12, మార్చి 2016, శనివారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు Day 04 (1 – 3 -2016 )

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు  Day 04 (1 – 3 -2016 )
మా తమిళ నాడు యాత్రలో ఈ రోజు మా ప్రయాణం కన్యా కుమారికి. అయితే, మా పేకేజీలో లేని మరో రెండు
ఆలయాలను మా గైడ్ చూపించాడు. వాటి వివరాలు చెప్పేక, కన్యా కుమారికి గురిచి చెబుతాను.
ఉదయం బ్రేక్ ఫాస్ట్  రామేశ్వరం లోని టూరిజమ్ వారి హొటల్ లోనే తీసు కున్నాము. కన్యా కుమారి అక్కడికి 350
350 కి.మీ దూరంలో ఉంది. ఉదయం 7.15ని.లకే టిఫిన్ లు కానిచ్చి బయలు దేరాము.

8.30 కి వొక చిన్న ఆలయం దగ్గర బస్ ఆగింది. అక్కడ వొక హనుమాన్ టెంపుల్ ఉది.
హనుమ విగ్రహం పెద్దదే. అక్కడే వొక వ్యక్తి మాకు నీటిలో తేలే రాళ్ళు చూపించేడు.
రాళ్ళు నీటిలో బెండుల్లా తేలడం అబ్బురమే. అలాంటి రాళ్ళు అక్కడ కొద్ది పాటి మాత్రమే ఉన్నాయి. అలాటి
రాళ్ళ మీదే శ్రీరామ అని వ్రాసి వానరులు సముద్రంలో వేసి లంకకు వారధి నిర్మించారుట!
వొక నీటి తొట్టిలో ఉన్న నాలుగయిదు రాళ్ళను కదిపి చూసేము.
రాముడు ధనుష్కోటి ప్రాంతంతలో నిర్మించిన సేతువు సమద్ర గర్భంలో కలిసి పోగా, అక్కడ నుండి
సేకరించి తెచ్చిన రాళ్ళు కొన్ని ఇక్కడ ఉంచి భక్తులకు చూపుతున్నట్టుగా చెప్పారు.
ఇది చూసేక, బస్ మళ్ళీ బయలు దేరింది. మరో గంట తర్వాత 9.30వొక చోట ఆది జగన్నాథ
స్వామి వారి కోవెల దగ్గర దర్శనార్ధం బస్ ఆగింది. ఈ ప్రాంతాన్ని దక్షిణ పూరి అని వ్యవహరిస్తారుట.
ఇక్కడ ఆలయంలో శయన ముద్రలో ఉన్న శ్రీరాముడు దర్శనమిస్తాడు. కుడి చేతిని తల కింద పెట్టుకుని
సీతాన్వేషణ ఎలా చేయాలా ! అని ఆలోచిస్తున్నట్టుగా శ్రీరామ మూర్తి శయన భంగిమలో ఆలోచనా ముద్రలో
కనిపిస్తాడు.  అర్చకులు ఆలయానికి చెందిన ఈ ఐతిహ్యం చెప్పారు. గర్భ గుడికి వెలుపల శ్రీరాముడిని
అవలోకిస్తూ శరణా గతి భంగిమలో విభీషణుని విగ్రహం ఉది. మరో ప్రక్క సముద్రుని విగ్రహం కూడా ఉంది.
మరో ప్రక్క పట్టాభిరాముని విగ్రహాలు చూడ ముచ్చటగా ఉన్నాయి.
సరే, ఇక్కడి నుండి బయలు దేరి, లంచ్ కి అవకాశం లేక పోవడంతో వొక చోట ఆపితే స్నాక్స్  అరటి
పళ్ళతో కడుపు నింపు కున్నాము.
నాలుగు గంటలకి కన్యా కుమారి చేరు కున్నాము.
కన్యాకుమారి చాలా అందమయిన ప్రదేశం. భారత ద్వీప కల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రాంతం.
అందుకే దీనిని కన్యా కుమారి అగ్రం అని అంటారు. ఇదొక ముఖ్య పర్యాటక కేంద్రం.పడమటి కనుమలలో
ప్రకృతి సిద్ధ మయిన అందాలతో అలరారే ప్రదేశం. ఇది బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం,
హిందూ మహా  సముద్రం కలిసే చోటు.  ఆ మూడు సముద్రాల జలాలు అక్కడ కన్యా కుమారిగా వెలిసిన
 పార్వతీ దేవి దివ్య పాదాలను తెల్లని కెరటాలతోనూ, నురుగులతోనూ  తడుపుతూ ఉంటాయి.
ఇక్కడి సైకత రేణువులుథోరియం ధాతువులతో కూడి ఉండడం వల్ల శక్తిమంతములై, పవిత్రమెలైనవిగా
భావిస్తారు. వారణాసి శివుడికీ, కన్యా కుమారి పార్వతీ దేవికీ నివాస స్థలాలుగా చెబుతారు.

ఇక్కడ కన్యా కుమారి ఆలయ దర్శనంతో పాటూ విశేష ఆకర్షణగా నిలిచేవి సముద్ర జలాలలో
కనుల పండువుగా కనిపిస్తూ ఉండేవివేకానంద  స్వామి మెమోరియల్ రాక్ టెంపుల్. 1892ప్రాంతంలో
వివేకానందుడు సముద్రాన్నిఈదుతూ వెళ్ళి అక్కడి కొండమీద ధ్యానం చేసే వారట!
స్వామి స్మారకార్ధం ఆ కొండ మీద వొక చలువ రాతి ధ్యాన మందిరాన్ని నిర్మించారు.
దానికి కొంత సమీపంలో  తమిళ కవి తిరువళ్ళవర్ భారీవిగ్రహం అబ్బుర పరుస్తూ ఉంటుంది.
133 అడుగుల ఎత్తుతో, ఏడున్నర టన్నుల బరువుతో ఉండే ఆ విగ్రహాన్ని 2000సం.లో
ముఖ్య మంత్రి కరుణా నిధిఆవిష్కరించారుట. ఇక్కడకీ,సముద్రలో రాక్   టెంపుల్ వద్దకూ వెళ్ళడానికి
పడవలలోనే వెళ్ళాలి.  ఫెర్రీ సర్వీసులు ఉంటాయి.  కానీ, ఆ రోజు సాయంత్రం అలల ఉధృతి ఎక్కువగా
 ఉడడంతో ఫెర్రీ సర్వీసులను రద్దు చేసారు. అందరం ఎంతో నిరుత్సాహ పడ్డాం. కానీ మా గైడ్ నిరుత్సాహ
 పడ వద్దనీ, యాత్రలో చిన్న మార్పు చేసి మరునాడు 5 వరోజు యాత్రలో  ఉదయం చూడ వసి ఉన్న
సుచీంద్రానికి ఆ సాయంత్రమే తీసుకుని వెళ్తాననీ, అందు వలన సమయం కలసి వచ్చి,
మరునాడు ఉదయం ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరిస్తే వివేకానంద రాక్ టెంపుల్ ని చూడ వచ్చనీ చెప్పాడు.

అందు చేత  సుచీంద్రం వెళ్ళడానికి ముందుగా కన్యా కుమారిలో గాంధీ మెమోరియల్ భవనం చూసేము.
అక్కడ మహాత్ముని అస్థికలుంచిన పాత్ర నిక్షిప్తం చేసిన పాల రాతి కట్టడం ఉంది. దాని మీద గాంధీ
జయంతి అక్టోబరు 2న  మాత్రమే సరిగ్గా పన్నెండు గంటలకి నేరుగా సూర్య కిరణాలు పడడం విశేషమని
 చెప్పారు. తర్వాత ఇక్కడ కన్యా కుమారి ఆలయాన్ని దర్శించు కున్నాం.ఆతర్వాత అంతా బస్ ఎక్కాము .
 బస్ 5.45 ని.లకి సుచీంద్రం చేరింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ కోవెలలో
 విశేషాంశం ఏమిటంటే, సంగీతం వినిపిచే స్తంభాలు. గైడు వాటి మీద లయ బద్ధంగా వాయించేడు. స్తంభాల
నుండి చెవి వొగ్గితే  మూడు నాలుగురకాల వాయిద్యాల సంగీతం ప్రతిధ్వనించింది. రాళ్ళు కూడా రాగాలు
పలకడం అంటే ఇదే కదా అనుకున్నాము.

సుచీంద్రం చూసుకుని 7.30కి తిరిగి కన్యాకుమారి చేరు కున్నాము. టూరిజమ్ వారి హొటల్ గదులలో
చేరి, విశ్రాంతి తీసుకుని ఎనిమిదిన్నరకి వారి హొటల్ లో డిన్నరు తీసు కున్నాము.

మర్నాడు ఉదయమే లేచి,  కన్యా కుమారిలోసూర్యోదయాన్ని చూడాలని, ఫెర్రీలు తిరిగితే
వివేకానంద మెమోరియల్ రాక్ టెంపుల్ చూడాలనీ ఉవ్విళ్ళూరుతూ నిద్రకి ఉపక్రమించాము.
శలవ్.

















మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Dayn 03 (29 -02-2016)

మా 8 రోజుల తమిళ నాడు  యాత్రా విశేషాలు  Day 03 ( 29-2-2016)
ఉదయం బ్రేక్ ఫాస్ట్  తంజావూరు టూరిజం వారి హొటల్ లోనే చేసి,మా మూడవ రోజు యాత్ర కోస8.30 ని. బయలు దేరాము.
కి బయలు దేరాం. మా ప్రయాణం రామేశ్వరానికి.   కానీ, దారిలో మా పేకేజీలో లేని మరో రెండు
దేవాలయాలను గైడ్ చూపించాడు. వాటి వివరాలు చెప్పేక, రామేశ్వరం గురించి చెబుతాను.
బస్ హైవేలో చాలా దూరం ప్రయాణం చేసాక, 9.30 ప్రాంతంలో వొక చోట సైడు రోడ్డు పట్టింది.
ఈ రోడ్డు ప్రయాణానికి మరీ అంత సుఖంగా లేదు. దాదాపు గంట  తర్వాత పెరుమియమ్ అనే
చోటుకి చేరుకున్నాం.  ఇక్కడ శయన భంగిమలో ఉన్న మహా విష్ణువు ఆలయం ఉంది.
 మహా విష్ణువు శ్రీదేవి, భూ దేవీ సహితుడై ఉంటాడు. నాభి నుండి పద్మం, దాని మీద బ్రహ్మ ఉంటాడు.  ఇదొక గుహాలయం.  పెద్ద కొండ గుహలో ఉంది. చూడ తగిన ఆలయమే. భక్తుల రద్దీ సామాన్యంగా ఉంది. పర్వ దినాలలో భక్తులు పోటెత్తుతారేమో  అనుకుంటాను.
 తొండమాన్ చక్రవర్తి దీనిని నిర్మించాడని  చెప్పారు. తిరుమల నిర్మాణాలలో ఈ ప్రభువు ప్రమేయం
చాలా ఉంది. శ్రీ వారి ఆలయంలో వీరి కంచు విగ్రహం ఉంది . శ్రీ మహా విష్ణువును దర్శించు కున్నాక
కోవెల బయట సమీపంలో లోనే వొక చిన్న గుహ చూపించాడు. వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఇక్కడే
 తలదాచు కుని ఆంగ్లేయుల చేతికి చిక్కాడని చెబుతారు.  గుహ చాలా ఇరుకుగా ఉండి చొర రానిదిగా
 ఉంది.
 దీని తర్వాత బయలు దేరి సుమారు 11.30 గంటల ప్రాంతంలో చటివాడ అనే చోట  వొక పెద్ద గణపతి
 ఆలయం  చూసేము. ఈ గణపతి కరగాసురుడు అనే రాక్షసుని సంహరించాడని స్థల పురాణం చెబు
తోంది. ఇక్కడి రాతి విగ్రహం చాలా పెద్దది. ఇది కూడా చూడ తగినదే.
2 గంటల ప్రాంతంలో  రామేశ్వరం వరకూ సముద్ర తీరాన వేసిన రైల్వే ట్రాక్,సముద్రంలో షిప్ లు
 వస్తే దారి ఇస్తూ రెండుగా చీలి పోయే అద్భుత మయిన రైలు వంతెనా ఉన్నాయి.
( హౌరా బ్రిడ్జి కూడా ఇలాంటిదే) దీని పొడవు దాదాపురెండున్నర కి.మీ ఉంటుందిట.ఇది కాక
ఎడమ వేపు ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన  రోడ్డు వంతెన కూడా ఉంది.
ఇక్కడ సముద్రం నీల వర్ణ శోభితమై కనుల పండువుగా ఉంటుంది. ట్రాఫిక్ కి అడ్డు లేకుండా మా బస్
 వో ప్రక్కగా ఆపి దిగి చూసి వేగిరం రండని గైడ్ చెప్పడంతో అందరం పొలోమని కెమేరాలతో
బస్ దిగేం. ఆ వంతెనలు. సముద్రం ఆ దృశ్యాలు ఎంత చూసినా తనివి తీరేలా లేదు. కాసేపు
ఫొటోలు తీసు కున్నాక, బస్ ఎక్కాము. బస్ బయలు దేరింది. రామేశ్వరానికి చేరు కోడానికి
ముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సమాధి బస్ లోనుండే చూపించాడు.  మరి కొంత
దూరం వెళ్ళాక శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్ప బడుతున్ననలుచదరంగా ఉండే
నవగ్రహ మండపం ఉంది. సముద్రపు అలలు కప్పి వేయడంతో ఐదు గ్రహాలు మాత్రమే బయటకి
కనబడుతూ తక్కిన నాలుగూ నీటిలో కనబడుతూ న్నాయి. మూడు ప్రక్కలా అనంత మయిన
సముద్ర జలాలను చూస్తూ, రాతి పలకల చప్టా మీద ఆ నవగ్రహాలనూ దర్శిచు కోవడం
వొక మధురానుభూతి అనే చెప్పాలి.
రాముడు ప్రతిష్ఠించిన నవగ్రహాలనూ దర్శిచు కున్నాక బస్ ఎక్కాము. రామ నాథంలో లంచ్ .
ప్రైవేటు హొటల్. చాలా పెద్దదే. గైడ్ సూచనతో  ఉదయం టిఫిన్ లు కాస్త హెవీగా ఉడడంతో ఆకళ్ళు
 లేక మేమూ మురళీ కృష్ణ గారూ పూర్తి భోజనం కాకుండా పెరుగన్నాలు మాత్రం తెప్పించుకు తిన్నాం. పెరుగన్నం
పెరుగన్నం కమ్మగా ఉంది. వారి కుటుంబ సభ్యులు రాధ గారూ విజయ లక్ష్మి గారూ  ఆకలి లేక
పోవడంతో పెరుగన్నం కూడా తీసుకో లేదు.అరటి పళ్ళు తినిఊరుకున్నారు.
      లంచ్ అయ్యాక, బస్ ఎక్కాం. బస్  సాయంత్రం నాలుగు గంటలకి రామేశ్వరం చేరుకుంది.
       టూరిజమ్ వారి హొటల్ చేరుకుని గదులలో ప్రవేశించాము. ఆలస్యం చెయ్యకుండా
        రామేశ్వరలో స్నానాలకు కావలసిన బట్టలు పోలథిన్ కవర్లలో పెట్టుకుని బయలు దేరేం.
        స్నానాలకీ, గుడి లోకీ వెళ్ళ వలసి ఉంటుంది కనుక సెల్ ఫోన్ లూ, కెమేరాలూ హొటల్
         గదిలోనే ఉంచేసాము.
        అక్కడ సముద్ర స్నానం చేసాక కోవెలలో ఉన్న 21 బావులలో స్నానం చేయాలంటారు.
        ఆ తర్వాత పొడి బట్టలు కట్టుకుని రామనాథ స్వామి దర్శనం చేసు కోవాలి. డబ్బులు తీసుకుని
        బావులలో నీరు తోడి పోయడానికి  కొందరు వ్యక్తులు ఉంటారు. మా గైడ్ మాకూ, మురళీ కృష్ణ
గారి కుటుంబానికీ వొక తెలుగు వచ్చిన వ్యక్తిని కుదిర్చి పెట్టాడు. అతడు మనిషికి వంద రూసాయల
చొప్పున  వసూలు చేసాడు. సముద్ర స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్ లు ఉన్నాయి.
 ముందుగా  మేము సముద్ర స్నానాలు చేసి, ఆ తడి బట్టలతోనే కోవెల లోనికి వెళ్ళి 21 బావులలో
ఆ వ్యక్తి నీరు తోడి పోస్తూ ఉంటే స్నానాలు చేసాము.ఇక్కడ నీళ్ళు తోడి పోసే వాళ్ళు మనల్ని బావి నుండి
 బావికి పరుగులు పెట్టిస్తూ ఉంటారు. లోగడ ఒక్కో నూతికీ నీళ్ళు తోడి పోయడానికి పావలా చొప్పున యిచ్చి
స్నానాలు చేసామని రాధ గారు చెప్పేరు.
నూతులలో స్నానాలు అయ్యేక పొడి బట్టలు మార్చుకుని ( బట్టలు మార్చు కోడానికి అక్కడ సదుపాయం
ఉంది)  రామనాథ స్వామి దర్శనం చేసు కున్నాము. కాశీ నుండి  మేము తెచ్చిన గంగను
అక్కడి పూజారులకి ఇస్తే సైకత లింగానికి అభిషేకం చేసారు.
ఈ బావుల వివరాలు:
1.మహా లక్ష్మీ తీర్ధం  2. సావిత్రీ తీర్ధం  3. గాయత్రీ తీర్ధం  4.సరస్వతీ తీర్ధం   5.సేతు మాధవ తీర్ధం    6. గంధమాదన తీర్ధం   7.కవచ తీర్ధం   8.గవయ తీర్ధం  9. నత తీర్ధం  10. నీల తీర్ధం  11. శంఖర తీర్ధం  12.చక్ర తీర్ధం  13.బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్ధం  14. సూర్య తీర్ధం   15. చంద్ర తీర్ధం   16. గంగా తీర్ధం   17. యమునా తీర్ధం   18. గయా తీర్ధం   19.  శివ తీర్ధం   20 సత్యామృత తీర్ధం  21 సర్వ తీర్ధం 22 కోటి తీర్ధము.


