హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఆగస్టు 2013, శనివారం

కళ్ళున్న కబోదులూ ... చెవులున్న బధిరులూ ...



పదవీ లాలస, పెదవీ లాలస పట్టు కుంటే వొక పట్టాన వొదిలేవి కావు.లోకంలో ప్రతి మనిషికీ ఆహార నిద్రా భయ మైధునాలతో పాటూ అమిత జీవితేచ్ఛగా ఉండేది ఏదో ఒక ఉన్నతమైన పదవి పొందాలని ఉంటుంది. ఎదుటి వాడి కంటె వొక మెట్టు అధికంగా ఉండాలని ఉంటుంది. ఏదో వొక పదవి కాలవాలని తాపత్రయ పడతాడు. అందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు కానీ, ఆ కోరిక దురాశగా మారి పోతేనే ప్రమాదం. అదే అన్ని అనర్ధాలకూ హేతువవుతుంది.
ఈ దురాశ ఎలాంటిదంటే ..
ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీమతే
లక్షాథిపస్తథా రాజ్యం. రాజ్యస్థ: స్వర్గ మీహతే

అంటే ... వంద ఉన్న వాడు వెయ్యి కావాలను కుంటాడు. వెయ్యి ఉన్న వాడు లక్ష కోరు కుంటాడు. లక్షాథికారి
 ( ఇప్పుడు ఎన్ని లక్షలూ చాలవను కోండి, అది వేరే మాట) ప్రభుత్వం, పదవి కావాలను కుంటాడు. రాజు స్వర్గాన్నీ, స్వర్గ సుఖాలనూ ఆశిస్తాడు ...

కానీ, కవి ... కారే రాజులు రాజ్యముల్ కలుగవే ... అంటూ గర్వించిన వారంతా సిరి మూట కట్టుకుని పోగలిగేరా ? అని నిలదీసాడు.... కానీ ఆశాపాశము కడున్ నిడుపు .. లేదంతంబు రాజేంద్ర !

ఎప్పటికయినా సుకవి ప్రజల నాలుకల మీద నిలిస్తే, రాజు శిలా ప్రతిమలా ఉండాల్సందే కదా ...


ధూర్జటి  పదవీ కాంక్ష ఎలాంటిదో చెప్పాడు కదా ... .

ఒకరిం జంపి పదస్థులై బ్రదుక  తా మొక్కొక్కరూహింతు రే
లకొ ? తామెన్నడు జావరో ? తమకుఁబోవో సంపదల్ ? పుత్ర మి
త్ర ళత్రాదుల తోడ నిత్య సుఖముంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నఁడుం కటకటా శ్రీకాళ హస్తీశ్వరా !

భావం: ఎవడినో ఒకడిని తుదముట్టించి, తాము వాడి పదవిని దక్కించు కోవాలని కొందరు చూస్తూ ఉంటారు. ఏమీ, తాము మాత్రం ఎప్పుడూ చావరా ? తమకు సంపదలు పోవా ? భార్యా పిల్లలూ, స్నేహితులతో ఎల్లకాలం సుఖంగా ఉంటారా ? బతికి ఉన్న వారికి  చావు రాదా ?

కానీ వారికి అదేమీ పట్టదు, ఒక్క రోజు రాజు చెయ్యి గణనాథా ! అంటూ తహతహలాడి పోతూ ఉంటారు.

రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు ... అనికూడా కవి చెప్పాడు. అంతే కాదు. ఒక సారి . పదవి అంటూ లభించేక వాడెలా మారి పోతోడా కూడా విపులంగానే వివరించాడు:

చూడండి:
రాజన్నంతనె బోవునా కృపయు, ధర్మం బాభిజాత్యంబు,వి
ద్యాజాత క్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సంరక్షయున్
సౌజన్యంబు, కృతం బెఱుంగుటయు,విశ్వాసంబుగాకున్న దు
ర్భీత శ్రేష్ఠులు గాఁ కతంబు కలదే శ్రీకాళ హస్తీశ్వరా !

రాజు అయ్యాడంటే చాలు, దయావిహీనుడైపోతాడు. ధర్మం మరచి పోతాడు. ఆభిజాత్యం పెరిగి పోతుంది, పండితులంటే లెక్క చేయడు. సత్యం పలుకడు, మంచి వారిని కాపాడడు, మంచి తనం అసలే ఉండదు, చేసిన మేలు మరచి పోతాడు, విశ్వాసహీనుడవుతాడు. ఏం కారణమో కదా ...

నిజమే ఓ సారి పదవి లభించేక చాలా మందిలో లేని కొమ్ములు మొలుస్తాయి. తామేదో దైవాంశ సంభూతుల మనుకుంటారు. కన్నూ మిన్నూ కానరు. యుక్తా యుక్త విచక్షణా ఙ్ఞానం నశించి పోతుంది. లభించిన పదవిని నిలుపు  కోడానికి ఎంత కయినా తెగిస్తారు. లోకంలో చూడ్డం లేదూ ?
రాజ్యపాలన అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
.
కాళిదాస మహా కవి అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో రాజ్యం గురించి చెబుతూ ...

నాతి శ్రమాపనయనాయ, నచ శ్రమాయ
రాజ్యం స్వ హస్త ధృత దండ మివాతపత్రమ్.  ... అంటాడు.

రాజ్య సుఖం ఎలాంటి దంటే, తన చేత్తో స్వయంగా పట్టుకున్న గొడుగులాంటిది. అంతగా శ్రమను పోగోట్టదు, అలాగని శ్రమని కలిగించదు.

అయితే, రాజుకి నిజమైన ప్రజాభి మానం అంటూ ఉంటే, అది చేతి గొడుగు లాంటిదని మరో కవి చెబుతున్నాడు చూడండి:

ప్రజాగుప్త శరీరస్య కిం కరిష్యతి సంహతా:
హస్త న్యస్తాతపత్రస్య వారిధారాఇవారయా.

ప్రజాభిమానం చేతి గొడుగులాంటిది. వర్షం ఏం చేయ గలదు ?

అందు చేత రాజైన వాడు ప్రజాభిమానం సత్య మార్గంలో పొందాలి. అలాంటి నాయకులను ప్రజలు ఎన్నటికీ మరచి పోరు. అలాంటి ప్రభువులే   ప్రాత: స్మరణీయులు.

పాలకుడైన రాజు పూలు కోసి, దండలు కట్టే తోటమాలిలా ఉండాలి. కానీ, చెట్లు నరికి బొగ్గులు చేసే వాడిలా ఉండ కూడదని శ్లోక కారుడు చెబుతున్నాడు. చూడండి:

పుష్పమాత్రంవిచినియాత్
మూలచ్ఛేదం నకారయేత్
మాలాకారయివారామే
న యథాంగార కారక:.

మహా భారతంలో రాజనీతి ధర్మాలు విదురుడూ, ధౌమ్యుడూ , నారదుడూ,  భీష్ముడూ వంటి  పెద్దలు చాలానే చెప్పారు
.
ధౌమ్యుడు  పాండవులకు చెప్పిన సేవా ధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.

 నారదుడు చెప్పిన రాజధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.

భీష్ముడు  ధర్మ రాజుకి చెప్పిన  మంచి మాటలు కొన్ని ఇక్కడ నొక్కి చదవొచ్చును.

రాజు నడచిన బాటలోనే ప్రజలూ నడుస్తారని యథా రాజా తథా ప్రజా: అనే నీతి వాక్యం కూడా  బోధిస్తోంది.


పదవి కాస్త ఊడిపోయేక ప్రభువు పని ఏమవుతుందో తెలుసా ?

పద్యం చూడండి:

విధి సంకల్పముచే నొకానొకఁడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదాభాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధికారాంతము నందు చూడ వలెగదా నయగారి భాగ్యముల్ !

అదృష్ట వశావ్న అధికారం లభించి, రాజ్య పాలన చేయడం మొదలెడితే, చెవిటి వాడవుతాడు. అంటే మంచి మాటలు చెవికెక్కవు, కన్నూమిన్నూ కానడు. మదం పెరిగి పోతుంది. అన్ని వ్యసనాలూ అలవడతాయి. మాట్లాడితే అన్నీ చెడ్డ మాటలే. పదవి ఊడేక వాడి సౌభాగ్యం చూడాలి మరి ...


మరి, ఇప్పుడున్న వారిలో పలువురు ప్రజా సేవకులా ? ప్రజా కంటకులా ?

కాలమే నిర్ణయిస్తుంది కదూ ...

నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే ...

స్వస్తి.










31, ఆగస్టు 2011, బుధవారం

కంటికి నిద్ర లేదు !!


సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

ఈ సందర్భం లోనే గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని ఒక చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. ( వాడి తొలి పరిచయం ఇక్కడ చూడండి ) ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి, ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

నాకు బ్లాగు రాయడం మీద చెప్ప లేనంత విరక్తి కలిగింది. కథా మంజరిని మూసేద్దామని నిర్ణయాని కొచ్చేను.

కానీ మా తింగరి బుచ్చి గాడు తన ఆత్మ కథను కథా మంజరిలో రాయాలని పట్టుబట్టేడు. అందు వల్ల తప్పడం లేదు.

త్వరలో మా తింగరి బుచ్చి గాడి ఆత్మ కథ కథా మంజరిలో. వేచి చూడండి ...





29, జనవరి 2011, శనివారం

కష్ట చతుష్టయమ్


ఎంతటి ధీరుడైనా నాలుగు రకాలయిన కష్టాలను మాత్రం ఓర్చుకో జాలడని పెద్దలు చెబుతున్నారు.

అవేమిటో చూద్దాం ...

సహస్ర దు:ఖాని సహంతి ధీరా : చత్వారి దు:ఖా న్యతి దుస్సహాని
కృషీ చ నష్టా గృహిణీ చ దుష్టా, పుత్రో2స్యవిద్వాన్ , ఉదరే వ్యథా చ.

ధీరులు వేయి దు:ఖాలనయినా ఓర్చుకో గలరు. అంటే, ఎన్ని కష్టాల నయినా సహించ గలరు. కానీ, నాలుగు రకాలయిన కష్టాలు మాత్రం వారికి అత్యంత దుస్సహమైనవి.

అవి యేమంటే ...

కృషి వినష్టమైతే ఆ కష్టాన్ని ఎంతటి ధీరుడూ ఓర్చుకో లేడు. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం చెడిపోతే అ దు:ఖం ఎంతటి ధీరుడినీ భీరువుగా చేస్తుంది.

ఇక రెండవది - భార్య దుష్టు రాలైతే ధీరుడు ఓర్చుకో లేడు.

పుత్రుడు విద్యా గంధ శూన్యుడయితే ఎంతటి ధీరుడూ సహించ లేడు.

ఇక, నాలుగవది - ఉదర బాధ. కడుపు నొప్పికి ఎంతటి ధైర్యవంతుడయినా తాళ లేడు.

ఈ రకంగా ఈ శ్లోకంలో ధీరుడు వేయి కష్టాలను సహించ గలడు కానీ, వ్యవసాయం నష్టమైనా, భార్య గయ్యాళిదైనా, కుమారుడు చదువు రాని దద్దమ్మ అయినా, కడుపులో నెప్పి కలిగినా ఓర్చుకో జాలడని కవి చెబుతున్నాడు.

25, జనవరి 2011, మంగళవారం

సాహసం శాయరా డింభకా !!


సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.


పిరికి గొడ్డులా ఉంటే లోకం తరిమి కొడుతుంది. అదే, బోర విరుచుకుని తిరిగేవనుకో లోకం సాగిల పడుతుంది. వెనుక బడితేను వెనకేనోయ్ అన్నాడు కవి. సాహసం చేయ లేక పోతే ఏదీ సాధించ లేం.‘ చెట్టు లెక్క గలవా ? పుట్ట లెక్క
గలవా ?..’’ అంటూ చెంచు లక్ష్మి కూడా ఓ క్వశ్చనీర్ హీరో గారి ముఖాన కొట్టడం తెలిసిందే కదా.

మా చిన్నప్పుడు ఊళ్ళోకి సర్కస్ కంపెనీ వచ్చిందంటే పండుగే, పండుగ ! పొద్దస్తమానం ఆ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండే వాళ్ళం. సర్కసు చూసొచ్చిన కుర్రాళ్ళు ఇంటి వెనుక పెరళ్ళలో ఏవో ఫీట్లు ప్రాక్టీసు చేయబోవడం రివాజు. అలా, మా వీధి పిలగాయలు నలుగురైదుగురు కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్న వాళ్ళూ లేక పోలేదు. సింహాలూ. పెద్ద పులులూ దొరికే ఛాన్సు ఎలాగూ లేదు కనుక,సీమ పందికి తర్ఫీదు ఇవ్వ బోయి అది భీకరంగా నిరాకరించడంతోను, తొడ కండ పీకేలాగున తన అసమ్మతి చూపడంతోను మంచాన పడిన కుర్రాళ్ళూ ఉండే వారు.

అలాగని సాహసాలు చెయ్యకుండా ఎలా ఉంటాం చెప్పండి?

సాహసాలంటే మంటల్లో దూకడాలూ, ఎత్తుల మీంచి దూకడాలూ మాత్రమే కానక్కర లేదు.

మా డింగరి బుచ్చబ్బాయ్ తనకి సున్నా మార్కులు వేసిన లెక్కల మాష్టారి మీదకి చాటుగా గురి చూసి మెట్లంగి రాయొకటి విసర లేదూ ? అప్పుడు వాడి సాహసానికి మేఁవంతా నోళ్ళు వెళ్ళబెట్టేం కదా. సాహసం కోసం మరీ ఇంతలేసి అకృత్యాలు చెయ్యమనడం లేదు కానీ, మీ పరిధిలో మీరు ఏవో ఒకటి రెండు సాహసాలయినా చేయక తప్పదు,జీవిత కాలంలో.

తెలుగు వర్ణమాల తెలిసిందే కదా, మరింకేం - ఏ కవితో రాసి పారెయ్యండి. ధైర్యంగా ఏ తలమాసిన పత్రికకో పంపించెయ్యండి. అచ్చోసిన వాడూ, చదివిన వాడూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళు పోతారు. ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ఇతరులకే కానీ మనకి ప్రమాదమేమీ లేదని ఢంకాభజాయించి చెబుతున్నాను.

ఇంటావిడ ధాం ధూమ్ లాడుతూ ఉంటే , పిరికి వాడిలా ముంగిముషాణంలా కూచో వద్దు. ఒక సారయినా సాహసోపేతంగా నోరు విప్పండి. మా సత్రాయిగాడు ఓ సారి ఇలాగే ధైర్యం చేసి వాళ్ళావిడ కన్నా పెద్ద నోరు పెట్టి ’’ నవ్వన్నది నిజమేనే ...‘‘ అని గాఠిగా అరిచేడు. వాడి ధైర్యానికి ఆవిడ మ్రాన్పడి పోయింది తెలుసా?

ఓ సారి మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చిత్రరాజాలను గుర్తుకు తెచ్చు కోండి.



మన ఎన్టీవోడినీ,





కాంతారావునీ,


రాజనాలనీ




వీళ్ళందరినీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ( దేశ వాళీ వీరులనే కాక విదేశీ వీరులని కూడా స్మరించడం మీ యిష్టం)

సాహస వీరుడు, సాగర కన్య లాంటి సినిమాలు చూసి పిరికి తనం ఏ మూలనయినా ఉంటే పోగొట్టుకోండి అని నా ఉచిత సలహా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరింత వివరంగా చెబుతూ మీ సహనాన్ని పరీక్షించే సాహసం చేయ లేను.

నా బ్లాగే కదా అని ఇలా నానా చెత్తా రాసే సాహసం చేస్తున్నానని మీరనుకుంటున్నారు కదూ.అవున్నిజమే. ఇంతకీ సాహసం చెయ్యమని ఒక కవి శ్లోకంలో చెప్పిన విషయమే మీముందు ఇవాళ ప్రస్తావించ బోతున్నాను. చూడండి:

న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి
సాహసం పున రారుహ్య, యది జీవతి పశ్యతి.

ప్రమాదాలు ఎదుర్కోనిదే మానవులు కార్య సాఫల్యాన్ని పొంద లేరు .విజయాన్ని అందు కోలేరు.అందు చేత, సాహసం చేసి, జయించి, బ్రతికి ఉంటే శుభాలు పొంద గలరు అని దీని భావం.

బ్రతికి యుండిన శుభములు బడయ వచ్చు ... అనుకుంటూ ఏ సాహస కృత్యమూ చేయకుండా పిరికి తనంతో బతకొద్దని కవి ఉవాచ. సహసం చెయ్. శుభాలు పొందు. ఆ సాహసం చేయడంలో ఛస్తే పాయె. బతికి ఉంటే శుభాలు పొంద గలవు అని కవి గారు హామీ యిస్తున్నారు.

వెన్ను చూపడం, మడమ త్రిప్పడం ... వంటి జాతీయాలు కదన రంగంలో సాహసోపేతంగా ముందుకు పొమ్మని ప్రోత్సహించేవే కదా.

బ్రేవో. గో ఎ హెడ్.

సాహసాల పేరిట సొమ్ము చేసుకునే టక్కరి తనమూ సాహసమేనా? ఏమో, 1979 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నేను రాసిన ఈ సాహసాల కథ చదివే సాహసం చేస్తే మీకే తెలుస్తుంది. చదివేక, ధైర్యం ఉంటే సాహసంతో కామెంటండి.

నా కథ చూడండి:




అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు

21, జనవరి 2011, శుక్రవారం

హెచ్చరిక



లోకంలో ప్రతి దానికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకటి జరిగిందంటే దానికి తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది.ఒక శ్లోకంలో భర్తృహరి ఈ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి:

దౌర్మంత్ర్యా న్నృపతి ర్వినశ్యతి, యతి స్సంగాత్, సుతో లాలనాత్
విప్రో2నధ్యయనాత్, కులం కుతనయా, చ్ఛీలం ఖలోపాసనాత్
హ్రీ ర్మద్యా, దనవేక్షణాదపి కృషి: ప్రవాసాశ్రయాత్
మైత్రీ చా2ప్రణయాత, సమృద్ధి రనయాత్ , త్యాగాత్ ప్రమాదా ద్ధనమ్

దుర్మార్గడైన మంత్రి వలన రాజు నాశనమై పోతాడు.

స్నేహాల వలన యతి (సన్యాసి) చెడి పోతాడు. అంతే కదా, సర్వసంగ పరిత్యాగికి ఇతర సాంగత్యాలు తగవు కదా?

గారం చేయడం వలన పుత్రుడు చెడతాడు. అతిగారాబం అనర్ధ హేతువు.

వేదాధ్యయనం చేయక పోవడం వలన బ్రాహ్మణుడు సంకనాకి పోతాడు. వాడికి విహితమైన వేదాభ్యసనం చేయకుండా, నిగమశర్మకి తమ్ముడిలా అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగితే ఏం బాగుపడతాడు లెండి ?

కుపుత్రుని వలన కులం నశిస్తుంది. కులానికో చెడ్డ కొడుకు పుడితే ఇహ చాలు, జనాలు ఆ కులాన్నంతా తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు. ఒక విభీషణుడున్నా, రావణ కులానికి దూషణలు తప్ప లేదు కదా.

దుష్టులతో చెలిమి వలన శీలం నశిస్తుంది. అందుకే పెద్దలు నీ స్నేహితులని చూసి, నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చని అంటారు.

మద్యపానం చేత లజ్జ నశిస్తుంది. తాగుబోతుకి ఎగ్గూ సిగ్గూ ఎక్కడుంటాయి చెప్పండి ?

తరచుగా వెళ్ళి చూడని వ్యవసాయం తగలబడుతుంది. కాలు మీద కాలు వేసుకుని దర్జాలు ఒలక బోస్తే వ్యవసాయం పనులు కావు. కార్తె పోతే రాదు. అందుకే అదనెరిగి వ్యవసాయం పనులు చేయాలి.

దేశాంతరగమనం వలన స్నేహం చెడి పోతుంది. అంతే కదా, ఎప్పుడూ దేశాలమ్మట పట్టుకు తిరుగుతూ ఉంటే మిత్రులే కరువవుతారు.తరుచుగా పలకరింపులు ఉంటేనే కదా, స్నేహాలు నిలుస్తాయి?

కూరిమి చెడి పోతే మైత్రీభావం నశిస్తుంది. కూరిమి గల దినములలో నేరము లెన్నడును తోచవు. ఆ కూరిమి విరసమైతే ఎదుటి వాడిలో అన్నీ తప్పులే కనబడుతూ ఉంటాయని శతక కర్త చెప్ప లేదూ?

అవినీతిచే సంపదలు నశిస్తాయిట. ఇది కొంత విచార మూలకం.అడ్డూ ఆపూ లేని సంపదలు పోగు పడేది అవినీతి పనులు అధికంగా చేయడం వల్లనే కదా? కవి మరి యిలా అంటాడేం? అంటే అవినీతితో చేకూరిన సంపదలు ఒకనాటికి నశించక తప్పదని కాబోలు. ఎంతటి ధనాధికులూ పట్టువడి శ్రీకృష్ణ జన్మ స్థానం చేరు కోవడం ఇటీవలి కాలంలో చూడడం లేదూ?

దానం, ప్రమాదం - వీటి వలన ధనం నశిస్తంది. ప్రమాదం సరే, దానం చేయడం వలన సంపదలు నశిస్తాయిట. కన్నూ మిన్నూ కానక అపాత్రదానాలు చేస్తూ పోతూ ఉంటే చేతికి చిప్ప కాక మరేం మిగులుతుంది ?

కనుక, ఆయా సంబంధాలనీ, విషయాలనీ విడిచి పెడితే మంచిది. లేక పోతే నశించడం ఖాయం అని కవి హెచ్చరిస్తున్నాడు.



17, జనవరి 2011, సోమవారం

గుండెల్లో తగినంత తేమ ఉండడం లేదు !!



మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.

గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?

14, జనవరి 2011, శుక్రవారం

తగని సిగ్గు



సిగ్గు లేదూ ! అని ఒక్కోసారి తిడుతూ ఉంటాం కానీ, సిగ్గును విడిచి పెట్టడమే కొన్న వేళల్లో శ్రేయస్కరం. సిగ్గే సింగారం కదా, అనుకుంటూ, అయిన దానికీ, కాని దానికీ సిగ్గులు ఒలక బోస్తూ ఉంటే సుఖం లేదు. పనులు జరుగవు.
అడగందే అమ్మయినా పెట్టదు అనీ, మనకేం కావాలో నోరు విడిచి అడగాల్సిందే. అడిగితే పోయేదేమీ లేదు. దక్కితే దక్కుతుంది. లేక పోతే పోయేదేం లేదు.సిగ్గు పడుతూ కూచుంటే నాయకులకు ఓట్లు రాలవ్. అందు చేత ఎగ్గూ సిగ్గూ లేకుండా, ఆడిన అబద్ధం తిరిగి ఆడకుండా, ఇచ్చిన హామీలనే తిరిగి యిస్తూ, సిగ్గు లేకుండా ముఖానికి నవ్వు పులుముకుంటూ, తిరిగేస్తూ ఉంటారు.

అలాగే, లజ్జని విడిచి పెట్టి లాగాలి లంచాలు. అంతే కానీ, ఎవరేమనుకుంటారో అని బిడియ పడుతూ కూచుంటే, మనదీ , వాడిదీ కూడా వాడే లాగేస్తాడనే ధర్మ రహస్యం తెలిసిన వాళ్ళు కావడం చేత, సిగ్గూ ఎగ్గూ అటకెక్కించి, నిర్లజ్జగా లంచాలు గుంజడం తమ జన్మ హక్కుగా చేసుకునే వారూ ఉన్నారు.

సినిమా తారలు బిడియాన్ని విడిచి పెట్టే విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, అలా వేయడం వలన ఒక వెలుగు వెలిగి పోతున్నారు.

ఇవన్నీ సరే, బిడియం ఏయే సందర్భాలలో విడిచి పెడితే సుఖమో , కవి ఒక శ్లోకంలో చెబుతున్నాడు.

చూడండి:


గీతే వాద్యే తథా నృత్యే, సంగ్రామే రిపుసంకటే
ఆహారే వ్యవహారే చ, త్యక్త లజ్జ: సుఖా భవేత్

సిగ్గును, మొహమాటాన్ని ఎప్పుడు విడిచి పెడితే మనిషి సుఖ పడతాడో చూడండి.

సంగీతం పాడేటప్పుడు సిగ్గు పడకూడదు.
నృత్యం చేసేటప్పుడు కూడా బిడియ పడ కూడదు.
అలాగే, వాద్యమును మ్రోగించేటప్పుడు కూడా సదరు సిగ్గు కూడదు.
శత్రువులతో పోరాడేటప్పుడు యుద్ధం లోను, శత్రు బాధ కలిగి నప్పుడు, లజ్జ పనికి రాదు.
భోజన సమయంలో సిగ్గు పడితే అర్ధాకలితో లేవక తప్పదు.
వ్యవహారం నడిచే సమయంలో కూడా బిడియం పనికి రాదు. మొహమాటాన్ని విడిచి పెట్టాలి.

ఈ పైన చెప్పిన సందర్భాలలో ఎవడు బిడియాన్ని విడిచి పెడతాడో వాడు సుఖాన్నీ, కీర్తినీ పొందుతాడని కవి ఈ శ్లోకంలో చెబుతున్నాడు.


5, జనవరి 2011, బుధవారం

అన్న దాతా సుఖీ భవ !


వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోంది, అక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.

‘‘ పకోడీలు కావయ్యా, బజ్జీలు ...’’ అన్నాను.

‘‘ ఏవో ఒకటి, అక్కయ్య గారూ, వేగిరం తెండి , నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.

అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.

ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:

పంక్తిభేదే పృథక్పాకే, పాకభేదే తథా2కృతే,

నిత్యం చ గేహకలహే, భవితా వసతి స్తవ.

ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటే, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ ? అలాగన్న మాట.

వడ్డించే వాడు మన వాడయితే, కడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితే, ఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువా, కొందరకి కొంచెం తక్కువా, కొందరకి కొసరి కొసరి, కొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.

అలాగే, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయి, ఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.

అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.

అలాగే, నిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.

అంటే, పంక్తి వడ్డనలో భేదం పాటించే వారింట, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింట, అసలే వండు కోని వారింట, నిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.

లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.

అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.

నింపాదిగా, శ్రద్ధగా భోజనం చేయాలి.

భుంజానో న బహు భ్రూయాత్, న నిందేదపి కంచన

జుగుప్పసితకథాం నైవ, శ్రుణుయాదపి వా వదేత్.

భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.

చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:

ఉష్ణ మశ్నీయాత్, స్నిగ్ధ మశ్నీయాత్, మాత్రావ

దశ్నీయాత్, జీర్ణే2శ్నీయాత్, వీర్యా2విరుద్ధ మశ్నీయాత్

ఇష్టే దేశే2శ్నీయాత్, నాతిద్రుత మశ్నీయాత్, నా2తి

విలంబిత మశ్నీయాత్, అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,

ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.

వేడి పదార్ధాలనే తినాలి.

చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )

మితంగా భుజించాలి.

ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.

ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.

మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోట, శుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.

త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.

అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.

అతిగా మాటలాడుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.

ఏకాగ్ర చిత్తంతో తినాలి.

ఏ పదార్ధం ఎంత అవసరమో, హితమో తెలుసుకుని అంతే తినాలి.

ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.

అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.

ఏకఏవ నభుంజీత, యదిచ్ఛేత్సిద్ధి మాత్మన:

ద్విత్రిభి ర్బహుభి స్సార్ధం, భోజనం తు దివానిశమ్,

పగలు కానీ రాత్రి కానీ, ఒంటరిగా తిన కూడదు. ఇద్దరో, ముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.

ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.

విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.

ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.

కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:


పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన

ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు

ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని

చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు

ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత

మని జాగు సల్పెడి యల్పుఁడొకడు

ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని

కడను రాఁజూచు ముష్కరుఁడొకండు

కుడి యింటను హాయిగా కూరుచుండి

వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు

వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు

ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.

పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.

ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.

తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.

ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.

హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.


ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.

ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.

( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)

పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.

వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.

ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.

ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.

ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.

కిం తు మద్యం స్వభావేన, యథైవా2న్నం తథా స్మృతమ్

ఆయుక్తియుక్తం రోగాయ, యుక్తాయుక్తం యథామృతమ్

మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)

స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.

తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.

మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !!

అంటాడు గురజాడ.

ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.

అలాగే, నాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.

దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.

మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం

ఇక,.

భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -

భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్

అని తొలి పాదం రాసేక , ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపం, అని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.

మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:

ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,

నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.

నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.

వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.

ఒక సారి, పండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూ, టై, హేటూ, బూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.

పండితుడు నవ్వి, అది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.

ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.

‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీ, భోజనం ముందొకటీ, తర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.

కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.

‘‘నా సలహా పాటించావా ? ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.

‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూ, రోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.

ఇదిలా ఉంచితే, తిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం

తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

తినగ తినగ వేము తీయనుండు.

అన్నమో రామచంద్రా !

అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.

వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.

ఇక,

తిండి అంటే అన్నం తినడమే కాదు.

లంచాలు తినడం, బుర్ర తినడం, సమయం తినడం, క్రికెట్ లో ఓవర్లు తినడం, దేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓ, ఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.

మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.

‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.

మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.

తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.

స్వస్తి.

30, డిసెంబర్ 2010, గురువారం

కోతుల రాజ్యంలో కోదండ రాముడు లేడా ?


కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటే, చూడవోయ్, బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామని, చూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతే, మరేమిటి చెప్పండి ? మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూ, అభినయ విశేషాలూ, సంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటే, మా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు. అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితే, సమయం వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు. కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో దిట్టలు. అర చేతిలో వైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీ, వీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేక, ప్రతి ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడక, నడత, మాట తీరు, ప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాం, మనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం. కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్ బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనతం విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటే, ఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదం, అధికారం, తెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరి, ఒకే చోట ఈ నాలుగూ కూడితే, చెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలి, దాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?
స్వస్తి.

28, డిసెంబర్ 2010, మంగళవారం

కానుకల కథా కమామీషూ !


ఎవరింట్లోనో, ఏదో వేడుక జరుగు తోంది. వెళ్ళాలి. అయితే, వట్టి చేతులతో వెళ్ళ లేం కదా? ఏదో ఒక కానుక తీసికొని వెళ్ళడం సముచితం. ఏం పట్టి కెళితే బావుంటుందో ఒకంతకి నిర్ణయానికి రాలేం. కుటుంబ సభ్యలు ఒక్కొక్కరూ ఒక్కో సలహా పారేస్తూ ఉంటారు. అదంటే యిదనీ, ఇదంటే అదనీ సూచనలు పరంపరగా వస్తూ ఉంటాయి. చివరకి విసిగి పోయి, మనకు తోచినంత నగదు కవర్లో పెట్టి ఇవ్వడానికి సిద్ధ పడి పోతూ ఉంటాం.

సమయానుకూలంగా , సమయోచితంగా ఎదుటి వారికి కానుకలు ఇవ్వడం కూడా ఒక కళ. సమయోచిత వస్త్రధారణ లాగే ఇది కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. సందర్భ శుద్ధి లేని మాటలూ. ప్రవర్తనా కూడా వికటించి, హేళనలకు పాత్రములవుతాయి. చావు యింటికి పరామర్శకి బయలు దేరి, పట్టు బట్టలు కట్టుకుని వెళ్ళం కదా? తద్దినం బోయినం తిని, త్రేన్చి, అన్నదాతా సుఖీ భవ ! అని వాగడం మంచిది కాదు కదా ?

పిల్లల పుట్టిన రోజుకి ఇవ్వతగిన కానుకలు, వివాహ సందర్భంగా వధూవరులకు ఈయ తగిన కానుకలు, ప్రేమికులు పరస్పరం ఇచ్చుకో తగిన బహుమతులు, షష్టి పూర్తి సందర్భంగా ఇచ్చేవి, నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఇవ్వతగినవి, పదవీ విరమణ కానుకలు ... ఇలా ఈ వింగడింపు చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది.

ఏతావాతా ఎవరింటి కార్యక్రమానికి వెళ్ళినా, వట్టి చేతులతో వెళ్ళ కూడదన్నది దీని సారాంశం.
ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నారు పెద్దలు. ఒక పండు, పత్రి, పువ్వు, లేదా చివరాఖరకి నీళ్ళు సమర్పించు కోవాలి తప్ప, చేతులు ఊపుకుంటూ వెళ్ళడం తగదు.

రిక్త హస్తాలతో వెళ్ళరాని తావులు ఏవో క్రింద శ్లోకంలో మనువు చెబుతున్నాడు.

అగ్నిహోత్రం గృహం క్షేత్రం, గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్.

అగ్నిహోత్రం దగ్గరకి, స్వగృహం దగ్గరకి, పుణ్యక్షేత్ర దర్శనానికి పోయి నప్పుడు, గర్భిణీలు, ముసలి వారు,పిల్లలు,
రాజు, దైవము, గురువు - వీరి వద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళ కూడదు. ఏదో ఒక కానుక తీసికొని పోచి సమర్పించాలి అని దీని భావం.

ఈ జాబితాలో స్నేహితుల ప్రస్తావన లేదు. కాని, మైత్రీబంధం కలకాలం నిలబడాలంటే చిన్న చిన్న కానుకలు ఒకరిరి కొకరు అడపాదడపా ఇచ్చుకుంటూ ఉండాలి.

బాల సఖుడు శ్రీ కృష్ణుని వద్దకు అటుకుల మూటతో వెళ్ళిన కుచేలుని కథ చూదాం ....

కుచేలుడు బహుకుటుంబీకుడు. గంపెడు సంతానం. ఎలాగో ఒకలాగ సంసారాన్ని లాగు కొస్తున్నాడు. బతుకు బండి మరి ముందుకు సాగ లేక కుయ్యో, మొర్రోమంటూ మొరాయిస్తోంది. కటిక దారిద్ర్యం యింట తాండవస్తోంది. బిడ్డలు ఆకలి బాధతో కృశించి, ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకులూ, గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటే, ఆ తల్లి విలవిల లాడి పోయింది. ఇహ లాభం లేదు. మీ బాల సఖుడు కన్నయ్య దగ్గరకి పోయి రండి .ఏమేనా ఇస్తాడు అని ఉపాయం చెప్పింది.

బాలసఖుండైన యప్పద్మ నేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మనము నుద్ధరింపుము; హరి కృపా క
టాక్ష రవి దీప్తి వడసి మహాత్మ ! నీవు

స్వామీ ! కృష్ణుడు మీ బాల్య సఖుడు. ఆ మహానుభావుడిని దర్శించి రండి.అతని కృపాకటాక్షం పొంది దారిద్య్రంతో తల్లడిల్లుతున్న పిల్లలను ఉద్ధరించండి అని వేడుకుంది.

కలలో కూడా ఎన్నడూ తలచుకోని కష్టాత్ముడు కూడా ఆపద కాలం లో ఒక్క తూరి తలచుకుంటే, వాడికి సకల భోగాలూ ఇస్తాడే, అవసరపడితే తనని తానుగా సమర్పించుకుంటాడే, అట్టి మహనీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే వారికి సమస్త సంపదలూ ఇవ్వకుండా ఉంటాడా ? అని బోధించింది.

సరే వెళ్తానన్నాడు కుచేలుడు. అయితే, వట్టి చేతులతో ఎలా వెళ్ళడం ? అని సంశయించేడు. దానికామె నిజమే సమా అని, అటుకులను కొన్నింటిని అతని చిరిన వస్త్రపు కొంగులో ముడి వేసింది. ఇహ వెళ్ళి రండని అంది. బయలు దేరాడు కుచేలుడు.
గోవింద దర్శనోత్సాహంతో బయలు దేరాడే కానీ కొన్ని సంశయాలు అతనిని పట్టి పీడిస్తున్నాయి.

ద్వారకా నగరంబు నేరీతి జొత్తును ? భాసురాంత:పురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ దర్శింపఁగలనొ? తద్ద్వార పాలు
రెక్కడి విప్రుడ ? నిందేల వచ్చెద ? వని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్ధశూన్యుండ నేను ;

నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె ? యాతఁ
డేల నన్ను నుపేక్షించు ? నేటి మాట
లనుచు నాద్వారకాపుర మతఁడు సొచ్చి.

ద్వారక లోనికి ఎలా ప్రవేశిస్తాను ?అంతి పురంలో ఉన్న ఆ పుండరీకాక్షుని ఎలా చూడ గలను ? ద్వార పాలకులు అడ్డగిస్తే ఏందారి ? పోనీ వారికి ఏదయినా బహుమానం (లంచం) ఇద్దామంటే చేతిలో చిల్లి గవ్వ లేని కటిక దరిద్రుడిని. ఇంతకూ నా భాగదేయం ఎలా ఉందో, ఏమిటో ? అయినా, నా పిచ్చి కానీ, ఆ స్వామి నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడులేఇలా అనుకుంటూ కక్ష్యాంతరాలు గడచి, కడకు కన్నయ్యను దర్శించు కున్నాడు.

కృష్ణుడు తన బాల సఖుని అత్యంత ఆదరంతో అక్కున చేర్చు కున్నాడు. గొప్ప ఆతిథ్యమిచ్చి సంభావించాడు.

సరసన కూర్చుండ బెట్టుకుని, బంగారు కలశం లోని నీళ్ళతో కుచేలుని పాదాలు కడిగాడు. ఆ నీటిని భక్తిగా తల మీద చల్లు కున్నాడు.కస్తూరి, పచ్చ కప్పురము కలిపిన మంచి గంధం బాల సఖుని మేని మీద పూసాడు.మార్గాయాసం తీరే లాగున అగరు ధూపం వేసాడు. సవినయంగా వీవెనతో విసిరాడు మణిమయ దీపాలతో నివాళులర్పించాడు. మిత్రుని సిగలో పూల దండలు ముడిచాడు. కర్పూర తాంబూలం యిచ్చాడు. గోదానం చేసాడు.ఆదర పూర్వకంగా యిలా బాల సఖుని స్వాగతించేడు.

ఆ ఆతిథ్యం స్వీకరించిన కుచేలుని శరీరం పులకించి పోయింది. కృష్ణుని పట్టపు దేవేరి కూడ కుచేలునికి వింజామరలు వీచి సేవించింది.

ఈ అద్భుత దృశ్యం చూసి అంత:పురకాంతలు విస్మయం చెంది యిలా అనుకున్నారు:

ఏమి తపంబు సేసెనొకొ ! యీ ధరణీ దివిజోత్తముండు తొల్
బామున ! యోగి విస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధి నాథు నిజతల్పమునన్ వజియించి యున్నవాఁ
డీ మహనీయ మేర్తి కెనయే ముని పుంగవు లెంతవారలున్ ?

ఈ బ్రాహ్మణుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా ! మునపటి జన్మలో ఎంతటి గొప్ప తపమాచరించాడో కదా ? యోగివంద్యుడైన పంకజనాభుని పానుపు మీద అధివసించాడు ! ఎంత లేసి ముని శ్రేష్ఠులు కూడ ఈ మహానుభావునికి సాటి రారు కదా !

తర్వాత మిత్రులిద్దరూ గురుకులం లో గడిపిన మధుర దినాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ తలపోతలతో మైమరచి పోయారు.

అంతలో శ్రీకృష్ణుడు కుచేలుని చినిగిన ఉత్తరీయంలో ముడి వేసి తెచ్చిన మూటను విప్పి, గుప్పెడు అటుకులను ఆదరంతో ఆరగించాడు.

మరో పిడికెడు అటుకులను తిన బోతూ ఉంటే రుక్మిణీ దేవి:‘‘ స్వామీ ! ఇతనికి సకల సంపదలూ అందించడానికి మీరు మొదట తిన్న పిడికెడు అటుకులు చాలును.’’ ఇక తినకండి. అంటూ వారించింది.

ఆ యింట తనకు దక్కిన మర్యాదలకు కుచేలుడు అమితానందం చెందాడు.ఇలా భావించాడు:

శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె ; నెన్న ’ దరిద్రుఁడు సంపదంధుడై
కానక తన్నుఁజేరఁ‘డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వ వస్తు పరిపూర్ణునిఁగా ననుఁ జేయ కుండునే ?

నా చెలికాడు శ్రీకృష్ణుడు నన్ను బాగానే సత్కరించాడు. బాగానే ఉంది. కానీ నాకు ధనమేదీ ఇవ్వాలని అతను అనుకున్నట్టుగా లేదు. దరిద్రుడనైన నేను సంపన్నుడ నైతే గర్వాంధకారంతో తనను సేవించనని తలచేడు కాబోలు ! లేక పోతే, ఆశ్రిత జనుల ఆర్తిని పోగొట్టే ఆ కృపా సముద్రుడు నన్ను ఐశ్వర్యవంతునిగా చేయ కుండా ఉంటాడా ?


ఇలా పరిపరివాధాలుగా ఆలోచిస్తూ తన ఊరు చేరుకున్న కుచేలునికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది ! దరిద్రానికి నిలయమైన తన కొంప అప్పుడక్కడ లేదు. దాని స్థానంలో ఇప్పుడొక విలాస తమయిన భవనం కనిపిస్తోంది. అతని దరిద్రమంతా పటాపంచలై పోయింది.

కుచేలుని ఎదుట సూర్య చంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి కట్టడాలూ, శుక పిక మయూరాలతో నిండిన చక్కని ఉద్యాన వనాలూ, వికసించిన తామరలతో, కలువలతో కనులు పండువు చేస్తున్న సరోవరాలూ, మణికంకణాలూ, వివిధ ఆభరణాలు ధరించిన దాస దాసీజనమూ, కలిగిన ఒక అద్భత మందిరాన్ని చూసి, ఇది ఏ పుణ్యాత్మునిదో కదా ! అని అబ్బుర పడ్డాడు. ఆ దివ్య భవంతి తనదే అని తెలుసుకుని అమితానందం చెందాడు.

ఈ సంపదలన్నీ శ్రీకృష్ణుని కృపాకటాక్షం వల్లనే సిద్ధించాయని సంతోషించాడు.

నేను నా బాల సఖుని వద్దకు అర్ధ కాంక్షతో వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడుగ కుండా నాకు వీడ్కోలు పలికి పిమ్మట వీటిని నాకు సమ కూర్చాడు.

భక్తులు సమర్పించిన లేశమాత్రమయిన పదార్ధాల నయినా దానిని కోటి గుణితంగా భగవంతుడు స్వీకరించి మన్నిస్తాడని అనడానికి కుచేలుని కథ ఒక గొప్ప ఉదాహరణ అని చెప్ప వచ్చును.

ఇదీ కుచేలోపాఖ్యానం.

చివరిగా ఒక మాట.

కానుకలు తీసి కోవడమే కాదు ; ప్రతి కానుకలు ( రిటర్న్ గిఫ్ట్ లు ) ఇచ్చే సంస్కారమూ అలవరచు కోవాలి.

ప్రతి కానుక అంటే, దేవదాసు పార్వతికి ఇచ్చిన కానుక లాంటిది కాదండోయ్ !
పరికిణీ చాటున తెచ్చిన తాయిలాన్ని పార్వతి దేవదాసుకి ఇస్తే, అంతా తినేసి, ఏదో విషయంలో అలిగి చేతి కర్రతో పార్వతికి దేవదాసు ఒకటి ఇచ్చు కోవడం గుర్తుంది కదూ ! చంద్రునిలో మచ్చ లాగున పార్వతి నుదుటుటి మీద పాపం, ఆ మచ్చ అలాగే ఉండి పోయింది. ఆ అందమైన మచ్చతో మహానటి సావిత్రి ముఖారవిందం ఈ జన్మకి మరిచి పోగలమా ?

కానుకలు ఇవ్వడమూ, ప్రతి కానుకలు ఇవ్వడమూ కూడా ఓ కళ ! కదూ ?!!

ఇదండీ, కానుకల కథ !!

ఇక స్వస్తి.



20, డిసెంబర్ 2010, సోమవారం

భజంత్రీలు


పొగడ దండలు అనే టపాలో పొగడ్తల గురించి కొంత మాట్లాడు కున్నాం కదా ? ( ఇక్కడ నొక్కి చూడండి)

ఇప్పుడు పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలు, మొహ మాటపు పొగడ్తలు, బలవంతపు పొగడ్తలు, బరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అని సొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడో, లేదో, చుట్టూ ఉన్న వాళ్ళు వహ్వా, వహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.

ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడో, కానీ, సొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.

డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినా, ఎలాగయినా వాయించు కో వచ్చును కదా.

సొంత డబ్బా సంగతి ఇలా ఉంటే, ఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తే, నీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.

నువ్వు నా వీపు గోకితే, నేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, పొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని , నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటే, స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటే, నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:

పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు

ముద్దియలా హరికి గలరు ముగురందరిలో

పెద్దమ్మ నాట్య మాడును

దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.

తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు

నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ

నన్నా తిరుమల రాయుడు

కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోను, శుక్రాచార్యునితోను, మన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితే, ఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,

రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపం, రాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుక, ప్రభువులవారు ముక్కంటితో సమానం.

రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదు, ఒక కన్ను లేదు కానీ, ప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని

పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా

జగ జట్టి యన్న తండ్రికి

దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు

అని !

నగపతి - ఇంద్రుడు

అతని పగతుడు (శత్రువు) - నరకుడు

అతని పగతుడు - శ్రీ కృష్ణుడు

అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)

అతని పగతుడు - భీముడు

అతని అన్న - ధర్మ రాజు

అతని తండ్రి - యముడు

అతని వాహనం - దున్న పోతు !

ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్

కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్

కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో

నందరు నందరే మఱియు, నందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలు, కోతులు,పందులు, దున్న పోతులు, గాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు

నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్

పిఱికి తనంబును లోభము

గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూ, ఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటే, పిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు.రప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారు, ఏమిచ్చారు ? అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం

డేపాటి ధనం బొసంగె ? నీరప రాజా ?’’

దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !

‘‘పాపాత్ముండెవ్వరికిని

చూపనిదే చూపెనయ్య, సూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.

ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై

యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె

నిష్ట సంపన్నురాలిందిర భార్య యై

కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె

కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై

బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై

పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె

అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని

మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !

చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1

హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడు, బహు కుటుంబీకుడు, పతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడు, కోరిన కోరికలను తీర్చే వాడు, పెద్ద కుటుంబం కల వాడు, అన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితే, విష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలు, కుమారుడు, కుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదని, అతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇది, నిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటే, భరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా ? సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?

అదే విధంగా, అన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడు, పాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.

దామోదరుడు అంటే, దామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం. పద్మ గర్భుడు .

చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడు, దయా గుణము కల వాడు, శత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతి, స్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.

ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును

తగ నర్ధుల కీయ నట్టి త్యాగము, సభలోఁ

బొగిడించు కొనుచుఁ దిరిగెడి

మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.