మన సాహితీ సంపద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన సాహితీ సంపద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2014, బుధవారం

గాన గంధర్వుని గొంతులో జాషువా కవి గారి శిశువు ఖండ కావ్యం




శిశువు గురించి శ్రీ జాషువా కవి  పద్యాలు

గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

జాషువా పద్యాలకి వివరణ అక్కర లేదు. అయినా, కొద్దిపాటి వివరణ ...
పాట పాడితేనే కాని నిద్దుర పోడు. తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుకలాగా ఒరిగి పోతాడు. ఆ లేత వయసులోనే కండలు తిరిగిన పిల్ల వస్తాదులా ముద్దొస్తాడు. ఎంత భాగ్యవంతుడో ! ఉయ్యేల దిగకుండానే అన్ని పనులూ జరిపించుకుంటాడు. ఉ ఊ అనే రెండక్షరాలు నేర్చిన వింత చదువరి. సతిని తాకని సాంబ శివుడిలా ఉంటాడు. కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పర దేశి. తన యింటికి కొత్త యజమాని. ఈ భూమి మీదకి ఏ రాచ కార్యం చేడానికి వచ్చేడో కదా ? కొంచెం నడక రానీ, అప్పుడు అడుగుదాం. ముందు ముందు వయసు వచ్చేక ఎలాగ ఉంటాడో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం ఈ చిన్నారి శిశువుకి ఏ పాపం తెలియదు !!

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర


తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో అన్నం , నీరు లేకుండా గడిపి, ప్రయాణం చేసి వచ్చిన బాట సారి. చిమ్మ చీకటిగా ఉండు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణ స్వరూపుడు. నునుపైన చెక్కిళ్ళలో బోసి నవ్వులలో ముద్దులు కురిపించే మోహనాకారుడు. తరగని తల్లి పాలు అనే మధు ధారలను తన అన్నంగా తచ్చుకున్న అతిథి.బట్ట కట్టుకోడు. సిగ్గు పడడు. నేల తల్లి అనే బడిలో చేరి ఇంకా వారం అయిందో, లేదో, మా ప్రకృతి కాంత వీడికి ఆకలీ నిద్రా నేర్పించింది.

ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

పడుకున్న ఊయ్యేల తొట్టి వాడికి ఏం ఉపదేశం చేస్తందో కానీ, ఒంటరిగా ఊ కొడుతూ ఉంటాడు. తల్లితో ఏ జన్మల సంబంధమో కాని ఏడ్చి సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఆ దేవ దేవుడు అతనితో ఏ సల్లాపాలు చేస్తాడో తెలియదు భలే భలే అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటాడు
ఈ మూడు రోజులలో ఎప్పుడు నేర్చుకున్నాడో వెర్రి తండ్రి ఛీ ఫో అని సరదాకి అంటే ముఖం చిన్న బుచ్చు కుంటాడు. ఆ బుగ్గల లేతదనం తగ్గి, చదువు సంధ్యలు నేర్చకున్నాక ‘ నా బంగారు కొండ , నా రతనాల కొండ ’ అని తల్లి ముద్దుగా అంటూ ఉండే మాటలు నిలుపుకుంటాడో లేదో , చూదాం !

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు
దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?

తన చేతి గిలక పండుకి ముచ్చటలు చెబుతూ ఉంటాడు. అది తిరిగి పలక లేదని కోపం వచ్చి విసిరి కొడతాడు. పొరుగింటి ఆడవాళ్ళు చేర దీస్తే వెళ్ళడాని యిష్ట పడడు. తన పర భేద భావం వీడికి అప్పుడే తెలిసి పోయింది.  తేనె అంటే ఇష్టం రుచుల భేదం గ్రహించేస్తున్నాడు. పెద్ద చప్పుడుని వింటే చాలు భయంతో తల్లిని గట్టిగా కరుచుకు పోతాడు. ఇతనికి అరిషడ్వర్గాలు అనే ఆరుగురు శత్రువులలో ( కామం, క్రోధం, లోభం, మోహం, మదం , మాత్సర్యం) ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారు అప్పుడే వీడి మనసులో చేరుకున్నారు కదా ? వీడి జాతకంలో గొప్ప కీర్తిమంతుడవుతాడని ఉందో, బొత్తిగా అప్రతిష్ఠ పాలవుతాడని రాసి ఉందో కదా !!



29, మార్చి 2014, శనివారం

పద్యా లొక పన్నెండు ... ఉగాది శుభాకాంక్షలతో ...





సాహితీ మిత్రు లందరికీ ఉగాది శుభాకాంక్షలు ! ...

మీ ... కథా మంజరి.

ఉగాది సందర్భంగా ఒక కానుక. మీ కోసం రసవంత మయిన మంచి తెలుగు పద్యాలు వివరణలతో ఒకే చోట ...


వీటిలో కొన్ని లోగడ తెలుగు పద్యం వెలుగు జిలుగులు అనే శీర్షికన నవ్య వార పత్రికలో వెలువడ్డాయి.

ప్రస్తుతం ఇదే శీర్షిక తేనె లొలికే తెలుగు పద్యం పేరుతో ఆంధ్ర భూమి మాస పత్రికలో వెలువడుతోంది ...

వాటి లోనుండి ఓ డజన్ ఒకే చోట ... ( ఏ పద్యం చూడా లనుకుంటే దాని మీద నొక్కి చూడండి )

1.ఏమి తపంబు సేసెనొకొ ! ....
సోతన భాగవతం


2. శివుడిటు రమ్మటంచు ...
చేమకూర వేంకట కవి విజయ విలాసం


3. తగిలి మదంబుచే ...
మారద వెంకయ్య భాీస్కర శతకం

4. అంకముఁజేరి శైల తనయాస్తన ...
అ్లసాని పెద్దన మను చరిత్ర


5. కారే రాజులు రాజ్యముల్ కలుగవే ?
పోతన భాగవతం.

6. నానాసూన వితాన వాసనల ..
రామరాజ భూషణుడు వసు చరిత్ర


7. ఆతప భీతి నీడలు రయంబున ...
నన్నె చోడుడు కుమార సంభవం


8. కటకట లక్ష్మణా !
కంకంటి పాపరాజు  .. ఉత్తర రామాయణం

9. అజినాషాడ ధరుండు ...
శ్రీనాథుడు హర విలాసము

10. చింతా శల్యము వాసెనే ?
తిక్కన మహా భారతం

11. అదిగో ద్వారక !
తిరుపతి వేంకట కవులు పాండవోద్యోగం

12.నుతజల పూరితంులగు నూతులు ..
నన్నయ మహా భారతం.

10, ఆగస్టు 2013, శనివారం

భలే వాడి వయ్యా !



పారావారము నందు న
నారని పెను చిచ్చు వోలె హాలాహలమే
పారఁగ నద్దానిని మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై



భావం : పాల సముద్రంలో మహా అగ్ని లాగున విషం పుట్టింది. అది ఎంతకీ ఆరేది కాదు. లోకాలను కాపాడడం కోసం శివుడు దానిని మనసారా మ్రింగాడు.

పరమేశ్వరుడు లోకసంరక్షణార్థం   మద్యం పుచ్చు కొన్నాడని సమస్య. దానిని  అవధాని గారు  మనసారా అనే విరుపుతో చక్కగా పూర్తి చేసాడు.
అమృతం కోసం దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధించారు. వాసుకిని తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. పాల కడలిని చిలకడం మొదలు పెట్టారు. అందు లోనుండి కామ ధేనువు, కల్ప వృక్షమూ, ఐరావతమూ, శ్రీమహా లక్ష్మీ, కౌస్తుభమూ, అప్సరోంగనలూ వెలువడ్డారు. చివరగా కాలకూటం వెలువడింది. దానిని ఏం చేయాలో దేవ దానవులకు తెలిసింది కాదు. చివరకు ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్ధించారు. లోక రక్షణ కోసం  శివుడు దానికి సిద్ధ పడ్డాడు.

ఆ సందర్భంలో పోతన గారు చాలా గొప్ప పద్యాలు రాసారు. వాటిని కూడా ఒకింత గుర్తు చేసు కుందాం. మంచి కవిత్వాన్ని మననం చేసు కోడానికి ముహూర్తం అక్కర లేదు కదా.
కంటే జగముల దు:ఖము
వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ
శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది.
పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.
శుకుడు అందుకే అంటాడు :
మ్రింగెడు వాడు విభుండని
మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ,
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా.
పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ...

కదలం బారవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు,నేత్రంబులు నెఱ్ఱగావు, నిజజూటార్ధేందుఁడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో, డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో, భక్షింపుచో, మ్రింగుచోన్.
పరమ శివుడు హాలాహలాన్ని రారమ్మని కవ్వించి పిలిచాడు. తనూ ఓ అడుగు ముందుకు వేసి సమీపించేడు. ఆ విషాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసాడు.కిందకి లాగాడు. నోట పెట్టుకుని మ్రింగాడు.
అలా శివుడు విషాన్ని భక్షిస్తూ ఉంటే, వొంటి మీద హారాలలా వేలాడుతున్న పాములు బెదరడం లేదు. కదలడం లేదు. ఆ మహా తాపానికి పరమ శివుని ఒంటి మీద ఒక్క చుక్క చెమట పుట్టడం లేదు. కనులు ఎఱ్ఱ బడడం లేదు. జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ వేడిమికి కంది పోలేదు. శివుని పద్మంలాంటి ముఖం వాడి పోలేదు.,
భలే వాడివయ్యా, భోలా శంకరా !






1, ఆగస్టు 2013, గురువారం

చిన్నప్పటి నుండీ వాడు తేడాయే !



ఒక చక్కని దత్త పది ...




పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం లోగడ చూస్తే సరే. లేదా వినండి ...

పాలు పంచడు రారాజు పాండవులకు

పెరుగు చున్నది వానిలో దురితము గన

నేయిలను గల్గ దిట్టియహితము వాని

నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !



భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)

వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.

ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.

వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.

ఇక భారత యుద్ధం తప్పదు !



వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :

రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను   కననే ? మూర్ఖత వానిని  ఊనెను



కనన్, ఏ + ఇలన్   =  ఏ లోకంలో నయినా ఉందా ?

వానిన్ + ఊనెన్.    =  వానిని మూర్ఖత్వం  పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
  



12, మే 2012, శనివారం

ఒకటి కొంటే ఒకటి ఉచితం ... రామాయణం పుస్తకం కొంటే భారత గ్రంథం ఉచితం !


























మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..


పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.


మరో మాట ... ఎందుకేనా మంచిదని చెప్పి చదువరులను ముందే హెచ్చరించాడు.


ఒక కథ వినేటప్పుడు మఱొక కథ మీద దృష్టి నిలిపితే, మొత్తం మొదటి అర్ధం గోచరించకుండా పోతుంది. అందు చేత ఈ రాఘవ పాండవీయం చదివేటప్పుడు ఒకే అర్ధం కలిగిన మామూలు కావ్యాన్ని ఎలా చదువుతారో అలాగే చదవండి. అంటే, ముందుగా రామాయణార్థాన్ని చదువుదామనుకుంటే, మనసు లోకి మరింక భారతార్థం ఏమిటా అని ఆలోచించకండి. అలాగే భారతార్ధం వచ్చేలా చదివేటప్పుడు రామాయణార్ధ ఏమిటా అని ఆలోచించకండి. ఏకార్ధ కావ్యం ఎలా చదువుతారో అలాగే చదువు కోండి. అని వివరణ ఇచ్చాడు.






రాఘవ పాండవీయం లోని రామాయణార్థంలో నూ భారతార్ధం లోనూ అర్ధాలు వచ్చే ఒక పద్యం ఉదాహరణకు చూద్దామా !


వెలయునఖిల భువనములలోన వారణ


నగరిపురమ తల్లి నాదనర్చి


రాజ్య లక్ష్మి మిగుల బ్రబల నయోధ్యనా


రాజ వినుతి గనిన రాజధాని.






ఈ పద్యం రామాయణ పరంగా అయోధ్యా నగరాన్ని వర్ణించే పద్యం. ఇదే పద్యం భారతార్ధంలో అయితే, హస్తినాపురాన్ని వర్ణిస్తున్న పద్యం !




ఇందులో సంస్కృతాంధ్ర శబ్ద సభంగ శ్లేష కవి వాడాడు.






ముందుగా రామాయణ పరంగా అర్ధం ఎలాగంటే,


రామాయణ పరంగా పద్యంలోని పదాలు ఇలా విరిచి చదువు కోవాలి.






అఖిల భువనముల లోన్, = అన్ని లోకాలలోనూ


అవారణ, నగరిపు, రమ, తల్లి = అడ్డు లేని ఇంద్రుని యొక్క సంపదయైన అమరావతికి తల్లి అన్నట్లుగా రాజ వినుతి గనిన = గొప్ప పేరు గాంచిన


రాజధాని అయోధ్యనాన్ = అయోధ్య అనే పేరుతో ప్రబలున్ = వెలయు చున్నది.






అంటే,

ఇంద్రుని రాజధాని అమరావతి. . దానికి తల్లి లాంటి నగరం అయోధ్య అన్నమాట.!






ఇక, భారతార్థంలో అన్వయం చూదామా !






న + యోధ్య = అయోధ్య ( యుద్ధం చేసినా జయింప బడనిది )


వారణ నగరి = వారణం అంటే ఏనుగు, వారణ నగరి అంటే హస్తినా పురం !


పురమ తల్లి = పుర శ్రేష్ట్రం. ( శ్రేష్ఠమైన నగరం )


అన్వయం ఇలా చూడాలి.






అఖిల భువనములలోన + వారన నగరి + పురమ తల్లి..






అంటే, అన్ని లోకాలలోనూ, హస్తినా పురం చాలా గొప్పది అని అర్ధం అన్నమాట !


తక్కిన అర్ధమంతా సుబోధకమే కదా !


వార్నాయనో ! ఒక్క పద్యానికి రెండు రకాల ( రామాయణ, భారతార్ధాలు ) అర్ధాలు గ్రహించడానికే ఇంత పీకులాట అయింది. ఇక మొత్తం కావ్యం అంతా చదవాలంటే మాటలా ? అనుకుంటున్నారా ?


తప్పదండీ, బాబూ, కష్టే ఫలీ ! అన్నారు. కావ్య రసం గ్రోలాలంటే ఆ మాత్రం కష్టపడొద్దూ ?


పనిలో పని, పింగళి సూరన కళా పూర్ణోదయం చదవండి..ఒక మిష్టరీ నవల చదువుతున్నట్టగా ఉంటుంది. తెలుగు కవుల గొప్ప తనమేమిటో తెలుస్తుంది. ! మన కావ్య సంపదను మనం ఎంత పదిలంగా కాపాడు కోవాలో తెలుస్తుంది !






స్వస్తి.




2, డిసెంబర్ 2011, శుక్రవారం

అంతా బూతేనా ? !


కవి చౌడప్ప పేరెత్తితే చాలును, థూ ... అంతా బూతు ! అనెయ్యడం తెలిసిన విషయమే.

చౌడప్ప నిజంగా అన్నీ బూతు పద్యాలే రాసాడా ? కాదనే చెప్పాలి. అందుకే మన సాహిత్య కారులు కవుల చరిత్రలు రాస్తూ కవి చౌడప్పకు సముచిత స్థానమే ఇచ్చారు.

కంద పద్యాలలో రచించాడు కవి తన చౌడప్ప శతకాన్ని. కవికి తనలా వేరొకరు కంద పద్యాలను రాయ లేరనే ఆత్మ ప్రత్యయం ఎక్కువ. అందుకే ఎంత థీమాగా చెప్పాడో చూడండి:

ముందుగ చను దినములలో

కందమునకు సోమయాజి ఘనుడందురు నే

డందరు నను ఘనుడందురు

కందమునకు కుందవరపు కవి చౌడప్పా.

భావం : పూర్వం రోజులలో కందపద్య రచనకు తిక్కన గారిది అందె వేసిన చేయి అంటారు. ఇవాళ నన్ను కంద పద్య రచనలో ఘనుడినని అంటారు.

కందము నీవలె జెప్పే

యందము మరిగాన మెవరియందున గని సం

క్రందన యసదృశనూతన

కందర్పా ! కుందవరపు కవిచౌడప్పా.

భావం: నీలా ఇంత అందంగా కందం చెప్పడం మరెవరికీ చాతకాదయ్యా ! నువ్వు ఇంద్రునితో సమానమైన నూతన మన్మథుడివి సుమీ ! అని కవి తన గురించీ, తన కంద పద్యం గురించీ చెప్పాడు.

కందముల ప్రాసగణయతు

లందముగా కవిత నెందరల్లరు విను నీ

కందంబులు రససన్మా

నందంబులు కుందవరపు కవిచౌడప్పా.

భావం: గణాలూ, యతులూ ,ప్రాసలూ కుదిరేలా చూసుకుని ఎందరు కంద పద్యాలను అల్ల లేదు ?

కాని, నీ కందాలు మాత్రం మహా రుచికరంగా భేషుగ్గా ఉంటాయి సుమీ !

నా నీతి వినని వానిని

భానుని కిరణములు మీద బారని వానిన్

వానను తడియని వానిని

గాననురా కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఈ కవికి ఎంత ఆత్మవిశ్వాసం అంటే, తను చెప్పే నీతులు వినని వాడూ, ఎండ వేడిమి తగలని వాడూ, వానలో తడవని వాడూ ఎవడూ ఉండడు. అలాంటి వాడిని తను చూడ లేదుట !

తెలుగులో పచ్చి బూతు కవిగా ముద్ర పడి పోయిన చౌడప్ప బూతులూ, అశ్లీల శృంగారం పెచ్చు మీరిన పద్యాలు రాయక పోలేదు. అయితే రాసిన వన్నీ బూతులే కావు. చక్కని నీతి పద్యాలూ మిక్కుటంగానే ఉన్నాయి.

హాస్యం కోసం బూతాడక తీరదనుకునే రోజుల వాడు మన కవి.

నీతులకేమి యొకించుక

బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో

నీతులు బూతులు లోక

ఖ్యాతులురా! కుందవరపు కవిచౌడప్పా.

భావం: నీతులు చెప్పడానికేం ! ఓ ! చాలా ఉన్నాయి. కానీ కొంచెమయినా బూతు మాటలు పలుకక పోతేనవ్వు పుడుతుందిటయ్యా ? రాజులను నవ్వించాలి కదా ! నీతులు, బూతులు రెండూ సమానమైన లోకఖ్యాతికరాలే కదా !

పది నీతులు పదిబూతులు

పది శృంగారములు గల్గు పద్యము సభలన్

చదివిన వాడే యధికుడు

కదరయ్యా కుందవరపు కవిచౌడప్పా.

భావం: పది నీతులు, పది బూతులు , పది శృంగార పద్యాలు సభలో చదివిన వాడే గొప్పవాడు కదా.!

ఛీ ! బూతు ! అంటూ ముఖం వికారంగా పెట్టే వాళ్ళకి కవి ఓ గట్టి చురకే వేసాడండోయ్ !

బూతని నగుదురు గడు తమ

తాతలు ముత్తాత మొదలు తరముల వా

రే తీరున జన్మించిరొ !

ఖ్యాతిగ మరి కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఛీ ! పచ్చి బూతు ! అన్న వాళ్ళే ఆ బూతుని నవ్వుతూ వింటారు. వాళ్ళ తాతముత్తాతలు బూతు లోంచి కాక పోతే మరెలా పుట్టుకొచ్చారు ?

జానపదులలో విస్తారంగానూ, నాగరికులలో రవంత అరుదుగానూ వినిపిస్తూ, నిఘంటువులలో ఎక్కడో మారుమూల బిక్కు బిక్కుంటూ ఉండే బూతు మాటలను ఈ కవి నిర్భీతిగా, ఏ మొఖమాటాలకీ తావు లేకుండా, గుట్టూ మట్టూ లేకుండా చాలా పద్యాలలో వాడిన మాట నిజమే అయినా, చౌడప్ప వన్నీ బూతు పద్యాలే కావు. చక్కని కందాలూ, ఎంచక్కని వృత్త పద్యాలూ చాలా ఉన్నాయి.

నీచులనూ, నీతి బాహ్యులనూ, మేక వన్నె పులలనూ, కుహనా మేథావులనూ, ఈ కవి ఏ శషభిషలూ లేకుండా జలకడిగి పారేస్తాడు.

చూడండి:

వేడుక పడి వినవలెనా

దోడు కవిత్వంబునైన తులువ నలువురన్

గోడిగము సేయు వాడే

గాడిదరా ! కుందవరపు కవిచౌడప్పా.

భావం: కవిత్వాన్ని చదవాలి. చక్కగా ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ హేళన చెయ్య కూడదు. అవమానించ కూడదు. అలా చేసే వాడు తుంటరి గాడిద !

ఇయ్యా యిప్పించ గల

యయ్యలకే గాని మీస మన్యుల కేలా ?

రొయ్యకు లేదా మీసము

కయ్యానకు కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఇచ్చే వాడికీ, ఇప్పించగల వాడికీ మీసాలు ఉండాలి. కానీ మిగతా పనిమాలిన వెథవలందరికీ మీసాలెందుకూ దండగ ! రొయ్యకు బారెడు మీసం ఉంటుంది ! ఎందుకూ !

మునుపాడి వెనుక లేదను

పెను గొంటె గులాము నోరు పీతిరి గుంటే

యనిఘనుడు సత్య వాక్యమె

గన వలెరా కుందవరపు కవిచౌడప్పా.

భావం: ముందు ఇస్తానని మాట యిచ్చి , తరువాత లేదు పొమ్మంటాడే, వాడి నోరు అశుద్ధం గొయ్యితో సమానం ! ఈ మాటలు పూర్తిగా నిజం.

పెద్దన వలె కృతి చెప్పిన

పెద్దన వలె ; నల్ప కవిని పెద్దన వలెనా ?

ఎద్దన వలె, మొద్దన వలె

గ్రద్దన వలె కుందవరపు కవిచౌడప్పా.

భావం: అల్లసాని పెద్దన లాగా కవిత్వం చెప్పిన కవినే పెద్ద అనాలి కానీ, తక్కిన పనికి మాలిన కవులని అందరినీ పెద్ద అనాలా ? ఎద్దనాలి. మొద్దనాలి. గ్రద్ద అనాలి.

కీలెరిగి వాత పెట్టడ మంటే ఇదే కాబోలు.

తులసీదళముల హరిపద

జలజంబుల పూజసేయు సరసుల యమ దూ

తలుజూచిఏమి చేయం

గలరప్పా కుందవరపు కవిచౌడప్పా.

భావం: హరి పాద పద్మాలకు తులసీ దళాలతో పూజ చేసే వాడిని యమ దూతలు కూడా ఏమీ చెయ్య లేరు !

పరవిత్తము గోమాంసము

పరసతి తన తల్లి యనుచు భావించిన యా

నరుడు నరుండా రెండవ

కరిరవదుడె కుందవరపు కవిచౌడప్పా.

భావం: పరుల సొమ్ము గోమాంసంతో సమానంగానూ, పరుల భార్యలను తల్లితో సమానంగానూ ఎవడయితే చూస్తాడో, వాడు అపర నారాయణుడే !

వానలు పస పైరులకును

సానలు పస వజ్రములకు సమరంబులకున్

సేనలు పస మృగజాతికి

కానలు పస కుందవరపు కవిచౌడప్పా.

భావం: పంటలకు వానలే పస. సానపట్టడం వల్ల వజ్రాలు కాంతితో మెరుస్తూ ఉంటాయి. యుద్ధాలకి సేనలు తగిన బలం. జంతువులకు క్షేమకరమయిన తావులు అవడులే.

పులి నాకి విడుచు దైవము

గల వానికి దైవ బలము గలుగని వేళం

గలహించి గొఱ్ఱె కరచును

కలియుగము కుందవరపు కవిచౌడప్పా.

భావం: దేవుని దయ ఉంటే, పులి కూడా వాడిని ఏమీ చేయదు. అలా తడిమి వదిలేస్తుంది. దైవ బలం లేక పోతే, గొఱ్ఱె కూడా కరుస్తుంది ! కలి కాలపు వింత అంటే ఇదే !

పాండవు లిడుమల బడరే

మాండవ్యుడు కొరత బడడె మహి ప్రాకృత మె

వ్వండోపు మీరి చనగ న

ఖండిత యశ కుందవరపు కవిచౌడప్పా.

భావం: చేసుకున్న వాళ్ళకి చేసుకొన్నంత ! పాండవులు ఎన్న కష్టాలు అనుభవించ లేదు ? మాండవ్య ముని కొరత పడ లేదూ ! పూర్వ జన్మలో చేసిన పాపాలు తప్పించు కోవడం ఎవరి తరమూ కాదు.

ఆడిన మాటను తప్పిన

గాడిద కొడకంచు తిట్టగావిని మదిలో

వీడా ! నా కొడుకని యేడ్చెను

గాడిదయును కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఆడిన మాటను తప్పిన వాడిని గాడిదా ! అని తిడితే వీడా నా కొక కొడుకు ! అని గాడిద కూడా ఏడిచిందిట !

మూలిక క్రియ కొదిగినదే

నాలుక సత్యంబు గలదె నడిపిన వాడే

యేలిక వరమిచ్చినదే

కాళికరా ! కుందవరపు కవిచౌడప్పా.

భావం: మందుకు పనికొచ్చేదే మూలిక. సత్యం పలికేదే నాలుక. చక్కగా పాలించే వాడే ఏలిక. వరమిచ్చేదే దేవత !

కుటుంబ వ్యవస్థ పట్ల కవి చౌడప్పకి ఎంత గౌరవమో చూడండి:

తన సతి యిడగా మనుమలు

తనయులు తలిదండ్రులన్న దమ్ముల్ బంధుల్

దినదినములు భుజియించుట

ఘనవిభవము కుందవరపు కవిచౌడప్పా.

భావం: భార్య వడ్డిస్తూ ఉంటే, మనుమలు, తల్లిదండ్రులూ, అన్నాదమ్ములు, బంధువులూ అందరూ కలిసి రోజూ భోజనం చెయ్యడం ఎంత వైభవంగా ఉంటుందో కదా !

సరసము చతురోపాయము

హరి భక్తియు శాంత గునము నర్థుల పట్లన్

పరమౌ చుపకారము విను

కరుణాకర కుందవరపు కవిచౌడప్పా.

భావం: సరసం, చతురోపాయం, హరి భక్తి, శాంత గుణం, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి.

సీమ దయా పరుడేలిన

క్షేమంబగు దోసకారి సీమేలినచో

క్షామంబగు నతడేలే

గ్రామంబున కుందవరపు కవిచౌడప్పా.

భావం: దయాపరుడైన వాడు నేలను పరిపాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. దుర్మార్గుడు పాలిస్తే అంతటా కరువే .

చౌడప్ప కవి వర్గ దృక్పథం ఎలాంటిదంటే,

ఎన్నగల యడవి మృగముల

కన్నీరేమైన వేటగానికి ముద్దా ?

నన్నాపు దొరకు బీదల

కన్నీరును కుందవరపు కవిచౌడప్పా.

భావం: వేట గాడికి అడివి జంతువు కన్నీళ్ళు ముద్దా యేమిటి ? వాటికతడు కరిగి పోతాడా ? అలాగే దోచు కునే దొరకు పేదవారి కన్నీళ్ళు ముద్దొస్తాయా ?

చౌడప్ప వృత్త పద్యాలలో మచ్చు కొకటి చూడండి:

ఆసలజేరి దుర్గుణ గణాఢ్యుని దాత వటంచు వేడినన్

మీసలము దువ్వుచున్ దిశల మీదన చూచుచు దుర్మథాంథుడై

మీసము నియ్య లేని నలు విత్త గులాము కీర్తి చేరునా ?

భూసుర వర్య కుందవర భూషణ చౌడ కవీశ్వరోత్తమా !

భావం: దుర్మార్గుడిని మన ఆశ కొద్దీ దాతవు అని వేడుకొంటే యేమవుతుంది ? మీసాలు మెలి త్రిప్పుతాడు. పైకీ కిందకీ చూస్తాడు. వీసం కూడా ఇవ్వడు. ఆ వెధవకి ఏం కీర్తి వస్తుంది చెప్పండి

కావాలనే చాలా బూతు పద్యాలు చెప్పాడు. అలాగే చాలా నీతులూ చెప్పాడు. ఆ సంగతి కవి ఇలా స్పష్టం చేస్తున్నాడు:

బూతులు కొన్నిట కొన్నిట

నీతులు చెప్పితి బుధులు నీతులబూతుల్

బూతుల మెచ్చందగు నతి

కౌతుక మతి కుందవరపు కవిచౌడప్పా.

భావం: నా పద్యాలలో కన్నింట నీతులు చెప్పాను. అలాగే, కొన్నింట బూతులూ చెప్పాను. తెలివైన వాళ్ళు నేను చెప్పిన నీతులతో పాటు ఆ బూతులనీ మెచ్చు కోవాలి సుమా !

చౌడప్ప కవి దెబ్బ ఎలాంటిదంటే ....

కాకులు వేవేలొక్క తు

పాకి రవము విన్న నులికి పడవా మరి ! నా

ఢాకకు తగు నాలాగే

కాకవులును కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఒక్క తుపాకి చప్పుడు వినగానే వేల కొద్దీ కాకులయినా సరే తుర్రుమంటూ ఎగిరి పోతాయ్ ! కదా ! అలాగే, కువులు కూడా నా దెబ్బకు అదిరి పోవలసినదే !

ఏం పెంకెతనం !

ఈ టపా రాసి post చెయ్య బోతూ ఉంటే వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. వస్తూనే వంటింటి వాసలనలని పసి కట్టేసి, ఇవాళ టిపిను పెసరట్లలా ఉందే ! అని సంతోషంగా నవ్వీసి , నేను రాసినదంతా చదివేడు.

‘‘ ఛ ! నువ్వు కూడా ఇంత దిగజారి పోతా వనుకో లేదు. నీ దిక్కుమాలిన కథా మంజరి బ్లాగులో ఇంత కాలం ఏవో పద్యాలూ, శ్లోకాలూ పెడుతూ నీ చేతి దురద తీర్చు కుంటున్నావంటే పోనీ లెమ్మను కున్నాను.. చివరకి ఈ అప్ప కవిగాడి పద్యాలు పెట్టే స్థితికి వచ్చేవన్నమాట !’’

అంటూ ఘాటుగా విమర్శించాడు. నేను కొయ్యబారి పోయేను.

వాళ్ళక్కయ్య ( సొంత సోదరి కాదు లెండి. వరసకి అక్కయ్య. అదీ వాడు కలుపుకొన్న వరసే)

పెసరట్టూ, ఉప్మా టిఫిను పెట్టి, కమ్మని కాఫీ ఇస్తే తాగి నిమ్మళించేడు.

అప్పుడన్నాడు: ‘‘ హు ! నీ ఏడుపేదో నువ్వు ఏడువ్. నాకెందుకు గానీ, ఆ అప్ప కవిగాడి మిగతా పద్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయ్ ?!’’ అన్నాడు సూటిగా.

ఈ మారు నిఝంగానే ( ఒక మేజా బల్ల చేయించు కోడానికి సరిపడేటంతగా ) కొయ్యబారి పోయేను.