Day 05 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Day 05 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2016, సోమవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ......Day 08 ( 5-3-2016)

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ......Day 08  ( 5-3-2016)

( చివరి భాగం )
మా యాత్రలో యిది చివరి రోజు. పేకేజీలో ఇవాళ ఏ దేవాలయ దర్శనాలు లేవు. కానీ మేమంతా
నిన్న గైడు చెప్పి నట్టుగా ఉదయం ఆరు గంటలకే ప్రయాణానికి తయారయి పోయేం కనుక, దారిలో
ఒక అమ్మ వారి ఆలయాన్ని దర్శించు కోగలిగేము. తిరుచ్చి నుండి చెన్నై 350 కి.మీల దూరం.
వీలయి నంత వరకూ మధ్యాహ్నం 3 లేదా 4 గంటల మధ్య చేరుకో గలిగితే మంచిదని గైడ్ చెప్పాడు.
చెన్నైలో ట్రాఫిక్ జామ్ లు ఎక్కువగా ఉంటాయనీ, ఒక్కో సారి చెన్నై చేరే సరికి ఎనిమిదీ తొమ్మిదీ కూడా
దాటి పోతూ ఉంటుందనీ గైడ్ చెప్పాడు.
ఉదయాన్నే 6 గంటలకల్లా తయారయి పోయి, లగేజీ బస్ డిక్కీలో పెట్టించుకుని అందరం
బస్ ఎక్కాము. దారిలో 9 గంటలకి ఉరుమండల్ అనే చోట టూరిజమ్ వారి హొటల్ దగ్గర బస్ ఆగింది.
అక్కడ బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేము. మళ్ళీ ప్రయాణం మొదలయింది. 12 గంటలకి మెయిల్ ముత్తూర్ అనే
చోట ఆగేము. అక్కడ ఆది పరాశక్తి గుడి లో అమ్మ వారిని దర్శించు కున్నాము. అదొక
గ్రామీణ దేవత కోవెల. గుడి చాలా పెద్దది. చాలా ఆధునికంగా నిర్మించేరు. అక్కడ దేవీ
భక్తులు ఎర్రని దుస్తులలో ఎర్రని పూలు పెట్టుని స్తోత్రాలు చేస్తూ అమ్మ వారిని కొలుస్తూ ఉంటారు.
దక్షిణలు హుండీలలో మాత్రమే వేయమని చెప్పారు.  ఎక్కడా  డబ్బుల కోసం చెయ్యి చాచింది లేదు.
ఆ ప్రాంతీయులు అమ్మ వారు చాలా శక్తిసంపన్నురాలిగా భావించి సేవిస్తారు . అమ్మ వారి విగ్రహం
చాలా బాగుంది. మొత్తానికి మా యాత్రలో చివరి రోజయిన ఈ రోజు కూడా పేకేజీలో లేని
వొకఆలయాన్ని దర్శించు కున్నందుకు అందరం సంతోషిస్తూ బస్ ఎక్కాము.
మా యాత్రలో ఏ ఆలస్యాలూ లేకుండా  చక్కగా జరిపించినందుకు మాగైడ్ కి అభినందనలు చెప్పాము.
తలో వందా వేసుకుని డ్రైవరుకీ, అతని సహాయకునికీ మా సంతోషం కొద్దీ యిచ్చి అభినందించేము.
బస్ లో ఆ చిరు అభినందన సభని అందరూ ఫొటోలు తీసుకున్నాం.
బస్ మళ్ళీ బయలు దేరింది. సరిగ్గా 3.30 అవుతూ ఉండగా చెన్నైలో తమిళ నాడు టూరిజమ్ వారి
ఆఫీసు దగ్గర ఆగింది. బయలు దేరిన చోటుకి సురక్షితంగా వచ్చి చేరాము.
లగేజీలు తీసుకుని వారి ఆఫీసులో కుర్చీల మీద కూర్చున్నాము. మా యాత్రీకులలో బొంబాయి
నుండి వచ్చిన దంపతులూ, వారి అమ్మాయీ తప్ప అందరం సీనియర్ సిటిజన్ లమే.
ఆఫీసులో మా టిక్కెట్ లు, ఫొటో ఐడెంటిటీ కార్డుల జెరాక్స్ ప్రతులూ ఇచ్చేక ఐదు నిమిషాల లోపే
కంప్యూటర్లో ఆ వివరాలు నమోదు చేసుకుని మాకు రిపండు కాగితాలు ఇచ్చేరు. వాటి మీద సంతకాలు
చేసి కేష్ కౌంటర్లో ఇస్తే మాకు రావలసిన రిఫండు యిచ్చేసారు. మా ఇద్దరికీ మొత్తం 28,100 రూ.లు
టిక్కెట్లకి అయితే, సీనియర్ సిటిజన్ రాయితీగా తిరిగి యిద్దరికీ కలిపి 5400 రూ.లు వచ్చేయి.
తర్వాత ఒకరి కొకరం బై బైలు చెప్పుకున్నాం. వెళ్ళ వలసిన వాళ్ళు ఆటోలు చేయించుకుని వెళ్ళి
పోయేరు.   నేనూ, మా ఆవిడా, మురళీ కృష్ణ గారి ఫేమిలీ ముగ్గురూ,బొంబాయి వెళ్ళ వలసిన కుటుంబం
 ముగ్గురూ మొత్తం 8 మందిమి మాత్రం మిగిలేం. మా మూడు  కుటుంబాల వారం ఎక్క వలసిన రైళ్ళూ
రాత్రి పదీ పన్నెండు గంటల మధ్య కావడంతో తొందర లేదు.
టూరిజమ్ వారి ఆఫీసులోనే రిఫ్రెష్ అయి, మెరీనా బీచ్ కీ, ఎగ్జిబిషన్ కీ వెళ్ళి వద్దామని నిర్ణయించు
కున్నాము. టూరిజమ్ వారి ఆఫీసు రాత్రంతా పని చేస్తుందనీ కనుక లగేజీ అక్కడ ఉంచి ఎంత రాత్రయినా
వచ్చి తీసుకో వచ్చనీ అక్కడి అధికారులు చెప్పేరు. మరింకేం ! అనుకుని లగేజీ అంతా అక్కడ
ఉంచి, ఆటోలు మాట్లాడుకుని బయలు దేరాము.
ముందుగా మెరీనా బీచ్ దగ్గర జరుగుతున్న ఎగ్జిబిషన్ చూసాము, చాలా బాగుంది. ఎక్కడా
ప్రవేశ రుసుము అంటూ లేదు. అక్కడే కలయ తిరుగుతూ అన్ని స్టాల్సూ చూసి మళ్ళీ ఆటోలు
మాట్లాడుకుని మెరీనా బీచ్ కి వెళ్ళాము. బీచ్ లో చాలా సేపు గడిపి తిరిగి 8.30 అవుతూ ఉండగా
టూరిజమ్ వారి రఫీసుకి చేరు కున్నాము. మా లగేజీలు తీసుకుని అక్కడి కుర్చీలలోనే కబుర్లు
చెప్పుకుంటూ కూర్చున్నాము. ఈ లోగా నేను బయటకి వెళ్ళి పెరుగు పేకెట్ , అరటి పళ్ళూ తెచ్చాను.
 మా ఆవిడ  ఆ పెరుగు తను తెచ్చుకున్న అన్నంలో కలుపుకుని తిన్నాది. తన భోజనం అయినట్టే.
రాధ, విజయ లక్ష్మి గారలు మాత్రం ఏకాదశి ఉపవాసం కనుక, పళ్ళు తిని ఉండి పోయేరు.
నేనూ మురళీ కృష్ణ గారూ బయటికి వెళ్ళి, దగ్గరలోనే ఆంధ్రా భోజన హొటల్ కనబడితే
అక్కడ భోజనాలు చేసి వచ్చేము. భోజనం బాగుంది. ఒక్కో భోజనం 65 రూపాయలు. 9 గంటలవుతూ
 ఉండగా, యిక మూడు కుటుంబాల వారమూ చెన్నై సెంట్రల్ కి ఆటోలు మాట్లాడుకుని బయలుదేరాము.
స్టేషను చేరాక, బొంబాయి నుండి వచ్చిన వాళ్ళు మా దగ్గర సెలవు తీసుకుని తమ రైలు వచ్చే
 ప్లాట్ ఫారమ్ దగ్గరకి వెళ్ళి పోయేరు. మేమూ మురళీ కృష్ణ గారి ఫేమిలీ  నాలుగో నంబరు  గేటులోంచి
లగేజీలు తీసుకుని వెళ్ళి అక్కడి కుర్చీలలోచతికిల పడ్డాం.
ఎదురుగా కనిపించే తెర మీద మా రైలు ఏ ప్లాట్ ఫారమ్ మీదకి వస్తుందో చూస్తూ కబుర్లు
చెప్పుకుంటూ గడిపేము. 9.30కి మా హౌరా మెయిల్ 8వ నంబరులోకి వస్తుందని డిస్ప్లే
వచ్చింది. మేం కూచున్న చోటుకి ఎదురు గేటులోనే 8వ నంబరు ప్లాటు ఫారమ్ కనుక
బాగుందను కున్నాం. మా మిత్రుల రైలు అక్కడ బయలు దేరేది కాక పోవడంతో డిస్ప్లేలో
జాప్యం జరుగుతోంది.
పది గంటలవుతూ ఉండగా, వెళ్ళొస్తామని చెప్పి, మేము ప్లాట్ ఫారమ్ మీదకి వెళ్ళాము. అప్పటికే
హౌరా మెయిల్ ప్లాట్ ఫారమ్ మీద పెట్టి ఉంది. మా కోచ్ ఎక్కి మా బెర్తులలో స్థిర పడ్డాం. ఈ సారి
మా యిద్దరివీ లోయర్ బెర్తులే. మెయిల్ రేపు మధ్యాహ్నం రెండు గంటల కి విజయ నగరం చేరుతుంది.
కనుక హాయిగా విశ్రాంతిగా పడుకో వచ్చనుకున్నాము. ట్రైన్  రాత్రి 11.50 ని.లకిబయలుదేరింది.

ముగిపు:

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నిద్ర లేచి ముఖాలు కడుక్కుని కాఫీలు వస్తే త్రాగేము.
9 .20కి రాజమండ్రి చేరింది. ముందుగా అనుకున్నాం కనుక రాజమండ్రిలో స్టేషనుకి
మా మరదలు మణి, వాళ్ళ చిన్నమ్మాయి రోషిణి వచ్చేరు. నాలుగయిదు నిమిషాలు కబుర్లు
చెప్పుకునే వీలు దొరికింది. మా తమ్ముడు రమణ ఏదో ఆఫీసు పని ఉండడంతో
రాలేక పోయేడు. మణి మాకోసం ఇంటి నుండి పేక్ చేసి తెచ్చిన టిఫిన్, భోజనం ఉన్న
సంచీ అందించి వీడ్కోలు చెప్పింది. ట్రైన్ బయలు దేరింది.
చేతులు కడుక్కుని వచ్చి టిఫిన్ లు కానిచ్చేం. చపాతీలు.కూర. మా మణి బాగా పేక్ చేసింది.
టిఫిన్ లకీ భోజనాలకీ వేరు వేరుగా పేపర్ ప్లేట్లూ, ప్లాస్టిక్ చెంచాలూ, కూల్ వాటర్ బాటిలూ ఉంచింది.
తను తెచ్చిన భోజనం ఇంటికి వెళ్ళేక తినొచ్చులే అనుకున్నాం.             మా చిన్నమ్మాయి కిరణ్ మా రైలు
విశాఖ పట్నం చేరగానే ఫోను చేసి చెబితే, మేం రైలు దిగి ఇంటికి చేరే సరికి  మాకోసం భోజనాలు
పట్టు కొస్తానని చెప్పి ఉంది. కానీ మణి మీల్సు కూడా తెచ్చి యివ్వడంతో మరేమీ చేసి తేవద్దని
మా అమ్మాయికి ఫోను చేసి మా ఆవిడ చెప్పింది.
ట్రైన్ లేటు లేకుండా సరైన సమయానికే విజయ నగర చేరుకుంది.
ఆటోలో యింటికి చేరుకుని స్నానాలు కానిచ్చి పేకెట్ విప్పి తినడానికి ఉపక్రమించేం.
అన్నం, పప్పు, దోసావకాయ పచ్చడీ పెరుగుతో భోజనం కానిచ్చేము.

మా యాత్రలాగే భోజనం కమ్మగా ఉంది.

ఇక్కడితో మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాల కథనం పూర్తయింది.

ఇక  మరోసారి 9 రాత్రులు ఉండేలా కాశీ వెళ్ళే యోచన ఉంది. మా చిన్నాన్న
 పంతులు బాబు, మురళీ పిన్ని, మా అక్కయ్య,  తన పెద్ద కొడుకు నాని, నాని
అత్త గారూ మామ గారూ మా శ్రీకాకుళం తమ్ముడు లక్ష్మణ్, మరదలు శారదలు
 కూడా తప్పకుండా వస్తామని అదరం కలిసి వెళదామని ఎప్పటి నుండో అంటున్నాం.

కాశీ నాథుని దయతో ఆ యాత్ర కూడా జయప్రదంగా జరగాలని కోరుకుంటూ, శలవ్.


ఈ యాత్ర వివరాల కోసం
ttdc అని type చేసి నెట్లో వెతక వచ్చును. లేదా,చిరునామా, ఫోను నంబర్లు
Tamil Naidu Tourism Devolepmednt Corporation,
Tourism Complex,
No.2 Wallajh Road, CHENNAI -600 002,
Phone :25333850 Extn. 208
Phone 044-25333113

mail ID ttdc@vsnl.com కి సపద్రదించ వచ్చును.


























13, మార్చి 2016, ఆదివారం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు ...Day 5 (2-3-2016)

మా తమిళ నాడు యాత్రా విశేషాలు  ...Day 5 (2-3-2016)

ఉదయాన్నే తయారయి పోయేం. నిన్నఫెర్రీ సర్వీసులు రద్దు అయి పోవడం వల్ల వివేకా
నంద మెమోరియల్ రాక్ టెంపుల్ దగ్గరకు వెళ్ళ లేక పోయాం. ఇవాళయినా వీలవుతుందో లేదో
అనుకుంటూ,  సముద్రం మీద సూర్యోదయాన్ని చూడడానికి  నేనూ, మా ఆవిడా,
మురళీ కృష్ణ గారూ, రాధ గారూ, విజయ లక్ష్మి గారూ బయలు దేరాము.అప్పటికి ఉదయం
 ఐదవుతోంది.
ఇవాళ సూర్యోదయం 6.20కి జరుగుతుందని అక్కడ చెప్పేరు.  నేటి ఉదయం చూడ వలసి ఉన్న
 సుచీంద్రం నిన్న సాయంత్రమే చూసి రావడం వల్ల మా మధురై ప్రయాణానికి ఏమంత తొందర లేదు.
సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడడానికి కట్టిన వలయాకారపు మెట్లున్న వ్యూపాయింట్
కట్టడం మా హొటల్ గదికి ఎదురుగా నడక దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్తూ, దారిలో కాఫీలు
దొరికితే కావలసిన వాళ్ళం త్రాగేం. వ్యూపాయింట్ టిక్కెట్టు మనిషికి పది రూపాయలు.
టిక్కెట్లు తీసుకుని మీద అంతస్తుకి చేరు కున్నాం. అక్కడి నుండి మూడు వేపులా
సముద్రం అందంగా కనిపిస్తోంది. ఆ ఉదయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్రపు గాలి
 మనసును ఉల్లాస పరుస్తోంది. మా దృష్టి అంతా  తూర్పు దిక్కు వేపే సారిచి ఆనందామృతాన్ని
 జుర్రు కోవాలని ఆసక్తిగా చూస్తున్నాం. చీకట్లు విడి పోయి, తెల తెలవారుతోంది. ఆకాశం క్రమేపీ రాగ
 రంజిత మవడం  చూదామనుకుంటున్న మాకు అవేళ ఆ కోరిక తీర లేదు! మబ్బులు అడ్డొచ్చాయి.
సూర్యోదయం చూడ లేక పోయేము.అయ్యో ! అనుకున్నాం. సూర్యోదయ వేళ దాటి పోయి,
అప్పటికే పావుగంట పైగా అయింది.మబ్బు రుమాలు ముఖాన కప్పుకుని మాతో దోబూచు
లాడడం తగునా ? ఎంత పని చేసావయ్యా, దినకరా !అనుకుంటూ వ్యూపాయింట్  నుండి దిగి
క్రిందకి వచ్చేము. ఇక ఫెర్రీ సర్వీసులు ఇవాళ ఉదయం ఉంటాయో, నిన్నటి  సాయంత్రంలాగే
 రద్దవుతాయో అనే శంకతో ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించేము. హొటల్ రూముకి వెళ్ళే
పని లేదు కనుక, నేరుగా ఫెర్రీలు బయలుదేరే చోటికే వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకున్నాం.
మేం అయిదుగురం ఫెర్రీలు బయలుదేరే చోటే ఉంటామని మా గైడ్ కి  ఫోన్ చేసి చెప్పేము.
మొదటి  ట్రిప్పు ఫెర్రీ 8.15 గంటలకి బయలు దేరుతుందిట. ఇకా చాలా టైముంది. అక్కడికి  చేరు
కున్నాము. అక్కడ ఫెర్రీ ఎక్కేందుకు క్యూ కనిపించి హమ్మయ్య! అనుకున్నాం. మురళీ కృష్ణ
గారు హిందూ పేపరు కొనుక్కుని వో షాపు మెట్ల మీద కూర్చుని పేపరు  చదువుకుంటూ గడిపేరు.
ఆడవాళ్ళు ముగ్గురూ అక్కడే వో షాపులో కుర్చీలు ఆక్రమించి కబుర్లు చెప్పుకుంటూ గడిపేరు.
నేను మరో కప్పు కాఫీ సేవించి అటూ యిటూ తచ్చాడుతూ గడిపేను. ఎనిమిదవుతూ ఉంటే మా
గైడ్ మిగిలిన వారిని వెంట పెట్టుకుని వచ్చేడు. ఫెర్రీ టిక్కెట్ల ఖర్చు టూరిజమ్ వారిదే కనుక
టిక్కెట్లుకొని మమ్మల్ని రాక్ టెంపుల్ దగ్గరకి బయలుదేర దీసాడు.

అందరం ఫెర్రీ ఎక్కేము. మురికి పట్టిన లైఫ్ జాకెట్లు వేసు కోవడం ఈ సారి కూడా తప్ప లేదు!
పది నిముషాల లోపే రాక్ టెంపుల్ కి చేరుకున్నాం. తిరువళ్ళవూర్ భారీ విగ్రహాన్ని దూరం నుండే
చూసేము. ఈ తమిళ కవి విగ్రహం133 అడుగుల ఎత్తుతో,ఏడున్నర టన్నుల బరువుతో
ఆసియాలోనే భారీ విగ్రహ మని చెబుతారు.
స్వామి వివేకానంద 1892 ప్రాంతంలో బారలు వేసుకుంటూ సముద్రాన్ని ఈది వెళ్ళి అక్కడి కొండ మీద
 ధ్యానం చేసుకునే వాడని నిన్నటి కథనంలోనే చెప్పేను కదా. స్వామి స్మృత్యర్ధంనిర్మించిన
ఈ రాక్ టెంపుల్ అందాలు  చూసి తీర వలసినదే. సముద్రపు హోరు, విసురు గాలి సమ్మోహన
 పరుస్తాయి. స్వామి ధ్యానం చేసిన చోటుని దర్శించు కున్నాము. మంద్ర స్వరంలో ఓంకారం
తప్ప మరే ధ్వను లూ విని పించని ఆ ధ్యాన మందిరంలో కొద్ది సేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాము.
  ధ్యానం కుదరక పోయినా, అలా కూచోడం వల్ల వొక ప్రశాంత మయిన అలౌకికానుభూతి కలిగి మనసు
తేట పడిన భావన కలిగి నట్టనిపిస్తుంది.
రాక్ టెంపుల్ మీద స్వామి సాహిత్య గ్రంథాలు విక్రయించే షాపులు ఐదారు వరకూ ఉన్నాయి.
హాయి గొలిపే ఆ వాతా వరణాన్ని వదిలి రావాలనిపించక పోయినా, యింకా బ్రేక్ ఫాస్టు చేసి
మధురై వెళ్ళ వలసి ఉంది కనుక హొటల్ గదులకు చేరుకుని లగేజీలను బస్ డిక్కీలో చేర్పించి హొటల్
 లో టిఫిన్లు కానిచ్చేము. ఈ రోజు చూడ వలసిన సుచీద్రం నిన్ననే చూసి
రావడం వల్ల సమయం కలిసి వొచ్చి, టిఫిన్లయ్యేక తీరికగా 10 గంటలకి బస్ ఎక్కి మధురై బయలు
దేరాము.
2 గంటల ప్రాంతంలో తిరుమంగళమ్ అనే చోట లంచ్ చేసాము. ఈ ఖర్చు మాదే. లంచ్ తర్వాత
బయలు దేరి 3 గంటలకి మధురై చేరు కున్నాము.

అక్కడ ముందుగా నాయక రాజుల రాజ మహల్ చూసేము. మేం చూసిన మహలు అసలు
మహలులో నాలుగో వంతు మాత్రమేననీ తక్కిన రాజప్రాసాదాలు శిధిలం కావడంతో పర్యాటకులకు
అనుమతి లేదనీ తెలిసింది. మేం చూసినంత మట్టుకే రాచ మహలు చాలా గొప్పగా విశాలంగా ఉంది.
ఆ నిర్మాణ కౌశల్యం అధ్భుతం నిపిస్తుంది. పెద్ద పెద్దహాళ్ళూ, ప్రాసాదాలూ, సభా భవనాలూ, యక్ష గాన
 ప్రదర్శనల  వేదికలూ చక్కని వర్ణ చిత్రాలతో కనుల పండువు చేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఒక్కో స్తంభమూ ముగ్గురు వ్యక్తులు చేతులు బారచాపి కొలిచినా చాలనంత చుట్టు కొలత
కలవి. రాజులు ఉపయోగించిన కొన్ని వస్తువులూ, కొన్ని శిల్పాలూ కూడా ప్రదర్శనకి ఉంచారు.
రాచ ప్రాసాదాలు చూసేక, మధురై లోని  మీనాక్షీ అమ్మ వారి దర్శనానికి బయలు దేరాము.

కంచి కామాక్షి తల్లిని లోగడ మూడు పర్యాయాలు దర్శించు కున్నాం, కానీ  మధుర మీనాక్షి అమ్మ
వారి దర్శనం ఇదే  మాకు మొదటి సారి. దీనితో కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మ
వార్లను మేం దర్శించుకున్నట్టయింది. ఈ మూడూ అష్టాదశ శక్తి పీఠాలలోనివే.


మధురైలో మీనాక్షి అమ్మ వారి కోవెల భారత దేశం లోనే వొక అపూర్వ మైన కట్టడమని చెప్ప వచ్చును.
ఇక్కడి శిల్ప కళ, ఎత్తయిన గోపురాలూ వర్ణ శోభితమై లరారుతూ ఉంటాయి.
1600 ప్రాంతంలో కుల శేఖర పాండ్యుడనే పాండ్య రాజు దీనిని నభూతో న భవిష్యసి అనే రీతిలో
నిర్మిచాడు. 45 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 14 గోపురాలతో ఈ ఆలయ నిర్మాణం ఉంది.  ఈ గోపురాలలో
ఎత్తయినది 170 అడుగులు కావడం విశేషం. ఇందులో రెండు గోపురాలకు బంగారు తాపడం చేసారు.
పసిడి వర్ణంతో అవి మెరిసి పోతూ ఉన్నాయి.
ఇక్కడ పరమ శివుడు సుందరేశ్వర స్వామి గానూ, పార్వతీ అమ్మ వారు మీనాక్షీ అమ్మ వారి గానూ
కొలవబడుతున్నారు.  ఆలయంలో గోడల మీద ఎక్కడా కొద్ది పాటి ఖాళీ కూడా లేకుండా చక్కని
శిల్పాలు,  వర్ణ చిత్రాలు ఉన్నాయి. తనివి తీరా ఆలయ దర్శనం చేసు కున్నాక, 6.30కి మధురై
లోని హొటల్ కి చేరు కున్నాము. లగేజీ హొటల్ గదులలో చేర్చుకుని, కాస్త విశ్రమించి, రాత్రి 8 గటలకి
టూరిజమ్ వారి హొటల్ లోనే డిన్నరు కానిచ్చేము.

మర్నాడు మా  6వ రోజు యాత్రలో భాగంగా విహార స్థల మయిన కొడైకెనాల్ కి ప్రయాణం.
ఆ ముచ్చట్లు చెప్పు కునే ముందు ఇప్పటికి శలవ్.