18, ఆగస్టు 2010, బుధవారం

వేటి వలన ఏవి శోభిస్తాయి ?



గత టపాలో ఏవి ఉంటే ఏవి ఉన్నట్లే అవుతుందో చూసాం. ( ఇక్కడ చూడండి) ఇవాళ ఏవి ఉండడం వలన వేటికి శోభ కలుగుతుందని పెద్దలు చెప్పారో చూదాం ...

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ మిదం శీలం పరం భూషణమ్ .

ఐశ్వర్యం వల్ల ఏది శోభిస్తుంది ? మంచితనం. ( సంపదకు మంచి తనమే అలంకారం. )
పరాక్రమం దేని వలన శోభిస్తుంది ? మాట మంచితనం ( ఎంత పరాక్రమం ఉన్నా, మాట కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)
ఙ్ఞానం దేని వలన శోభిస్తుంది? శాంతం వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)
పాండిత్యానికి అలంకారం ఏది ? వినయం
ధనం ఉన్నందుకు ఏది చేయడం వల్ల శోభ కలుగుతుంది ? పాత్రత నెరిగిన దానం
తపస్సునకు ఏది అలంకారంగా భాసిస్తుంది ? సహనం. కోపం లేక పోవడం (క్రోధిగా తపస్వికిఁజన్నే? అని భారతం చెబుతోంది.)
సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య లక్షణం ఏది ? క్షమా గుణం
ధర్మమునకు శోభని కలిగించేది ఏది ? నిర్మోహత్వం ( దేనిమీద ఎక్కువ మమకారం లేక పోవడం)
సమత వలన ఏమి కలుగుతుంది ? తేజస్సు.

తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త జనులకూ శోభని ఇస్తుంది.

ఈ విధంగా పెద్దలు శీల వర్తనకి పెద్ద పీట వేసారు.

1 కామెంట్‌:

హను చెప్పారు...

nijame namDi....

కామెంట్‌ను పోస్ట్ చేయండి