20, డిసెంబర్ 2010, సోమవారం

భజంత్రీలు


పొగడ దండలు అనే టపాలో పొగడ్తల గురించి కొంత మాట్లాడు కున్నాం కదా ? ( ఇక్కడ నొక్కి చూడండి)

ఇప్పుడు పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలు, మొహ మాటపు పొగడ్తలు, బలవంతపు పొగడ్తలు, బరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అని సొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడో, లేదో, చుట్టూ ఉన్న వాళ్ళు వహ్వా, వహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.

ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడో, కానీ, సొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.

డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినా, ఎలాగయినా వాయించు కో వచ్చును కదా.

సొంత డబ్బా సంగతి ఇలా ఉంటే, ఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తే, నీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.

నువ్వు నా వీపు గోకితే, నేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, పొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని , నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటే, స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటే, నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:

పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు

ముద్దియలా హరికి గలరు ముగురందరిలో

పెద్దమ్మ నాట్య మాడును

దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.

తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు

నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ

నన్నా తిరుమల రాయుడు

కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోను, శుక్రాచార్యునితోను, మన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితే, ఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,

రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపం, రాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుక, ప్రభువులవారు ముక్కంటితో సమానం.

రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదు, ఒక కన్ను లేదు కానీ, ప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని

పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా

జగ జట్టి యన్న తండ్రికి

దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు

అని !

నగపతి - ఇంద్రుడు

అతని పగతుడు (శత్రువు) - నరకుడు

అతని పగతుడు - శ్రీ కృష్ణుడు

అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)

అతని పగతుడు - భీముడు

అతని అన్న - ధర్మ రాజు

అతని తండ్రి - యముడు

అతని వాహనం - దున్న పోతు !

ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్

కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్

కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో

నందరు నందరే మఱియు, నందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలు, కోతులు,పందులు, దున్న పోతులు, గాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు

నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్

పిఱికి తనంబును లోభము

గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూ, ఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటే, పిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు.రప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారు, ఏమిచ్చారు ? అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం

డేపాటి ధనం బొసంగె ? నీరప రాజా ?’’

దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !

‘‘పాపాత్ముండెవ్వరికిని

చూపనిదే చూపెనయ్య, సూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.

ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై

యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె

నిష్ట సంపన్నురాలిందిర భార్య యై

కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె

కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై

బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై

పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె

అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని

మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !

చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1

హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడు, బహు కుటుంబీకుడు, పతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడు, కోరిన కోరికలను తీర్చే వాడు, పెద్ద కుటుంబం కల వాడు, అన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితే, విష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలు, కుమారుడు, కుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదని, అతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇది, నిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటే, భరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా ? సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?

అదే విధంగా, అన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడు, పాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.

దామోదరుడు అంటే, దామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం. పద్మ గర్భుడు .

చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడు, దయా గుణము కల వాడు, శత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతి, స్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.

ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును

తగ నర్ధుల కీయ నట్టి త్యాగము, సభలోఁ

బొగిడించు కొనుచుఁ దిరిగెడి

మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.

17, డిసెంబర్ 2010, శుక్రవారం

పొగడ దండలు !!


లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !

గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.

యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...

కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహసా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:

వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. ఆ రకమయిన పద్ధతులను గురించి విపులంగా పొగడ దండలు 2 టపాలో చూదాం.

స్వస్తి.

16, డిసెంబర్ 2010, గురువారం

వెర్రి మొర్రి శంకలు

అనుమానం పెనుభూతం అన్నారు. మనకి రాను రాను అన్నీ అనుమానాస్పదాలుగానే తోచడం ఒక విషాదం. తినే తిండి మంచిదో కాదో అనుమానం. తాగే నీరు మంచిదో కలుషితమైనదో భయం. పీల్చే గాలి స్వచ్ఛమైనదో కాదో అనే శంక పీడిస్తూ ఉంటుంది. చదివే చదువుకి సరైన ఉపాథి లభిస్తుందో లేదో తెలియక సతమత మైపోతూ ఉంటాం. దరి చేరిన వాడు మిత్రుడో, సమయం చూసి వెన్ను పోటు పొడుస్తాడో తెలియదు. వొంటికి ఏ రోజున ఏ రోగం వస్తుందో అని హడలి పోయి ఛస్తూ ఉంటాం. సగం రోగాలకి ఆ భయమే కారణం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మ కూడదో తెలియదు. నమ్మిన వాడు పాల ముంచుతాడో, నట్టేట ముంచుతాడో అర్ధం కాదు. నమ్మక పోతే ఏం అనర్ధమో తెలియదు. ఆఫీసు కెళ్ళిన భర్త / భార్య అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారో అనే అనుమానంతో వ్యథ చెందే అనుమాన పిశాచులూ ఉంటారు. అలాంటి మూర్ఖుల వల్ల వారికీ మశ్శాంతి ఉండదు. వారిని వెన్నంటి ఉండే వారికీ సుఖం ఉండదు. ఇంటికి వేసిన తాళం గడియ ఊడిపోయే లాగున పది సార్లు లాగి చూస్తే కానీ తాళం సరిగా వేసామో, లేదో, అనే శంక తీరదు. ఊరికెళ్ళి వచ్చే సరికి ఇల్లు దోచుకో బడకుండా భద్రంగా ఉంటుందో లేదో అనే అనుమానంతో మనశ్శాంతి కరువవుతుంది. బజారులో కొన్న పచారీ వస్తువులు కల్తీవో, నాణ్యమైనవో గ్రహించడం కష్టమై పోతోంది. విత్తనాలు కొన్న రైతుకి పాపం, అవి మంచివో, నకిలీ విత్తనాలో తెలీదు. పోనీ, పండిన పంట ఏరకమయిన అతివృష్టి, అనావృష్టి లాంటి వేవీ లేకుండా సరిగా చేతి కందుతుందో లేదో తెలీదు. మన వద్ద ఉన్న వంద, అయిదు వందలు, వెయ్యి నోట్లు మంచివో కాదో తెలియక తికమక పడిపోతూ ఉంటాం.బోలెడు డబ్బు పోసి టిక్కెట్లు కొనుక్కుని వెళ్తే సినిమా బావుంటుందో, చీదేస్తుందో తెలియదు.ఇంట్లో కరెంటు ఎప్పుడు టప్పున ఆరి పోతుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా ఎంత సేపు ఉంటుందో గ్యారంటీ లేదు. ఇంటాయన ఇంటద్దె ఎప్పుడు పెంచేస్తాడో ఏమో అని బెంగ పడుతూ ఉంటాం. సొంత ఇల్లయితే, ఏలిన వారు ఎంత శాతం పన్ను పెంచి పన్నూడ గొడతారో తెలియదు.ముచ్చట పడి కొనుక్కున్న చీర రంగు ఎంత కాలం వెలిసి పోకుండా ఉంటుందో నిర్ధారణగా చెప్పలేం. పత్రికకి పంపిన రచన పడుతుందో, తిరిగొస్తుందో ఎవరికెరుక ? అచ్చేసుకున్న పుస్తకాలు అమ్ముడు పోతాయో, మూలన పడి బూజు పడతాయో తెలియదు. ఎక్క వలసిన రైలు, లేదా విమానం సకాలానికి బయలు దేరుతుందో, రద్దవుతుందో తెలియదు. నల్లా లో నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఏమో తెలియదు. వచ్చినా, ఎంత సేపు ఉంటుందో తెలియదు. ఎంత బాగా రాసినా పరీక్షలో ఎన్ని మార్కులు పడతాయో తెలియదు. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన ఉద్యోగం ఎప్పుడు ఊడి పోతుందో నమ్మకం లేదు. కంప్యూటరు ఎప్పుడు మొరాయిస్తుందో ఖర్మ ! మహిళా బిల్లు అమలుకి నోచు కుంటుందో లేదో ? భీమ్ పాపాల శర్మ మన నెత్తి మీదకి మళ్ళీ ఏ సినిమా కథ చెబుతాడో తెలీదు. విప్లవం వస్తుందో రాదో అగమ్య గోచరం. ఏ ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టు కుంటుందో ఎవడికీ తెలియదు. పొత్తులు ఎంత కాలం నిలుస్తాయో అసలే తెలీదు. అయోధ్యలో రామాలయం కడతారో లేదో తెలీదు. తెలంగాణా వస్తుందో రాదో తెలీదు. వస్తే, హైదరాబాదు సంగతి ఏం చేస్తారో తెలీడం లేదు. తీరా, తెలంగాణా ఇచ్చేక మరెన్ని చిన్న రాష్ట్రాల కోసం పేచీలు మొదవుతాయో తెలీదు. గెలిపించిన ప్రభుత్వం ఐదేళ్ళూ పాలిస్తుందో, మధ్యంతరానికి దారులు తీస్తుందో చెప్ప లేం. 2012 దాటేక ప్రళయం వస్తుందో ఏమో నని బెంగ. ( ఈ విషయంలో ఇప్పటికే ఘనత వహించిన కొన్ని టీ వీ ఛానెళ్ళు పని కట్టుకుని ఊరికే ఊదర గొట్టేస్తున్నాయి కదా ? )

ఈ కథా మంజరి టపాని ఎంత మంది చదువుతారో తెలీదు. చదివిన వారు ఎంత మంది కామెంట్ లు పెడతారో తెలీదు

ఇది అనంతం. వీటికి అంతం లేదు.....

హితోపదేశంలో కవి ఒక శ్లోకంలో మనకు కలిగే అనేక శంకల గురించి ఉటంకిస్తూ, అన్ని శంకలు పెట్టుకుంటే బతక లేం అని తేల్చి పారేసేడు.

చూడండి:

శంకాభి: సర్వ మాక్రాంతం, అన్నం పానం చ భూతలే
ప్రవృత్తి: కుత్ర కర్తవ్యా, జీవితవ్యం కథం ను వా.

భూమ్మీద అన్ని విషయాలూ అనేక అనుమానాలతో కూడి ఉంటున్నాయి.
చివరకి అన్నం తినడం, నీరు త్రాగడం కూడ అనుమానం వల్ల దుర్భరమవుతోంది. అంటే,
తినడానికీ, త్రాగడానికీ కూడా ఊరికే భయ పడి పోతూ ఉంటున్నాం. ఇలాగయితే బతకడం ఎలాగ ? అని దీని భావం.

ఇన్ని అనుమానాలతో బతకడం కష్టం కనుక మరీ వెర్రి మొర్రి అనుమానాలు పెట్టు కోకుండా ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఈ టపా రాయడంలో నేను చెప్ప దలచిన పరమార్ధం అదే.

ఈ విషయం ఎంత మంది సరిగా అర్ధం చేసుకుంటారో కదా, అనేదే నా అనుమానం !!

స్వస్తి.



10, డిసెంబర్ 2010, శుక్రవారం

నస మంజరి - 2


ఒకటి నుండి వంద వరకూ ఉన్న అంకెలలో వందదే అగ్రస్థానం. వంద ఒక పూర్ణత్వానికి నికషగా మనం భావిస్తూ ఉండడం కద్దు.

ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే సినీ జీవులు దానిని ఒక గొప్ప కితాబుగా భావిస్తూ ఉంటారు. తమ చిత్ర రాజం వంద రోజులు ఆడడం కోసం ఎన్ని పుర్రాకులయినా పడుతూ ఉంటారు. వంద రోజుల ఆటలూ ఎలాగో ఒక లాగ పడే లాగున నానా తంటాలూ పడుతూ ఉంటారు. ఆడక పోయినా, ఆడిస్తారు.చివరకి వంద రోజులూ పూర్తి కాగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటారు. భుజాలు చరుచు కుంటారు.

అలాగే, మన పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ‘ శతమానం భవతి’ అంటూ ఆశీర్వదిస్తారు. నూరేళ్ళు బ్రతకమని కోరు కుంటారు. ( కాకిలా కలకాలం బ్రతకడం వేష్టుగా భావించే నిరాశా వాదులూ ఉంటారు. అది విషయాంతరం)

మహానుభావుల శత జయంతులు ఘనంగా జరుపు కుంటూ ఉంటాం. వందేళ్ళ నాటికి కూడా వారి పేరు స్మరించు కోవడం వారి ఘనతకు నిదర్శనం.

వంద సంఖ్యను తలుచు కుంటూ ఉంటే వంద మంది కౌరవులు గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు. వంద సంఖ్య ప్రత్యేకతను మంట గలిపిన వారు కౌరవులు

కవి ఆరుద్రకి కూడా వంద సంఖ్య మీద ఏమంత ప్రత్యేక మైన మోజు ఉన్నట్టుగా తోచదు.

తరాని కో వంద కవులు
తయారవుతా రెప్పుడూ
వంద లోనూ మంద లోనూ
మిగల గలిగే దొక్కడు !

అని తేల్చి చెప్పీసేడు.


సరే, ఈ శ్లోకం చూడండి ...

శతనిష్కో ధనాఢ్యశ్చ, శతగ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా, శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు కల వాడు ధనికుడు. వంద గ్రామాలు కల వాడు భూకామందు. వంద గుఱ్ఱాలు కల క్షత్రియుడే రాజు. వంద శ్లోకాలు ఎవడి కయితే వచ్చో, వాడు పండితుడు అని దీని అర్ధం.

ఈ లెక్కలో నిష్కము అంటే, మాడ, టంకము, నూట యెనిమిది మాడలు, పతకము, బంగారము, వెండి అనే అర్ధాలు ఉన్నాయని శబ్ద రత్నాకరం చెబుతోంది.

మాడ అంటే బంగారం అని నిఘంటువు. ఒక ప్రత్యేక మైన విలువ కలిగిన బంగారు నాణెము మాడ.

టంకము అనే దానికి పదహారు డబ్బుల బంగారు నాణెము అని నిఘంటువు. దీనికే దీనారము అని మరో పేరు.

మరి, డబ్బు అంటేనో ? రెండు దుగ్గానుల రాగి నాణెము అని అర్ధం.

దుగ్గాని అంటేనో ?

దుగ + కాని = దుగ్గాని. అంటే రెండు దమ్మిడీల విలువ కలది. ఈ పాత కాలపు నాణేల గురించి తెలుసు కోవడం తమాషాగా ఉంటుంది. ఒక టంకానికి పదహారు డబ్బులు కనుక ఈ లెక్క ప్రకారం ఇక్కడ కాని అంటే దమ్మిడి అని శబ్ద రత్నాకరం చెబుతోంది.

అయిదు కాసుల నాణెమును దమ్మిడి అంటారుట. కొందరయితే, రెండు కాసుల నాణెమును దమ్మిడి అంటారని నిఘంటువు వివరిస్తోంది.

ఇక, కాసు అనే పదానికి నిఘంటువు ఏం చెబుతోందో సరదాగా చూదాం ...

కాసు అంటే,దుగ్గానిలో నాలుగవ భాగమని కొందరు, కాదు కాదు ... దుగ్గానిలో పదవ భాగమని కొందరు అంటారుట.

కాసు వీసం కలిగి ఉంటే ... అని ఒక గేయంలో గురజాడ ప్రయోగించాడు. వీసం అంటే ఒక రూకలో పదహారవ భాగం.



నిఘంటువు రూక అనే పదానికి ధనము అనే అర్ధంతో పాటు, చిన్న మెత్తు వెండి బంగారముల నాణెము అని కూడా అర్శాన్ని ఇచ్చింది.

ఇప్పుడోసారి మళ్ళీ వెనక్కి డబ్బు దగ్గరకి వెళదాం.

డబ్బు అంటే రెండు దుగ్గానుల నాణెం అని తెలుసు కున్నాం కదా?

డబ్బు అనే దానికి బొంకు, బొంకు పలకడం అనే వేరే అర్ధాలు కూడా ఉన్నాయి !

వాడొక డబ్బు డబ్బేడు అంటే, వాడొక అబద్ధం చెప్పేడు అని అర్ధం. ( ఈ ఉదాహరణ నిఘంటు కారుడు ఇచ్చినదే)
ఈ అర్ధాలే కాక, డబ్బు అనే దానికి డంబము అనే అర్ధం కూడా ఉంది. డంబము అంటే, స్థితికి మంచిన వేషము అని అర్ధం.


ఏతావాతా ఇంతలా కొండను తవ్వి నేను పట్టిన ఎలుక ఏమిటయ్యా అంటే,

డబ్బు అంటే వొట్టి అబద్ధం అని మనం గ్రహించాలి. డబ్బు అనే పదార్థం వొట్టి మిథ్య. వచ్చి నట్టే ఉంటుంది. రాదు. ఉన్నట్టే ఉంటుంది, ఉండదు. వస్తూనే పోతూ ఉంటుంది. పోతూ వస్తూ ఉంటుంది. నానా రగడా చేస్తుంది. దానికి అల్లరీ ఆగమూ హెచ్చు. ఉన్నప్పటికీ తృప్తి నివ్వదు. లేక పోతే బతక నివ్వదు. లక్ష్మి చంచలమైనదని ఊరికే అన్నారా?

అందు చేత ఈ డబ్బు మాయలో పడి కొట్టుకు పోకుండా జీవితం వేరే విధంగా సార్ధకం చేసుకోడానికి మార్గాలు ఏమైనా వెతుక్కోవాలి. తప్పదు.

ఎందు కంటే,

ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే, నారీ గృహ ద్వారి, జన:శ్మశానే
దేహాశ్చితాయాం పర లోక మార్గే, కర్మా2నుగో గచ్ఛతి జీవ యేక:

అని పెద్దలు చెబుతున్నారు.

మనం సంపాదించు కున్న ధనం ( డబ్బు) మన వెంట రాదు. భూమి మీదే ఉండి పోతుంది.
మనం పోషించిన పశువులు పశుశాల విడిచి మన పార్ధివ దేహం వరకూ కూడా రావు.భార్య ద్వారం దాటి ఇవతలికి అడుగు పెట్టదు (పెట్టరాదని నియతి కాబోలు) బంధువులు పరేత నిలయ ప్రాంతం వరకూ వస్తారు. దేహం చితి వరకూ మాత్రమే వస్తుంది.

మరి, పర లోక ప్రయాణంలో మన వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే, మన పుణ్య పాప కర్మలు మాత్రమే అని దీని భావం.

అందండీ సంగతి.

అయితే, డబ్బే వద్దా, అంటే కావాలి.‘‘ డబ్బు తేలే నట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయి ’’ అని కవి చెప్పాడు

‘‘ వ్చర్ధం నిర్ధనికస్య జీవన మహోదారైరపి త్యజ్యతే’’ అన్నారు. అంటే ధనం లేని వ్యర్ధుడిని జీవన సహచరి కూడా ఫో, ఫోవోయ్ అంటుందిట.

అంచేత, మన గుండె డబ్ డబ్ మని కొట్టుకుంటున్నంత వరకూ డబ్బు కావాలి. కాని అది మన నిజమైన అవసరాలకి మించి అక్కర లేదని తాత్పర్యం. మన సంపాదనకి మనం ట్రష్టీలం మాత్రమే అని అంటారు గాంధీజీ.

అదండీ డబ్బు జాలం ( నెట్) కథ !


9, డిసెంబర్ 2010, గురువారం

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !


భోజ రాజు ముఖం చూస్తూనే కవిత్వం పుట్టుకు వస్తుందిట.

ఒక రోజు భోజుడు కొలువు తీరి ఉండగా, భద్ర మణి అనే మహా పండిత కవి అక్కడికి వచ్చేడు. అప్పటికే భోజుని సింహాసనం ప్రక్కన కుడి వేపు కాళి దాస కవి సుఖాసీనుడై కూర్చుని ఉన్నాడు.
విధి లేని సరిస్థితిలో అయిష్టంగానే భద్ర మణి ఎడమ వేపు కూర్చున్నాడు. అది అతనికి అవమాన కరంగా తోచింది. మనసు కుత కుతలాడి పోయింది. ఎడమ వేపు కూర్చోవడంతో తను కాళి దాసు
కన్నా, తక్కువ అనే ఆత్మ న్యూనతా భావం అతనిని కలచి వేసింది. మరి ఉండ లేక ఈ శ్లోక పాదాలు చెప్పాడు:

గృహ్ణోత్యేష రిపో శ్శిర: ప్రతి జనం కర్షత్య సౌవాజినం
ధృత్వా చర్మ ధను: ప్రయాతి సతతం సంగ్రామ భూమావసి
ద్యూతం చైర్య మధ స్త్రియంచ న పదం .జానా వినాయాం కర:

ఈ మూడు శ్లోక పాదాల అర్ధమూ ఇది:

ఎడమ చేయి ముందుగా శత్రువు శిరస్సును పట్టుకుంటుంది. ముందుకూ వెనుకకూ లాగి గుంజుతుంది. బాణం వేసే ముందు విల్లు పట్టు కుంటుంది. జూదం, స్త్రీలను బలాత్కారం చెయ్యడం, పనికి మాలిన శపథాలు చెయ్యడం మొదలయినవి చెయ్యదు.

ఇలా భద్ర మణి ఎడమ చేయి గొప్ప తనాన్ని పొగడడం ద్వారా ఎడమ వేపు కూర్చోవడం వలన తనకి వచ్చిన చిన్న తనం ఏమీ లేదని చాటుకో డానికి ప్రయత్నించేడు.

వెంటనే కాళి దాసు శ్లోకం నాలుగో పాదాన్ని పూరించి, ఆ కవికి తేరుకో లేని గట్టి చురక అంటించేడు.

కాళి దాసు పూరించిన నాలుగో పాదం ఇది:

దానాద్యితరం విలోక్య విధినా శౌచాధి కారి కృత:

ఎడమ చేతికి దానం చేసే అర్హత లేనందు వలన బ్రహ్మ దానికి నీచమైన పనులు చేయమని నియోగించాడు సుమా !

కాళి దాసు పూరించిన శ్లోక పాదం విని కవి గారికి దిమ్మతిరిగి పోయి ఉంటుంటుంది. కదూ?

అంచేత, ఊరికే కుడి ఎడమల తగువులతో సరి పుచ్చక మనకి దక్కగల గౌరవం మనకు దక్కిన స్థానం బట్టి కాక, మన ప్రతిభా వ్యత్పత్తులను బట్టి ఉంటుందని గ్రహించాలి.


స్వస్తి.

7, డిసెంబర్ 2010, మంగళవారం

నస మంజరి


అజాత మృత మూర్ఖాణాం, వర మాద్యౌ న చాంతిమ:
సకృ ద్దు:ఖ కరా వాద్యా, వంతిమస్తు పదే పదే.

ఈ శ్లోకంలో కవి ముగ్గురి గురించి చెబుతున్నాడు.

ఇంకా పుట్టని వాడు , చని పోయిన వాడు, మూర్ఖుడు.

ఈ ముగ్గురిలో కడపటి వాడి కంటె ముందున్న ఇద్దరే మేలు. అంటే, ఇంకా పుట్టని వాడు, చని పోయిన వాడు - వీళ్ళిద్దరూ ఒక్క సారే దు:ఖాన్ని కలిగిస్తారు. కాని ఈ ఆఖరున చెప్పిన వాడున్నాడే, మూర్ఖుడు , వాడు మాత్రం మాటి మాటికి దు:ఖాన్నే కలిగిస్తూనే ఉంటాడు.

అంటే ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు. అని కవి చెబుతున్నాడు.

అలాంటి మూర్ఖులు వంద మంది ఉండడం కన్నా, గుణవంతుడైన ఒక్క కుమారుడు ఉంటే చాలని కూడా చెబుతున్నాడు.

వర మేకో గుణీ పుత్రో, నచ మూర్ఖ శతైరపి
ఏక శ్చంద్ర స్తమో హంతి, నచ తారా గణో2పి చ.

మూర్ఖులైన పుత్రులు వంద మంది కన్నా, మంచి గుణాలు కలిగిన వాడు ఒక్కడు చాలును. కోట్ల నక్షత్రాల కన్నా, చీకట్లు పార ద్రోలే చంద్రుడు ఒక్కడు చాలును కదా అని దీని భావం.

పరి వర్తిని సంసారే, మృత: కోవా న జాయతే
స జాయతో యేన జాతేన, యాతి వంశ స్సమున్నతిమ్

ఈ సంసారము చావు పుట్టుకలతో కూడినది. కనుక ఇచ్చట చని పోయిన వాడు ఎవడు తిరిగి పుట్టడం లేదు ? కాని, యెవని పుట్టుక వలన వంశం కీర్తిని పొందుతూ ఉందో, వాని పుట్టుక మాత్రమే సార్ధకమైనది. అని దీని భావం.

కులము లోన నొకడు గుణ హీనుడుండిన
కులము చెడును వాని గుణము వలన
చెఱకు వెన్ను బుట్టి, చెరపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినుర వేమ

ఒక గుణ హీనుడు చాలు, మొత్తం వంశానికంతటికీ చెడ్డ పేరు తీసుకుని రావడానికి. చెఱకు గడ చివర వెన్ను పుడితే దాని తీపి అంతా నశించి పోతుంది కదా అని వేమన చెప్పనే చెప్పాడు కదా.

బద్దెన కూడ దీనినే తిరుగ రాసాడు

కొఱగాని కొడుకు పుట్టిన
కొఱగామియె కాదు, తండ్రి గుణముల చెఱచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెఱచు కదరా సుమతీ !

కొడుకులు పుట్ట లేదో అని ఏడిచే వారికి హెచ్చరికగా ధూర్జటి ఈ పద్యం చెప్పాడు.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నే గతుల్
వడసెన్? పుత్రులు లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్?
చెడునే మోక్ష పదంబపుత్రకునకున్ శ్రీ కాళ హస్తీశ్వరా.

బ్రతుకు మీది మమకారంతో అయ్యో, కొడుకులు పుట్ట లేదే, అని ఏడుస్తూ ఉంటారు. కురుపతికి వంద మంది కొడుకులు పుట్ట లేదా? వారి వలన అతనికి ఏ సద్గతులూ లభించ లేదు. పుత్రులే లేని శుకునికి మంచి గతులే లభించాయి. పుత్రులు లేని వారికి మోక్ష పదవి రాదను కోవడం సరి కాదు .

అందు వలన మందితో పని లేదని తెలుసు కోవాలి.

తెలియని కార్య మెల్ల కడ తేర్చుట కొక్క వివేకి చే కొనన్
వలయు, నట్లైన దిద్దు కొన వచ్చు, ప్రయోజన మాంద్య మేమియున్
కలుగదు, ఫాల మందు తిలకంబిడు నప్పుడు చేత నద్దమున్
కలిగిన చక్క చేసి కొనుగాదె, నరుండది చూచి భాస్కరా.

ఒక తెలివయిన వాని సహకారంతో ఎంతటి దుష్కర కార్యాన్నయినా చక్కగా నిర్వర్తించ వచ్చును.
చేతిలో అద్దం కలిగి ఉంటే, దానిని చూసి చక్కగా తిలకం దిద్దు కో వచ్చును కదా.

ఒక్కడు చాలునని చెప్పడాని మరీ ఇన్ని ఉదాహరణలు చెప్పాలా ! ఒక్కటి చెబితే చాలదూ ?
చాదస్తం కాక పోతే ! కథా మంజరి పేరు మార్చి నస మంజరి అని పెట్టుకో, ఫో అంటారా? తమ దయ. మద్భాగ్యం.

స్వస్తి.





2, డిసెంబర్ 2010, గురువారం

దెబ్బల రాజ్యం లో దబ్బఱ నీతులు















అమాయక గిరిజనులను మైదాన ప్రాంత వ్యాపారులు దోపిడీ చేయడంలో అనేక విధాలయిన మెళకువలు
చూపుతూ ఉంటారు. వాటికి చెందిన ఒక దోపిడీ విధానమే అడ్డకి పడ్డ అనేది.

మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకటి రోజులలో తరుచుగా వినిపించే ఈ మాటకి అర్ధం నాకు తెలిసేది కాదు. మా నాన్న గారు చెప్పిన దాని ప్రకారం, అమాయక గిరిజనులకి మైదాన ప్రాంతీయులు అడ్డ ( వెనుకటి కొలమానం. అడ్డ, తవ్వ, సేరు, కుంచం మొదలయినవి. నాలుగు అడ్డలు ఒక కుంచం అనే వారు) తో వారికి కావలసిన ధాన్యమో, బియ్యమో కొలిచి అప్పుగా ఇచ్చే వారుట. కొంత కాలానికి ఆ అడ్డెడు అప్పుకి వారు తీర్చ వలసిన బాకీని చక్ర వడ్డీతో లెక్క కట్టి, దొంగ లెక్కలు వేసి ఇబ్బడి ముబ్బడిగా పెంచి, అధిక మొత్తంలో బాకీ పడినట్టుగా తేల్చి చెప్పే వారుట. అంత బాకీ చెల్లించ లేని గిరిజనులు తాము తీసుకున్న అడ్డెడు అప్పు నిమిత్తం తమ ఇంటిలో ఉండే ఏ ఆవు పెయ్యనో ( దానినే పడ్డ అనే వారు) ఇచ్చేసే వారుట. ఇదీ అడ్డకి పడ్డ కథ. ఇది దోపిడీకి పరాకాష్ఠ .

అఙ్ఞానం, అమాయకత్వం ఉండే చోట కుటిల వ్యాపారులు తమ మోసపు వ్యాపారపు మెళకువ లన్నీ చూపెడుతూ ఉంటారు.

గ్రామాలలో చిల్లర వ్యాపారులు దినుసులను అమ్మడమే కాక, కొనడం కూడ చేస్తూ ఉంటారు.
ఆ దినుసలను వారు కుంచంతో కొలుస్తూ ఉంటారు. తాము రైతు వారీ నుండి దినుసులను కొనవలసి వచ్చి నప్పుడు ‘‘ పెద్దమ్మీ, కుంచం పట్రా ’’ అని ఇంట్లోకి కేక వేసే వారుట. ఇంట్లో రెండు సైజుల కుంచాలు ఉంటాయిట. ఒకటి పెద్దదీ, రెండోది చిన్నదీనూ. వ్యాపారులు రైతు వారీ నుండి తాము దినుసులు కొనడానికి పెద్దమ్మాయిని కుంచం తెమ్మని కేకెయ్యడంలో కిటుకు, ఇంట్లో ఉన్న పెద్ద కుంచం తెమ్మని అనడం, తమకి కొలతకు ఎక్కువగా దినుసులు రావడం కోసం ఇంట్లోంచి పెద్ద రకం కుంచం తెమ్మని సంకేతం, అదే, తాము అమ్మ వలసిన దినుసుల కొలతకి చిన్న సైజు కుంచమయితే, తమకి లాభం కనుక, ’’ చిన్నమ్మాయ్, కుంచం తే ‘‘ అని, చిన్న కుంచం తెమ్మని సంకేతాన్ని పంపే వారని మా నాన్న గారు చెబుతూ ఉండే వారు.

కుటిల వ్యాపారులు ఎన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటారో తెలియ జేస్తూ ఒక కవి ఈ శ్లోకం వ్రాసేడు. చూడండి:

తులేన కించిత్ తులయా చ కించత్, మానేన కించిత్ శపథేన కించిత్
కించిచ్చ కించిచ్చ హర త్యశేషవ, వణిక్సమో నాస్తి ప్రశస్త చోర:

అసలు త్రాసు లోనే కొంత తిరకాసు ఉంటుంది. తక్కెడ సరిగా ఉండదు. ఎప్పుడు తూచినా, ఆ తక్కెడ అమ్మే వాడికే లాభదాయకంగా తప్పుడు తయారీతో ఉంటుంది. ( సరుకులు వేసే తక్కెడ క్రింద అయిస్కాంతం ముక్క పెట్టడంలాంటి గిమ్ముక్కులు కూడానూ)

ఇక, తూచడంలో కొంత మోసం. దుకాణంలో తూకం సరి పోయి నట్టుగానే అనిపిస్తుంది. ఇంటికి పోయి కొలుచు కుంటే, ఎంతో కొంత తరుగు కనిపిస్తుంది. అదెలా జరిగిందో తెలియక జుట్టు పీక్కోవడమే . ఆ కిటుకు మనకి తెలీనంత ఒడుపుగా చేసే వ్యాపారులుంటారు.

ఇక, కొల మానంలో మరి కొంత మోసం, తన నిజాయితీని నిరూపించుకుంటూ వేసే ఒట్ల తో కొంత, యిలాగ కొంచెం కొంచెంగానే కాజేసి, చివరికి ఏమీ మిగల కుండా చేసే వ్యాపారిని మించిన చోరాగ్రేసరుడు మరొకడు ఉండ బోడని కవి ఈ శ్లోకంలో చెబుతున్నాడు.


టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలు తెలిస్తేనా కదా, అంతంత కూడ బెట్ట గలిగేది?

త్రాసు, తూచడం గురించి చెబుతున్నాను కనుక, మీకు రెండు పిల్లులు, ఒక కోతి కథ గుర్తు చేయడం సమంజసం.

రెండుపిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచు కోవడంలో వాటికి తగాదా వచ్చింది. తగవు ఎటూ తేలక, అవి తగువు తీర్చమని ఒక కోతి దగ్గరకి వెళ్ళాయి.

ఆ కోతి సరేనని ఆ రొట్టె ముక్కని రెండు సమాన భాగాలుగా చేసి. ఇచ్చే మిషతో ఒక త్రాసులో రొట్టె ముక్కలు వేస్తుంది. ఒక సారి అందులో ముక్క పెద్దదయి పోయిందనీ, మరొక తూరి ఇందులో ముక్క చాల లేదనీ కబుర్లు చెబుతూ, ఆ రొట్టె ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా త్రుంచి నోట్లో వేసు కోవడం మొదలు పెట్టింది.

వెర్రి పిల్జలులకు జరుగుతున్న దేమిటో అవగతమయే లోపల ఆ కోతి మొత్తం రొట్టెను చప్పరించీసి, త్రేన్చిందిట.

జెల్ల కొడితే, దెబ్బ తినే వాడు తేరుకోక ముందే జెల్ల కొట్టీవాలి అనేది కుటిల వ్యాపారపు నీతి.

దెబ్బల రాజ్యంలో ఇలాంటి నీతులకి విలువ ఎక్కువ మరి.

మరో విషయం -


కథా మంజరిలో ఇది నా 199 వ టపా. మరి , నా 200 వ టపా రేపే విడుదల !

నా 200 వ టపా ... ( విరమణ .. ... కాదు ... ... విరామం )


ఇది నా 200వ టపా. ఈ సందర్భంగా నేను రాసిన వాటిలో కొన్ని టపాలు ఒకే చోట చూడండి ...






























































కథా మంజరిలో నా కథల టపాలు:

















పుస్తక పరిచయాలు:







7. జగన్నాథ రధ చక్రాల్ ... ! ఆ ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులో ?!


ఇతరాలు:








నవలిక


మా శ్రీమతి కథలు




ప్రత్యేకం


నన్ను బ్లాగు లోకానికి పరిచయం చేసిన శ్రీమతి వలభోజు జ్యోతి, శ్రీ చింతా రామ కృష్ణారావు, డాక్టర్ శ్రీమతి సుధా రాణి గార్లకు మరో సారి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నాను.

కౌముది వెబ్ పత్రికలో అనగనగా ఒక మంచి కథ శీర్షికన నా కథలు వేడుక ( జూన్ 2010 ) , గుండె తడి
( నవంబరు2010) ప్రచురించిన కౌముది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నా బ్లాగుని చదువరుల చెంతకు చేర్చిన సంకలినులు కూడలి, హారం, జాల్లెడ, మాలిక , సమూహము వీటి బాధ్యులకు మరీ మరీ ధన్యవాదాలు.

నా బ్లాగు టపాలను ఆదరించిన వారందరికీ నా కృతఙ్ఞతలు.

200 టపాలు పూర్తయ్యాయి. ఇక మీదట నాకు గల వేరే వ్యాపకాల వల్ల కొంత విరామం పాటిద్దామనుకుంటున్నాను. ( పాఠక స్వగతం : హమ్మయ్య ! రక్షించేవు నాయనా ! పండుగ చేసుకుంటాం)

ఇది విరమణ కాదు, విరామమే. ( పాఠక స్వగతం: మళ్ళీ ఈ పితలాటకఁవా? హన్నా !! )


ధన్యవాదాలు ... మీ, కథా మంజరి

మనశ్శల్యాలు


లోకంలో మనస్సునకు చాల బాధ కలిగించే ఏడు విషయాల గురించి ఈ శ్లోకంలో కవి చెబుతున్నాడు.

చూడండి ...

శశీ దివస ధూసరో గళిత యౌవనా కామినీ
సరో వితగ వారిజం, ముఖ మనక్షరం స్వాకృతే:
ప్రభు ర్దన పరాయణ:, సతత దుర్గతి స్సజ్జన:,
నృపాంగణగత: ఖలో మనసి సప్త శల్యాని మే.

నాకు లోకంలో ఏడువిషయాలు మనశ్శల్యాలై నన్ను బాధిస్తూ ఉంటాయి అని కవి వాపోతున్నాడు.

అవి ఏమంటే,

తెల్లవారగానే వెల వెల పోయే చంద్రబింబం
యవ్వనం సడలి పోయిన కామిని
పద్మాలు లేనట్టి చెఱువు
అక్షరం ముక్క లేనట్టి సుందర వదనం
ధనాశా పరుడైన ప్రభువు
సత్పురుషుల నిత్య దారిద్ర్యం
అధికారుల దగ్గర ఎప్పుడూ పరమ తుంటరులకే చేరిక ఉండడం.

ఇవీ కవిగారిని బాధించే ఏడు విషయాలు.

రేయంతా నేల మీద అంతటా చక్కగా పరుచు కున్న వెన్నెల తెల్ల వారగానే వెలవెలబారి పోవడం చూస్తూ ఉంటే ప్రకృతిని ఆరాధించే ఎవరికయినా బాధాకరమే.

యవ్వనం సడలి పోయిన కామిని రూపం చూడనలవి కానిదట.
చెఱువులో పద్మాలు ఉంటేనే అందం.
ఎంత అందగాడయినా, నిరక్షర కుక్షి అయితే, వాడి ముఖం చూడాలనిపించదు మరి.
ధనాశా పరుడైన రాజు ముఖం కూడా చూడ్డానికి పరమ దరిద్రంగా ఉంటుంది.
నిత్యం అష్ట కష్టాలు పడుతూ, దరిద్రం ఓడుతూ ఉండే మంచి వారి స్థితి ఎవరికయినా బాధాకరమే.

ఇక, రాజుల కోటరీలో మంచి వారికి అణు మాత్రమైనా చోటు లేకుండా, నేర చరితులకూ, దుష్టులకూ, దగా కోరులకూ, అవినీతి పరులకూ, వంచకులకూ, మాత్రమే చోటు ఉండడం చూస్తే ఆలోచనాపరులైన వారెవరికయినా బాధని కలిగిస్తుంది కదూ?

1, డిసెంబర్ 2010, బుధవారం

ఆ పైన నీ ఇష్టం


బృహత్సంహిత లోని ఈ శ్లోకం చూడండి ...

జయే ధరిత్ర్యా: పుమేవ సారం, పురే గృహం సద్మని చైక దేశ:
తత్రా2పి శయ్యా, శయనే వరా స్త్రీ, రత్నోజ్వలా రాజ్య సుఖస్య సార:

దేశం ఎంత విశాలంగా ఉండనీ, కేంద్రమైనది నగరమే. నగరం ఎంత పెద్దదిగా ఉండనీ, తన ఇల్లే ఎంతో ప్రీతి పాత్రంగా ఉంటుంది. తన ఇల్లు ఎంత పెద్దదిగా ఉండనీ, దానిలో తన పడక గదే శాంతిని కలిగిస్తుంది. ఆ పడక గదిలో కూడ మిక్కిలి విశ్రాంతిని ఇచ్చేది శయ్య. ఆ శయ్యా సుఖం కూడ పూర్తిగా పొందాలంటే స్వీయానురక్తయై, ఉత్తమురాలైన భార్య వల్ల మాత్రమే మనశ్శాంతి చేకూరుతుంది. అని దీని భావం.

అంటే, మహారాజుకైనా స్వగృహం మాత్రమే శాంతిని ఇస్తుందనీ, అందునా, అనురక్త ఐన భార్య మాత్రమే చిత్త శాంతినీ, సౌఖ్యాన్నీ ఇవ్వగలదనీ తెలుసు కోవాలి.

మన ఇంట లేని సౌకర్యాలు ఎన్నింటిని అతిథి మర్యాదలు చేసే చుట్టాలు సమకూర్చినా, మరీ ఎక్కువ రోజులు అక్కడ ఉండాలనిపించక పోవడం అందరకీ అనుభవం లోకి తరుచుగా వచ్చే విషయమే.

ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుదామా, మన ఇంట , మన పడక గదలో, మన మంచం మీద సేద దీరుదామా అని ఊరికే ఇదయి పోతాం.

ఇది నాది అను కోవడంలో ఉండే తృప్తితో ఏదీ సాటి రాదు.

అందుకే పెద్దలు గృహమే కదా స్వర్గ సీమ అన్నారు.

దానిని స్వర్గ ధామం చేయడమూ, నరక తుల్యంగా మార్చడమూ కూడ మన చేతుల్లోనే ఉంది. కదూ?