స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్వగతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మార్చి 2014, గురువారం

పార్వతీ పురంలో మా ఇంటి వీధరుగు ...


పల్లె తల్లి లాంటిది. పట్నం ప్రియురాలి లాంటిది ... అంటూ మొదలు పెట్టి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు వీధి అరుగు అనే గొప్ప వ్యాసం వీధరుగు గురించి రాసేరు.

 వీధి అరుగు ఆహ్వానం లాంటిది. నవ్వుతూ రమ్మని పిలుస్తుంది. వచ్చి కాస్సేపు కూర్చుని సేద దీర మంటుంది. కబుర్లు చెబుతుంది. కలత తీరుస్తుంది.కుశలాలు అడుగుతుంది. మంచి నేస్తంలా కలగలిసి పోతుంది.ఇప్పుడు వీధులే తప్ప వీధరుగులు లేవు.

వీధరుగులు లేని కొంపలు ముటముటలాడిస్తూ ఉండే ముఖాలతో ఉంటాయి.చిర్రు బుర్రులాడే కోపిష్ఠి మనిషిలా ఉంటాయి.స్వార్థపు గూళ్ళలా ఉంటాయి. 

అరుగు లన్నిటి లోన
ఏ అరుగు మేలు ?
పండితులు కూర్చుండు
మా అరుగు మేలు !

ఈ బాల ల గేయం  విన్నారు కదూ ?

పార్వతీపురంలో మా ఇంటి వీధరుగు మీద మహా పండితులు కూర్చునే వారని డప్పాలు కొట్టను కానీ, రాబోయే రోజుల్లో కాబోయే  ( తెలుగు ) పండితుడొకడు  నిక్కరూ , చొక్కా వేసుకుని  కూర్చునే వాడని మాత్రం ఘంటాపథంగా చెప్ప గలను.

పార్వతీ పురంలో మా యింటి ముందుండే ఈ వీధి అరుగును చూడండి

 దీని మీదే కదా, మా బాల్యం గడిచింది.

 దీని మీదనే కదా ఎన్టీవోడి గురించీ ఏఎన్నార్ గురించీ తగువులాడు కున్నది ?

 ఈ అరుగు మీదనే కదా ఎక్కాలు చదువు కున్నది ? 

ఈ అరుగు మీదనే కదా హోం వర్కులతో కుస్తీలు పట్టినది ?

 ఈ అరుగు మీదనే కదా, మనిషి చంద్రుడి మీద కాలు పెట్టాడన్న వార్తను విని విస్తు పోయినది ?

 ఈ అరుగు మీదనే కదా సినిమా కబుర్లూ, గణపతి మేష్టారు పెట్టిన తొడపాయసాల గురించీ ఒకరికొకరం చెప్పు కున్నది ?

 ఈ అరుగు మీర కూర్చునే కదా ఇంటికి వచ్చే అతిథుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినది ?

 ఈ అరుగు మీద నిలబడే కదా అమ్మ వారి జాతరలో సిరిమాను సంబరాన్ని చూసి పులకించి పోయినది ?

 ఈ అరుగు మీదనే కదా అమ్మ చేసి ఇచ్చిన జంతికలు గుప్పెటలో ఉంచుకుని కొసరి కొసరి తిన్నది ?

 అయ్యో, ఇప్పుడెలా ఉందో చూసేరా .? చిన్నప్పటి ఆటబొమ్మ చివికి పోయి దొరికినట్టు ...

 మాసి పోయిన సామ్రాజ్యాలకు చిరిగి పోయిన జెండా చిహ్నం ...

\
 ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు ?



మా వీధి ..

24, మార్చి 2013, ఆదివారం

ఈ ఇష్గాలంటే నా కెంతో ఇష్టం !!





నాకు మా విజయ నగరం అంటే చాలా ఇష్టం.తెలుగు కథకు పురిటి గడ్డ కనుకయిష్టం. గురజాడ తిరిగిన తావు కనుక ఇష్టం. కన్యా శుల్కం లాంటి గొప్ప నాటకం వెలిసిన ఊరు కనుక యిష్టం. ఆ నాటకం తొలి ప్రదర్శన జరిగిన ఊరు కనుక ఇష్టం. తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో నేల కనుక యిష్టం.
   నాకింకా చాలా ఇష్టాలు ఉన్నాయి. తడియారని అచ్చు వేసిన కొత్త పుస్తక మయితే ఇష్టం. అది కథల పుస్తక మయితే మరీ మరీ  ఇష్టం.  
మా ఊరి  కోట,  పెద్ద చెరువు, గంట స్తంభంమూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు,అయ్య కోనేరు, బొంకుల దిబ్బ, మహా రాజావారి కళాశాల, మా చదువుల తల్లి
 మా సంప్కృత కళాశాల,  అమ్మ లాగ అన్నం పెట్టి ఆదరించిన సింహాచల దేవస్థానం వారి అన్నదానసత్రవూ, సంగీత కళాశాల,అమ్మ వారి  కోవిల, గుమ్చీ,  రాజారావు మేడ, డంకే షావలీ మసీదు, వ్యాస నారాయణ మెట్ట,. ఇంకా దోమల మందిరం .... నిజమే  మా విజీనారం దోమలంటే కూడా నాకు చాలా ఇష్టం. మా పతంజలి చెప్పినట్టు, అవి రాత్రి వేళ కుడుతూ, కథలూ కాకరకాయలూ రాసుకోమనీ, చదువుకోమనీ సదా హెచ్చరిస్తూ ఏండేవి కదా.
నిజమే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. మా దాట్ల నారాయణ మూర్తి రాజు, పతంజలి, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, గార్లతో ఎంతో ఇష్టంగా రాత్రీ పగలూ తిరిగిన ఊరు కనుక చాలా ఇష్టం. మరింకా మా గురు దేవులు మానా ప్రగ్గడ శేషసాయి గారు మా భాగ్యవశాన  మమ్ములను సదా ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు కనుక ఇష్టం...... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇష్టాలకు అంతూ పొంతూ ఉండదు.  అలా చెప్పడం కూడా నాకు చాలా యిష్టం.

ఈ ఇష్టాల పుస్తకంలో కొన్ని పుటలు వెనక్కి తిప్పితే, మా రసాలూరు సాలూరు వస్తుంది. ఆ ఊరంటే, అక్కడి సందు గొందులతో, మురికి వాసనaతో, పేదరికపు బీద జీవిత ముఖ పత్రాలతో నాకు చాలా ఇష్టం.
అక్కడి వేగావతి నది, పంచముఖేశ్వర స్వామి వారి ఆలయం, నేను దాదాపు పాతికేళ్ళు పని చేసిన మా కాలేజీ, ...ముత్యాలమ్మ కోవిల, పారమ్మ కొండ,దూరంగా కనిపించే   కొండలూ,  అక్కడి మల్లె తోటలు, తియ్యని పాటల బాదుషా కబీర్ షా  గారు పాడిన మా కళా వేదికా,  ఇంకా, వేగావతి బ్రిడ్జి మీద సాయంత్రాలు కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుపన్న మా మిత్ర బృందమూ,.. ఒకటేమిటి ... అన్నీ గుర్తుకు వస్తాయి.

ఆ రోజులలో మా రసాలూరు సాలూరు గురించి రాపిన నా పద్యం ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. అది కూడా చెప్పి, నా ఇష్టాల జాబితా చాలా అసమగ్రంగా ఇంతటితో ముగిస్తాను ..

సీ.
పొలిమేర విడిసి తా తొలి పూజ లందు మా
    తల్లి ముత్యాలమ్మఁ దలతు నేను. !
వేగమే లేనట్టి వెర్రి బాగుల తల్లి
     వేగావతికి నుతులు వేనవేలు !
తనుఁగొల్చు భక్తుల తరియించి వేలుపు
   పరమ పావన మూర్తి పంచ ముఖుడు !
శి రాత్రి వేళలో జన సంద్రమై కాచు
కొండ పారమ తల్లి అండ మాకు !


చాల దయగల తల్లి మా శ్యామలాంబ !
వేల్పుటెకిమీడు జోతలు వేంకటేశ !
మరులు కల్పించు మాయూరి మల్లె పొదలు !
మంచి గంధము మాయూరి మంచి తనము !!




10, జులై 2012, మంగళవారం

అయ్యో, చచ్చి పోయింది...


కష్టే ఫలే ... శర్మ కాలక్షేపం కబుర్లు  బ్లాగులో అమ్మయ్య బతికేడు టపా చదివాక ఇది రాస్తున్నాను.
గుండెలు పిండేసే ఆ టపా ఇక్కడ చూడ వచ్చును.  వారి టపాకి కామెంటుగా ఈ మాటలు రాయడం కన్నా, నేరుగా ఒక టపాగా ఉంచితే మరింత మందికి అందుబాటులో ఉంటుందని తలచి, ఇది రాస్తున్నాను.



ఆ టపా నన్ను అమితంగా కదిలించి వేసింది.. ఎలాగయితే నేం ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలిగేరు. ఆ భాగ్యం వారికి  కలిగింది. నా బాల్యంలో, అంటే, నాకు పదేళ్ళు ఉండే రోజులలో  నేనూ, నా మిత్రులూ కూడా కళ్ళారా చూస్తూనే ఒక మరణాన్ని నివారించ లేక పోయాం. ఆ సంఘటన తలచుకొని ఇప్పటికీ మేమంతా విచారిస్తూ ఉంటాం.

వివరాలలోకి వెళ్తే ...

మా బాల్యంలో నేనూ, నామిత్రులూ కలిసి రైల్వే కట్ట ప్రక్కగా నడుస్తూ, ఊరికి  దూరంగా ఓ చోట ఏడు కానాలు అని పిలువబడే ఒక చిన్న కానా గట్టున కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం కానా అంటే  రైల్వే పట్టాలకి అడ్డంగా కట్టిన చిన్న బ్రిడ్జి. ఓ రోజు అలా చాలా సేపు గడిపేక  చీకట్లు అలుము కుంటున్న వేళ ఇంటికి పోదాం అని అందరం లేచాం. సరిగ్గా అదే సమయంలో గూడ్సు ట్రయిన్ ఏదో  , ఒక వేపునుండి రావడం  గమనించాం. అదే సమయంలో రైలు పట్టాల మీద నెత్తి మీద మూటతో పట్టాల నడుమ నుండి నడుచుకు పోతున్న ఒకావిడ మా కంట పడింది.  వెనుక నుండి వస్తున్న రైలు శబ్దం విన బడ లేదో, పరాకుగా ఉందో తెలియదు. అలా పట్టాల నడుమ నుండి నిర్లక్ష్యంగా నడుస్తూ ఉండడం మా ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక దురలవాటుగా అందరికీ ఉండేది. కారణం, మా వెనుక బడిన ప్రాంతంలో రోజులో  మూడో నాలుగో రానీ తరుచుగా  పాసింజరు ట్రయిన్లు కానీ, గూడ్సు బళ్ళు కానీ వచ్చేవి కావు.

సరే, అదే ధీమాతో పరాకుగా  పట్టాల నడుమ నడుచు కుంటూ పోతున్న ఆమెను హెచ్చరించడానికి  గాభరాగా అందరం ఒకేసారి ప్రయత్నించాం. ఆ భయాందోళనల వల్ల అనుకుంటాము, మాలో ఒక్కరికి గొంతు పెగల లేదు. ఎంత ప్రయత్నించినా, మా నోట శబ్ధం రాలేదు.ఒకే సారి అందరకీ గొంతులు పూడ్చుకు పోయాయి. ఇంతలో జరుగ వలసిన ఘోరం జరిగి పోయింది. మా కళ్ళెదుటే ఆమెను గూడ్సు బండి చాలా దూరం ఈడ్చుకొని పోయింది. కొంత దూరంలో బండి ఆగింది. మా దుఃఖం అంతా ఇంతా కాదు. పరుగు పరుగున  అక్కడకి చేరు కున్నాం. రైలు పట్టాల మధ్య తునాతునకలై పడి ఉన్న ఆ శరీరాన్ని చూసి వణికి పోయాం.
చాలా రోజులు, కాదు, చాలా ఏళ్ళ పాటు ఆ బీభత్స దృశ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉండేది.

ఇప్పుడు చెప్పండి,  వారు తమ  ఉద్యోగిని కాపాడు కోవడంలోనూ, మేము ఆమెను కాపాడ లేక పోవడంలోనూ మన ప్రమేయం ఏమైనా ఉందంటారా ? అదే దైవేచ్ఛ అంటే అనుకుంటాను. కదూ

25, ఏప్రిల్ 2011, సోమవారం

నవ్య కథా నీరాజనంలో నా ఇంటర్వ్యూ ....

గత నెల మొదటి వారంలో నవ్య వార పత్రికలో కథా నీరాజనంలో నా ఇంటర్వ్యూ ప్రచురించారు. దానిని నా కథా మంజరిలో పెట్టమని మిత్రులు కోరేరు. ఎందుకు లెద్దురూ, అని దాట వేసాను.

నా బ్లాగరు మిత్రులు వదల లేదు. నువ్వు పెడతావా . మమ్మల్ని పెట్ట మంటావా ? అని బెదిరించడం మొదలు పెట్టారు.
నిజం చెప్పొద్దూ, బ్లాగులో పెట్టాలనే ఉబలాటం నాకు మాత్రం ఉండదూ.

సరే లెమ్మని, కొంత వినయం, మరి కొంత మొఖమాటం నటించి, ఇంకొంత నిరాసక్తత, వేరొక కొంత సిగ్గు అభినయించి, ఇక
ఆ అభినయాలను చాలించి, ఇదిగో, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ మీ ముందు పెడుతున్నాను. చూడండి:












ఒక విషయం : ఇంటర్వ్యూ చదవడానికి ఇమేజి పెద్దది కావడం లేదు. కదూ. ఈ లోపం ఎలా సరి చేయాలో దానికి తగిన సాంకేతిక పరిచయం నాకు లేదు.