ప్రస్తావన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రస్తావన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2016, మంగళవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... ప్రస్తావన

మా 8 రోజుల తమిళ నాడు యాత్రాదర్శన విశేషాలు
ప్రస్తావన
గత 2015 అక్టోబరు నెలలో మా అన్నదమ్ములం నలుగురమూ ( ఆఖరి వాడు రాలేక పోయాడు)
శ్రీమతులతో సహా కాశీ, గయ, ప్రయాగ యాత్రలు చేసి వచ్చేం. మాతో మా మరదలు హైమ కూడా వచ్చింది.
ఆ యాత్రా విశేషాలన్నీ మా అన్నయ్య ‘‘ మా కాశీ యాత్ర విశేషాలు’’ పేరిట ముఖ పుస్తకంలో వివరగా చక్కగా రాసేడు.
ఈ ఫిబ్రవరి 25 వ తేదీన నేనూ, నా భార్య విజయ లక్ష్మి తమిళనాడు యాత్రలు చేసి వచ్చేము.
తమిళ నాడు టూరిజమ్ వారు ఏర్పాటు చేసిన 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శిని లో బయలు దేరి వెళ్ళి వచ్చేము. అసలు తమిళ నాడు టూరిజమ్ వారి ( ఇక నుండిదీనిని ttdc అని పేర్కొంటాను) ఈ పేకేజీ గురించి, మేము హైదరాబాద్ లో ఉండే రోజులలోనే, ఐదేళ్ళ క్రిందటే మా తమ్ముడు క్ష్మణ్, మరదలు
శారద చాలా బాగుంటుందని చెప్పేరు. వాళ్ళు అప్పటికే వెళ్ళి ఉండడంతో వాళ్ళ అనుభవం మాకు అక్కరకొచ్చింది. ఐతే, ఎప్పటి కప్పుడు వెళ్దాం అనుకుంటూనే తాత్సారం చేసాక, దైవ సంకల్పం వల్ల ఇప్పటి కయింది. ఆ 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలనూ 8 భాగాలలో మీ తో పంచు కోవాలని అనుకుంటున్నాను. సూక్ష్మాంశాలతో పాటూ సవివరంగా రాదామని నాప్రయత్నం. వెళ్ళ దలచు కున్న
వారికి ఉపయుక్తంగా ఉండే లాగున పేకేజీవిరాలూ, ధరవరలూ, వసతులూ, భోజన సదుపాయాలూ షాపింగ్ స్థలాలూ వాటి గురించి చెబుతాను. ఆ యాత్రాస్థలాల గురిచి క్లుప్తంగా నయినా తెలియ జేస్తాను. ఆసక్తి కలవారు అంతర్జాలంలో గూగులమ్మని అడిగితే ఆ యమ ఎలాగూ చెబుతుంది!
పేకేజీ వివరాలు:
తమిళనాడు గవర్నమెంట్ టూరిజమ్ వారి 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శినిలో రాత్రి పూట ప్రయాణాలు ఉండవు. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి వారి టూరిజమ్ హొటళ్ళు ఉండే ప్రాంతాలకి చేరుస్తారు. ఆ హొటళ్ళ లో బస. మళ్ళీ మరు నాడు ఉదయంబ్రేక్ ఫాస్టు అయ్యాక మరో యాత్రా స్థలానికి ప్రయాణం. AC Non Ac బస్సులూ, టూరిజమ్ వారి హొటళ్ళూ ఉంటాయి.
మేము టూర్ కి A C కోచ్ నీ, బసకి AC రూమునీ బుక్ చేసుకున్నాము. ఒక్కో టిక్కెట్టు ధర రూ.14,050. మొత్తం 28,100 ఇచ్చి నెట్లో బుక్ చేసుకుని ప్రింటవుట్ తీసుకున్నాను. ( మనం సీనియర్ సిటిజన్ల మయినా, వికలాంగుల మయినా ఒక్కో టిక్కెట్ కి 20 శాతం నగదు రిఫండ్ యాత్ర పూర్తయాక వెంటనే ఇచ్చేస్తారు !)
ఈ పేకేజీలో మనకి చూపించే యాత్రా స్థలాలు ఇవి:
1పుదుచ్చేరి,2 పిచ్చ వరం 3.చిదంబరం 4.వైదీశ్వరన్ కోయిల్ 5నాగ పట్నం ( నాగూర్) 6 వేలంకిని 7.తంజావూరు 8.రామేశ్వరం 9.కన్యా ుమారి10.సుచీంద్రం11. మధురై12.కొడైకెనాల్ 13.తిరుచ్చి (శ్రీరంగం)
ఇవి కాక దారిలో అదనంగామరో ఇవి కాక పేకేజీలో లేని నాలుగయిదు ముఖ్య స్థలాలను కూడా చూపెడతారు. వీటిలోవైదీశ్వరన్ కోయిల్,
తంజావూర్ ,రామేశ్వరం, కన్యా కుమారి, మధురై, కొడైకెనాల్, తిరుచ్చి లలో రాత్రి బస.
టూరిజమ్ వారి కేంటీన్లలో ప్రతి చోటా ఉదయం స్వీటుతో పాటు నాలుగయిదు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి స్వీటుతో పాటు చక్కని రుచికర మయిన భోజనాలు కొసరి కొసరి వడ్డించేరు. ఎక్కడి క్కడ వాటర్ బాటిళ్ళు కొనుక్కునే వాళ్ళం. పేకేజీ నిబంధనల ప్రకారం ఉదయం టిఫిను తప్పని సరిగానూ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టూరిజమ్ వారే ఇస్తారు. ఏదో ఒక పూట మంచి హోటల్ వద్ద ఆపుతారు. మన ఖర్చుతో నచ్చినవి తీసుకో వచ్చును.
పగటి పూట యాత్ర ముగించుకుని టూరిజమ్ వారి హొటల్ కి చేరు కోగానే రూమ్ బాయస్ మన సమాన్లు భద్రంగా మనుకు కేటాయించిన గదులకు చేరుస్తారు.
అలాగే మరు నాడు ఉదయమే బస్ వద్దకు చేరుస్తారు. ఎక్కడా టిప్ కోసం చేయి చాపిన దాఖలాలు లేవు.
టూరిజమ్ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం, వారి టూరిజమ్ శాఖ తీసుకుంటున్న శ్రద్ద ఎంతయినా మెచ్చుకో తగినదే. మనతో పాటు ఒక గైడూ, కోచ్ డ్రైవరూ, అతని సహాయకుడూ ఉంటారు. మా గైడ్ పేరు గణేశ్.
మా యాత్ర చెన్నై లో ఫిబ్రవరి 27 శనివారం ఉదయం 7 గంటలకి మొదలై మార్చి 5వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటకి ముగుస్తుంది. కనుక, మేం ఒక రోజు ముందుగా అంటే 26 వ తేదీ నాటికే చైన్నై చేరు కోవాలి. అందుచేత మేం 25 సాయంత్రం 5.45ని.కి విజయ నగరంలో ఎక్కడానికి వీలుగా భువనేశ్వర్,
చైన్నై సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ లో 3rd AC టిక్కెట్లు బుక్ చేసు కున్నాము. అలాగే తిరుగు ప్రయాణానికి చెన్నైలో 5 వ తేదీ రాత్రి 11.45 కి బయలు దేరే హౌరా మెయిల్ లో టిక్కెట్లు బుక్ చేసు కున్నాము.
ఐతే, స్లీపరు క్లాసు తప్ప ఎ.సి దొరక లేదు. సరే లెమ్మనుకున్నాం.టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇక ప్రయాణం తేదీ కోసం ఎదురు చూడడమే !
మద్రాసుకి ప్రయాణంతో మొదలయ్యే మా తమిళ నాడు యాత్రా దర్శిని రోజు వారీ వివరాలు సశేషమ్!