తమాషా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తమాషా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2015, శుక్రవారం

ఛూ ! మంత్ర కాళీ !



పేక ముక్కలతో రకరకాల గమ్మత్తులు చేయడం మనలో కొందరకి కొట్టిన పిండి.
మా చిన్నప్పుడు మా సింహం బాబాయి పేక ముక్కలతో ఒక మేజిక్కు తరుచుగా మా దగ్గర చేసి చూపెడుతూ ఉండే వాడు. నాకు సరిగా గుర్తు లేదు కానీ, పేక ముక్కలను మూడో, నాలుగో వరసలుగా పేర్చే వాడు. ఏదో ఒక ముక్కను మనసులో తలుచుకో మనే వాడు. తర్వాత, నువ్వు తలుచుకున్న ముక్క ఈ వరసలో ఉందా? అంటూ వరసల వారీగా అడిగే వాడు. మేం ఉందనో, లేదనో చెప్పాక, ఛూమ్ మంత్రకాళీ అంటూ ఒక వికటాట్టహాసం చేసి, మేం తలుచుకున్న ముక్క ఏదో కరెక్టుగా చెప్పీసే వాడు. మేం నిబిడాశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టీసే వాళ్ళం. తనకిలాంటి మంత్రాలూ, తంత్రాలూ చాలా చేతనవుననీ, సరిగా చదవక పోతే మమ్మల్ని పాషాణాలుగా ( అంటే, బండ రాళ్ళుగా నన్న మాట.ఆ అర్ధం కూడా మా సింహం బాబాయే చెప్పాడు) మార్చేస్తాననీ బెదిరించే వాడు.నిజమే కాబోలుననుకుని, మేం బెదరి పోయి బుద్ధిగా పుస్తకాలు తీసే వాళ్ళం. ఆ ట్రిక్కు కాస్త పెద్దయాక మాకూ తెలిసి పోయిందనుకోండి !

అలాంటి ట్రిక్కునే ఉపయోగిస్తూ అక్షర ప్రశ్న పేరిట మన వాళ్ళు ఒక పద్యం చెప్పారు.ఆ సీస పద్యంలో ఏ అక్షరాన్ని తలుచుకున్నా మనం కనిపెట్టెయ్య వచ్చును. ఈ అక్షర ప్రశ్న ట్రిక్కు కోసం ఆ కవిగారు మన కోసం ఒక సీస పద్యాన్నీ, ఒక కీ బోర్డునీ (అదీ పద్య రూపం లోనే) తయారు చేసి సిద్ధంగా ఉంచేరండోయ్ ! ఆ వైనాన్ని చూడండి మరి:

(1)
అరి భయంకర చక్ర కరి రక్ష సాగర
శాయి శ్రీ కర్పుర సాటి యుగళ
(2)
నాళీక సన్నిభ నయన యండజవాహ
వాణీశ జనక వైభవబిడౌజ
(4)
రాజీవమందిరా రమణ బుధా భీష్ట
వరజటిస్తుత శైరి వాసు దేవ
(8)
భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమగరుడ
(16)
దోష శైలేశ శచి దక్ష ద్రుహిణ హేళి.

ఈ పద్యంలో మీరు ఏదో ఒక అక్షరాన్ని కోరుకోవచ్చును.
అయితే, ఆ కోరు కోవడంలో మాత్రం కొన్ని నిబంధనలు పాటించి తీరాలి.
అవేమిటంటే,
1.అచ్చులలో అకారం మాత్రమే తలుచు కోవాలి.
2.హల్లులలో అనునాసికాక్షరాలయిన క వర్గ, చవర్గ పంచమాక్షరాలు తలుచుకో కూడదు.
తలుచుకోకూడదు.
3. గుణింతంతో పని లేదు.
4.న,ణ లకూ ర,ఱ లకూ అభేదం పాటించాలి.

ఈ నిబంధనలకు లోబడి మీరు మీది పద్య పాదాలలో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకో వచ్చును.

ఉదాహరణకి మీరు ళ అనే అక్షరం తలుచుకున్నారనుకోండి( కాసేపు మీరు తలచుకున్న అక్షరం ళ అని నాకు చెప్పలేదు అని కూడా అనుకోండి. అబ్బ ! కాసేపు అనుకుందురూ !) ఇప్పుడు నేనడిగే ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పాలి. నా ప్రశ్పలూ, మీ జవాబులూ ఇలా ఉంటాయి:
నేను: మీరు తలుచుకున్న అక్షరం (1) వ నంబరు వేసి ఉన్న పాదంలో ఉందా?
మీరు: ఉంది.
నేను: రెండవ పాదంలో ఉందా?
మీరు: ఉంది.
నేను: మరి, మూడవ పాదంలో ఉందా?
మీరు: లేదండీ బాబూ !
నేను: నాలుగవ పాదం లోనో?
మీరు: అబ్బ ! గొప్ప నసగాడిలా ఉన్నావే? నేను తలుచుకున్న అక్షరం అందులో కూడా లేదయ్యా, మగడా అంటే వినవేం!
నేను: కోప్పడకు. శపించీ గల్ను. పోనీ, చివరి ప్రశ్న. అయిదో పాదంలో ఉందా? కాస్త చెబుదూ !
మీరు: ఆ! ఉంది. ఉంది ...

మన అడగడాలూ, చెప్పడాలూ పూర్తయాయి. నేను ఆ అక్షరం ఏదో చెప్పడమే మిగిలి ఉంది.

దానికి నేను అవలంబించే పద్ధతి చూడండి:

మీరు తలచిన అక్షరం తొలి రెండు పాదాలలోనూ, ఐదవ పాదంలోనూ ఉందని అన్నారు. కదూ?
ఆ పాదాల ముందు వేసి ఉన్న అంకెలు చూడండి. 1 , 2, 16 ఈ మూడు అంకెలనీ కలపండి.
19 వచ్చింది. కదా ! ఈ మొత్తం 19 రాగానే ఈ క్రింది కీ సాయంతో మీరు తలుచుకున్న అక్షరం ళ అని నాకు సులభంగా తెలిసి పోతుంది.

కీ చూడండి:

అన్నయ్యతోటి విస్సాప్రగడ కామ
రాజు భాషించు హేళి దాక్షిణ్య శాలి.

ఇదీ కీ పద్యచరణాలు. మొదటి చరణంలో 12 అక్షరాలు, రెండవ చరణంలో 12 అక్షరాలు ఉండడం గమనించండి.

ఒక్కో అక్షరానికీ ఒక్కో విలువ ఉందని గుర్తుంచు కోండి. తొలి చరణంలోని 12 అక్షరాలకీ వరుసగా 1,2,3,4,5,6,7,8,9,10,11,12

అలాగే రెండవ చరణంలోని అక్షరాలకి వరుసగా 13,14,15,16,17,18,19,20,21,22,23,24 విలువలు అని గుర్తుంచుకోండి.

(ఉదాహరణకి: బ అనే అక్షరానికి విలువ 15, అలాగే ద అనే అక్షరానికి విలువ 20)

సరే, ఇందాక మీరు ళ అనే అక్షరాన్ని తలుచుకున్నారు. నాకు మీరు తలుచుకున్న అక్షరం ఏదో చెప్ప లేదు కదా?. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నల ప్రకారం మీరు తలుచుకున్న అక్షరం తొలి రెండు పాదాలలోనూ, చివరి అయిదో పాదం లోనూ మాత్రమే ఉంది అని మీరు కించిదసహనంగా చెప్పగా, నేను గ్రహించాను కదా? ఆ రెండు పాదాల ముందూ నేను వేసుకున్న అంకెలను కూడితే 19 వచ్చింది కదూ?

ఇప్పుడు ఈ పంతొమ్మిది (19) విలువ కలిగిన అక్షరం ఏదో కీ వాక్యంలో చూడండి.

కీ వాక్యంలో 19 వ అక్షరం ళ. కనుక మీరు తలచిన అక్షరం ళ అండోచ్ !


అదీ తమాషా ! ఈ గణితం పద్య రూపంలో ఉండడమే దీని ప్రత్యేకత! ఈ తమాషా పద్యం చెప్పిన కవి విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామ వాస్తవ్యుడని పద్యంలో ఉండే ఆకరం బట్టే తెలుస్తోంది.