
31, మార్చి 2010, బుధవారం
ఆశ ... దోశ ... అప్పడం ... వడ ....

30, మార్చి 2010, మంగళవారం
చెప్తే వినాలి ...
28, మార్చి 2010, ఆదివారం
అవును కదూ ?
10, మార్చి 2010, బుధవారం
ఇచ్చుటలో ఉన్న హాయీ ....
ప్రియ:ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వర:
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి :
మబ్బు ఎప్పుడూ నీటినే యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !
ఎంత మంచి శ్లోకమో చూసారు కదూ ?
ఇవ్వడంలోని గొప్పతనం అలాంటిది మరి...
ఇవ్వడంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపై కపోల తటిపైఁబాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !
వామన చరితంలోని ఈ పద్యం బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన
పద్య రత్నాలలో యిదొకటి !
9, మార్చి 2010, మంగళవారం
అల్లుడా ! మజాకానా !!
సదా వక్ర: సదా క్రూర: సదా పూజామపేక్షతే
కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమ గ్రహ:
ఎప్పుడూ కుటిలంగానే ఆలోచిస్తూ ఉంటాడు. తనని అందరూ నిత్యం గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు.
అమ్మాయి కొంగు ఒక్క క్షణం సేపు కూడా వదలడు. ఎవరయ్యా ? దశమ గ్రహంగా పిలవబడే అల్లుడు !
అప్పొసింగిన వాడును, అల్లుడ, ద్దె
యింటి యజమానుడు, జీతమిచ్చు వాడు
కుల వినోదియు, పన్నులు కూర్చు వాడు
పుస్తె కట్టని మగడు పో పురుషులకు !
ఆడ పడుచు అర్ధ మొగుడని మనం విన్నదే కదా ? ఆ పద్యంలో మగాళ్ళకి మొగుళ్ళ గురించి చెబుతున్నాడు కవి.
వెలయాలు, శిశువు, అల్లుడు
నిలయేలిక, యాజకుండు, నేవురు ధరలో
కలిమియే లేమియు దలపరు
కలియుగమున కీర్తి కామ కాటయ వేమా !
ఉందా, లేదా అని చూడకుండా పీడించే వాళ్ళ జాబితా చూడండి ... మీది పద్యంలో చెప్పిన ఐదుగురూ వీర లెవెల్లో పీడించడమే పనిగా పెట్టుకునే వాళ్ళుట ...
మోడరన్ అల్లుళ్ళ గురించి పాత కాలపు కవి వాపోయిన విధంబెట్టిదనిన ...
నీటయిన యింగ్లీషు మోటారు సైకిలు
కొని పెట్ట వలెనను కూళ యొకడు
రిస్టు వాచియు, గోల్డు రింగును, బూట్సును
సూట్లు కావలెనను శుంఠ యొకడు
బియ్యే, బియల్ వరకయ్యెడు ఖర్చు
భరియింప వలెనను దరిధ్రుడొకడు
భార్యతోడను చెన్న పట్టణంబుననుంచి
చదివింప వలెనను చవట యొకడు
సీమ చదువులు చాల సింపిలు, నన్నట
కంప వలెననుచు నడుగు నొకడు
ఇట్లు కొసరు కింద నిష్టార్ధముల్ వరులు
దెలుపు చున్న వారు తెల్లముగను
మరో శ్లోకం చూడండి ...
జామాతరో, భాగినేయా, మాతులా దారబాంధవా
అగ్నాతా ఏవ మాతులాం భక్షయంత్యాఖువత్ సదా
దార బాంధవులు నిత్యం మన సంపాదనని ఎలుకల్లా తినేస్తారుటండీ ...
అలుని మంచితనంబును
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్
పొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులును లేవు తెలియగ సుమతీ !
శ్వశుర మందిర నివాస: స్వర్గతుల్యో నరాణాం
యది భవతి వివేక: పంచభిషడ్దినైర్వా
దధి మధు క్షీర లోపో మాసమేకం నరాణాం
తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ:
అత్తవారిల్లు అయిదారు రోజులు స్వర్గ తుల్యమే. పంచ భక్ష్య పరమాన్నాలూ అమరుస్తారు ... పాత బడితే పాద రక్ష ప్రయోగమే సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు.
8, మార్చి 2010, సోమవారం
తినడం మానెయ్యొద్దు
కైర జీర్ణ భయాత్ భ్రాత: భోజనం పరిహీయతే ?
తప్పునకు భయపడి ఏ పనీ చేక పోవడం మంచిది కాదు. అరగదని చెప్పి , అన్నం తినడం మానేస్తామా చెప్పండి
15, ఫిబ్రవరి 2010, సోమవారం
పేరు చెబితే చాలదు ...
యస్తు క్రియవాన్ పురుష: స విద్వాన్
సు చింతితం ఔషధ మాతురాణాం
నా నామ మాత్రేణ కరోతి శాంతి :
బాగా ఆలో చించి నిర్ణయించిన ఔషధమే అయినా, దాని పేరు చెప్పినంత మాత్రాన రోగం పోదు కదా ? శాస్త్రాలు చదివినా, క్రియాశేలురు కాక పోతే మూర్ఖులుగానే మిగిలి పోతారు.
14, ఫిబ్రవరి 2010, ఆదివారం
వాక్యం రసాత్మకం కావ్యం ...
భిక్షుణా కక్ష నిక్షిప్త కిమిక్షుర్నీరసో భవేత్ ?
కవి దరిద్రుడయినా, ధనికుడయినా, కవిత్వం రసవంతంగా ఉంటే చాలు. బిచ్చగాని చేతి చంకనున్నంత మాత్రాన చెఱకు గడకు తీపి తరిగి పోదో దు కదా !
12, ఫిబ్రవరి 2010, శుక్రవారం
శివార్పణం - కథ
హర హర ! మహా దేవ !!
తల పైని చదలేటి యలలు తాండవమాడ
నలల త్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముమైన ముంగురులు చెఱలాడ
కను బొమ్మలో మధుర గమనములు నడయాడ
కను పాపలో గౌరి కసి నవ్వు బింబింప
కను చూపులను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవ కంట గటి నిప్పులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ
అమిత సంరంభ హాహాకారములు రేగ
ఆడెనమ్మా శివుడు !
పాడెనమ్మా భవుడు !
కిసలయ జటాచ్ఛటలు ముసురు కొని వ్రేలాడ
బుసలు గొని దల చుట్టు భుజగములు బారాడ
మకర కుండల చకాచకలు చెక్కులబూయ
అకళంక కంఠ హారాళి నాట్యము సేయ
ముకు జెఱములో శ్వాసముల దదడింపంగ
బ్రకట భూతి ప్రభా వ్రజమాచరింపంగ
విటల తటమున చెమట నిండి వెల్లువ గట్ట
తకఝణత యను తాళమానము తోడ
వికచ నేత్రస్యంది విమల చూపుల తోడ
ఆడెనమ్మా శివుడు !!
పాడెనమ్మా భవుడు !!
మహా శివ రాత్రి శుభాకాంక్షలు .. ఈ పర్వ సందర్భంగా సరస్వతీ పుత్ర పుట్ట పర్తి నారాయణాచార్యుల వారి ప్రసిద్ధ కావ్యం శితాండవం నుండి మీది మీగడ తరకలు ...
8, ఫిబ్రవరి 2010, సోమవారం
పులి జూదం


అశ్వం నైవ గజం నైవ
వ్యాఘ్రం నైవచ నైవచ
అజా పుత్రం బలిం దద్యాత్
దైవో దుర్బల ఘాతక:
గుఱ్ఱాన్నీ, ఏనుగునీ బలి యివ్వరు. బలం లేని మేకనే బలి యిస్తారు. దేవుడు దుర్బలులనే శిక్షిస్తాడు కదా !
