10, జనవరి 2011, సోమవారం

ఎంత కష్టం ! ఎంత కష్టం !


‘’ హాయిగా ఇంత వండి పడేసి, మొగుడు ఆఫీసుకి వెళ్ళాక, తిరిగి యింటికి తగలడే వరకూ నీకు పనేం ఉంటుంది చెప్పు? ఏ పత్రికో పట్టుకుని ఆ వెర్రి మొర్రి సీరియల్సూ గట్రా చదవుతూ పడుకోవడమో, లేదంటే, పిచ్చి పిచ్చి టీ.వీ జీళ్ళ పాకం సీరియళ్ళు చూస్తూ గడపడమో తప్పితే ?’’

ఈ రకమయిన మాటలు ఇదే మోతాదులో కాక పోయినా, కొంత మాటల మేకప్ వేసుకుని దాదాపు ప్రతి యింటా విన బడుతూనే ఉంటాయి.

మీరేం చేస్తున్నారని ఎవరయినా అడిగితే ఎందుకో తెలీదు కానీ , కొంచెం అనవసరంగా మొహమాట పడి పోతూ జాబేమీ చేయడం లేదండీ, హౌసు వైఫునిఅని జవాబిచ్చే సగటు ఆడవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం.

జాబ్ చేసే ఆడవారికి తామేదో తీసి పోయి నట్టుగా పాపం , కించ పడుతూ మాట్లాడుతూ ఉండే వారూ కనిపిస్తారు. ఈ వేగవంతమయిన రోజులలో ఉద్యోగం ఆడవాళ్ళకి కొంత వెసులు బాటుని కలిగించేదే కానీ అదనపు సదుపాయం మాత్రం కాదని నాకనిపిస్తూ ఉంటుంది. ఆర్ధిక స్వేచ్ఛ వలన ఆడవాళ్ళకి అదనపు గౌరవంతో పాటు అదనపు సమస్యలూ తెచ్చి పెడుతూ ఉండడం కూడా కొన్ని ఇళ్ళలో కనిపించే విషాదం.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, ఇళ్ళలో ఆడవాళ్ళు చేసే అవధానం ఎలాంటిదో శ్రీమాన్ గరిక పాటి నరసింహా రావు అవధాని గారు చెప్పిన ఒక ప్రసిద్ధ మైన ఆశు పద్యం తెలియని వారి కోసం చెప్పుకుందాం.

అష్టావధానం లో సమస్యా పూరణం, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటానాదం ,పురాణ పఠనం,అప్రస్తుత ప్రసంగం మొదలయిన ఎనిమిది అంశాలు ఉంటాయి కదా. ఈ అంశాల ఎన్నికలో అవధాని అభిరుచిని బట్టి కొన్నిటి స్థానంలో వేరే అంశాలూ చేర్చబడుతూ ఉంటాయి. ఏమైనా అంశాల సంఖ్య ఎనిమిదికి మించదు. ఘంటా నాదం బదులు పుష్ప గణనం, కానీ చదరంగ క్రీడ కానీ ఉండవచ్చును. కొందరు అవధానులు ఈ ఎనిమిది అంశాలలో న్యస్తాక్షరిని చేర్చి అవధానం చేస్తూ ఉంటారు.

పృచ్చకులు నిర్వహించే సమస్య మొదలగు వాటి గురించి క్లుప్తంగా చెప్పు కుందాం,

1. సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక ఛందస్సులో ఒక పద్యం యొక్క నాలుగవ పాదం చెబుతాడు.అతను ఇచ్చిన పాదం కొంత అసంబద్ధంగానో, అసంగతంగానో, అశ్లీలార్ధ ద్యోతకంగానో కనిపించ వచ్చును.హేతు బద్ధంగా అనిపించక పోవచ్చును. కానీ, అవధాని పద్యం యొక్క మీది మూడు పాదాలు చెప్పడంతో ఆ అసంగత్వం ఏదేనా ఉంటే, తొలిగి పోయి చక్కని భావ యుక్తమయిన పద్యం తయారవుతుంది. ఇది సమస్య.

ఉదాహరణకి : ఒక పృచ్ఛకుడు ‘‘ ఈతాకుల గుడిసె లోన ఇనుడు దయించెన్’’ అనే సమస్య ఇచ్చాడు. ఇది పద్యంలోని నాలుగో పాదం. తూర్పు కొండల్లో ఉదయించాల్సిన సూర్యుడు ఈతాకుల గుడిసెలో ఉదయించడ మేమిటి ? అవధాని గారి పూరణతో పద్యంలో ఆ సందిగ్ధత తొలిగి పోతుంది. చూడండి:

సీతా పతి పూదోటకు

ఏతా మెత్తంగ వలయు వేకువ జామున్

తాతా ! తొంగున్నావా ?

ఈతాకుల గుడిసె లోన ఇనుడుదయించెన్.

శ్రీరాముల వారి పూల తోటను చూసు కుంటూ ఉండే తోట మాలి తన ఈతాకుల గుడిసెలో పడుకుని ఉన్నాడు. తెల్ల వారింది. తాతను నిద్ర లేపుతూ మనుమరాలు కాబోలు, అంటోంది:

‘‘ తాతా, సూర్యుడు ఉదయించాడు. రాముల వారి పూల తోటకు ఏతాం ఎత్తి నీళ్ళు పట్టాలి. ఇంకా నవ్వు నీ ఈతాకుల గుడిపెలో పడుకుని లేవ లేదా?’’ అని అవధాని గారి చక్కని పూరణతో పృచ్ఛకుడు సమస్య ఇచ్చి నప్పటి అసంబద్ధత తొలిగి పోయింది కదూ?

2. నిషేధాక్షరి: పృచ్ఛకుడు ఏదో ఒక అంశం యిచ్చి కోరిన ఛందస్సులో అవధాని పద్యం చెప్పడం మొదలు పెడుతూ పాదం తొలి పదంలో తొలి అక్షరాన్ని పలుకుతాడు. వెంటనే పృచ్ఛకుడు తర్వాతి పదాన్ని నిషేధిస్తాడు. అంటే అవధాని ఇక ఆ అక్షరాన్ని ఉపయోగించ కూడదన్న మాట. దానికి బదులు మరో అక్షరాన్ని వేసు కోవాలి. ఉదాహరణకి అవధాని శ్రీరాముని మీద పద్యం చెప్పడానికి సిద్ధ పడి శ్రీ అని అన్నాడను కోండి, పృచ్ఛకుడు అనే అక్షరాన్ని నిషేధిస్తాడు. దానితో అవధాని ర అనే అక్షరానికి బదులుగా మరో అక్షరం వాడాలి. ఇలా పృచ్ఛకుడు ప్రత్యక్షర నిషేధం కానీ, తాను కోరిన చోట నిషేధం కానీ విధిస్తూ ఉంటాడు. నిషేధించిన అక్షరాన్ని వదిలి అవధాని వేరే అక్షరాన్ని ప్రయోగిస్తూ , మొత్తానికి అర్ధవంతమయిన పద్యం చెప్పాలి. అవధానంలో అవధాని ప్రతిభకు నిషేధాక్షరి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి.

3. దత్త పదిలో పృచ్ఛకుడు తనకు తోచిన నాలుగు పదాలు చెబుతాడు. వాటిని వరుసగా ఒక్కో పాదంలో ఉపయోగిస్తూ, అర్ధవంతమయిన చక్కని పద్యం అవధాని చెప్పాలి.

చూడండి, ఒక దత్తపది. ఒక పృచ్ఛకుడు పాలు, పెరుగు, నేయి, నూనె అనే పదాలు ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ భారతార్ధం వచ్చే లాగున ఒక పద్యం చెప్పమన్నాడు.

అవధాని గారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు

పెరుగు చున్నది వానిలో దురితము గన

నే యిలను గల్గ దిట్టి యహితము వాని

నూనె మూర్ఖత తప్పదు యుద్ధ మింక.

నాలుగు పాదాల లో పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలూ వచ్చేయి కదా. ఇక భావం చూడండి:

దుర్యోధనుడు పాండవులకు రాజ్య భాగం ఇవ్వడు. దుర్మార్గం వాడిలో మరీ పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడా చూడం .వాడిలో మూర్ఖత్వం ప్రబలి పోయింది. ఇక యుద్ధం తప్పదు.

4. వర్ణన: పృచ్ఛకుడు కోరిన అంశం గురించి, కోరిన ఛందస్సులో కోరిన వర్ణన చేస్తూ అవధాని పద్యం చెప్పాలి.

ఇవి సాధారణంగా దేవతా వర్ణనలో, ప్రకృతి వర్ణనలో అయి ఉంటాయి.

5. .ఆశువు: అవధాని పృచ్ఛకుడు అడిగిన విషయం మీద చక్కని పద్యం చెప్పాలి. అడిగే వాడు పకోడీ మీద పద్యం కావాలన వచ్చు. కంప్యూటరు గురించి కావాలన వచ్చు దేని గురించయినా పద్యం చెప్పమన వచ్చు. అతనిష్టం. అవధాని ఆశువుగా, ధారాశుద్ధితో మొత్తం పద్యం చెప్పాలి.

6. ఘంటా నాదం (లేదా) చదరంగం (లేదా) పుష్ప గణన (లేదా) తేదీ, వారాల లెక్క :

(a) ఘంటానాదం: అవధానం జరుగు తున్నంత సేపూ ఒక వ్యక్తి ఠంగ్ మని ఒక్కో గంట కొడుతూ ఉంటాడు. అవధానం చివరలో అతడు ఎన్ని గంటలు కొట్టేడో అవధాని లెక్క తప్ప కుండా సరిగ్గా చెప్పాలి.

(b) చదరంగం: ఒక ప్రక్క ఇతర పృచ్ఛకులకు పద్య పాదాలు అవీ చెబుతూనే అవధాని ఒక వ్యక్తితో చదరంగం ఆడాలి. గెలవక పోయినా ఫరవా లేదు కానీ, ఓడిపో కూడదు.

(c) పుష్ప గణన: ఇది కూడా ఘంటా నాదం లాంటిదే. గంటలకు బదులు ఇక్కడ పూల లెక్క ఉంటుంది.

ఒక వ్యక్తి పూల రాశి లోనుండి ఒక్కో పువ్వునూ తీసి ప్రక్కన పెడుతూ ఉంటాడు. అవధాని ఆ పూల సంఖ్య సరిగ్గా చెప్పాలి.

(d) తేదీ వారాల లెక్క: పృచ్ఛకుడు ఏడాది, నెల, తేదీ చెప్పి, ఆ రోజు ఏ వారమో చెప్ప గలరా ? అనడిగితే తడుము కోకుండా అవధాని ఆ వారం పేరు సరిగ్గా చెబుతాడు.

7. పురాణపఠనం: పృచ్ఛకుడు కోరిన గ్రంధం లోనుండి కోరిన భాగం లోని పద్యాలు చదివి,పురాణం చెప్పడం.

8. అప్రస్తుత ప్రసంగం: అవధానం జరుగుతున్నంత సేపూ, అవధాని గారి ఏకాగ్రతను చెడ గొడుతూ ఒక పృచ్ఛకుడు చమత్కారవంతమైన సంభాషణ తనకు తోచిన రీతిని చేస్తూ ఉంటాడు. అవధాని అతనికి తగు రీతిలో , అతనడిగిన దానికి దీటుగా బదులు చెబుతూ ఉండాలి.

అష్టావధానంలో చోటు చేసుకుంటూ ఉండే మరో అంశం వ్యస్తాక్షరి అని చెప్పు కున్నాం కదూ. ఇదెలా చేస్తారంటే, పృచ్ఛకుడు అనుష్టుప్ శ్లోకంలో ఉండే సంఖ్యానుగుణంగా గడులు గీసుకుని సిద్ధంగా ఉంటాడు. అవధానం మొదలయ్యేక, పృచ్ఛకుడు తనకు నచ్చిన అంశం మీద ఒక శ్లోకం చెప్పమంటాడు. సాధారణంగా ఇది కూడా ఏ దేవతా ప్రార్ధనో అవుతుంది. అయితే, శ్లోకమంతా ఒకే సారి కాకుండా, తనకు నచ్చిన గడి సంఖ్య చెప్పి, ఆ గడిలో ఉండ తగిన అక్షరం చెప్పమని అవధానిని అడిగి, అతను చెప్పిన అక్షరాన్ని ఆ గడిలో వ్రాసుకుంటాడు.అవధానం పూర్తయే లోగా మొత్తం అన్ని గడులూ అవధాని అప్పుడూ అప్పుడూ చెప్పిన అక్షరాలతో నిండి పోతాయి. అవధానం చివరలో ఆ అక్షరాలన్నీ కలిసి ఒక పూర్తి అర్ధవంతమయిన శ్లోకం అవుతుంది..

అవధానం లోని అంశాల గురించి ఇక్కడ నేను వ్రాసినది సర్వ సమగ్రం కాక పోవచ్చును. కొంత అస్పష్టత ఉండ వచ్చును. నా తెలియమి కూడా కారణం కావచ్చును. కానీ నాకు తెలిసినంతలో అవధానం లోని అంశాలను వివరించాను. పెద్దలు సరి చేస్తే సరి దిద్దుకుంటాను.

అవధాని పృచ్ఛకులకు ఒకే సారి నాలుగు పాదాలూ చెప్పనవసరం లేదు. చెప్పడు కూడా. ఆవృత్తికి ఒక పాదం చొప్పున చెబుతాడు, అవధానం ముగిసే సమయానికి పద్యం నాలుగు పాదాలూ పూర్తవుతాయి.

ఆ తరువాత అంశం, ధారణ. అవధాని ఒక్కో పాదం చొప్పున అన్ని ఆవృత్తాలలో చెప్పిన మొత్తం పద్యాలు తిరిగి ఆయా అడిగిన వారికి (పృచ్ఛకులకు) ధారగా అప్ప చెబుతాడు. ఎక్కడా తడుము కోరాదు. ఏం చెప్పానని అడుగ రాదు. మొదట చెప్పిన దానికి భిన్నంగా చెప్ప రాదు. ధారణ విజయవంతంగా చేస్తే అవధానం విజయవంతంగా పూర్తయినట్టు లెక్క ! మరో విషయం, మొత్తం అవధాన సమయం నాతి దీర్ఘంగా ఉండ కుండా చూడడం కూడా అవధాని ప్రతిభకు పట్టం కట్టేదే.

ఇంత కష్టసాధ్యమైన అవధానం మన ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా చేస్తూ ఉంటారో ఈ పద్యంలో చూడండి:

అడుగడుగున నిషేధాఙ్ఞ జారీ చేయు

భర్త నిషేధాక్షరార్తిఁదోప

గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ

మాసమ్ము గడప సమస్య కాగ

అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు

దత్తుండు దత్త పదమ్ము కాగ

ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి

వర్ణనీయాంశమై వరలు చుండ

పాలు కూరలు పళ్ళ బండ్ల వారల రాక

ఆశు ధారా కవిత్వార్ధ మనఁగ

అత్తయ్య వేసెడి అక్షింత లవి యన్ని

పాత పురాణంపు పఠన మనఁగ

చీటి మాటికి వచ్చు సెల్లు సందేశాలు

వ్యస్తాక్కరమ్ముల వరుస గాగ

విసుగు తెప్పించెడి వీర ధారా వాహి

అధిక ప్రసంగమై అడ్డు పడఁగ

దినము దినమిట్లు వనితలు తిప్పలు పడి

పూట పూటకు అవధాన పూర్ణ బుద్ధి

తనరు చుండంగ పురుషావధాను లేల?

వర సహస్రావధానులీ పడతు లెల్ల !

.ఆడ వాళ్ళు అవధానంలో అవధాని గారు చేసే పనులన్నీ తమ నిత్య జీవితమనే అవధానంలో ఎలా చేస్తున్నారో చూడండి.

మొగుడు ప్రతీ దానికీ అడ్డు పడుతూ అది వద్దు, ఇది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు అంటూ తల తినేస్తూ ఉంటాడుట. దీనిని నెట్టుకు రావడమే ఆడ వారు చేసే నిషేధాక్షరి .

చాలీ చాలని జీతం రాళ్ళతో, లేదా బొటా బొటీ డబ్బులతో నెల గడపడమే వారికి సమస్య.

అదీ ఇదీ సర్దవే అమ్మా, అంటూ వెంట పడే కాన్వెంటు పిల్లలను ముస్తాబు చేసి, బడికి పంపడమే దత్తపది.

ఇంట్లో బుజ్జి పాపాయిలు ఉంటే నిత్యం వారిని ముద్దాడుతూ, వారికి సేవలు చేయడంతోనే సరి పోతుంది. అదే వర్ణన.

పాలబ్బాయ్, కూరలబ్బాయ్ సండ్ల బళ్ళ వాళ్ళతో చేసే సంభాషణే ఆశువు

ఇక ఇంట్లో అత్త గారు కనుక ఉంటే ఆవిడ గారు వేసే అక్షింతలు, వినిపించే పాత పురాణం అంతా యింతా కాదుట. అదే పురాణపఠనం

ఈ మధ్యలో సెల్ ఫోను రింగవుతూ ఉంటుంది. ఆ బాధ మరీ వర్ణనాతీతం ఇల్లలికి. అది వ్యస్తాక్షరి.

విసుగు తెప్పించే బుల్లి తెర ధారావాహికలు అధిక స్రసంగాలు.

ఇలా రోజూ తిప్పలు పడే వనితలు గొప్ప అవధాన విద్య ప్రదర్శిస్తున్నారు. సహస్రావధానులైన పడతులుండగా, ఇక పురుషావధాను లెందుకండీ ...

నిత్యావధానులైన ఆడవారికి నమోవాకాలు .

తల్లుల కష్టం వెల కట్ట లేనిది. వెల కట్ట రానిదీనూ.

వారికి ఆది వారమూ లేదు, శలవు దినమూ ఉండదు. కదూ?

రిటైర్మెంటు అసలే లేదు.

9, జనవరి 2011, ఆదివారం

కొంచెం టచ్ లో ఉంటే చాలు ...


అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.

అతి పరిచయం వల్ల అలుసై పోతామట. తరుచు వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా అనాదరం కలుగుతూ ఉంటుంది. రోజూ చచ్చే వాడి కోసం ఎంతని ఏడుస్తాం అంటారు కదా, అలాగే, రోజూ కనిపించే వాడు వస్తే ఏమీ పట్టనట్టుగా ఊరుకుండి పోతాం. మలయ పర్వతం మీద మంచి గంధం చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. మనకవి అపూర్వం. చాలా విలువైనవి. కాని అక్కడ ఉండే భిల్ల వనితలు ఆ మంచి గంధం చెక్కలనే వంట చెఱకుగా ఉపయోగించడం చూడ లేదూ ? అంటున్నాడు కవి. అతి పరిచయం వలన అలుసై పోవడ మంటే ఇదే. పని కట్టుకుని పుణ్య క్షేత్రాలకో, దర్శనీయ స్థలాలకో వెళతాం. అక్కడి ప్రతి అణువునీ కళ్ళార్పకుండా చూస్తూ తన్మయులై పోతూ ఉంటాం. కెమేరాలలో ఆ అందమైన
దృశ్యాలను అపురూపంగా బంధిస్తూ ఉంటాం. అక్కడి స్థానికులు మాత్రం మనంతగా విచలితులు కావడం జరుగదు. రోజూ చూసేదా కదా, అనే భావనతో రవంత నిర్లిప్తంగా కనిపిస్తారు.

ఆలు మగలైనా సరే, అప్పుడప్పుడు ఏ పుట్టినింటికో ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి నాల్రోజులు ఉండి వస్తూ ఉండడం మంచిది. ఎడబాటు ఎప్పుడూ మరింత చేరువ చేస్తుంది. అందుకే కదా, మన ప్రబంధ కవులు విప్రలంభ శృంగారానికి అంత ప్రాముఖ్యమిచ్చి, పోషించారు?

అంచేత, మరీ అతుక్కు పోకుండా, తగు మోతాదులో కొంచెం టచ్ లో ఉంటే చాలు ... కదూ !

7, జనవరి 2011, శుక్రవారం

మీకు చేత కాదూ ?

16వ శతాబ్దికి చెందిన రఘునాథ రాయలు, అతని కుమారుడు విజయ రాఘవ నాయకుడు ( 17వ శ.) తంజావూరు ప్రభువులు. గొప్ప సాహిత్య పోషకులు. వారిరువురూ స్వయం రాజా, స్వయం కవి అన్నట్టుగా చక్కని కావ్యాలు రచించారు.
నాయక రాజుల కొలువులో కవులే కాక ముద్దు పళని, రంగాజమ్మ, రామ భద్రాంబ, మధురవాణి మొదలయిన కయిత్రులు కూడ ఉండే వారు. వారిలో రంగాజమ్మ ప్రసిద్ధురాలు. మన్నారు దాస విలాసము అనే కావ్యమే కాక, అనేక యక్షగానాలు రచించింది. విజయ రాఘవుడీమెను చేరదీసి పోషించాడు. ప్రభువు రంగాజమ్మకు దగ్గరవడం సహించ లేని రాణి వాసపు రాణులెవరో రంగాజమ్మను నిందించి ఉంటారు. దానికి రంగాజమ్మ పద్య రూపంలో ఇచ్చిన ప్రత్యుత్తరం చూడండి:

ఏ వనితల్ మముం దలప నేమి పనో? తమరాడువారు గా
రో? వలపించు నేర్పెరుఁగరో ? తమ కౌగిట లోన నుండఁగా
రావిది యేమిరా ! విజయ రాఘవ ! యంచిలు దూరి బల్మిచే
దీవర కత్తినై పెనఁగి తీసుకు వచ్చితినా ? తలోదరీ !

ఈ పద్యానికి చెందిన ఒక చక్కని ఆడియో లింక్ ఇక్కడ చూడండి. ఈ పద్యాన్ని చక్కని కంఠ మాధుర్యంతో ఆలపించిన వారికి ధన్యవాదాలు.



ఏ స్త్రీ లయినా మమ్ము ఆడి పోసు కోవడం తగదు. మీరేమి, ఆడువారు కాదా ? వలపించే నేర్పు మీకు లేదా? మీ కౌగిటిలో ఉండగా బలవంతంగా విజయ రాఘవా, రావేమిరా !, రా !అంటూ మీ అంతిపురం లోకి చొచ్చి కపటంతో ప్రభువులను తీసుకొని రాలేదు కదా ?

ఈ సందర్భంగా విజయ రాఘవుని రసికతను నుతిస్తూ చెప్పిన పద్యం కూడా చూడండి.

ఇంతీ పానుపు పై నిదె
కంతుడు కూర్చున్న వాడు కనుగొను, వహవా !
కంతుడనంగుడు నీ తెలి
వింతేనా ! విజయ రాఘవేంద్రుఁడె చెలియా !

రాణి వాసపు స్త్రీల సంభాషణ ఇది:

ఈ శయన మందిరంలో తల్పం మీద సాక్షాత్తు మన్మథుడు కూర్చుని ఉన్నాడు, చూడవే అని ఒకతె అంటున్నది.

దానికి రెండవ ఆమె ఇలా ప్రత్యుత్తరమిచ్చింది: నీ మొహం ! నీ తెలివి తేటలు ఇంతేనా ? అతడు నీవన్నట్టు కంతుడు ( మన్మధుడు) కాదే. ఎందు కంటే, కంతుడు అనంగుడే. శివ కోపానలంచేత దగ్ధమైన వాడు. అశరీరుడు. మరి, ఇక్కడ సశరీరుడైన అంద గాడు కూర్చుని ఉన్నాడు. ఎవరో తెలుసా ? ఈతడు మన విజయ రాఘవ నాయకుడే, చెలీ !

( ప్రభువులు మన్మధాకారులని భావం)

5, జనవరి 2011, బుధవారం

అన్న దాతా సుఖీ భవ !


వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోంది, అక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.

‘‘ పకోడీలు కావయ్యా, బజ్జీలు ...’’ అన్నాను.

‘‘ ఏవో ఒకటి, అక్కయ్య గారూ, వేగిరం తెండి , నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.

అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.

ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:

పంక్తిభేదే పృథక్పాకే, పాకభేదే తథా2కృతే,

నిత్యం చ గేహకలహే, భవితా వసతి స్తవ.

ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటే, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ ? అలాగన్న మాట.

వడ్డించే వాడు మన వాడయితే, కడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితే, ఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువా, కొందరకి కొంచెం తక్కువా, కొందరకి కొసరి కొసరి, కొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.

అలాగే, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయి, ఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.

అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.

అలాగే, నిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.

అంటే, పంక్తి వడ్డనలో భేదం పాటించే వారింట, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింట, అసలే వండు కోని వారింట, నిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.

లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.

అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.

నింపాదిగా, శ్రద్ధగా భోజనం చేయాలి.

భుంజానో న బహు భ్రూయాత్, న నిందేదపి కంచన

జుగుప్పసితకథాం నైవ, శ్రుణుయాదపి వా వదేత్.

భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.

చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:

ఉష్ణ మశ్నీయాత్, స్నిగ్ధ మశ్నీయాత్, మాత్రావ

దశ్నీయాత్, జీర్ణే2శ్నీయాత్, వీర్యా2విరుద్ధ మశ్నీయాత్

ఇష్టే దేశే2శ్నీయాత్, నాతిద్రుత మశ్నీయాత్, నా2తి

విలంబిత మశ్నీయాత్, అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,

ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.

వేడి పదార్ధాలనే తినాలి.

చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )

మితంగా భుజించాలి.

ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.

ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.

మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోట, శుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.

త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.

అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.

అతిగా మాటలాడుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.

ఏకాగ్ర చిత్తంతో తినాలి.

ఏ పదార్ధం ఎంత అవసరమో, హితమో తెలుసుకుని అంతే తినాలి.

ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.

అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.

ఏకఏవ నభుంజీత, యదిచ్ఛేత్సిద్ధి మాత్మన:

ద్విత్రిభి ర్బహుభి స్సార్ధం, భోజనం తు దివానిశమ్,

పగలు కానీ రాత్రి కానీ, ఒంటరిగా తిన కూడదు. ఇద్దరో, ముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.

ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.

విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.

ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.

కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:


పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన

ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు

ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని

చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు

ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత

మని జాగు సల్పెడి యల్పుఁడొకడు

ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని

కడను రాఁజూచు ముష్కరుఁడొకండు

కుడి యింటను హాయిగా కూరుచుండి

వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు

వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు

ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.

పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.

ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.

తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.

ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.

హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.


ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.

ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.

( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)

పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.

వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.

ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.

ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.

ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.

కిం తు మద్యం స్వభావేన, యథైవా2న్నం తథా స్మృతమ్

ఆయుక్తియుక్తం రోగాయ, యుక్తాయుక్తం యథామృతమ్

మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)

స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.

తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.

మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !!

అంటాడు గురజాడ.

ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.

అలాగే, నాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.

దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.

మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం

ఇక,.

భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -

భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్

అని తొలి పాదం రాసేక , ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపం, అని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.

మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:

ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,

నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.

నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.

వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.

ఒక సారి, పండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూ, టై, హేటూ, బూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.

పండితుడు నవ్వి, అది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.

ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.

‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీ, భోజనం ముందొకటీ, తర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.

కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.

‘‘నా సలహా పాటించావా ? ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.

‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూ, రోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.

ఇదిలా ఉంచితే, తిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం

తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

తినగ తినగ వేము తీయనుండు.

అన్నమో రామచంద్రా !

అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.

వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.

ఇక,

తిండి అంటే అన్నం తినడమే కాదు.

లంచాలు తినడం, బుర్ర తినడం, సమయం తినడం, క్రికెట్ లో ఓవర్లు తినడం, దేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓ, ఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.

మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.

‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.

మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.

తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.

స్వస్తి.

2, జనవరి 2011, ఆదివారం

జగన్నాధ రధ చక్రాల్ ... ఆ ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులో ?!


ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారి కొత్త పుస్తకం జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య వీక్లీ మొదటి పేజీ) విశాలాంధ్ర వారి ప్రచురణగా 2011 కొత్త సంవత్సరం మొదటి రోజున వెలువడింది. ఈ సందర్భంగా విశాలాంధ్ర వారి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కవి శివా రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.శర్మ గారు ఈ పుస్తకాన్ని తమ అన్నా వదినలు అయలసోమయాజుల గణపతి రావు, నాగ రత్నం దపంతలకి అంకితం చేసారు.

నవ్య వార పత్రిక సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించేక జగన్నాథ శర్మ గారు నవ్య వీక్లీ లో హరహర మహా దేవ ! అనే శీర్షికతో మొదలు పెట్టి ఈ మొదటి పేజీ రచనలు చేస్తున్నారు ఇది నవ్య పాఠకులను విశేషంగా అలరిస్తూ వస్తోంది. వీక్లీ చేతిలో పడగానే మొట్ట మొదట ఈ మొదటి పేజీ సంపాదక రచనను చదవనిదే మిగతా పుటల జోలికి వెళ్ళని అసంఖ్యాక పాఠక శ్రేణి తయారయింది. అద్భుతమైన శైలితో వివిధ సామాజికాంశాలను అలవోకగా తడుముతూ సానుకూల దృక్పథంతో పాఠకులను ఈ రచనలు విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. జీవితం పట్ల ఒక ఆశాహ దృక్పథాన్ని ప్రోది చేస్తూ, వ్యక్తి చైతన్యాన్ని పెంపొందించేలా ఈ కథనాలు తెలుగు పత్రికా రచనలో ఒక బాధ్యతాయుతమైన పాత్రను నిర్వర్తిస్తున్నాయి. అలా వ్రాస్తున్న మొదటి పేజీ రచనల నుండి ఏర్చి కూర్చిన 92 రచనలతో ఇప్పుడీ పుస్తకం అందంగా వెలువడింది.

పుస్తకాన్ని చూడగానే కొనాలనిపించేంత అందంగా రమణ జీవి గారు భావ స్ఫోరకమైన టైటిల్ డిజైన్ చేసారు.

పుస్తకం వెనుక అట్ట మీద ప్రచురించిన పెద్దల అభిప్రాయాలు చూడండి ...

నవ్య వీక్లీ సంపాదకులుగా జగన్నాథ శర్మ గారు సాగు చేసిన ఙ్ఞాపకాల తోటగా ప్రచురణ కర్తలు

తమ అమూల్యాభిప్రాయం వెలువరిస్తే,

ప్రముఖ రచయిత ముక్తవరం పార్ధ సారధి ఇలా అంటున్నారు:

ఇవి కథలు కావు.వ్యాసాలు కావు. మ్యూజింగ్స్ కూడా కావు. నవ్య వీక్లీకి సంపాదకుడిగా ఉన్న జగన్నాథ శర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ ‘ప్రోజ్ పాయెమ్స్’ ఆయన స్మృతి వల్మీకాలు. ఙ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగ భరితంగా, గుండె గొంతుకలో అడ్డు పడినట్టు పదాలలో బంధించడం మాత్రం జగన్నాథ శర్మ గారికే సాధ్యం. ఇవి చదువుతూ ఉంటే ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది. మరోసారి మనస్సు కలుక్కుమంటుంది.. లేదా నాస్టాల్జియాతో వెన్నులో చలి పుట్టి ‘ ఇలా ఉండేదా ఆనాటి బతుకు’ అని మనకు తెలియకుండానే మౌనంగా రోదిస్తాం.కనిపించని కన్నీరూ, పంటి కింద బిగపట్టిన బాధా, చిన్ననాటి కలల జలతారు దృశ్యాలూ వీటిలో మనల్ని పలకరిస్తాయి.ఇవి శర్మ గారు మనకిచ్చిన చిరు కానుకలు‘.

మరో రచయిత ఓలేటి శ్రీనివాసభాను ఏమంటున్నారో చూడండి:

పడికట్టు పదాల్లేవు. పనికి రాని ఉపన్యాసాలూ లేవు. ఆరితేరిన కథకుడు తనదైన శైలిలో రాసిన కథనాలు ఇందులో ఉన్నాయి. సంపాకీయం అంటే ఎత్తయిన శిఖరమ్మీదో, ఏకాంతంలోనో కూర్చొని రాసిన ప్రవేశికలు కావివి. కథాకథన శైలిలో ఆవిష్కరించిన అవతారికలివి. వీటిలో ఆశలున్నాయి. ఆకాంక్షలున్నాయి. ఆశయాలూ, అనుభూతులూ ఉన్నాయి. సమస్యల పట్ల సానుభూతితో స్పందించి, సానుకూలమైన పరిష్కారాన్ని అందించడం ఈ‘జగన్నాథ రధ చక్రాల’ విశిష్టత. బియ్యం గింజ మీద అక్షరాలు రాసినట్టుగా గుప్పెడు వాక్యాల్లో గుండెను కమ్ముకునే భావాలకు పటం కట్టి, సంపాదకీయాలకు సరికొత్త పట్టం కట్టిన ప్రవీణ్యం ఇందులో ఉంది. ఎప్పుడు చదివినా జీవితాన్ని ప్రతిబింబించే, మనిషికి ప్రాతినిధ్యం వహించే శాశ్వత విలువలు ఇందులో ఉన్నాయి.

శర్మ గారి ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులు ఉన్నాయో ! సూదంటురాయిలా ఆకర్షించే ఈ శీర్షికలే చెబుతాయి. మచ్చుకి కొన్ని చూడండి:

కొమ్మా లేదు ! కోకిలమ్మా లేదు !

మీసాల తాతయ్య పల్లీలు

చిగురు తొడిగిన శ్రమ

పునుకుల పున్నమ్మ

ఆకు పచ్చని ఙ్ఞాపకం

బుడ బుక్కలు

కన్నీరు కూడా వరమే

జజ్జనకరజనారే ! జనకుజన జనారే !

తూనీగ ... తూనీగ

ఙ్ఞాపకాల సన్నజాజులు

పరమ శివుడు, పిల్ల చేష్టలు

వేసవి వెన్నెల

చెట్టెక్క లేని చిన్న తనం ...

ఇలా రాస్తూ పోతే మొత్తం అన్ని శీర్షికలనూ పేర్కొనాలసి వస్తుందేమో !

జగన్నాథ శర్మ గారి గురించి ప్రత్యేకంగా వ్రాయాల్సిన పని లేదు.

13 -4 - 1956 లో విజయ నగరం జిల్లా, పార్వతీ పురంలో పుట్టిన వీరు ప్రవృత్తి రీత్యా రచయిత, వృత్తి రీత్యా పత్రికా రచయిత. దాదాపు అయిదు వందల కథలు, అయిదు నవలలు, అనేక వ్యాసాలు వ్రాసారు.

సినిమా, టీవీ రంగాలలో పనిచేసిన విశేషానుభవం ఉంది. ప్రముఖ టీవీ ఛానెళ్ళలో వీరు రాసిన టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా ఉంటున్నారు . వెనుకటి తరానికి చెందిన గొప్ప సంపాదకులకు తీసిపోని విధంగా, కాలానుగుణమై మార్పులను ఆమోదిస్తూనే, నిత్యం ఏదో కొత్త దనాన్ని ప్రదర్శిస్తూ, నవ్య వార పత్రికను అటు సగటు పాఠకుల పత్రికగాను, ఇటు రచయితల పత్రికగాను తీర్చి దిద్దుతున్నారు. పురా పత్రికా రంగ వైభవాన్ని గుర్తనకు తెచ్చే లాగున దీపావళి సంచికలు ప్రచురించడం, ఒక శ్రీశ్రీ ప్రత్యేక సంచికను తీసికొని రావడం, వారం వారం నవ్య నీరాజనంతో రచయితలను పరిచయం చేయడమే కాక వారి కథలలో ఒక గొప్ప కథను పునర్ముద్రించడం - సంపాదకునిగా వీరి నిబద్ధతకు కొలబద్దలుగా చెప్పుకో వచ్చును.

ఇంతవరకూ ప్రచురితమైన వీరి పుస్తకాలు:

పాల పిట్ట కథలు (ప్రపంచ బాలల జానపదకథలకు అనుసృజన)

పేగు కాలిన వాసన (కథలు)

మహా భారతం (బాలల కోసం సరళ వ్యావహారికంలో)

రాబోయే వీరి పుస్తకాలు:

మహా భారతం ( తక్కిన సంపుటాలు )

అగ్రహారం కథలు

మా ఊరి కథలు

ఇది విశాలంధ్ర వారి ప్రచురణ. విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను దొరుకుతుంది.

192 పుటలున్న దీని వెల రు. 90 మాత్రమే.

మరెందుకాలస్యం ? మనమూ వారి ఙ్ఞాపకాల తోటలో విహరిద్దామా !

30, డిసెంబర్ 2010, గురువారం

కోతుల రాజ్యంలో కోదండ రాముడు లేడా ?


కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటే, చూడవోయ్, బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామని, చూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతే, మరేమిటి చెప్పండి ? మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూ, అభినయ విశేషాలూ, సంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటే, మా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు. అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితే, సమయం వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు. కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో దిట్టలు. అర చేతిలో వైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీ, వీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేక, ప్రతి ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడక, నడత, మాట తీరు, ప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాం, మనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం. కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్ బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనతం విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటే, ఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదం, అధికారం, తెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరి, ఒకే చోట ఈ నాలుగూ కూడితే, చెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలి, దాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?
స్వస్తి.

29, డిసెంబర్ 2010, బుధవారం

టిక్కెట్టు డబ్బులు వాపసు చెయ్యరూ ?


ఈ శ్లోకంలోని చమత్కారాన్ని గమనించండి:

ప్రాయో ధనవతా మేవ, ధన తృష్ణా గరీయసీ
పశ్య కోటి ద్వయాసక్తం, లక్షాయ ప్రవణం ధను:

డబ్బు మీద వ్యామోహం అందరకీ సర్వ సాధారణమే అయినా, బాగా ధనవంతులయిన వారికి ధనం మీద ఆశ మరీ ఎక్కువగా ఉంటుందిట. కోట్లు కల వారు కూడ లక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారుట. ఇదీ ఈ శ్లోక భావం.

శ్లోకంలోని రెండవ పాదం గమనించండి.

కోటి అనే పదానికి వంద లక్షలు అనే అర్ధమే కాక, వింటి కొప్పు ( ధనుస్సు చివర ) అనే అర్ధం కూడా ఉంది. అందు వల్ల ధనుస్సునకు రెండు కోట్లు ( రెండు చివరలు) ఉన్నాయన్నమాట !

ధనుస్సు ఎప్పుడూ ఛేదించ వలసిన లక్ష్యం వేపే గురిపెట్టి చూస్తూ ఉంటుంది.

లక్ష అనే పదానికి కూడ వంద వేలు అనే అర్ధమే కాక, గుఱి అనే అర్ధం కూడా ఉంది.

కనుక, రెండు కోట్లు గల ధనుస్సు ఎప్పుడూ లక్ష కోసం ( ఛేదించ వలసిన లక్ష్యం కోసం ) ఎదురు చూస్తూ ఉంటుందన్న మాట.

అలాగే, రెండు కోట్లు కల వాడు కూడా (మరో) లక్ష కోసం చూస్తూ ఉంటాడు. ఆశాపాశము కడున్నిడుపు, లేదంతంబు ....

ఎప్పుడో చదివిన ఒక జోక్ గుర్తుకు వస్తోంది. వెనుకటికి, ఓ ఊళ్ళో ప్రదర్శన జరుగుతూ ఉండగా సినిమా హాలు ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది. చాలా మంది గాయ పడ్డారు.హాలు యాజమాన్యం వారు వచ్చి, అందరినీ బ్రతిమాలుకుని అందరకీ వైద్యం చేయించుకొమ్మని తలాయింతా ఇచ్చి, ఇళ్ళకు పంపి వేసారుట.

ఒక ప్రేక్షకుడు మాత్రం డబ్బు అందుకుని కూడా సీటు లోనుండి కదల్లేదు.

హాలు యజమాని సవినయంగా అడిగేడు: ‘‘ తమకి మరేమయినా కావాలా ?’’

ప్రేక్షకుడు నసుగుతూ : ‘‘ మరే, సినిమా పూర్తిగా చూడనే లేదు, టిక్కెట్టు డబ్బులు వాపసు యిప్పిస్తే ...’’





28, డిసెంబర్ 2010, మంగళవారం

కానుకల కథా కమామీషూ !


ఎవరింట్లోనో, ఏదో వేడుక జరుగు తోంది. వెళ్ళాలి. అయితే, వట్టి చేతులతో వెళ్ళ లేం కదా? ఏదో ఒక కానుక తీసికొని వెళ్ళడం సముచితం. ఏం పట్టి కెళితే బావుంటుందో ఒకంతకి నిర్ణయానికి రాలేం. కుటుంబ సభ్యలు ఒక్కొక్కరూ ఒక్కో సలహా పారేస్తూ ఉంటారు. అదంటే యిదనీ, ఇదంటే అదనీ సూచనలు పరంపరగా వస్తూ ఉంటాయి. చివరకి విసిగి పోయి, మనకు తోచినంత నగదు కవర్లో పెట్టి ఇవ్వడానికి సిద్ధ పడి పోతూ ఉంటాం.

సమయానుకూలంగా , సమయోచితంగా ఎదుటి వారికి కానుకలు ఇవ్వడం కూడా ఒక కళ. సమయోచిత వస్త్రధారణ లాగే ఇది కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. సందర్భ శుద్ధి లేని మాటలూ. ప్రవర్తనా కూడా వికటించి, హేళనలకు పాత్రములవుతాయి. చావు యింటికి పరామర్శకి బయలు దేరి, పట్టు బట్టలు కట్టుకుని వెళ్ళం కదా? తద్దినం బోయినం తిని, త్రేన్చి, అన్నదాతా సుఖీ భవ ! అని వాగడం మంచిది కాదు కదా ?

పిల్లల పుట్టిన రోజుకి ఇవ్వతగిన కానుకలు, వివాహ సందర్భంగా వధూవరులకు ఈయ తగిన కానుకలు, ప్రేమికులు పరస్పరం ఇచ్చుకో తగిన బహుమతులు, షష్టి పూర్తి సందర్భంగా ఇచ్చేవి, నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఇవ్వతగినవి, పదవీ విరమణ కానుకలు ... ఇలా ఈ వింగడింపు చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది.

ఏతావాతా ఎవరింటి కార్యక్రమానికి వెళ్ళినా, వట్టి చేతులతో వెళ్ళ కూడదన్నది దీని సారాంశం.
ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నారు పెద్దలు. ఒక పండు, పత్రి, పువ్వు, లేదా చివరాఖరకి నీళ్ళు సమర్పించు కోవాలి తప్ప, చేతులు ఊపుకుంటూ వెళ్ళడం తగదు.

రిక్త హస్తాలతో వెళ్ళరాని తావులు ఏవో క్రింద శ్లోకంలో మనువు చెబుతున్నాడు.

అగ్నిహోత్రం గృహం క్షేత్రం, గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్.

అగ్నిహోత్రం దగ్గరకి, స్వగృహం దగ్గరకి, పుణ్యక్షేత్ర దర్శనానికి పోయి నప్పుడు, గర్భిణీలు, ముసలి వారు,పిల్లలు,
రాజు, దైవము, గురువు - వీరి వద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళ కూడదు. ఏదో ఒక కానుక తీసికొని పోచి సమర్పించాలి అని దీని భావం.

ఈ జాబితాలో స్నేహితుల ప్రస్తావన లేదు. కాని, మైత్రీబంధం కలకాలం నిలబడాలంటే చిన్న చిన్న కానుకలు ఒకరిరి కొకరు అడపాదడపా ఇచ్చుకుంటూ ఉండాలి.

బాల సఖుడు శ్రీ కృష్ణుని వద్దకు అటుకుల మూటతో వెళ్ళిన కుచేలుని కథ చూదాం ....

కుచేలుడు బహుకుటుంబీకుడు. గంపెడు సంతానం. ఎలాగో ఒకలాగ సంసారాన్ని లాగు కొస్తున్నాడు. బతుకు బండి మరి ముందుకు సాగ లేక కుయ్యో, మొర్రోమంటూ మొరాయిస్తోంది. కటిక దారిద్ర్యం యింట తాండవస్తోంది. బిడ్డలు ఆకలి బాధతో కృశించి, ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకులూ, గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటే, ఆ తల్లి విలవిల లాడి పోయింది. ఇహ లాభం లేదు. మీ బాల సఖుడు కన్నయ్య దగ్గరకి పోయి రండి .ఏమేనా ఇస్తాడు అని ఉపాయం చెప్పింది.

బాలసఖుండైన యప్పద్మ నేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మనము నుద్ధరింపుము; హరి కృపా క
టాక్ష రవి దీప్తి వడసి మహాత్మ ! నీవు

స్వామీ ! కృష్ణుడు మీ బాల్య సఖుడు. ఆ మహానుభావుడిని దర్శించి రండి.అతని కృపాకటాక్షం పొంది దారిద్య్రంతో తల్లడిల్లుతున్న పిల్లలను ఉద్ధరించండి అని వేడుకుంది.

కలలో కూడా ఎన్నడూ తలచుకోని కష్టాత్ముడు కూడా ఆపద కాలం లో ఒక్క తూరి తలచుకుంటే, వాడికి సకల భోగాలూ ఇస్తాడే, అవసరపడితే తనని తానుగా సమర్పించుకుంటాడే, అట్టి మహనీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే వారికి సమస్త సంపదలూ ఇవ్వకుండా ఉంటాడా ? అని బోధించింది.

సరే వెళ్తానన్నాడు కుచేలుడు. అయితే, వట్టి చేతులతో ఎలా వెళ్ళడం ? అని సంశయించేడు. దానికామె నిజమే సమా అని, అటుకులను కొన్నింటిని అతని చిరిన వస్త్రపు కొంగులో ముడి వేసింది. ఇహ వెళ్ళి రండని అంది. బయలు దేరాడు కుచేలుడు.
గోవింద దర్శనోత్సాహంతో బయలు దేరాడే కానీ కొన్ని సంశయాలు అతనిని పట్టి పీడిస్తున్నాయి.

ద్వారకా నగరంబు నేరీతి జొత్తును ? భాసురాంత:పురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ దర్శింపఁగలనొ? తద్ద్వార పాలు
రెక్కడి విప్రుడ ? నిందేల వచ్చెద ? వని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్ధశూన్యుండ నేను ;

నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె ? యాతఁ
డేల నన్ను నుపేక్షించు ? నేటి మాట
లనుచు నాద్వారకాపుర మతఁడు సొచ్చి.

ద్వారక లోనికి ఎలా ప్రవేశిస్తాను ?అంతి పురంలో ఉన్న ఆ పుండరీకాక్షుని ఎలా చూడ గలను ? ద్వార పాలకులు అడ్డగిస్తే ఏందారి ? పోనీ వారికి ఏదయినా బహుమానం (లంచం) ఇద్దామంటే చేతిలో చిల్లి గవ్వ లేని కటిక దరిద్రుడిని. ఇంతకూ నా భాగదేయం ఎలా ఉందో, ఏమిటో ? అయినా, నా పిచ్చి కానీ, ఆ స్వామి నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడులేఇలా అనుకుంటూ కక్ష్యాంతరాలు గడచి, కడకు కన్నయ్యను దర్శించు కున్నాడు.

కృష్ణుడు తన బాల సఖుని అత్యంత ఆదరంతో అక్కున చేర్చు కున్నాడు. గొప్ప ఆతిథ్యమిచ్చి సంభావించాడు.

సరసన కూర్చుండ బెట్టుకుని, బంగారు కలశం లోని నీళ్ళతో కుచేలుని పాదాలు కడిగాడు. ఆ నీటిని భక్తిగా తల మీద చల్లు కున్నాడు.కస్తూరి, పచ్చ కప్పురము కలిపిన మంచి గంధం బాల సఖుని మేని మీద పూసాడు.మార్గాయాసం తీరే లాగున అగరు ధూపం వేసాడు. సవినయంగా వీవెనతో విసిరాడు మణిమయ దీపాలతో నివాళులర్పించాడు. మిత్రుని సిగలో పూల దండలు ముడిచాడు. కర్పూర తాంబూలం యిచ్చాడు. గోదానం చేసాడు.ఆదర పూర్వకంగా యిలా బాల సఖుని స్వాగతించేడు.

ఆ ఆతిథ్యం స్వీకరించిన కుచేలుని శరీరం పులకించి పోయింది. కృష్ణుని పట్టపు దేవేరి కూడ కుచేలునికి వింజామరలు వీచి సేవించింది.

ఈ అద్భుత దృశ్యం చూసి అంత:పురకాంతలు విస్మయం చెంది యిలా అనుకున్నారు:

ఏమి తపంబు సేసెనొకొ ! యీ ధరణీ దివిజోత్తముండు తొల్
బామున ! యోగి విస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధి నాథు నిజతల్పమునన్ వజియించి యున్నవాఁ
డీ మహనీయ మేర్తి కెనయే ముని పుంగవు లెంతవారలున్ ?

ఈ బ్రాహ్మణుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా ! మునపటి జన్మలో ఎంతటి గొప్ప తపమాచరించాడో కదా ? యోగివంద్యుడైన పంకజనాభుని పానుపు మీద అధివసించాడు ! ఎంత లేసి ముని శ్రేష్ఠులు కూడ ఈ మహానుభావునికి సాటి రారు కదా !

తర్వాత మిత్రులిద్దరూ గురుకులం లో గడిపిన మధుర దినాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ తలపోతలతో మైమరచి పోయారు.

అంతలో శ్రీకృష్ణుడు కుచేలుని చినిగిన ఉత్తరీయంలో ముడి వేసి తెచ్చిన మూటను విప్పి, గుప్పెడు అటుకులను ఆదరంతో ఆరగించాడు.

మరో పిడికెడు అటుకులను తిన బోతూ ఉంటే రుక్మిణీ దేవి:‘‘ స్వామీ ! ఇతనికి సకల సంపదలూ అందించడానికి మీరు మొదట తిన్న పిడికెడు అటుకులు చాలును.’’ ఇక తినకండి. అంటూ వారించింది.

ఆ యింట తనకు దక్కిన మర్యాదలకు కుచేలుడు అమితానందం చెందాడు.ఇలా భావించాడు:

శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె ; నెన్న ’ దరిద్రుఁడు సంపదంధుడై
కానక తన్నుఁజేరఁ‘డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వ వస్తు పరిపూర్ణునిఁగా ననుఁ జేయ కుండునే ?

నా చెలికాడు శ్రీకృష్ణుడు నన్ను బాగానే సత్కరించాడు. బాగానే ఉంది. కానీ నాకు ధనమేదీ ఇవ్వాలని అతను అనుకున్నట్టుగా లేదు. దరిద్రుడనైన నేను సంపన్నుడ నైతే గర్వాంధకారంతో తనను సేవించనని తలచేడు కాబోలు ! లేక పోతే, ఆశ్రిత జనుల ఆర్తిని పోగొట్టే ఆ కృపా సముద్రుడు నన్ను ఐశ్వర్యవంతునిగా చేయ కుండా ఉంటాడా ?


ఇలా పరిపరివాధాలుగా ఆలోచిస్తూ తన ఊరు చేరుకున్న కుచేలునికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది ! దరిద్రానికి నిలయమైన తన కొంప అప్పుడక్కడ లేదు. దాని స్థానంలో ఇప్పుడొక విలాస తమయిన భవనం కనిపిస్తోంది. అతని దరిద్రమంతా పటాపంచలై పోయింది.

కుచేలుని ఎదుట సూర్య చంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి కట్టడాలూ, శుక పిక మయూరాలతో నిండిన చక్కని ఉద్యాన వనాలూ, వికసించిన తామరలతో, కలువలతో కనులు పండువు చేస్తున్న సరోవరాలూ, మణికంకణాలూ, వివిధ ఆభరణాలు ధరించిన దాస దాసీజనమూ, కలిగిన ఒక అద్భత మందిరాన్ని చూసి, ఇది ఏ పుణ్యాత్మునిదో కదా ! అని అబ్బుర పడ్డాడు. ఆ దివ్య భవంతి తనదే అని తెలుసుకుని అమితానందం చెందాడు.

ఈ సంపదలన్నీ శ్రీకృష్ణుని కృపాకటాక్షం వల్లనే సిద్ధించాయని సంతోషించాడు.

నేను నా బాల సఖుని వద్దకు అర్ధ కాంక్షతో వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడుగ కుండా నాకు వీడ్కోలు పలికి పిమ్మట వీటిని నాకు సమ కూర్చాడు.

భక్తులు సమర్పించిన లేశమాత్రమయిన పదార్ధాల నయినా దానిని కోటి గుణితంగా భగవంతుడు స్వీకరించి మన్నిస్తాడని అనడానికి కుచేలుని కథ ఒక గొప్ప ఉదాహరణ అని చెప్ప వచ్చును.

ఇదీ కుచేలోపాఖ్యానం.

చివరిగా ఒక మాట.

కానుకలు తీసి కోవడమే కాదు ; ప్రతి కానుకలు ( రిటర్న్ గిఫ్ట్ లు ) ఇచ్చే సంస్కారమూ అలవరచు కోవాలి.

ప్రతి కానుక అంటే, దేవదాసు పార్వతికి ఇచ్చిన కానుక లాంటిది కాదండోయ్ !
పరికిణీ చాటున తెచ్చిన తాయిలాన్ని పార్వతి దేవదాసుకి ఇస్తే, అంతా తినేసి, ఏదో విషయంలో అలిగి చేతి కర్రతో పార్వతికి దేవదాసు ఒకటి ఇచ్చు కోవడం గుర్తుంది కదూ ! చంద్రునిలో మచ్చ లాగున పార్వతి నుదుటుటి మీద పాపం, ఆ మచ్చ అలాగే ఉండి పోయింది. ఆ అందమైన మచ్చతో మహానటి సావిత్రి ముఖారవిందం ఈ జన్మకి మరిచి పోగలమా ?

కానుకలు ఇవ్వడమూ, ప్రతి కానుకలు ఇవ్వడమూ కూడా ఓ కళ ! కదూ ?!!

ఇదండీ, కానుకల కథ !!

ఇక స్వస్తి.



27, డిసెంబర్ 2010, సోమవారం

వాగుడు కాయలకు ఓ ఝలక్ !


అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

సుప్రసిద్ధ మయిన ఈ వేమన పద్యం వివరించే అర్ధమే కలిగిన ఒక సంస్కృత శ్లోకం చూదామా ?

నిస్సారస్య పదార్ధస్య, ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ధ్వని స్తాదృక్ , యాదృ క్కాంస్యే ప్రజాయతే.

నిస్సారములయిన అల్ప వస్తువులకు ఆడంబరం ఎక్కువగా ఉంటుంది.
కంచు మ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా !

26, డిసెంబర్ 2010, ఆదివారం

బాలల కోసం ఓ బహుమతి - జగన్నాథ శర్మ గారి సరళ వచన మహా భారతం


బాలల కోసం సరళ వ్యావహారికంలో అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ రచించిన మహా భారతం (ఆది పభా అరణ్య పర్వాలు ) హైదరాబాద్ పాలపిట్ట బుక్స్ వారు ఇటీవల వెలువరించారు.

పుస్తకం చూడ ముచ్చటగా ఉంది. బాలి వేసిన అందమైన ముఖ చిత్రంతో చూడ గానే ఆకట్టు కునేలా ఉంది. ముద్రాపకులు తమ ముందు మాటలో మరల ఎందుకనగా ... అంటూ, భారతాన్ని మరల ఎందుకు ప్రచురిస్తున్నారో సహేతుకంగా వివరించారు. తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అనే మాట ఈతరం పిల్లలకు తెలుసా ? అనే ప్రశ్నను ముందుగా సంధించి, ఆబాల గోపాలాన్ని శతాబ్దులుగా అలరిస్తున్న ఈ అధ్బుత పౌరాణిక గాథను మరల మరల ప్రతి తరం చదివి తీరాలని చెబుతున్నారు. ఇప్పటికే వ్యాస ప్రోక్త భారతాన్ని తెలుగులో చాల మంది పద్యంలోను, గద్యం లోను రచించారు. అత్యాధునిక సాంకేతిక ధోరణులు ప్రబలిన ఇరవయ్యొకటో శతాబ్దంలో జీవిస్తున్న వారి చేత సరి కొత్తగా చదివించాల్సిన గ్రంథమిది. భారతాన్ని ఎందరో తిరుగ రాసి నప్పటికీ, ఎప్పటికప్పుడు వచ్చే తరానికి కొత్తగా వినిపించాల్సిన గాథ మహా భారతం. అద్భుత కథన నైపుణ్యం కలిగిన జగన్నాథ శర్మ గారు పిల్లలకు సులువుగా బోధ పడేందుకు గాను, ఈ తరానికి నచ్చేట్టుగాను, వారి మనసు మెచ్చేట్టుగాను, చవులూరిస్తూ చదివించే విధంగా సరళ వచనంలో ఈ రచన చేసారు. నవ్య వార పత్రికలో ధారావాహికంగా వెలువడుతున్న ఈ పిల్లల వచన మహా భారతం అసంఖ్యాక పాఠకుల మనసులు దోచుకుంటోంది. ఎందరో ఎంతగానో ప్రశంసలు కురిపించారు, కురిపిస్తున్నారు. పద్దెనిమిది పర్వాల జగన్నాథ శర్మ గారి వచన భారతం రచనను మొత్తం ఆరు భాగాలుగా వెలువరిస్తున్నట్టుగా ప్రచురణ కర్తలు తెలియ జేస్తున్నారు. ఆ వరసలో వెలువడిన తొలి సంపుటం యిది. ఈ సంపుటిలో ఆది, సభా, అరణ్య పర్వాల కథ ఉంది. శర్మ గారు ఈ వచన భారతాన్ని తమ జననీ జనకులు అయల సోమయాజుల రామ సోదెమ్మ, జగన్నాథం గారలకు భక్తి ప్రపత్తులతో అంకితం చేసారు. ప్రతి ఇంట తల్లి దండ్రులు కొని , తమ చిన్నారులకు బహుమతిగా యిచ్చి వారి చేత చదివించ తగిన చక్కని పుస్తకమిది. పిల్లలకు ఇవ్వ తగిన గొప్ప బహుమతి గా పుస్తకాన్ని చెప్పుకో వచ్చును.

జగన్నాథ శర్మ గారి గురించి ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు .....

1956లో పార్వతీ పురంలో జన్మించిన శర్మ గారు వందలాది కథలు వ్రాసేరు. యువ మాస పత్రికలో వచ్చిన వీరి రాజధాని కథలు, పల్లకి వార పత్రికలో వచ్చిన మా ఊరి కథలు, ఆది వారం ఆంధ్ర జ్యోతిలో వచ్చిన అగ్రహారం కథలు విశేష ప్రాచుర్యం పొందాయి. నవలా రచయితగా, సినిమా, టి.వి. రచయితగా కూడా వీరు ప్రసిద్ధులు. ప్రస్తుతం నవ్య వారపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. అరణి, అనీలజ, నీలకంఠాచార్య వీరి కలం పేర్లు.

ఇప్పటి వరకు ప్రచురితమయిన వీరి రచనలు ....

తెలుగు లోనికి అనువాదం చేసిన ప్రపంచ ప్రఖ్యాత పిల్లల జాన పద కథలు పాల పిట్ట కథలు. ( వివరాల కోసం ఇక్కడ నొక్కి చూడండి)

పేగు కాలిన వాసన (కథా సంకలనం)

బాలల కోసం సరళ వ్యావహారికంలో రచించిన మహా భారతం ( ఆది సభా అరణ్య పర్వాలు)

త్వరలో వెలువడనున్న పుస్తకాలు ....

జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య మొదటి పేజీ)

అగ్రహారం కథలు