మంచి పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచి పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2013, బుధవారం

మా ముద్దుల ముసిలోడా ...



విజయ నగరం పెద్దలందరూ కలిసి ‘‘ మూడు యాభైల మన గురజాడ ’’ కార్యక్రమాన్ని జరిపించాలని తలపెట్టి, 2011 సెప్టెంబరు 21 నాడు శ్రీకారం చుట్టేరు. సాలు పొడుగునా వేడుకలూ సభలూ రాజాంలో జరిగేయి. తరవాత్తరువాత, 2012 సె్టంబరు 19, 20 తేదీలలో ముగింపు సభలు ఘనంగా నిర్వహించుకొన్నారు.

తర్వాత, విశాఖ పట్నం కళాభారతి ఆడిటోరియంలో కన్యాశుల్కం

యథాతధ పూర్తి నిడివి ప్రదర్శన జరిగింది. దానితో ఆ సంబరాలు ముగిసాయి.

సరే, ఆ సందర్భానికి కొనసాగింపుగా వెలుగు మిత్రులంతా కలిసి ‘‘మూడు యాభయిల మన గురజాడ’’ అనే 400 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు.ఇందులో ప్రముఖులు గురజాడ గురించి రాసిన 50 వ్యాసాలున్నాయి. శిసాగర్, సీరపాణి, రజనిలు రాసిన మూడు కవితలూ,ఆయా సభలకు చెందిన ఫొటోలూ ఉన్నాయి.

‘‘మూడు యాభయిల మన గురజాడ’’ పుస్తకాన్ని ప్రచురించి న వెలుగు మిత్రులు  గురజాడకి అంకితం చేస్తూ రాసిన గేయం ఇది ...

ఇక చదవండి ....

మా ముద్దుల ముసిలోడా


ఇప్పుడంటే మురిగ్గుంటై
డెంగూ ఫీవరుగా
వూరిని ఝడిపిస్తోంది గానీ
మా అయ్య కోనేరు



ఆరడుగుల లోతుల్లోకి
విసిరేసిన అణాకాసుని
నీటి మడుగున చందమామగా చెరిపించేది

కారణాలడక్కూడదు.
‘‘ వీడికి వెఱ్ఱికాబోలు’’ అనుకుంటారు,

కడుపికింత తిండి పెట్ట లేక పోయినా
అడుక్కున్నోడికి సైతం
చేతికి సెల్ ఫోనిచ్చాం
ఇదీ అడుగు నుండి మా అభివృద్ధి
కడుపుమండా ఏలుబడి అలా సాగుతోంది
నిలుచున్న చోటే దిక్కులు వెతుక్కుంటూ
చట్ట సభల్లో పొక్కుల చిక్కుకుంటూ

ఎవడితరం పులి మీద సవారీ !’’
అదీ మా ప్రయోజకత్వం
సిగ్గిడిసి అడిగేస్తున్నా
మైడియర్ ఓల్డు అప్పారావు
అన్నావన్నావు

‘‘ మంచి గతమున కొంచెమునోయి’’
మేమేమో గతం గొప్పలే
దుదదపత్తింగా గోక్కుంటున్నాం
అందని ఎత్తులో నిలిచిన నీ మనసు
‘‘పట్టుబడాలని నిదానిస్తున్నాం.’’
‘‘ మందగించక ముందు అడుగేయి’’
కదా నువ్వన్నది

‘‘ చిత్రం చిత్రం మహా చిత్రం’’
ఎన్నిమార్లు కన్నిమార్లు
నిన్ను చూస్తున్న కొద్దీ
కొత్త చిగుర్లేసి నిగారిస్తుంటావు

‘‘ వీర్య మెరుగక విద్య నేర్వక’’
కూడా అన్నావు కదా !

అమ్మ ముసిలోడా



అయితే ఇక చూడు మా తడాఖా
‘‘ అరె ఝాఁ , ఝాఁఝటక్ .. ఫటక్ ...’’
అదుగో నవ్వుతున్నావు
‘‘మనవాళ్ళు వొట్టి వెధవాయిలోయ్’’

నీ నోట్లో నోరెట్టలేం తండ్రీ

నీకో నమస్కారం

అందుకే నీకోసం ఈ పుస్తకం ...



---- వెలుగు మిత్రులం.




14, మార్చి 2013, గురువారం

కొత్త కథల పుస్తకం - వేద ప్రభాస్ కథలు





మిత్రుడు వేద ప్రభాస్ ( జె.వి.బి. నాగేశ్వర రావు)  కొత్త కథల సంపుటిని వెలువరించాడు. సాహిత్యం లో కథానికకు ప్రపంచం లోనే  ఆద్యుడైన ఎడ్గార్ ఎలెన్ పో కథను  అత్యంత వేగంగా అన్ని దేశాలకూ అన్ని భాషలకూ పంప గలిగాడంటే కథా ప్రక్రియ ఎంత లలిత మైనదో,  తెలిసి పోతుంది. ఒక మంచి కథ చదివి నప్పుడు కథ ఎంత బలమైనదో కూడా అంతే  తేలిగ్గా తెలిసి పోతుంది. అంటూ తన మాటగా చెప్పుకొన్న వేద ప్రభాస్ విద్యా రంగంలో ఉపాధ్యాయునిగా మొదలిడి అనేక పదవులు నిర్వహించి, రాజీవ్ విద్యా మిషన్ లో విజయ నగరం .జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారిగా ఇటీవలనే పదవీ విరమణ చేసారు.
అచ్చంగా ఇంత వరకూ 18 కథలూ పయనం, దేవభూమి, కొయ్య గుర్రాలు అనే నవలలు రాసారు.  రెండు నవలలు తెలుగు లోకి అనువాదం చేసారు.  రెండు కథలకు ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు కూడా అందు న్నారు, ఈ పుస్తకాన్ని తమ తల్లి దండ్రులకు అంకితం చేసారు.
దీనికి ముందు మాటగా తన  అభిప్రాయాన్ని  మల్లాది తెలియ జేస్తే , ఆప్త వాక్యాన్ని పంతుల జోగారావు రాశారు. రచయిత మంజరి తన మాటగా కథా గానం వినిపించారు,


12 కథలున్న ఈ పుస్తకం వెల వంద రూపాయలు. రచయిత పేర, ప్లాట్ నంబరు 71, నటరాజ్ కాలనీ విజయ నగరం చిరునామాకు సంప్రదించ వచ్చును. లేదా 08922220996 నంబరుకి కానీ, 9490791568 సెల్ నంబరుకి కానీ ఫోన్ చేస్తే చాలును. 

19, జూన్ 2012, మంగళవారం

అమ్మకానికి కాదు సుమా !




పోయినవి పోగా, మిగిలిన మా పుస్తకాల జాబితా  ఇది ... మా పర హస్త గత మయిన పుస్తకాలు ..రావి శాస్త్రి మొత్తం పుస్తకాల సెట్టు, అలాగే ముళ్ళపూడి వారి రచనలు, సాక్షి వ్యాసాలు, భారతి సంచికలు,  ఇంకా చాలా ... చాలా ...


21, ఫిబ్రవరి 2012, మంగళవారం

హా ! దొరికెన్ !






హమ్మయ్య ! దొరికిందండీ, ఇన్నాళ్లకి !

పఠాభి ‘ ఫిడేలు రాగాల డజన్ ’ పుస్తకం ఓ మిత్రుని ఇంట దొరికింది. మద్రాసు రామరాయ ముద్రణాలయం వారు వేసిన ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించ బడిందో వివరాలు ప్రచురణ కర్తలు ఇవ్వ లేదు. శ్రీ. శ్రీ ధర్మమా అనీ, ఇది ప్రమాది అధిక శ్రావణ మాసంలోనో, కాస్త అటూ ఇటూ గానో వెలువడి నట్టుగా భావించ వచ్చు. దానికి సరిపోయిన ఇంగ్లీషు సంవత్సరం చూసుకుంటే సరి. వెల మాత్రం‘‘ డజన్ అర్ధణాలు’’ అని ఉంది. అంటే ఆరు అణాలని తాత్పర్యం ! అనగా పావలా బేడ. అనగా అర్ధ రూపాయికి రెండణాలు తక్కువ. అనగా, నలుబది ఎనిమిది కానులు. అనగా ... అనగా .... అనగా ....

పాత ఎక్కాల బుక్కు మీరే చూసుకోండి.

కవి ఈ పుస్తకాన్ని వచన పద్యములు అని పేర్కొన్నాడు. నేను తెలుగులో పీ.జీ

చేసి నప్పుడు ఫిడేలు రాగాల డజన్ కోసం చాలా వెతికాను, ఎక్కడా కాపీలు నాకయితే దొరక లేదు. ఇందులోని కవితలను ( వచన పద్యములను ? ) అక్కడా ఇక్కడా చూసి, ఎత్తి రాసుకొని బండి లాగించీసేను. ఇప్పుడు దొరికింది, ఈ చిన్న పుస్తకం. ఎలా ఉందో చూసారూ ? పఠాభి రచన మీద చెదలు తమ అభిప్రాయం చెప్పాలని అనుకుని, మధ్య లోనే విరమించు కున్నట్టున్నాయి. మహా భారతంతో పాటూ, మహా ప్రస్థానం వరకూ అవి ఇలాగే తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా తెలియ జేస్తూ ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండక పోతే !

పుస్తకం అట్ట మీద - ‘‘చదవండి ఫిడేలు రాగాల డజన్ ’’ అని ఉంది. కింద చిన్న ఫిడేలు బొమ్మ చూసారు కదూ. ఇక్కడ కొంత కొంటె దనం. అప్పట్లో కొత్త దనం- కన బరిచారు. ఫిడేలు బొమ్మ కింద రాగాల డజన్ అని ముద్రించారు. కింద చలం గారి మాటలు ... వెనుక అట్ట మీద విద్వాన్ విశ్వం గారివీ, వేదుల (సత్య నారాయణ శర్మ) వారివీ , మాటలు ఉన్నాయి. తర్వాత,

ఆంధ్ర పత్రిక వారివీ, కథాంజలి వారివీ అభిప్రాయాలు కూడా వేశారు.

ఆ కింద చివరాఖరిగా ఎర్రక్షరాలతో రాగాల డజన్ కాదు, దీన్ని రోగాల డజన్ అనాలి. అని B.R.R గారు అభిప్రాయ పడ్డారు. ( వీరెవరు చెప్మా ? )



పుస్తకములు దొరుకు స్థలము : నమ్మాళ్వారు, పోస్టు బాక్సు 251, మద్రాసు అని ఉంది.

అంకితము మృణాళినికి, కాదు కల్యాణికి ; కాదు ఇరువురికి అని ఉంది.

కవి గారే రాసారో, ముద్రాపకులే రాసారో కానీ అంకితం తరువాతి పేజీలో ఇలా ఉంది:

‘‘అక్కడక్కడ ఈ పద్యాలలో వచ్చునట్టి పఠాభి అనే పేరు గల పాత్రకు, గ్రంథ కర్తకు

ఏ మాత్రం సంబంధం లేదని గమనింపు ; ‘‘ కృష్ణ పక్షం’’ లోని ‘‘ కృష్ణ’’ కును, దాని గ్రంథ కర్త నామం లోని ‘‘కృష్ణ’’ కును ఏలా సంబంధం లేదో అలాగే. ’’



ఇక, ఇంట్రో శ్రీ.శ్రీ రాసేరు. శ్రీ.శ్రీ నవ కవుల తిరుగు బాటుని గురించి రాస్తూ ఫిడేలు రాగాల డజన్ చదవమని సలహా ఇచ్చాడు. 38 పేజీలున్న ఈ చిన్ని పుస్తకంలో పుటల సంఖ్య లన్నీ తెలుగు అంకెలే వేసారు.

ఫిడేలు రాగం పద్యం ఇదీ .....

చూడండి.



ఫిడేలు రాగమ్ ఫిడేలురాగమ్

ఫిడేలు రాగమ్బులు

వినూతన పదప్ రేమికులు , మహా కాముకులు ;

అన్ యోన్ యమగు దమ్ పతులు కూడ;

ఫిడేలన్ నది,, ‘‘ మయ్డియ రాగ్రా

మీ వారన్దరు సనాతనాచార్ యుల్

ముఖమ్విరిచి, ఇన్ గ్ లీష్టానిని

నన్ ను న్జేపట్ టవద్ దని

గద్ దిన్చినా కూడ నీవు

మహా సాహసన్తో, రుమాన్ టిక్ గా

మ్ యారేజ్జేసుకొన్ నావు గదా ! స్ వీట్ హార్ ట్ ! ’’

రాగమ్ అనినాడు

‘‘థ్ యాన్ క్ స్ టు పఠాభి

నా కతడు ధయ్రిన్గా

సహాయమ్ జేయ పట్ టి మనకు

వివాహమయిన్ ది డార్ లిన్ గ్ !’’



ఫిడేలు రాగమ్బులు ఆదర్ శమగు జమృతులు

తటాల్ మని కలకన్ ఠ మున, ఫిడీలీలా

స్ ర శ్ ని న్ చినది. ‘‘ రాగా డియర్నన్ ను

నిజన్గా ప్ రేమిస్ తావా నీవు ?

ఏమ్ మాటన్టున్నావు ఫిడేలీ జీవితేశ్ వరీ!

నా జన్ మనీలో లీనమయి పోయిన్ది,

సన్ ఘమ్ నన్ వినా గూడా

నిన్ను చేపట్టినన్ దుక్నాకు , వచిమ్ప రాని

సవుఖ్ యమ్’’ ఫిడీలు చిత్ తతస్త్రులు

ఆపనందంతో మ్ రోగినవి.



రాగమ్ అంత ఫిడీలీని గాఢమ్ గా

కన్గిలించాడు. తర్వాత వారి

దేహాలు న్నే కమయినాయి సరళ శయ్యన్.

అపూర్ వమ్ బగు అన్దంబగు సన్తానమ్ వారికి

జనిన్చి అసన్ ఖ్ యాకముగ ; --- వారన్తా

పఠాభిని గని ‘‘ తాతా తాతా ’’ అనే వారు.



----------



దీనికి టీకా టిప్పణులు చెప్పడానికి శ్రీ. శ్రీ లేడు. ఆరుద్రా లేడు. రోణంకీ లేడు.

తెలిస్తే ఎవరయినా చెబుదురూ .......



అప్పుడు .... హా దొరికెన్ ! అని ఊరుకోకుండా, హా ! తెలిసెన్ ! అని కూడా అనుకుంటాను.

బాబ్బాబు ! ఎవరయినా పుణ్యం కట్టుకుందురూ !

28, నవంబర్ 2011, సోమవారం

కుంచెకారులతో ఓ కులాసా సాయంకాలం !



‘ కుంచె’కారులూ, కొంత మంది ‘కలం’కారులూ కలిసి నిన్న ఆదివారం
( తే 27.11.2011దీ) సాయంత్రం కులాసాగా, దిలాసాగా, నిండుగా ఒక పండుగలా నవ్వుతూ గడిపిన సందర్భాన్ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాను.

సరస్వతుల రామ నరసింహం అంటే చాలా మందికి తెలియక పోవచ్చును. తెలియక పోయినా వచ్చే ప్రమాదమేమీ లేదు. కాని ‘సరసి’ అనే పేరు తెలియని వారు తెలుగు పత్రికలతో ఎంతో కొంత పరిచయం ఉన్న వారదరకీ తెలిసి ఉంటుంది. ఉండాలి కూడా. లేక పోవడం బాగోదు సుమండీ, ముందే చెబుతున్నాను.




ఎందుకంటే, సరసి గారు తెలుగునాట వచ్చే దాదాపు అన్ని పత్రికలలోనూ అసంఖ్యాకంగా కార్ట్యూనులు వేస్తూ ఉంటారు.

వారం వారం నవ్యలో వచ్చే ‘మన మీదే నర్రోయ్ !’ చప్పున గుర్తొచ్చి తీరుతుంది. తెరలు తెరలుగా నవ్వు మన పెదాల మీద అసంకల్పితంగా విరగబూస్తుంది. ఇంత వరకూ సరసి గారు తన కార్టూన్ పుస్తకాలు రెండింటిని ప్రచురించారు. ఇప్పుడేమో ముచ్చటగా తన మూడో కార్టూన్ల పుస్తకం

వెలువరించారు !

సరసి కార్టూన్లు 3 (వైశంపాయనుడి కథలతో కలిపి) అనే పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం నాడు హైదరాబాద్ బాలానందం భవనంలో మహా సందడిగా జరిగింది. చాలా మంది కుంచెకారులూ, కలంకారులూ వచ్చి చాలా సందడి చేసారు. అందులో ఉభయకారులూ కూడా ఉన్నారు. అంటే కార్టూనిస్టులూ, రచయితలూ కూడా నన్నమాట.

నాకయితే పరిచయం కాలేదు కానీ, కవులు కూడా వచ్చే ఉంటారు. వీళ్ళతో పాటు చాలామంది కార్టూన్ల ఇష్టులు కూడా వచ్చి ఎంతో సందడిగానూ, సరదాగానూ ఈ సాయంత్రాన్ని కరగదీసారు.

సభకి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు అథ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ నవ్య సంపాదకులు శ్రీ ఎ.ఎన్.జగన్నాథ శర్మ చేసారు. సరసి గారి పుస్తకాన్ని శ్రీ సుధామ గారు పరిచయం చేసారు. వారి మాటలు విన్నాక మన సరసి గారు అందరికీ మరింత ముద్దొచ్చేసారు. సభలో ఇంకా బాలానందం కార్యదర్శి కామేశ్వరి గారూ, సరసి అని (కలం పేరుని) నామకరణం చేసి, గీతలు నేర్పిన గురువు గారు శ్రీ తమ్మా సత్యనారాయణ గారు సరసి గారిని తమ మానస పుత్రులుగా పేర్కొనడం ప్రేక్షకులను ఆనందపరవశులను చేసింది.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు ప్రముఖ కార్టూనిస్టులు మోహన్, చంద్ర, రాంపా, రవికిషోర్, శంకు, గీతా సుబ్బారావు, ప్రముఖ సినీ దర్శకులు, రచయిత జనార్ధన మహర్షి, మొదలయిన కుంచెకారులు, కలంకారులూ, కళాకారులూ చాలామంది పాల్గొని ఈ సాయంకాలాన్ని నిజంగా ఒక కులాసా సాయంకాలంగా మార్చేసారు !

సరసి గారు ఈ పుస్తకాన్ని సరస వ్యంగ్య గీత గోవిందుడు / సకల కళా హృదయ జయ దేవుడు డా. జయదేవ్ బాబు కి అంకింతం చేసారు.

పుస్తకానికి ఆప్తవాక్యంగా, కాదు, పరమాప్త వాక్యంగా శ్రీ బాపు గారు రాసిన మాటలు ‘గురు దీవెన’ పేరిట ప్రచురించి. సరసి గారు తమ గురు భక్తిని చాటుకున్నారు.

ఆ మాటలివి : ( వీటిని చదివేక కూడా ఈ పుస్తకాన్ని కొని చదవకుండా ఉండలేం)

చూడండి:

మన తెలుగు లోగిళ్ళలో
అచ్చ తెలుగు నవ్వుల్ని
ఏరుకొచ్చి - సొంత టైన్ దారంతో
మాల కడుతూన్న సరసి గారూ !

నేను గర్వపడే స్నేహితుడా!
మీరందించే పరిమళాలు
ఎల్ల వేళలా ఇలాగే గుబాళించాలని
ఆ సీతారాముణ్ణి వేడుకుంటూ ...

మీ వీరాభిమాని బాపు.


ప్రముఖ హాస్యనటులు శ్రీ బ్రహ్మానందం గారు ఈ పుస్తకానికి ఎంచక్కని కొసమెరుపు మెరిపించారు.

‘‘సరసి కార్టూన్లంటే నాకిష్టం. అందుకే వారం వారం క్రమం తప్పకుండా నవ్య వీక్లీ కొంటూ ఉంటాను.’’

ఈ కార్టూన్ల పుస్తకంలో కార్టూన్లతో పాటు మధ్యే మధ్యే వైశంపాయనుడి కథలు ఓ 24 కూడా మనకందించారు !

ఇవన్నీ గిలిగింతలు పెట్టే చక్కని హాస్య, వ్యంగ్య కథలే !

పుస్తకంలోని ఒక్క కార్టూను గురించి కానీ, ఒక్క కథ గురించి గానీ ప్రస్తావన చేయకుండానే, ఈ టపా ఎందుకు ముగిస్తున్నానంటే, బాపూ గారి మాటలూ, బ్రహ్మానందం గారి పలుకులూ విన్న తర్వాతయినా ఎవరికి వారే ఒక్క క్షణం ఆలస్యం చేయ కుండా పుస్తకాన్ని కొని తెచ్చుకొని ఆనందిస్తారనే భరోసా, ప్రగాఢమైన నమ్మకం ఉండడం చేతనే.

పుస్తకం ఎక్కడ దొరుకుతుందంటారా ?

శ్రీ భారతీ పబ్లికేషన్స్, ప్లాట్ నెం. 56, 3వ వీధి, అనంత సరస్వతీ నగర్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ 500 047 వారిని సంప్రదించండి.

లేదా, నేరుగా సరసి గారినే, ‘‘ ఇలా డబ్బులు పంపుతానూ, నాకూ, నేను ముందంటే నేను మందంటూ పేచీలు పడకుండా మా ఆవిడ కోసమూ, పిల్లల కోసమూ, ’’ అంకుల్ గారూ ఏవేనా మంచి పుస్తకాలుంటే ఇద్దురూ, చదివి ఇచ్చేస్తానూ ! అనడిగే మా పక్కింటి వాళ్ళ కోసమూ, నా బంధు మిత్రుల కోసమూ , పెళ్ళిళ్ళకీ, వేరే శుభకార్యాలకీ కానుకగా ఇవ్వడం కోసం నాకు బోలెడు కాపీలు కావాలీ, వెంటనే పంపించండీ’’ అని డిమాండ్ చెయ్యండి. ఎందుకు పంపించరో చూస్తాను .హన్నా ! తమంత సరసులు పంపించమని (డబ్బులకే సుమండీ) అడిగితే పంపకుండా ఉండడానికి ఎన్ని గుండెలు ఉండాలి చెప్పండి ?

ఇదీ సరసి గారి ఫోను నంబరు: 09440542950

మెయిల్ ID : sarasicartoonist@gmail.com

పళ్ళ దుకాణం వాడయినా, మనం టోకున ఎక్కువ కిలోల పళ్ళు తీసుకునే రకంలా కనిపిస్తే, దోర ముగ్గిన పళ్ళ లోంచి ఒకటి తీసి ముక్కలు కోసిఒక ముక్క మనకందిస్తూ, ‘‘ తినండి సార్ ! తిని రుచి చూడండి ! బాగుంటేనే కొనండి.’’ అనడం కద్దు. కదా,

అంచేత, ఈపుస్తకంలో మచ్చు ( రుచి) కోసం ఒక చక్కని కార్టూన్ మీ కోసం. చూడండి:



చివరిగా,

సరసి గారి కార్టూన్ లలో నాకు బాగా నచ్చినదీ. అస్సలు నచ్చనిదీ ఒక దాని గురించి చెప్ప వలసి వస్తే,

నచ్చినది : నా వల్ల కాదు. ఆయన వేసిన వేలాది కార్టూన్ల నుండి ఎంచి‘ ఇదీ ’ అని చెప్పడం.

నచ్చనిది: ఇంత వరకూ వెయ్య లేక పోయారు. వెయ్యడం అతనికి చేత కాలేదు. నాకు నచ్చని కార్టూను వెయ్యడం అతని తరం కాదు.

శలవ్





25, నవంబర్ 2011, శుక్రవారం

ఈ ఫొటోలో వ్యక్తి ఎవరని అడగను. నేనే పరిచయం చేస్తాను ...


గత మే నెలలో కామమ్మ కథ అనే ఒక టపా ఉంచాను. ఆ కథలో నేను ప్రస్తావించిన నా మిత్రుని ఫొటో అప్పట్లో లభించ లేదు.

కానీ, ఇటీవల మరో మిత్రుని షష్టి పూర్తి కార్యక్రమం కోసం మా స్వగ్రామం పార్వతీపురం వెళ్ళడం జరిగింది.
అప్పుడు నా పుస్తకాల మిత్రునికి నేను తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో అక్కడే, ఆ టపా లోనే, ఉంచ వచ్చును. కానీ మరో సారి కామమ్మ కథ పుస్తకం నా పుస్తకాల గూటి లోకి గువ్వలా వచ్చి ఎలా చేరిందో, ఆ ముచ్చట పూర్తిగా బ్లాగు మిత్రులతో పంచు కోవాలని దీనిని పెడుతున్నాను. అదీ కాక, అలా చేస్తే, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అయి పోతుందనిపించింది కూడా. అది కూడా ఒక కారణం. అందుకే ఆ టపా మరొక్క తూరి ...



చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...

నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.

ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.

విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.

ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.

నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు.శరత్ సాహిత్యమంతా ఉండేది.

ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.

ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.

హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?

నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?

ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?

సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.

ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.

మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.

ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.

మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.

ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.

మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.

వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.

వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.

నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.

ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.

అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.

శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ

శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.

సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.

స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.

ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.

చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.

ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.

ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటే, నాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...

నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...

అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...



20, నవంబర్ 2011, ఆదివారం

గురుదేవుల శతజయంత్యుత్సవ సంచిక


పెద్దలూ, సమవయస్కులూ భాష్యం అనీ, అంతేవాసులు ఎస్వీయన్ గారు అనీ ఎంతో ఇష్టంగా పిలుచుకునే వారు వారిని.
వారే శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యుల వారు.

వారి శతజయంతి వేడుకలు విజయ నగరం శంకరమఠంలో తే 16 -9-2010 ది అద్వితీయంగా జరిగాయి.
మాష్టారి బంధువులూ, మిత్రులూ, శిష్యులూ, విజయ నగరం సౌరులూ చాలా మంది విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయ వంతం చేసారు.

ఆనాటి కర్యక్రమం వివరాలతో, ఫొటోలతో, ప్రముఖుల వ్యాసాలతో రూపొందించిన ఎస్.వీ.ఎన్ గారి శతజయంత్యుత్సవ సంచిక వెలువడింది.
నాటి కార్యక్రమంలో ఆచార్య శలాక రఘునాథ శర్మ, బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్య స్వామి, వారి శిష్యులు డాక్టర్ ఎ. గోపాలరావు, డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహంగారూ, విజయ నగరం సంస్కృత కలాశాల నాటి అథ్యక్షులు శ్రీ మానాప్రగడ శేషసాయి గారూ, జోస్యుల దక్షిణా మూర్తి గారూమొదలయిన వారు చక్కని ప్రసంగాలు చేసారు.

గురువు గారి కుమారులు శ్రీభాష్యం శ్రీనివాసాచార్యులు, రంగాచార్యులు గారలు ఈ శతజయంతి సంచికను ప్రచురించారు.

ఇందులోమహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శ్రీమాన్ న.చ.రఘునాథాచార్య స్వామి, శ్రీమతి కిదాంబి గోదా దేవి, కిదాంబి రఘుపతి, ఆచార్య సార్వ భౌమ ప్రొ. వేదుల సుబ్రహ్మణ్య శా స్త్రి, ప్రాచార్య శలాక రఘనాథ శర్మ, డా. యు.ఎ.నరసింహమూర్తి,శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్యులు, డా. అయలసోమయాజుల గోపాలరావు,
జోస్యుల దక్షిణామూర్తి, శ్రీభాష్యం తిరుమల రామానుజాచార్యులు, ప్రభృతులు వ్రాసిన చక్కని రచనలు ఉన్నాయి.

వీటితో పాటు విష్ణధర్మాంతర్గత మాంగళ్య వివృద్ధి స్తోత్రమ్ నకు మా గురుదేవులు ఎస్.వీ.ఎన్ గారు రచించిన ఆంధ్రతాత్పర్య సహిత వ్యాఖ్యానాన్ని కూడ ప్రచురించారు.

మా గురుదేవులు శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యులు (ఎస్.వి.ఎన్) గారు విజయగరం సంస్కృత కలాశాలలో విద్యాప్రవీణ, భాషా ప్రవీణలు చదివారు.


జ్యోతిష, న్యాయ, వేదాంత శాస్త్రాలలో నిష్ణాతులు. 1947 నుండి 1973 వరకూ అదే కలాశాలలో పండిత పదవిని అలంకరించారు. తెలుగు శాఖకి అధిపతి గా బాధ్యతలు నిర్వహించారు.

1969 - 1972 వరకూ అదే కలాశాలలో భాషాప్రవీణ చదివిన నేను వారి శిష్యులలో ఒకడినై కనులారా వారిని తిలకిస్తూ, చెవులారా వారి పాఠ్య బోధనామృతాన్ని గ్రోలే అదృష్టానికి నోచు కున్నాను.

గురుదేవులు మాకు అనంతుని ఛందస్సు, ప్రౌఢవ్యాకరణం, అహోబల పండితీయం, అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, రాఘవపాండవీయం మొదలయినవి బోధించారు. 16వ శతాబ్ది నాయకరాజుల యుగం ప్రత్యేకాంశంగా మాకు బోధించారు.

శ్రీ ఎస్.వీ.ఎన్ గారు ప్రౌఢ వ్యాకరణానికి చక్కని వ్యాఖ్య వెలయించారు. అలాగే అనంతుని ఛందోదర్పణానికి తత్త్వబోధినీ వ్యాఖ్య రచించారు. అప్పటి వరకూ ఈ గ్రంథాలకు సర్వ సమగ్రమయిన వ్యాఖ్యాన గ్రంథాలు లేవు.

ఛందోదర్పణానికయితే అసలు వ్యాఖ్యలే లేవు. ఆ ఘనత మా గురుదేవులకే దక్కింది !

గురువులు నాచన సోమన ఉత్తరహరివంశానికీ, చేమకూర వేంకట కవి విజయ విలాసానికీ కూడా చక్కని వ్యాఖ్యలు రచించారు. ( ఇవి రెండూ అముద్రితాలు, దురదృష్టవశాత్తు నేడు అలభ్యాలు కూడా.)

శ్రీనివాస స్తుతి పేరుతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై శతకాన్ని రచించారు.

శ్రీకూర్మనాథ సుప్రభాతం రచించారు.

నాట్య శాస్త్ర రచనలో పోణంగిపల్లి అప్పారావు గారు, తూమాటి దొణప్ప గారు మొదలయిన ఎందరో సాహితీ వేత్తలకు. పరిశోధకులకూ వీరు అందించిన సహకారం అనన్యసామాన్యమైనది.

చెరగని చిరు నవ్వు , అవ్యాజమైన వాత్సల్యాన్ని కురిపించే చూపులూ, మృదు మధురమైన మాట తీరూ, నిరాడంబరమైన జీవన శైలీ మా గురు దేవులకే స్వంతం.

మాకు ప్రౌఢ వ్యాకరణమో, ఛందో దర్పణమో పాఠ్యాంశంగా బోధించడానికి , తాము స్వయంగా చక్కని వ్యాఖ్యానాలు ఆ పుస్తకాలకి రచించి కూడా తరగతి గది లోకి రావడానికి ముందుగా ప్రతి రోజూ ఆ పుస్తకాలను శ్రద్ధగా తిరగెయ్యడం చూస్తే
అంత గొప్ప గురువల వద్ద చదువు కొనే మా భాగదేయం మాకే దక్కింది కదా అని గర్వించే వాళ్ళం.

ఈ శతజయంతి సంచిక గురించి మరిన్ని వివరాలు కావాలనుకునే వారికి :

శ్రీభాష్యం శ్రీనివాసాచార్యలు, 101, లక్ష్మీ నిలయం, తిరుమల నగర్, మీర్ పేట, మౌలాలి, హైదరాబాద్40,
ఫోను నంబరు: 27241942 మరియు 9866474202 చిరునామాకి సంప్రదించ వచ్చును.

గురుభ్యో నమ:

ఇతి శివమ్.





6, జులై 2011, బుధవారం

గుండె తడి ... కథల సంపుటి ... ఒక సమీక్ష



నా ‘ గుండె తడి ’ కథల సంపుటి గురించి ఈ వారం ( 13.7.2011) దీ సంచికలో బుక్ చాట్ శీర్షికలో ప్రచురిత మైన ‘శ్రీవత్స‘ గారి పుస్తక సమీక్ష చదవండి ...


2, జూన్ 2011, గురువారం

కంట తడి పెట్టించిన కథల నామిని ... ఒక నిందా రూప స్తుతి



ఈ నెల ( మే 2011 ) పాల పిట్ట మాస పత్రిక చదివేరా?

అందులో కంట తడి పెట్టించిన కథల నామిని శీర్షికన ఖమ్మం నుండి శ్రీధర్ రాసిన ‘‘నామిని, నెంబర్ వన్

పుడుంగి ’’ పుస్తకం మీద ఒక సమీక్షా వ్యాసం ప్రచురించారు.

నిందా స్తుతి రూపంలో వచనంలో వచ్చిన ఇంత గొప్ప సమీక్షా వ్యాసం ఇటీవల నేను చదివి ఉండ లేదు.

అమ్మీ, పెబోవతీ ... అనే సంబోధనతో మొదలై

యెట్టా యేగుతున్నావమీ, ఈ నా బట్టగానితోని, పెద్ద పుస్తకం రాసి కాపరాన్ని దేశమంతా రచ్చ రచ్చ చేసినాడు

గదమ్మీ ... అనే వాక్యాలతో నామిని కొత్త పుస్తకం ’’ నామిని, నెంబర్ వన్ పుడుంగి‘‘ మీద రాసిన నిందా రూప స్తుతి చివరి అక్షం వరకూ ఉగ్గబెట్టి చదివిస్తుంది.

పచ్చ నాకు సాక్షిగా , సినబ్బకతలు, ముని కన్నడి సేద్యం, చదువులా ? చావులా? తో పాటు నామిని రాసిన ఈ కొత్త పుస్తకం ‘‘ నామిని, నెంబర్ వన్ పుడుంగి’’ వెంటనే కొనుక్కుని చదివేలా చేస్తుంది.

పుస్తకం చదివేక, నామిని పుడుంగి అవునో కాదో తేల్చు కోవలసినది మనమే.

పాలపిట్ట మాస పత్రిక వివరాలు:

పాలపిట్ట,

ప్లాట్ నె.3, ఎంఐ.జి - 2, బ్లాక్ -6,

ఏ.పి.హెచ్.బి. , బాగ్ లింగంపల్లి,

హైదరాబాద్ - 500 044

ఫోన్: 040 - 27678430

సెల్: 9848787294

మెయిల్: palapittabooks@gmail.com



24, మార్చి 2011, గురువారం

డా. ముద్దు వెంకట రమణారావుకొత్త పుస్తకాలు

డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గురించి కథా మంజరి లో ‘‘ విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం’’అనే శీర్షిక లో వారి పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.

అవి:

1. రమణీయం ( కవితా వ్యాస సంపుటి)

2. కమనీయం ( కవితా సంపుటి)

3. ఉదయ కిరణాల (వ్యాస సంపుటి)

4. మహనీయం ( కవితా సంపుటి)

5. సంధ్యారాగం ( వ్యాస సంపుటి )

ఆ వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.

ఇక, ఇటీవల వారు ‘‘వెన్నెల వెలుగులు ’’ అనే వ్యాస సంపుటిని, ‘‘ అనలానిల గీతాలు ’’ అనే కవితా సంపుటిని కొత్తగా వెలువరించారు.

వాటి గురించిన క్లుప్త పరిచయం:

వెన్నెల వెలుగులు:

ఇందులో వివిధ అంశాల మీద సాధికారికంగా వారు వ్రాసిన 33 వ్యాసాలు ఉన్నాయి.

ఈ పుప్తకానికి అక్కిరాజు రమాపతిరావు గారు సాహితీ కదంబం పేరిట ముందు మాటను, డా.ఎస్.వి. సత్యనారాయణ గారు వ్యాస వెన్నెలకు అభినందన పేరిట ఆప్తవాక్యాలను వ్రాసారు.

అక్కిరాజు వారు ఈ గ్రంథాన్ని ప్రపంచ సాహిత్యాన్ని స్థూలంగా ఎరుక పరిచే పెద్దబాల శిక్షగా అభివర్ణించారు.వీటిలో చిత్రణలు మన మనసుని ప్రపంచ యాత్ర చేయిస్తాయి అని చెబుతున్నారు.

అంతగా ప్రాచుర్యం పొందని కావ్యాలను సైతం మరుగున పడి పోకుండా, సామాన్య పాఠకులకు పరిచయం కలిగించడమే ధ్యేయంగా వీటిలో కొన్ని వ్యాసాలను వారు రచించడం జరిగింది. అద్దంకి కేశవరావు గారి తథాగతీయం ఐతిహాసిక కావ్యం గురించిన వ్యాసమే ఇందుకు నిదర్శనం. తాము చెప్ప దలచుకున్న విషయాన్ని నిదానంగాభావించి, పాఠకుల సంభావింప చేసే నైపుణ్యం గ్రథనంలోనూ, కథనంలోనూ కనబడుతుంది అని రమణారావు గారిని అక్కిరాజు ప్రశంసించారు. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చూపే అంతర్వీక్షణం, ప్రపంచాన్నంతా తెలియాలన్న ఆర్తి ఉండాలని, అవి రమణారావు గారిలో పుష్కలంగా ఉన్నాయని, అందు చేతనే ఈ వ్యాస సంపుటి ఇంత సరళ సుందరమై, సుబోధకమై, విషయావగాహనా సమన్వితమై, ఆసక్తి పరులైన తెలుగు వారికి అత్యంత సన్నిహితంగా చేరువయ్యేలాగున వెలువడిందని అక్కిరాజు రమాపతి రావు గారు అభిప్రాయ పడడం సహేతుకమే అనిపిస్తుంది.

డా.ఎస్.వి.సత్యనారాయణ గారు తమ ఆప్త వాక్యంలో చర్విత చర్వణంగా పూర్వ సాహిత్య సౌరభాల గురించి లోగడ విమర్శకాగ్రేసరులు చెప్పిన విషయాలనే తిరిగి చెప్పకుండా, వారు దర్శించిన వినూత్న సాహిత్యాంశాలను రేఖామాత్రంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సదాశయంతో రమణారావు గారు ఈ వ్యాస వెన్నెలను రూపొందించారని చెబుతున్నారు.

ఆయా సాహిత్యాంశాలలో చక్కని పరిశ్రమ చేసి కూడా, సామాన్య పాఠకజన పఠనపరిశ్రమని గణన లోనికి తీసుకుని నాతి దీర్ఘమైన రీతిలో ఈ వ్యాసాలను రచించడం జరిగిందని రచయిత తమ ముందు మాటలో తెలియజేసారు.

ఈవ్యాస సంపుటిలో వసు చరిత్రం, ఆముక్త మాల్యద, అనిరుద్ధ చరిత్రము, తొలి అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, ఐతిహాసిక కావ్యం తథాగతీయం, వంటి గొప్ప ప్రాచీన కావ్యములను గురించిన అనుశీలనమే కాక, నాయని సుబ్బారావు కృతులు, జాతీయోద్యమ కాలం నాటి రచనలు, ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథకులు, మరాఠీ నాటక కర్త విజయ్ తెందూలక్కర్, విక్టోరియా యుగం నాటి ఆంగ్ల సాహిత్యపు పోకడలు, రష్యన్ సాహిత్య పరిచయం, అప్పటికీ ఇప్పటికీ షేక్స్పియర్, లాంటి వ్యాసాలు పొందు పరిచారు.

సంగీతాభిమానులైప ఈ రచయిత వాటికి సంబంధించిన కొన్ని మంచి వ్యాసాలను కూడ ఇందులో జత చేసారు. హిందూస్థానీ శాష్త్రీయ సంగీత పరిచయం, సూర్య కుమారి జాతీయ గీతాలు ఈ కోవకి చెందిన వ్యాస రచనలు.

వీరికి చిత్రకాళాభినివేశం కూడ మెండు. ఆధునిక చిత్ర కళ, ఆంధ్ర చిత్ర కళ వంటి లఘు వ్యాసాలను చదివితే ఈ విషయం కాదనలేం.

ప్రాచీన, అర్వాచీన సాహిత్య గ్రంథాల పట్ల అభిరుచి కలిగి ఉండడం, తగినంత కృషి చేసి సంస్కృత సాహిత్యం అధ్యయనం చేయడం తాను అనుభవించిన వాటిని అక్షరాలలో అందంగా పలవరించడం, పదిమందితో పంచు కోవడం వీరికి చాల ప్రీతి పాత్రమైన విషయంగా తోస్తుంది. అది. సాహిత్యం, చిత్ర కళ, నృత్య రీతులు, శిల్పం, పర్యటనానుభవాలు , సంగీతం ... ఏదయినా కావచ్చును. వాటి ఆనుపానులు తెలుసు కోవాలనే అనురక్తి వీరిలో మెండు. తెలిసిన దానిని, తెలుసుకున్న దానిని, సామాన్య పాఠకులకు తెలియ జేయాలనే ఆర్తి కూడ ఎక్కువే. ఎదిగిన కొద్దీ ఒదిగే మనస్తత్వంతో,

వీరు ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్నీ అక్షర బద్ధం చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతులయ్యారని ఈ పుస్తకాలే చెబుతున్నాయి.

ఈ వ్యాస సంపుటిని వీరు తమ బాల్య మిత్రులు, సహృదయులు, విద్యా వేత్త, అశేష శేముషీ ధురంధరుడు, కీ.శే. ఆచార్య తూమాటి దొణప్ప ( మాజీ వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం) మధుస్మృతికి అంకితం చేసారు.

ఇక, వీరు ప్రచురించిన కొత్త కవితా సంపుటి అనలానిల గీతాలు:

62 కవితలు గల ఈకవితా సంపుటికి డా.సి.నారాయణ రెడ్డి గారు, డా,ఎన్. గోపి గారు అభినందన వాక్యాలు అందచేసారు.

భావపూర్ణంగా, సముచిత పదనిహితంగా పాఠకులకు అందించే సృజనాత్మక ప్రతిభ రమణారావు గారిదని సి.నా.రె ప్రశంసించగా,అనలానిల గీతాలలో అనల గీతాలు ( అగ్నికి సంబంధించినవి) అనిలగీతాలు ( వాయువుకి చెందినవి) , వాటి గూర్చిన కవితాలాపన, తాత్వ్తిక స్పర్శ కనిపిస్తున్నదని ఆచార్య గోపి వివరించారు. మృదుత్వం, తగ్గని ప్రౌఢశైలిలో రాసిన పద్యాలు రమణారావు గారి కవితా శక్తిని తెలియ జేస్తాయి అని అభినందిస్తున్నారు.

వీటిలో అనలానిల గీతాలే కాకుండా అన్య వస్తు సంబంధితాలయిన మరి కొన్ని కవితలను కూడ చేర్చడం జరిగింది.

వీటిలో అనల గీతాలు 15, అనిల గీతాలు 12, ఇతరములు 31, అనువాద గీతాలు 4 మొత్తం 62 కవితలు చేర్చారు. సంఖ్యాపరంగా ఇతర గీతాలు, అనువాద కవితలు అనలానిల గీతాల కన్న ఎక్కువ కనిపించే ఈ కవితా సంపుటికి అనలానిల గీతాలు అనే పేరు ఉంచడం చిత్రమనిపించినా, అసంగతంగా తోచదు. పాంచభౌతిక పరివ్యాప్తమైన లోకంలో అనల స్పర్శ, అనిల స్పర్శ లేనివి ఏవీ ఉండనేరవు అనే స్పృహ ఈ కవి లో ఉండడం చేత దీనికి అనలానిల గీతాలు అనే పేరు సముచితమని భావించి ఉంటారు.

అనల గీతాలు అగ్నిమీళే పురోహితమ్ అనే వేద వచనంతోను, అనిల గీతాలు మలయానిల గీతం తోను మొదలు పెట్టడం వీరి ఔచితీ ప్రదర్శనకు తార్కాణ.

ఈ కవితా సంపుటిలో వీరి కవితా సామర్ధ్యానికి ఉదాహరణ ప్రాయంగా కొన్ని కవితా పంక్తులని చూడండి:

అణువునణువున నిక్షిప్తమైన అగ్ని

జఠర మందు జీర్ణాగ్నిగా జ్వలనమందు

ప్రాణులన్నిట వెలిగెడి ప్రాణ జ్యోతి

పీడితుల మానసమ్ముల విప్లవాగ్ని.

అగ్ని గీతం అనే శీర్షికన వెలువరించిన ఈ చిన్ని కవితలో ప్రాణులన్నిట వెలిగే అనల జ్యోతి పీడితుల మనస్సులలో రగిలే విప్లవాగ్నిగా అభివర్ణించడం కవికి గల అభ్యుదయ దృక్ఫథాన్ని తెలియ జేస్తోంది.

ఒక దీపం చాలు వేయి దీపాలను వెలిగించును అనే భావనకు పద్య రూపం:

ఒక్క దీపమ్ముతోడ ప్రద్యోతమౌను

శతసహస్ర దీపమ్ములు ; సకల శుష్క

వనములనెల్లను దావాగ్ని కణము కాల్చు

మంచి చెడ్డల రెంటిని పంచునగ్ని.

ఇక, అనిల గీతాలలో తొలియూరుపు అనే కవిత గొప్ప తాత్త్విక కోణం ఆవిష్కరించే కవిత.

తొలియూరుపు నుండి కడపటి యూరుపు వరకు జీవధార ప్రవహింపగ, చేతన ప్రభ వికసింపగ అవిరామంగా ప్రసరించే మారుత తరంగాలకు కవి అంజలి ఘటిస్తున్నారు.

అనిల గీతాలాపనలో గాలిలో కలసి పోయిన కాలకూట విషవాయువు బారిన మృత్యువాత పడిన అసంఖ్యాక జనుల మృత్యు ఘోష విషవాయువు కవితలో వినిపిస్తున్నారు. ఇది వీరి సామాజిక స్పృహకు నిదర్శనం.

భీకర దృశ్యమ్మది

వేలకొలది జనులు

విగత జీవులైన వేళ

విషాద చరిత సృష్టించును

అని చెబుతూ ఈ దండనీతి యేరీతిగ సాగిందని, ఎవరు దీనికి బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.

ఇతర గీతాలలో చక్కని గీతాలు కనిపిస్తాయి. సెల్ ఫోన్, టైమ్ మిషీన్ వంటి చమత్కార జనితాలయిన కవితలను ఈ విభాగంలో చూడవచ్చును.

మనలోనే కాలయంత్రములు

మనస్సులోనే ఇమిడి వున్నవి ...

అంటూ, మన ఙ్ఞాపకాలే గత కాలం లోకి మనలని మోసుకుని పోతాయనీ, మన కలలే భావి మార్గంలోకి మనలను పయనింప చేస్తాయనీ, అందు వలన కడు క్లిష్టమైన ఖరీదయిన యంత్రాలతో పని లేదని వివరణ యిస్తున్నారు.

ఈ కవి తమ కవితావేశాన్ని ఇలా అక్షరీకరిస్తున్నారు:

కవితావేశము పొంగు వేళల లసత్

కావ్యాకృతుల్ మన్మనో

భవమై, సుందర పద్య గేయ రచనల్

భాసించు స్వేచ్చా విధిన్

మివులన్ సమ్మదమై, నవరసో

న్మీలమ్ముగా వ్రాసెదన్

ఇవినా తప్పులుగా బుధుల్ తెలిసి

సైరింపంగ ప్రార్ధించెదన్.

ఈ కవితాభివేశం యిలాగే నిండు నూరేళ్ళు కవిలో ఉండాలని కోరుకుందాం,

ఈ కవితా సంపుటిని వారు తమ ఆప్తుడు, సహృదయుడు, కవి, పండితుడు అయిన కీ.శే. పంతుల విశ్వనాధ రావు మధుర స్మృతికి అంకితం ఇచ్చారు.

సుందరంగా వెలువడిన ఈ రెండు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),వారు ప్రచురించారు. వారి ప్రథాన కార్యాలయం శ్రీకాకుళంలో ఉంది. వెన్నెల వెలుగులు వ్యాస సంపుటి వెల రూ. 125. కాగా, అనలానిల గీతాలు కవితా సంపుటి రూ.75 లకు లభిస్తోంది.

ఇతర వివరాలకు: శ్రీరామిశెట్టి, ప్రథాన కార్యదర్శి,

ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం వీధి,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001

పెల్: 9441707772

చిరునామాకి సంప్రదించ వచ్చును.

లేదా, నేరుగా రచయిత గారినే పంప్రదించ వచ్చును. వారి చిరునామా:

డా,యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ

రిటైర్డ్ సివిల్ సర్జన్

ప్లాట్ నం. 211, ఎస్.బి.ఐ కాలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001

ఫోన్: (08942)223143 సెల్: 9849696511