2, డిసెంబర్ 2010, గురువారం

మనశ్శల్యాలు


లోకంలో మనస్సునకు చాల బాధ కలిగించే ఏడు విషయాల గురించి ఈ శ్లోకంలో కవి చెబుతున్నాడు.

చూడండి ...

శశీ దివస ధూసరో గళిత యౌవనా కామినీ
సరో వితగ వారిజం, ముఖ మనక్షరం స్వాకృతే:
ప్రభు ర్దన పరాయణ:, సతత దుర్గతి స్సజ్జన:,
నృపాంగణగత: ఖలో మనసి సప్త శల్యాని మే.

నాకు లోకంలో ఏడువిషయాలు మనశ్శల్యాలై నన్ను బాధిస్తూ ఉంటాయి అని కవి వాపోతున్నాడు.

అవి ఏమంటే,

తెల్లవారగానే వెల వెల పోయే చంద్రబింబం
యవ్వనం సడలి పోయిన కామిని
పద్మాలు లేనట్టి చెఱువు
అక్షరం ముక్క లేనట్టి సుందర వదనం
ధనాశా పరుడైన ప్రభువు
సత్పురుషుల నిత్య దారిద్ర్యం
అధికారుల దగ్గర ఎప్పుడూ పరమ తుంటరులకే చేరిక ఉండడం.

ఇవీ కవిగారిని బాధించే ఏడు విషయాలు.

రేయంతా నేల మీద అంతటా చక్కగా పరుచు కున్న వెన్నెల తెల్ల వారగానే వెలవెలబారి పోవడం చూస్తూ ఉంటే ప్రకృతిని ఆరాధించే ఎవరికయినా బాధాకరమే.

యవ్వనం సడలి పోయిన కామిని రూపం చూడనలవి కానిదట.
చెఱువులో పద్మాలు ఉంటేనే అందం.
ఎంత అందగాడయినా, నిరక్షర కుక్షి అయితే, వాడి ముఖం చూడాలనిపించదు మరి.
ధనాశా పరుడైన రాజు ముఖం కూడా చూడ్డానికి పరమ దరిద్రంగా ఉంటుంది.
నిత్యం అష్ట కష్టాలు పడుతూ, దరిద్రం ఓడుతూ ఉండే మంచి వారి స్థితి ఎవరికయినా బాధాకరమే.

ఇక, రాజుల కోటరీలో మంచి వారికి అణు మాత్రమైనా చోటు లేకుండా, నేర చరితులకూ, దుష్టులకూ, దగా కోరులకూ, అవినీతి పరులకూ, వంచకులకూ, మాత్రమే చోటు ఉండడం చూస్తే ఆలోచనాపరులైన వారెవరికయినా బాధని కలిగిస్తుంది కదూ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి