20, నవంబర్ 2011, ఆదివారం

గురుదేవుల శతజయంత్యుత్సవ సంచిక


పెద్దలూ, సమవయస్కులూ భాష్యం అనీ, అంతేవాసులు ఎస్వీయన్ గారు అనీ ఎంతో ఇష్టంగా పిలుచుకునే వారు వారిని.
వారే శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యుల వారు.

వారి శతజయంతి వేడుకలు విజయ నగరం శంకరమఠంలో తే 16 -9-2010 ది అద్వితీయంగా జరిగాయి.
మాష్టారి బంధువులూ, మిత్రులూ, శిష్యులూ, విజయ నగరం సౌరులూ చాలా మంది విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయ వంతం చేసారు.

ఆనాటి కర్యక్రమం వివరాలతో, ఫొటోలతో, ప్రముఖుల వ్యాసాలతో రూపొందించిన ఎస్.వీ.ఎన్ గారి శతజయంత్యుత్సవ సంచిక వెలువడింది.
నాటి కార్యక్రమంలో ఆచార్య శలాక రఘునాథ శర్మ, బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్య స్వామి, వారి శిష్యులు డాక్టర్ ఎ. గోపాలరావు, డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహంగారూ, విజయ నగరం సంస్కృత కలాశాల నాటి అథ్యక్షులు శ్రీ మానాప్రగడ శేషసాయి గారూ, జోస్యుల దక్షిణా మూర్తి గారూమొదలయిన వారు చక్కని ప్రసంగాలు చేసారు.

గురువు గారి కుమారులు శ్రీభాష్యం శ్రీనివాసాచార్యులు, రంగాచార్యులు గారలు ఈ శతజయంతి సంచికను ప్రచురించారు.

ఇందులోమహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శ్రీమాన్ న.చ.రఘునాథాచార్య స్వామి, శ్రీమతి కిదాంబి గోదా దేవి, కిదాంబి రఘుపతి, ఆచార్య సార్వ భౌమ ప్రొ. వేదుల సుబ్రహ్మణ్య శా స్త్రి, ప్రాచార్య శలాక రఘనాథ శర్మ, డా. యు.ఎ.నరసింహమూర్తి,శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్యులు, డా. అయలసోమయాజుల గోపాలరావు,
జోస్యుల దక్షిణామూర్తి, శ్రీభాష్యం తిరుమల రామానుజాచార్యులు, ప్రభృతులు వ్రాసిన చక్కని రచనలు ఉన్నాయి.

వీటితో పాటు విష్ణధర్మాంతర్గత మాంగళ్య వివృద్ధి స్తోత్రమ్ నకు మా గురుదేవులు ఎస్.వీ.ఎన్ గారు రచించిన ఆంధ్రతాత్పర్య సహిత వ్యాఖ్యానాన్ని కూడ ప్రచురించారు.

మా గురుదేవులు శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యులు (ఎస్.వి.ఎన్) గారు విజయగరం సంస్కృత కలాశాలలో విద్యాప్రవీణ, భాషా ప్రవీణలు చదివారు.


జ్యోతిష, న్యాయ, వేదాంత శాస్త్రాలలో నిష్ణాతులు. 1947 నుండి 1973 వరకూ అదే కలాశాలలో పండిత పదవిని అలంకరించారు. తెలుగు శాఖకి అధిపతి గా బాధ్యతలు నిర్వహించారు.

1969 - 1972 వరకూ అదే కలాశాలలో భాషాప్రవీణ చదివిన నేను వారి శిష్యులలో ఒకడినై కనులారా వారిని తిలకిస్తూ, చెవులారా వారి పాఠ్య బోధనామృతాన్ని గ్రోలే అదృష్టానికి నోచు కున్నాను.

గురుదేవులు మాకు అనంతుని ఛందస్సు, ప్రౌఢవ్యాకరణం, అహోబల పండితీయం, అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, రాఘవపాండవీయం మొదలయినవి బోధించారు. 16వ శతాబ్ది నాయకరాజుల యుగం ప్రత్యేకాంశంగా మాకు బోధించారు.

శ్రీ ఎస్.వీ.ఎన్ గారు ప్రౌఢ వ్యాకరణానికి చక్కని వ్యాఖ్య వెలయించారు. అలాగే అనంతుని ఛందోదర్పణానికి తత్త్వబోధినీ వ్యాఖ్య రచించారు. అప్పటి వరకూ ఈ గ్రంథాలకు సర్వ సమగ్రమయిన వ్యాఖ్యాన గ్రంథాలు లేవు.

ఛందోదర్పణానికయితే అసలు వ్యాఖ్యలే లేవు. ఆ ఘనత మా గురుదేవులకే దక్కింది !

గురువులు నాచన సోమన ఉత్తరహరివంశానికీ, చేమకూర వేంకట కవి విజయ విలాసానికీ కూడా చక్కని వ్యాఖ్యలు రచించారు. ( ఇవి రెండూ అముద్రితాలు, దురదృష్టవశాత్తు నేడు అలభ్యాలు కూడా.)

శ్రీనివాస స్తుతి పేరుతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై శతకాన్ని రచించారు.

శ్రీకూర్మనాథ సుప్రభాతం రచించారు.

నాట్య శాస్త్ర రచనలో పోణంగిపల్లి అప్పారావు గారు, తూమాటి దొణప్ప గారు మొదలయిన ఎందరో సాహితీ వేత్తలకు. పరిశోధకులకూ వీరు అందించిన సహకారం అనన్యసామాన్యమైనది.

చెరగని చిరు నవ్వు , అవ్యాజమైన వాత్సల్యాన్ని కురిపించే చూపులూ, మృదు మధురమైన మాట తీరూ, నిరాడంబరమైన జీవన శైలీ మా గురు దేవులకే స్వంతం.

మాకు ప్రౌఢ వ్యాకరణమో, ఛందో దర్పణమో పాఠ్యాంశంగా బోధించడానికి , తాము స్వయంగా చక్కని వ్యాఖ్యానాలు ఆ పుస్తకాలకి రచించి కూడా తరగతి గది లోకి రావడానికి ముందుగా ప్రతి రోజూ ఆ పుస్తకాలను శ్రద్ధగా తిరగెయ్యడం చూస్తే
అంత గొప్ప గురువల వద్ద చదువు కొనే మా భాగదేయం మాకే దక్కింది కదా అని గర్వించే వాళ్ళం.

ఈ శతజయంతి సంచిక గురించి మరిన్ని వివరాలు కావాలనుకునే వారికి :

శ్రీభాష్యం శ్రీనివాసాచార్యలు, 101, లక్ష్మీ నిలయం, తిరుమల నగర్, మీర్ పేట, మౌలాలి, హైదరాబాద్40,
ఫోను నంబరు: 27241942 మరియు 9866474202 చిరునామాకి సంప్రదించ వచ్చును.

గురుభ్యో నమ:

ఇతి శివమ్.





2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా! ఈ చక్కని గురుదేవులకు సంబంధించిన శతజయంతి సంచికను గూర్చి వివరంగా వ్రాయటం ద్వారా మళ్ళీ మన గురుదేవులను కళ్ళముందు కట్టించావు ! చాలా ఆనందం కలిగింది నాకు.చాలా సంతోషం. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి