9, డిసెంబర్ 2010, గురువారం

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !


భోజ రాజు ముఖం చూస్తూనే కవిత్వం పుట్టుకు వస్తుందిట.

ఒక రోజు భోజుడు కొలువు తీరి ఉండగా, భద్ర మణి అనే మహా పండిత కవి అక్కడికి వచ్చేడు. అప్పటికే భోజుని సింహాసనం ప్రక్కన కుడి వేపు కాళి దాస కవి సుఖాసీనుడై కూర్చుని ఉన్నాడు.
విధి లేని సరిస్థితిలో అయిష్టంగానే భద్ర మణి ఎడమ వేపు కూర్చున్నాడు. అది అతనికి అవమాన కరంగా తోచింది. మనసు కుత కుతలాడి పోయింది. ఎడమ వేపు కూర్చోవడంతో తను కాళి దాసు
కన్నా, తక్కువ అనే ఆత్మ న్యూనతా భావం అతనిని కలచి వేసింది. మరి ఉండ లేక ఈ శ్లోక పాదాలు చెప్పాడు:

గృహ్ణోత్యేష రిపో శ్శిర: ప్రతి జనం కర్షత్య సౌవాజినం
ధృత్వా చర్మ ధను: ప్రయాతి సతతం సంగ్రామ భూమావసి
ద్యూతం చైర్య మధ స్త్రియంచ న పదం .జానా వినాయాం కర:

ఈ మూడు శ్లోక పాదాల అర్ధమూ ఇది:

ఎడమ చేయి ముందుగా శత్రువు శిరస్సును పట్టుకుంటుంది. ముందుకూ వెనుకకూ లాగి గుంజుతుంది. బాణం వేసే ముందు విల్లు పట్టు కుంటుంది. జూదం, స్త్రీలను బలాత్కారం చెయ్యడం, పనికి మాలిన శపథాలు చెయ్యడం మొదలయినవి చెయ్యదు.

ఇలా భద్ర మణి ఎడమ చేయి గొప్ప తనాన్ని పొగడడం ద్వారా ఎడమ వేపు కూర్చోవడం వలన తనకి వచ్చిన చిన్న తనం ఏమీ లేదని చాటుకో డానికి ప్రయత్నించేడు.

వెంటనే కాళి దాసు శ్లోకం నాలుగో పాదాన్ని పూరించి, ఆ కవికి తేరుకో లేని గట్టి చురక అంటించేడు.

కాళి దాసు పూరించిన నాలుగో పాదం ఇది:

దానాద్యితరం విలోక్య విధినా శౌచాధి కారి కృత:

ఎడమ చేతికి దానం చేసే అర్హత లేనందు వలన బ్రహ్మ దానికి నీచమైన పనులు చేయమని నియోగించాడు సుమా !

కాళి దాసు పూరించిన శ్లోక పాదం విని కవి గారికి దిమ్మతిరిగి పోయి ఉంటుంటుంది. కదూ?

అంచేత, ఊరికే కుడి ఎడమల తగువులతో సరి పుచ్చక మనకి దక్కగల గౌరవం మనకు దక్కిన స్థానం బట్టి కాక, మన ప్రతిభా వ్యత్పత్తులను బట్టి ఉంటుందని గ్రహించాలి.


స్వస్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి