మంచి మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచి మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, డిసెంబర్ 2019, శనివారం

చెప్తే వినాలి

           
             



చెప్తే వినాలి

సంతస్తాయసి సంస్థితస్య పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ జుషా మేవం విధా వృత్తయ :

నీరము తప్త లోహమున నిల్చి యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు , నా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్

బాగా కాలిన లోహం మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.

అలాగే, మనం అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.

దుర్జనులు ఎప్పుడూ పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని ఆదరించం కదా ?

19, డిసెంబర్ 2019, గురువారం

మంచి మనసు


                                                             


                                                   మంచి మనసు

సంత స్తృణోత్పారణ ముత్తమాంగాత్,
సువర్ణకోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా2పి కృతోపకారా:
ఖలా: పరే వైర మివోద్వహంతి

మంచి చెడుల తారతమ్యం ఎప్పుడూ ఉండేదే. మంచి వారికీ, చెడ్డ వారికీ ప్రవర్తనలో భేదం స్పష్టంగా కనిపించి పోతూనే ఉంటుంది.

తల మీద ఉన్న గడ్డి పోచను తొలిగించినంత మాత్రాన , వాళ్ళేదో మనకి మహోపకారం చేసినట్టుగా సత్పురుషులు భావిస్తూ ఉంటారు. అంటే, మనం వారికి ఏ చిన్న ఉపకారం చేసినా అది మహోపకారం చేసినట్టుగా కృతఙ్ఞత కనబరుస్తారు. చేసిన మేలు ఎప్పటికీ మరిచి పోరు.

అదే, చెడ్డ వారయితేనా, మన ప్రాణాలు పణంగా పెట్టి గొప్ప ఉపకారం చేసినా, కృతఘ్నులై చేసిన మేలు మరిచి పోవడమే కాక, అకారణంగా మన మీద పగ సాధిస్తూ ఉంటారని మీది శ్లోకం చెబుతోంది.

17, డిసెంబర్ 2019, మంగళవారం

గోరంత మేలు


                           
    



గోరంత మేలు

ప్రథమవయసి పీతం తోయ మల్పం స్మరంత:
శిరసి నిహితభారా నారికేళా నరాణాం,
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి.

మంచి వారికి ఎంత చిన్న ఉపకారం చేసినా వారు దానిని తమ జీవితాంతం మరిచి పోరు.
కొబ్బరి చెట్టుని చూడండి, ఎప్పుడో చిఱుత ప్రాయంలో మనం పోసే కొద్దిపాటి నీటిని త్రాగి, ఆ మేలు మరి ఎప్పటకీ మరిచి పోదు. బరువైన కాయలను గుత్తులు గుత్తులుగా మోస్తూ, కలకాలం మనుషులకు తీయని నీటిని ఇస్తున్నది కదా !


28, డిసెంబర్ 2011, బుధవారం

చెప్పుకోండి చూద్దాం ! - 2


గతంలో ఇలాంటి చిత్ర సమస్యే ఒకటి ఇస్తే, కొంచెం సుళువుగా ఇవ్వొచ్చు కదా ! అని కోప్పడ్డారు.
అంచేత ఇప్పుడు మరీ సుళువుగా ఇచ్చాను. ( మరీ పీ.జీ నుండి కే.జీకి దిగిపోయానేమో)

సమస్య సుళువైనది కనుక క్లూ ఇవ్వడం అనవసరం.

1.చిత్రాలు వరుసగా లేవు. వాటి ఆధారంగా పద్యాన్ని పోల్చుకోండి.
2. ఒకే చిత్రాన్ని అవసరార్ధం మరోమారు ఉపయోగించు కోవచ్చును.
3. చిత్రాన్ని పూర్తిగా కానీ, చిత్ర భాగాన్ని కానీ ఉపయోగించు కోవడం మీ ఇష్టం.












24, నవంబర్ 2011, గురువారం

వేథం దిట్టగ రాదు ! ... కానీ ...


అవున్నిజఁవే ! బ్రహ్మ దేవుడ్ని తిట్ట కూడదు. ! తప్పు. కళ్ళు పోతాయ్ ! కానీ, అతడు చేసే తింగరి పనులకు ఒక్కోసారి శతక కవి థూర్జటి style లో తిట్టాలనిపిస్తుంది. కదూ !

లేక పోతే ఏఁవిటి చెప్పండి ?

అష్టైశ్వర్యాలూ ప్రసాదిస్తాడు. అజీర్తి రోగం పట్టు కునేలా ఆశీర్వదిస్తాడు.

సకల విద్యాపారంగతునివి కమ్మని చెబుతాడు. అష్ట దరిద్రాలూ అనుభవించు పొమ్మంటాడు.

అందమైన మనోహర రూపం ప్రసాదిస్తాడు. అలవి మాలిన అహంకారాన్నీ, అఙ్ఞానాన్నీ అంట గడతాడు.

ఏ టీ ఎమ్ సెంటర్లో ఏ.సీ ఉండి, అది పని చేస్తూ, ఏ టీ ఎమ్ మాత్రం పని చేయ నట్టుగానూ ...

రైల్ లో బెర్తు కన్ ఫరమ్ అయిన కులాసాలో మనం ఉండగా రైలే రద్దయే పరిస్థితి కలిగినట్టుగానూ ...

నువ్వు పో గొట్టు కొన్న నీ పర్సులో వేలాది రూపాయలు ఉండడమూ, నీకు దొరికిన ఎవడో తల మాసిన వాడి పర్సులో చిల్లర నాణేలు మాత్రమే ఉండడమూ ...

ఎందుకు లెండి . చెబితే చేంతాడంత. వాడు చేసే తిక్క పనులు అన్నీ ఇన్నీ కావు.

ఈ శ్లోకం చూడండి :

యాత: క్ష్మామఖిలాం ప్రదాయ హరయే పాతాల మూలం బలి:
సక్తుప్రస్థవిసర్జనాత్ స చ ముని: స్వర్గం సమారోపిత:
ఆబాల్యా దసతీ సురపురీం కుంతీ సమారోహయత్
హా ! సీతా పతి దేవతా2గమదధో ధర్మస్య సూక్ష్మా గతి:

దీని అర్ధం ఏమిటంటే,

వామనుడు మూడడుగుల నేల దానం ఇమ్మని బలిని కోరాడు. ముందూ వెనుకా చూసు కోకుండా సరే ఇస్తున్నా పట్టు అన్నాడు మహా దాత బలి. అప్పటికీ రాక్షస గురువు శుక్రాచార్యడు వద్దు సుమీ, దుంప నాశనమై పోతావ్ ! అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ బలి విన లేదు ! అంత గొప్ప దానాన్ని చేసిన బలికి ఏం జరిగింది ?
పాతాళానికి పోయేడు !

సక్తుప్రస్థుడు అనే ఒక ముని కొద్దిపాటి పేల పిండిని ఎవడికో పెట్టాడు. వానికి స్వర్గం లభించింది !

వివాహం కాకుండానే తల్లి అయిన కుంతికి స్వర్గం లభించింది.

పరమ పతివ్రత అయిన సీతా దేవి మాత్రం భూగర్భంలో పడిపోయింది. ఆహా ! ధర్మం నడక ఎంత సూక్ష్మమైనదో కదా !

ఇదీ శ్లోక భావం.

అలారాసి పెట్టి ఉంది మరి అనుకుంటాం. కానీ అలా రాసిన వాడిని థూర్జటి కవిలాగా తిట్ట కూడ దంటూనే తిట్టే సాహసం చెయ్యం !

ఇంతకీ థూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో వేథను ఎలా తిట్టాడో కాస్త చూదామా ?

వేథం దిట్టగ రాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ? థీ చాతురిం జేసినన్ యటుల రా బాటంచు నేఁ బోక క్షు
ద్భా దాదుల్ కలిగింప నేల ? యది కృత్యంబైన దుర్మార్గులం
యీ ధాత్రీశుల చేయ నేటి కకటా ! శ్రీకాళ హస్తీశ్వరా !

దీని భావం:

ఓ శ్రీకాళహస్తీశ్వరా ! బ్రహ్మ దేవుడిని తిట్ట కూడదు. కానీ, లేక పోతే, మమ్మల్ని పండితులు గానూ, కవులుగానూ పుట్టించడం ఎందుకు ? పోనీ, తన బుద్ధి నేర్పరితనం వల్ల అలా చేసేడే అను కుందాం. ఆ పాండిత్యం వలన కలిగిన ఙ్ఞానంతో మిమ్ములను సేవించు కుంటూ, ఆ మార్గంలో నడవనీయ కుండా మాకు ఆకలి దప్పులు ఎందుకు పెట్టాడయ్యా

మాకుండే ఆ బాధలను ఆసరాగా చేసుకొని, తమ చుట్టూ తిరిగేలా చేసుకొంటున్న ఈ దుర్మార్టులయిన రాజులను ఎందుకు పుట్టించాడయ్యా !

ఈ ఆకలి బాధలూ, సంసార జంఝాటాలూ లేకుండా ఉంటే, ఓ దేవా ! నీవు మాకు ప్రసాదించిన పాండిత్యంతో , దాని వలన కలిగిన మంచి ఙ్ఞానంతో సదా మిమ్ములనే సేవించు కుంటూ ఉండే వారము కదా !

(తిక్కలోడివి కాక పోతే, మాకు మంచి పాండిత్యం ఇవ్వడ మెందుకు ? దానిని మీ కోసం వినియోగించ కుండా రాజులను ఆశ్రయిస్తూ దేబిరించడ మెందుకూ ? అలా దేబిరించడానికి కారణభూత మయిన ఆకలిదప్నులను మాకు ఇవ్వడ మెందుకూ ? వాటిని ఆసరాగా చేసు కొని మా బలహీనతలనూ, దీనత్వాన్నీ ఆసరాగా చేసుకొని మమ్ములను తమ చుట్టూ తిప్పుకొని రాక్షసానందం పొందే ఈ దుర్మార్గులయిన రాజులను పుట్టించడ
మెందుకూ ! )

లలాట లేఖో న పున: ప్రయాతి.

తల రాత మార్చ లేం కదా.









4, నవంబర్ 2011, శుక్రవారం

సారీ, గురూ !


మా తింగరి బుచ్చి గాడు మీకు గుర్తున్నాడు కదూ!

వీడు రెండో తరగతి రెండుసార్లు చదివి ‘ ఇహ మనకీ చదువులు వంట బట్టవు కానీ ’ అనుకోని వదిలేసాడు. ఆ తర్వాత తన నేస్తులయిన బడి గుంటలంతా పాస్ పీస్ మంటూ ఏవో ఇంగిలిపీసు ముక్కలు మాట్లాడేస్తూ ఉండడంతో తనూ ఓ నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చుకోవాలను కున్నాడు. ముందుగా ఓ రెండింటిని ఒంట పట్టించు కున్నాడు.

అవి : 1. టాంక్యూ
2. షారీ ! ...
వాడు వాటిని అలాగే పలుకుతాడు. అవేమిటో మీకు నేను చెప్పనక్కర లేదు. ఈ రెండూ నేర్చుకొన్న కొత్తలో ఏది ఎప్పుడు వాడాలో తెలియక తెగ తికమక పడి పోతూ ఉండే వాడు. దానికిదీ, దీనికదీ వాడేస్తూ ఉండే వాడు. అలవాటయ్యే సరికి వారం పది రోజులు పట్టింది.

సరే, టాంక్యూ సంగతి అలా ఉంచితే వాడు షారీ పదం నేర్చుకొన్న కొత్తలో ఆ మోజు కొద్దీ దాన్ని ప్రయోగించడానికి తగిన పరిస్థితులను తానే కల్పించుకొనే వాడు.

సినిమా హాళ్ళలో, ఇంటర్వెల్ అయ్యాక తిరిగి షో మొదలయ్యే వేళ, చీకట్లో కావాలనే కుర్చీలలో కూర్చునే వారి కాళ్ళు
తొక్కి ‘ షారీ ’ ! అని పళ్ళికిలించే వాడు. ఈ సరదా ఒక్కో సారి వికటించి, ‘‘ ఎవడ్రా నువ్వూ ’’తో మొదలై తిట్ల దండకాలతోనూ, ఒక్కోతూరి గూబ గుయ్యి మనిపించడాలతోనూ ముగిసేది. మూడు తిట్లూ, ఆరు చెంప కాయలతో వాడికా పదం బాగా వంటబట్టింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు వాడు.

మనలో చాలా మంది ఈ సారీ పదం అలవోకగా వాడేస్తూ ఉంటాం. అడుసు తొక్క నేల ? కాలు కడుగ నేల ? అని కూడా చూసు కోం.

అండగా సారీ అనే దిక్కుమాలిన పదం ఒకటుండగా
ఆలోచించి పని చెయ్యడ మెందుకు దండగా ! ... అనుకొంటూ ఉంటాం, కాస్త కవితాత్మకంగా.

మన పూజా విధానంలోనూ, మనం పలికే మంత్రంలోనో, చేసే పూజలోనో, అసలు మన భక్తిలోనో ఏమేనా పొరపాట్లూ గట్రా ఉంటే దేవుళ్ళకు సారీ చెప్పేసే సుళువు ఒకటి మన వాళ్ళు పొందు పరిచే ఉంచారు.

మీ తెలిసినదే కదా.

వినాయక పూజ చేస్తున్నామనుకోండి, చివరలో

మంత్రహీనం, క్రియాహీనం, భక్తి హీనం గణాధిప:
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.

అని లెంపలు వాయించు కోవాలి. ఎలాగూ సారీ చెప్పేస్తున్నాం కదా అని భక్తిలో కానీ, పూజా విధానంలో కానీ, మంత్రంలో కానీ బుద్ధి పూర్వకంగా పొరపాటు చేయ కూడదు. అలాగే ఏమరుపాటూ తగదు. కళ్ళు పోతాయ్.

అసలు సారీ చెప్పు కోవాల్సిన పరిస్థితి తెచ్చు కోవడమే తప్పయితే, అలా చెప్పే సారీని కూడా కుర్రకారు కొంతమంది
మరీ విడ్డూరంగా, యాదాలాపంగా, నిర్లక్ష్యంగా , తలపొగరుగా కూడా చెబుతూ ఉండడం కద్దు. అదే -

సారీ గురూ ! ఇది మరింత దిక్కు మాలిన పదం.

ఇక,

మన ప్రాచీన కవులకు కవిత్వం పట్ల, ఛందస్సు పట్ల , అసలు అక్షరం పట్ల ఎంత విధేయత ఉండేదో చూడండి :

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో2స్తుతే.

ఎక్కడయినా అక్షర స్ఖలనం జరిగినా, అంటే అక్షర దోషం కలిగినా, ఛందోభంగం వచ్చినా, లేదా మరే దోషాలు నా కవిత్వంలో ఉన్నా, ఓ అక్షర మూర్తీ ! వాటిని అన్నింటినీ మన్నించు తండ్రీ ! నారాయణుడవైన నీకిదే నా నమస్కారం !

ఇంత భక్తీ, నిబద్ధతా ఉండబట్టే వారు మహా కవులయ్యారు. ఋషులయ్యారు. నానృతి: కురుతే కావ్యమ్ కదా.

పొరపాటు చేసినా క్షమించమని అడగడంలో ఇంత ఉదాత్తత చూపించాలి. ఇంత విధేయత కనబరచాలి.

అంతే కానీ, సారీ గురూ ! అనేస్తే చాలనుకో కూడదు. ఇదే నేను చెప్ప దలచినది.

నేను చెప్ప దలచిన దానిని అర్ధమయ్యేలా సరిగా చెప్ప లేదనిపిస్తోందా. కథా మంజరి ( ఏకైక నస బ్లాగు ) తరఫున,

సారీ, గురూ !


21, మే 2011, శనివారం

అవునా ? అదన్న మాట సంగతి !


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసు కోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

ధర్మో రక్షతి రక్షిత:

సత్య మేవ జయతే

అహింసా పరమో2ధర్మ:

ధనమూల మిదం జగత్

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి

కృషితో నాస్తి దుర్భిక్షమ్

యథా రాజా తథా ప్రజా

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:

శత శ్లోకేన పండిత:

శతం విహాయ భోక్తవ్యం

అతి సర్వత్ర వర్జయేత్

బుద్ధి: కర్మానుసారిణీ

వినాశ కాలే విపరీత బుద్ధి:

భార్యా రూప వతీ శత్రు:

స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

వృద్ధ నారీ పతి వ్రతా

అతి వినయం ధూర్త లక్షణమ్

ఆలస్యం అమృతం విషమ్

దండం దశ గుణం భవేత్

ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?

ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

పుస్తకం, ఆడుది , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ.

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

అప్పుడు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా !

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

వీటిలో స్త్రీల విషయమై చెప్పిన వాటి విషయమై నాకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాని. పూర్వులు చెప్పిన దానిని మార్చ రాదు కనుక , యథాతథంగా ఇచ్చాను. స్త్రీవాదులు కినక వహించరు గాక !

స్వస్తి.














14, ఏప్రిల్ 2011, గురువారం

దండం దశ గుణం భవేత్


దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

మరయితే, ఈ టపాకి ఎన్నుకున్న చిత్రం అలా ఉందేమిటయ్యా, అని నిలదీయకండి.

ప్రమాదో ధీమతామపి ( బుద్ధిమంతులు కూడ ఒక్కొక్క తూరి పొరబడుతూ ఉంటారు) అని చెప్పడానికి అలా ఉంచానంతే.


28, మార్చి 2011, సోమవారం

చింకి లెక్చరు ... ఈ బ్లాగును చదవొద్దు !


ఉదయాన్నే ఫోనొచ్చింది. పానకాల రావు చేసాడు. బుధవారం మధ్యాహ్నం రెండింటికి కుటుంబంతో పాటు వస్తాడుట. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. భోజనం చేసే వస్తాం కనుక ఆ ఏర్పాట్లేవీ చేయ నవసరం లేదని , కావాలంటే సాయంత్రం ఏ నాలుగింటికో చెల్లెమ్మ ఓపిక ఉంటే కరకరలాడేలా ఏ పకోడీలో, ఘుఘుమలాడే బజ్జీలో చేస్తే సరిపోతుందని భరోసా యిచ్చేడు. వాడు మాఇంటికి వచ్చేటప్పుడు మెనూ వాడే నిర్ణయిస్తాడు. నా గుండెలో రాయి పడింది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి ఇండియా పాకిస్తాన్ లు ఆడే కీలకమైన వన్ డే క్రికెట్ మేచ్ ఉంది. పానకాల రావుకీ, వాడి పెళ్ళానికీ కూడా క్రికెట్ మోజు లేదు. అసలు వాళ్ళకి క్రికెట్ గురించి తెలుసో లేదో కూడా అనుమానమే. వాడి పిల్లలకి మాత్రం క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం, ఈ కాలపు పిల్లలు కదా. అయితే వాళ్ళు ఇల్లు తీసి పందిరేస్తారు. టీ.వీలో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడయితే మరీనూ. వాళ్ళ అల్లరీ ఆగమూ అంతా యింతా కాదు. సచిన్ అవుటయితే ఆ కోపం సోఫా కవర్ల మీదో, పుస్తకాల షెల్ఫు మీదో చూపిస్తారు. లేదా టీ కప్పులు, కాఫీ కప్పులు నేల కేసి కొడతారు. తర్వాత తీరిగ్గా సారీ ఆంటీ, సారీ అంకుల్ అంటూ పళ్ళు యికిలిస్తారు. అసలు ఇలాంటి ఉపద్రవాలేవీ వాళ్ళ ఇంట్లో జరుగకుండా తప్పించు కోవడం కోసమే బుధవారం నాడు పానకాల రావు మా యింటికి వచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కాబోలు. ద్రోహి. ఎంత కపటి ? ఎంత దురాలోచన ?

‘‘ లేదురా, ఈ బుధ వారం మేం ఇంట్లో ఉండడం లేదు. జరూరు పని మీద మా సొంతూరు వెళుతున్నాం ...’’ అంటూ ఓ అబద్ధం చెప్పి తప్పించు కోవాలని పానకాలుకి ఫోను చేద్దామని వాడి నంబరుకి రింగ్ చేసాను. వాడి సెల్ ఆఫ్ చేసి ఉంది. వాళ్ళావిడ నెంబరు కూడా కలవడం లేదు. నానుంచి ఈ రిప్లయ్ ఊహించేడో యేమో, ముందుగానే జాగ్రత్త పడుతున్నారల్లే ఉంది.

జావకారిపోయేం, నేనూ, మా ఆవిడానూ. ఇహ మా బుధ వారం ప్రోగ్రాం సర్వ నాశనమైపోయినట్టే.

ఇలా పనిమాలి పోసుకోలు కబర్ల కోసం వచ్చే వాళ్ళని ఎలా అదపు చేయాలో తెలియక సతమతమై పోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ రాకని ఎలా కట్టడి చేయాలో సరైన సలహా చెబుతాడు కదా అని కథా మంజరి బ్లాగు నిర్వాహకుడికి ఓ మెయిలు పెట్టాను. విషయం అంతా వివరిస్తూ నా గోడు వెళ్ళ బోసుకున్నాను.

ఆ చాదస్తపు బ్రామ్మడు సలహా యివ్వక పోగా, అలా ఇంటి కొచ్చే వారిని అడ్డుకో కూడదనీ, అతిథి సేవాతత్పరత, దిబ్బా దిశిగుండం అంటూ నాకే ఓ చింకి లెక్చరు యిచ్చేడు.పైగా తన మాటలకు ఉపబలకంగా ఏవో సంస్కృత శ్లోకాలూ గట్రా కోట్ చేయడమొకటీనూ. నాకు ఎక్కడో మండింది.

ఆ చింకి లెక్చరు మీరూ వినండి మరి:

నా2భ్యత్థానక్రియా యత్ర, నా22లాసా మధురాక్షరా:
న చా2పి కుశల ప్రశ్న:, తత్ర్త హర్మ్యే న గమ్యతే.

ఎవడి గృహానికి వెళ్తే ఆ యింటి యజమాని లేచి, ఎదురేగి మంచి మాటలతో పలుకరించి, కుశలాదికాలు అడిగి ఆదరించడో అలాంటి వాడి ఇంటికి వెళ్ళ కూడదు.

ఇదీ శ్లోక భావంట. గాడిద గుడ్డేం కాదూ?

చింకి లెక్చర్లో మరి కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడండోయ్

ఉత్తమస్యా2పి వర్ణస్య, నీచో2పి గృహమాగత:
పూజనీయో యథాయోగ్యం, సర్వదేవమయో2తిథి:

పెద్దింటి వాడింటికి చిన్నింటి వాడు వచ్చి నప్పటికీ వానిని యథోచితంగా సత్కరించి, భోజనాదులు సమకూర్చాలి. అతిథి సర్వ దేవమయుడని గుర్తుంచు కోవాలి.

గ్రాసాదపి తదర్ధేన, కస్మాన్నో దీయతే2ర్ధినే,
ఇచ్ఛానురూపో విభవ: కదా కస్య భవిష్యతి.

ఇంటికి వచ్చిన వాడికి ఆ పూట శ్రద్ధతో భోజనం పెట్టాలి. లేదా, తగినంత ధనమైనా యిచ్చి పంపించాలి. వాడే మరో చోట తింటాడు. ఎప్పుడో తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాననడం వట్టి మాట.
తనకు కావలసినంత ధనం ఎప్పుడూ ఎవడి దగ్గరా ఉండడం చూడం కదా. అంచేత, ఎంతుంటే అంతా యిచ్చి పంపాలి.

న్యాయార్జిత ధనసత్త్వ, ఙ్ఞాననిష్ఠో2తిథి ప్రియ:
శాస్త్రవిత్ సత్యవాదీ వా, గృహస్థత్వే2పి ముచ్యతే.

న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించే వాడూ, తత్వ్త ఙ్ఞానం నందు శ్రద్ధ కలవాడూ, అతిథి అభ్యాగతులను ఆదరించి సేవించే వాడున్నూ, శాస్త్రఙ్ఞుడు, సత్యవ్రతుడు అయిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ముక్తిని పొందుతాడు అని ధర్మ శాప్త్రాలు చెబుతున్నాయి.

దాతవ్య మన్నం విధివత్, సత్కృత్య నతు లీలయా
సర్వే వర్ణా యథా పూజాం, ప్రాప్నువంతి సుసత్కృతా:

ఆయా వర్ణముల వారికి యథోచితముగా సత్కరించి, విధివిహితంగా పూజించి అన్నం పెట్టాలి కాని, ఏదోలే అని, తేలిక భావంతో అన్నం పడవేయ కూడదు సుమా !

తృణాని భూమి రుదకం, వాక్చతుర్ధీ చ సూనృతా,
ఏతాన్యపి సతాం గేహే, నోచ్చిద్యంతే కదాచన

అతిథికి అన్నం పెట్టే శక్తి లేక పోయినప్పటికీ, ధార్మికుడైన గృహస్థుని యింట విశ్రమించే చోటు, దాహానికి మంచి తీర్ధం,నాలుగు మంచి మాటలు ... వీటికి లోటు చేయ కూడదు సుమీ.

అరాప్యుచితం కార్యం ఆతిథ్యం గృహ మాగతే
ఛేత్తు: పార్శ్వగతాం ఛాయాం, నోపసంహరతే ద్రుమ:

ఇంటికి వచ్చిన అతిథి, తన శత్రువయినా సరే, ఆతిథ్యం యిచ్చి గౌరవించాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనే ఇస్తోంది కదా.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంస భక్షణమ్.

అతిథి వాకిటిలో ఉండగా వాడిని విడిచి తాను మాత్రమే అన్నం తినడం మహా దోషం. అలాంటి వాడు పట్టిన ఆపోశనం మద్యపానం చేయడంతో సమానం. వాడు తినే అన్నం గోమాంసంతో సమానం.

బాలో వా యది వా వృద్ధో, యువా వా గృహమాగత:
తస్య పూజా విధాతవ్యా, సర్వస్యా2భ్యాగతో గురు:

ఇంటికి అతిథి, అభ్యాగతునిగా వచ్చిన వాడు బాలుడు కానీ, వృద్ధుడు కానీ - అలా వచ్చిన వాడు పూజనీయుడు. వాడిని పూజించ వలసినదే. అభ్యాగతులు గురువుల వలె అందరకీ ఆదరణీయులు.

ఈ విధంగా కథా మంజరి వాడు అతిథి సేవను గురించి చాలా సేపు నాకు ఓ చింకి లెక్చరు యిచ్చి నా బుర్ర తినీసేడు.

చుట్టాల బాధని ఎలా వదిలించు కోవాలో చెప్పరా నాయనా అంటే చింకి లెక్చర్లతో మెదడు తినేసే
( మధ్యలో సంస్కృత శ్లోకాలూ, వాడి పిండాకూడూనూ) ఈ చాదస్తపు బ్లాగరెక్కడ దొరికాడురా బాబూ. ఇహ మీద వాడి కథా మంజరి బ్లాగు నేను చదవను గాక చదవను.

మీరు కూడా చదవొద్దు. ఏం ?!


16, జనవరి 2011, ఆదివారం

కోప మేల నోయీ ... !!


ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్

ఈ శ్లోకంలో కవి కోపం గురించి చెబుతున్నాడు.కోపం అంటూ వచ్చేక, ఎవరెవరిలో ఆ కోపం ఎంత సేపు ఉంటుందో నిర్ధారిస్తున్నాడు.

ఎలాంటి వారికయినా, ఎప్పుడో ఒకప్పుడు కోపం రాకుండా పోదు. కానీ. ఉత్తములైన వారిలో ఆ కోపం కొంచెం సేపు మాత్రమే ఉండి తగ్గి పోతుంది. వారిలో ఆ కోపం క్షణం సేపు కన్నా ఎక్కువ సేపు ఉండదు.

అదే మథ్యములలో అయితే కోపం రెండు ఘడియల సేపు ఉండవచ్చును.

అధమ ప్రకృతి గల మనుషులలో, అంటే , నీచులలో వచ్చిన కోపం మొత్తం ఒక రోజంతా ఉండవచ్చును.

దీని వల్ల ఎంత కోపం వచ్చినా, ఎంతో కొంత సేపటికి తగ్గి పోక తప్పదని తెలుస్తోంది.

కానీ ఓ రకం వాళ్ళలో మాత్రం కోపం వస్తే , బతికి ఉన్నంత కాలం ఆ కోపం పోదు. వాళ్ళు ఆ కోపాన్ని, కోపకారణాన్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారు.

వాళ్ళనే పాపిష్ఠి వాళ్ళు అని చెప్పాలి. వారిది ఆసురీతత్త్వం. అంటే రాక్షస ప్రకృతి అన్న మాట.

కోపం వేగంగా తగ్గి పోవాలన్నా, కోపం వల్ల వేరే దుష్ఫలితాలు కలగకుండా ఉండాలన్నా, మన వాళ్ళు ఒక చిట్కా చెప్పనే చెప్పారు కదా.

కోపం వచ్చి నప్పుడు పది వరకూ అంకెలు లెక్క పెట్టమన్నారు. అప్పటికి వచ్చిన కోపం తగ్గి పోతుంది.

ఒక వేళ తగ్గ లేదనుకోండి, కొంచెం డోసు పెంచండి. మరో పదో, ఇరవయ్యో అంకెలు ఎక్కువ లెక్క పెట్టండి అప్పటికీ తగ్గక పోతే, ఏనిమల్ డోసు వాడి చూడండి. ఇంకా ఈ చిట్కా పని చేయ లేదనుకోండి . మీ యిష్టం చ్చినంతగా కోపాన్ని ప్రదర్శించండి. అరచి అరచి అలసి సోయి మీరే శాంతిస్తారు.

గురజాడ వారి కన్యా శుల్కంలో కోపిష్ఠి పాత్రలు చాలానే ఉన్నాయి. ధామ్ ధూమ్ లాడుతూనే ఉంటాయి.

గురువు గిరీశాన్ని వెంట బెట్టుకుని కృష్ణారాయపురం అగ్రహారం వొచ్చిన కొడుకు వెంకటేశాన్ని‘ వెధవాయీ, ఈ మారైనా పాసయినావా ?’ అని ప్రేమతో కసురుతూ అడిగిన అగ్నిహోత్రావధాన్లు గిరీశాన్ని చూసి, ‘ యా తుర కెవడోయ్’ అని నిలదీస్తాడు. గిరీశం పట్నం డాబు వొలకబోస్తూ, ‘ టర్క్ ! డామిట్ ! , టెల్ మాన్ ’

అన్నాడో, లేదో, అగ్నిహోత్రావధాన్లు అగ్గిరాఁవుడై పోయాడు.

‘ మానా? మానులా వుంచా నంచావూ? గూబ్బగల గొడతాను ’ అని గయ్యిమంటాడు.

సుబ్బిని లుబ్ధావధాన్లుకి యిచ్చి కన్యా శుల్కం పద్దెనిమిది వందలు తీసుకుని పెళ్ళి మాటలు నిర్ణయమైపోయిన సంగతి విని , భార్య వెంకమ్మ అదే గనుక జరిగితే నూతిలో పడి ఛస్తానని గగ్గోలు పెడుతుంది. చెల్లి బాధ చూడ లేక కరటక శాస్త్రి బావ గారితో ఏదో నచ్చ చెప్ప బోతే, దాంతో మళ్ళీ మన అగ్గి రాముడికి చిర్రెత్తు కొచ్చి, ’ వీళ్ళమ్మా శిఖ తరగా, ప్రతీ గాడిద కొడుకూతిండి పోతుల్లాగా నాయింట చేరి నన్ననే వాళ్ళే.తాంబోలం యిచ్చేసాను తన్నుకు ఛావండి ’ అని ఇంతెత్తు ఎగురుతాడు

కోపం ఎప్పుడూ మంచిది కాదు.
తన కోపమె తన శత్రువు ,తన శాంతమె తనకు రక్ష అనే హిత వాక్యం ఎప్పుడూ మరచిపో కూడదు. భారతం కూడా, కోపము తపముంజెఱచును ... అని చెబుతోంది.

కోపం పేరు చెబుతే గుర్తొచ్చే మొదటి ముని దుర్వాస మహా ముని. తపశ్శక్తిని ఎప్పుడూ కోపతాపాలతో ధారపోస్తూ ఉండడమే. ఆ ముని కోపం వల్లనే కదా అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకం కీలకమైన మలుపు తిరుగుతంది.

కోపానికి పరాకాష్ఠ పరమ శివుని మూడో కన్ను. శివ కోపానలానికి మదనుడు దగ్ధమై పోయాడు. అనంగుడైనాడు.

కీచకవథ ఘట్టంలో ద్రౌపదికి విరటుని కొలువులో కీచకుని వలన జరిగిన అవమానానికి రగిలి పోయి భీమ సేనుడు కోపంతో ఊగి పోయాడు. ప్రక్కనే ఉన్న మహా వృక్షాన్ని పెకిలించి వేసి, కీచకుడిని అంతం చేయాలని ఉద్రేక పడి పోయాడు. కానీ, అప్పడు పాండవులు అఙ్ఞాత వాసంలో ఉండడం చేత, దానికి భంగకరం కాకుండా, ‘‘ వలలుండెక్కడ సూచె ... ’’ అంటూ నర్మ గర్భమైన వాక్యాలతో ధర్మజుడు వారించ బట్టి, సరి పోయింది.

కోపం గురిచి ఇంకా చెప్పడానికి చాలానే ఉన్నా, మరీ ఎక్కువగా చెప్తే మీకు విసుగు కలిగి, కోపం వస్తుందేమో. మరి ముగిస్తాను.

9, జనవరి 2011, ఆదివారం

కొంచెం టచ్ లో ఉంటే చాలు ...


అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.

అతి పరిచయం వల్ల అలుసై పోతామట. తరుచు వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా అనాదరం కలుగుతూ ఉంటుంది. రోజూ చచ్చే వాడి కోసం ఎంతని ఏడుస్తాం అంటారు కదా, అలాగే, రోజూ కనిపించే వాడు వస్తే ఏమీ పట్టనట్టుగా ఊరుకుండి పోతాం. మలయ పర్వతం మీద మంచి గంధం చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. మనకవి అపూర్వం. చాలా విలువైనవి. కాని అక్కడ ఉండే భిల్ల వనితలు ఆ మంచి గంధం చెక్కలనే వంట చెఱకుగా ఉపయోగించడం చూడ లేదూ ? అంటున్నాడు కవి. అతి పరిచయం వలన అలుసై పోవడ మంటే ఇదే. పని కట్టుకుని పుణ్య క్షేత్రాలకో, దర్శనీయ స్థలాలకో వెళతాం. అక్కడి ప్రతి అణువునీ కళ్ళార్పకుండా చూస్తూ తన్మయులై పోతూ ఉంటాం. కెమేరాలలో ఆ అందమైన
దృశ్యాలను అపురూపంగా బంధిస్తూ ఉంటాం. అక్కడి స్థానికులు మాత్రం మనంతగా విచలితులు కావడం జరుగదు. రోజూ చూసేదా కదా, అనే భావనతో రవంత నిర్లిప్తంగా కనిపిస్తారు.

ఆలు మగలైనా సరే, అప్పుడప్పుడు ఏ పుట్టినింటికో ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి నాల్రోజులు ఉండి వస్తూ ఉండడం మంచిది. ఎడబాటు ఎప్పుడూ మరింత చేరువ చేస్తుంది. అందుకే కదా, మన ప్రబంధ కవులు విప్రలంభ శృంగారానికి అంత ప్రాముఖ్యమిచ్చి, పోషించారు?

అంచేత, మరీ అతుక్కు పోకుండా, తగు మోతాదులో కొంచెం టచ్ లో ఉంటే చాలు ... కదూ !

27, డిసెంబర్ 2010, సోమవారం

వాగుడు కాయలకు ఓ ఝలక్ !


అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

సుప్రసిద్ధ మయిన ఈ వేమన పద్యం వివరించే అర్ధమే కలిగిన ఒక సంస్కృత శ్లోకం చూదామా ?

నిస్సారస్య పదార్ధస్య, ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ధ్వని స్తాదృక్ , యాదృ క్కాంస్యే ప్రజాయతే.

నిస్సారములయిన అల్ప వస్తువులకు ఆడంబరం ఎక్కువగా ఉంటుంది.
కంచు మ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా !

2, నవంబర్ 2010, మంగళవారం

గోరంత మేలు - కొండంత కృతఙ్ఞత


ప్రథమవయసి పీతం తోయ మల్పం స్మరంత:
శిరసి నిహితభారా నారికేళా నరాణాం,
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి.

మంచి వారికి ఎంత చిన్న ఉపకారం చేసినా వారు దానిని తమ జీవితాంతం మరిచి పోరు.
కొబ్బరి చెట్టుని చూడండి, ఎప్పుడో చిఱుత ప్రాయంలో మనం పోసే కొద్దిపాటి నీటిని త్రాగి, ఆ మేలు మరి ఎప్పటకీ మరిచి పోదు. బరువైన కాయలను గుత్తులు గుత్తులుగా మోస్తూ, కలకాలం మనుషులకు తీయని నీటిని ఇస్తున్నది కదా !

31, అక్టోబర్ 2010, ఆదివారం

నటనాలయమ్


జీవితమే ఒక నాటక రంగం అనే విషయాన్ని భర్తృహరి తన వైరాగ్య శతక విభాగంలో ఇలా వివరించాడు:

క్షణం బాలో భూత్వా క్షణ మపి యువా కామరసిక:
క్షణం విత్తైర్హీన: క్షణమపి చ సంపూర్ణ విభవ:
జరాజీర్ణై రంగై: నట ఇవ వలీమండితతను:
నర స్సంసారాంతే విశతి యమధానీయవనికామ్.

మానవులు నటుల వలె రకరకాల పాత్రలు కొంత సేపు ధరిస్తారు. ఆ తర్వాత, ఆ వేషం కాస్త తీసివేసి, చివరకి రంగస్థలం నుండి నిష్క్రమిస్తారు. మీది శ్లోకం ఆ విషయమే చెబుతోంది:

కొంత కాలం పసి వారుగా , కొంత కాలం రసికులయిన యువకులుగాను, కొంత కాలం పరమ దరిద్రులుగానూ, మరి కొంత కాలం గొప్ప సంసన్నులుగానూ నటిస్తారు. చివరకు అవయవాలన్నీ అశక్తాలయిపోయాక, శక్తులన్నీ ఉడిగి పోయాక, ఒళ్ళంతా ముడుతలు వారి, వణుకుతూ దీనులుగా నటిస్తారు. లోకంలో తమ పాత్ర పూర్తయేక,యమపురికి చేరుకుంటారు.

ఈ శ్లోకంలో కవి మానవుల జీవిత కాలంలో వచ్చే వివిధ దశలను గురించి ప్రస్తావించేడు. ఆయా దశలలో సంభవించే పరిణామాలను విశదీకరించేడు. జీవన గమనంలో ఎదురయ్యే పతనాభ్యుదయాలను ఎత్తి చూపాడు. కడకు మానవ జీవిత నాటకానికి మరణమనే యవనిక ఎలా పడుతుందో నిరూపించేడు.

వార్ధక్యం అనివార్యం అనీ తెలుసును. మరణం అవశ్యం అనీ తెలుసును. కానీ, విషయ వాంఛలకు మాత్రం దూరంగా జరగడం మానవులకు రుచించదు.

దానికి సంబంధించిన శ్లోకం చూసే ముందు సరదాగా ఈ బాపు గారి కార్ట్యూన్ చూసి. పడి పడి నవ్వుకోండి:



చూడండి:

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయు: పరిశ్రవతి భిన్నఘటా దివాంభో,
లోక స్తథా ప్యహిత మాచరతీతి చిత్రమ్ !

ముసలితనం ఆడుపులిలా బెదిరిస్తూ మీద పడుతోంది.
వ్యాధులు శత్రువులాగున శరీరాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఆయువు పగిలిన కుండ లోని నీటిలాగా తరిగి పోతోంది.
అయినా, లోకం తనకు ఏది హితం కాదో దానిని విడిచి పెట్టకుండా చేస్తూ ఉంది.
ఏమి చిత్రం !

మానవుల విషయ వాంఛల తీవ్రత ఎలాంటిదో మరొక శ్లోకంలో కూడా ఇలా వివరించాడు:

వలిభి ర్ముఖ మాక్రాంతం, పలితై రంకితం శిర:
గాత్రాణి శిధిలాయంతే, తృష్ణైకా తరుణాయతే.

ముఖం ముడుతలు పడిపోయింది. జుట్టు నెపి పోయింది. ముగ్గు బుట్టలా తయారయింది. అవయవాల బిగి సడలి పోయింది. అన్నింటా ముసలితనం దాపురించింది.

ఇక, పరువంలో నవనవలాడుతూ ఉన్నదేమిటయ్యా, అంటే, కోరిక ఒక్కటే.


స్వస్తి.


29, అక్టోబర్ 2010, శుక్రవారం

ఉన్నది చాలదూ ?


ఎవడు దరిద్రుడయ్యా, అంటే, ఎవడయితే ఎంతకీ సంతృప్తి చెందడో, వాడూ దరిద్రుడు.కోరికల గుర్రాలని అదుపులో ఉంచుకోక పోతే బతుకు బండి నిశ్చయంగా విషాదాల గతుకు బాటలోనే పల్టీలు కొడుతుంది. కోరికలకేం? అవి అనంతం.

ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే
లక్షాధిసత్తధా రాజ్యం, రాజ్యస్థ: స్వర్గమీహతే

వంద కలవాడు వేయి కావాలనుకుంటాడు. వేయి కలవాడు లక్ష కావాలని ఉవ్విళ్ళూరుతాడు. లక్ష కలవాడు రాజ్యాధికారం కోసం వెంపర్లాడుతాడు. పోనీ, అది కూడా దక్కినా సంతృప్తి చెందడే !అప్పుడు స్వర్గమే తన స్వంతం కావాలని తహతహలాడిపోతాడు. ఇదీ నైజం. ఈ నైజమే అనర్ధదాయకం. సర్వ మానవ సంబంధాలనీ విఛ్ఛిన్నం చేసేది ఇదే కదా?

ఆశాపాశము దాఁగడున్నిడుపు, లేదంతంబు రాజేంద్ర ! వా
రాశి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులన్నర్ధ కా
మాశన్ బాయఁగ నేర్చిరు ? మును నిజాశాంతంబులం జూచిరే?

(పోతన)

ఆశ అనే పాశం చాలా పొడవైనది సుమా ! దానికి కొస అంటూ లేదు.సముద్ర వేలావలయితమైన మహా సామ్రాజ్యాన్ని పొందినప్పటికీ వైన్యుడు, గయుడు మున్నగు రాజులు తృప్తి చెందారా? ఆశా మోహాన్ని విడిచి పెట్ట గలిగారా? తమ ఆశలని తుదముట్టుగా తీర్చుకో గలిగేరా? లేదే !

తనియఁబడకుండ మును గోసి కొనఁజవి
చేటె గాదు, విత్తు చేటుఁగలుగు
పక్వమైనఁగొనిన ఫలమించుఁజెడదు బీ
జంబుఁగార్య సిద్ధి చందమిట్లు

(తిక్కన)
మితి మీరిన ఆశతో, ఆబగా పండీపండని కసుగాయని కోయడం వల్ల అది చవికి చేటు. రుచికరం కాదు. అంతే కాక విత్తుకీ చేటునే కలగిస్తుంది. పండినఫలం కొంచెం కూడ చెడదు.విత్తనం కూడ చెడదు. కార్య సిద్ధి జరగాలంటే ఇదే విధంగా తగు సమయపాలన అవసరం సుమీ.

నీళ్ళ లోన మొసలి నెరమాంసమాసించి
గాల మందు చిక్కు కరణి భువిని
ఆశదగిలి నరుడు నాలాగు చెడి పోవు
విశ్వదాభిరామ వినుర వేమ

నీటిలో ఉండే చేప గాలానికి తగిలించి ఉండే ఎరకి ఆశ పడి తినబోయి, ఆ గాలానికి చిక్కి చస్తుంది. లోకాన అత్యాశకు పోయిన వాడు కూడ ఈలాగుననే నశిస్తాడు.

ఈ శ్లోకం చూడండి:

వయ మిహ పరితుష్టా వల్కలైస్త్వం దుకూలై:
సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేష:
స తు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కో2ర్ధవాన్ కో దరిద్ర:.

మాకు నార చీరలతోనే సంతృప్తి కలుగుతోంది. నీకు పట్టుపీతాంబరాలు ఉంటే కాని తృప్తి కలగడం లేదు. సంతృప్తిని పొందడం అనేది ఇద్దరకీ సమానంగానే జరుగుతోంది. నేను నార బట్టలతోనూ, నువ్వు పట్టు బట్టలతోనూ ఒకే లాగున సంతృప్తిని చెందడం లేదూ?ఐతే, ఇక్కడ చెప్పుకో వలసినది ఏమిటంటే, తృప్తి ఎవడికి లేదో, ఎవని ఆశకి అంతూ పొంతూ లేదో వాడు దరిద్రుడు !

లక్షాధికారైన లవణమన్నమె కాని మెఱుగు బంగారంబు మ్రింగ బోడు. ఆపాటి దానికి ఎందుకయ్యా మితిమీరిన తాపత్రయాలు?

మనస్సు సంతృప్తి చెందినప్పుడు ఇక ధనికుడెవరు? దరిద్రుడెవరు? అంతా సమానమే.

ఇలా ఉన్నది చాలదూ? అనుకోవడం విత్తం విషయంలోనే కానీ, విద్వత్తు విషయంలో కాదు సుమండీ.

స్వస్తి.







24, అక్టోబర్ 2010, ఆదివారం

చెట్లను ప్రేమిద్దాం ... !


కుమారుడు, తటాకము,కావ్యము,నిధానము,ఆలయము,వనము,భూదేవ స్థాపనము ఈ ఎనిమిదింటినీ మన పూర్వీకులు సప్త సంతానాలుగా పేర్కొన్నారు.

వీటిలో కొందరు కుమారునికి బదులుగా సత్ర ప్రతిష్ఠ ను సప్త సంతానాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. అదలా ఉంచితే, వీటిలో వనము అంటే తోట అని అర్ధం. తోటలు పెంచడంలో మన పూర్వీకులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అందులో ధార్మిక దృక్పథమూ, లోక కల్యాణ సంకల్పమూ తప్ప, వ్యాపార దృక్పథం ఇసుమంతయినా ఉండేది కాదు.

ఆర్ధిక ప్రయోజనం లేదనుకుంటే, ఎలాంటి చెట్లనయినా, అనాలోచితంగా మొదలంటా నరికి వేయడానికి సందేహించని ప్రవృత్తిని పెంపొందించుకున్నాం. ఎంత దురదృష్టమో కదూ?

ఈ సందర్భంగా మాకూ ఉన్నాయి స్వగతాలు పేరిట గోపీచంద్ వ్రాసిన తుమ్మ చెట్టు గుర్తుకు వస్తున్నది. అందులో భూకామందు తన పొలంలో పెంచుకున్న తుమ్మ చెట్టుని ఎంతో ప్రీతి పాత్రంగా చూసుకుంటాడు. కాని, అతను గతించాక, కాని కాలం దాపురించి, అతని అల్లుడు పొలం గట్టున ఆ తుమ్మ చెట్టు అసహ్యంగా ఉండడమే కాక, వ్యర్ధంగా ఉందని భావించి, నిర్దయగా దానిని కొట్టి వేయిస్తాడు. ఇందులో తుమ్మ చెట్టు ఆత్మగతం ఎంతో విఙ్ఞాన దాయకంగానూ, చాలా హృదయంగమంగానూ ఉంటుంది. తుమ్మ ముళ్ళు కాళ్ళలో దిగబడుతున్నా, దాని ఉపయోగం తెలిసిన రైతులు తుమ్మ చెట్టును ఎంతో ఆదరంగా చూసుకుంటూ ఉంటారు. దాని విశిష్టత తెలియని వ్యక్తుల దృష్టిలో తుమ్మ చెట్టు ఒక పనికి రాని చెట్టు. ఈ రచన చదివితే, ఒక్క తుమ్మ చెట్టే కాదు, ప్రతి చెట్టూ మానవాళికి ఎంతో ఉపయోగకారి అని గ్రహిస్తాం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ...

మన పెద్దలు వన దేవతలను కొలిచారు. చెట్లనూ, పుట్లనూ సేవించడం మన హైందవ సంస్కృతిలో ఒక ప్రథానభాగం.

మా చిన్నప్పుడు సోషలు పాఠంలో అశోకుడు రహదారికి ఇరు ప్రక్కలా చెట్లు నాటించెను. అనే అంశాన్ని ఎంతో ఇష్టంగా చదువుకునే వాళ్ళం. అశోకుడు రోడ్డుకి రెండు ప్రక్కలా చెట్లు ఎందుకు నాటించాడో తెలుసునా? అనడిగితే, దారి మధ్యలో అయితే ఇబ్బంది కదండీ అనే కొంటె కోణంగుల కాలమిది.

చెట్లను ప్రేమించడమంటే, ప్రకృతిని ఆరాధించడం.

ఎప్పుడో, ఏడాదికోసారి వన మహోత్సవాల తంతు తూతూ మంత్రంగా జరిపించి, చేతులు దులుపుకోవడం అనే ప్రహసనం మనకు తెలిసిందే.

కాని , మన పూర్వీకుల అలా కాదు. వృక్ష జాతిని దేవతాగణంగా తలపోసి ఆరాధించే వారు.
వాపీకూప తటాకాలు ప్రతిష్ఠించి, వనాలను అభివృద్ధి చేసే వారు. అటవీ సంపదకూ, వర్షాలకూ, భూసార పరి రక్షణకూ, సుఖతరమైన ప్రజా జీవితానికీ, చెట్లు ఆధారం అని ఏనాడో గ్రహించారు. అలాంటి వనాలను అభివృద్ధి చేసి ఆదర్శప్రాయులయ్యారు.

వృక్షో రక్షతి రక్షిత: అన్నారు.

ఈ శ్లోకం ఆ విషయాన్నే ఎలుగెత్తి చాటుతోంది. చూడండి:

దశకూప సమా వాపీ. దశ వాపి సమో హ్రద:
దశ హ్రద సమ: పుత్రో దశ పుత్ర సమో ద్రుమ:

పది నూతులతో ఒక దిగుడు బావి సమానం. నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె
సూనృత వ్రత యొక బావి మేలు .... అని నన్నయ గారు శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేత చెప్పించిన పద్యం ఇదే విషయాన్ని వివరించింది.

ఇక, పది దిగుడు బావులతో ఒక చెఱువు సమానం. ఒక కుమారుడు పది చెఱువులతో సాటి రాగలడు.
పదిమంది పుత్రులతో సమాన మైనది ఒక మహా వృక్షం !!

అని, చెట్టు ప్రాముఖ్యం ఎలాంటిదో వివరించారు.

అంతే కాదు, ఏయే చెట్లు నాటి పోషిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందో కూడా వివరించారు.

చూడండి:

అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం, న్యగ్రోథ మేకం దశతిన్త్రిణీకం
కపిత్థ బిల్వా2మలక త్రయంచ, పంచామ్రవాపీ నరకం న పశ్యేత్.

ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షం ( అంటే, వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు), ఒక మ్రరి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు. అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం ! అంటే, వారికి స్వర్ట ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.

స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను అదే లెక్కతో నాటి, అక్కడ ఓ దిగుడు బావి తవ్విస్తే సరి పోతుంది కాబోలు అనుకో వద్దు. లెక్క కేం కానీ, వీలయినన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశం.

చెట్లు కూలుతున్న దృశ్యాలు మనకింక కనిపించ కూడదు. కదూ?

స్వస్తి.

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

హిత వచనమ్ డాట్ కామ్


సాధారణంగా ప్రసంగవశాత్తు మనం మన పెద్దల నుండి విన్న నానుడులో, సామెతలో, పద్య పాదాలో, శ్లోక చరణాలో సందర్భవశాత్తు ఉటంకిస్తూ ఉంటాం.అలా ఉటంకించే వాటిలో సద్య పాదాల, శ్లోక చరణాల చివరి పంక్తులు మాత్రమే చెబుతూ ఉంటాం. వాటి పూర్తి పాఠం మనలో కొందరకి తెలియక పోవడం కద్దు. అలాంటి వాటి పూర్తి పాఠాలను కొన్నింటిని ఇక్కడ చూదాం.

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తరుచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ శ్లోకం పూర్తి పాఠం ఇది:

అపి స్వర్ణమయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

తమ్ముడా లక్ష్మణా ! ఈ రావణ లంక మొత్తం బంగారుమయం అయితే కావచ్చును. కానీ నాకిక్కడ ఉండడం సమ్మతం కాదు. ఈ వైభోగాలేవీ నాకు రుచించడం లేదు. మన బంధుగణాన్నీ,అయోధ్యాపురినీ వెంటనే చూడాలని ఉంది. ఎందుకంటే, కన్న తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

మరొకటి:
నాస్తి జాగరతో భయం అంటూ ఉంటారు కదా, దీని పూర్తి పాఠం చూడండి:

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం

చక్కగా వ్యవసాయం చేస్తే కరువు కాటకాలంటూ ఉండవు. నిత్యం జపతపాలు చేస్తూ ఉంటే అన్ని
పాపాలూ పోతాయి. మౌనంగా ఉండడం వల్ల ఎవరితోనూ జగడం అన్నదే ఉండదు. మెలకువగా, జాగ్రత్తగా ఉంటే భయమన్నదే ఉండదు.

మరొకటి:

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే దాని పూర్తి పాఠం చూడండి:

విద్వత్త్వంచ నృపత్వంచ
నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే

పండితుడు, రాజు వీరికి పోలికే లేదు. రాజు కేవలం తన దేశంలోనే , అంటే తన రాజ్యం లోనే
గౌరవించబడతాడు. ఇక పండితుడో? లోకమంతటా గౌరవాదరాలు పొందుతాడు.

దేనికయినా మరీ ఓవరయి పోతూ ఉంటే అతి సర్వత్ర వర్జయేత్ అని హెచ్చరిస్తూ ఉంటాం,దీని పూర్తి పాఠం చూడండి:

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

కన్నూ మిన్నూ కానకుండా దానాలూ ధర్మాలూ చేసుకుంటూ పోతే నాశనమై పోతాం సుమా.అందుకు భారతం లోని కర్ణుడే తార్కాణం. ఇంద్రుడు కపటోపాయంతో కవచ కుండలాలు దానమడిగితే మరో ఆలోచన లేకుండా వాటిని దానం చేసీసేడు. అవి లేనందు వలన యుద్ధంలో మరణించాడు. అలాగే మరీ అంత దురాశా పనికి రాదు. తమదీ, పాండవులదీ కూడా రాజ్యం తనకే దక్కాలనే పేరాశతోనే కదా, దుర్యోధనుడు పేచీల మీద పేచీలు పెట్టి, కడకు భరత యుద్ధంలో దుర్మరణం పాలయ్యేడు. అలాగే మితి మీరిన కామంతో రావణుడు సీతాపహరణం చేపి రఘురాముని చేతిలో మరణించాడు. అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు
సుమా !
అందుకే చెప్పేరు, ఎప్పుడూ అతి వద్దు. మితి ముద్దు. అని.

మరొకటి చూడండి:
చెబితే వింటాడూ? వాడి కెంత తోస్తే అంత! అనుభవిస్తాడు వెధవ ! బుద్ధి: కర్మాను సారిణీ అని, మన వాళ్ళు ఊరికే అన్నారా? అనడం వింటూ ఉంటాం. దాని పూర్తి రూపం చూడండి.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగానుసారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.

ఇంకొకటి చూదామా?

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి పుట్టి ఉండడం ఎప్పుడూ జరిగి ఉండ లేదు. అలాంటి బంగరు లేడిని ఎన్నడూ చూడనూ లేదు. విననూ లేదు. కాని, ప్రియసతి సీత అడిగింది కదా అని,ముందు వెనుకలు ఆలోచించకుండా బంగారు లేడిని తీసుకుని రావడానికి విల్లంబలు ధరించి రాముడు పరిగెత్త లేదూ? ఆ పిదప రావణుడు సీతను అపహరించడం, రాముడు పడిన వేదన, రావణ వధ ఎన్న ఇడుముల పాలయ్యాడో కదా? చెడి పోయే కాలం వస్తే అలాంటి విపరీతమయిన బుద్ధులే పుడతాయి మరి !

చివరగా మరొకటి ...

చెప్పింది చెప్పినట్టు వెంటనే ఎప్పుడూ చేయవు కదా, ప్రతీ దానికీ ఊరకే తటపటాయిస్తావు.ఆలస్యాదమృతం విషం రా నాయనా ! అని కోప్పడుతూ ఉంటాం. దాని పూర్తి పాఠం చూడండి మరి:

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యవ్వనమ్
కాలక్షేపం న కర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని వేడి వేడిగా తినక పోతే అది జీర్ణమై చావదు. చల్లారిన భోజనం విషతుల్యం.అలాగే, యవ్వన వతులైన ముదితలు వారి యవ్వనం కోలు పోయాక అందగించరు. ప్రతీదీ తరువాత చూదాం లే అని, తాత్సారం చేయడం కూడా మంచిది కాదు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారి పోతుంది సుమా!

ఇప్పటికివి. మరి కొన్ని తదుపరి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం.

సంస్కృత శ్లోకాలే కాదు, మన కవిత్రయం వారి భారతం లోనూ. పోతన గారి భాగవతం లోనూ, రామాయణం లోనూ, ఇతర ప్రసిద్ధ కావ్యాలు, ప్రబంధాలలోనూ ఇలాంటివి చాలా కొటేషన్లు కనిపిస్తూ ఉంటాయి.

వీలుని బట్టి వాటిని మన హిత వచనమ్ డాట్ కామ్ లో చూదామా?

స్వస్తి.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

సతాయింపు వారి సహజ గుణము !


ద్వా విమౌ పురుషౌ లోకే, శిరశ్శూల సమౌ మతౌ,
గృహస్థశ్చ నిరారంభో, యతిశ్చ సప్రతిగ్రహ:

లోకంలో ఇద్దరి వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు మనకు తల నొప్పిగా పరిణమిస్తారు.
ఎవరయ్యా వాళ్ళు, అంటే,

ఏపనీ చేయని ఇంటి యజమాని ఒకడు.

రెండో వాడు సన్యాసం తీసుకుని కూడా గృహస్థుల దగ్గర డబ్బు ఆశించే యతి.

వీళ్ళిద్దరితో తల నెప్పి ఇంతా అంతా కాదు. శ్లోకంలో శిరశ్శూల సమౌ అనే పదం వీళ్ళు మనకి తల నెప్పితో సమానం అని చెబుతోంది.

నిజమే కదూ, ఏపనీ చేయకుండా, నిర్వ్యాపారంగా ఇంట కూర్చుని తింటూ, అలాగని ఊరు కోకుండా ప్రతి దానికీ సతాయిస్తూ ఉండే మగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో తల నెప్పి కాక మరేమిటి?

ఇక, సన్యాసం తీసి కొన్న యతులు మన మతులు పోగొట్టే వైభోగాలు అనుభవిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం కదా? కాషాయం కట్టి, సర్వం పరిత్యజించామని చెప్పుకునే వాళ్ళు కూడా, ధనం కోసం పీడించడం సతాయింపు కాక మరేమిటి చెప్పండి ?

వీళ్ళలో కొందరికి కట్న కానుకలు కావాలి. పాద పూజలు కావాలి. పూల దండలు కావాలి. ఎర్ర తివాచీ ఆహ్వానాలు కావాలి. ఏసీ కార్లూ, గదులూ కావాలి. విమాన ప్రయాణాలు కావాలి. విదేశాలలో లభించే సకల వైభోగాలూ కావాలి.

కుదిరితే కప్పు కాఫీ లాగ, అందమైన అమ్మాయిలూ, సినీ తారలూ కావాలి ...

అబ్బో, ఆశా పాశము కడున్ నిడుపు. లేదంతంబు ....

పనీ పాటు చేయని వాళ్ళంటే, కేవలం రిటైరయిన వాళ్ళూ, వృద్ధులూ మాత్రమే అనుకో నక్కర లేదండీ. మంచి వయసులో ఉండే మగానుబావులు కొందరిలోనూ ఈ పని గండం గాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ సతాయింపు అనుభవించే ఇంట్లోని వ్యక్తులకే ఎరుక.

శ్లోకంలో పురుషుల గురించే చెప్పారు కనుక ఆడవారికి మినహాయింపు ఉందనుకో నక్కర లేదండోయ్.

పని చేస్తూనో, చేయకుండానో, , చేస్తున్నట్టు నటిస్తూనో, సతాయించే తల నెప్పి లలనలకు
తక్కువేం లేదు.

ఏతావాతా ఈ సతాయింపు గాళ్ళు తల నెప్పి మాత్రలూ, మందులూ తయారు చేసే కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లుగా చక్కగా పనికొస్తారు.

అయితే, అందుకూ సతాయిస్తారేమో, కదూ !

6, సెప్టెంబర్ 2010, సోమవారం

పోనిద్దురూ ...!!


ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా:
ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాం
గిరిశిఖరగతా2పి కాక పంక్తి:
పులినగతై ర్న సమత్వమేతి హంసై:

లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు.మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు.
కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి.
మరి హంసలో ? నేల మీద నదీ పులినతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !

ఇదీ ఈ శ్లోకార్ధం.

నిజమే కదా, ఉన్నతులు నిగర్వులై, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇడుములు పడుతూ ఉండడం, కుసంస్కారుల చేత నిదాదరణ. తిరస్కారాలు పొందుతూ ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాం.

అలాగే, అధములు ఆడంబర జీవనం గడపడమూ మనకి తెలిసినదే. నిజానికి ఈ పాడు లోకంలో అలాంటి వారికే మన్నన ఎక్కువగా ఉండడం బాధాకరం. కాని, అది లోక రీతి.

ఏం చేస్తాం చెప్పండి?
యస్యాస్తి విత్తం స నర: కులీన: స పండిత: స:శ్రుతవాన్ గుణఙ్ఞ:
స ఏవ వక్తా సచ దర్శనీయ: సర్వే గుణా: కాంచన మాశ్రయన్తి.

ఎవడు ధనవంతుడో వాడు కులీనుడు. పండితుడు. వివేకి. ధన్యుడు. నేర్పరి. ఆహా, అన్ని గుణాలూ బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా !

అయితే, కాలాంతరంలో నయినా ఎవరి విలువలు ఎలాంటివో విశదం కాక తప్పదు. కాకులు కొండ కొనన ఉన్నా, హంసలతో సరి కావు కదా !

పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొన కొమ్మలనుండగ గ్రింద గండభే
రుండ మదేభసింహ నికురంబములుండవె? చేరి భాస్కరా !

చెట్టు క్రింద గండ భేరుండాలు, మదించిన ఏనుగులు, సింహాలు ఉంటూ ఉండగా, ఒక కోతి మాత్రం చెట్టు కొమ్మల చివరన ఎక్కి కూర్చున్నదట. అంత మాత్రం చేత, ఆ మృగములకు వచ్చిన తక్కువతనం ఏమీ లేదు.
అలాగే, మహా పండితులందరూ నేల మీద సుఖాసీనులై ఉంటే, ఒక అల్పుడు ఉన్నతాసనం ఎక్కి కూర్చుంటే ఆ పండితుల గొప్పతనమేమీ తరిగి పోదు.

మణిలాగ కనిపించినంత మాత్రం చేత గాజు పూస మణి కాజాలదు. గాజు గాజే.మణి మణే కదా !

అలాగే, వసంత కాలం వచ్చినప్పుడు కదా, కాకి ఏదో, కోకిల ఏదో తెలియవచ్చేది ?!


26, ఆగస్టు 2010, గురువారం

కత్తి మీద సాము ...


సేవా ధర్మం చాల కష్టతరమైనది. నిజానికది కత్తి మీది సాము లాంటిది. రాచ కొలువు లభించడం ఎంత కష్టమో, దానిని నిర్వహించడం అంతే కష్టం. ప్రభువుల వారికి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. ఎంతో మెళకువతో మెలగాలి. ఈ శ్లోకం ఆ అర్ధాన్నే వివరిస్తోంది:

మౌనా న్మూర్ఖ: ప్రవచన పటు:, నాతులో జల్పకో వా,
ధృష్ట: పార్న్వే వసతి నియతం చూరతశ్చా: ప్రగల్భ:
క్షాంత్యా భీరు ర్యది న సహతే ప్రాయశోనా2భిజాత:
సేవాధర్మ: పరమ గహనో యోగినా మస్యగమ్య:

సేవలు చేసి మెప్పు పొందడం చాల కష్టమైన పని. అది నిర్లిప్తంగా ఉండే యోగులకు కూడ అగమ్యగోచరం. సేవకుడు ఎలా ప్రవర్తించినా ఏదో ఒక తప్పు పట్టుకుంటారు యజమానులు.
మాట్లాడ కుండా మౌనంగా ఉంటే వొట్టి మూర్ఖుడని అంటారు.
మాటకారి అయితే వాగుడుకాయ అని తిడతారు.
ఓర్చుకుని సహనంగా ఉంటే పిరికిపంద అని వెక్కిరిస్తారు.
ఎదురాడితే తక్కువ జాతివాడంటారు.
యజమానికి ఎప్పుడే అవసరం ఉంటుందో అని, అతనికి సమీపంలో ఉంటే పొగరుబోతని అంటారు.
దూరం దూరంగా ఉంటే చేత కాని చవట అంటారు.
ఇలా సేవకునిలో లేని తప్పులని పదే పదే ఎత్తి చూపుతూ యజమానులు నానా యాగీ చేస్తారు.
సేవా ధర్మం చాలా కష్టం బాబూ !