తెలుగు మధురిమలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు మధురిమలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, నవంబర్ 2019, గురువారం

పదవి పోయేక...

అధికారాంతమునందు చూడవలె..

ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే

ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !
త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !

ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !

నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !

27, నవంబర్ 2019, బుధవారం

అలకల కొలికి...


ఉ.  మాసిన చీర గట్టికొని మౌనముతోడ నిరస్త భూషయై
      వాసెనకట్టు గట్టి నిడువాలిక కస్తురిపట్టు వెట్టి లో
       గాసిలి చీకటింటికడ కంకటిపై జలదాంతచంద్ర రే
       ఖాసదృశాంగి యై పొరలె గాఢమనోజవిషాద వేదనన్.

భావం: ( కోపించిన సత్యభామ ) మాసిన చీర కట్టుకుంది. ఒంటి మీది నగలన్నీ తీసి వేసింది.తలకి  గుడ్డ కట్టుకుంది. నుదుట దట్టంగా కస్తూరిపట్టు పెట్టింది. మేఘాల చాటున చంద్ర రేఖలా తీవ్ర మయిన మన్మథ వేదనతో చీకటి గదిలో మంచం మీద  అలవిమాలిన దుఃఖంతో, బాధతో దొర్లింది.

   ఈ పద్యం నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధం లో  సత్య భామ కోపగృహంలో ప్రవేశించిన ఘట్టం లోనిది. కోపం వస్తే అయినింటి ఇల్లాళ్ళు అందరూ ఏం చేస్తారో, ఈ రాణి వాసపు  స్త్రీరత్నం  సత్య భామ కూడా అదే చేసింది! మాసిన చీర కట్టుకుంది. నగలన్నీ తీసేసింది. తలకి గుడ్డ చుట్టుకుంది. శిరో వేదనకి  వేసుకునే కస్తూరి పట్టు వేసుకుంది. చీకటి గదిలో మంచం మీద అశాంతిగా దొర్లింది !

      సత్య కోప కారణానికి ముందు చాలా గ్రంథమే నడిచింది. శ్రీకృష్ణుడు తన పట్టపు రాణి రుక్మిణి ఇంట ఉండగా, కలహభోజనుడు నారదుడు పారి జాత పుష్పాన్ని తెచ్చి ఇచ్చాడు. అంతటితో ఊరు కోక, నచ్చిన చెలికి ఇమ్మన్నాడు. కృష్ణుడు ఇరుకున పడ్డాడు !  సత్యకి తెలిస్తే ఏమవుతుందో అని శంకిస్తూనే, రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణి ఆనందంగా దానిని అందుకుంది. ఇక నేం ! తగవులమారి  నారదుడు సవతుల మధ్య అగ్గి రాజేసే మాటలు చాలా అన్నాడు.ఆ పారిజాత పుష్పం ఎన్నటికీ వాడదనీ. సువాసన వీడదనీ చెప్పాడు. కృష్ణుడు  దానిని రుక్మిణికే ఇవ్వడంతో సవతులలో  అతనికి ఆమె పట్లనే అనురాగం ఎక్కువ అని తెలుస్తోందన్నాడు. ఇక సవతులందరూ ఆమెకు దాసీ లవడం ఖాయం అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా ! శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడనే మాట కల్ల అని దీనితో తేలి పోయిందని కూడా అన్నాడు !

  ఇంకే ముంది !  ఒక చెలికత్తె ద్వారా ఈ మాటలన్నీ సత్యచెవిని పడ్డాయి . ఆమె కర్ర దెబ్బతిన్న పామే అయింది. నెయ్యి పోస్తే భగ్గున మండే అగ్ని కీలలా లేచింది! భర్త అనాదరం చూపితే అభిమానవతులలో వచ్చే కళ్ళు ఎర్రబడడం,గొంతు బొంగురు పోవడం వంటి  శారీరక మార్పులన్నీ వచ్చేయి. తటాలున పడకటింటికి చేరింది. మాసిన చీర కట్టుకోడం, నగలు తీసి పారెయ్యడం,తలకి గుడ్డ బిగించడం,కస్తూరి పట్టు పెట్టుకోడం, మంచం మీద ఆశాంతిగా దొర్లడం, ఇవన్నీ కోప గృహం వాతావరణాన్ని మరింత వేడెక్కించేవే!  చివరకి రానే వచ్చేడు కృష్ణుడు.  అనునయ వాక్యాలతో ఆమెను ఓదార్చాలని చూసేడు. చివరకు ఆ జగన్నాటక సూత్రధారి ఆమె పాదాల మీద తల వాల్చి మ్రొక్కాడు! బ్రహ్మాది  దేవతలచే పూజింప బడే ఆ శిరస్సును  సత్య ఎడమ కాలితో తన్నింది.
నాథుల అపరాధాన్ని సహించని స్త్రీలు ప్రణయ కోపంలో ఉచితానుచితాలు చూస్తారా !

         ఈ సరస శృంగార కావ్యం అంటే తెలుగు వారికి ఎంత మక్కువో చెప్పలేం!

26, నవంబర్ 2019, మంగళవారం

మీ వాడితో మేం ఇక పడలేం తల్లీ ..



మత్త.   పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలఁబోయి మా యిలు సొచ్చి తా
           నుట్టి యందక రోళ్ళుఁబీటలు నొక్క ప్రోవిడి యెక్కి చే                           
            వెట్టఁ జాలక కుండ క్రిందొక తూఁటొనరించి మీ
             పట్టి మీఁగడ పాలుఁ జేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ !


భావం: అమ్మా, యశోదమ్మా ! ఏం పిల్లడమ్మా, మీ పిల్లడు ! నిన్న గాక మొన్న పుట్టాడో, లేదో, దొంగ తనాలు మొదలు పెట్టాడు !ఇవాళ మా ఇంట జొరబడ్డాడు. ఉట్టి అందక, రోళ్ళు, పీటలు ఒక దాని మీద ఒకటి పేర్చి వాటి మీద ఎక్కి అందుకోవాలనుకున్నాడు. వాడలా చేస్తాడని ఊహించి,ఉట్టి అందకుండా ఎత్తుగా కట్టేం. కన్నయ్యకి ఉట్టిలో చేయి పెట్టడం సాధ్యం కాలేదు. ఇక లాభం లేదనుకున్నాడేమో, కిందనుంచే  కుండకు పెద్ద చిల్లు పెట్టి, మీగడ పాలను దోసిళ్ళతో పట్టి త్రాగాడు !

      చేత వెన్న ముద్దతో,బోసి నవ్వులు చిందిస్తూ బంగురుతూ ఉండే కన్నయ్య వర్ణ చిత్రం తెలుగు లోగిళ్ళలో ఒక అపూర్వ ఆకర్షణ. పసి బిడ్డలున్న ఇంట, చిన్ని కృష్ణుడితో తమ బిడ్డను సరి పోల్చుకుని మురిసి పోని తల్లి దండ్రులూ ఉండరు. వెన్న దొంగ దుడుకు చేష్టలను పోతన మహా కవి తన ఆంధ్ర మహా భాగవతం దశమ స్కంధంలో కమ్మని పద్యాలలో పటం కట్టి  పద్యరూప వర్ణ చిత్రాలుగా ఆవిష్కరించేడు.!

     నల్లనయ్య అల్లరి చేతలు చూసి వ్రేపల్లె లోని ఇళ్ళాళ్ళకు ఓర్పు నశించి పోయింది. అంతా కలసి కట్టుగా నందుని యింటికి వచ్చి యశోదమ్మతో పిల్ల వాని ఆగడాలను ఏకరువు పెట్టారు. నల్లనయ్య బాల్యక్రీడలన్నీ అతని లీలా విలాసాలే !    ‘‘బాలురకు పాలు లేవని బాలింతలు మొత్తు కుంటూ ఉంటే,  నీ బిడ్డ లేగల త్రాళ్ళు విప్పి ఆవుల దగ్గరకి వదిలేస్తూ ఉంటాడు. చక్కగా కాగిన పాలను తన నేస్తాలకు పోస్తాడు. అంతటితో ఊరుకోకుండా కడవలు పగుల కొట్టి మరీ జారుకుంటాడు! ఎప్పుడు ఇంట్లో జొరబడతాడో, పాలు, వెన్న దొంగిలించి ఎప్పుడు బయటకి మాయమవుతాడో తెలియదు. వెళ్తూ వెళ్తూ , యింత వెన్నను నిద్ర పోతున్న కోడలి మూతికి రాస్తాడు. దానితో అత్త కోడలిని దండిస్తుంది.అలాగే పాలూ, నెయ్యీ జుర్రుకున్నాక పగుల కొట్టిన కడవలను  ప్రక్కనున్న యిళ్ళలో పడేసి పోతాడు. దానితో యిరుగు పొరుగులకి తగువులే, తగువులు . ఆ గదులకు భద్రంగా తాళాలు వేస్తే, వేసిన తాళాలు వేసినట్టే ఉండేవి. నీ కొడుకు లోపల నాట్యం చేస్తూ ఉన్నాడమ్మా! కడవలు అందకుండా ఉండడం కోసం మా యిళ్ళలో ఉట్లు ఎత్తుగా కట్టి ఉంచేం. అయినా ,పీటలు, రోళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి అందుకోవాలని చూస్తాడు. అది వీలు కాకపోతే కడవలకి తూట్లు పెట్టి పాలూ, వెన్నాత్రాగేస్తున్నాడు. యశోదమ్మా, యింక మా ఇళ్ళలో నీ కుమారుడు పాలూ పెరుగూ ఉండ నివ్వడు. ఎక్కడికయినా వెళ్ళి పోతాం. నంద ప్రభువుల వారి ఆవుల మీద ఆన !’’  అని గోపికలు వాపోయేరు.
ఇంత చెప్పినా యశోదమ్మ కన్నయ్యనే వెనకేసు కొచ్చింది !  చనుబాలు త్రాడం వదలని తన పసి బిడ్డపై నిందలు వేయ వద్దని బ్రతిమాలుకుంది.    

 మాతృత్వపు మాధుర్యానికి  ఆకాశమే హద్దు మరి!

23, నవంబర్ 2019, శనివారం

సత్యమేవ జయతే

చం.  మును మునుఁబుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
       డెనిమిది నాళ్ళ పాటి గలఁడింతియ పూరియ మేయ నేరఁడేఁ
        జని కడుపార చన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
         మ్మని సుకృతంబు గట్టి కొనవయ్య దయా గుణ ముల్లసిల్లఁగన్.
భావం:  నిన్న గాక మొన్న నాకొక ముద్దుల కుమారుడు పుట్టాడు. వాడు పుట్టి ఇంకా ఏడెనిమిది రోజులు కాలేదు.  ఇంత గడ్డి కూడ తిన లేడు.నేను ఇంటికి పోయి వాడికి కడుపు నిండా పాలిచ్చి ఇక్కడున్నట్టుగా వేగంగా వచ్చేస్తాను. దయతో నన్ను పోయి రమ్మని పుణ్యం కట్టుకోవయ్యా పులి రాజా!
     ‘‘అవు – పులి’’  కథ  చెప్పని పెద్దలూ, వినని బిడ్డలూ తెలుగు నాట ఏ ఇంట్లోనూ ఉండరు. ఈ కథని అనంతామాత్యుడు భోజరాజీయం లో పద్య రూపంలో  చాలా ఆర్ద్రంగా వ్రాసాడు.. ఈ కథా కావ్యంలో మూడు పెద్ద కథలూ, మరెన్నో ఉప కథలూ ఉంటాయి. అనంతుడు ఇదే కాక, రసాభరణం అనే ఆలంకారిక గ్రంథమూ, ఛందో దర్పణం అనే ఛందో గ్రంథమూ కూడా వ్రాసాడు. 
       ఒక అడవిలో మేతకు వెళ్ళిన ఒక ఆవు దారి తప్పి పోయింది. ఒక పెద్ద పులి ఎదురు పడి, దానిని తిని వేస్తానంటుంది.  ఆకొన్న వారికి ఆహారం పెట్టడం కన్నా పుణ్యం లేదని, పులికి ఆహార మవడానికి  సిద్ధ పడుతుంది ఆవు. కాని, ఒక్క సారి ఇంటికి పోయి, ఏడెనిమిది రోజుల వయసున్న తన బడ్డకు కడుపు నిండా పాలిచ్చి రావడానికి అనుమతి కోరింది. అంతే కాదు, ‘‘ ఈ ఉదయం పాలిచ్చి వచ్చాను. నా బిడ్డ అటూ, యిటూ గెంతులు వేయడంతో ఆ పుడిసెడు పాలు ఈపాటికి అరిగి పోయి ఉంటాయి. ఇప్పుడు వాడి కేది దారి?’’ అని దిగులు చెందింది. ‘‘ గుమ్మెడు పాలు నా బిడ్డకి తృప్తి నిచ్చి వాడి ఆకలి తీరుస్తాయి. నా ఒంట్లో మాంసం అంతా తిన్నా సరే, నీ జఠరాగ్ని చల్లారదు. కనుక ఇందులో మొదట చేయ దగిన పని ఏదో నీకు తెలయదా ! అన్నా! పులి రాజా! నన్ను పోయి రమ్మను. ఇలా వెళ్ళి అలా వస్తాను’’ అని కూడా ప్రార్ధించింది. ఆ మాటలతో కూడ పులి మనసు కరగ లేదు. గోవుని చూసి అపహాస్యం చేసింది. ‘‘ నన్ను బేల్పరచి, నీ కొడుకు దగ్గరకి పోయి, నేను తినేస్తానని తెలిసి కూడా తిరిగి వస్తావా ?! చెప్పే వారు ఎన్నయినా చెబుతారు. వినే వారికి వివేకం ఉండొద్దూ !’’ అని వెక్కిరించింది. ‘‘ అడవిలో  ఉన్నంత మాత్రం చేత పులి అంత తెలివి మాలిన దనుకున్నావా !’’ అని కూడ నిష్ఠర మాడింది. అప్పుడు ఆవు తన మాట నమ్మమని ఎన్నో ఒట్లు పెట్టి మరీ చెప్పింది. మాట జవదాటితే తనకు ఎలాంటి దుర్గతి పడుతుందో చెప్పింది. ఎలాగయితేనేం చివరకి పులి అంగీకరించి ,ఆవును సత్వరమే  తిరిగి రమ్మని పంపించింది. సత్య నిష్ఠ గల ఆవు ఆడిన మాట తప్ప లేదు!  బిడ్డకి పాలిచ్చి, నీతులు చెప్పి, పులి దగ్గరకి  తిరిగి వచ్చి, తనని తిని, ఆకలి చల్లార్చు కొమ్మంది.     విభ్రమం కొలిపే ఆ సత్య సంధతకి  నివ్వెర పోయిన పెద్ద పులి ఆవుని  శ్లాఘించి, విడిచి పెట్టింది!
     సత్య వాక్కుకి ఉన్న శక్తి అలాంటిది మరి ! ఈ కథ ప్రతిపాదించే విశ్వజనీన మయిన నీతి అదే !

22, నవంబర్ 2019, శుక్రవారం

మూడే, మూడడుగులు...



మ. వడుగా ! యెవ్వరి వాఁడ? వెవ్వఁడవు? సంవాస స్థలం బెయ్య? ది
      య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్;                            
       గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
        గడతేఱెన్ ! సుహుతంబులయ్యె శిఖులుం ! గల్యాణ మిక్కాలమున్.

భావం: ఓ బ్రహ్మచారీ !నీ పేరేమిటి? ఎవరి కుమారుడవు? నీ నివాసం ఎక్కడ?నీ రాక వల్ల నా వంశం, జన్మ ధన్యమయ్యాయి. నేను చేస్తున్న ఈ యాగం కృతార్ధ మయింది. నా కోరికలు నెర వేరాయి.అగ్నులు చక్కగా వ్రేల్చ బడ్డాయి.(  దేవతలకు సమర్పించ బడిన హవిస్సులు సఫల మయ్యాయి) ఈ సమయం మిక్కిలి శుభప్రదం!
   రాక్షస ప్రభువైన బలి చక్రవర్తి ఆడి తప్పని వాడు. సద్ధర్ముడు అమరావతి నుండి దైత్య కులానికి శత్రువయిన ఇంద్రుడినీ ఇతర దేవతలనూ వెళ్ళ గొట్టాడు.ముల్లోకాలకు ప్రభువయ్యాడు.దేవతలకు చేటు కాలం దాపురించింది. దేవతల తల్లి అదితి  వారి దురవస్థను చూడ లేక పోయింది. భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు శ్రీహరిని ధ్యానించింది. ఆమె ప్రార్ధన మన్నించి బలిని సంహరించి దేవతలను కాపాడడానికి  శ్రీహరి ఆమె గర్భాన  వామనుడై జన్మించాడు.తండ్రి కశ్యపుడు వామనునికి వడుగు చేసాడు.ఆ సందర్భంగా వటువుకి సూర్యుడు గాయత్రినీ, బృహస్పతి జంద్యాన్నీ,కశ్యపుడు ముంజ దర్భల మొల త్రాడునీ,అదితి కౌపీనాన్నీ,భూ దేవి నల్లని జింక చర్మాన్నీ,దండాన్ని చంద్రుడూ, గొడుగును ఆకాశమూ,బ్రహ్మ కమండలాన్నీ, సరస్వతి జపమాలనూ, సప్తర్షులు దర్భలనూ  ఇచ్చారు!  భిక్షాటనకు వటువుకి అన్నీ అమిరాయి !
 
   
    ఆ పిమ్మట వటువయిన వామనుడు బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలి వామనుని భక్తితో సత్కరించి, కుశల ప్రశ్నలు అడిగిన ఈ పద్యం పోతన భాగవతంలోని వామనావతార ఘట్టం లోనిది.

బలి ఇవ్వ జూపిన సకల భోగోపకరణాలనీ కాదని మూడడుగుల నేల దానమిమ్మని వామనుడు కోరాడు. అదే తనపాలిట బ్రహ్మాండమని పలికాడు ! రెండడుగులతో భూనభోంతరాలను ఆక్రమించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా మహా దాత అయిన దైత్య రాజు మూడో అడుగు తల దాల్చి వటువు చేత పాతాళానికి అణచి వేయబడ్డాడు.    ఆ దాన వైభవం అపూర్వం !  అజరామరం . అనితర సాధ్యం !

        ‘‘ కారే రాజులు ...’’,  ‘‘ ఆదిన్ శ్రీసతి కొప్పుపై ..’’ ‘‘ ఇంతింతై వటుడింతయై ...’’, ‘‘ రవి బింబంబుపమింప ..’’ మొదలయిన పద్యాలతో   పోతన గారి భాగవతంలో  వామనావతార ఘట్టమంతా ఒక తేనె వాక లాగ మధురాతి మధురం ! రస బంధురం ! తెలుగు వారి భాగ్య వశాన పోతన కవి ప్రసాదించిన కవితా స్వాదు ఫలం !
                                                                                                         

21, నవంబర్ 2019, గురువారం

తెలుగు మధురిమలు


మ. తన వెంటన్ సిరి,లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
      న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ                            
       క్ర నికాయంబును, నారదుండు,ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
       య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్ !

భావం: మొసలి బారిన పడి, శరణు వేడుతూ ఆక్రోశిస్తున్న భక్తుడయిన గజేంద్రుని మొర విని, వైకుంఠ వాసుడయిన విష్ణువు బయలు దేరాడు. అతని వెంట లక్ష్మీ దేవి, ఆమె వెనుక అంత:పుర కాంతలూ బయలుదేరారు. వారి వెంట గరుడుడూ,  ఆతనిని అనుసరిస్తూ విల్లూ, గదా, చక్రమూ, శంఖమూ వచ్చాయి. వాటి వెంట నారదుడూ, విష్వక్సేనుడూ వచ్చారు. వారి వెంట మొత్తం వైకుంఠ వాసులంతా శీఘ్రంగా బయలుదేరి వచ్చారు.
      
        త్రికూట పర్వత శ్రేణిసమీపాన ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో   తిరిగే ఏనుగుల గుంపు లోనుండి  ఒక రోజు ఒక గజ రాజు  మంద నుండి విడి పోయి దారి తప్పాడు. భార్యలతో తిరుగుతూ బాగా డస్సి పోయాడు. అక్కడొక మడుగు కనిపించి ఆనందంతో  మడుగు నీటిలో దిగి క్రీడిస్తూ అక్కడే ఉండే ఒక మొసలి బారిన పడ్డాడు. శక్తి కొలది మొసలితో పోరాడాడు.  ఆ నీరాట వనాటాలకు పోరు వెయ్యేండ్లు అతి భీకరంగా సాగింది. గజరాజు బాగా అలసి సోయాడు.మొసలితో పోరాడే ఓపిక సన్నగిల్లి పోయింది.      ఇక తనకు దిక్కు ఆ మహా విష్ణువే అనుకున్నాడు. ఈ లోకం ఎవని వలన పుడుతుందో, ఎవని వలన లయమవుతుందో,ఈ విశ్వానికి ఎవడు మూలకారకుడో, అన్నీ తానైన వాడెవ్వడో అట్టి భగవంతుడినే శరణు కోరుకోడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘ దేవా ! నాలో మరింక పోరాడే శక్తి లేదు. ధైర్యం సన్నగిల్లి పోయింది.ప్రాణాలు కడతేరుకు పోతున్నాయి.మూర్ఛితుడనవుతున్నాను.నీవే తప్ప అన్యు లెవరూ నన్ను రక్షింప లేరు. నన్ను కాపాడు !’’  అని ఎలుగెత్తి విలపించాడు

    గజరాజు మొర శ్రీమహా విష్ణువు చెవిని పడింది. అప్పుడా పురుషోత్తముడు అల  వైకుంఠ పురంలో రమా దేవితో క్రీడావినోదియై ఉన్నాడు.  గజేంద్రుని మొర ఆలకించాడు. ఆ భక్త జన రక్షకుడు వెంటనే కదిలాడు. లక్షీ దేవికి మాట మాత్ర మయినా చెప్ప లేదు.ఆయుధాలయిన శంఖ చక్రాలను చేతులలోకి తీసుకో లేదు.సేవకులనూ.గరుడ వాహనాన్ని పిలువ లేదు.జారి పోయిన జుట్టు ముడిని సవరించుకో లేదు. చివరకి చేతిలో ఉన్న రమా దేవి పైట కొంగును కూడా ఆ తొందరలో విడిచి పెట్ట లేదు.! పోతన గారి ఆంధ్ర మహా భాగవతం గజేంద్ర మోక్షణం లోని ఈ ఘట్టం లోనిదే మీది పద్యం !   కరి రాజును కాపాడడానికి బయలు దేరిన హరి వెంట లక్ష్మీ దేవి,రాణివాసం, శంఖ చక్రాది ఆయుధాలూ,నారద విష్వక్సేనులూ, మొత్తం వైకుంఠమే కదిలి వచ్చిన దృశ్యాన్ని కనుల ముందు మత్తేభ వృత్తంలో సాక్షాత్కరింప చేసిన  మధుర  మనోహర మయిన కల్పన యిది !


      మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవ సహాయం భక్తులకు తప్పక లభిస్తుందని చెప్పే కథ గజేంద్రమోక్షణం!



20, నవంబర్ 2019, బుధవారం

తెలుగు మధురిమలు


సీ. తనయందు నఖిలభూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగు వాఁడు !
      పెద్దలఁబొడగన్నభృత్యుని కైవడిఁ జేరి నమస్కృతుల్ సేయువాఁడు !
       కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావము సేసి మరలు వాఁడు !                            
       తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతను దీనులఁ గావఁజింతించు వాఁడు !

