7, మే 2010, శుక్రవారం

పలుకే బంగారం !!










సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.

ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడండి ...

కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ !

పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా, కోకిల - అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ? దాని గొంతువిని మెచ్చుకుంటావు ?

మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట పడుతున్నావు ?

అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....

బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు బాధించకుండా మాటలాడదగునని చెప్పాడు కదా ?

ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి. ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్వహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.

అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక, కాస్త సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...

అయితే , కొందరున్నారు ... ఎంత మంచిగా చెప్పు ... వినరు. తల కెక్కించు కోరు. వాళ్ళకి తెలీదు. చెబితే వినరు.


భర్తృహరి ఎలా వాపోయాడో చూడండి ...

బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయ దూషితా:
అబోధో పహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్

బాగా తెలిసిన వారికి మదం, మాత్సర్యం జాస్తి. చెబితే వినరు. ప్రభువులా - వారసలే గర్విష్ఠులు. వారికి చెప్ప లేం. ఇక ఇతరులంటారా, వారికి చెప్పినా అర్ధం కాదు. అందుల్ల నాలుగు మంచి మాటలు చెబుదామన్నా నోరు దాటి బయటకి రావడం లేదు.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం కూడా చూడండి ...

బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.




సనాతన ధర్మం చెప్పినది చూడండి ...

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మస్సనాతన:

సత్యాన్నే పలకాలి.ప్రియ వచనలాలే పలకాలి. సత్యమయినా, అప్రియాన్ని పలకవద్దు. ప్రియమైన దయినప్పటికీ అసత్యం పలక వద్దు. ఇది సనాతన ధర్మం.

అయితే, తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ పాపహేతువేనని నన్నయ గారు ...

తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.

తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ, సత్యము పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు ...

ప్రియ భాషణముల గురించి ఎలాగూ చెప్పుకుంటున్నాం కనుక ఇది కూడా చూడండి ...

అనుదిన సంతోషణములు,
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
తనయులు సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్

పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పిన పద్యమిది.

కొడుకుల ముద్దు మాటలు జనకులకు నిత్యం ఆనందాన్ని కలిగిస్తూ. విచారాలని పోగొడుతూ ఉంటాయి. పిల్లకాయల పలుకులు వారి చెవులకి మంచి అలంకారాలు ...

సభలో సభారంజకంగా మాట్లాడలంటే ఎలాంటివి మాట్లాడాలో కవి చౌడప్ప తన మార్కు పద్యంలో చెప్పాడు. గమనించండి...

పది నీతులు పది బూతులు
పది శృంగారములు కల్గు పద్యములు సభన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుంద వరపు కవి చౌడప్పా !

ఆ రోజులలో సభలలో అలాంటి మాటలు గౌరవ ప్రదాలే కాబోలు.

నీతులూ బూతులూ లోకఖ్యాతులని కూడా సెలవిచ్చాడు మరి ...

నీతులకేమి యొకించుక
బూతాడక నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుంద వరపు కవి చౌడప్పా !

ఐతే, నాకు చక్కగా మాట్లాడడం చాతనవును కదా అని ఎక్కడ పడితే అక్కడ మెప్పించేలా మాట్లాడడం అంత సుళువేమీ కాదు . అదే చెబుతున్నాడు చౌడప్ప ... మరో పద్యంలో ...

నేరుతునని మాట్లాడగ
వారిజు భవునంత వాని వశమా ? తంజా
వూరి రఘు నాధ నాయుని
గారెదెరుగ కుంద వరపు కవి చౌడస్సా .

నాకు బాగా మాట్లాడడం చాతనవునని విర్రవీగుతూ తంజావూరి ప్రభువులు రఘునాథ రాయుని ఎదుట
మాట్లాడడం బ్రహ్మ దేవుడికి కూడా సాధ్యం కాదు సుమీ ! అని కుండ బద్దల కొట్టినట్టుగా చెబుతున్నాడు కవి...

మాట్లాడడం సుళువే కానీ, మాట మీద నిలబడడమే కష్టం పోతన గారు చెప్ప లేదూ ?...

బ్రతు వచ్చు గాక బహు బంధనములైన
వచ్చు గాక లేమి వచ్చుగాక !
జీవ ధనము లైన చెడు గాక పడు గాక
మాట తిరుగ లేరు మాన ధనులు !

కష్టాలు రానీ, దరిద్రం కలగనీ ఏమైనా కానీ మాన ధనులు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ....

మంచి వాడు ఎప్పుడూ మంచి మాటలే పలుకుతాడు. కఠినంగా మాట్లాడడు. ఒక వేళ ఎప్పుడినా అతను కఠినంగా పలికినా మేలే జరుగుతుంది తప్ప - కీడు కాదు. చూడండి భాస్కర శతకంలో కవి ...

పలుమరు సజ్జనుండు ప్రియ భాషలె పల్కు , కఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁగీడునుఁగాదు ; నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁడొకజాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు ! వేగిరమె శీతల నీరముఁగాక భాస్కరా !

సజ్జనుడు సదా మంచి మాటలే పలుకుతాడు. ఎప్పుడూ కఠినంగా పలుకడు. ఒక వేళ ఎప్పుడయినా అతని నోటి వెంట కఠినోక్తులు వచ్చినా , దాని వలన మనకి కీడు కలుగదు. మంచే జరుగుతుంది.
ఎలాగంటే, లోకానికి చల్లదనాన్ని ఇవ్వడం కోసం మేఘుడు వచ్చి, వర్షం కురిపిస్తాడు. ఒక్కోసారి వడగళ్ళూ కురిపిస్తాడు. అయితే అవి రాళ్ళలాగా ఉండి పోతాయా ? వెంటే చల్లని నీటిగా కరిగి పోదూ ?

మంచి మాటల గురించి సుమతీ శతకంలోంచి మరో మంచి మాట ...

మాటకుఁబ్రాణము సత్యము
కోటకుఁబ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁబ్రాణము మానము
చీటికిఁబ్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ !

మాటకి సత్యాన్ని పలకడమే ప్రాణం. కోటకి మంచి భటులు ప్రాణం. శీలమే పడతికి ప్రాణం ( ఆ మాట కొస్తే మగవాడికి కాదా ఏమిటి?) ఇక, సంతకమే చీటీకి ( ఉత్తరం వగైరాలకి ...) అతి ముఖ్యం అంటున్నాడు కవి ...

మాట్లాడకుండా ఉండడం కూడా కొండొకచో శోభిస్తుంది సుమా !

ఎలాగంటే ....

మూర్ఖో2పి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టిత:
తావచ్చ శోభతే మూర్ఖో యావత్కించిన్నభాషతే.


మూర్ఖుడు - అంటే చదువు సంధ్యలు లేని శుంఠ కూడా చక్కని బట్టలు వేసుకుని సభలలో రాణించ గలడు.
ఎంత వరకయ్యా అంటే ..... నోరు విప్పనంత వరకూ !!

మరి ఇప్పటికి స్వస్తి.





5, మే 2010, బుధవారం

చిత్రం ! భళారే విచిత్రం !!










పద్యం ఇదీ:

ఎన్నడు చూడబోయినను యించుక మాయని హాస రేఖ నీ
కన్నుల కానుపించునది కమ్మగ, యిమ్ముగ వెన్నెలంబలెన్ !
మిన్నగు నీదు వర్తనము మెచ్చఁగ హెచ్చగు శక్తి కావలెన్
మన్సన చేసి , నన్నెపుడు మానసమందిడు రామ కృష్ణుఁడా !


ఈ ఫొటో దాదాపు నలభై ఏళ్ళ క్రిందటిది. విజయనగరం వీనస్ ఫోటో స్టూడియోలో మేం సరదాగా తీయించుకున్నది. ( తే 21-11-1971 దీన) అంటే, అప్పుడు మేం విజయనగరం మహా రాజా
సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ మూడో సంవత్సరం చదువుతున్నాం.

ఫొటోలో ఎడమ చేతి వేపు ఉన్నది నేను .

కుడి చేతి వేపు ఉన్నది ఎవరో తెలుసా?

ఆంధ్రామృతం బ్లాగు ద్వారా అందరికీ చక్కని పద్య రచనలతో చిర పరిచితుడైన శ్రీ చింతా రామ కృష్ణా రావు.

క్రింద ఉన్న పద్యం అతని గురించి 21-11-1971 దీన నేను రాసిన పద్యం. నా దగ్గర ఈ ఫొటో లేదు, నేను రాసిన ఆ పద్యమూ లేదు. కాని సహృదయుడైన నా మిత్రుడు రామకృష్ణా రావు వీటిని ఇంత కాలం తన దగ్గర భద్ర పరచి, ఇటీవలే నాకు పంపించేడు.

ఆంధ్రామృతం బ్లాగుని అభిమానించే బ్లాగర్లకందరికీ ఈ ఫొటో సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను...

3, మే 2010, సోమవారం

మన కోసం వెలువడింది, ఓ మంచి కథా సంకలనం !


ముఖ పత్రం చూస్తూనే తెలిసి పోతోంది కదూ , ఈ కథలన్నీ రైలు జీవితాలకి చెందిన కథలని.
నిజమే, రైలు నేపథ్యంలో మానవీయ కోణంలో అనేక అంశాలని తాకుతూ హృద్యంగా సాగిన 20 గొప్ప కథలున్న మంచి కథా సంకలనం యిది !

ఇందులో ప్రతీ కథా హృదయ సంబంధి. గుండె గూడు పట్లు కదిలించి వేసే కథలివి.
రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భాను దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ ట్రాఫిక్ ఇనస్పెక్టర్ గా పని చేసే రోజులలో దేశంలో చాలా ప్రాంతాలు ఉద్యోగ రీత్యా చుట్ట బెట్టి వచ్చేరు.

అలా సంపాదించిన అపూర్వానుభవంతో రైలు జీవితాల గురించి అద్భుతమైన కథలు మనకందించేరు.ఈ కథలన్నీ లోగడ నవ్య వార పత్రికలో ధారావాహికంగా వచ్చి విశేషంగా పాఠకులని అలరించాయి.

ఈ రచయిత వివిధ సాహితీ ప్రక్రియల మీద ఎనలేని మమకారం పెంచుకున్న వ్యక్తి. కథారచయితగా దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలోను కథలు వెలువరించారు. ఆంధ్ర జ్యోతి ఆదివారం, ఈనాడు ఆదివారం, సితార సంచికలకు ఫ్రీ లాన్సర్ గా అనేక రచనలు చేసారు ; చేస్తున్నారు.

ఈనాడు ఆదివారంలో ప్రాచుర్యం పొందిన ‘ఇది కథ కాదు’ శీర్షికను ‘తేజస్వి’ కలం పేరుతో నిర్వహించారు.
అనేక నృత్య రూపకాలను టీ.వీ ల కోసం రచించారు. ఆకాశ వాణిలో చాలా గేయ రూపకాలు ప్రసారమయ్యాయి. హిందీ, కన్నడ భాషల ధారావాహికలకు తెలుగులో డబ్బింగ్ రచన కూడా చేసారు. నవ్య వీక్లీలో వీరి ‘కలకండ పలుకులు’ శీర్షిక బహుళ జనాదరణ పొందింది. ప్రస్తుతం అదే పత్రికలో ‘వెండి తెర వర ప్రసాదం’ పేరుతో ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్ర మనకి అందిస్తున్నారు ...


ఈ ‘ పొగబండి కథలు ’ చదవడం ఒక అపూర్వమైన అనుభవం కాగలదు.

ఈ కథలకి ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి గారు మనసుకుంచెతో గీసిన చిత్రాలు ఈ కథల పుస్తకంలో మరో అదనపు ఆకర్షణ !


ఈ పుస్తకం గురించి ఎవరేం అంటున్నారో చూడండి ....

శ్రీ శ్రీనివాస భానుగారు రాసిన ‘ పొగబండి కథలు’ రైలు నేపథ్యంగా మానవీయ కోణంలోని అనేక అంశాలని స్పృశిస్తూ హృద్యంగా సాగాయి, జున్ను కోరిన భార్య కోరిక తీర్చడానికి భర్త పడే ఆరాటం, బ్యూరోక్రసీతో వచ్చిన హిపోక్రసీతో గతంలోకి వెళ్ళడం, ఇలా అనేక అంశాలని, అనుభూతులని ఈ పొగబండి మృదువుగా, నిశ్శబ్దంగా మన ముందుకి తెచ్చి, మన లోని అనుభూతులని కూడా తట్టి లేపుతుంది.
పూర్వం కృష్ణాతీరం నేపథ్యంలో వచ్చిన ‘అమరావతి కథలు’ ఒరవడిలో ఎలాంటి బ్రేకులు లేకుండా సాగే ‘పొగబండి కథలు’ మనకందించిన ఓలేటి వారికి అభినందనలు.

- మల్లాది వెంకటకృష్ణమూర్తి

జీవితాన్నీ, జీవిక కోసం చేపట్టిన వృత్తినీ మనసారా ఆస్వాదించ గలిగే వ్యక్తికి మాత్రమే ఆసక్తికరమైన కథనాలతో నలుగురినీ మెప్పించ గలిగే తలపోతలుంటాయి. ఇక, ఆ వ్యక్తి సమర్ధుడైన రచయిత అయితే చెప్పే పని లేదు. తన స్మృతి పేటికలో భద్రపరచిన ఒక్కో ఙ్ఞెపకాన్నీ చక్కని చిక్కని కథగా అక్షర బద్ధం చేయగలుగుతాడు. ఓలేటి శ్రీనివాసభాను ‘పొగబండి కథలు’ అందుకు నిలువెత్తు నిదర్శనం. రైల్వేలకు చెందిన సాంకేతిక విషయాల జోలికి అంతగా పోకుండానే ఆ జీవిత పార్శ్వాలనీ , అపురూప కోణాలనీ ఆర్ద్రంగా చిత్రీకరించిన కథలివి. నిత్య జీవితంలో ఇతర సామాజిక వర్గాలతో కలగలిసి పోతూనే, కాస్త ఎడంగా ఉన్నట్టు తోచే రైలు బతుకుల్లో విస్మయ పరిచే బతుకులెన్నో ఉన్నాయి. వాటిని ఒడుపుగా పట్టుకుని పదే పదే చదివించే కథలుగా మలచడంలో రచయిత సఫలీకృతుడయ్యాడని నా నమ్మకం. ఈ కథలు చదివితే మీరూ ఆ మాట కాదన లేరు .


- పంతుల జోగారావు


‘ పొగబండి కథలు’ పుస్తక రూపంలో వస్తున్నాయంటే నాకు మించిన ఆనందం ఇంకెవరికీ ఉండదేమో ! జీవితంలోంచి వచ్చిన కథలివి. కథే బొమ్మ వేయించు కొంటుంది. అందు వల్ల బొమ్మలూ బాగానే కుదిరాయి. ‘నవ్య’ వీక్లీలో ఇవి వచ్చినన్నాళ్ళూ పాఠకులు అబ్బుర పడ్డారు. తిరిగి ఈ కథలతో పాటు నా బొమ్మలు ఈ రూపంలో పాఠకుల చేతికందడం సంతోషదాయకం.


- శ్రీబాలి.


క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ వారు ప్రచురించి ఇటీవల విడుదల చేసిన ఈ కథల సంపుటి కథా ప్రియులని ఎంతగానో అలరిస్తుందని చెప్పడానికి ఇందులోనుండి మచ్చుకి ఒక కథ ....















ఈ కథల పుస్తకం మీద నవ్య వార పత్రిక తే 19-5-2010 దీ సంచికలో బుక్ చాట్ శీర్షిక క్రింద వచ్చిన సమీక్ష
చూడండి .....





29, ఏప్రిల్ 2010, గురువారం

మా వూరెళ్ళాం ...!!



















మొన్న 24వ తేదీ, శనివారం నాడు మా పార్వతీ పురం ప్రయాణం. పుట్టిన గడ్డకి వెళ్తున్నాం అనే సరదాతో మాకు వొళ్ళూ మీదా తెలియడం లేదు.

నవ్య వార ప్రతిక సంపాదకులు, ప్రముఖ రచయిత టి.వి , సినిమా ల రచయిత
శ్రీ ఎ.ఎన్.జగన్నాధ శర్మ కథల సంపుటి ‘ పేగు కాలిన వాసన’ ఆవిష్కరణ సభ అక్కడ మా బాల్య మిత్రులు , కథా రచయిత పి.వి.బి.శ్రీరామ మూర్తి , తదితర సాహితీ మిత్రులు చేస్తాం రమ్మన్నారు.

బాగానే ఉంది. ఈ నెపంతో నయినా, మళ్ళీ దాదాపు 35 ఏళ్ళ తర్వాత మా ఊరు చూడొచ్చు కదా, అనే సంబరంతో రైట్ వస్తాం అనేసాం.

ఇక్కడి నుండి ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి , నేను , జగన్నాథ శర్మ , పుస్తక ప్రచురణ కర్త గుడిపాటి ,
పొగబండి కథల రచయిత, ప్రముఖ పాత్రికేయుడు, టి.వి రచయిత ఓలేటి శ్రీనివాస భాను బయలు దేరాం.

24 వ తేదీ రాత్రి 9 గంటలకి బయలుదేరే నాగావళి ఎక్సప్రెస్ లో ఎ.సి. త్రీ టైరులో రిజర్వేషన్లు ఉన్నాయి. మా మొత్తం టిక్కెట్టు జగన్నాధ శర్మ దగ్గర ఉంది. అందరం 8 గంటల ప్రాంతంలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో కలవడానికి తీర్మానం.
అందరికన్నా ముందుగా జగన్నాధ శర్మ చేరుకున్నాడు. ఇక చూడాలి, మా శర్మ తొందర ! నేను స్టేషన్కి చేరుకున్నాక, శర్మకి ఫోను చేసి, ‘ ఎక్కడున్నావురా బాబూ ’ అనడిగేను. ‘ ఇదిగో, సరిగ్గా ఓవరు బ్రిడ్జి దగ్గరే ’ అంటాడు. ఫోనులో ఒకరి మాటలు ఒకరికి వినబడడం లేదు. సికిందరాబాదు ప్లాట్ ఫారమ్మీద , ఆ రద్దీలో ఏ ఓవరు బ్రిడ్జి మొదట్లో ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఎలాగయితే నేం కలుసుకున్నాం.అప్పటికే వచ్చేరు ఓలేటి శ్రీని వాస భానూ , గుడిపాటి. రైల్వేలో పనిచేసాడు కనుక కాబోలు శ్రీను ఈ రైల్వే అంతా నాదే ! అన్నంత ధీమాగా అటూ యిటూ నడుస్తున్నాడు. శర్మ, ‘చూడు చూడు , ఈ రైల్వే అంతా సొంత ఆస్థిలా ఎలి ఫీలై పోతున్నాడో ’ అంటూ నవ్వేడు. ఇక గుడిపాటి మాత్రం హరి మీద గిరి పడ్డా చలించని రీతిలో మహా నింపాది.

ఇక రావాల్సింది కవి శివా రెడ్డి. ఎంతకీ రాడే ! ఓ ప్రక్క రైలుకి టైమయి పోతోంది. ఫోను చేద్దాం అంటే, శివా రెడ్డి దగ్గర సెల్ లేదు. సెల్ వాడరు. శివా రెడ్డి కోసం ఇక పరుగో పరుగు ! ఓ ప్రక్క భానూ, మరో ప్రక్క గుడిపాటి వెతకడం మొదలెట్టారు. ఇంతలో ‘వచ్చేస్తున్నా ’ అని కవిగారి నుండి ఫోనొచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఎ.షి.త్రీ టైరు ఎటుందని శివారెడ్డి అడిగితే ఓ తలమాసిన వాడు తప్పుడు సమాచారం అందించడంతో, పాపం శివా రెడ్డి మొత్తం రైలుకి ఆ చివర నుండి యీ చివర వరకూ తిరగాల్సి వచ్చింది. వస్లూనే తనకి ఆ తప్పుడు సమాచారం యిచ్చిన వ్యక్తిని అటూ యిటూ ఏడు తరాలు తిట్టి పోసి, అలుపు తీర్చుకున్నాడు శివా రెడ్డి.

మొత్తానికి అందరం చేరేం. ఇక అప్పటి నుండి మా ప్రయాణం అంతా నవ్వులే నవ్వులు ! సరదాలే సరదాలు ! కబుర్లే కబుర్లు !! ఎవరి ముద్దలు వాళ్ళు యింటి దగ్గరే తిని రమ్మని శర్మ హుకుం జారీ చెయ్యడంతో రైల్లో తిండి బాధ లేదు. బెర్తులు చూసుకుని కుదురుకున్నాం.


జో పాపా ! లాలీ , జో !!

శివా రెడ్డికి కింద బెర్తులో ఉన్న ఓ ఇల్లాలు బాత్ రూం అవసరపడి, తన బిడ్డని కాస్త చూడమని అందించింది, ‘ ఉచ్చ పోసెయ్యదు కదా ?’ అడిగేరు శివారెడ్డి. ‘‘ లేదండీ, పాపకి డైఫరు కట్టేను ’’ అని భరోసా యిచ్చిందా తల్లి. సరే అని పాపని ఒళ్ళోకి తీసుకున్నశివా రెడ్డి పాట్లు ఇంక చూడాలి ! పాప ఒకటే ఏడుపు. శివా రెడ్డి పాపని సముదాయించడం ! ఆ దృశ్యం చూసి తీరాలి .ఎంత ముచ్చట వేసిందో.

ఆ రాత్రి మూడు గంటలకి తిరుపతి నుండి వచ్చిన మధురాంతకం నరేంద్ర మాతో కలిసేరు. ఆయనకి అక్కడి నుండి రిజర్వేషను శర్మ ముందే చేయించాడు.

నరేంద్రతో పాటు, శర్మతో ఎప్పుడో హైస్కూలులో చదువుకున్న ఓ మిత్రుడు - పేరు సత్య ప్రకాష్ - అంత రాత్రి వేళప్పుడు శర్మని కలుసుకోడానికి వచ్చేడు. ఇటీవల నవ్యలో జగన్నాధ శర్మ సినీ దర్శకుడు, రచయిత వంశీ గురించి రాసిన ఓ వ్యాసంలో కంఠు అని చూసి, చాలా రోజులకి తన పాత
మిత్రుడి జాడ పోల్చుకున్నాడుట , అతను. రైల్వేలోనే ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడుట. ఎప్పటిదో, శర్మది, చిన్నప్పటి ఫొటో ఒకటి జేబులో పోలిక పట్టడం కోసం ఉంచుకుని మరీ వచ్చేడు. నిజానికి ఆ ఫొటో ఇప్పుడు చూసి, శర్మే గుర్తు పట్ట లేడు. అంత భద్రంగా తన చిన్న నాటా మిత్రుని ఫొటో పదిలంగా దాచుకుని తెచ్చిన ఆ వ్యక్తి ని చూసి, అబ్బుర పడ్డాం.

విజయవాడ స్టేషనులో రాత్రి మూడు గంటల వేళలో ఆ బాల్య మిత్రులు ఇద్దరూ కలుసుకుని తనివితీరా కొద్ది సేపు కబుర్లు చెప్పుకునే ఆ దృశ్యం భువన మోహనంగా ఉంది.

శర్మ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టేడు.

కబుర్లతో జాము రాత్రి వరకూ హోరెత్తించి, పడుకున్నాం. ఏం పడుకోవడం లెండి ! నాకూ, శర్మకీ, భానుకీ మా సొంతూరు చూడబోతున్న ఆనందంతో నిద్ర పడితే కదా ?

తెల్లారి నాలుగో గంటకి అందరికీ తెలివొచ్చింది. శివా రెడ్డి అప్పటికే ఓ దఫా తేనీరు సేవించి, నాకొక టీ యిప్పించి కబుర్లు ప్రారంభించేరు. శర్మ వచ్చి చేరాడు. మరి కాస్సేపటికి భాను. శర్మ ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తూనే ఉంది.


రైలు విశాఖ పట్నం చేరింది. ఆంధ్రభూమిలో పని చేసే జ్యోత్స్న , అతని మిత్రులు మేడా మస్తాన్ రెడ్డి మమ్మలని కలవడానికి వచ్చేరు. టిఫిన్ పొట్లాలతో సహా ... మళ్ళీ కబుర్లు. ఫొటోలు దిగేం. టిఫిన్లయేక రైలు కదలబోతూ ఉంటే ఎక్కాం.


దార్లో తాటి ముంజెలూ, వేరు సెనక్కాయలూ , టీలూ ...
రైలు మా పార్వతీ పురం చేరబోతూ ఉంది. ఆ పరిసరాలని చూస్తూ శర్మ సంతోషం పట్ట లేక చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టేడు.

అదిగో శివాలయం. అదిగో సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, అల్లదిగో వేణు గోపాల్ టాకీస్, ఇదిగిదిగో మా టౌను రైల్వే గేటు ....అంటూ పొంగి పోతూ. మా సరదా చూసి శివారెడ్డీ, గుడిపాటీ, నరేంద్ర ఎంత ముచ్చట పడ్డారో !

రైలు మా పార్వతీ పురం టౌను స్టేషన్లో ఆగింది. అక్కడే కదా, ప్లాట్ ఫారం చివర, తురాయి చెట్టు కింద, సిమ్మెంటు బల్ల మీద కథల గురించి చెప్పుకుంటూ - నేనూ, శర్మా, భానూ, మా పీ.వీ.బీ.శ్రీరామ మూర్తి - ఎన్నో సాయంత్రాలు చీకటి చిక్కబడే వరకూ గడిపే వాళ్ళం ... మమ్మలని రచయితలుగా మేం తీర్చి దిద్దుకున్న నేల తల్లి అదే కదా !

పొంగి పోయాం. కళ్ళు చెమర్చాయి. ఉద్విగ్నంతో ఎవరికీ నోరు పెగలడం లేదు.
ఆ గాలి, ఆనేల, ఆమట్టి వాపనా మాకిష్టం. .....
మమ్మల్ని రిసీవ్ చేసుకుందుకి చాలా మంది మిత్రులు రచయితలు వచ్చేరు.
రచయితలు పి.వి.బి.శ్రీరామ మూర్తీ, గంటేడ గౌరు నాయుడూ, చింతా అప్పల నాయుడూ. జల్దు బాబ్జీ, ... కార్లో సాదరంగా తీసికెళ్ళి మమ్మల్ని ఓ లాడ్జిలో దించేరు.

మా ఊరి వీధుల్లో ...


స్నానాలూ, భోజనాలూ కానిచ్చేక, నేనూ , జగన్నాధ శర్మా, ఓలేటి శ్రీనివాస భానూ మా ఊరినీ, మేం తిరిగిన వీధులనీ చూడడానికి బయలు దేరాం.
మా బాల్యాన్ని వెతుక్కుంటూ ఆ వీథులమ్మట ముచ్చట పడి పోతూ చాలా సేపు తిరిగాం

పార్వతీ పురంలో ఆ రోజు వరకూ ఎండలు అదర గొట్టేసాయిట. మేం ఊరిని చూడ్డానికి బయలు దేరామో, లేదో, చల్లగా అయి పోయింది వాతావరణం. మా ఊరి తల్లకి మేమంటే ఎంత ప్రేమో !!

వీధులన్నీ తిరిగేం. అప్పటి ఆత్మీయ మిత్రులని, బంధువులని కొందరిని కలుసుకున్నాం. ముచ్చట్లు కలబోసుకున్నాం.
ఒక సారి మేం దాదాపు నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళి పోయేం.మా కంఠు (శర్మ) అప్పటిలో పని చేసిన కర్రల మిల్లుని చూసాం. అదే కదా, పేగు కాలిన వాసన కథకి నేపథ్యంగా నిలిచిన చోటు....
శర్మ అగ్రహోరం కథల్లో చెప్పిన మా యిల్లు, జోగారావు గారి మేడ చూసాం. పాత పోలీసు స్టేషను వీధీ, కంచర వీధీ .. శర్మ రాసిన మాస్టర్ పీస్ మినీ కథ - పండా అప్పట్లో ఉన్న పూరిల్లూ ...
శర్మ అన్నయ్య గణపతి, తండ్రి పని చేసిన కోమటి గుమస్తా కొట్టు ... చూసి శర్మ కళ్ళలో నీళ్ళు ఉబికి రావడం గమనించి మాకూ కళ్ళు చెమరించాయి...
సాయంత్రం కావస్తోంది. పుస్తకావిష్కరణ సభా కార్యక్రమానికి వేళ దగ్గర పడుతోంది. ఆ వీధులని, ప్రదేశాలనీ వదల లేక వదల లేక మళ్ళీ మా బస దగ్గరకి చేరాం మేం వెళ్ళే సరికి కాళీ పట్నం రామారావు మాష్టారు వచ్చి ఉన్నారు. రచయితలు జయంతి వెంకట రమణ, డాక్టర్ వి. చంద్ర శేఖర రావు , ఎ,వి, రెడ్డి శాస్త్రి , వేద ప్రభాస్, డా. బి.ఎస్.ఎన్. మూర్తి, కొల్లూరు జగన్నాధ రావు, మల్లా ప్రగడ రామారావు గంటేడగౌరు నాయుడు, చింతా అప్పల నాయుడు, నఖ చిత్ర కారుడు పరిశి నాయుడు, ... చాలా మంది సభ జరిగే చోటుకి బయలు దేరడానికి రెడీ అయిపోయి ఉన్నారు. ఇక మాదే ఆలస్యం. వేగిరం స్నానాలు చేసి, తయారయి అంతా బయలు దేరాం ...

ఆ సాయంత్రం పేగు కాలిన వాసన కథా సంపుటి ఆవిష్కరణ సభ చాలా విజయవంతంగా జరిగింది.
ఎందరో రచయితలు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చేరు. , మా బాల్య మిత్రులూ ఎక్కడెక్కడి నుండో వచ్చేరు...అంతా ఒక పండుగ వాతావరణం.

సభని ప్రారంభిస్తూ పి.వీ.బీ , చింతా అప్పల నాయుడు గారలు స్వాగతం పవలికారు.
సభాధ్యక్షులు శివా రెడ్డి . ముఖ్య అతిథి కాళీ పట్నం రామారావు మాష్టారు. పుస్తక సమీక్షలు అట్టాడ అప్పల నాయుడు, మధురాంతకం నరేంద్ర గారలు అపూర్వంగా పుస్తక సమీక్షలు చేసారు.. వాళ్ళు ప్రసంగిస్తున్నంత సేపూ చప్పట్లు ఆగ లేదు సభలో గుడిపాటి మాట్లాడుతూ త్వరలోనే జగన్నాధ శర్మ రాసిన అగ్రహారం కథలని ఒక చక్కని సంపుటిగా తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించడంతో ఆనందంతో సభ మారు మ్రోగి పోయింది. .జల్దు బాబ్జీ ఆప్త వాక్యం చదివేడు. శర్మ మిత్రులు మంథా రఘునాథ శర్మ, పేర్రాజు, పంతుల లక్ష్మణ మూర్తి, శర్మ తమ్ముడు, రాము - రాయపూర్ నుండి వచ్చేడు... యిలా ఎందరో, ఇక , చాల మందిరచయితలు కూడా అతనితో తమ అనుబంధాన్ని కొద్ది మాటలలో సభలోని వారితో మాటల్లో పంచుకున్నారు.

తర్వాత జగన్నాధ శర్మకి అపూర్వమైన రీతిలో ఘన సన్మానం జరిగింది.
మేం పుట్టి, పెరిగి, తిరుగాడి, తొలి కథలు రాసుకున్న మా పార్వతీ పురంలో మా కంఠు (జగన్నాధ శర్మ)కి ఈ విధమైన

అపూర్వ సత్కారం లభించడం మాకు ఎప్పటికీ మరిచి పోలేని మధురానుభూతిని మిగులుస్తుంది.

మా నేలని తాకేం. మా ఊరి చెరువుల మీద నుండి, కొండల మీద నుండి వచ్చే చల్లని గాలి పీల్చాం. చిన్న నాటి మిత్రులని కలుసుకున్నాం. మా పెద్దల, గురువుల ఆశీర్వాదాలు అందుకున్సాం . మా బాల్యం లోకి వెళ్ళి పోయేం ....

బరువెక్కిన గుండెతో మా చల్లని తల్లికి, మా ఊరికి వీడ్కోలు పలికాం ....

పార్వతీ పురంలో పీ.వీ.బీ, జల్దు బాబ్జీగారల ఇళ్ళలో కమ్మని భోజనాలూ , టిఫిన్లూ . చవులూరించే ఆ రుచులు తలుచుకుంటూ తిరుగు ప్రయాణం. సభా విశేషాల గురించీ, మా పార్వతీ పురం ప్రజల ఆత్మీయతానురాగాల గురించీ చాలా సేపు మాట్లాడుకుంటూ గడిపేక, ఎవరి బెర్తుల మీదకి వాళ్ళు చేరాం. ఎన లేని ఆనందంతో కాబోలు అందరికీ బాగా నిద్ర పట్టింది.

మర్నాడు రైల్లో మళ్ళీ మామూలే ! ఉదయాన్నే మూడింటికి లేచాం. మధురాంతకం తిరుపతి వెళ్ళాలి కనుక విజయ వాడలో దిగేసారు ...

ఆ ఉదయం టీలు, కాఫీలు ఆరారా త్రాగుతూ కబర్లు మొదలెట్టాం ...

ఆ ఉదయం రైల్లో సైడు బెర్తు మీద బాసిం పట్టు వేసుకుని కూర్చుని శివా రెడ్డి చేసిన ప్రసంగం మహా అద్భుతంగా సాగింది.
నగర జీవితాన్ని గురించీ, కవిత్వాన్ని గురించీ, నవలా సాహిత్యం గురించీ అనువాద రచనల గురించీ, శ్రీశ్రీ, నారాయణ బాబు, ఆరుద్ర .... ఒక శాఖా చంక్రమణంగా సాగినా, శివా రెడ్డి ప్రసంగం వరద గోదావరిలా పరవళ్ళు తొక్కింది. నేనూ. జగన్నాధ శర్మ, ఓలేటి శ్రీనివాస భానూ, గుడిపాటి శ్రోతలం. శివాదెడ్డి అపూర్వ ప్రసంగాన్ని ఆ వేళ చల్లని ఉదయం సమయంలో , వేగంగా దూసుకు పోతున్న రైల్లో వినడం నిజంగా ఒక అపూర్వానుభూతి అనే చెప్పాలి.

రైలు ఉదయం తొమ్మిది గంటల వేళకి సికిందరాబాద్ చేరుకున్నాక, బరువెక్కిన గుండెలతో వెళ్ళొస్తామని ఒకరికొకరు చెప్పుకుంటూ స్టేషను బయటికి దారితీసాం ....


మరి కొన్ని ఫొటోలు చూడండి ...


జగన్నాధ శర్మ,పంతుల జోగారావు.జ్యోత్స్న, శివా రెడ్డి. (విశాఖ రైల్వే స్టేషన్లో)






ఆప్త వాక్యం చదువుతున్న జల్దు బాబ్జీ
ఈ కార్యక్రమ నిర్వహణలో తెర వెనుక సూత్రధారి. మా ఆత్మీయ మిత్రుడు.





పేగు కాలిన వాసన ప్రచురణ కర్త గుడి పాటి




పార్వతీపురం బసలో ఓలేటి శ్రీనివాస భాను, శివా రెడ్డి, మధురాంతకం నరేంద్ర, జగన్నాధ శర్మల పిచ్చాపాటీ







జగన్నాధ శర్మ తనకు చేసిన సన్మానానికి ధన్యవాదాలు చెబుతూ ....



శర్మ మిత్రుడు, క్లాస్ మేట్ పంతుల లక్ష్మణ మూర్తి ముద్దులతో శర్మని ముంచెత్తుతూ ....


శర్మ మరో మిత్రుడు మంథా రఘునాధ శర్మ











శర్మని అభినందిస్తూ క్లాస్ మేట్ పేర్రాజు ...


పంతుల జోగారావు


.మధురాంతకం నరేంద్ర పుస్తక సమీక్ష చేస్తూ ... చిత్రంలో కుడి వేపు చివర ఉన్నది మంచు పల్లి శ్రీరామమూర్తి


అట్టాడ అప్పల నాయుడు పుస్తక సమీక్షలు ....


కాళీ పట్నం రామా రావు మాష్టారు శర్మని అభినందిస్తూ ...


పార్వతీ పురంలో ఈ కార్య క్రమ నిర్వహణలో ప్రధాన సూత్రధారి, రచయిత, జగన్నాధ శర్మ కి ఆత్మీయ మిత్రుడు పి.వి.బి.శ్రీరామ మూర్తి.


28, ఏప్రిల్ 2010, బుధవారం

ఏనుగు ఏనుగే ... పీనుగు పీనుగే !!

























క్షుత్షామో2పి ,జరాకృశో2పి, శిధాలం ప్రాయో2పి, కష్టా ధశా
మాపన్నో2పి, విపన్నదీధితరపి, ప్రాణేషు నశ్యోత్ష్వపి
మత్తేభేంద్ర విభిన్న కుంభ విశిత గ్రాసైక బద్ధసృ్పహ:
కిం జీర్ణం తృణయత్తిమానమహతా మగ్రేసర: కేసరీ

గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన విశీర్ణమైన, నా
యాసమునైన, నష్టరుచియూనను ప్రాణభయార్తమైన,ని
నిస్రా సమదేభ కుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కసరి జీర్ణ తృణంబు మేయునే?


తిండి లేక చిక్కి పోయినా, ముసలిదయి పోయినా, బాధలలో ఉన్నా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే, ఏనుగు కుంభ స్థలాన్ని చీల్చి అక్కడి మాంసాన్నే తింటుంది తప్ప , సింహం మిగతా చెత్త తినదు. వేరే గడ్డి కరవదు.

మరి, కుక్క సంగతి చూడండి ...


లాంగూల చాలన మధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చ భుక్తే

వాలము ద్రిప్పు, నేలబడ వక్త్రము కుక్షియుఁజూపు క్రిందటం
గాలిడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్ర శుం
డాలము శాలితండులగుడంబులు చాటు వచశ్శతంబు చే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిఁగ జూచు మహోన్నత స్థితిన్


యజమాని పడేసే ఎంగిలి కూడు కోసం కుక్క ఎన్ని వికార చేష్టలయినా చేయడం మనకి తెలిసిందే
కదా ?
యజమాని ఎదుట తోక ఆడిస్తుంది. నేల మీద పడి దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేల
కెలుకుతుంది. తిండి కోసం ఎన్ని వికార పోకడలయినా, పోతుంది. దాని నైజమే అంత కద !! భద్ర గజం అలా కాదు. మురిపించుకుని, బుజ్జగింపు మాటలు చెబితే కాని తినదు.

సింహం సింహమే ! ఏనుగు ఏనుగే !! కుక్క కుక్కే కదా !!!

24, ఏప్రిల్ 2010, శనివారం

చిన్నారి పొన్నారి తండ్రీ ... ...


శిశువు గురించి శ్రీ జాషువా కవి చాలా మంచి పద్యాలు వ్రాసారు. చాలా మందికి ఇవి పరిచిత పూర్వాలే అయి ఉండ వచ్చును. తెలియని వారి కోసం యీ టపా ...

గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

జాషువా పద్యాలకి వివరణ అక్కర లేదు. అయినా, కొద్దిపాటి వివరణ ...
పాట పాడితేనే కాని నిద్దుర పోడు. తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుకలాగా ఒరిగి పోతాడు. ఆ లేత వయసులోనే కండలు తిరిగిన పిల్ల వస్తాదులా ముద్దొస్తాడు. ఎంత భాగ్యవంతుడో ! ఉయ్యేల దిగకుండానే అన్ని పనులూ జరిపించుకుంటాడు. ఉ ఊ అనే రెండక్షరాలు నేర్చిన వింత చదువరి. సతిని తాకని సాంబ శివుడిలా ఉంటాడు. కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పర దేశి. తన యింటికి కొత్త యజమాని. ఈ భూమి మీదకి ఏ రాచ కార్యం చేడానికి వచ్చేడో కదా ? కొంచెం నడక రానీ, అప్పుడు అడుగుదాం. ముందు ముందు వయసు వచ్చేక ఎలాగ ఉంటాడో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం ఈ చిన్నారి శిశువుకి ఏ పాపం తెలియదు !!

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర


తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో అన్నం , నీరు లేకుండా గడిపి, ప్రయాణం చేసి వచ్చిన బాట సారి. చిమ్మ చీకటిగా ఉండు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణ స్వరూపుడు. నునుపైన చెక్కిళ్ళలో బోసి నవ్వులలో ముద్దులు కురిపించే మోహనాకారుడు. తరగని తల్లి పాలు అనే మధు ధారలను తన అన్నంగా తచ్చుకున్న అతిథి.బట్ట కట్టుకోడు. సిగ్గు పడడు. నేల తల్లి అనే బడిలో చేరి ఇంకా వారం అయిందో, లేదో, మా ప్రకృతి కాంత వీడికి ఆకలీ నిద్రా నేర్పించింది.


ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

పడుకున్న ఊయ్యేల తొట్టి వాడికి ఏం ఉపదేశం చేస్తందో కానీ, ఒంటరిగా ఊ కొడుతూ ఉంటాడు. తల్లితో ఏ జన్మల సంబంధమో కాని ఏడ్చి సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఆ దేవ దేవుడు అతనితో ఏ సల్లాపాలు చేస్తాడో తెలియదు భలే భలే అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటాడు
ఈ మూడు రోజులలో ఎప్పుడు నేర్చుకున్నాడో వెర్రి తండ్రి ఛీ ఫో అని సరదాకి అంటే ముఖం చిన్న బుచ్చు కుంటాడు. ఆ బుగ్గల లేతదనం తగ్గి, చదువు సంధ్యలు నేర్చకున్నాక ‘ నా బంగారు కొండ , నా రతనాల కొండ ’ అని తల్లి ముద్దుగా అంటూ ఉండే మాటలు నిలుపుకుంటాడో లేదో , చూదాం !

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు

దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?


తన చేతి గిలక పండుకి ముచ్చటలు చెబుతూ ఉంటాడు. అది తిరిగి పలక లేదని కోపం వచ్చి విసిరి కొడతాడు. పొరుగింటి ఆడవాళ్ళు చేర దీస్తే వెళ్ళడాని యిష్ట పడడు. తన పర భేద భావం వీడికి అప్పుడే తెలిసి పోయింది. తేనె అంటే ఇష్టం రుచుల భేదం గ్రహించేస్తున్నాడు. పెద్ద చప్పుడుని వింటే చాలు భయంతో తల్లిని గట్టిగా కరుచుకు పోతాడు. ఇతనికి అరిషడ్వర్గాలు అనే ఆరుగురు శత్రువులలో ( కామం, క్రోధం, లోభం, మోహం, మదం , మాత్సర్యం) ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారు అప్పుడే వీడి మనసులో చేరుకున్నారు కదా ? వీడి జాతకంలో గొప్ప కీర్తిమంతుడవుతాడని ఉందో, బొత్తిగా అప్రతిష్ఠ పాలవుతాడని రాసి ఉందో కదా !!

ఎంత చక్కని పద్యాలో చూసారు కదూ ? !!

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మసి బొగ్గులు


దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

ఈ చిన్న శ్లోకంలో ఎంత గొప్ప విషయం కవి చెప్పాడో చూడండి ...

చెడ్డ వాళ్ళు బొగ్గుల లాంటి వారుట ! వాళ్ళు శత్రుత్వంలో ( వేడిగా ఉన్నప్పుడు) మన చేతులు కాలుస్తారుట.

స్నేహంలో ఉన్నప్పుడు ( అంటే చల్లగా ఉన్నప్పుడు) మన చేతులని మసి చేస్తారుట !

మైత్రిలోనూ, వైరం లోనూ వాళ్ళు మనతో ఒక్కలాగే ప్రవర్తిస్తారన్న మాట.

అంచేత చెడ్డ వారితో స్నేహం వద్దు సుమా.

11, ఏప్రిల్ 2010, ఆదివారం

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....


చెప్పఁదగుఁగవిత రసముల్
జిప్పిల, నప్పప్ప ! భళి భళీయన. లేదా
యెప్పుడుఁజేయక యుండుటకవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే కదా. మన కవులు రస బంధురమయిన గొప్ప కవిత్వం చెప్పడంతో పాటు , కవిత్వం గురించి, కవిత్వం గొప్ప తనం గురించి కూడా మంచి కవిత్వం చెప్పారు. అలాంటి సందర్భాలను కొన్నింటిని చూదామా ?


గుడి కూలును, నుయి పూడును
వడి నీటను చెఱువు తెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యమె సుమ్మీ
కుడి యెడమల నరసి చూడ గువ్వల చెన్నా.
సప్త సంతానాలలో ఏవీ శాశ్వతంగా నిలిచేవి కావని చెబుతూ, ఎన్నటికీ చెడనిది పద్యమే సుమా అని చెప్పడం జరిగింది.యొప్పు సుమీ, సుకవి యెంతయుచితఙ్ఞుఁడొకో
( రాజ శేఖర చరిత్ర . మాదయ గారి మల్లన.)

కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య సత్కథ
ల్వావిరి పుట్టు రత్నము లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వవృత్తములు సానల దీరిన జాతి రత్నముల్
గావున నిట్టి మిశ్ర కథగా నొనరింపుము నేర్పు పెంపునన్.

( వసు చరిత్ర . రామ రాజ భూషణుడు)


తా రసపుష్ఠిమైఁ బ్రతి పదంబున జాతియు వార్తయున్ జమ
త్కారము నర్ధ గౌరవముఁగల్గ ననేక కృతుల్ ప్రసన్న గం
భీర గతిన్ రచించి మహి మించినచో నిఁక శక్తు లెవ్వ ర
య్యా ! రఘునాథ భూప రసికాగ్రణికిన్ జెవి సోకఁజెప్పఁగన్
(విజయ విలాసము . చేమ కూర వేంకట కవి.)


చెప్పఁగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్.

( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)

కవిత్వం చెబితే కర్పూరం కుప్పలుగా పోసినట్టు ఉండాలట. కుంకుమ మీద మీద కప్పినట్టుండాలట. పూల పొట్లం విప్పినట్టుండాలిట ! ఎంత గొప్ప కోరికో కదూ ?

కవియల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాజి గణుతింపంగాఁ
గవి నేను రామకృష్ణుఁడఁగవి యను నామంబు నీటి కాకికి లేదే ?

( తెనాలి రామలింగ కవి పేర వినిపించే చాటువు.)
కవి అంటే పెద్దన, తిక్కనాదులూ , తనూనట. మిగతా కవులు కుకవులట. కవి అనే పేరు నీటి కాకికి కూడా ఉందికదా అని వేళాకోళం చేసాడు.

గడియకు నూఱు పద్యములు గంటము లేక వచింతుఁదిట్టగాఁ
దొడగితినా పఠాలుమని తూలి పడంగుల శైలరాజముల్
విడిచి యనుగ్రహించి నిఱు పేద ధనాధిపత్యులుఁజేతు, నే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే ?

ఈ తిట్టు కవి గడియకు నూఱు పద్యాలు అవలీలగా చెప్పగలడట. తిట్టినా అంతే. కుల పర్వతాలు కదిలి పోవలసినదే. అనుగ్రహించితే కటిక పేద వాడిని సైతం ధనవంతునిగా చేయ గలడట ....

నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచ మొప్పు త
ప్పరయు రసఙ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే ?

(అల్లసాని పెద్దన)
కవి గారికి కవితా రచన చేయడానికి ఎన్ని సదుసాయాలు కావాలో చూడండి ...
ధూర్జటి కవిత్వానికి అతులిత మాధుర్యం చేకూరడానికి కారణం తెలుసు కదా ?


స్తుతమతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
యతులిత మాధురీ మహిమ ! హా ! తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితాజనతా ఘనతాపహారి సం
తత మధురోధరోదిత సుధారస ధారలు గ్రోలుటం జుమీ !

కవి గారి కవితకి అంత మాధుర్యం అబ్బడానికి నిత్యం సౌకుమార్యం కల కన్నియల అధర మాధుర్యాన్ని చవి చూస్తూ ఉండడమేనట.

పలుకగ వలె నవరసములు,
కులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
నళుకక యటు గాకున్నం
బలుకక యుండుటయె మేలు బహుమానముగన్

( రఘునాథ రాయలు. రామాయణం)
చెప్తే నవరసాలూరు కవిత చెప్పాలి. లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. అదీ సంగతి. తెలిసిందా ?


రెండర్ధంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
కుండుం, దద్గతి కావ్య మెల్ల నగునే నొహో యనంజేయదే
పాండిత్యంబున? నందునుం దెనుఁగుగబ్బంబద్ధుతంబండ్రు , ద
క్షుండెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషా కృతిన్.

(పింగళి సూరన. రాఘవ పాండవీయం ద్వ్యర్ధి కావ్యం,)

రెండర్ధాల పద్యం రాయడమే కష్టం. మొత్తం కావ్యం అంతా అలా రాయాలంటే సాధ్యమా ?
భారత రామాయణాలని ఓహో అనే లాగున ద్వ్యర్ధి కావ్యంగా రాసి చూపిస్తున్నాను. చూడండి తమాషా అని కవి ఎంత ధీమాగా చెబుతున్నాడో కదూ ?


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా ?
అని ప్రతిన పూని మహా భాగవత రచన చేసాడు పోతన కవి.

ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !!!

ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా రాయి. సహిస్తాను. కానీ, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం రాయకు. ముమ్మాటికీ రాయకు.

అరసికులకు కవిత్వం వినిపించవలసి రావడం ఎంత బాధాకరమో కవి వాపోతున్నాడు. గమనించారా?

నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు రే
ఖా కమనీయ వైఖరులు గాంచి, భళి! భళీ!! యన్నవాడె, ‘ మీ
దేకుల’’ మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్.

( జాషువా కవి)

అంత వరకూ కవిత్వాన్ని అహో, ఒహో అంటూ తెగ మెచ్చుకుని , కులం పేరడిగి, తెలుసుకొని చీదరించుకునే నీచుల గురించి జాషువా కవి ఎలా వాపోయాడో ఈ పద్యంలో చూసారు కదూ?

పాతదంతా మంచిదనీ, కొత్తదతా తిరస్కరించదగినదని అనుకో రాదని కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో హెచ్చరించాడు.


పురాణమిత్యేవ న సాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్యవద్యం
సంత: పరీక్ష్యాన్తరత్ భజంతే
మూఢ పర ప్రత్యయ నేయ బుద్ధి :
దీనికి వేలూరి శివరామ శాస్త్రి గారి అనువాద పద్యం కూడా చూడండి.


రమ్య మెప్పుడు గాదు పురాణమనుచు
గొనబు గల్గిన దనరాదు క్రొత్తదనుచు
పండితుండొండు దానిని భజన సేయు
మూఢుడితరుల వచించు బుద్ధి నొప్ప.

అందుకే ఆధునికులలో గురజాడ ...

పాత కొత్తల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటా వీవు, నీవిక
చెచ్చకుంటే మించి పాయెను

అని తిరస్కరిస్తూ ...

ఆకులందు అణగిమణగీ
కవిత కోకి పలుక వలెనోయ్
ఆపలుకులను విని
దేశమందభిమానములు
మొలకెత్తవలనోయ్

అని చెప్పాడు. అడుగు జాడ గురజాడది. అది భావికి బాట.


కుక్కపిల్లా, అగ్గిపుల్లా,సబ్బుబిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ
కవితా మయమేనోయ్ అన్నీ ...

అంటూ చెప్పిన శ్రీ.శ్రీ గారు కాదేదీ కవితకనర్హం అని పేర్కొన్నారు.
ప్రపంచమొక పద్మవ్యూహం అంటూ, కవిత్వమొక తీరని దాహం అని కూడా చెప్పారు.కదూ?

బాలగంగాధర తిలక్ కవిత్వం ఒక ఆల్కెమీ ... దాని రహస్యం కవికే తెలుసునని చెప్ప లేదూ?
కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అనడానికి అనంతమైన ఉదాహరణలు ఉన్నాయి.

దాదాపు ప్రాచీన, ఆధునిక కవులందరూ కవిత్వం మీద కవిత్వం చెప్పిన వారే. మచ్చునకు కొన్ని ఉదాహరణలు చూపించానంతే ...
బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి) నుండి ‘నా కవిత్వం ’ అనే తిలక్ కవితతో ముగిస్తాను ....

నా కవిత్వం


నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనిక వాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజి పువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథ: పతంగాలూ
ధర్మ వీరుల కృత రక్తనాళాలూ
త్యాగ శక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతా
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.










31, మార్చి 2010, బుధవారం

ఆశ ... దోశ ... అప్పడం ... వడ ....


అశ అనేది ఉండడం ఎవరికయినా సహజమే. కాని, అత్యాశ మాత్రం పనికి రాదు.
దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు

ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం రాజ్యస్థ: స్వర్గమీహతే

వంద కలవాడు వేయి కావాలని కోరుకుంటాడు. వేయి కలవాడు లక్ష కావాలని అభిలషిస్తాడు. లక్షాధికారి
రాజ్యం (అధికారం) కావాలని ఉవ్విళ్ళూరుతాడు. పోనీ, అంతటితో ఊరుకుంటాడా అంటే, ఉహూఁ .... ప్రభుత్వం సిద్ధించిన పిమ్మట స్వర్గం ప్రాప్తించాలని కలలు కంటాడు. ఆశకి అంతు లేదు కదా ?