ఇక్కడ రామేశ్వరం గురించిన కొన్ని వివరాలు చెబుతాను ...
రామేశ్వర ఒక ద్వీపం.ఈ ద్వీపాన్ని ప్రధాన భూభాగం నుడి పంబన్ కాలువ వేరు చేస్తోంది.
ఈ ద్వీపం శంఖు ఆకారంలో ఉంటుందంటారు. సుముద్రం అవతలి తీరాన శ్రీలంక
 రాజధాని కొలంబో ఉంది. ఇక్కడి స్వామి రామనాథ స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొకటి. ఇది
సైకత(ఇసుక) లింగం. రావణ సంహారానంతరం బ్రహ్మ హత్యా పాతకం నుడి తప్పించు కోడానికి శ్రీరాముడు
లింగ ప్రతిష్ఠ చేయ దలచాడు. హనుమంతుడిని కైలాసం వెళ్ళి ప్రతిష్ఠ కోసం శివ లింగాన్ని తెమ్మని
పంపించేడుట. కానీ  సమయానికి హనుమ లింగం తీసుకుని  రాక పోవడంతో  ముహూర్తం మించి పోకుండా
 శ్రీరాముడు సీతమ్మ వారు చేసిన సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడుట. తరువాత  కైలాసం నుండిలింగంతో
వచ్చిన హనుమంతుడు అలిగాడుట. అప్పుడు రాముడు ఆ లింగాన్ని కూడా ప్రక్కనే ప్రతిస్ఠించి,
దానికే ముందు పూజలు జరుగుతాయని మాట యిచ్చాడుట.
రామేశ్వరంలో ప్రభాత సమయాన వెళ్ళి స్ఫటిక లింగాన్ని కూడా దర్శించు కోవచ్చును. మాకు అవకాశం
లేక పోయింది. ఇక్కడ వానర సేన సాయంతో   శ్రీరాముడు సముద్రానికి వారధి నిర్మిచాడుట,.
 నీళ్ళపై తేలే రాళ్ళతో దీనిని నిర్మించాడంటారు. ఇలాంటి రాళ్ళని రామేశ్వరంనుండి తిరుగు ప్రయాణంలో
 వొక చిన్న గుడిలో చూసేము. ఈ రామ సేతువు రామేశ్వరంలో ధనుష్కోటి నుండి శ్రీ లంక వరకూ
వ్యాపించి ఉండేదిట.సముద్ర గర్భాన నాసా వారు ఇటీవల దీని ఉనికిని నిర్ధారించేరు.

రాత్రి 8 గటల ప్రాంతంలో హొటల్ కి చేరుకుని డిన్నర్ అయ్యేక విశ్రమించేం.
మర్నాడు 7.30కి కన్యాకుమారికి  మా ప్రయాణం. అందు వల్ల వేకువనే లేచి తయారైపోయి, నేనూ,
మా ఆవిడా మరో సారి సముద్రపు ఘాట్ వద్దకు వెళ్ళాం. మా ఆవిడ అక్కడి ఇసుకను
కొంత సేకరించింది. దీనిని తీసుకుని వెళ్ళి కాశీలో గంగలో కలపాలిట. ( ఈ సారి కాశీలో 9 రాత్రులు
నిద్ర చేయాలని మా సంకల్పం. ఆ కాశీ నాథుని దయ. )
మా తమిళ నాడు యాత్రలలో భాగంగా 4 వ రోజు కన్యా కుమారి యాత్ర గురించిన
వివరాలు ఇప్పటికి సశేషమ్.



























        
     




11, మార్చి 2016, శుక్రవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ..Day 02

మా  8 రోజుల  తమిళ నాడు యాత్రా విశేషాలు  2/8  Day 2.(28-2-2016)

తమిళ నాడు టూరిజమ్ వారి బస్సు లో  మా తమిళ నాడు 8 రోజుల యాత్రలో ఇది రెండో రోజు.
ఈ రోజు కొంత విశేష మేమిటంటే, ఈ రోజు మేము వొక దర్గానీ, వొక చర్చినీ, హిందూ
 దేవాలయాన్నీ కూడా చూడడం జరిగింది. మా బస్ లో అన్య మతస్తు లెవరూ లేరు. అందరమూ హిందువులమే.
 కానీ  అందరూ దర్గానీ. చర్చినీ కూడా చాలా ఆసక్తి కరంగా చూడడమే కాక, తోచిన దక్షిణలు
సమర్పించుకుని ప్రార్ధనలు కూడా చేసారు. ముఖ్యంగా వేలంగిణి చర్చి నిర్వహణని అంతా మెచ్చు కున్నారు.
సరే, రెండో రోజు ఉదయమే6.30 ని.కు బస్ బయుదేరింది. 9 గంటలకు దారిలో మా ఖర్చుతో బ్రేక్ ఫాస్టు
తీసుకుని ముందుగా తిరుకడయూర్ అనే చోట వొక పెద్ద శివాలయం దర్శించు కున్నాం. నిజానికి ఈ
 ఆలయ దర్శనం మా టూర్ పేకేజీలో లేక పోయినా, గైడ్ ఈ ఆలయానికి తీసుకు వెళ్ళాడు. ఇదొక పెద్ద
శివాలయం. బాగా రద్దీగా  ఉంది. ఇంత పెద్ద శివాలయాన్ని ఉదయాన్నే చూపించి నందుకు అందరం గైడ్ కి
 ధన్యవాదాలు చెప్పాం. ఆ ఆలయ విశిష్ఠత ఏమిటంటే, ఇక్కడ 60 ఏళ్ళు నిండిన వారు షష్ఠి పూర్తి జరుపు
 కుంటారు ! మేం వెళ్ళిన నాడు దాదాపు పది, పదిహేను  జంటల వరకూ  కుటుంబాలతో వచ్చిఅక్కడ
షష్ఠి పూర్తి జరుపు కోవడం చూసాం. అది చూస్తూ ఉంటే ముచ్చట వేసింది. ఈ శివ కోవెల చూసేక, నాగ
పట్నం బయలుదేరాం.
దీనినే నాగూర్ అని కూడా అంటారు. ఈనాగపట్నం ప్రాంతం అంతా 2004 మహా ఉప్పెనకు గురై
పూర్తిగా ధ్వంస మయినదే. తర్వాత చక్కగా పునర్మించ బడింది. ఆ పెను ఉప్పెనలో దాదాపు
20 వేల మందికి పైగా జల సమాధి అయ్యారని అంచనా. వారి స్మృత్యర్థం నాగ పట్నం సమీపాన నిర్మించిన
స్మారక స్తూపాన్ని మా గైడ్ బస్ నుండి చూపిచేడు. బస్ వో ప్రక్కగా ఆపించి బస్ దిగి ఫొటోలు తీసు
 కున్నాము.
గంటన్నర ప్రయాణంతో నాగూర్ చేరు కున్నాం. ఇక్కడ వొక ప్రాచీన మయిన దర్గా చూసేము.
ఈ ప్రాంతంలో కావేరీ నది దక్షిణ వాహినిగా ప్రవహించి, దూరాన సముద్రంలో కలుస్తుంది.
దర్గాలో లోపలి భాగంలో కూడా చాలా రకాల షాపులు ఉన్నాయి. మత పరమయిన వస్తువులూ
పూజా సామగ్రి విక్రయించడం కనిపించింది. పిల్లల ఆట వస్తువులూ అవీ సరేసరి.
దర్గా చూసేక బయలు దేరి వేలంకిని చర్చికి వెళ్ళాం. దీనినే వేలంగిణి అని కూడా వ్యవహరిస్తారు.
చాలా ప్రసిద్ధ మయిన రోమన్ కేథలిక్ చర్చి యిది. చాలా పెద్ద చర్చి. వేలంగిణీ మాత
ఆరోగ్య ప్రదాత అని విశ్వాసంతో తల్లిని   వేలాదిమంది  భక్తులు నిత్యం కొలుస్తూ ఉంటారు. 2004లో
సునామీ వచ్చి నప్పుడు వందలాది మందికి ఆ చర్చి ఆశ్రయం కలిగించిందిట.ఆ ప్రాంత మంతాపూర్తిగా
జలమయ మయినా,చర్చిలో ఒక్క చుక్క నీరు కూడా చేర లేదని చెబుతారు. కొందరు భక్తులు మన పొర్లు
 దండాల లాగా మోకాళ్ళ మీద నడుచు కుంటూ మాత దర్శనం చేసు కోవడం కనిపించింది.
చర్చి పరి శుభ్రంగానే కాక, ఎక్కడా వ్యాపార వాసనలు లేవు. మనసారా వేలంగిణీ మాతను అందరం
 దర్శించుకుని  బస్ ఎక్కాము. ఇక మా యాత్రలో ఆ రోజుకి చివర దర్శనీయ స్థలం తంజావూరు.
తంజావూరు అక్కడకి 95 కి,మీ, దూరంలో ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకి చేరాం.ttdc  వారి హొటల్ కి
 చేరుకుని గదులలో ప్రవేశించాము. ఉదయం బ్రేక్ ఫాస్టు మా ఖర్చే కనుక ఆ రోజు లంచ్,
డిన్నరూ కూడా టూరిజమ్ వారిదే నని గైడ్ చెప్పాడు. అంతే కాదు, మరు నాడు ఉదయం టిఫిన్లు కూడా
 అక్కడేనుట.  లంచ్ తీసుకుని, వేగిరం తయారయితే 3 గంటలకి తంజావూరులో చూడ తగిన ప్రదేశాలకి వెళ్ళి
 వద్దామని గైడ్ చెప్పాడు.
ఇక్కడ  టూరిజమ్ వారి  హొటల్    గురించి చెప్పాలి. నిజానికి వొక రాజ ప్రాసాదాన్ని హొటల్ గా
 మార్చడంతో చూడడానికి చాలా రిచ్ గా ఉంది. రాచ మహలు అందాలతో ఆ వసతి అందరినీ ఆకట్టుకుంది.
అక్కడ ఆతిథ్యం కూడా రాచ మర్యాదలనే తలపించేలా ఉంది.
గబగబా తయారై పోయి అందరం లంచ్ తీసుకుని 3 గంటల కల్లా బస్ క్కాము.
ఇక్కడ తంజావూరు గురించి కొంత చెప్పుకుందాం. 16వ శతాబ్దికి చెందిన నాయక రాజులు దీనిని రాజధాని
గా చేసుకుని పాలించారు. నాయక రాజులలో  అచ్యుత నాయకుడు, రఘునాథ నాయకుడు, అతని
తనయుడు విజయరాఘవ నాయకుడు చాలా ప్రసిద్ధులు. వీరు గొప్ప కళా పోషకులు. ఆ రాజులు కవులు
 కూడా కావడంతో అనేక గ్రంథాలు రాసేరు. రఘునాథ నాయకుడు కర్ణాటక సంగీతంలో గొప్ప ప్రతిభ కలవాడు.
అనేక రాగాలను తాళాలనుస్వయంగా కల్పన చేసాడు  రఘునాథనాయకుని రామాయణం, చాలా
 విశిష్ఠ మయినది. విజయ రాఘవుని రఘునాథాభ్యుదయం యక్షగానం కూడ చాలా ప్రసిద్ధ మయినది.
యక్షగాన ప్రక్రియను ఈ రాజులు  ఎంతగానో ప్రోత్సహించేరు. వాటి ప్రదర్శన కోసం ఎన్నో విశాల మయిన
వేదికలను నిర్మించారు కూడా.
చెప్పగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, విరి పొట్లము
విప్పిన గతి కుంకుమ పైపై
కప్పిన క్రియ ఘుమ్మనన్ కవిత్వము సభలన్
అనివారి నికష! ప్రతి పద్యం చమత్కారాలతో కమ్మనయిన మూడాశ్వాసాల ప్రబంధం రచించిన
 విజయ విలాస కర్త చేమ కూర వేంకట కవి , రామ భద్రాంబ మొదలయిన కవులూ,కవయిత్రులూ వీరి
 ఆస్థానంలోని వారే.

ప్రసంగవశాత్తు ఇక్కడ తంజావూరు ప్రభువుల దాన వైభవానికి చెందిన వొక కథ కూడా చెప్పు కోవాలి.
ఈ కథలో నిజం ఎంతో కానీ, తంజావూరు బద్ధకస్తుల కథగా యిది చాలా ప్రసిద్ధ మయినది.
నాయక రాజులు తమ పాలనలో వొక పెద్ద అన్నదాన సత్రం నిర్మించి పూటకి 60 వేల మంది ఉచితంగా
ముప్పూటలా భోజనాలు చేసే వీలు కల్పించారుట. ఇంత పెద్ద అన్న దాన సత్రం మరెక్కడా ఉండదు.
అన్నదాన కార్యక్రమం ముగిసేక, సత్రం అధికారులు గంట మ్రోగిస్తే దానిని విని కానీ రాజులు భోజనాలకి
కూర్చునే వారు కారుట. ఇలా ఉండగా రాను రాను తంజావూరులో ఈ అన్నదానం వల్ల సోమరుల సంఖ్య
 తామర  తంపరగా పెరిగిపోయింది. అందరి లోకీ గొప్ప సోమరి పోతు ఎవరూ అని రాజులు తెలుసుకో గోరేరుట.
వో రోజు రాత్రి సత్రానికి నిప్పు పెట్టారు. అంతా పొలోమని బయటకి పరిగెత్తారు. ముగ్గురు మాత్రం పడుకునే
 ఉన్నారు. వారిలో వొకడు కాసేపటికి విధి లేక లేచి వెళ్ళి పోయేడు. రెండవ వాడు తాము పడుకున్న
 చోటుకి  అగ్ని కీలలు వచ్చే వరకూ పడుకుని ఇక లాభం లేదనుకుని  లేచి వెళ్ళి పోయాడుట. మూడవ
వాడు మాత్రం తాను పడుకున్న చోట పైన ఉండే దూలం పూర్తిగా కాలే వరకూ చూదాం లెమ్మని పడుకునే
 ఉన్నాడుట. సత్రం అధికారులు వాడినే అతి గొప్ప సోమరి పోతుగా నిర్ణయించి బలవంతంగా లాగి బయట
పడేసారుట. ఈ కథలో వాస్తవం ఉన్నా, లేక పోయినా తంజావూరు ప్రభువుల దాన శీలత్వం లోక ప్రసిద్ధ
మయినదే . ఇక  యాత్రా కథనం లోకి వద్దాం.

బస్ ముదుంగాతంజావూరు సరస్వతీ మహల్  గ్రంథాలయం చేరుకుంది. ప్రపంచ ప్రసిద్ధ మయిన
ఆ పుస్తక దేవాలయాన్ని దర్శించు కోవడం మా జీవితంలో వొక మధురానుభవం అనే చెప్పాలి.
మేం వెళ్ళిన రోజున గ్రథాలయంలో కొన్ని భాగాలకు మరమ్మత్తులుజరుగుతున్నాయి.ఇదొక పెద్ద
పుస్తక భాండాగారం. ఎందరో సాహితీవేత్తలకు గొప్ప గొప్ప గ్రంథాలు ఇక్కడ ఉపలభ్యమౌతాయి.
సాహిత్య పరిశోధకులకు ఇదొక పెన్నిథి వంటిది.
సరస్వతీ మహల్ గ్రంథాలయం చూసేక తంజావూరు లోని గొప్ప శైవ  క్షేత్రం బృహదీశ్వరాలయం చేరు కున్నాము.
కావేరీ నది ఒడ్డున దక్షినాన ఉండే తంజావూరులో బృహదీశ్వరాలయం అతి పెద్ద శైవ క్షేత్రం.
తంజ – ఆన్ అనే రాక్షసుని ఇక్కడశ్రీ ఆనందవల్లి, శ్రీ నీల మేఘ పెరియాళ్ లు వధించినట్లు ఐతిహ్యం.
అపురూప మయిన శిల్ప కళా వైభవానికి పరాకాష్ఠగా ఈ ఆలయం విలసిల్లుతోంది.1010లో తొలి చోళ రాజ
రాజు నిర్మించిన అతి పెద్ద శైవాలయమిది. దీనికి మూడు ద్వారాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం
కేరళాంతకన్ కాగా రెండవది రాజరాజన్ తిరువళ్ మరొకటి తిరులేశక్కన్ తిరువళ్. ఇక్కడే వొక పెద్ద నంది
ఉంది. లేపాక్షి తర్వాత దేశంలో అతి పెద్ద నంది ఇదేనంటారు. దాని ఎదురుగా పెద్ద లింగ పీఠం మీద బృదీశ్వర
స్వామి దర్శనమిస్తాడు .బృహత్ అంటే పెద్ద. ఇది చాలా పెద్ద లింగం కనుక దీనికా పేరు వచ్చింది. భక్తుల రద్దీ
 విశేషంగా ఉంది.
గర్భ గుడిలో దక్షిణాన శివుడూ, పడమర వేపు నటరాజు, ఉత్తరాన దేవతామూర్తు విగ్రహాలూ ఉంటాయి.
ఇది సర్వకళా శోభిత మయిన గోపురాలతో కూడిన ఆలయం.
భారత ప్రభుత్వం1954లో తొలి సారిగా 1000 రూపాయల నోటు ముద్రించి నప్పుడు నోటు మీద ఈ
 ఆలయ చిత్రాన్నే ముద్రించారు.  అలాగే 2001లో ఈ ఆలయ చిత్రం ముద్రించిన తపాలా బిళ్ళ
కూడా విడుదల చేసారు.
సర్వతో భద్ర మయిన ఈ బృహదీశ్వరాలయ దర్శనం జీవితంలో మరచి పోలేనిది. అక్కడ చాలా సేపు గడిపి,
మా హొటల్ కి చేరు కున్నాము. ఆ రాత్రి తంజావూరు లోనే బస.
మర్నాడు మా 3వరోజు యాత్రా సందర్భంగా రామేశ్వరం చూసాము, ఆ వివరాలు ప్రస్తుతానికి
సశేషమ్!