తే.    సఖులయెడ సోదర స్థితి జరుపువాఁడు, దైవతములంచు గురువులఁ దలచు వాఁడు !
        లీలలందును బొంకులు లేని వాఁడు, లలితమర్యాదుఁడైన ప్రహ్లాదుఁ డధిప !
భావం: ఓ ధర్మ రాజా ! దానవ రాజయిన హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు  మర్యాదా పూర్వక మయిన మంచి నడత కల వాడు. హరిభక్తుడయిన  అతడు లోకము నందలి అన్ని ప్రాణులనూ తన లాగా భావిస్తాడు. పెద్దలు ఎదురయితే సేవకుని లా మిక్కిలి గౌరవభావంతో నమస్కరించే వినయ సంపన్నుడు. పర స్త్రీలను తల్లి వలె భావించి, అణకువతో ప్రక్కకి తొలగి పోతాడు. దీనులను తల్లిదండ్రుల లాగా ఆదరిస్తాడు.   స్నేహితులను  సోదర భావంతో చూసే సహృదయుడు. గురువులను దైవంతో సమానంగా కొలుస్తాడు. హాస్యానికి కూడా ఎప్పుడూ అబద్ధమాడడు.
         పోతన గారి ఆంధ్ర మహా భాగవతంలో రాజసూయ యాగ సమయంలో విచ్చేసిన నారద మహర్షి ధర్మ రాజుకి ఈ హరి తత్వ కథలను చెప్పినట్టుగా శుకుడు పరీక్షిత్తుకు వివరిస్తాడు సనక సనందనాదులను వైకుంఠద్వారం వద్ద నిరోధించి, శాపగ్రస్థులయిన ద్వార పాలకులు జయవిజయులు తదనంతర జన్మలలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగను, రావణ కుంభ కర్ణులుగను, శిశుపాల దంతవక్తృలుగను పుట్టి ,వైర భక్తితో  విరోధించి హరి చేతిలో నిహతులయ్యారు.  వీరిలో ,దితి కుమారులు హిణ్యకశిప,హిరణ్యాక్షులలో హిరణ్యాక్షుని శ్రీహరి వరాహ రూపంలో వధించాడు. సోదరుని మరణంతో ఖిన్నుడయిన హిరణ్య కశిపుడు మరింత విష్ణు ద్వేషిగా మారాడు. హరి నామం చెవిని పడితేనే కుపితుడయ్యే వాడు.
    అట్టి హరి ద్వేషికి కుమారుడయిన ప్రహ్లాదుడు మహా విష్ణు భక్తుడు. నిత్యం హరినామ స్మరణతో పులకించి పోయే వాడు. తనయుని హరి భక్తి మాన్చటానికి హిరణ్యకశిపుడు చేయని దుష్కృత్యాలు లేవు. చివరకు ఆ వైర భక్తితోనే  నరసింహావతారమెత్తి వచ్చిన  శ్రీమహా విష్ణువు చేతిలో వధింప బడతాడు.
     
       హరి ద్వేషి అయిన దానవ వీరుని కుమారుడయిన ప్రహ్లాదుని గుణగణాలు పోతన ఈ పద్యంలో మనోహరంగా వర్ణించాడు.సర్వభూతాలను తనతో సమానంగా చూసుకునే సమదర్శి. పెద్దల యెడ అమిత వినయశీలి. పరస్త్రీలను తల్లుల వలె భావించే సుగుణాల ప్రోవు.దీన జనులను సమాదరించే ఆర్ద్ర హృదయుడు. సంగడికాండ్రను సోదర భావంతో చూసే సహృదయుడు.గురువులను దైవంతో సమానంగా చూసుకునే ఆదర్శ విద్యార్ధి. హాస్యానికయినా  అసత్యమాడని సత్యసంధుడు లలితమర్యాదుడు .
         మానవ వ్యక్తిత్వ వికాసానికి మహాకవి పోతన చెప్పిన  తొలి పాఠాలు కదూ యివి !