రూపాయి .. ... పాయె !
ఏమయి పోయింది చెప్మా ?!
మా చిన్న తనంలో మా నరసింహం
బాబాయి ( ఈ సింహం
బాబాయికి ఆ మధ్య ఘనంగా సహస్ర చంద్ర దర్శన
కార్యక్రమం జరిగింది కూడానూ ) ఈ తప్పి
పోయిన రూపాయి లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని
అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.
మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:
ఇదిగో ఆ లెక్క:
రాముడు, భీముడు ఇద్దరూ మంచి
స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి
కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.
షాపులో ఒక మంచి బొమ్మని
చూసి అదెంత అని, అడిగారు.
అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.
సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ
ఇచ్చి, బొమ్మను
కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి
ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘
ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు
ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి
ఎక్కడో పారేసానని, అందు
వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే
వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.
రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ
మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు
రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.
ఇదీ కథ. ఇప్పుడు అసలు
ప్రశ్న ఏమిటంటే,
రాముడు భీముడు కలిసి షాపు
పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.
బొమ్మ అసలు ఖరీదు నలభై
అయిదు.
పని వాడు తెచ్చినది ఐదు
రూపాయలు.
వాడు పారేసానని చెప్పినది
రెండు రూపాయలు.
రాముడు , భీముడు పంచు కున్నది -
చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.
ఇప్పుడు చెప్పండి:
బొమ్మ అసలు ధర నలభై అయిదు .
పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.
లెక్క సరి పోయిందే !
ఇప్పుడు ఇదే లెక్కని ఇలా
చూడండి:
బొమ్మ కోసం మొదట రాముడు తన
వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది:
25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి
తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.
పని వాడు తెచ్చి ఇచ్చిన
దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం
ఎంతన్నమాట ? ఇరవై
మూడు న్నర రూపాయలు. అంతే కదా !
అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన
రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?
ఇరవై మూడున్నర రూపాయలు.
అంతే కదా ?
ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి
ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?
ఇరవై మూడున్నర + ఇరవై
మూడున్నర = 47 రూపాయలు.
కదా !
పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?
ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన
2 రూపాయలు
= 49 రూపాయలు.
అరే ! ఒక రూపాయి తక్కుఃవ
వస్తోందే ? ఏమయి
పోయింది చెప్మా ?!
టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు
పారేసినది 2 మరి వాడు
ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు
మొత్తం 52 అయి
పోవడం లేదూ ? అదనంగా ఈ
రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి
చెప్మా ?