భాగవతంలో వామన చరిత్రలో పోతన గారి పద్యం ఒకటి చూడండి ...


ఆశాపాశము దాఁగడున్నిడుపు , లేదంతంబు రాజేంద్ర! వా
రాశి ప్రావృ త మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులున్నర్ధ కా
మాశన్ బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే ?

మహా సామ్రాజ్యం చేకూరినప్పటికీ వైన్యుడు, గయుడు మొదలయిన పూర్వ రాజులు ఖేద పడ లేదా ?అర్ధకామాశను విడువ గలిగారా?

పసిడి కంకణం మీద పేరాశతో పులి నోటికి చిక్కిన బాపడి కథ చిన్నప్పుడు చదువుకో లేదూ ?

రాజ్య కాంక్షతో అయిన వారినే చంపిన దుర్మార్గులు చరిత్రలో ఎందరు లేరు? అశ ఎంత చెడ్డది ?

అలాంటి వారి గురించి ధూర్జటి చెప్పిన పద్యం కూడా చూడండి ...

ఒకరింజంపి సదస్థులై బ్రతుక తా మొక్కొక్కరూహింతురే
లొకొ ? తామెన్నడుఁజావరో ? తమకు బోవో సంపదల్ ? పుత్ర మి
త్ర కళత్రాదుల తోడ నిత్య సుఖమందంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నడుం కట కటా ! శ్రీ కాళ హస్తీశ్వరా !

బంగరు లేడి లోకంలో ఉండడం దుర్లభం అని తెలిసి కూడా సీతా దేవి దానిని కోరడం , రాముడు ఆమెను విడిచి తెస్తానని వెళ్ళడం ఏం చోద్యం !

కనకమృగము భువిని కద్దు , లేదనకయె , తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివి లేని వాడు దేవుడెట్లాయెరా , విశ్వదాభి రామ వినుర వేమ.

వేమన పద్యమే మరొకటి ...

నీళ్ళ లోన మీను నెరమాంసమాశించి . గాలమందు చిక్కు కరణి భువిని
ఆశ దగిలి నరుడు నీలాగు చెడి పోవు విశ్వదాభిరామ వినుర వేమ,

నీళ్ళలో చేప గాలానికి కట్టిన ఎరకి ఆశ పడి గాలానికి చిక్కి ఛస్తోంది. ఆశ కి తగిలిన మానవుడూ అలాగే నశిస్తాడు సుమా.

ఆశయా బద్ధతే లోకే ... అన్నారు పెద్దలు. అత్యాశ కూడదని చెప్పడమే లక్ష్యం.

30, మార్చి 2010, మంగళవారం

చెప్తే వినాలి ...

సంతస్తాయసి సంస్థితస్య పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ జుషా మేవం విధా వృత్తయ :

నీరము తప్త లోహమున నిల్చి యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు , నా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్

బాగా కాలిన లోహం మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.

అలాగే, మనం అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.

దుర్జనులు ఎప్పుడూ పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని ఆదరించం కదా ?

28, మార్చి 2010, ఆదివారం

అవును కదూ ?

ఆరంభ గుర్వీక్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృధ్ది ముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా, ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం


మొదల చూసిన కడు గొప్ప పిదప కుఱుచ
ఆది కొంచెము తర్వాత నధిక మగుచు
తనరు దిన పూర్వ పర భాగ జనిత మైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి


కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తర్వాత తగ్గి పోతుంది .
మంచి వారితొ స్నేహం మొదట తక్కువగా ఉండి పిదప పెరుగుతుంది.

కుజనులతొ మైత్రి ఉదయకాలపు నీడ లాగున, సజ్జనులతొ మైత్రి సయంకాలపు నీడ లాగున ఉంటాయి .

10, మార్చి 2010, బుధవారం

ఇచ్చుటలో ఉన్న హాయీ ....

ప్రియ:ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వర:

అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి :

మబ్బు ఎప్పుడూ నీటినే యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !

ఎంత మంచి శ్లోకమో చూసారు కదూ ?

ఇవ్వడంలోని గొప్పతనం అలాంటిది మరి...

ఇవ్వడంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ

బాదాబ్జంబులపై కపోల తటిపైఁబాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !

వామన చరితంలోని ఈ పద్యం బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన

పద్య రత్నాలలో యిదొకటి !

9, మార్చి 2010, మంగళవారం

అల్లుడా ! మజాకానా !!

సదా వక్ర: సదా క్రూర: సదా పూజామపేక్షతే

కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమ గ్రహ:

ఎప్పుడూ కుటిలంగానే ఆలోచిస్తూ ఉంటాడు. తనని అందరూ నిత్యం గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు.

అమ్మాయి కొంగు ఒక్క క్షణం సేపు కూడా వదలడు. ఎవరయ్యా ? దశమ గ్రహంగా పిలవబడే అల్లుడు !

అప్పొసింగిన వాడును, అల్లుడ, ద్దె

యింటి యజమానుడు, జీతమిచ్చు వాడు

కుల వినోదియు, పన్నులు కూర్చు వాడు

పుస్తె కట్టని మగడు పో పురుషులకు !

ఆడ పడుచు అర్ధ మొగుడని మనం విన్నదే కదా ? ఆ పద్యంలో మగాళ్ళకి మొగుళ్ళ గురించి చెబుతున్నాడు కవి.

వెలయాలు, శిశువు, అల్లుడు

నిలయేలిక, యాజకుండు, నేవురు ధరలో

కలిమియే లేమియు దలపరు

కలియుగమున కీర్తి కామ కాటయ వేమా !

ఉందా, లేదా అని చూడకుండా పీడించే వాళ్ళ జాబితా చూడండి ... మీది పద్యంలో చెప్పిన ఐదుగురూ వీర లెవెల్లో పీడించడమే పనిగా పెట్టుకునే వాళ్ళుట ...

మోడరన్ అల్లుళ్ళ గురించి పాత కాలపు కవి వాపోయిన విధంబెట్టిదనిన ...

నీటయిన యింగ్లీషు మోటారు సైకిలు

కొని పెట్ట వలెనను కూళ యొకడు

రిస్టు వాచియు, గోల్డు రింగును, బూట్సును

సూట్లు కావలెనను శుంఠ యొకడు

బియ్యే, బియల్ వరకయ్యెడు ఖర్చు

భరియింప వలెనను దరిధ్రుడొకడు

భార్యతోడను చెన్న పట్టణంబుననుంచి

చదివింప వలెనను చవట యొకడు

సీమ చదువులు చాల సింపిలు, నన్నట

కంప వలెననుచు నడుగు నొకడు

ఇట్లు కొసరు కింద నిష్టార్ధముల్ వరులు

దెలుపు చున్న వారు తెల్లముగను

మరో శ్లోకం చూడండి ...

జామాతరో, భాగినేయా, మాతులా దారబాంధవా

అగ్నాతా ఏవ మాతులాం భక్షయంత్యాఖువత్ సదా

దార బాంధవులు నిత్యం మన సంపాదనని ఎలుకల్లా తినేస్తారుటండీ ...

అలుని మంచితనంబును

గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్

పొల్లున దంచిన బియ్యము

తెల్లని కాకులును లేవు తెలియగ సుమతీ !

శ్వశుర మందిర నివాస: స్వర్గతుల్యో నరాణాం

యది భవతి వివేక: పంచభిషడ్దినైర్వా

దధి మధు క్షీర లోపో మాసమేకం నరాణాం

తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ:

అత్తవారిల్లు అయిదారు రోజులు స్వర్గ తుల్యమే. పంచ భక్ష్య పరమాన్నాలూ అమరుస్తారు ... పాత బడితే పాద రక్ష ప్రయోగమే సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు.