నవ్వితే నవ్వడి ..నాకేం
అభ్యంతరంయలేదు..
కొంత మంది గలగలా ఏదో
మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం
కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.
ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు.
ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత
స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి
పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే
బోధ పడుతుంది.’’ అని
హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై
నవ్వి పోతాం.
అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి.
తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ
కదొక తుత్తి !
అలాంటివాటిని కొన్నింటిని
చూదాం !
వృత్తింకల్పయ శక్తి లేదు
అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా
సుఖాదత్రవై
పోతే పో
బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం
భాషాద్వయం పాతున:
ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా
పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.
‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల
కాదురా’’ ‘‘ మరెలా
బతకడం ?’’ ‘‘ఉంటే
ఉండు. పోతే పో !’’ ఇలా
సాగింది వారి సంభాషణ.
మరొకటి -
కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !
మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే
గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!
భామా కలాపంలో హాస్యగాడు
చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:
ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం
దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం
ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి
జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం
ఏతన్హా భారతం.
ఇలాంటి ఉభయ భాషా
విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:
గణానాం గణనాథశ్చ
గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:
అక్కలమ్మా మహామారీ మాతంగీ
పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం
ఆశీరమ్మాయ నమోనమ:
కామినీ చైవ గాంధారీ
లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె
గంపాయ తే నమ:
పగటి వేషగాళ్ళు వేదంలా
స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:
అంబలి ముఖ్యంత్వలంకారం
కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం
దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా
సర్వాదాయం యథాక్రమం
తిన్నట్టే తిన్నకున్నట్టే
ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన
దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ
వర్జయేత్ .
మరొకటి చూడండి:
తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి
కవిగారి ఇంట దరిద్రం ఇలా
ఉంది మరి !
చివరగా ఇంకొకటి ...
క్షుధాతురాణాం
నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న
చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న
పల్లం
కామాతురాణాం న ముసిలిర్న
పిల్ల:
ఇది కామాతురాణాం న రుచిర్న
పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో
లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు.
కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి