4, ఆగస్టు 2010, బుధవారం

విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం


శ్రీ ముద్దు వెంకట రమణా రావు విశ్రాంత నేత్ర వైద్య నిపుణులు.

వీరికి తెలుగు, సంస్కృత సాహిత్యాల పట్ల ప్రగాఢ మైన అభిమానం,అభిరుచి. సంగీతంలో కూడ మంచి ప్రవేశం ఉంది. ఎనభై సంవత్సరాల వయసులో కూడ ఉరక లేసే ఉత్సాహంతో సాహితీ సేద్యం చేస్తున్నారు. వివిధ సాహిత్య సంస్థలతోనే కాక, సంగీత సమాఖ్యలతో కూడ సన్నిహితంగా మెలుగుతూ ఆయా సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

కీ.శే. యం. లక్ష్మణ మూర్తి, సూర్యకాంతం దంపతులు వీరి తల్లిదండ్రులు.

11-09-1930 వ తేదిన ఒరిస్సా గంజాం జిల్లా కాశీనగరంలో పుట్టిన వీరు వైజాగ్ ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి యం.బి.బి.యస్ , యం.యస్.డి.ఒ పట్టాలు పొంది, పి.జి. డిప్లమో చేసారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసారు.

అరవైయ్యవ దశకంలో ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి వంటి పత్రికలలో కొన్ని చక్కని కథలు వ్రాసిన ఈ నేత్ర వైద్యులు వృత్తి రీత్యా సమయాభావం వలన అడపా దడపా రచనలు చేస్తున్నా, వాటిని పత్రికలలో ప్రచురించ లేదు. ఉద్యోగ విరమణ చేసాక, తమ చిన్న నాటి ఆత్మీయ మిత్రులు శ్రీ గొర్తి సత్యనారాయణ గారు ఇచ్చిన ప్రేరణతో ఇటీవల తమ రచనలతో వరుసగా ఐదు చక్కని పుస్తకాలను వెలువరించారు.

అవి:

రమణీయం

సంధ్యారాగం

ఉదయ కిరణాలు

కమనీయం

మహనీయం

భావుకతకూ, లోకవృత్తాలను సహేతుకంగా విమర్శించే డాక్టరు గారి నిపుణతకూ,విస్తారమైన వారి అధ్యయన సాధికారతకూ, నిదర్శన ప్రాయంగా నిలిచే ఈ పుస్తకాలను మీకు ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను.


1.రమణీయం

ఇదొక అపురూపమైన సాహితీ కదంబమాల అని చెప్పుకో వచ్చును. ఇందులో 48 కవితలు , 8 అనువాద గేయాలు, 07 సాహితీ వ్యాసాలు, వివిధ అంశాల మీద వ్రాసిన వ్యాసాలు 11 , ఇంకా 03 గల్పికలు,08 కథలు పొందుపరిచారు. అంతే కాక వారి అన్న గారి సమస్యాపూరణలు, పద్య రచనలు కూడ చేర్చి వారి పట్ల తమ ఆదర భావాన్ని ప్రకటించుకున్నారు.

వీరి కవితా ధారకి ఉదాహరణ ప్రాయంగా మచ్చుకి:

ఆకలి దప్పుల నల్లలాడిననే

అన్నోదకముల విలువలు తెలియును

సోపాన పంక్తుల నెక్కిననే కద

సౌధోపరి సౌందర్యము కనవిందగు ... అంటూ సాగే సాధన అనే గీతం,

సుభగ శరీర సురభిళా

సుగుణ సౌశీల్యా విరళా

సౌందర్యజిత చంద్రకళా

విరహిణీ, కాంతామణీ, ఊర్మిళా ! ... అంటూ సాగే ఊర్మిళ పద్యాల ఖండ కావ్య రచనా ...

మధుర రసాల వనమనోఙ్ఞమ్ము

కదళీ నారికేళ కేదారమ్ము

కుల్య తటినీ తటాక వికసిత

కుముదవనజ పుష్ప వన నికాయమ్ము ... అని కోనసీమ అందాలను తనివితీరా వర్ణించిన పద్యాలూ ... ఎంతగానో అలరిస్తాయి. అందమయిన పదాల పొందిక, చక్కని మధురమయిన శైలీ విన్నాణమూ, ఈ పద్యాలను, కవితలను ఎంతో రసవంతములుగా అందించేందుకు కవికి ఉపకరించిన ఉపకరణాలు.

అనువాద గేయాల విభాగంలో ...

ముందుగానే తెలిసి ఉంటే

చివరగా మనము చినుకు లోన

కలిసి నడిచే భాగ్యమదియని

ముందుగానే తెలిసి వుంటే

వాన లోనే రాత్రి అంతయు

వదలకుండగ నీ కేలు పట్టి

హృదికి హత్తుకు గడిపియుందును ... అని సాగే మధురమయిన అనువాద రచనలు ఉన్నాయి.

కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి, గరిమెళ్ళ , పాల్కురికి సోమన మున్నగు వారి గురించే కాక, మేఘసందేశం, కళల ప్రయోజనం, దళిత కవిత్వం మొదలయిన వాటి మీద విశ్లేషాణాత్మక వ్యాసాలు సాహితీ వ్యాస విభాగంలో కనిపిస్తాయి.

వీరి గల్పికలు, కథలు కూడ చదివించే రచనలు. కథా రచయితగా వీరి సామర్ధ్యాన్ని చాటేవిగా ఉన్నాయి.

శ్రీ ముద్దు నరసింహ మూర్తి , స్వర్గీయ సీతా లక్ష్మి దంపతులు.

శ్రీ రమణారావు గారు తమ రమణీయం గ్రంధంలో తమ అన్నగారయిన నరసింహ మూర్తి గారి పద్య రచనలు కూడ కొన్ని చేర్చి ప్రచురించారు.

తెలుగు భాషాభిమానం, కవిత్వాభిమానం గల వీరి సోదరులు వ్రాసిన కొన్ని

సమస్యాపూరణ పద్యాలు, మరి కొన్ని ఆంగ్ల సామెతలకు తెలుగులో పద్యానువాదాలు ఇందులో అలరిస్తున్నాయి.


ఈ పుస్తకం వారి జననీ జనకులకి అంకితం చేసారు.

ఇక, రెండో పుస్తకం ...




2.సంధ్యారాగం

ఇది వివిధ విషయాల మీద తన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ, తన భావాలను చదువరులతో పంచుకోవాలనే ఆకాంక్షతో వ్రాసిన 56 వ్యాస రచనల సంపుటి.

ఇందులో తెలుగు సాహిత్యం,విదేశీ సాహిత్యం, సంగీతం , చరిత్ర, పర్యటన, వైద్యం, గురించిన వ్యాసాలతో పాటు కొన్ని ఇతర అంశాల గురించినవ్యాసాలు,

7 వ్యాస సదృశ గల్పికలూ చోటు చేసుకున్నాయి.

వీటిలో కుమార సంభవం, శతక రచనలు, బాపు రెడ్డి కవిత్వం, శోభిరాల కావ్య సంపద, వంశధార కథలు, కథా వార్షికలు 2004, 05 ల మీద సమీక్షా వ్యాసాలు మొదలైనవి ఉన్నాయి.

విదేశీ సాహిత్యం గురించిన వ్యాసాలలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిసిజమ్ , ఫ్రెంచి సాహిత్య పరిచయం చోటు చేసుకోగా, సంగీత విభాగంలో పాశ్చాత్య సంగీతాన్ని గురించీ , సంగీత రావు గారి గురించి వ్రాసినవి ఉన్నాయి.

పర్యటన, వైద్య విభాగాల్లో చేర్చిన వ్యాసాలు వారి అనుభవ సారంగానూ. వారి యాత్రా ప్రియత్వాన్నీ వ్యక్త పరిచేవిగానూ ఉన్నాయి.