చరిత్ర గతిని పరిశీలిస్తే , యిది నిజమే అనిపిస్తుంది కదూ ! ఈ పర పీడన పరాయణత్వం అంతటా కనిపిస్తూనే ఉంటుంటుంది.
‘‘ బలవంతులు దుర్బల జాతిని
బలహీనుల కావించారు
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం ?
నర జాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం ... ’’ అని శ్రీ.శ్రీ అన లేదూ ?
భాస్కర శతకంలోని పద్యం అదే చెబుతోంది కదూ !
తగిలి మదంబుచే నెదిరిఁదన్ను నెఱుంగక దొడ్డ వారితోఁ
బగఁగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు ; టింతెఁగాక, తా
నెగడి జయింప నేరడిది నిక్కము ; తప్పదు ; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా !
తన బలమేమిటో గ్రమించుకో లేక, ఎదిరి బలాన్ని ( శత్రువు బలాన్ని) అంచనా వేసుకోకుండా, బలవంతుడితో ఢీకొట్టి పోరుకి సిద్ధ పడిన వాడు చెడి పోతాడనడంలో సందేహం లేదు...
లోకంలో కొండని మదంతో ఢీ కొట్టిన పొట్టేలు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా ! కొండ అలాగే ఉంటుంది. పొట్టేలు మాత్రం ఛస్తుంది.
ఈ చెప్పిన విషయాలు కొంత నిరాశా వాదాన్ని ప్రోది చేస్తున్న వేమో అనుకునే పని లేదు. వ్యష్టి శక్తి సమిష్టి శక్తిగా రూపు దాల్చడం జరుగని రోజులవి. అయినా, దోపిడీ వర్గ స్వభావాన్నీ, బలాన్నీ చక్కగానే అంచనా వేసాయనే చెప్పాలి.
చీమలు పెట్టిన పుట్టలు పాముల ఆక్రమణకి లోను కావడం ఈ దోపిడీనే తెలియ జేస్తుంది.
అయితే, మన బద్దెన కవి హెచ్చరిక చేయనే చేసాడు కదూ ! ...
బలవంతుఁడ నాకేమని
బలువురితో నిగ్రహించి పలుకుట మేలా ?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతఁజిక్కి చావదె సుమతీ !
7, ఫిబ్రవరి 2010, ఆదివారం
అధికారాంతమునందు చూడవలె ....
ఒక చక్కని శ్లోకం చూదామా?
ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే
ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...
ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !
త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !
ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...
విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !
నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...
ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్
రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...
అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...
కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !
అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !
6, ఫిబ్రవరి 2010, శనివారం
చిలుకా పలకవే ....
సద్విద్యా యది కా చింతా
వరా కోదర పూరణే
శుకోప్యశన మాప్నోతి
రామ రామేతి చాబ్రువన్
ఎంత చక్కని శ్లోకమో చూడండి ...
రామ రామ అనే రెండు మాటలు నేర్చిన చిలుకే తన తిండిని తాను సంపాదంచుకో గలుగుతోంది. హాయిగా బ్రతుకుతోంది.
మరి, బాగా చదువుకున్న వారికి ఎందుకంత బెంగ ?
బాగుంది కదూ ! ఇలాంటి చక్కని శ్లోకాల నీ, మంచి పద్యాలనీ ఇక నుండీ ఈ టపాలో మీరు చూడ వచ్చును ...
5, ఫిబ్రవరి 2010, శుక్రవారం
చదరంగం - వడ్ల గింజల లెక్క !
చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగం గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా ! అనే లెక్క గురించి మనకి తెలిసిందే కదా ? పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో యీ లెక్కనీ, దాని జవాబునీ యిచ్చాడు . చూదామా ...
మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్
ఇదీ లెక్క. దీనికి జవాబు :
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్
ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి.
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...
శరములు = సాయకములు = ఐదు
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.
ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది !
ముందు మీరు ప్రయత్నించండి.
లేదా,
జవాబు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడాల్సిందే.మరి మీ యిష్టం !
18446744073709551615
4, ఫిబ్రవరి 2010, గురువారం
జఠరాగ్ని - కథ

30, జనవరి 2010, శనివారం
శరణు ! శరణు !! - కథ
శిక్ష - కథ
28, జనవరి 2010, గురువారం
తిరుపతి వేంకట కవులు - అభినవాంధ్ర భోజ దర్శనం

తిరుపతి వేంకట కవులు నానా రాజ సందర్శనం చేస్తూ, అభినవాంధ్ర భోజులు, వితరణ శీలి , విజయ నగర ప్రభువులు ఆనంద గజపతి మహా రాజులను స్తుతిస్తూ చెప్పిన పద్య రత్నాలు ...
అల పతంజలి కృతంబైన భాష్యమునకే
పరిఢ విల్లును మహా భాష్య పదము
అల దేవ దేవుడై యలరారు శివునకే
తేజరిల్లును మహా దేవ పదము
అల త్రివిష్ఠప విభుండైన పాకారికే
యెన్నందగును మహేంద్ర పదము
అల కాళికా దాసుడౌ కవీశ్వరునకే
గణన కెక్కును మహా కవి పదమ్ము
రమణఁబరికింప నల మహా రాజ పదము
నీక తగు గాక, యన్యు లౌ లోక పతుల
కొకరికైనను చెల్లునే ! యోగ రూఢి
విజయ నగర మహా రాజ ! విపుల తేజ !
రాజు రాజనఁగనే రాజాయెనే చంద్రు ?
డల రాజ శేఖరు నాశ్రయించె
రాజు రాజనఁగనే రాజాయెనే యింద్రు ?
డర్క మాత్మజుని దాన మడిగి కొనియె
రాజు రాజనఁగనే రాజ రాజా కుబే
రుడు ? కిం నరేశత్వ రూఢి గాంచె
రాజు రాజనఁగనే రాజ రాజా సుయో
ధనుఁ? డధి కర్ణత్వ మనుగ మించె ;
రాజనిన రాజ రాజన్న రాజులందు
నీక తగు గాక యన్యు లౌ లోక పతుల
కొకరి కైనను చెల్లునే ? యుర్వి లోన
విజయ నగర మహా రాజ ! విపుల తేజ !
తానా రాజు, సుతుండు కోమటి ; కళత్రంబెన్న నక్షత్ర మెం
తో శైల్యమ్ము, నిశాకరత్వమును, శైత్యోపాధియుంగల్గు తా
రా నాధుండన దేహ గేహ వితత్రై వర్ణ సాకర్యకు
డౌనా ? యెన్నటికిన్ భవాదృశుడు ? కాడానంద భూపాలకా !
దీన పోషకుడన్న తేట మాటకు మహా
రాజ ! నీ నగరి కాలేజి సాక్షి !
విద్వత్ప్రభువటన్న విఖ్యాతి కో శాంత
నిధి ! భవన్నగర పండితులు సాక్షి !
శ్రిత పోషకుండన్న వితత కార్తికి మహా
మతి ! భవన్నగర హర్మ్యములు సాక్షి !
ఆనందమ కాలయంబన్న మాట కో
చారు ప్రతాప ! నీ పేరు సాక్షి !
నీ యశము దేశముల నిండె ననుట
కితర దేశాటకులమైన యేము సాక్షి !
పౌషవాడ కులాంబోధి పూర్ణ చంద్ర !
శ్రీమదానం గజపతి క్షితి తలేంద్ర !
తిరుపతి వేంకటేశ్వరులని ధీరులు పిల్తురు మమ్ము, బ్రహ్మ స
ద్గురు వరు పాద సేవన మకుంఠిత సత్కృప మాకు నిచ్చె వ్యా
కరణము ; నీ కవిత్వమనఁగా నది పిన్నట నాడ పుట్టె న
బ్బురముగఁ బెంచు కొంటి మిది పొమ్మనినన్ మఱి పోదు భూవరా !
ఎందఱఁ జూపెనేని వరియింపదు మా కవితా కుమారి, క
న్నందుకు దేశముల్ దిరుగుటబ్బెను ; సౌఖ్యము లేక పోయె నా
నంద నృపాల ! నీదు సుగుణమ్ములు చెప్పిన నాలకించి వెం
టం దలయూచెఁగావునఁ దటాలునఁ దీనిఁబరి గ్రహింపుమా !
కవితా మాధురిఁ దా గ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబుగా
దు ; విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్, వహ్వరే !
కవిరాజా !‘‘ యని, మెచ్చి యిచ్చు నృపుఁడొక్కడైనఁగర్వైనచోఁ
గవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !
అమ్మ వంకనుఁజుట్టమా యేమి ? భోజ భూ
పాల వర్యున కల్ల కాళి దాసు !
అబ్బ వంకనుఁజుట్టమా యేమి ? విక్రమ
ప్రభు వరేణ్యున కల్ల భట్ట సుకవి !
అత్త వంకనుఁజుట్టమా యేమి ? రాజ ధ
రా ధీశ్వరునకు నన్నయ్య భట్టు !
మామ వంకనుఁజుట్టమా యేమి ? కృష్ణ రా
డ్ధరణీశ్వరునకు ఁబెద్దన్న గారు !
కవి యయిన వాని నెల్లను గారవింప
రాజయిన వాని కెల్ల ధర్మమ్ము గాక !
పూషవాడ కులాంబోధి ! పూర్ణ చంద్ర !
శ్రీమదానంద గజపతి క్షితి తలేంద్ర !!
శత ఘంట కవనం కరతలామలకంగా చెప్పి. అష్టావధాన కష్టావలంబనము ‘‘ నంబి కొండయ దండనము మాకు !’’ అనివచించిన ధీశాలురు తిరుపతి కవులు ! ‘‘ అల నన్నయ్యకు లేదు , తిక్కనకు లేదా భోగ...’’ మన గలిగినా, ‘‘ దోసమటంచెఱింగియును దుందుడు కొప్పఁగఁబెంచినార మీ మీసము ...’’ అన గలిగినా ఆ ధిషణ వారికే తగును కదా !!
27, జనవరి 2010, బుధవారం
మహా కవి కాళి దాసు - నాలుగు శ్లోక రత్నాలు ...
మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్హ్ఞాన శాకున్తలం మహోన్నతమైన నాటకం.గీర్వాణ భాషలో విరచితమయిన ఆ నాటకాన్ని చదివి గెటే పండితుడు ఆనందం పట్ట లేక, నాట్యం చేసాడుట .
కావ్యేషు నాటకం రమ్యం
నాటకేషు శకున్తలా
తత్రాపి చతుర్ధోంక:
తత్ర శ్లోక చతుష్టయమ్
అని కదా, పెద్దలు అంటారు. కావ్య రచనలలో కెల్లా సమాహార కళ అయిన నాటకమే రమణీయ మయినది. అందులోను కాళిదాసు రచించిన శాకున్తలమ్ మరీ రమణీయం. ఆ నాటకంలోను, నాలుగో అంకం, అందునా, మరీ ముఖ్యంగా నాలుగు శ్లోకాలూ బహు రమణీయాలని చెప్తూ ఉంటారు...
ఆ మనోహర మయిన నాలుగు శ్లోకాలనూ, మరో సారి మీతో పంచుకునే భాగ్యాన్ని నాకు కలుగ జేయండి ..
వీటికి శ్రీ కందుకూరి వీరేశ లింగం పంతులు గారు రచించిన యథానువాద తెలుగు నాటకం నుండి తెలుగు సేత పద్యాలను కూడ ప్రతి శ్లోకం క్రింద యిస్తున్నాను... అవధరించండి ...
శకుంతల అత్తవారింటికి, దుష్యంతుని వద్దకు బయలు దేరుతూ ఉంటే, కణ్వ మహా ముని ఆమెకు అత్త వారింట ఎలా ప్రవర్తించాలో బోధించే ఘట్టం ...
