29, మార్చి 2011, మంగళవారం

అడ్రసు లేని మనుషులు ... కథ


గత టపాలో ( నొక్కి చూడండి) లేమి వల్ల , ఇతర మానసిక ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చే అతిథుల గురించి ఆందోళన పడుతూ, చుట్టాలను వదిలించు కోవాలనుకునే వారి గురించి కొంత వ్యంగ్యంగా రాసేను.

ఇదే ఇతి వృత్తంతో 15-2-1980 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అడ్రసు లేని మనుషులు అనే కథ ఒకటి రాసి ప్రచురించేను. ఆర్ధిక కారణాల వల్ల ఇంటికి ఆత్మీయుల రాకను కూడ ఆమోదించ లేని వ్యక్తుల దయనీయమైన స్థితిని ఇందులో చూపించేననుకుంటాను. అదే కారణం వల్ల వ్యక్తులు ఆత్మీయతల నుండి, స్నేహాల నుండి, అనుబంధాల నుండి, చివరాఖరికి తమ నుండి కూడా తాము ఎలా పిరికిగా, దూరంగా పారి పోతున్నారో, ఎలా అడ్రసు లేని మనుషులుగా మిగిలి పోతున్నారో ఈ కథలో చెప్పడానికి ప్రయత్నించేను.

ఇదీ ఆ కథ. ( అక్షరాలు పెద్దవి చేసి చదవడానికి కథ మీద నొక్కండి)

28, మార్చి 2011, సోమవారం

చింకి లెక్చరు ... ఈ బ్లాగును చదవొద్దు !


ఉదయాన్నే ఫోనొచ్చింది. పానకాల రావు చేసాడు. బుధవారం మధ్యాహ్నం రెండింటికి కుటుంబంతో పాటు వస్తాడుట. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. భోజనం చేసే వస్తాం కనుక ఆ ఏర్పాట్లేవీ చేయ నవసరం లేదని , కావాలంటే సాయంత్రం ఏ నాలుగింటికో చెల్లెమ్మ ఓపిక ఉంటే కరకరలాడేలా ఏ పకోడీలో, ఘుఘుమలాడే బజ్జీలో చేస్తే సరిపోతుందని భరోసా యిచ్చేడు. వాడు మాఇంటికి వచ్చేటప్పుడు మెనూ వాడే నిర్ణయిస్తాడు. నా గుండెలో రాయి పడింది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి ఇండియా పాకిస్తాన్ లు ఆడే కీలకమైన వన్ డే క్రికెట్ మేచ్ ఉంది. పానకాల రావుకీ, వాడి పెళ్ళానికీ కూడా క్రికెట్ మోజు లేదు. అసలు వాళ్ళకి క్రికెట్ గురించి తెలుసో లేదో కూడా అనుమానమే. వాడి పిల్లలకి మాత్రం క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం, ఈ కాలపు పిల్లలు కదా. అయితే వాళ్ళు ఇల్లు తీసి పందిరేస్తారు. టీ.వీలో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడయితే మరీనూ. వాళ్ళ అల్లరీ ఆగమూ అంతా యింతా కాదు. సచిన్ అవుటయితే ఆ కోపం సోఫా కవర్ల మీదో, పుస్తకాల షెల్ఫు మీదో చూపిస్తారు. లేదా టీ కప్పులు, కాఫీ కప్పులు నేల కేసి కొడతారు. తర్వాత తీరిగ్గా సారీ ఆంటీ, సారీ అంకుల్ అంటూ పళ్ళు యికిలిస్తారు. అసలు ఇలాంటి ఉపద్రవాలేవీ వాళ్ళ ఇంట్లో జరుగకుండా తప్పించు కోవడం కోసమే బుధవారం నాడు పానకాల రావు మా యింటికి వచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కాబోలు. ద్రోహి. ఎంత కపటి ? ఎంత దురాలోచన ?

‘‘ లేదురా, ఈ బుధ వారం మేం ఇంట్లో ఉండడం లేదు. జరూరు పని మీద మా సొంతూరు వెళుతున్నాం ...’’ అంటూ ఓ అబద్ధం చెప్పి తప్పించు కోవాలని పానకాలుకి ఫోను చేద్దామని వాడి నంబరుకి రింగ్ చేసాను. వాడి సెల్ ఆఫ్ చేసి ఉంది. వాళ్ళావిడ నెంబరు కూడా కలవడం లేదు. నానుంచి ఈ రిప్లయ్ ఊహించేడో యేమో, ముందుగానే జాగ్రత్త పడుతున్నారల్లే ఉంది.

జావకారిపోయేం, నేనూ, మా ఆవిడానూ. ఇహ మా బుధ వారం ప్రోగ్రాం సర్వ నాశనమైపోయినట్టే.

ఇలా పనిమాలి పోసుకోలు కబర్ల కోసం వచ్చే వాళ్ళని ఎలా అదపు చేయాలో తెలియక సతమతమై పోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ రాకని ఎలా కట్టడి చేయాలో సరైన సలహా చెబుతాడు కదా అని కథా మంజరి బ్లాగు నిర్వాహకుడికి ఓ మెయిలు పెట్టాను. విషయం అంతా వివరిస్తూ నా గోడు వెళ్ళ బోసుకున్నాను.

ఆ చాదస్తపు బ్రామ్మడు సలహా యివ్వక పోగా, అలా ఇంటి కొచ్చే వారిని అడ్డుకో కూడదనీ, అతిథి సేవాతత్పరత, దిబ్బా దిశిగుండం అంటూ నాకే ఓ చింకి లెక్చరు యిచ్చేడు.పైగా తన మాటలకు ఉపబలకంగా ఏవో సంస్కృత శ్లోకాలూ గట్రా కోట్ చేయడమొకటీనూ. నాకు ఎక్కడో మండింది.

ఆ చింకి లెక్చరు మీరూ వినండి మరి:

నా2భ్యత్థానక్రియా యత్ర, నా22లాసా మధురాక్షరా:
న చా2పి కుశల ప్రశ్న:, తత్ర్త హర్మ్యే న గమ్యతే.

ఎవడి గృహానికి వెళ్తే ఆ యింటి యజమాని లేచి, ఎదురేగి మంచి మాటలతో పలుకరించి, కుశలాదికాలు అడిగి ఆదరించడో అలాంటి వాడి ఇంటికి వెళ్ళ కూడదు.

ఇదీ శ్లోక భావంట. గాడిద గుడ్డేం కాదూ?

చింకి లెక్చర్లో మరి కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడండోయ్

ఉత్తమస్యా2పి వర్ణస్య, నీచో2పి గృహమాగత:
పూజనీయో యథాయోగ్యం, సర్వదేవమయో2తిథి:

పెద్దింటి వాడింటికి చిన్నింటి వాడు వచ్చి నప్పటికీ వానిని యథోచితంగా సత్కరించి, భోజనాదులు సమకూర్చాలి. అతిథి సర్వ దేవమయుడని గుర్తుంచు కోవాలి.

గ్రాసాదపి తదర్ధేన, కస్మాన్నో దీయతే2ర్ధినే,
ఇచ్ఛానురూపో విభవ: కదా కస్య భవిష్యతి.

ఇంటికి వచ్చిన వాడికి ఆ పూట శ్రద్ధతో భోజనం పెట్టాలి. లేదా, తగినంత ధనమైనా యిచ్చి పంపించాలి. వాడే మరో చోట తింటాడు. ఎప్పుడో తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాననడం వట్టి మాట.
తనకు కావలసినంత ధనం ఎప్పుడూ ఎవడి దగ్గరా ఉండడం చూడం కదా. అంచేత, ఎంతుంటే అంతా యిచ్చి పంపాలి.

న్యాయార్జిత ధనసత్త్వ, ఙ్ఞాననిష్ఠో2తిథి ప్రియ:
శాస్త్రవిత్ సత్యవాదీ వా, గృహస్థత్వే2పి ముచ్యతే.

న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించే వాడూ, తత్వ్త ఙ్ఞానం నందు శ్రద్ధ కలవాడూ, అతిథి అభ్యాగతులను ఆదరించి సేవించే వాడున్నూ, శాస్త్రఙ్ఞుడు, సత్యవ్రతుడు అయిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ముక్తిని పొందుతాడు అని ధర్మ శాప్త్రాలు చెబుతున్నాయి.

దాతవ్య మన్నం విధివత్, సత్కృత్య నతు లీలయా
సర్వే వర్ణా యథా పూజాం, ప్రాప్నువంతి సుసత్కృతా:

ఆయా వర్ణముల వారికి యథోచితముగా సత్కరించి, విధివిహితంగా పూజించి అన్నం పెట్టాలి కాని, ఏదోలే అని, తేలిక భావంతో అన్నం పడవేయ కూడదు సుమా !

తృణాని భూమి రుదకం, వాక్చతుర్ధీ చ సూనృతా,
ఏతాన్యపి సతాం గేహే, నోచ్చిద్యంతే కదాచన

అతిథికి అన్నం పెట్టే శక్తి లేక పోయినప్పటికీ, ధార్మికుడైన గృహస్థుని యింట విశ్రమించే చోటు, దాహానికి మంచి తీర్ధం,నాలుగు మంచి మాటలు ... వీటికి లోటు చేయ కూడదు సుమీ.

అరాప్యుచితం కార్యం ఆతిథ్యం గృహ మాగతే
ఛేత్తు: పార్శ్వగతాం ఛాయాం, నోపసంహరతే ద్రుమ:

ఇంటికి వచ్చిన అతిథి, తన శత్రువయినా సరే, ఆతిథ్యం యిచ్చి గౌరవించాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనే ఇస్తోంది కదా.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంస భక్షణమ్.

అతిథి వాకిటిలో ఉండగా వాడిని విడిచి తాను మాత్రమే అన్నం తినడం మహా దోషం. అలాంటి వాడు పట్టిన ఆపోశనం మద్యపానం చేయడంతో సమానం. వాడు తినే అన్నం గోమాంసంతో సమానం.

బాలో వా యది వా వృద్ధో, యువా వా గృహమాగత:
తస్య పూజా విధాతవ్యా, సర్వస్యా2భ్యాగతో గురు:

ఇంటికి అతిథి, అభ్యాగతునిగా వచ్చిన వాడు బాలుడు కానీ, వృద్ధుడు కానీ - అలా వచ్చిన వాడు పూజనీయుడు. వాడిని పూజించ వలసినదే. అభ్యాగతులు గురువుల వలె అందరకీ ఆదరణీయులు.

ఈ విధంగా కథా మంజరి వాడు అతిథి సేవను గురించి చాలా సేపు నాకు ఓ చింకి లెక్చరు యిచ్చి నా బుర్ర తినీసేడు.

చుట్టాల బాధని ఎలా వదిలించు కోవాలో చెప్పరా నాయనా అంటే చింకి లెక్చర్లతో మెదడు తినేసే
( మధ్యలో సంస్కృత శ్లోకాలూ, వాడి పిండాకూడూనూ) ఈ చాదస్తపు బ్లాగరెక్కడ దొరికాడురా బాబూ. ఇహ మీద వాడి కథా మంజరి బ్లాగు నేను చదవను గాక చదవను.

మీరు కూడా చదవొద్దు. ఏం ?!


27, మార్చి 2011, ఆదివారం

పంతుల సీతాపతి రావు గారి పద్యాలు


శ్రీ పంతుల సీతాపతి రావు పద్య రచనలో విశేష కృషి చేస్తున్నారు. గణిత శాస్ర్త ఉపాధ్యాయునిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు నందిన వీరు తెలుగు పద్యం మీద అపార మైన మక్కువతో తరచుగా పద్య రచన చేస్తూ ఉంటారు. సుందర కాండ మొత్తం వీరు ఇటీవల పద్య రచనగా పూర్తి చేసారు. స్పందించిన ప్రతి అంశాన్ని ఛందో బద్ధం చేయడం వీరి అలవాటు. ఉద్యోగ విరమణానంతరం వీరు ప్రస్తుతం విశాఖ లో ఉంటున్నారు. వారి పుష్పావేదన మన కథా మంజరి బ్లాగర్ల కోసం. చూడండి:
:
పుష్పా వేదన


వేకువందునే మేల్గాంచి వివస మొంది,
దైవ పూజకు పూలను తేవ నెంచి,
పూల తోటకు నేగితి పూలు కోయ, 1

జాలి కురిపించు జంధ్యాల పూల కవిత
ఎచట నుండియో వినిపించె అచట నాకు
మనసు మార్చుకు కొమ్మను విడిచి పెట్టి
వట్టి చేతుల ఇంటికి పయన మైతి 2

పయన మవుతున్న నను జూచి మల్లె యొకటి
"వెళ్ళి పోబోకు మిత్రమా! వెళ్ల కనుచు "
నేల పడియున్న పూలను నెత్తి జూపి
దీన మలరగ వినిపించె వింత కధను 3

వాడి రాలిన మము జూడ వచ్చి నావ?
పూజ కొరకునే పూవులు పూయు ననుచు
భక్తి శ్రద్ధతో మమ్ముల పట్టు కెళ్ళి
పూజ చేసెడి వారు మీ పూర్వ జనులు 4


రంగు రంగుల పూవుల రాసి పోసి,
ఊలు దారాలతో మమ్ము మాల గూర్చి
స్వామి మెడలోన మము వేయు సమయ మందు,
ఎంత ఆనంద పడితిమో ఎరుక పడదు. 5

మంత్రపు నీళ్ళు జల్లి మము మంత్రము తోడనె పూజ చేసి , యా
చెంతన యున్న భక్తులకు చింతలు పోవగ ఇచ్చి నంత , వా
రంతయు పూజ పూవులని ఆత్రత తోడుగ చేత బట్ట ; మే
మెంతగ పొంగి పోయితిమొ ? ఏ తరి చేసిన పుణ్య మంచు చున్ 6

నూట ఎనిమిది పూవులు పూజ చేసి
మంత్ర మంత్రంబు కోక్కొక్క మహిమ జెప్పి,
స్వామి పాదాల చెంతన జార విడువ
ప్రభువు సేవకు ఉపయోగ పడితి మనుచు
అమిత ఆనంద పడితిమి అబ్బురముగ 7

పూజ చేసిన వాడిన పూల నన్ని
భద్ర పరిచియు మర్నాడు పదిలముగను
తులసి మొక్కల నడుమున తురిమి యుంచి
జలము నర్పణ చేసియు జార విడరె ! 8

గోళెముల లోన మట్టిని గుమ్మ రించి,
మొక్కలను నాటి ప్రతి రోజు మొద మలర,
నీరు పోయుచు ప్రాణాలు నిలుపు మీకు ,
పూల నిచ్చెడి సంతృప్తి పొంది నాము ! 9

పెండ్లి కూతురు అందంబు వెల్లి విరియ
మల్లె జాజులు జడలోన మాల తురిమి
బంధు హితులంత మెచ్చుతూ పరవ సించ
జన్మ ధన్యత అయినంత సంభ్రమొందె ! 10

సభల యందున సత్కవుల్ సత్క రించ
పుష్ప గుచ్చము లిచ్చుచు ప్రోత్స హించ
వారి గౌరవ మంతయు మాదె అనుచు
గొప్పగా మేము చప్పట్లు కొట్టి నాము 11

హరికధను చెప్పు హరిదాసు హార మందు,
పూల దండయే దాసుకు ప్రోత్స హమ్ము;
హరియు నామమె ప్రజలకు హర్ష మనుచు
బ్రతుకు చున్నాము ఇన్నాళ్ళు పరువు తోడ 12

సిగను ముడుచు కొనెడి చిరు పూల దండయే,
భార తీయ స్త్రీకి గౌర వమ్ము ;
పెళ్లి రోజు తెచ్చు మల్లె పూదండయే
ప్రియుడు సఖికి ఇచ్చు ప్రేమ గుర్తు ! 13


ప్రకృతికె కాదు జనులకు బహు విధాల
అందము తొ బాటు ఆహ్లాద మంద చేయు
మమ్ము వెలి వెయ మీ కెట్లు భావ్య మయ్య?
ప్రజల కుపయోగ పడ నట్టి బ్రతుకు లేల? 14

అడవి కాచిన పూలలా అంత రించ
పుట్టి గిట్టిన మా కెట్లు పుణ్య మబ్బు?
ప్రభువు సేవకు ఉప యోగ పడుయు నటుల
సాయ మొందించి మా పట్ల జాలి గొనుమ? 15

అనుచు పూలన్ని నా మీద ఆగ్ర హించ
పూజ సరిపడ పూలను ప్రోగు చేసి
పూల నర్పించి దైవాన్ని పూజ చేయ
పరుగు పరుగున ఇంటికి పయన మైతి ! 16







24, మార్చి 2011, గురువారం

డా. ముద్దు వెంకట రమణారావుకొత్త పుస్తకాలు

డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గురించి కథా మంజరి లో ‘‘ విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం’’అనే శీర్షిక లో వారి పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.

అవి:

1. రమణీయం ( కవితా వ్యాస సంపుటి)

2. కమనీయం ( కవితా సంపుటి)

3. ఉదయ కిరణాల (వ్యాస సంపుటి)

4. మహనీయం ( కవితా సంపుటి)

5. సంధ్యారాగం ( వ్యాస సంపుటి )

ఆ వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.

ఇక, ఇటీవల వారు ‘‘వెన్నెల వెలుగులు ’’ అనే వ్యాస సంపుటిని, ‘‘ అనలానిల గీతాలు ’’ అనే కవితా సంపుటిని కొత్తగా వెలువరించారు.

వాటి గురించిన క్లుప్త పరిచయం:

వెన్నెల వెలుగులు:

ఇందులో వివిధ అంశాల మీద సాధికారికంగా వారు వ్రాసిన 33 వ్యాసాలు ఉన్నాయి.

ఈ పుప్తకానికి అక్కిరాజు రమాపతిరావు గారు సాహితీ కదంబం పేరిట ముందు మాటను, డా.ఎస్.వి. సత్యనారాయణ గారు వ్యాస వెన్నెలకు అభినందన పేరిట ఆప్తవాక్యాలను వ్రాసారు.

అక్కిరాజు వారు ఈ గ్రంథాన్ని ప్రపంచ సాహిత్యాన్ని స్థూలంగా ఎరుక పరిచే పెద్దబాల శిక్షగా అభివర్ణించారు.వీటిలో చిత్రణలు మన మనసుని ప్రపంచ యాత్ర చేయిస్తాయి అని చెబుతున్నారు.

అంతగా ప్రాచుర్యం పొందని కావ్యాలను సైతం మరుగున పడి పోకుండా, సామాన్య పాఠకులకు పరిచయం కలిగించడమే ధ్యేయంగా వీటిలో కొన్ని వ్యాసాలను వారు రచించడం జరిగింది. అద్దంకి కేశవరావు గారి తథాగతీయం ఐతిహాసిక కావ్యం గురించిన వ్యాసమే ఇందుకు నిదర్శనం. తాము చెప్ప దలచుకున్న విషయాన్ని నిదానంగాభావించి, పాఠకుల సంభావింప చేసే నైపుణ్యం గ్రథనంలోనూ, కథనంలోనూ కనబడుతుంది అని రమణారావు గారిని అక్కిరాజు ప్రశంసించారు. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చూపే అంతర్వీక్షణం, ప్రపంచాన్నంతా తెలియాలన్న ఆర్తి ఉండాలని, అవి రమణారావు గారిలో పుష్కలంగా ఉన్నాయని, అందు చేతనే ఈ వ్యాస సంపుటి ఇంత సరళ సుందరమై, సుబోధకమై, విషయావగాహనా సమన్వితమై, ఆసక్తి పరులైన తెలుగు వారికి అత్యంత సన్నిహితంగా చేరువయ్యేలాగున వెలువడిందని అక్కిరాజు రమాపతి రావు గారు అభిప్రాయ పడడం సహేతుకమే అనిపిస్తుంది.

డా.ఎస్.వి.సత్యనారాయణ గారు తమ ఆప్త వాక్యంలో చర్విత చర్వణంగా పూర్వ సాహిత్య సౌరభాల గురించి లోగడ విమర్శకాగ్రేసరులు చెప్పిన విషయాలనే తిరిగి చెప్పకుండా, వారు దర్శించిన వినూత్న సాహిత్యాంశాలను రేఖామాత్రంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సదాశయంతో రమణారావు గారు ఈ వ్యాస వెన్నెలను రూపొందించారని చెబుతున్నారు.

ఆయా సాహిత్యాంశాలలో చక్కని పరిశ్రమ చేసి కూడా, సామాన్య పాఠకజన పఠనపరిశ్రమని గణన లోనికి తీసుకుని నాతి దీర్ఘమైన రీతిలో ఈ వ్యాసాలను రచించడం జరిగిందని రచయిత తమ ముందు మాటలో తెలియజేసారు.

ఈవ్యాస సంపుటిలో వసు చరిత్రం, ఆముక్త మాల్యద, అనిరుద్ధ చరిత్రము, తొలి అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, ఐతిహాసిక కావ్యం తథాగతీయం, వంటి గొప్ప ప్రాచీన కావ్యములను గురించిన అనుశీలనమే కాక, నాయని సుబ్బారావు కృతులు, జాతీయోద్యమ కాలం నాటి రచనలు, ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథకులు, మరాఠీ నాటక కర్త విజయ్ తెందూలక్కర్, విక్టోరియా యుగం నాటి ఆంగ్ల సాహిత్యపు పోకడలు, రష్యన్ సాహిత్య పరిచయం, అప్పటికీ ఇప్పటికీ షేక్స్పియర్, లాంటి వ్యాసాలు పొందు పరిచారు.

సంగీతాభిమానులైప ఈ రచయిత వాటికి సంబంధించిన కొన్ని మంచి వ్యాసాలను కూడ ఇందులో జత చేసారు. హిందూస్థానీ శాష్త్రీయ సంగీత పరిచయం, సూర్య కుమారి జాతీయ గీతాలు ఈ కోవకి చెందిన వ్యాస రచనలు.

వీరికి చిత్రకాళాభినివేశం కూడ మెండు. ఆధునిక చిత్ర కళ, ఆంధ్ర చిత్ర కళ వంటి లఘు వ్యాసాలను చదివితే ఈ విషయం కాదనలేం.

ప్రాచీన, అర్వాచీన సాహిత్య గ్రంథాల పట్ల అభిరుచి కలిగి ఉండడం, తగినంత కృషి చేసి సంస్కృత సాహిత్యం అధ్యయనం చేయడం తాను అనుభవించిన వాటిని అక్షరాలలో అందంగా పలవరించడం, పదిమందితో పంచు కోవడం వీరికి చాల ప్రీతి పాత్రమైన విషయంగా తోస్తుంది. అది. సాహిత్యం, చిత్ర కళ, నృత్య రీతులు, శిల్పం, పర్యటనానుభవాలు , సంగీతం ... ఏదయినా కావచ్చును. వాటి ఆనుపానులు తెలుసు కోవాలనే అనురక్తి వీరిలో మెండు. తెలిసిన దానిని, తెలుసుకున్న దానిని, సామాన్య పాఠకులకు తెలియ జేయాలనే ఆర్తి కూడ ఎక్కువే. ఎదిగిన కొద్దీ ఒదిగే మనస్తత్వంతో,

వీరు ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్నీ అక్షర బద్ధం చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతులయ్యారని ఈ పుస్తకాలే చెబుతున్నాయి.

ఈ వ్యాస సంపుటిని వీరు తమ బాల్య మిత్రులు, సహృదయులు, విద్యా వేత్త, అశేష శేముషీ ధురంధరుడు, కీ.శే. ఆచార్య తూమాటి దొణప్ప ( మాజీ వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం) మధుస్మృతికి అంకితం చేసారు.

ఇక, వీరు ప్రచురించిన కొత్త కవితా సంపుటి అనలానిల గీతాలు:

62 కవితలు గల ఈకవితా సంపుటికి డా.సి.నారాయణ రెడ్డి గారు, డా,ఎన్. గోపి గారు అభినందన వాక్యాలు అందచేసారు.

భావపూర్ణంగా, సముచిత పదనిహితంగా పాఠకులకు అందించే సృజనాత్మక ప్రతిభ రమణారావు గారిదని సి.నా.రె ప్రశంసించగా,అనలానిల గీతాలలో అనల గీతాలు ( అగ్నికి సంబంధించినవి) అనిలగీతాలు ( వాయువుకి చెందినవి) , వాటి గూర్చిన కవితాలాపన, తాత్వ్తిక స్పర్శ కనిపిస్తున్నదని ఆచార్య గోపి వివరించారు. మృదుత్వం, తగ్గని ప్రౌఢశైలిలో రాసిన పద్యాలు రమణారావు గారి కవితా శక్తిని తెలియ జేస్తాయి అని అభినందిస్తున్నారు.

వీటిలో అనలానిల గీతాలే కాకుండా అన్య వస్తు సంబంధితాలయిన మరి కొన్ని కవితలను కూడ చేర్చడం జరిగింది.

వీటిలో అనల గీతాలు 15, అనిల గీతాలు 12, ఇతరములు 31, అనువాద గీతాలు 4 మొత్తం 62 కవితలు చేర్చారు. సంఖ్యాపరంగా ఇతర గీతాలు, అనువాద కవితలు అనలానిల గీతాల కన్న ఎక్కువ కనిపించే ఈ కవితా సంపుటికి అనలానిల గీతాలు అనే పేరు ఉంచడం చిత్రమనిపించినా, అసంగతంగా తోచదు. పాంచభౌతిక పరివ్యాప్తమైన లోకంలో అనల స్పర్శ, అనిల స్పర్శ లేనివి ఏవీ ఉండనేరవు అనే స్పృహ ఈ కవి లో ఉండడం చేత దీనికి అనలానిల గీతాలు అనే పేరు సముచితమని భావించి ఉంటారు.

అనల గీతాలు అగ్నిమీళే పురోహితమ్ అనే వేద వచనంతోను, అనిల గీతాలు మలయానిల గీతం తోను మొదలు పెట్టడం వీరి ఔచితీ ప్రదర్శనకు తార్కాణ.

ఈ కవితా సంపుటిలో వీరి కవితా సామర్ధ్యానికి ఉదాహరణ ప్రాయంగా కొన్ని కవితా పంక్తులని చూడండి:

అణువునణువున నిక్షిప్తమైన అగ్ని

జఠర మందు జీర్ణాగ్నిగా జ్వలనమందు

ప్రాణులన్నిట వెలిగెడి ప్రాణ జ్యోతి

పీడితుల మానసమ్ముల విప్లవాగ్ని.

అగ్ని గీతం అనే శీర్షికన వెలువరించిన ఈ చిన్ని కవితలో ప్రాణులన్నిట వెలిగే అనల జ్యోతి పీడితుల మనస్సులలో రగిలే విప్లవాగ్నిగా అభివర్ణించడం కవికి గల అభ్యుదయ దృక్ఫథాన్ని తెలియ జేస్తోంది.

ఒక దీపం చాలు వేయి దీపాలను వెలిగించును అనే భావనకు పద్య రూపం:

ఒక్క దీపమ్ముతోడ ప్రద్యోతమౌను

శతసహస్ర దీపమ్ములు ; సకల శుష్క

వనములనెల్లను దావాగ్ని కణము కాల్చు

మంచి చెడ్డల రెంటిని పంచునగ్ని.

ఇక, అనిల గీతాలలో తొలియూరుపు అనే కవిత గొప్ప తాత్త్విక కోణం ఆవిష్కరించే కవిత.

తొలియూరుపు నుండి కడపటి యూరుపు వరకు జీవధార ప్రవహింపగ, చేతన ప్రభ వికసింపగ అవిరామంగా ప్రసరించే మారుత తరంగాలకు కవి అంజలి ఘటిస్తున్నారు.

అనిల గీతాలాపనలో గాలిలో కలసి పోయిన కాలకూట విషవాయువు బారిన మృత్యువాత పడిన అసంఖ్యాక జనుల మృత్యు ఘోష విషవాయువు కవితలో వినిపిస్తున్నారు. ఇది వీరి సామాజిక స్పృహకు నిదర్శనం.

భీకర దృశ్యమ్మది

వేలకొలది జనులు

విగత జీవులైన వేళ

విషాద చరిత సృష్టించును

అని చెబుతూ ఈ దండనీతి యేరీతిగ సాగిందని, ఎవరు దీనికి బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

ఇతర గీతాలలో చక్కని గీతాలు కనిపిస్తాయి. సెల్ ఫోన్, టైమ్ మిషీన్ వంటి చమత్కార జనితాలయిన కవితలను ఈ విభాగంలో చూడవచ్చును.

మనలోనే కాలయంత్రములు

మనస్సులోనే ఇమిడి వున్నవి ...

అంటూ, మన ఙ్ఞాపకాలే గత కాలం లోకి మనలని మోసుకుని పోతాయనీ, మన కలలే భావి మార్గంలోకి మనలను పయనింప చేస్తాయనీ, అందు వలన కడు క్లిష్టమైన ఖరీదయిన యంత్రాలతో పని లేదని వివరణ యిస్తున్నారు.

ఈ కవి తమ కవితావేశాన్ని ఇలా అక్షరీకరిస్తున్నారు:

కవితావేశము పొంగు వేళల లసత్

కావ్యాకృతుల్ మన్మనో

భవమై, సుందర పద్య గేయ రచనల్

భాసించు స్వేచ్చా విధిన్

మివులన్ సమ్మదమై, నవరసో

న్మీలమ్ముగా వ్రాసెదన్

ఇవినా తప్పులుగా బుధుల్ తెలిసి

సైరింపంగ ప్రార్ధించెదన్.

ఈ కవితాభివేశం యిలాగే నిండు నూరేళ్ళు కవిలో ఉండాలని కోరుకుందాం,

ఈ కవితా సంపుటిని వారు తమ ఆప్తుడు, సహృదయుడు, కవి, పండితుడు అయిన కీ.శే. పంతుల విశ్వనాధ రావు మధుర స్మృతికి అంకితం ఇచ్చారు.

సుందరంగా వెలువడిన ఈ రెండు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),వారు ప్రచురించారు. వారి ప్రథాన కార్యాలయం శ్రీకాకుళంలో ఉంది. వెన్నెల వెలుగులు వ్యాస సంపుటి వెల రూ. 125. కాగా, అనలానిల గీతాలు కవితా సంపుటి రూ.75 లకు లభిస్తోంది.

ఇతర వివరాలకు: శ్రీరామిశెట్టి, ప్రథాన కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం వీధి,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001

పెల్: 9441707772

చిరునామాకి సంప్రదించ వచ్చును.

లేదా, నేరుగా రచయిత గారినే పంప్రదించ వచ్చును. వారి చిరునామా:

డా,యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ

రిటైర్డ్ సివిల్ సర్జన్

ప్లాట్ నం. 211, ఎస్.బి.ఐ కాలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001

ఫోన్: (08942)223143 సెల్: 9849696511

6, మార్చి 2011, ఆదివారం

ఎర్ర డబ్బా ఆకలి కేకలు


ఎర్రగా బుర్రగా, కొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?

నగరాల్లో, పట్నాలలో, పల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులు, కవర్లు, ఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చి, నా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరి, అక్కడ ముద్రలు వేయించుకుని, ఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలో, బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళి, అవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.



ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవి, కబుర్లు చెప్పేవి, నిష్టూరాలు పలికేవి, నిందలు వేసేవి, సాయం కోరేవి, అభయం యిచ్చేవి, ధైర్యం చెప్పేవి, బెంగలు, బాధలు, చికాకులు, కష్టాలు కలబోసుకునేవి, కన్నీళ్ళు కార్చేవి, నవ్వుతూ కళకళ లాడేవి ... ...

కొన్ని మృదువుగా, కొన్ని కఠినంగా, కొన్ని క్లుప్తంగా, కొన్ని సుదీర్ఘంగా, మరి కొన్ని పెళుసుగా, కుండ బద్దలు కొట్టి నట్టుగా, హెచ్చరికలు, ఓదార్పులు, మంతనాలు, హిత వచనాలు, వేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...

శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .

కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.

కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...

ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.

మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.

ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?

లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?

నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.

ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...

ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనో పూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.

సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.

అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..

అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.


చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.

నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?

2, మార్చి 2011, బుధవారం

21, ఫిబ్రవరి 2011, సోమవారం

శరణు !శరణు !!


మాతృభాషా దినోత్సవ సందర్భంగా నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చిన నా కథ మరొక్కసారి.

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

‘‘సరసి’’జ మనువిద్ధమ్ ...

తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వ్యక్తి, ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఎక్కడా తూలి పడి పోకుండా నడిస్తేనే కదా, అతడు ఆ విద్యలో విజయం సాధించి నట్టు !

రంజకం అంటుకుని, ఝయ్ ఝయ్ మని వెలగడం మొదలు పెట్టిన చిచ్చు బుడ్డి అంత లోనే తుస్సుమంటే అదోలా ఉంటుంది.

బ్రహాండమయిన పబ్లిసిటీ ఇచ్చిన చిత్రరాజం మొదటి రీలే మొహం మొత్తేస్తే రెండో ఆట వేసే ప్రసక్తే ఉండదు కదా.

గొప్ప ఆర్భాటాలకు నీరసమైన ముగింపులు అందగించవు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కార్ట్యూన్ల పుస్తకంలో మొదటి కార్టూను నుండి చివరి కార్టూను వరకూ కూడా పొట్ట పగిలేలా నవ్వించ గల కార్టూన్ల పుస్తకం దొరికితే ఎంత బావుంటుంది చెప్పండి?

ఆ ముచ్చట నిశ్చయంగా నూటికి రెండు వందల పాళ్ళు తీర్చ గల మంచి కార్టూన్ల పుస్తకాలు - సరసి గారి కార్టూన్ల పుస్తకాలు రెండూనూ.

సరస్వతుల రామనరసింహం గారు సరసి అనే కలం పేరుతో రెండు కార్ట్యూన్ పుస్తకాలు ప్రచురించారు.
ఇప్పటికే వందలాది కార్ట్యూన్ అభిమానుల పొట్టలు చెక్కలు చేసిన నేరానికి సరసి గారు ఇలాంటి కార్టూన్లు ఇంకా వేలాదిగా వేయాలని , ఆవిధంగా వీరికి కఠిన దండ (న) విధించాలని యువరానర్,
కోరుకుంటున్నాను.

సరసిజ మనువిద్ధం శైవలేనా2పి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్స్మీం తనోతి ...

అంటాడు శకుంతల గురించి కాళిదాసు. నాచు చేత కూడినదై నప్పటికీ పద్మం మనోహరంగా ఉంటుంది. మాలిన్యం కలదైనప్పటికీ చంద్రుని లోని మచ్చ శోభను విస్తరిస్తోంది అని శ్లోకంలో ఈ రెండు పాదాలకీ అర్ధం.

సరసి గారి కార్టూన్లు కూడా ఆయన మాటల్లోనే చెబుతే, ఆస్తిపాస్తులు అట్టే వున్నవి కావు. ఎక్కువగా మధ్య తరగతి ప్రాణులు. సూటు వేసుకో లేని బడుగు బనీను జీవులు. నేతల చుట్టూ తిరగకుండా , నేత బట్టలు చుట్టుకుని తిరిగేవి. సమస్యల్లో నవ్వులు వెదుక్కునేవి. తమ మీద తామే పడి నవ్వుకునేవి. ఆ విధంగా ఈ కార్టూన్లన్నీ బడుగుల జీవితాల్లో నుండి, వారి అలవాట్ల నుండి, ఆలోచనల నుండి, ఆశల నుండి, నిరాశల నుండి,మాటల్లోంచి, చేతల్లోంచి, వచ్చిన దినుసులే.

అలా ఈ రెండు పుస్తకాలలోని కార్టూన్లు ‘సరసి’జ మనువిద్ధాలు.

సరసి గారి కార్టూన్లు ఆంధ్ర ప్రభలో వచ్చే రోజులలో శ్రీ బాపు గారి నుండి ఆ పత్రికా సంపాదకులకు ఈ విధంగా ఉత్తరం వచ్చింది:

‘‘ మీ పత్రికలో సరసి అన్నతను ( లేదా, ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన వానిని ఇంత వరకూ చూడ లేదు’’

బాపు గారి నుండి ఇంత గొప్ప కితాబు అందుకున్న సరసి గారి కార్టూన్ల గురించి వేరే చెప్పనవసరం లేదు.

ప్రతి పద్యము నుందు చమ
త్కృతి గలుగం చెప్ప నేర్తు వెల్లడ బెళుకౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీ మార్గ మెవ్వరికిన్ రాదు సుమీ !

అని, నుతిస్తాడు రఘునాథుడు విజయ విలాస కర్త చేమకూరి వెంకన్నను.

చేమకూర కవి ప్రతి పద్యం లోనూ చమత్కారం చిలికిస్తే, ప్రతి గీత లోనూ, ప్రతి రాత లోనూ చక్కని చమత్కారాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించిన అచ్స తెలుగు కార్ట్యూనిస్ట్ సరసి గారు. వారి కార్టూన్ లు తెలుగుతనంతో చక్కిలిగంతలు పెడుతూ ఉంటాయి.

మనమీదేనర్రోయ్ అనిపిస్తూ ఉంటాయి.

ఆ పుస్తకాలను చూస్తే ఈ రహస్యాన్ని మీరు కూడా నాలాగే కనిపెట్ట వచ్చును.

సరసి గారి గీతా మాధుర్యం రుచి చూడడం కోసం వారి కార్టూన్ పుస్తకాలలో ప్రచురించిన మొదటి, చివరి కార్టూన్ లు సరదాగా ఇక్కడ చూడండి:

ఇవి సరసి కార్టూన్లు మొదటి సంకలనం లోని తొలి పుట లోని కార్టూన్ లు.




అదే పుస్తకం లోని చివరి పేజీ కార్టూను ఇది!



సరసి కార్టూన్లు - 2 పేరుతో వచ్చిన రెండవ సంకలనం లోని మొదటి కార్టూను ఇది !




ఆ కార్టూన్ల పుస్తకం లోని చివరి పేజీలో ఉన్న కార్టూను ఇది !

రెండు పుస్తకాల లోనూ తొలి , మలి కార్టూన్ ల రుచి చూసారు కదా ? ఇహ మధ్యలో ఉండే మాధుర్యాన్ని మీరే జుర్రుకోండి ...తనివి తీరా నవ్వు కోండి. అంత కంటె ముందు ఈ కార్టూన్ పుస్తకాలను కొనుక్కోండి. అది మాత్రం మరిచి పోకండేం?

ఎక్కడ దొరుకుతాయంటారా? అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. వెల గురించి బెంగ లేదు. మీరు ఒక్కో పుస్తకానికీ వంద చొప్పున రెడింటికీ రెండు వందలు యిచ్చి, పాతిక రూపాయల చొప్పున మొత్తం ఏభై రూపాయలు ఇమ్మని దబాయించి మరీ వసూలు చేసుకోండి. కాదంటే సరసి గారికి కంప్లయింట్ చేయండి.

అన్నట్టు, ఈ కార్టూను పుస్తకాలు కొన్న వారికి కలకండల్లాంటి తియ్యని ముందు మాటలు - శ్రీరమణ,తనికెళ్ళ భరణి గార్లవి - పూర్తి ఉచితంగా ఇవ్వబడును. ఆలసించిన కార్టూన్ భంగం. ఆపైన మీ యిష్టం. నన్ననకండి.
సరసి గీతలే కాదు, రాతలు కూడా చక్కిలి గింతలు పెట్టేవే. వాటి గురించి మరో మారు ....

ఇంకా వివరాలూ గట్రా కావాలంటే సరసి గారితోనే నేరుగా మాట్లాడితే ఓ పనైపోతుంది ...
వారి ఫోను: 09440542950 మెయిలెడ్రసు: sarasi-cartoonist@yahoo.com

7, ఫిబ్రవరి 2011, సోమవారం

పెంకె ఘటం, మా పతంజలి


పతంజలి గారు ఓ రోజు ఒక పత్రికాఫీసులో కూర్చొని వుండగా అక్కడికి దండిగా మాత్రమే కధలు రాసిన ఓ విశాఖ రచయిత వచ్చారు. పత్రికాధిపతి ఆయనను పతంజలి గారికి పరిచయం చేసారు. పతంజలి గారు అప్పటికే వీర బొబ్బిలి,రాజుగోరు,దెయ్యం ఆత్మ కధ,పెంపుడు జంతువులులాంటి క్లాసిక్స్ రాసి వున్నారు.ఆ రచయిత పతంజలి గారి వంక దర్పంగా ఓ చూపు చూసి మీ పేరు విన్నట్లు గుర్తు .మీరు కూడా కధలవీ రాస్తారనుకుంటాఅన్నారు.పతంజలి గారు పెంకిగా ఎబ్బెబ్బేనేను అట్లాంటి పనులు చేయను లెండిఅనేసారు.ఈ ఎపిసోడ్ అంతా పతంజలి గారు విశాఖ వర్మకి చెపుతూ చూసావోయ్ ఈ రచయితల గోరోజనం…..”అన్నారు.అపుడు వర్మ రణపెంకిగాఅంతేలెండి మరి అయన రాసిన ఐదువందల కధలు మీరు రాయని ఒక కధతో సమానమనిముక్తాయించారు

పతంజలి గారి హాస్య చతురతికి చక్కని తార్కాణమిది. వర్మ గారి ముక్తాయింపు బావుంది. పతంజలి గడుసు దనానికి మరో చిన్న ఉదాహరణ : విజయనగరంలో ఓ (పెద్ద అనుకునే ) రచయిత ఒక సారి తన పుస్తకాన్ని యిచ్చి అభిప్రాయం కోరేడు పతంజలిని . రెండు రోజులాగి చెప్తానని పతంజలి ఆ పుస్తక రచయితతో చెప్పి పుస్తకం తీసుకున్నాడు.
రెండు, మూడు రోజులయేక పతంజలి ఆ పుస్తకాన్ని అతనికి తిరిగి యిచ్చేస్తూ : ‘‘ పుస్తకం చాలా బావుందండి. చక్కని గెటప్. మంచి ప్రింట్. ఎక్కడా అక్షర దోషాలు లేవ్. వాడిన పేపరు చాలా బాగుంది …’’ లాంటి మాటలేవో మాట్లాడేడు. ఆ రచయిత చాలా సంతోషించి, ధన్యవాదాలు మరీ, మరీ చెప్పి ఆనందంగా వెళ్ళి పోయేడు.
‘‘
ఆయనకి నా అభిప్రాయం సరిగా చెప్ప గలిగేను కదా?’’ అడిగేడు పతంజలి.
‘‘
బ్రహ్మాండంగా పుస్తకం గురించి ఒక్ఖ మాట దొర్లకుండా జాగ్రత్త పడుతూ బాగానే చెప్పారు …’’ అన్నాను, నవ్వుతూ
తర్వాత, యిద్దరం సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీలు తాగుతూ ఎంతగా పగలబడి నవ్వుకున్నామో

- - - - - - - - -

ఈ టపాలో మొదటి సంఘటన విశేషాన్ని జాజిమల్లి గారి మల్లీశ్వరి బ్లాగు టపా పతంజలి రాయని కథ నుండి తీసు కోవడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. ఆ టపా కోసం ఇక్కడ చూడండి.

ఇక, రెండవ సంఘటన గురించి నేను జాజిమల్లిగారి పతంజలి రాయని కథ టపాకు నేను అప్పట్లో ఉంచిన వ్యాఖ్య . ( మొదటి సంఘటన నాకు శృత పూర్వం కాడం చేత, రెండో దానిలో నా ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండడం చేత టపా పెట్టే ముందు జాజిమల్లి గారి టపా గురించి పేర్కొనడంలో ఏమరుపాటు జరిగింది.)

ఈ రోజు పతంజలి సమగ్ర సాహిత్య రచనలు మరోసారి ( బహుశా పదో సారి) చదువుతూ ఉంటే ఆ టపా, దానికి నేను పెట్టిన వ్యాఖ్య గుర్తొచ్చి మరోసారి బ్లాగులో నా ముచ్చట కొద్దీ పెట్టాను.

ఇది టపాల పునరక్తి కావచ్చు, కానీ మా పతంజలి గురించి ఎన్ని సార్లు చెప్పినా నాకు తనివి తీరదు.

ఇక్కడ నా ఈ టపాకి వ్యాఖ్య పెట్టి, నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసిన మల్లి (Malli) గారికి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నాను.. .

కె.ఎన్.వై.పతంజలి రచనలూ,ఫోటోలు కోసం ఓసారి ఇక్కడ నొక్కి చూస్తే ఓ పనైపోతుంది.

0

0


4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సభకు నమస్కారం !



సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణమ్.

చక్కగా మాట్లాడ గలగడమే వ్యక్తికి అలంకారం. ఆకట్టుకునేలా ప్రసంగించ గల వారికి ఎప్పుడూ సంఘంలో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. సభలలో అయితే, వక్తలలో గొప్పగా ఉపన్యసించ గలడని పేరు పొందిన వక్తల ప్రసంగాలను కార్యక్రమం చివరిలో ఉండేటట్టుగా నిర్వాహకులు జాగ్రత్త పడుతూ ఉంటారు. దానికి కారణం సభకు వచ్చిన జనాలను వెళ్ళి పోకుండా కట్టడి చేయడానికే అనే విషయం సర్వ విదితమే.

సభలలో తరుచుగా మాట్లాడాల్సి వచ్చే వక్తలకు ఎదురయ్యే ప్రధాన సమస్య , ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించడం అనేది. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియ జేస్తూ, ప్రేక్షక మహాశయులకు అభివాదాలు చేస్తూ ప్రారంభించాలనుకున్న వారి ఉపన్యాసం, వేదిక ఒక్కో సారి పెద్దలతో క్రిక్కిరిసి పోయి ఉండే పక్షంలో ఈ ప్రారంభ వాక్యాలు ఎంతకీ తెమలవు. దాదాపు వందన సమర్పణలా ఉంటాయి వారి ఉపన్యాస ప్రారంభ వాక్యాలు.

ఏవో తంటాలు పడి మొదలెట్టాక, ఇక ఆగే పని లేదు. వినేవారి సహనాన్ని పరీక్షకు పెట్టడమే

మైకాసురులని వీరిలో కొందరు అప్పటికే పేరు పడిపోయి ఉంటారు. సహనం చచ్చిన నిర్వాహకులు వారి వాక్ప్రవాహానికి అడ్డ కట్ట వేయడానికి నానా హావభావ ప్రదర్శనలూ చేస్తూ ఉంటారు.

ఎట్టకేలకు, చివరిగా ఓ రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను అని భరోసా యిచ్చిన సదరు వక్త కచ్చితంగా ఆ పీకుడు మరో అరగంట దాకా కొనసాగించాడన్నమాటే.

ఇక, సభా కార్యకమాలలో చివరి వక్తగా ఉపన్యసించ వలసిన వక్త బాధ మరో రకంగా ఉంటుంది. అప్పటికే అతను చెప్ప దలచిన నాలుగు ముక్కలూ అంతకు ముందు మాట్లాడిన వక్తలలో ఎవరో ఒకరు చెప్పీసి ఉంటారు. ఇహ అతనికి కొత్తగా ఏమీ చెప్పడానికి మిగలక పోవడంతో ఉపన్యసించడానికి నానా తంటాలూ పడతాడు. విలువ చచ్చిన ఆ మాటలకు విసిగి పోయిన ప్రేక్షకులు ఒక్కోసారి ఉదాత్తంగానూ, ఒక్కోసారి భీకరంగానూ తమ అసమ్మతిని ప్రదర్శిస్తూ ఉంటారు.
బెదిరి పోయిన సదరు వక్త అర్ధాంతరంగా ఉపన్యాసం ముగించీసి, ఓ రైలు తప్పి పోయిన వాడి నవ్వు ముఖాన పులుముకుని, తిరిగి తన సీటులో కూలబడి, కర్చీఫుతో ముఖం రుద్దుకునే కార్యక్రమాన్ని మొదలెడతాడు.

ఉపన్యాసకులలో గండరగండలు కొందరుంటారు. వారికి వేదికతో పని లేదు. ప్రేక్షకులతో నిమిత్తంత లేదు. కార్యక్రమ అజెండాతో పని లేదు. సభా కార్య క్రమం దేనికి సంబంధించినదో వారికి తెలియ నక్కర లేదు. వస్తారు. అనర్గళంగా ఉపన్యాసంతో చితక్కొట్టేస్తారు. జరూరు పని ఉంది. మీరంతా మన్నించాలి అంటూ వారి అనుమతితో నిమిత్తం లేకుండా అక్కడ నుండి వెళ్ళి పోతారు. ఈ జబర్దస్తీ వక్తలు దేని గురించయినా మాట్లాడ గలరు. సాహిత్య సభలో కూరగాయల గురించీ, కార్మిక సభలో కథా సాహిత్యం గురించీ .....

ఇక, సభలలో దండల ప్రహసనం గురించి చెప్పు కోవాలంటే చాలా ఉంది. ఒక్కో తూరి కొన్ని సభలలో అప్పటి కప్పుడు దండలు వేసి సత్కరించాల్సిన వ్యక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోతూ ఉండడంతో నిర్వాహకులు చేసేదేమీ లేక నిర్మొహమాటంగా ముందు సత్కరించిన సన్మానితుని కాస్త ప్రక్కకి లాగి, ఒక్క ముక్క క్షమాపణలతో దౌర్జన్యంగా వారి మెడలోని దండలను, వారి చేతికిచ్చిన బొకేలను, కొండొకచో వారికి కప్పిన దుశ్శాలువాను కూడా ఒలుచుకు పోతారు. ఇంద్రడుకి తన సహజ కవచ కుండలాలు ఇచ్చిన దాన వీర శూర కర్ణుని భంగిమలో ఓ చిరు నవ్వు బలవంతాన విసిరి లోలోపల కుమిలి పోతూ ఆ దౌర్జన్య కాండకు తలొగ్గడం తప్పితే సదరు వక్త చేసేదేమీ ఉండదు.

సభల గురించి మాట్లాడు కునేటప్పుడు కురు సభలో శ్రీకృష్ణ రాయబారం గురించి తలచు కోకుండా ఉండలేం. ఒక నిండు సభలో అంత అర్ధవంతంగా ఉపన్యసించిన మహా వక్త ప్రపంచ చరిత్ర లోనే మరొకడు లేడు.

మన వివేకానందుడినీ,

వాళ్ళ చర్చల్ నీ ఓ సారి మనసారా తలుచుకుని కాసంత ముందుకు జరుగుదాం.

కల్పిత పాత్రే అయినా, మన జంఘాల శాస్త్రిని మరచి పోవద్దు సమా !

ఇంకా ఎందరో మహానుభావులు. వారందరకీ వందనాలు చెబుతూ నా ఎరికలో జరిగి సభావశేషాలు, సభా విశేషాలు ఒకటి రెండు మీ ముందుంచుతాను:


విశాఖ పట్నంలో శ్రీ,శ్రీ షష్టి పూర్తి సభలో కవి ఆరుద్ర అలిగేరు. వివరాల జోలికి నేనిప్పుడు పోదలచు కోలేదు. ఆ రోజు సాయంత్రం పెద్ద బహిరంగ సభ జరిగింది. తాపీ ధర్మారావు సభాధ్యక్షులు.
అలిగిన ఆరుద్ర గారూ, వారి శ్రీమతి రామ లక్ష్మి గారూ ముందు వరసలో కూర్చున్నారు. సభలో ఉపన్యసించేందుకు ఆరుద్ర సుముఖంగా లేరు.


తాపీ ధర్మారావుగారు, ఇహ ఊరుకో లేక, పెద్దాయన కనుక, పెద్దరికం వహించి ఆరుద్ర గారిని ఉపన్యసించడానికి వేదిక మీదకి ఆహ్వానించేరు. ఆరుద్ర కదల లేదు.

తాపీ వారు వదిలి పెట్ట లేదు. ‘‘ ఇప్పుడు సభను ఉద్దేశించి ఆరుద్ర గారు నాలుగు మాటలు మాట్లాడుతారు.’’ అని ఏకపక్షంగా ప్రకటించారు. దాంతో ఆరుద్రకి ఎక్కడో కాలింది. మౌనంగా వేదిక ఎక్కి,

‘‘ సభకు నమస్కారం ! ఇక సెలవు !’’

అని, నాలుగంటే నాలుగే ముక్కలు పలికి వేదిక దిగి పోయేడు. ఆరుద్ర చతురతకి సభ నివ్వెర పోయింది.

ఆ తర్వాత మెత్తబడిన ఆరుద్ర ఆనాటి సభలో అపూర్వమైన ప్రసంగం అనర్గళంగా చేసేడనుకోండి ...

నేను విన్న మరో సభా ముచ్చట:

ఓ పెద్ద సభలో దేశం పట్టనంత ఒక మహాకవికి సన్మాన కార్యక్రమం జరిపించేరు. ఎందు చేతనో కానీ దుశ్శాలువా విషయంలో కొంత ఉదాసీనత కనబరచి, చవక రకం శాలువా కవిగారికి కప్పేరు. అంతే, కవిగారికి ఒళ్ళు మండి పోయింది. ఆ అసంతృప్తిని అణుచుకుంటూ ఇలా అన్నారుట: ‘‘ ఈ కార్యక్రమ నిర్వాహకులు నాకు కప్పిన శాలువా మాకు చాలా ఉపయోగ పడుతుందని విన్నవిస్తున్నాను. చాలో రోజులుగా ఒడియాలు పెట్టేందుకు సరైన గుడ్డ లేదంటూ ఇటీవల మా ఆవిడ ఒకటే సణుగుతోంది. ఆలోటు దీనితో తీరిపోతుంది.’’

కవిగారి వ్యంగ్యంతో కంగు తిని, నిర్వాహకులు అప్పటికప్పుడు ఖరీదయిన మరో శాలువా తెప్పించి వారికి కప్పి, బ్రతుకు జీవుడా ! అని ఊపిరి పీల్చుకున్నారుట.

ఒక సారి ఓ పెద్ద సభలో ప్రముఖ నటులు శ్రీ గుమ్మడి వేంకటేశ్వర రావు గారు ఉపన్యసించడానికి లేచారు. సభ నానా గోలగా ఉంది. ఎంతకీ సద్దు మణగ లేదు. గుమ్మడి గారు చాలా సేపు నిరీక్షించేరు. కార్యక్రమ నిర్వాహకులు కంగారు పడి పోతున్నారు. వాలెంటీర్స్ ఎక్కడో తిరుగుతూ పట్టించు కోవడం లేదు. ప్రేక్షకుల మధ్యకి పరుగులు తీసి వారిని సద్దుమణిగేలా చేదామని ఒకరిద్దరు వేదిక మీదనుండి లంఘించ బోయారు. గుమ్మడి గారు వాళ్ళని కంటి చూపుతో నివారించి, కంచు కంఠంతో హాలు దద్దరిల్లిపోయే లాగున ‘‘ హలో, వాలంటీర్స్ ! ముందు మీరంతా నిశ్శబ్దంగా ఉండాలి ’’ అని అరిచేరు.

మొత్తం సభలోని వారంతా ఒక్క సారి ఉలిక్కి పడి, అందులో చమత్కారం అర్థం చేసుకుని చాలా సేపు పగలబడి నవ్వేరు. తర్వాత గుమ్మడి గారు అద్భుతమైన ప్రసంగం చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్ద వతావరణంలో చేసారు.

సభా కార్యక్రమాలలో వక్తల తొట్రుపాటుల వల్లనయితే నేమి, తెలియమి వల్ల నయితే నేమి జరిగే సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి కూడా. బరువైన పదాన్ని వాడాలనే దుగ్ధతో సన్మానితునికి శ్రద్ధాంజలి ఘటించే వారూ, సంతాప సభలో ప్రసంగించే అదృష్టం దక్కినందుకు తనకా రోజు అమితానందంగా ఉందంటూ వాక్రుచ్చే వారూ కూడా కనిపిస్తూ ఉంటారు.

నొక్కి వక్కాణించడాలూ, బల్ల గుద్ది చెప్పడాలూ సభలలో సర్వసాధారణం.


కవితా పఠనం జరిగే సాహితీ సభలలో అయితే ఒక్కో సారి పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి.

ఏ కవీ తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూస్తూ ఉంటాడే కాని. తన ముందు వాడి కవిత్వం శ్రద్ధగా విన్న దాఖలాలు ఎక్కడో కానీ కనిపించవ్.


సభలలో వక్తల హావ భావ చేష్టల వల్ల కూడా ఒక్కో సారి నవ్వులు పూస్తూ ఉంటాయి.

వక్తలలో కొందరకి కొన్ని పదాలు అలవాటుగా పదే పదే దొర్లిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం, అవి వారి ఊత పదాలు మరి.

ఒక సారి ఒక ప్రాచ్య కళాశాలలో వార్షికోత్సవ సభ జరుగుతోంది. సభాధ్యక్షత వహించిన వారు పెద్ద పోలీసు ఆఫీసరు. ఆమెకు తెలుగు అంతగా రాదు. కళాశాల ప్రిన్సిపాల్ గారు మహా పండితులు. వారికి మాట మాటకీ ‘‘ దీని పేరేమిటీ ...‘‘ అనే ఊత పదం వాడడం అలవాటు. అలవాటు ప్రకారం, ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మాటి మాటికీ దీని పేరేమిటీ ... అనడం మొదలు పెట్టారు. అలా అన్న ప్రతి సారీ ఆయన చూపుడు వేలు అనుకో కుండా ఆవిడ గారి వేపే చూపెడుతూ ఉండడంతో సభలో అంతా క్షణానికో సారి పెద్ద పెట్టున నవ్వుతూ గోల చేసారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో కళాశాల అధ్యక్షుల వారికీ తెలియ లేదు .సభాధ్యక్షురాలికీ అవగతం కాలేదు !

వక్తలకు ఇలా ఊత పదాలు లేనిదే మాట్లాడ లేని బలహీనత ఉంటే మాత్రం సభల్లో హాస్యరసం చిప్పిల్లక తప్పదు.

సరే, కథా మంజరి అలవాటు ప్రకారం సభ గురించిన ప్రస్తావన ఉన్న ఒకటి రెండు శ్లోకాలను ప్రస్తావించాలి కదా ?

చూడండి:

న సా సభా యత్ర న సంతి వృద్ధా:, న తే వృద్ధా యే న వదంతి ధర్మం
నా సౌ ధర్మో యత్ర న సత్యమస్తి, న తత్సత్యం యచ్చతే నాభ్యుపేతమ్

ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు. ఎవరు ధర్మాన్ని చెప్పరో, వారు వృద్ధులు కారు. దేని యందు సత్యం లేదో, అది ధర్మం కాదు. దేని వలన లోక కల్యాణం జరుగదో అది సత్యం కాజాలదు. అని మహా భారతం చెబుతోంది. అంటే, లోక కల్యాణం చేసే సత్య ధర్మ ప్రవచనం చేసే పండితులు ఎక్కడ ఉంటారో, అదే మంచి సభ అని భావం.

మరో శ్లోకం చూడండి:

యత్ర ధర్మో హ్యధర్మేణ, సత్యం యత్రానృతేన చ,
హన్యతే ప్రేక్షమాణానాం, హతా స్తత్ర సభాసద:

ఏ న్యాయ సభలో ధర్మం అధర్మం చేతను, సత్యం అబద్ధం చేతను బాధింపబడుతోందో ఆ సభలోని సభాసదులు జీవచ్ఛవాల వంటి వారే అవుతున్నారని దీని భావం.

ఇక్కడ మరో చిన్న అంశం - సభలోని వారిని సభాసదులు అని వాడడం జరిగింది. సాధారణంగా సభలోని వారిని సభికులు అనడం కద్దు. కానీ, సభికులు అంటే సభలో ధర్మం తెలిసిన వారే అనే కాక, జూదరులు అనే మరో అర్ధం కూడా ఉండడంతో ఆ పదం వాడడం అంత సబవుగా తోచదు.

మరొకటి చూడండి:

విపది ధైర్య మధాభ్యదయే క్షమా, సదసి వాక్పటుతా యుధి విక్రమ:
యశసి చాభిరతి ర్వ్యసనం శ్రుతౌ, ప్రకృతి సిద్ధ మిదం హి మహాత్మనామ్


ఈ శ్లోకంలో కవి కష్టంలో ధైర్యాన్ని, ఐశ్వర్యం కలిగి నప్పుడు ఓర్పు, యుద్ధంలో భుజబలం, కీర్తియందు ఆసక్తి విద్యయందు కోరిక సజ్జనుల సహజ గుణాలుగా చెబుతూ సభలలో సంపూర్ణమైన వాక్ నైపుణ్యం కలిగి ఉండడం కూడా సజ్జనుల సహజ గుణ మని చెబుతున్నాడు.

న సా సభా యత్ర న భాతి కశ్చిత్, న సా సభా యత్ర విభాతి చైక:
సభా తు సైవా2స్తి యథార్హరూపా, పరస్పరం యత్ర విభాంతి సర్వే.

ఒక్కడూ ప్రకాశించనిది, అది సభ అనిపించు కోదు. అంటే ప్రసంగించిన వక్తలందరూ చెత్తగా మాట్లాడితే అది మంచి సభ అనిపించు కోదుట. పోనీ, ఏ ఒక్కరో ప్రకాశించినా అదీ మంచి సభ అనిపించు కోదుట. అంటే, సభలో వక్తలంతా చెత్తగా ప్రసంగించి , ఏ ఒక్క వక్తో గొప్పగా మాట్లాడినంత మాత్రం చేత ఆ సభ మెచ్చుకో తగినది కాదని భావం. ఎక్కడయితే, ఉన్న వారందరూ ఒకరి వల్ల ఒకరు అధిక తరంగా ప్రకాశిస్తారో, అదే సభ అనే పేరుకి తగినది అని కవి భావం.


సభ గురించిన మరో మంచి శ్లోకం చూడండి:


సభా కల్పతరుం వందే, వేదశాఖోపజీవితం
శాస్త్రపుష్ప సమాయుక్తం, విద్వద్భ్రమర శోభితమ్.

వేదాలు అనే శాఖలతో, శాస్త్రాలు అనే పువ్వులతో, విద్వాంసులు అనే తుమ్మెదలతో ప్రకాశించే సభ అనే కల్ప వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని దీని భావం.

చివరిగా గుర్తొచ్చిన ఓ జోక్ తో ముగిస్తాను ...


‘‘ నిన్న టౌన్ హాలులో మావారికి సన్మాన సభ జరిగింది. ఎంత ఘనంగానో జరిగిందిట ! టౌను హాలు సగం జనంతో నిండి పోయిందిట. తెలుసా !?’’ అంది మీనాక్షి దర్పంగా స్నేహితురాలు కామాక్షితో.

దానికి కామాక్షి మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ’’ పోదూ, మరీ బడాయి కాక పోతే ... ఆ సభకు మా వారూ వచ్చేరు. సగం హాలంతా ఖాళీయేనట కదా ? ’’ అంది.

స్వస్తి.










3, ఫిబ్రవరి 2011, గురువారం

మాయ మైపోయానోచ్ !


ఎవరయినా సంపదలనిచ్చే లక్ష్మీ దేవిని నుతిస్తారే తప్ప, దరిద్ర దేవతను పొగడరు కదా ?

కాని, ఈ శ్లోకంలో కవి దరిద్ర దేవతను ఎలా నుతిస్తున్నాడో చూడండి:

దరిద్రాయ నమస్తుభ్యం, సిద్ధో2హం త్వత్ప్రసాదత:
సర్వం పశ్యామి దేవేశ, న మాం పశ్యతి కశ్చన.

దీని అర్ధం ఏమిటంటే,

ఓ దరిద్ర దేవతా ! నీకు వందనాలు. ఎందువల్లనంటే, నీ అనుగ్రహం వల్లనే కదా, నేను సిద్ధుడనైనాను. నాకు మహిమాన్వితమైన గొప్ప సిద్ధులు చేకూరాయి.

ఎలా అంటావా?

నేను అన్నింటినీ చూడ గలుగు తున్నాను. కాని ఒక్కరు కూడా నన్ను చూడ లేక పోతున్నారు.

ఈ కామరూప విద్య నాకు ప్రసాదించింది నువ్వే కదా, తల్లీ !

ఇదీ కవిగారు దరిద్ర దేవతను నుతించిన వైనం.

ఇందులో చమత్కారం సులభ గ్రాహ్యమే. అష్ట దరిద్రుడైన వాడికి అందరూ కనిపిస్తారు. కానీ వాడి మీద ఒక్కరి చూపు కూడా పడదు. దరిద్రుడిని ఎవరు మాత్రం చూస్తారు చెప్పండి? వాడి ఉనికిని ఎవరు మాత్రం గుర్తిస్తారు చెప్పండి?

‘దరిద్రుడనయినందు వలన నన్ను ఎవరూ పట్టించు కోవడం లేదు’ అని వాపోతున్నాడన్నమాట.

29, జనవరి 2011, శనివారం

కష్ట చతుష్టయమ్


ఎంతటి ధీరుడైనా నాలుగు రకాలయిన కష్టాలను మాత్రం ఓర్చుకో జాలడని పెద్దలు చెబుతున్నారు.

అవేమిటో చూద్దాం ...

సహస్ర దు:ఖాని సహంతి ధీరా : చత్వారి దు:ఖా న్యతి దుస్సహాని
కృషీ చ నష్టా గృహిణీ చ దుష్టా, పుత్రో2స్యవిద్వాన్ , ఉదరే వ్యథా చ.

ధీరులు వేయి దు:ఖాలనయినా ఓర్చుకో గలరు. అంటే, ఎన్ని కష్టాల నయినా సహించ గలరు. కానీ, నాలుగు రకాలయిన కష్టాలు మాత్రం వారికి అత్యంత దుస్సహమైనవి.

అవి యేమంటే ...

కృషి వినష్టమైతే ఆ కష్టాన్ని ఎంతటి ధీరుడూ ఓర్చుకో లేడు. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం చెడిపోతే అ దు:ఖం ఎంతటి ధీరుడినీ భీరువుగా చేస్తుంది.

ఇక రెండవది - భార్య దుష్టు రాలైతే ధీరుడు ఓర్చుకో లేడు.

పుత్రుడు విద్యా గంధ శూన్యుడయితే ఎంతటి ధీరుడూ సహించ లేడు.

ఇక, నాలుగవది - ఉదర బాధ. కడుపు నొప్పికి ఎంతటి ధైర్యవంతుడయినా తాళ లేడు.

ఈ రకంగా ఈ శ్లోకంలో ధీరుడు వేయి కష్టాలను సహించ గలడు కానీ, వ్యవసాయం నష్టమైనా, భార్య గయ్యాళిదైనా, కుమారుడు చదువు రాని దద్దమ్మ అయినా, కడుపులో నెప్పి కలిగినా ఓర్చుకో జాలడని కవి చెబుతున్నాడు.