రచయిత ఈ పుస్తకాన్ని ఆది దేవుడు సూర్య నారాయణ మూర్తికి అంకితం చేసారు.


3.ఉదయ కిరణాలు

వచన రచనా విభాగంగా వెలువరించిన ఈ పుస్తకం కూడ 45 వ్యాసాల సంకలనమే.

ఇందులో రఘు వంశం , సౌందరనందనం , పౌలస్త్య హృదయం , దీపావళి, ఫిరదౌసి, బసవ రాజు అప్పారావు, మొదలయిన వ్యాస శీర్షికలతో ఆయా కవుల రచనల గురించి పరిచయ పూర్వక విశ్లేషణాత్మక వ్యాసాలు కనిపిస్తాయి. తెలుగు కవులనే కాక, ఈ విభాగంలో షేక్స్పియర్, ఇలియట్ వంటి వారిని గురించిన వ్యాసాలూ ఉన్నాయి. ఇవి కాక, వేదాంతం, మతం , వాణిజ్యం, స్త్రీ స్వేచ్ఛ , గ్లోబలైజేషన్, చారిత్రక ప్రదేశాల పరిచయం, దర్శనీయ క్షేత్రాలు ,మనోవిశ్లేషణ ... యిలా భిన్న భిన్న అంశాల గురించి అలవోకగా వ్రాసిన లఘు వ్యాసాలు మనలని అలరిస్తాయి.

రచయిత ఈ పుస్తకాన్ని తమ ఆత్మీయ బాల్య మిత్రులు శ్రీ గొర్తి వెంకట సత్య నారాయణ మూర్తి గారికి అంకితం చేసారు.


4.కమనీయం

ఇది కవితా సంపుటి. 73 కవితలతో ఈ కవితా సంపుటి వెలువరించారు.ప్రతి కవిత లోనూ వారి కవితా తత్వం, రసభావ బంధురమయిన వారి మనోఙ్ఞమైన శైలి, భాషా విషయకంగా వారి ప్రతిభా సంపద గోచరిస్తూ ఉంది. ఛందో గంధంతో పరిమళించే వారి కవితలు ధారా శుద్ధితో ప్రశంసనీయంగా ఉన్నాయి.

కవి గారు ఈ కవితా సంపుటిని వారి సోదరి, స్వర్గీయ ముద్దు(చుండూరు) శకుంతలకు అంకితం చేసారు.

మచ్చుకి ఒకటి రెండు కవితలు ...

నవాబుల దర్బారు హాలులా

నగరం వ్యాపించివుంది

భారతి మేఖలాపతకంలా ప్రకాశించు నగరం

తెలుగు తల్లి నుదుట తిలకం

తెలుగు చరిత్రకు స్వర్ణ ఫలకం

( భాగ్య నగరం)

ద్వేష దౌర్జన్యపూరిత తీవ్రవాద

కంటకావృత శిధిల మార్గాన నేల

శాంత్యహింసా సుహృజ్జీవ సాధు భావ

సత్య సౌలభ్య పథమున సాగి పొమ్ము

(అనుసరణీయం)

తల్లి వడి లోన వెచ్చగ తనువు మరచి

శాంత్యమాయక భావాల స్వాదు రసము

నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ

చింత లెఱుగని పొన్నారి చిట్టి పాప

(నిద్ర)


5 మహనీయం

ఆ కావ్య సంపుటిలో పద్య విభాగంలో 64 ఛందోసుందరమయిన పద్యరచనలు, గేయ కవితా విభాగంలో 61 గేయాలూ , అనువాద కవితల విభాగంలో 9 అనువాద కవితలూ చేర్చి ప్రచురించారు.

ఈ కవికి మిక్కిలి ప్రీతి పాత్రమైన ప్రకృతి వర్ణన, ఋతు వర్ణనలు ఇందులో సజహజంగానే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే యాత్రాప్రియులైన వీరు దేశ దేశాలు తిరిగి, తాను చూసిన అందమయిన ప్రదేశాలనీ , ఆ అందాలనీ కూడ మనతో పంచుకోవడం కనిపిస్తుంది.

ఇవే కాక, వివిధ కవుల గురించిన మనోహరమయిన పద్యాలు, కావ్య ప్రశంసలు, భగవదారాధనలు, జాతీయ భావనలు, రాష్ట్ర గానాలూ. సంగీతకారుల ప్రశంసలూ, ... ఇలా ఒకటేమిటి, వైయక్తిక పులకరింతల పలవరింతలూ, అనుభవాల గిలిగింతలూ, తల పోతల కలబోతలూ ... ప్రతి కవితలోనూ అందంగా అక్షరీకరించి మనకి అందించారు.

మచ్చునకు ఒకటి రెండు ...

ఉత్పలమాలికాభరణుజ్జ్వల నీల శరీర తేజుడున్

సత్పరిపాలకాశ్రయుడు, శర్వవిరించి మహేంద్రపూజ్యభా

స్వత్పరిపూర్ణ సద్గుణుడు, సర్వ జగత్పరిపాలకుండు, మా

ఉత్పల వారికిచ్చుత శుభోన్నత జీవన శాంతి సౌఖ్యముల్

(ఉత్పల కవివర్యునికి సమర్పించిన శుభ కామన... ఉత్పల అనే శీర్షికతో ఛందస్సుందర మయిన పద్య కుసుమాలు.)

గ్రంధకర్త ఈ కావ్య సంపుటిని నిత్య కల్యాణ శోభితుడు కొండలరాయునికి అంకితం చేసారు.

ఈ ఐదు పుస్తకాలూ రచయిత ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృ తిక సమాఖ్య, శ్రీకాకుళం వారి సహకారంతో ప్రచురించారు.

(త్వరలో వెలువడనున్న వీరి రచనలు: ఒక కవితా సంపుటితో పాటు

వెన్నెల వెలుగులు ( సాహిత్య వ్యాసాలు) , ఇంగ్లీషు – తెలుగు మెడికల్ డిక్షనరీ.)

ఇప్పటికి ప్రచురితములయిన ఈ ఐదు పుస్తకాలు చదవాలన్నా, రచయిత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరినా, క్రింది చిరునామాలకు సంప్రదించాలి:

డా. యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ.,

రిటైర్డ్ సివిల్ సర్జన్,

ప్లాట్ నెంబర్: 11, శ్రీ కోలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం 532001

ఫోన్: (08942)223243.

లేదా,

శ్రీ రామిశెట్టి, ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర ప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య,

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం,

శ్రీకాకుళం 532001

ఫోన్ (08942)278572

ఈ పుస్తకాలు విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను, బుక్ సెంటర్ (విశాఖ పట్నం) . నవోదయ బుక్ హౌస్, కాచి గూడ, హైదరాబాద్ వారి దగ్గర లభిస్తాయి.

3 కామెంట్‌లు:

Sudha Rani Pantula చెప్పారు...

అవిశ్రాంతంగా సాహితీ సేద్యం చేస్తున్న కృషీవలుడు, విశ్రాంత నేత్రవైద్యులు డా.ముద్దు రమణారావుగారి గురించి, వారి సాహిత్యసేవ గురించి ఎంతో చక్కగా పరిచయం చేసారు. వారు బ్లాగులోకంలో కూడా ఇటీవల ప్రవేశించారు.http://kamaneeyam.blogspot.com/ ఈ బ్లాగునుంచి కమనీయమైన,రమణీయ రచనలను వెలువరిస్తారని ఎదురుచూస్తున్నాం.

Lakshman .M. V. చెప్పారు...

the year of birth has been mentioned as 1830; it should read as 1930.

కథా మంజరి చెప్పారు...

@ శ్రీ సంఘ మిత్ర గారికి. నమస్కారం.

నిజమేనండీ. Typing లో ఆ తప్పు దొర్లినట్టు నేను చూసుకో లేదు. ఇప్పుడు సవరించాను. మీకు నా ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి