14, మార్చి 2016, సోమవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ......Day 08 ( 5-3-2016)

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ......Day 08  ( 5-3-2016)

( చివరి భాగం )
మా యాత్రలో యిది చివరి రోజు. పేకేజీలో ఇవాళ ఏ దేవాలయ దర్శనాలు లేవు. కానీ మేమంతా
నిన్న గైడు చెప్పి నట్టుగా ఉదయం ఆరు గంటలకే ప్రయాణానికి తయారయి పోయేం కనుక, దారిలో
ఒక అమ్మ వారి ఆలయాన్ని దర్శించు కోగలిగేము. తిరుచ్చి నుండి చెన్నై 350 కి.మీల దూరం.
వీలయి నంత వరకూ మధ్యాహ్నం 3 లేదా 4 గంటల మధ్య చేరుకో గలిగితే మంచిదని గైడ్ చెప్పాడు.
చెన్నైలో ట్రాఫిక్ జామ్ లు ఎక్కువగా ఉంటాయనీ, ఒక్కో సారి చెన్నై చేరే సరికి ఎనిమిదీ తొమ్మిదీ కూడా
దాటి పోతూ ఉంటుందనీ గైడ్ చెప్పాడు.
ఉదయాన్నే 6 గంటలకల్లా తయారయి పోయి, లగేజీ బస్ డిక్కీలో పెట్టించుకుని అందరం
బస్ ఎక్కాము. దారిలో 9 గంటలకి ఉరుమండల్ అనే చోట టూరిజమ్ వారి హొటల్ దగ్గర బస్ ఆగింది.
అక్కడ బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేము. మళ్ళీ ప్రయాణం మొదలయింది. 12 గంటలకి మెయిల్ ముత్తూర్ అనే
చోట ఆగేము. అక్కడ ఆది పరాశక్తి గుడి లో అమ్మ వారిని దర్శించు కున్నాము. అదొక
గ్రామీణ దేవత కోవెల. గుడి చాలా పెద్దది. చాలా ఆధునికంగా నిర్మించేరు. అక్కడ దేవీ
భక్తులు ఎర్రని దుస్తులలో ఎర్రని పూలు పెట్టుని స్తోత్రాలు చేస్తూ అమ్మ వారిని కొలుస్తూ ఉంటారు.
దక్షిణలు హుండీలలో మాత్రమే వేయమని చెప్పారు.  ఎక్కడా  డబ్బుల కోసం చెయ్యి చాచింది లేదు.
ఆ ప్రాంతీయులు అమ్మ వారు చాలా శక్తిసంపన్నురాలిగా భావించి సేవిస్తారు . అమ్మ వారి విగ్రహం
చాలా బాగుంది. మొత్తానికి మా యాత్రలో చివరి రోజయిన ఈ రోజు కూడా పేకేజీలో లేని
వొకఆలయాన్ని దర్శించు కున్నందుకు అందరం సంతోషిస్తూ బస్ ఎక్కాము.
మా యాత్రలో ఏ ఆలస్యాలూ లేకుండా  చక్కగా జరిపించినందుకు మాగైడ్ కి అభినందనలు చెప్పాము.
తలో వందా వేసుకుని డ్రైవరుకీ, అతని సహాయకునికీ మా సంతోషం కొద్దీ యిచ్చి అభినందించేము.
బస్ లో ఆ చిరు అభినందన సభని అందరూ ఫొటోలు తీసుకున్నాం.
బస్ మళ్ళీ బయలు దేరింది. సరిగ్గా 3.30 అవుతూ ఉండగా చెన్నైలో తమిళ నాడు టూరిజమ్ వారి
ఆఫీసు దగ్గర ఆగింది. బయలు దేరిన చోటుకి సురక్షితంగా వచ్చి చేరాము.
లగేజీలు తీసుకుని వారి ఆఫీసులో కుర్చీల మీద కూర్చున్నాము. మా యాత్రీకులలో బొంబాయి
నుండి వచ్చిన దంపతులూ, వారి అమ్మాయీ తప్ప అందరం సీనియర్ సిటిజన్ లమే.
ఆఫీసులో మా టిక్కెట్ లు, ఫొటో ఐడెంటిటీ కార్డుల జెరాక్స్ ప్రతులూ ఇచ్చేక ఐదు నిమిషాల లోపే
కంప్యూటర్లో ఆ వివరాలు నమోదు చేసుకుని మాకు రిపండు కాగితాలు ఇచ్చేరు. వాటి మీద సంతకాలు
చేసి కేష్ కౌంటర్లో ఇస్తే మాకు రావలసిన రిఫండు యిచ్చేసారు. మా ఇద్దరికీ మొత్తం 28,100 రూ.లు
టిక్కెట్లకి అయితే, సీనియర్ సిటిజన్ రాయితీగా తిరిగి యిద్దరికీ కలిపి 5400 రూ.లు వచ్చేయి.
తర్వాత ఒకరి కొకరం బై బైలు చెప్పుకున్నాం. వెళ్ళ వలసిన వాళ్ళు ఆటోలు చేయించుకుని వెళ్ళి
పోయేరు.   నేనూ, మా ఆవిడా, మురళీ కృష్ణ గారి ఫేమిలీ ముగ్గురూ,బొంబాయి వెళ్ళ వలసిన కుటుంబం
 ముగ్గురూ మొత్తం 8 మందిమి మాత్రం మిగిలేం. మా మూడు  కుటుంబాల వారం ఎక్క వలసిన రైళ్ళూ
రాత్రి పదీ పన్నెండు గంటల మధ్య కావడంతో తొందర లేదు.
టూరిజమ్ వారి ఆఫీసులోనే రిఫ్రెష్ అయి, మెరీనా బీచ్ కీ, ఎగ్జిబిషన్ కీ వెళ్ళి వద్దామని నిర్ణయించు
కున్నాము. టూరిజమ్ వారి ఆఫీసు రాత్రంతా పని చేస్తుందనీ కనుక లగేజీ అక్కడ ఉంచి ఎంత రాత్రయినా
వచ్చి తీసుకో వచ్చనీ అక్కడి అధికారులు చెప్పేరు. మరింకేం ! అనుకుని లగేజీ అంతా అక్కడ
ఉంచి, ఆటోలు మాట్లాడుకుని బయలు దేరాము.
ముందుగా మెరీనా బీచ్ దగ్గర జరుగుతున్న ఎగ్జిబిషన్ చూసాము, చాలా బాగుంది. ఎక్కడా
ప్రవేశ రుసుము అంటూ లేదు. అక్కడే కలయ తిరుగుతూ అన్ని స్టాల్సూ చూసి మళ్ళీ ఆటోలు
మాట్లాడుకుని మెరీనా బీచ్ కి వెళ్ళాము. బీచ్ లో చాలా సేపు గడిపి తిరిగి 8.30 అవుతూ ఉండగా
టూరిజమ్ వారి రఫీసుకి చేరు కున్నాము. మా లగేజీలు తీసుకుని అక్కడి కుర్చీలలోనే కబుర్లు
చెప్పుకుంటూ కూర్చున్నాము. ఈ లోగా నేను బయటకి వెళ్ళి పెరుగు పేకెట్ , అరటి పళ్ళూ తెచ్చాను.
 మా ఆవిడ  ఆ పెరుగు తను తెచ్చుకున్న అన్నంలో కలుపుకుని తిన్నాది. తన భోజనం అయినట్టే.
రాధ, విజయ లక్ష్మి గారలు మాత్రం ఏకాదశి ఉపవాసం కనుక, పళ్ళు తిని ఉండి పోయేరు.
నేనూ మురళీ కృష్ణ గారూ బయటికి వెళ్ళి, దగ్గరలోనే ఆంధ్రా భోజన హొటల్ కనబడితే
అక్కడ భోజనాలు చేసి వచ్చేము. భోజనం బాగుంది. ఒక్కో భోజనం 65 రూపాయలు. 9 గంటలవుతూ
 ఉండగా, యిక మూడు కుటుంబాల వారమూ చెన్నై సెంట్రల్ కి ఆటోలు మాట్లాడుకుని బయలుదేరాము.
స్టేషను చేరాక, బొంబాయి నుండి వచ్చిన వాళ్ళు మా దగ్గర సెలవు తీసుకుని తమ రైలు వచ్చే
 ప్లాట్ ఫారమ్ దగ్గరకి వెళ్ళి పోయేరు. మేమూ మురళీ కృష్ణ గారి ఫేమిలీ  నాలుగో నంబరు  గేటులోంచి
లగేజీలు తీసుకుని వెళ్ళి అక్కడి కుర్చీలలోచతికిల పడ్డాం.
ఎదురుగా కనిపించే తెర మీద మా రైలు ఏ ప్లాట్ ఫారమ్ మీదకి వస్తుందో చూస్తూ కబుర్లు
చెప్పుకుంటూ గడిపేము. 9.30కి మా హౌరా మెయిల్ 8వ నంబరులోకి వస్తుందని డిస్ప్లే
వచ్చింది. మేం కూచున్న చోటుకి ఎదురు గేటులోనే 8వ నంబరు ప్లాటు ఫారమ్ కనుక
బాగుందను కున్నాం. మా మిత్రుల రైలు అక్కడ బయలు దేరేది కాక పోవడంతో డిస్ప్లేలో
జాప్యం జరుగుతోంది.
పది గంటలవుతూ ఉండగా, వెళ్ళొస్తామని చెప్పి, మేము ప్లాట్ ఫారమ్ మీదకి వెళ్ళాము. అప్పటికే
హౌరా మెయిల్ ప్లాట్ ఫారమ్ మీద పెట్టి ఉంది. మా కోచ్ ఎక్కి మా బెర్తులలో స్థిర పడ్డాం. ఈ సారి
మా యిద్దరివీ లోయర్ బెర్తులే. మెయిల్ రేపు మధ్యాహ్నం రెండు గంటల కి విజయ నగరం చేరుతుంది.
కనుక హాయిగా విశ్రాంతిగా పడుకో వచ్చనుకున్నాము. ట్రైన్  రాత్రి 11.50 ని.లకిబయలుదేరింది.

ముగిపు:

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నిద్ర లేచి ముఖాలు కడుక్కుని కాఫీలు వస్తే త్రాగేము.
9 .20కి రాజమండ్రి చేరింది. ముందుగా అనుకున్నాం కనుక రాజమండ్రిలో స్టేషనుకి
మా మరదలు మణి, వాళ్ళ చిన్నమ్మాయి రోషిణి వచ్చేరు. నాలుగయిదు నిమిషాలు కబుర్లు
చెప్పుకునే వీలు దొరికింది. మా తమ్ముడు రమణ ఏదో ఆఫీసు పని ఉండడంతో
రాలేక పోయేడు. మణి మాకోసం ఇంటి నుండి పేక్ చేసి తెచ్చిన టిఫిన్, భోజనం ఉన్న
సంచీ అందించి వీడ్కోలు చెప్పింది. ట్రైన్ బయలు దేరింది.
చేతులు కడుక్కుని వచ్చి టిఫిన్ లు కానిచ్చేం. చపాతీలు.కూర. మా మణి బాగా పేక్ చేసింది.
టిఫిన్ లకీ భోజనాలకీ వేరు వేరుగా పేపర్ ప్లేట్లూ, ప్లాస్టిక్ చెంచాలూ, కూల్ వాటర్ బాటిలూ ఉంచింది.
తను తెచ్చిన భోజనం ఇంటికి వెళ్ళేక తినొచ్చులే అనుకున్నాం.             మా చిన్నమ్మాయి కిరణ్ మా రైలు
విశాఖ పట్నం చేరగానే ఫోను చేసి చెబితే, మేం రైలు దిగి ఇంటికి చేరే సరికి  మాకోసం భోజనాలు
పట్టు కొస్తానని చెప్పి ఉంది. కానీ మణి మీల్సు కూడా తెచ్చి యివ్వడంతో మరేమీ చేసి తేవద్దని
మా అమ్మాయికి ఫోను చేసి మా ఆవిడ చెప్పింది.
ట్రైన్ లేటు లేకుండా సరైన సమయానికే విజయ నగర చేరుకుంది.
ఆటోలో యింటికి చేరుకుని స్నానాలు కానిచ్చి పేకెట్ విప్పి తినడానికి ఉపక్రమించేం.
అన్నం, పప్పు, దోసావకాయ పచ్చడీ పెరుగుతో భోజనం కానిచ్చేము.

మా యాత్రలాగే భోజనం కమ్మగా ఉంది.

ఇక్కడితో మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాల కథనం పూర్తయింది.

ఇక  మరోసారి 9 రాత్రులు ఉండేలా కాశీ వెళ్ళే యోచన ఉంది. మా చిన్నాన్న
 పంతులు బాబు, మురళీ పిన్ని, మా అక్కయ్య,  తన పెద్ద కొడుకు నాని, నాని
అత్త గారూ మామ గారూ మా శ్రీకాకుళం తమ్ముడు లక్ష్మణ్, మరదలు శారదలు
 కూడా తప్పకుండా వస్తామని అదరం కలిసి వెళదామని ఎప్పటి నుండో అంటున్నాం.

కాశీ నాథుని దయతో ఆ యాత్ర కూడా జయప్రదంగా జరగాలని కోరుకుంటూ, శలవ్.


ఈ యాత్ర వివరాల కోసం
ttdc అని type చేసి నెట్లో వెతక వచ్చును. లేదా,చిరునామా, ఫోను నంబర్లు
Tamil Naidu Tourism Devolepmednt Corporation,
Tourism Complex,
No.2 Wallajh Road, CHENNAI -600 002,
Phone :25333850 Extn. 208
Phone 044-25333113

mail ID ttdc@vsnl.com కి సపద్రదించ వచ్చును.


























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి