవ్వరూ చూడ లేరులే అని సూచన. వంటరి దానను అనడం వలన ఇంటిలో మన కలయికకు ఎవరూ అడ్డంగా లేరులే అనే భరోసా, దొంగ లెవరయినా దోచేస్తారేమో అనడం వలన, నువ్వు తక్షణం రాక పోతే మరెవరయినా వొచ్చి, నా పొందు స్వీకరించే భాగ్యం పొంద గలరు సుమా అనే బెదిరింపు. కంట కనుము అని అనడం వలన, నా అంత అంద గత్తె పిలుస్తూ ఉంటే జాగు చేయక వెంటనే ఓ చూపు చూడవయ్యా అని కవ్వించడం. ప్రక్క యింటి వాడ ! అనడం వలన నువ్వు చాలా కాలంగా మా ప్రక్క ఇంటి లోనే ఉంటున్నావు కనుక ఈ అదృష్టం నీకే అభిస్తోందయ్యా అని ఊరించడం ..... ఇదీ ధ్వని !

మరో పద్యం, శాస్త్రి గారి అనువాదం:

ఒడలెరుఁగ దిచ్చట శయించు చుండు నత్త,

నేనొ, యిచటఁబరుండుదును, నీవొ, రేయి

నంధుడవు ! పాంథ ! దివసకమందె, దీని

చక్కగాఁజూడు పడకు మాశయ్యలందు

ఇదీ పద్యం. ఈ నెరజాణ పరిస్థితీ అలాంటిదే. మగడు ఊర లేడు. చాలా రోజులయింది.

విదేశగతుడై. తానా ,యవ్వనవతి. దేహం మగతోడు కావాలంటోంది. ఉప్పూ కారం తినే వయసాయె!

సరే, ఇంటికి ఓ అతిథి వచ్చేడు. చూడ చక్కగా ఉన్నాడు. ఈవిడ గారి కన్ను వాడి మీద పడింది. ధ్వని గర్భితంగా సంకేతం వినిపించింది.

ఓ బాటసారీ, ఇదిగో చూడు. మా అత్త వొళ్ళూ మీదా కానకుండా ఇక్కడ పడుకుని ఉంటుంది. ఆవిడ గారికి ఓ సారి నిద్ర పడితే మరి అంతే . ఒళ్ళెరుగదు. నేను ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటూ ఉంటాను. నువ్వు చూడబోతే రేచీకటి గాడిలా ఉన్నావు. రాత్రి వేళ మంచి నీళ్ళు త్రాగడానికో, మరేదో అవసరానికో లేస్తావు. నీకు రేచీకటిలా ఉంది. ఎవరెక్కడ పడుకుంటారో ఇప్పుడే చెబుతున్నాను. ఈ పగటి వెలుతురు లోనే చక్కగా చూసి గుర్తు పెట్టుకో. మా పడకల మీద పడకు సుమీ !

వాచ్యార్ధంలో ఇందులో ఎంచడానికేమీ లేదు. నెరజాణ గడుసుతనమంతా తన కోరికను ధ్వన్యంతరంగా చెప్పడం లోనే ఉంది.

ముందుగా రాత్రి వేళ అత్త ఎక్కడ పడుకుంటుందో చెప్పింది. ఆవిడ ఒళ్ళెరక్కుండా పడుకుంటుంది కనుక మనకింక భయమేమీ లేదని సూచించింది. తను ఏ మంచం మీద పడుకుని ఉంటుందో చక్కగా సూచన చేసింది. రేచీకటి గాడివనడంలో, ఆ రాత్రి ఇంట్లో దీపం లేకుండా అంతా చీకటిమయం చేసి ఉంచుతానని చెప్పకనే చెప్పింది. ఎవరెక్కడ పడుకుంటారో పగటి వేళ వెలుతురు ఉండగానే చక్కగా చూసి గుర్తు పెట్టు కోమని హెచ్చరించింది.

ఇక , పడకు మా శయ్య లందు అనడం వల్ల రాత్రి తన పడక మీదకి రమ్మని ధ్వని ఎలా కుదురుతుంది?

అని సందేహం రావచ్చును.

మా పడకల మీద పడ వద్దు అని వాచ్యంగా నిషేధించింది. పడకలు అని బహువచనం వాడడం వలన ఆ నిషేధం అన్వర్ధము కదా ?

అత్త పరుండే శయ్య మీద కాకుండా తాను ఒక్కతె పరుండే పడక మీద పడవచ్చుననే ధ్వని ఇందులో ఉంది. వాచ్య రూప నిషేధంలోనే విధి రూప అంగీకారం ఉంది.

ఇదీ ధ్వని.

మరో ఉదాహరణ కూడ చెబుతాను.

ఒక అటవీ ప్రాంతలో ఒక ప్రేమ జంట కులాసాగా తిరుగుతూ ఉంది. అక్కడి పూల పొదలే వారి పడకటిల్లు. మంచి యుక్త వయసులో ఉన్నారు. కామోపభోగాలు చక్కగా అనుభవిస్తున్నారు.

ఒక బ్రాహ్మణుడు పూజకు పువ్వులు కోసుకోవడం కోసం రోజూ వాళ్ళండే పొదల దగ్గరకి వస్తూ ఉన్నాడు. వారి ఏకాంతానికి ఇది భంగకరంగా పరిణమించింది. ఇటు వేపు రావద్దయ్యా అని చెప్పాలంటే భయం. ఆ సద్బ్రాహ్మణుడికి అలా చెప్పే ధైర్యం వారికి లేదు.తమ కలయికకు ఆటంకం కలిగిస్తున్న అతని రాకను నివారించాలి. తనంతట తానుగా ఆ బ్రాహ్మణుడు మరి అటు వేపు రాకుండా చేయాలి.

అందుకే ధ్వని గర్భితంగా అతనితో వినయంగా ఇలా చెప్పారు:

ఓ బ్రాహ్మణుడా ! నువ్వు రోజూ పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ Iఉన్నావు, ఇక్కడ రోజూ నిన్ను ఓ కుక్క అల్లరి పెడుతోంది కదా ? ఇక్కడ తిరిగే ఓ పెద్దపులిని చూసి, మరి ఆ కుక్క నీ జోలికి రాదు. ఇక్కడి నుండి ఉడాయించింది,. నువ్వు ఇక మీదట ఎప్పటి లాగే రోజూ నిర్భయంగా పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ ఉండ వచ్చును. మరేమీ భయం లేదు.

కుక్కకే భయపడే ఆ బ్రాహ్మణుడు మరి పులి పేరెత్తితే ఇక ఆ ఛాయలకు వస్తాడా చెప్పండి?

అంతే ! ఇక, అటు వేపుగా ఆ వెర్రి బ్రాహ్మణుడి పత్తా లేదు !

ఆ యువతీ యువకులకి పండుగే పండుగ !

స్వస్తి.