యాస్యత్యద్య శకున్తలేతి హృదయం సంస్ప ష్ట ముత్కంఠయా
కణ్ఠస్తంభిత బాష్ప వృత్తి కలుషశ్చిన్తా జడం దర్శనమ్
వైక్లబ్యం మమ తావదీదృశ మహా స్నేహాదరణ్యౌకస:
పీడ్యంతే గృహిణ: కథం నుతనయా విశ్లేష దుఃఖైర్నవైః
కందుకూరి వారి అనువాదం ...
కొందలమందె డెందము శకుంతల తానిపుడేగు నంచయో,
క్రందుగ బాష్ప రోధమున కంఠమునుంజెడె, దృష్టి మాంద్యముం
బొందె, నొకింత పెంచిన తపోధనులే యిటు కుంద, నెంతగాఁ
గుందుదురో తమంతగను కూఁతులఁబాయు గృహస్థలక్కటా.
2. పాతుం నప్రధమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషుయా
నా దత్తే ప్రియమణ్డనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్
ఆద్యేవ: కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్యుత్సవ:
సేయం యాతి శకున్తలా పతి గృహం సర్వైరను ఙ్హ్ఞాయతాం
ఎవతె జలంబు మీకిడక యెన్నడుఁద్రాగదు తాను ముందుగా
నెవరితె ప్రేమచేఁజిదుమ దీప్సిత భూషణమయ్యు, మీ చిగు
ళ్ళెవతకు మీరు తొల్త ననలెత్తుట పండువుగాగ నుండు నా
ప్రవిమల గాత్రి యేగుఁబతి సజ్జకు నందరనుజ్ఞ నీయరే.
3. అస్మాన్ సాధు విచిన్త్య సంయమి ధనానుచ్చై: కులంచాత్మన
స్త్వయ్యస్యా: కథమప బాంధవ కృతాం స్నేహ పృవృత్తించతామ్
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా
భాగ్యాయత్త మత: పరం నఖలు తద్వాచ్యం వధూబన్ధుభి:
మమ్ముల సత్తపోధనుల, మాన్య భవత్కులమున్, స్వబంధులన్
సమ్మతి వేడ కీమె యెటొ సల్పిన నీ పయి కూర్మినెంచి మా
కొమ్మని నేలు కొమ్ము పరికొమ్మలతో సమగౌరవంబుగన్
బిమ్మటిదెల్ల భాగ్యమగు , పేర్కొనరాదిది యింతి బంధువుల్.
4.. శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే
భర్తుర్వి ప్రకృతాపి, రోషణతయా మాస్మ ప్రతీపం గమ:
భూయిష్ఠ భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాన్త్యేవం గృహిణీపదం యువతయో వామా: కులస్యాధయ:
4. గురులకు సేవ చేయు మనుగుంగతి జూడుము నీ సపత్నులన్
వరుడలుకన్వహించినను భర్తృ విరుద్ధవు గాకు మీసునన్
పరిజనులందుఁజూపుము కృపంగడు, బొందకు భాగ్య గర్వమున్
తిరిగిన నిట్లు, కాంతురు సతీత్వము కాంతలు, నింద్యము లొండుచోన్.
26, జనవరి 2010, మంగళవారం
పట్టు పరికిణి - అల నాటి నా కథ

ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో తొలిసారిగా 6-1 -1971 దీ సంచికలో ప్రచురింప బడింది.
అదే పత్రికలో అలనాటి కథలు శీర్షిక క్రింద తే 10-2-2001 దీ సంచికలో తిరిగి ప్రచురింప బడింది






శ్రీనాథ మహా కవి రచించిన కాశీ ఖండంలోని గుణ నిధి కథ ఆధారంగా నవ్య శివరాత్రి ప్రత్యేక సంచిక ౧౭-౨-౨౦౧౦లో ప్రచురణ. అతిగారాబంతో పిల్లలను చెడ గొట్టే వారికి గుణ పాఠం చెప్పడంతో పాటు, శివ లీలలు తెలిపే కథ యిది.
.jpg)













