21, మే 2011, శనివారం

అవునా ? అదన్న మాట సంగతి !


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసు కోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

ధర్మో రక్షతి రక్షిత:

సత్య మేవ జయతే

అహింసా పరమో2ధర్మ:

ధనమూల మిదం జగత్

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి

కృషితో నాస్తి దుర్భిక్షమ్

యథా రాజా తథా ప్రజా

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:

శత శ్లోకేన పండిత:

శతం విహాయ భోక్తవ్యం

అతి సర్వత్ర వర్జయేత్

బుద్ధి: కర్మానుసారిణీ

వినాశ కాలే విపరీత బుద్ధి:

భార్యా రూప వతీ శత్రు:

స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

వృద్ధ నారీ పతి వ్రతా

అతి వినయం ధూర్త లక్షణమ్

ఆలస్యం అమృతం విషమ్

దండం దశ గుణం భవేత్

ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?

ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

పుస్తకం, ఆడుది , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ.

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

అప్పుడు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా !

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

వీటిలో స్త్రీల విషయమై చెప్పిన వాటి విషయమై నాకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాని. పూర్వులు చెప్పిన దానిని మార్చ రాదు కనుక , యథాతథంగా ఇచ్చాను. స్త్రీవాదులు కినక వహించరు గాక !

స్వస్తి.














14, మే 2011, శనివారం

రూపాయి ... పాయె ! ఏమై పోయింది చెప్మా ?


మా చిన్న తనంలో మా నరసింహం బాబాయి ఈ లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.

ఈ వేసవిలో మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:

ఇదిగో ఆ లెక్క:

రాముడు, భీముడు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.

షాపులో ఒక మంచి బొమ్మని చూసి అదెంత అని, అడిగారు. అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.

సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ ఇచ్చి, బొమ్మను కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘ ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి ఎక్కడో పారేసానని, అందు వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.

రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.

ఇదీ కథ. ఇప్పుడు అసలు ప్రశ్ప ఏమిటంటే,

రాముడు భీముడు కలిసి షాపు పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.

బొమ్మ అసలు ఖరీదు నలభై అయిదు.

పని వాడు తెచ్చినది ఐదు రూపాయలు.

వాడు పారేసానని చెప్పినది రెండు రూపాయలు.

రాముడు , భీముడు పంచు కున్నది - చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.

ఇప్పుడు చెప్పండి:

బొమ్మ అసలు ధర నలభై అయిదు . పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.

లెక్క సరి పోయిందే !

ఇప్పుడు ఇదే లెక్కని ఇలా చూడండి:

బొమ్మ కోసం మొదట రాముడు తన వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది: 25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.

పని వాడు తెచ్చి ఇచ్చిన దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం ఎంతన్నమాట ? ఇరవై మూడు న్నర రూపాయలు. అంతే కదా !

అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?

ఇరవై మూడున్నర రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?

ఇరవై మూడున్నర + ఇరవై మూడున్నర = 47 రూపాయలు. కదా !

పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన 2 రూపాయలు = 49 రూపాయలు.

అరే ! ఒక రూపాయి తక్కుఃవ వస్తోందే ? ఏమయి పోయింది చెప్మా ?!

టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు పారేసినది 2 మరి వాడు ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు మొత్తం 52 అయి పోవడం లేదూ ? అదనంగా ఈ రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి చెప్మా ?




మన రూపాయి ఎక్కడికీ పోలేదు. ఎక్కువా కాలేదు. ఇక్కడే ఉంది. కదూ !

2, మే 2011, సోమవారం

సరస సల్లాపమ్





మొగుడూ పెళ్ళాలన్నాక, ఆ పాటి మాటా మాటా అనుకోరా యేమిటి ?

మీ వాళ్ళు ఇలాగంటే, మహ చెప్పొచ్చారు లెండి, మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ? అని ఒకరి నొకరు దెప్పి పొడుచు కోవడం, మూతులు ముడుచు కోవడం, అలకలు, ముక్కులు చీదు కోవడాలూ, మాటలు మానెయ్యడాలూ, కూరలు తగలెయ్యడాలూ, ఉపాహారం తిన కుండానే వీధిలోకో, ఆఫీసుకో వెళ్ళి పోవడాలూ. ఆ తరువాత అయ్యో అనుకోడాలూ, తప్పంతా నాదే, నేనే ఊరికే రెచ్చ గొట్టేను, పాపిష్ఠి దాన్ని ( లేదా ) మూర్ఖపు వెధవని అనుకోడాలూ, సాయంత్రానికి వేడి వేడి పకోడీలు చేయడాలూ, కమ్మని కాఫీలు పెట్టడాలూ, మూరల లెక్కన మల్లెలో, సన్నజాజులో బేరమాడడాలూ, క్షమాపణలూ వగైరాలయేక, కరిగి పోవడాలూ ... ఇదీ సాంసారిక మాధుర్యం.

ఆది దంపతుల సరస సల్లాపాలు గమనిస్తే, అమృతోపమానమైన సరస సంభాషణతో భార్యా భర్తలు తమ దాంపత్యాన్ని ఎంత ప్రఫుల్లంగా, మధుర కావ్యంలాగున, తేనె వాక లాగున, ఇంద్ర ధనుస్సుల్లాగ మలచు కో వచ్చునో అవగత మవుతుంది.

చూడండి మరి :

క్వతిష్ట తస్తే పితరౌ మమేతి
అపర్ణ యోక్తే పరిహాస పూర్వం
క్వవా మమేవ శ్వసురౌ తవేతి
తామీరయన్ సస్మిత మీశ్వరోవ్యాత్

( శ్రీ కృష్ణకర్ణామృతమ్ )

దీనికి తెలుగు సేత:
‘నాకున్న తల్లి దండ్రులు
మీ కేరీ ’ యని యపర్ణ మేలము లాడన్
‘నాకున్న యత్త మామలు
నీ కేరీ’ యనుచు నగు త్రి నేత్రుని గొలుతున్ !

‘‘నాథా, నాకున్న మాతాపితరుల వంటి వారు నీకు లేరు. మా తలిదండ్రులు అంత గొప్ప వారు’’ అంటూ పార్వతి శివుడిని మేలమాడింది.

‘‘ పోదూ, మీ వాళ్ళ గొప్పలు నువ్వే చెప్పాలి. చాలు. చాలు. నాకున్న అత్త మామలు నీకు లేరులే !’’ అని బదులు చెప్పాడుట పరమ శివుడు. శివ పార్వతుల సల్లాపం ఎంత మనోహరంగా ఉన్నదో చూసారా ?

అర్ధనారీశ్వరత్వానికి అర్ధం, పరమార్ధం అదే.





స్వస్తి.

1, మే 2011, ఆదివారం

నా కథల సంపుటి వెలువడింది ...




నా కథల సంపుటి గుండె తడి 24 కథలతో విడుదలయింది.

ఈ కథా సంపుటిని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. ముఖ చిత్రం శ్రీ రమణ జీవి.

వెనుక అట్ట మీద నవ్య వార పత్రిక సంపాదకులు, ప్రముఖ రచయిత శ్రీ ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారు, మరో ప్రముఖ

రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు నా కథల పై తమ అభిప్రాయాలు పొందు పరిచారు.

పుస్తకం పేజీలు: 156. వెల: రు.75లు.

ప్రతులు దొరుకు చోటు:

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 4-1-435, విఙ్ఞాన్ భవన్, ఆబిడ్స్, హైదరాబాద్ - 001.
ఫోన్: 040 24744580 / 04024735905

E^mail: visalaandhraph@yahoo.com
www.visalaandhra.com

ఇంకా, విశాలాంధ్ర వారి సుల్తాన్ బజార్ శాఖ, హైదరాబాద్, విజయవాడ,విశాఖపట్నం, అనంతపురం, కరీం నగర్, తిరుపతి,గుంటూరు, హన్మ కొండ, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం బ్రాంచీలలో లభ్యం.


30, ఏప్రిల్ 2011, శనివారం

చీకటి రోజుల చిరు కవిత


మహా కవి జయంతి నేడు.

చీకటి రోజుల్లో బరంపురం అఖిల భారత రచయితల మహా సభలో మహా కవి ఎదుట చదివి, వారి ఆశీర్వాదాన్ని పొందిన ఈ చిరు కవిత మరోసారి ...

ఈ కవిత చదివేక శ్రీ.శ్రీ నా చేతిలో కవిత ఉన్న కాగితం తీసుకుని దాని మీద తన సంతకం చేసి తిరిగి యిచ్చేరు.
ఉరకలు వేసే ఆ వయసులో అందుకు నేనెంత గర్వించేనో కదా !
అది నా వద్ద ఇంకా పదిలం. మరి ఆ చీకటి రోజుల కవితను చూడండి:

కంఠం మీద కత్తి


కంఠం మీద కత్తి
ఎలుగెత్తి పాడ లేను
ముంజేతికి బాండేజీ
చెల రేగి వ్రాయ లేను.

సిరా బుడ్డిలో సాలీడు
సిగరెట్టు నుసి రాల లేదు

అరరే ! చిక్కులు పడందయ్యా,
ఆలోచనల దారం.

28, ఏప్రిల్ 2011, గురువారం

వలువల విలువలు


ఈ చాటువు విన్నారా ?

చాకి వాని తోడ జగడాలు పడ లేక
సిరి గలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గట్టె సీ !యని మది రోసి
భైరవుండు చీర పార వైచె.

ఇప్పటి లో లాగా అప్పుడు ధనవంతులకి కూడా బీరువాల నిండా ఇన్నేసి బట్టలుండేవా ఏమిటి ?
కట్టుకో గుడ్డా, విడుపుకో గుడ్డా అన్నట్టుగా ఉండేవి. చాకలి చలువ చేసి బట్టలు తేడానికి చాలా ఆలస్యం చేసే వాడు. దానితో జనం విసిగి పోయే వారు. మనుషులే కాదు, దేవతలు కూడానుట !

అందు చేత, చాకి వానితో తంటాలు పడ లేక సిరి గల వాడు (శ్రీ మహా విష్ణువు - లక్ష్మీ దేవి భర్త) ఇలా లాభం లేదని చెప్పి పట్టు చీర ధరించాడుట. ఆ రోజుల్లో మగ వారు ధరించిన వస్త్ర విశేషానికి కూడా చీర అనే వ్యవహారం ఉండేది. పట్టు బట్ట అయితే చాకలికి వేయ నక్కర లేదు. ఒక సారి దులిపి కట్టుకుంటే చాలును. ఇక, శివుడు తోలు ధరించేడు. గజ చర్మధారి కదా, శివుడు ?
ఇది మరీనూ, మన కాలపు జీను బట్టలాగా ఉతుకులే అక్కర లేదు. అంత వేగం చిరుగులు పడవు కూడా. మాసినా అదో ఫేషను. మరి కాల భైరవుడయితే ఛ ! ఛ! అని విసుక్కుని కట్టిన చీర కాస్త పార వేసి దిగంబరుడైనాడట !

ఎంతయినా, వలువలకు విలువ హెచ్చు కదా ? ఎంత ఖరీదయిన దుస్తులు ధరిస్తే అంత గౌరవం.

ఒక సారి కామన్ వెల్త్ రౌండ్ టేబిల్ సమావేశానికి మహాత్ముడు వెళ్ళ వలసి వచ్చి నప్పుడు ముందు తన అలవాటైన అంగ వస్త్రంతో వెళ్ళాడుట. అతని వాలకం చూసి, కాపలాదారులు లోనికి రానివ్వ లేదుట. సరే , మహాత్ముడు బ్రిటిష్ వారిలాగ కోటూ, బూటూ వేసుకుని వెళ్ళాడుట. ఈ సారి అతనికి రాచ మర్యాదలతో స్వాగతం లభించిందిట. లోనికి వెళ్ళాక, అక్కడ జరిగిన ఒక విందులో బాపూజీ పదాదార్ధాలను తినడం మానేసి తన కోటు మీద జల్లు కోవడం మొదలు పెట్టాడుట. దొరలు ఆ చర్యకి విస్తు పోయి కారణం ఆరా తీసారుట.

మహాత్ముడు నవ్వి, ఇక్కడ మనుషుల కన్నా బట్టలకే విలువ అనుకుంటాను. అందు వలన ఈ విందు నాకు గాక నా బట్టలకు ఇస్తున్నట్టుగా భావిస్తున్నాను. అందుకే విందు ఈ సూటు, కోటుకి పెడుతున్నాను అన్నాడుట.

దొరల ముఖాలు మాడి పోయాయని వేరే చెప్ప నక్కర లేదు కదా ? ఈ కథలో నిజమెంతో నాకయితే తెలియదు కానీ, వలువలకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వక పోవడ మనేది ఎప్పుడూ ఉన్నదే అన్నది మాత్రం పరమ సత్యం.

వలువల విలువల గురించిన మరో పద్యం చూడండి:

పీతాంబుని బిల్చి పిల్ల నిచ్చిన మామ
గజ చర్మ ధారికి గరళ మిచ్చె

దొర వేషమునకు విందు లొసంగు గేస్తు
చింపి గుడ్డల వాని సీత్కరించె

అద్దె గుడ్డల వాని కర్ధాసనంబిచ్చె
కౌపీన ధారిని కసిరి కొట్టె

జలతారు ముసుగున్న శిలను దైవమ్మనె
త్రోవ కడ్డ మైన తొలగ దన్నె

వలువలను బట్టి లోకాన విలువ హెచ్చు
వలువలకు విలువ హెచ్చు నీ చేతి చలువ వలన
అట్టి నీ చేతి చలువ మహత్య మెఱుగు
ఘనులకు గద నేడు సత్కార సభలు !

పట్టు పీతాంబరాలు కట్టిన శ్రీ మహా విష్ణువుకు సిరి దేవి ఇల్లాలుగా లభించింది. తోలు బట్ట కట్టిన శివుడికి అంతా కలిసి, తాగమని విషం ఇవ్వడం జరిగింది. దొర వేషంలో వస్తే విందులు, చింపిరి గుడ్డలతో వస్తే ఛీత్కారాలు. అద్దె గుడ్డలతో వస్తే అర్ధాసనం, గోచి ధరించి వస్తే కసుర్లు.
రాతి బొమ్మకు దేవుడని చెప్పి జలతారు మేలి ముసుగులు వేయడం,త్రోవకి అడ్డంగా ఉందని మామూలు బండ రాయిని తొలగదన్నడం.

లోకంలో బట్టలను బట్టి కదా మనుషులకు విలువ ! అట్టి బట్టలను చలువ చేసే మడివేలు వల్ల ఆ వలువలకు విలువ ఎక్కువ అవుతోంది. చక్కగా చలువ చేసిన బట్టలు ధరించిన వాడికే కదా సత్కార సభలు జరుగుతూ ఉన్నాయి ?




25, ఏప్రిల్ 2011, సోమవారం

నవ్య కథా నీరాజనంలో నా ఇంటర్వ్యూ ....

గత నెల మొదటి వారంలో నవ్య వార పత్రికలో కథా నీరాజనంలో నా ఇంటర్వ్యూ ప్రచురించారు. దానిని నా కథా మంజరిలో పెట్టమని మిత్రులు కోరేరు. ఎందుకు లెద్దురూ, అని దాట వేసాను.

నా బ్లాగరు మిత్రులు వదల లేదు. నువ్వు పెడతావా . మమ్మల్ని పెట్ట మంటావా ? అని బెదిరించడం మొదలు పెట్టారు.
నిజం చెప్పొద్దూ, బ్లాగులో పెట్టాలనే ఉబలాటం నాకు మాత్రం ఉండదూ.

సరే లెమ్మని, కొంత వినయం, మరి కొంత మొఖమాటం నటించి, ఇంకొంత నిరాసక్తత, వేరొక కొంత సిగ్గు అభినయించి, ఇక
ఆ అభినయాలను చాలించి, ఇదిగో, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ మీ ముందు పెడుతున్నాను. చూడండి:












ఒక విషయం : ఇంటర్వ్యూ చదవడానికి ఇమేజి పెద్దది కావడం లేదు. కదూ. ఈ లోపం ఎలా సరి చేయాలో దానికి తగిన సాంకేతిక పరిచయం నాకు లేదు.


24, ఏప్రిల్ 2011, ఆదివారం

విశ్వ ప్రేమ



విశ్వ ప్రేమ

ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీ చక్ర
మిరుసు లేకుండనే తిరుగు చుండు

ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలచి యుండు

ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ
కడలి రాయుడు కాళ్ళు ముడుచు కొనును

ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల
గాలి దేవుడు సురటీల విసరు

ఆ మహా ప్రేమ - శాశ్వతమైన ప్రేమ
అద్భుత మఖండ మవ్యక్త మైన ప్రేమ
నిండి యున్నది బ్రహ్మాండ భాండ మెల్ల
ప్రేయసీ ! సృష్టి యంతయు ప్రేమ మయము !!

( కరుణశ్రీ)


సిద్ధి స్సాధ్యే సతామస్తు ప్రసాదాత్తస్య ధూర్జటీ:
జాహ్నవీ ఫేన లేఖేవ యన్మూర్ధ్ని శశిన: కళా

గంగానది నురుగు రేఖయా అను నట్లు ఎవని శిరస్సున చంద్ర కళ కలదో, అట్టి ఈశ్వరుని అనుగ్రహము వలన సత్పురుషులు పనులు సాధించెదరు గాక !

23, ఏప్రిల్ 2011, శనివారం

ఓసింతేనా?!


ఈ పద్యం చూడండి:

హరి కుమారుడై యొప్పునాతడు హరి
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి
హరికి శిరము తోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి

హరికి ( శ్రీ మహా విష్ణువునకు) కొడుకు హరి.

హరికి కుడి కన్ను హరి.

హరికి శిరస్సుతో ఒప్పువాడు హరి.

హరికి ఎడమ కన్ను హరి.

ఏమిటో అంతా గోలగా ఉంది. కదూ. అబ్బే మరేమీ లేదు.


హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధమే కాక, కోతి, సూర్యుడు,సింహము, చంద్రుడు అనే యితర అర్ధాలు కూడా ఉన్నాయి. వీటినే నానార్ధాలు అంటారు. వాటి సాయంతో ఇప్పుడు పద్యానికి అర్ధం చూడండి:

ఇప్పుడు చూడండి:

మొదటి పాదంలో తొలి పదం హరికి సూర్యుడు అనీ, పాదం చివర గల హరి అనే పదానికి కోతి అనీ అర్ధం చెప్పుకోవాలి.


ఇప్పుడా పాదానికి హరి కొడుకు హరి. అంటే, సూర్యుని కొడుకు కోతి ( సుగ్రీవుడు ) అనే అర్ధం వస్తుంది. సుగ్రీవుడు సూర్య తనయుడే కదా.

రెండవ పాదం. హరి కుడి కన్ను హరిట. ఈ పాదంలో చివర గల హరి అనే పదానికి సూర్యుడు అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి శ్రీహరికి కుడి కన్ను సూర్యుడు అని అర్ధం వస్తుంది. నిజమే కదా.

మూడవ పాదం లో చివర గల హరి శబ్దానికి సింహం అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి హరికి తలతో ఒప్పు వాడు సింహం అని అర్ధం వస్తుంది.


సింహం తలతో తిరిగే వాడు. నరసింహావతారం. హరి నారసింహుడు అని అర్ధం వస్తుంది.

నాలుగవ పాదంలో చివర గల హరి అనే పదానికి చంద్రుడు అని చెప్పుకోండి.

ఇప్పుడా పాదానికి హరికి ఎడమ కన్ను చంద్రుడు అని అర్ధం సిద్ధిస్తుంది. నిజమే కదా.

అబ్బచ్చా, యిదా అర్ధం ! అనుకుంటున్నారా? ఇలాంటి తమాషాలు మన కవులు చాలా చేసారండోయ్.

స్వస్తి.



20, ఏప్రిల్ 2011, బుధవారం

ముఖే ముఖే సరస్వతీ ...


ఒక చక్కని దత్తపదిని చూదామా?

పృచ్ఛకుడు అవధానిగారిని పాలు, పెరుగు,నేయి, నూనె అనే పదాలను ఇచ్చి, భారతార్ధంలో పద్యం చెప్పమని కోరాడు.

అవధానిగారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగుచున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !

పృచ్ఛకుడు కోరిన నాలుగు పదాలూ పద్యం నాలుగు చరణాలలో మొదటి పదాలుగానే వచ్చేయి కదా?

ఇక భావం చూడండి:

రారాజు ( దుర్యోధనుడు) పాండవులకు పాలు పంచడు. రాజ్య భాగం ఇవ్వడు. ఐదూళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనని తెగేసి చెప్పనే చెప్పాడు కదా?

వానిలో ( ఆ దుర్యోధననునిలో) దురితము నానాటికీ పెరుగుతోంది. దుర్మార్గం ఎక్కువవుతోంది.

ఇలాంటి అహితము ( చెడ్డ నడవడిక) లోకంలో ఎక్కడయినా చూసామా ? (కన నేయిలను?) లేదు కదా !

వానిన్ (మూర్ఖత) ఊనెన్ = వానినూనె మూర్ఖత = వాడిని మూర్ఖత్వం పట్టుకుంది. ఒట్టి మూర్ఖపు ముండాకొడుకయ్యేడు.

యుద్ధం ఇంక తప్పదు

పాలు, పెరుగు, నేయి నూనె అనే పదాలను అవధాని గారు దుర్యోధనుడు పాండవులకు రాజ్యం పాలు పంచడు అనీ,

వాడిలో నానాటికీ అహంకారం పెరుగు తోందనీ,

ఎక్కడయినా ఇలాంటి దుశ్చేష్టితం లోకంలో చూసామా (కన నేయిలన్) అనీ,

ఆ దుర్యోధనుడి మనసులో మూర్ఖత్వం చోటు చేసుకుందనీ (వాని నూనె మూర్ఖత) అనీ

అందు వలన కురు పాండవ సంగ్రామం తప్పదనీ ఎంత చక్కని పద్యం చెప్పాడో చూసారా?



స్వస్తి.

14, ఏప్రిల్ 2011, గురువారం

దండం దశ గుణం భవేత్


దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

మరయితే, ఈ టపాకి ఎన్నుకున్న చిత్రం అలా ఉందేమిటయ్యా, అని నిలదీయకండి.

ప్రమాదో ధీమతామపి ( బుద్ధిమంతులు కూడ ఒక్కొక్క తూరి పొరబడుతూ ఉంటారు) అని చెప్పడానికి అలా ఉంచానంతే.


11, ఏప్రిల్ 2011, సోమవారం

దేవతలకు కూడా దారిద్ర్యమేనా ?



దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.

చూడండి:

హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య, నలాంగలం
క్రమ పరిమితా భూమిర్విష్ణో: న గౌ ర్న చ లాంగలం
ప్లవహతి కృషి:నాద్యా ప్యేషాం ద్వితీయం గవం వినా
జగతి సకలే నే దృగ్దృష్టం దరిద్ర కుటుంబకమ్.

బలరాముడికి నాగలి ఉంది. కాని ఎద్దులు లేవు.
శివుడుకి ఎద్దు ఉంది. కాని నాగలి, భూమి లేవు.
హరికి మూడడుగుల నేల ( బలి ఇచ్చినది) ఉంది. కానీ, ఎడ్లు, నాగలి లేవు.
ఇంత దరిద్ర కుటుంబం ఎక్కడా చూడ లేదయ్యా ! అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.

కేవలం చమత్కారం కోసమే సుమండీ. నాగలి, ఎద్దు, భూమి మొదలయినవి ఆయా దేవతలకి వరుసగా ఆయుధమూ, వాహనమూ, ధర్మ పత్ని గానూ శోభిల్లుతున్నాయి.

కాసుల పురుషోత్తమ కవి కూడా వ్యాజ నిందా రూపమైన తన ఆంధ్రనాయక శతకంలో హరి పరమ దరిద్రుడని వెటకారంగా అన లేదూ?
చూడండి:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకుడను నాఖ్యఁదెచ్చె

ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్ధదుడన్న ఘనతఁదెచ్చె

కమలఘర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁదెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుడన్న ప్రతిభఁదెచ్చె

ఆండ్రు బిడ్డలుఁదెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ !
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !

శ్రీహరికి అఖిల భారకుడు ( సమస్త లోక భారాన్ని వహించేవాడు), కామితార్ధదుడు ( కోరిన కోరికలు ఇచ్చే వాడు), బహు కుటుంబికుడు ( జగమంత కుటుంబంకలవాడు), పతిత పావనుడు
( పతితులను వారి పాపాలు పోగొట్టి, పుణ్యాత్ములుగా చేసే వాడు) అనే పేర్లు ఉన్నాయి.

అయితే , మన కవి హరికి ఈ పేర్లన్నీ రావడానికివరుసగా అతని భార్యలు భూదేవి, శ్రీ లక్ష్మి, అతని కుమారుడు బ్రహ్మ, కుమార్తె గంగ కారణం తప్ప అతని గొప్పేమీ లేదని వ్యాజ నిందా రూపంలో చెబుతున్నాడు. హరి మొదటి నుండీ (దరిద్ర) దామోదరుడేనుట !

దామోదరుడు అంటే, దామము (పద్మము) ఉదరము నందు కలవాడని అర్ధం. శ్రీహరి నాభిలో కల పద్మం నుండే కదా బ్రహ్మ జనించినది.

ఇది నిందా రూప స్తుతి. అట్టి మహనీయులను పత్నులుగాను, కుమారునిగాను, కుమార్తె గాను కలిగిన హరి మరింత ఘనత వహించిన వాడు కదా. వ్యాజ నిందా రూపంలో హరిని నుతించడానికి కవి అతనికి లేని పోని దారిద్ర్యాన్ని ఆపాదించి చెబుతున్నాడు.

దేవతల దారిద్ర్యాన్ని గురించిన మరొక చాటువు కూడా చూదాం

శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట, రా
జీవాక్షుండ విరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడ లేక సుమీ !

కవి తమాషాగా శివుడు హిమవత్పర్వతం మీద నివాసం ఏర్పరచు కోవడం, సూర్య చంద్రులు ఆకాశంలో ఉండడం, శ్రీహరి నిరంతరం పాలకడలిలో ఆది శేషుని మీద పవళించడం కేవలం నల్లి బాధ పడ లేకనే అని చెబుతున్నాడు.నల్లులూ, దోమలతో వేగాల్సిన దరిద్రం ఆ దేవతలకీ తప్పడం లేదని చమత్కారంగా చెబుతున్నాడు.

పరమేశుడు కాశీ నగరం విడిచి రావడానికి కూడా ఈ దరిద్రమే కారణం కదా.

దేవతల దారిద్ర్యం గురించిన ఈ చమత్కారాలకు ఇక స్వస్తి. మరో టపాలో మళ్ళీ కలుద్దాం.

9, ఏప్రిల్ 2011, శనివారం

కిచిడి శ్లోకమ్


ఒక చమత్కార శ్లోకం చూడండి ...

అంబలి ద్వేషిణం వందే
చింతకాయ శుభ ప్రదమ్
కూరగాయ కృత త్రాసం
పాలనేతి గవాం ప్రియమ్


తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసేరా ? కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?

అంబలిని ద్వేషించే వాడికి వందనమట. చింతకాయ చాలా శుభ దాయకమట. కూరగాయ భయోత్పాతకమట. ఆవు పాల నేయి ప్రియమైనదట. ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?

అం , బలి = బలిని అణచి వేసిన వాడు

చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు

కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు

పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )

వందే = నమస్కరించుచున్నాను.


ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.


3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది ఉదయం ... కథ


అందరికీ ఖర నామ సంవత్సర శుభాకాక్షలు.... మీ కథా మంజరి.

అందరకీ సమస్త శుభాలూ కలగాలని, అందరి మనుగడ హాయిగా సాగాలని కోరుకుంటున్నాను.

తే 27-3-1971 దీ కృష్ణా పత్రిక వార పత్రికలో , ఉగాది సంచికలో వచ్చిన నా కథ ఉగాది ఉదయం సరదాగా మీతో పంచు కోవాలని ఇక్కడ ఉంచుతున్నాను. ఈ కథ ను పెద్ద అక్షరాలలో చదవాలనుకుంటే కథ మీద నొక్కి చూడండి.

ఉగాది పండుగతో ముడి పడి ఉన్న కొన్ని మూఢ నమ్మకాల పర్యవసానాన్ని సున్నితంగా తెలియ జేయడమే ఈ కథ ఉద్దేశం. ఇది నా తొలినాటి కథలలో ఒకటి.

29, మార్చి 2011, మంగళవారం

అడ్రసు లేని మనుషులు ... కథ


గత టపాలో ( నొక్కి చూడండి) లేమి వల్ల , ఇతర మానసిక ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చే అతిథుల గురించి ఆందోళన పడుతూ, చుట్టాలను వదిలించు కోవాలనుకునే వారి గురించి కొంత వ్యంగ్యంగా రాసేను.

ఇదే ఇతి వృత్తంతో 15-2-1980 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అడ్రసు లేని మనుషులు అనే కథ ఒకటి రాసి ప్రచురించేను. ఆర్ధిక కారణాల వల్ల ఇంటికి ఆత్మీయుల రాకను కూడ ఆమోదించ లేని వ్యక్తుల దయనీయమైన స్థితిని ఇందులో చూపించేననుకుంటాను. అదే కారణం వల్ల వ్యక్తులు ఆత్మీయతల నుండి, స్నేహాల నుండి, అనుబంధాల నుండి, చివరాఖరికి తమ నుండి కూడా తాము ఎలా పిరికిగా, దూరంగా పారి పోతున్నారో, ఎలా అడ్రసు లేని మనుషులుగా మిగిలి పోతున్నారో ఈ కథలో చెప్పడానికి ప్రయత్నించేను.

ఇదీ ఆ కథ. ( అక్షరాలు పెద్దవి చేసి చదవడానికి కథ మీద నొక్కండి)

28, మార్చి 2011, సోమవారం

చింకి లెక్చరు ... ఈ బ్లాగును చదవొద్దు !


ఉదయాన్నే ఫోనొచ్చింది. పానకాల రావు చేసాడు. బుధవారం మధ్యాహ్నం రెండింటికి కుటుంబంతో పాటు వస్తాడుట. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. భోజనం చేసే వస్తాం కనుక ఆ ఏర్పాట్లేవీ చేయ నవసరం లేదని , కావాలంటే సాయంత్రం ఏ నాలుగింటికో చెల్లెమ్మ ఓపిక ఉంటే కరకరలాడేలా ఏ పకోడీలో, ఘుఘుమలాడే బజ్జీలో చేస్తే సరిపోతుందని భరోసా యిచ్చేడు. వాడు మాఇంటికి వచ్చేటప్పుడు మెనూ వాడే నిర్ణయిస్తాడు. నా గుండెలో రాయి పడింది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి ఇండియా పాకిస్తాన్ లు ఆడే కీలకమైన వన్ డే క్రికెట్ మేచ్ ఉంది. పానకాల రావుకీ, వాడి పెళ్ళానికీ కూడా క్రికెట్ మోజు లేదు. అసలు వాళ్ళకి క్రికెట్ గురించి తెలుసో లేదో కూడా అనుమానమే. వాడి పిల్లలకి మాత్రం క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం, ఈ కాలపు పిల్లలు కదా. అయితే వాళ్ళు ఇల్లు తీసి పందిరేస్తారు. టీ.వీలో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడయితే మరీనూ. వాళ్ళ అల్లరీ ఆగమూ అంతా యింతా కాదు. సచిన్ అవుటయితే ఆ కోపం సోఫా కవర్ల మీదో, పుస్తకాల షెల్ఫు మీదో చూపిస్తారు. లేదా టీ కప్పులు, కాఫీ కప్పులు నేల కేసి కొడతారు. తర్వాత తీరిగ్గా సారీ ఆంటీ, సారీ అంకుల్ అంటూ పళ్ళు యికిలిస్తారు. అసలు ఇలాంటి ఉపద్రవాలేవీ వాళ్ళ ఇంట్లో జరుగకుండా తప్పించు కోవడం కోసమే బుధవారం నాడు పానకాల రావు మా యింటికి వచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కాబోలు. ద్రోహి. ఎంత కపటి ? ఎంత దురాలోచన ?

‘‘ లేదురా, ఈ బుధ వారం మేం ఇంట్లో ఉండడం లేదు. జరూరు పని మీద మా సొంతూరు వెళుతున్నాం ...’’ అంటూ ఓ అబద్ధం చెప్పి తప్పించు కోవాలని పానకాలుకి ఫోను చేద్దామని వాడి నంబరుకి రింగ్ చేసాను. వాడి సెల్ ఆఫ్ చేసి ఉంది. వాళ్ళావిడ నెంబరు కూడా కలవడం లేదు. నానుంచి ఈ రిప్లయ్ ఊహించేడో యేమో, ముందుగానే జాగ్రత్త పడుతున్నారల్లే ఉంది.

జావకారిపోయేం, నేనూ, మా ఆవిడానూ. ఇహ మా బుధ వారం ప్రోగ్రాం సర్వ నాశనమైపోయినట్టే.

ఇలా పనిమాలి పోసుకోలు కబర్ల కోసం వచ్చే వాళ్ళని ఎలా అదపు చేయాలో తెలియక సతమతమై పోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ రాకని ఎలా కట్టడి చేయాలో సరైన సలహా చెబుతాడు కదా అని కథా మంజరి బ్లాగు నిర్వాహకుడికి ఓ మెయిలు పెట్టాను. విషయం అంతా వివరిస్తూ నా గోడు వెళ్ళ బోసుకున్నాను.

ఆ చాదస్తపు బ్రామ్మడు సలహా యివ్వక పోగా, అలా ఇంటి కొచ్చే వారిని అడ్డుకో కూడదనీ, అతిథి సేవాతత్పరత, దిబ్బా దిశిగుండం అంటూ నాకే ఓ చింకి లెక్చరు యిచ్చేడు.పైగా తన మాటలకు ఉపబలకంగా ఏవో సంస్కృత శ్లోకాలూ గట్రా కోట్ చేయడమొకటీనూ. నాకు ఎక్కడో మండింది.

ఆ చింకి లెక్చరు మీరూ వినండి మరి:

నా2భ్యత్థానక్రియా యత్ర, నా22లాసా మధురాక్షరా:
న చా2పి కుశల ప్రశ్న:, తత్ర్త హర్మ్యే న గమ్యతే.

ఎవడి గృహానికి వెళ్తే ఆ యింటి యజమాని లేచి, ఎదురేగి మంచి మాటలతో పలుకరించి, కుశలాదికాలు అడిగి ఆదరించడో అలాంటి వాడి ఇంటికి వెళ్ళ కూడదు.

ఇదీ శ్లోక భావంట. గాడిద గుడ్డేం కాదూ?

చింకి లెక్చర్లో మరి కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడండోయ్

ఉత్తమస్యా2పి వర్ణస్య, నీచో2పి గృహమాగత:
పూజనీయో యథాయోగ్యం, సర్వదేవమయో2తిథి:

పెద్దింటి వాడింటికి చిన్నింటి వాడు వచ్చి నప్పటికీ వానిని యథోచితంగా సత్కరించి, భోజనాదులు సమకూర్చాలి. అతిథి సర్వ దేవమయుడని గుర్తుంచు కోవాలి.

గ్రాసాదపి తదర్ధేన, కస్మాన్నో దీయతే2ర్ధినే,
ఇచ్ఛానురూపో విభవ: కదా కస్య భవిష్యతి.

ఇంటికి వచ్చిన వాడికి ఆ పూట శ్రద్ధతో భోజనం పెట్టాలి. లేదా, తగినంత ధనమైనా యిచ్చి పంపించాలి. వాడే మరో చోట తింటాడు. ఎప్పుడో తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాననడం వట్టి మాట.
తనకు కావలసినంత ధనం ఎప్పుడూ ఎవడి దగ్గరా ఉండడం చూడం కదా. అంచేత, ఎంతుంటే అంతా యిచ్చి పంపాలి.

న్యాయార్జిత ధనసత్త్వ, ఙ్ఞాననిష్ఠో2తిథి ప్రియ:
శాస్త్రవిత్ సత్యవాదీ వా, గృహస్థత్వే2పి ముచ్యతే.

న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించే వాడూ, తత్వ్త ఙ్ఞానం నందు శ్రద్ధ కలవాడూ, అతిథి అభ్యాగతులను ఆదరించి సేవించే వాడున్నూ, శాస్త్రఙ్ఞుడు, సత్యవ్రతుడు అయిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ముక్తిని పొందుతాడు అని ధర్మ శాప్త్రాలు చెబుతున్నాయి.

దాతవ్య మన్నం విధివత్, సత్కృత్య నతు లీలయా
సర్వే వర్ణా యథా పూజాం, ప్రాప్నువంతి సుసత్కృతా:

ఆయా వర్ణముల వారికి యథోచితముగా సత్కరించి, విధివిహితంగా పూజించి అన్నం పెట్టాలి కాని, ఏదోలే అని, తేలిక భావంతో అన్నం పడవేయ కూడదు సుమా !

తృణాని భూమి రుదకం, వాక్చతుర్ధీ చ సూనృతా,
ఏతాన్యపి సతాం గేహే, నోచ్చిద్యంతే కదాచన

అతిథికి అన్నం పెట్టే శక్తి లేక పోయినప్పటికీ, ధార్మికుడైన గృహస్థుని యింట విశ్రమించే చోటు, దాహానికి మంచి తీర్ధం,నాలుగు మంచి మాటలు ... వీటికి లోటు చేయ కూడదు సుమీ.

అరాప్యుచితం కార్యం ఆతిథ్యం గృహ మాగతే
ఛేత్తు: పార్శ్వగతాం ఛాయాం, నోపసంహరతే ద్రుమ:

ఇంటికి వచ్చిన అతిథి, తన శత్రువయినా సరే, ఆతిథ్యం యిచ్చి గౌరవించాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనే ఇస్తోంది కదా.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంస భక్షణమ్.

అతిథి వాకిటిలో ఉండగా వాడిని విడిచి తాను మాత్రమే అన్నం తినడం మహా దోషం. అలాంటి వాడు పట్టిన ఆపోశనం మద్యపానం చేయడంతో సమానం. వాడు తినే అన్నం గోమాంసంతో సమానం.

బాలో వా యది వా వృద్ధో, యువా వా గృహమాగత:
తస్య పూజా విధాతవ్యా, సర్వస్యా2భ్యాగతో గురు:

ఇంటికి అతిథి, అభ్యాగతునిగా వచ్చిన వాడు బాలుడు కానీ, వృద్ధుడు కానీ - అలా వచ్చిన వాడు పూజనీయుడు. వాడిని పూజించ వలసినదే. అభ్యాగతులు గురువుల వలె అందరకీ ఆదరణీయులు.

ఈ విధంగా కథా మంజరి వాడు అతిథి సేవను గురించి చాలా సేపు నాకు ఓ చింకి లెక్చరు యిచ్చి నా బుర్ర తినీసేడు.

చుట్టాల బాధని ఎలా వదిలించు కోవాలో చెప్పరా నాయనా అంటే చింకి లెక్చర్లతో మెదడు తినేసే
( మధ్యలో సంస్కృత శ్లోకాలూ, వాడి పిండాకూడూనూ) ఈ చాదస్తపు బ్లాగరెక్కడ దొరికాడురా బాబూ. ఇహ మీద వాడి కథా మంజరి బ్లాగు నేను చదవను గాక చదవను.

మీరు కూడా చదవొద్దు. ఏం ?!


27, మార్చి 2011, ఆదివారం

పంతుల సీతాపతి రావు గారి పద్యాలు


శ్రీ పంతుల సీతాపతి రావు పద్య రచనలో విశేష కృషి చేస్తున్నారు. గణిత శాస్ర్త ఉపాధ్యాయునిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు నందిన వీరు తెలుగు పద్యం మీద అపార మైన మక్కువతో తరచుగా పద్య రచన చేస్తూ ఉంటారు. సుందర కాండ మొత్తం వీరు ఇటీవల పద్య రచనగా పూర్తి చేసారు. స్పందించిన ప్రతి అంశాన్ని ఛందో బద్ధం చేయడం వీరి అలవాటు. ఉద్యోగ విరమణానంతరం వీరు ప్రస్తుతం విశాఖ లో ఉంటున్నారు. వారి పుష్పావేదన మన కథా మంజరి బ్లాగర్ల కోసం. చూడండి:
:
పుష్పా వేదన


వేకువందునే మేల్గాంచి వివస మొంది,
దైవ పూజకు పూలను తేవ నెంచి,
పూల తోటకు నేగితి పూలు కోయ, 1

జాలి కురిపించు జంధ్యాల పూల కవిత
ఎచట నుండియో వినిపించె అచట నాకు
మనసు మార్చుకు కొమ్మను విడిచి పెట్టి
వట్టి చేతుల ఇంటికి పయన మైతి 2

పయన మవుతున్న నను జూచి మల్లె యొకటి
"వెళ్ళి పోబోకు మిత్రమా! వెళ్ల కనుచు "
నేల పడియున్న పూలను నెత్తి జూపి
దీన మలరగ వినిపించె వింత కధను 3

వాడి రాలిన మము జూడ వచ్చి నావ?
పూజ కొరకునే పూవులు పూయు ననుచు
భక్తి శ్రద్ధతో మమ్ముల పట్టు కెళ్ళి
పూజ చేసెడి వారు మీ పూర్వ జనులు 4


రంగు రంగుల పూవుల రాసి పోసి,
ఊలు దారాలతో మమ్ము మాల గూర్చి
స్వామి మెడలోన మము వేయు సమయ మందు,
ఎంత ఆనంద పడితిమో ఎరుక పడదు. 5

మంత్రపు నీళ్ళు జల్లి మము మంత్రము తోడనె పూజ చేసి , యా
చెంతన యున్న భక్తులకు చింతలు పోవగ ఇచ్చి నంత , వా
రంతయు పూజ పూవులని ఆత్రత తోడుగ చేత బట్ట ; మే
మెంతగ పొంగి పోయితిమొ ? ఏ తరి చేసిన పుణ్య మంచు చున్ 6

నూట ఎనిమిది పూవులు పూజ చేసి
మంత్ర మంత్రంబు కోక్కొక్క మహిమ జెప్పి,
స్వామి పాదాల చెంతన జార విడువ
ప్రభువు సేవకు ఉపయోగ పడితి మనుచు
అమిత ఆనంద పడితిమి అబ్బురముగ 7

పూజ చేసిన వాడిన పూల నన్ని
భద్ర పరిచియు మర్నాడు పదిలముగను
తులసి మొక్కల నడుమున తురిమి యుంచి
జలము నర్పణ చేసియు జార విడరె ! 8

గోళెముల లోన మట్టిని గుమ్మ రించి,
మొక్కలను నాటి ప్రతి రోజు మొద మలర,
నీరు పోయుచు ప్రాణాలు నిలుపు మీకు ,
పూల నిచ్చెడి సంతృప్తి పొంది నాము ! 9

పెండ్లి కూతురు అందంబు వెల్లి విరియ
మల్లె జాజులు జడలోన మాల తురిమి
బంధు హితులంత మెచ్చుతూ పరవ సించ
జన్మ ధన్యత అయినంత సంభ్రమొందె ! 10

సభల యందున సత్కవుల్ సత్క రించ
పుష్ప గుచ్చము లిచ్చుచు ప్రోత్స హించ
వారి గౌరవ మంతయు మాదె అనుచు
గొప్పగా మేము చప్పట్లు కొట్టి నాము 11

హరికధను చెప్పు హరిదాసు హార మందు,
పూల దండయే దాసుకు ప్రోత్స హమ్ము;
హరియు నామమె ప్రజలకు హర్ష మనుచు
బ్రతుకు చున్నాము ఇన్నాళ్ళు పరువు తోడ 12

సిగను ముడుచు కొనెడి చిరు పూల దండయే,
భార తీయ స్త్రీకి గౌర వమ్ము ;
పెళ్లి రోజు తెచ్చు మల్లె పూదండయే
ప్రియుడు సఖికి ఇచ్చు ప్రేమ గుర్తు ! 13


ప్రకృతికె కాదు జనులకు బహు విధాల
అందము తొ బాటు ఆహ్లాద మంద చేయు
మమ్ము వెలి వెయ మీ కెట్లు భావ్య మయ్య?
ప్రజల కుపయోగ పడ నట్టి బ్రతుకు లేల? 14

అడవి కాచిన పూలలా అంత రించ
పుట్టి గిట్టిన మా కెట్లు పుణ్య మబ్బు?
ప్రభువు సేవకు ఉప యోగ పడుయు నటుల
సాయ మొందించి మా పట్ల జాలి గొనుమ? 15

అనుచు పూలన్ని నా మీద ఆగ్ర హించ
పూజ సరిపడ పూలను ప్రోగు చేసి
పూల నర్పించి దైవాన్ని పూజ చేయ
పరుగు పరుగున ఇంటికి పయన మైతి ! 16







24, మార్చి 2011, గురువారం

డా. ముద్దు వెంకట రమణారావుకొత్త పుస్తకాలు

డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గురించి కథా మంజరి లో ‘‘ విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం’’అనే శీర్షిక లో వారి పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.

అవి:

1. రమణీయం ( కవితా వ్యాస సంపుటి)

2. కమనీయం ( కవితా సంపుటి)

3. ఉదయ కిరణాల (వ్యాస సంపుటి)

4. మహనీయం ( కవితా సంపుటి)

5. సంధ్యారాగం ( వ్యాస సంపుటి )

ఆ వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.

ఇక, ఇటీవల వారు ‘‘వెన్నెల వెలుగులు ’’ అనే వ్యాస సంపుటిని, ‘‘ అనలానిల గీతాలు ’’ అనే కవితా సంపుటిని కొత్తగా వెలువరించారు.

వాటి గురించిన క్లుప్త పరిచయం:

వెన్నెల వెలుగులు:

ఇందులో వివిధ అంశాల మీద సాధికారికంగా వారు వ్రాసిన 33 వ్యాసాలు ఉన్నాయి.

ఈ పుప్తకానికి అక్కిరాజు రమాపతిరావు గారు సాహితీ కదంబం పేరిట ముందు మాటను, డా.ఎస్.వి. సత్యనారాయణ గారు వ్యాస వెన్నెలకు అభినందన పేరిట ఆప్తవాక్యాలను వ్రాసారు.

అక్కిరాజు వారు ఈ గ్రంథాన్ని ప్రపంచ సాహిత్యాన్ని స్థూలంగా ఎరుక పరిచే పెద్దబాల శిక్షగా అభివర్ణించారు.వీటిలో చిత్రణలు మన మనసుని ప్రపంచ యాత్ర చేయిస్తాయి అని చెబుతున్నారు.

అంతగా ప్రాచుర్యం పొందని కావ్యాలను సైతం మరుగున పడి పోకుండా, సామాన్య పాఠకులకు పరిచయం కలిగించడమే ధ్యేయంగా వీటిలో కొన్ని వ్యాసాలను వారు రచించడం జరిగింది. అద్దంకి కేశవరావు గారి తథాగతీయం ఐతిహాసిక కావ్యం గురించిన వ్యాసమే ఇందుకు నిదర్శనం. తాము చెప్ప దలచుకున్న విషయాన్ని నిదానంగాభావించి, పాఠకుల సంభావింప చేసే నైపుణ్యం గ్రథనంలోనూ, కథనంలోనూ కనబడుతుంది అని రమణారావు గారిని అక్కిరాజు ప్రశంసించారు. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చూపే అంతర్వీక్షణం, ప్రపంచాన్నంతా తెలియాలన్న ఆర్తి ఉండాలని, అవి రమణారావు గారిలో పుష్కలంగా ఉన్నాయని, అందు చేతనే ఈ వ్యాస సంపుటి ఇంత సరళ సుందరమై, సుబోధకమై, విషయావగాహనా సమన్వితమై, ఆసక్తి పరులైన తెలుగు వారికి అత్యంత సన్నిహితంగా చేరువయ్యేలాగున వెలువడిందని అక్కిరాజు రమాపతి రావు గారు అభిప్రాయ పడడం సహేతుకమే అనిపిస్తుంది.

డా.ఎస్.వి.సత్యనారాయణ గారు తమ ఆప్త వాక్యంలో చర్విత చర్వణంగా పూర్వ సాహిత్య సౌరభాల గురించి లోగడ విమర్శకాగ్రేసరులు చెప్పిన విషయాలనే తిరిగి చెప్పకుండా, వారు దర్శించిన వినూత్న సాహిత్యాంశాలను రేఖామాత్రంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సదాశయంతో రమణారావు గారు ఈ వ్యాస వెన్నెలను రూపొందించారని చెబుతున్నారు.

ఆయా సాహిత్యాంశాలలో చక్కని పరిశ్రమ చేసి కూడా, సామాన్య పాఠకజన పఠనపరిశ్రమని గణన లోనికి తీసుకుని నాతి దీర్ఘమైన రీతిలో ఈ వ్యాసాలను రచించడం జరిగిందని రచయిత తమ ముందు మాటలో తెలియజేసారు.

ఈవ్యాస సంపుటిలో వసు చరిత్రం, ఆముక్త మాల్యద, అనిరుద్ధ చరిత్రము, తొలి అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, ఐతిహాసిక కావ్యం తథాగతీయం, వంటి గొప్ప ప్రాచీన కావ్యములను గురించిన అనుశీలనమే కాక, నాయని సుబ్బారావు కృతులు, జాతీయోద్యమ కాలం నాటి రచనలు, ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథకులు, మరాఠీ నాటక కర్త విజయ్ తెందూలక్కర్, విక్టోరియా యుగం నాటి ఆంగ్ల సాహిత్యపు పోకడలు, రష్యన్ సాహిత్య పరిచయం, అప్పటికీ ఇప్పటికీ షేక్స్పియర్, లాంటి వ్యాసాలు పొందు పరిచారు.

సంగీతాభిమానులైప ఈ రచయిత వాటికి సంబంధించిన కొన్ని మంచి వ్యాసాలను కూడ ఇందులో జత చేసారు. హిందూస్థానీ శాష్త్రీయ సంగీత పరిచయం, సూర్య కుమారి జాతీయ గీతాలు ఈ కోవకి చెందిన వ్యాస రచనలు.

వీరికి చిత్రకాళాభినివేశం కూడ మెండు. ఆధునిక చిత్ర కళ, ఆంధ్ర చిత్ర కళ వంటి లఘు వ్యాసాలను చదివితే ఈ విషయం కాదనలేం.

ప్రాచీన, అర్వాచీన సాహిత్య గ్రంథాల పట్ల అభిరుచి కలిగి ఉండడం, తగినంత కృషి చేసి సంస్కృత సాహిత్యం అధ్యయనం చేయడం తాను అనుభవించిన వాటిని అక్షరాలలో అందంగా పలవరించడం, పదిమందితో పంచు కోవడం వీరికి చాల ప్రీతి పాత్రమైన విషయంగా తోస్తుంది. అది. సాహిత్యం, చిత్ర కళ, నృత్య రీతులు, శిల్పం, పర్యటనానుభవాలు , సంగీతం ... ఏదయినా కావచ్చును. వాటి ఆనుపానులు తెలుసు కోవాలనే అనురక్తి వీరిలో మెండు. తెలిసిన దానిని, తెలుసుకున్న దానిని, సామాన్య పాఠకులకు తెలియ జేయాలనే ఆర్తి కూడ ఎక్కువే. ఎదిగిన కొద్దీ ఒదిగే మనస్తత్వంతో,

వీరు ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్నీ అక్షర బద్ధం చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతులయ్యారని ఈ పుస్తకాలే చెబుతున్నాయి.

ఈ వ్యాస సంపుటిని వీరు తమ బాల్య మిత్రులు, సహృదయులు, విద్యా వేత్త, అశేష శేముషీ ధురంధరుడు, కీ.శే. ఆచార్య తూమాటి దొణప్ప ( మాజీ వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం) మధుస్మృతికి అంకితం చేసారు.

ఇక, వీరు ప్రచురించిన కొత్త కవితా సంపుటి అనలానిల గీతాలు:

62 కవితలు గల ఈకవితా సంపుటికి డా.సి.నారాయణ రెడ్డి గారు, డా,ఎన్. గోపి గారు అభినందన వాక్యాలు అందచేసారు.

భావపూర్ణంగా, సముచిత పదనిహితంగా పాఠకులకు అందించే సృజనాత్మక ప్రతిభ రమణారావు గారిదని సి.నా.రె ప్రశంసించగా,అనలానిల గీతాలలో అనల గీతాలు ( అగ్నికి సంబంధించినవి) అనిలగీతాలు ( వాయువుకి చెందినవి) , వాటి గూర్చిన కవితాలాపన, తాత్వ్తిక స్పర్శ కనిపిస్తున్నదని ఆచార్య గోపి వివరించారు. మృదుత్వం, తగ్గని ప్రౌఢశైలిలో రాసిన పద్యాలు రమణారావు గారి కవితా శక్తిని తెలియ జేస్తాయి అని అభినందిస్తున్నారు.

వీటిలో అనలానిల గీతాలే కాకుండా అన్య వస్తు సంబంధితాలయిన మరి కొన్ని కవితలను కూడ చేర్చడం జరిగింది.

వీటిలో అనల గీతాలు 15, అనిల గీతాలు 12, ఇతరములు 31, అనువాద గీతాలు 4 మొత్తం 62 కవితలు చేర్చారు. సంఖ్యాపరంగా ఇతర గీతాలు, అనువాద కవితలు అనలానిల గీతాల కన్న ఎక్కువ కనిపించే ఈ కవితా సంపుటికి అనలానిల గీతాలు అనే పేరు ఉంచడం చిత్రమనిపించినా, అసంగతంగా తోచదు. పాంచభౌతిక పరివ్యాప్తమైన లోకంలో అనల స్పర్శ, అనిల స్పర్శ లేనివి ఏవీ ఉండనేరవు అనే స్పృహ ఈ కవి లో ఉండడం చేత దీనికి అనలానిల గీతాలు అనే పేరు సముచితమని భావించి ఉంటారు.

అనల గీతాలు అగ్నిమీళే పురోహితమ్ అనే వేద వచనంతోను, అనిల గీతాలు మలయానిల గీతం తోను మొదలు పెట్టడం వీరి ఔచితీ ప్రదర్శనకు తార్కాణ.

ఈ కవితా సంపుటిలో వీరి కవితా సామర్ధ్యానికి ఉదాహరణ ప్రాయంగా కొన్ని కవితా పంక్తులని చూడండి:

అణువునణువున నిక్షిప్తమైన అగ్ని

జఠర మందు జీర్ణాగ్నిగా జ్వలనమందు

ప్రాణులన్నిట వెలిగెడి ప్రాణ జ్యోతి

పీడితుల మానసమ్ముల విప్లవాగ్ని.

అగ్ని గీతం అనే శీర్షికన వెలువరించిన ఈ చిన్ని కవితలో ప్రాణులన్నిట వెలిగే అనల జ్యోతి పీడితుల మనస్సులలో రగిలే విప్లవాగ్నిగా అభివర్ణించడం కవికి గల అభ్యుదయ దృక్ఫథాన్ని తెలియ జేస్తోంది.

ఒక దీపం చాలు వేయి దీపాలను వెలిగించును అనే భావనకు పద్య రూపం:

ఒక్క దీపమ్ముతోడ ప్రద్యోతమౌను

శతసహస్ర దీపమ్ములు ; సకల శుష్క

వనములనెల్లను దావాగ్ని కణము కాల్చు

మంచి చెడ్డల రెంటిని పంచునగ్ని.

ఇక, అనిల గీతాలలో తొలియూరుపు అనే కవిత గొప్ప తాత్త్విక కోణం ఆవిష్కరించే కవిత.

తొలియూరుపు నుండి కడపటి యూరుపు వరకు జీవధార ప్రవహింపగ, చేతన ప్రభ వికసింపగ అవిరామంగా ప్రసరించే మారుత తరంగాలకు కవి అంజలి ఘటిస్తున్నారు.

అనిల గీతాలాపనలో గాలిలో కలసి పోయిన కాలకూట విషవాయువు బారిన మృత్యువాత పడిన అసంఖ్యాక జనుల మృత్యు ఘోష విషవాయువు కవితలో వినిపిస్తున్నారు. ఇది వీరి సామాజిక స్పృహకు నిదర్శనం.

భీకర దృశ్యమ్మది

వేలకొలది జనులు

విగత జీవులైన వేళ

విషాద చరిత సృష్టించును

అని చెబుతూ ఈ దండనీతి యేరీతిగ సాగిందని, ఎవరు దీనికి బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

ఇతర గీతాలలో చక్కని గీతాలు కనిపిస్తాయి. సెల్ ఫోన్, టైమ్ మిషీన్ వంటి చమత్కార జనితాలయిన కవితలను ఈ విభాగంలో చూడవచ్చును.

మనలోనే కాలయంత్రములు

మనస్సులోనే ఇమిడి వున్నవి ...

అంటూ, మన ఙ్ఞాపకాలే గత కాలం లోకి మనలని మోసుకుని పోతాయనీ, మన కలలే భావి మార్గంలోకి మనలను పయనింప చేస్తాయనీ, అందు వలన కడు క్లిష్టమైన ఖరీదయిన యంత్రాలతో పని లేదని వివరణ యిస్తున్నారు.

ఈ కవి తమ కవితావేశాన్ని ఇలా అక్షరీకరిస్తున్నారు:

కవితావేశము పొంగు వేళల లసత్

కావ్యాకృతుల్ మన్మనో

భవమై, సుందర పద్య గేయ రచనల్

భాసించు స్వేచ్చా విధిన్

మివులన్ సమ్మదమై, నవరసో

న్మీలమ్ముగా వ్రాసెదన్

ఇవినా తప్పులుగా బుధుల్ తెలిసి

సైరింపంగ ప్రార్ధించెదన్.

ఈ కవితాభివేశం యిలాగే నిండు నూరేళ్ళు కవిలో ఉండాలని కోరుకుందాం,

ఈ కవితా సంపుటిని వారు తమ ఆప్తుడు, సహృదయుడు, కవి, పండితుడు అయిన కీ.శే. పంతుల విశ్వనాధ రావు మధుర స్మృతికి అంకితం ఇచ్చారు.

సుందరంగా వెలువడిన ఈ రెండు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),వారు ప్రచురించారు. వారి ప్రథాన కార్యాలయం శ్రీకాకుళంలో ఉంది. వెన్నెల వెలుగులు వ్యాస సంపుటి వెల రూ. 125. కాగా, అనలానిల గీతాలు కవితా సంపుటి రూ.75 లకు లభిస్తోంది.

ఇతర వివరాలకు: శ్రీరామిశెట్టి, ప్రథాన కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం వీధి,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001

పెల్: 9441707772

చిరునామాకి సంప్రదించ వచ్చును.

లేదా, నేరుగా రచయిత గారినే పంప్రదించ వచ్చును. వారి చిరునామా:

డా,యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ

రిటైర్డ్ సివిల్ సర్జన్

ప్లాట్ నం. 211, ఎస్.బి.ఐ కాలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001

ఫోన్: (08942)223143 సెల్: 9849696511

6, మార్చి 2011, ఆదివారం

ఎర్ర డబ్బా ఆకలి కేకలు


ఎర్రగా బుర్రగా, కొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?

నగరాల్లో, పట్నాలలో, పల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులు, కవర్లు, ఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చి, నా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరి, అక్కడ ముద్రలు వేయించుకుని, ఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలో, బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళి, అవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.



ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవి, కబుర్లు చెప్పేవి, నిష్టూరాలు పలికేవి, నిందలు వేసేవి, సాయం కోరేవి, అభయం యిచ్చేవి, ధైర్యం చెప్పేవి, బెంగలు, బాధలు, చికాకులు, కష్టాలు కలబోసుకునేవి, కన్నీళ్ళు కార్చేవి, నవ్వుతూ కళకళ లాడేవి ... ...

కొన్ని మృదువుగా, కొన్ని కఠినంగా, కొన్ని క్లుప్తంగా, కొన్ని సుదీర్ఘంగా, మరి కొన్ని పెళుసుగా, కుండ బద్దలు కొట్టి నట్టుగా, హెచ్చరికలు, ఓదార్పులు, మంతనాలు, హిత వచనాలు, వేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...

శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .

కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.

కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...

ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.

మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.

ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?

లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?

నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.

ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...

ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనో పూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.

సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.

అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..

అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.


చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.

నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?

2, మార్చి 2011, బుధవారం