3, జులై 2015, శుక్రవారం

గుండెల్లో తగినంత తేమ ఉండడం లేదు !



మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.



గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?

30, జూన్ 2015, మంగళవారం

మన వల్ల కాదు బాబూ ! ( సేవా ధర్మం చాలా కష్టం )



సేవా ధర్మం చాల కష్టతరమైనది. నిజానికది కత్తి మీది సాము లాంటిది. రాచ కొలువు లభించడం ఎంత కష్టమో, దానిని నిర్వహించడం అంతే కష్టం. ప్రభువుల వారికి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. ఎంతో మెళకువతో మెలగాలి. ఈ శ్లోకం ఆ అర్ధాన్నే వివరిస్తోంది:

మౌనా న్మూర్ఖ: ప్రవచన పటు:, నాతులో జల్పకో వా,
ధృష్ట: పార్న్వే వసతి నియతం చూరతశ్చా: ప్రగల్భ:
క్షాంత్యా భీరు ర్యది న సహతే ప్రాయశోనా2భిజాత:
సేవాధర్మ: పరమ గహనో యోగినా మస్యగమ్య:

సేవలు చేసి మెప్పు పొందడం చాల కష్టమైన పని. అది నిర్లిప్తంగా ఉండే యోగులకు కూడ అగమ్యగోచరం. సేవకుడు ఎలా ప్రవర్తించినా ఏదో ఒక తప్పు పట్టుకుంటారు యజమానులు.
మాట్లాడ కుండా మౌనంగా ఉంటే వొట్టి మూర్ఖుడని అంటారు.
మాటకారి అయితే వాగుడుకాయ అని తిడతారు.
ఓర్చుకుని సహనంగా ఉంటే పిరికిపంద అని వెక్కిరిస్తారు.
ఎదురాడితే తక్కువ జాతివాడంటారు.
యజమానికి ఎప్పుడే అవసరం ఉంటుందో అని, అతనికి సమీపంలో ఉంటే పొగరుబోతని అంటారు.
దూరం దూరంగా ఉంటే చేత కాని చవట అంటారు.
ఇలా సేవకునిలో లేని తప్పులని పదే పదే ఎత్తి చూపుతూ యజమానులు నానా యాగీ చేస్తారు.


సేవా ధర్మం చాలా కష్టం బాబూ !

ఆహా ! ఏమి రుచి ! ( చల్లి బువ్వ )



కన్యా శుల్కం రెండో అంకం లో మొదటి సారిగా బుచ్చమ్మని చూస్తాడు గిరీశం. బచ్చమ్మ ప్రవేశిస్తూనే తమ్ముడు వెంకటేశంతో, ‘‘ తమ్ముడూ, అమ్మ కాళ్ళు కడుక్కోమంచూందిరా’’ అంటుంది. అదే మొదటి సారి గిరీశం బుచ్చమ్మని 
చూడడం.
ఆమెని చూస్తూనే గిరీశానికి మతి పోతుంది. తనలో హౌ బ్యూటి ఫుల్ ! క్వైటనస్సెక్టెడ్ ! అనుకుంటాడు. బస్తీలో మధుర వాణిని విడిచి వచ్చేక ఇక్కడ కృష్ణా రాయ పురం అగ్రహారంలో ఇంత అందం ఉంటుందని అతను అనుకో లేదు. అందుకే, ‘‘ పల్లెటూర్లో వూసు పోదనుకున్నాను కానీ, పెద్ద కాంపేసుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం ’’ అనుకుంటాడు.

బుచ్చమ్మ గిరీశాన్ని ‘‘ అయ్యా, మీరు చల్ది వణ్ణం తించారా?’’ అనడుగుతుంది.

గిరీశం తడుము కోకుండా ‘‘ నాట్ది స్లైటస్టబ్జక్షన్ ’’ అని తలూపుతాడు. అంతే కాదు, ‘‘ అనగా, యంత మాత్రం అభ్యంతరం లేదు.’’ అని అనువాదం కూడా వెలగ బెడతాడు. అంతటితో ఆగ కుండా

‘‘ వడ్డించండిదిగో వస్తున్నాను.’’ అని చెప్పి, ‘‘ తోవలో యేటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను’’ అని కూడా బుకాయిస్తాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజుల్లో పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా ఇళ్ళలో అంతా ఉదయాన్నే చల్ది అన్నాలు తినేవారు. టిఫిన్లూ గిఫిన్లూ తెలియవు.

చల్ది , చల్లంది , చల్దన్నం ఈ పేర్లతో పిలిచే ఆ తరవాణీ అన్నం మహా రుచిగా ఉంటుంది. గ్రామీణులు సల్లంది అని అంటారు.

చలి + అది = చల్ది. చల్లనిది అని అర్ధం. చల్లని అన్నం అన్నమాట. ఇక్కడ చకారం తాలవ్య చకారం. దంత్య చకారం కాదు. ఈ చల్దన్నం కోసం ప్రతి ఇంట తరవాణి కుండలు ఉండేవి. తరవాణి అంటే పుల్లని నీళ్ళు అని నైఘంటికార్ధం. ఏతావాతా తేలిందేమిటంటే, చల్లంది అంటే, పులిసిన అన్నం అని అర్ధం !

మా ఇళ్ళలో పిల్లలందరకీ ఉదయాన్నే చల్దన్నాలు పెట్టే వారు. తెల్ల వారకుండానే లేచి స్నానాలు చేసి, మడి కోసం ప్రత్యేకంగా కుట్టించిన పట్టు లాగులు (చెడ్డీలు) తొడుక్కుని మరీ పిల్లలం ఒక పంక్తిని కూచుంటే కానీ మాకు చల్దన్నాలు వడ్డంచే వారు కాదు.

మా ఊర్లో ఉదయాన్నే వీధుల్లోకి తామరాకులు అమ్మకానికి వచ్చేవి. నూకలో, బియ్యమో యిచ్చి మా నాయనమ్మ ఆ తామరాకుల కట్టలని కొనేది. వాటిలో వడ్డించిన చల్దన్నం ఎంత రుచిగా ఉండేదో మాటల్లో వర్ణించడం కష్టం. ఆ తర్వాత రోజుల్లో అరిటాకులూ, తర్వాత తెల్లని పింగాణీ కంచాలూ వచ్చేయి. స్టీలు కంచాలు వచ్చే వేళకి ఇంట్లో చల్దన్నాల స్థానాన్ని టిఫిన్లు ఆక్రమించాయి.

ఉదయాన్నే ఆ తరవాణితో కూడిన చల్దన్నం తింటే ఎండ పొద్దెక్కాక ఎంత వేళకీ కానీ అసలు ఆకలనేదే తెలిసేది కాదు. ఆ రుచికరమయిన చల్దన్నం తినడానికి కమ్మగా ఉండడమే కాక, కడుపులో హాయిగా తేలిగ్గా ఉన్నట్టుండేది. అన్న సారం వొంట బట్టేక, కొంచెం మత్తుగా కూడా ఉండేది. నిద్ర ముంచు కొచ్చేది.

మా ఇంట్లో కాఫీల యుగం ప్రారంభ మయేక, అప్పుడప్పుడు ఆ కాఫీ రుచి మరిగి, మా పిల్లలం మాకూ కాఫీలు కావాలని గోల చేసే వాళ్ళం.

మా నరసింహం బాబాయి మాకు నడ్డి మీద ఒక్కటిచ్చుకుని, ‘‘ అన్నాలు తినే వాళ్ళకి కాఫీలు లేవర్రా !’’ అని ఓ తిరుగు లేని అలిఖిత శాసనం వినిపించే వాడు. నేను ఓ సారి అతనా మాట అనగానే ఉడుక్కుని, ‘‘ అక్కడికి, కాఫీలు త్రాగే వారంతా అన్నాలు మానేస్తున్నట్టు !’’ అని గొణిగాను. నా సణుగుడు వినిపించి మా నరసింహం బాబాయి నా నడ్డి ఫెడీల్మనిపించడం జరిగింది లెండి.

సరే, ఇంత రుచికరమయిన చల్ది అన్నం గురించి, అంతే రుచికరమయిన ఒక శ్లోకం మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. చూడండి:

వసంత నవ మల్లికా కుసుమపుంజవ న్మంజులం,
ససర్షపరసాలకం లికుచనీర వృగ్నార్ధకం,
వరాంగ్యుపరికేళిజ శ్రమ నివారణే కారణం,
జలోదన ముపాస్మహే జలజ బాంధవ ప్యోదయే.

వసంత కాలంలోని క్రొత్త మల్లి పువ్వు లాగ మంజులంగా ఉంటుంది. ఆవ తోడి మామిడి కాయ నంజుడుతో, అంటే, ఆవకాయ నంచుకుంటూ, లేదా, నిమ్మ రసంలో ఊరబెట్టిన అల్లపు ముక్కలతో, అంటే అల్లం పచ్చడితో నంచుకుంటూ చల్ది అన్నాన్ని ఉదయాన్నే తింటున్నాను. (మనోజ కేళి వలన కలిగిన) నా శ్రమ అంతా నివారించ బుడుతోంది కదా ! అని దీని భావం.

ఆవకాయ, లేదా, అల్లం పచ్చడి మొదలయినవి నంచుకుంటూ తెలతెల వారుతూ ఉండే తరవాణి లోంచి తీసి పెట్టిన చల్దన్నం తినడం కన్న స్వర్గం మరొకటి లేదని తెలుసుకోవాలి.

చల్దన్నం గురించి చెప్పుకుంటూ శ్రీకృష్ణుడు బాల్యంలో గోపాలురతో కూడి చల్దులారగించిన మధుర ఘట్టాన్ని తలుచు కోకుండా ఉండ లేం కదా !

చూడండి, భాగవతంలో బమ్మెర పోతన శ్రీకృష్ణుని బాల్య చేష్టలు వర్ణిస్తూ, పశువులను మేపుకుంటూ, నెచ్చెలి కాండ్రతో చల్దులు ఆరగించే సన్నివేశాన్ని మనోహరంగా రచించాడు.

గోపాలురు బాల కృష్ణునితో పాటు ఊరి చివర పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చి వేస్తోంది. అందరకీ ఆకలి వేస్తోంది. ఇక రండర్రా, చల్దులు తిందాం, అని గోపాలుడు గోపాలురను కేకేసి ఎలా పిలుస్తున్నాడో చూడండి :

ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార ! చల్ది గుడువన్ రమ్య స్థలంబిక్కడీ
దండన్ తేగలు నీరు ద్రావి యిరువందం బచ్చికల్ మేయుచుం
దండబై విహరించు చుండగ నమంద ప్రీతి భక్షింతమే

ఎండలో మ్రగ్గి పోయారు. ఆకలితో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడమెందుకు? ఓ బాలకులారా, రండి ! మనం చల్దులు తినడానికి ఇక్కడ ఈ చోటు చాలా మనోహరంగా ఉంది. ఇక్కడ లేగ దూడలు నీళ్ళు త్రాగి, ఈ చుట్టు ప్రక్కల గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ అందమయిన స్థలంలో చల్దులు తిందామా?

గోపాలుని పిలుపుతో గోపాలురంతా బిలబిలా అక్కడికి చేరారు. కృష్ణుని చుట్టూ వలయంగా కూర్చుని చల్దులు ఎలా తిన్నారో చూడండి:

జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁగూర్చుండి వీక్షింపుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు, లతల్ , చిక్కంబులున్, బువ్వు లా
కులు కంచంబులుగాభుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా !

పద్మంలో ఉండే కర్ణిక (బొడ్డు) చుట్టూ ఉండే రేకుల లాగ, కృష్ణుని చుట్టూ వలయాకారంగా అతనినే చూస్తూ కూర్చున్నారు గోపాలురు. తర్వాత, ఇళ్ళ నుంచి తెచ్చుకున్న చిక్కాలు విప్పి, చల్దులు తినడం మొదలెట్టారు. శిలలు, చిగుళ్ళు, గడ్డి, లతలు, చిక్కాలు, పువ్వులు, ఆకులు మొదలయిన వాటిని కంచాలుగా చేసుకుని గోపార్భకులు చల్దులు ఆరగించారు.

ఇలా చల్దులు తినే ఆ పిలకాయల సరదాలూ, కోణంగితనాలూ పోతన ఎంత మనోఙ్ఞంగా వర్ణించాడో చూడండి:

మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు
నూరు గాయలు దినుచుండు నొక్క
డొకని కంచము లోని దొడిసి చయ్యన మ్రింగి
చూడు లేదని నోరు సూపు నొక్క
డేగురార్గుర చల్దు లెలమిఁబన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక
డిన్నియునుఁదగ బంచి యిడుట నెచ్చెలి
తనమనుచు బంతెన గుండు లాడు నొకడు

కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల
మేలి భక్ష్య రాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు

మాటి మాటికి వేలు ముడిచి ప్రక్క వారిని ఊరిస్తూ ఒకడు ఊరగాయలు తింటూ ఉంటాడు.
ప్రక్క వాడి కంచం లోనుండి కొంత చల్ది లాక్కుని గుటుక్కున మ్రింగి వేసి, అబ్బే, నేను తిన లేదు కావాలంటే చూసుకో ! అని, నోరు చూపిస్తాడు ఒకడు.
పందెం కట్టి ఐదారుగురి చల్దులను కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు.
ఇంకొక గోప బాలకుడు, ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహ లక్షణం అంటూ నచ్చ చెబుతూ తింటున్నాడు.
అదిగో, చూడు ! కృష్ణుడు, అంటూ చూపు మరలించి, ప్రక్క వాని కంచం లోని చల్దులలో మేలైన భక్ష్య రాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు వేరొకడు .ఒకడు నవ్వుతాడు. మరొకడు నేస్తులను నవ్విస్తున్నాడు. ఇంకొకడు ఏవో ముచ్చటలు చెబుతున్నాడు. మరొకడు మురిసి పోతున్నాడు.

ఇలా నెచ్చెలి కాండ్రతో చల్దులు కుడిచే గోపాలుడు ఎలా ఉన్నాడంటే,

కడుపున దిండుగాఁగట్టిన వలువలో
లాలిత వంశ నాళంబుఁజొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద
డాపలి చేత మొనయ నునిచి.
చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు
వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి

సంగిడీల నడుమఁజక్కనఁగూర్చుండి
నర్మ భాషణముల నగవు నెఱపి,
యాగ భోక్త కృష్ణుఁడమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

కృష్ణుడు నడుము చుట్టూ దట్టీ కట్టు కున్నాడు. దానిలో తన వేణువును ఏటవాలుగా దూర్చాడు. కొమ్ము బూరా, చేతి కర్ర - ఈ రెండింటినీ జారి పోకుండా ఎడమ చంకలో ఇరికించి పట్టు కున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్ది ముద్ద ఎడమ చేతిలో పట్టు కున్నాడు. ఇంటి దగ్గర అల్లరి చేసి కొసరి కొసరి కట్టించు కొని, వచ్చిన ఊరుగాయ ముక్కలను కుడి చేతి వ్రేళ్ళ సందులో ఇరికించి పట్టుకున్నాడు.సంగడీల నడుమ కూర్చున్నాడు. చక్కగా వారినందరినీ నవ్విస్తున్నాడు. అతడు యాగ భోక్త. అట్టి నల్లనయ్య బాల్య క్రీడలతో ఒప్పుతూ నెచ్చెలి కాండ్ర మధ్య కూర్చుని చల్దులు ఆరగిస్తూ ఉంటే, నింగిని దేవతలందరూ నివ్వెర పోయారు. ఆ దేవ దేవుని శైశవ క్రీడలను తన్మయులై చూస్తున్నారు.

ఇదీ చల్ది కథ. చల్దన్నం గురించి ఇంత ఉందా చెప్ప డానికి ?! అంటే, ఉంది మరి !

తవ్విన కొద్దీ తరగని నిధి కదా, మన సాహితీ సంపద !

స్వస్తి.





28, జూన్ 2015, ఆదివారం

అన్నదాతా సుఖీ భవ ! తినడం కూడా వో కళ !



వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోందిఅక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.
‘‘ పకోడీలు కావయ్యాబజ్జీలు ...’’ అన్నాను.
‘‘ ఏవో ఒకటిఅక్కయ్య గారూవేగిరం తెండి నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.
అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:
పంక్తిభేదే పృథక్పాకేపాకభేదే తథా2కృతే,
నిత్యం చ గేహకలహేభవితా వసతి స్తవ.
ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటేఅయిన వాళ్ళకి ఆకుల్లోనుకాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ అలాగన్న మాట.
వడ్డించే వాడు మన వాడయితేకడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితేఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువాకొందరకి కొంచెం తక్కువాకొందరకి కొసరి కొసరికొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.
అలాగేవేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయిఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.
అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.
అలాగేనిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.
అంటేపంక్తి వడ్డనలో భేదం పాటించే వారింటవేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింటఅసలే వండు కోని వారింటనిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.
లక్షాధికారైన లవణమన్నమె కానిమెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.
అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.
నింపాదిగాశ్రద్ధగా భోజనం చేయాలి.
భుంజానో న బహు భ్రూయాత్న నిందేదపి కంచన
జుగుప్పసితకథాం నైవశ్రుణుయాదపి వా వదేత్.
భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.
చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:
ఉష్ణ మశ్నీయాత్స్నిగ్ధ మశ్నీయాత్మాత్రావ
దశ్నీయాత్జీర్ణే2శ్నీయాత్వీర్యా2విరుద్ధ మశ్నీయాత్
ఇష్టే దేశే2శ్నీయాత్నాతిద్రుత మశ్నీయాత్నా2తి
విలంబిత మశ్నీయాత్అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,
ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.
వేడి పదార్ధాలనే తినాలి.
చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )
మితంగా భుజించాలి.
ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.
ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.
మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోటశుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.
త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.
అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.
అతిగా మాటలాడుతూతుళ్ళుతూకేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.
ఏకాగ్ర చిత్తంతో తినాలి.
ఏ పదార్ధం ఎంత అవసరమోహితమో తెలుసుకుని అంతే తినాలి.
ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.
అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.
ఏకఏవ నభుంజీతయదిచ్ఛేత్సిద్ధి మాత్మన:
ద్విత్రిభి ర్బహుభి స్సార్ధంభోజనం తు దివానిశమ్,
పగలు కానీ రాత్రి కానీఒంటరిగా తిన కూడదు. ఇద్దరోముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.
ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.
విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.
ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.
కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:

పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన
ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు
ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు
ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత
మని జాగు సల్పెడి యల్పుఁడొకడు
ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని
కడను రాఁజూచు ముష్కరుఁడొకండు
కుడి యింటను హాయిగా కూరుచుండి
వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు
వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు
ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.
పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.
ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.
తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.
ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.
హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.

ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.
ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.
( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)
పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.
వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.
ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.
ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.
ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.
కిం తు మద్యం స్వభావేనయథైవా2న్నం తథా స్మృతమ్
ఆయుక్తియుక్తం రోగాయయుక్తాయుక్తం యథామృతమ్
మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)
స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.
తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.
మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !!
అంటాడు గురజాడ.
ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.
అలాగేనాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.
దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.
మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం
ఇక,.
భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -
భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్
అని తొలి పాదం రాసేక ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపంఅని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:
ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,
నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.
నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.
వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.
ఒక సారిపండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూటైహేటూబూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.
పండితుడు నవ్విఅది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.
ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.
‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీభోజనం ముందొకటీతర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.
కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.
‘‘నా సలహా పాటించావా ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.
‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూరోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.
ఇదిలా ఉంచితేతిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం
తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.
తినగ తినగ వేము తీయనుండు.
అన్నమో రామచంద్రా !
అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.
వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.
ఇక,
తిండి అంటే అన్నం తినడమే కాదు.
లంచాలు తినడంబుర్ర తినడంసమయం తినడంక్రికెట్ లో ఓవర్లు తినడందేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.
మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.
‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.
మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.
తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.
స్వస్తి.

27, జూన్ 2015, శనివారం

కథా మంజరి బ్లాగయినా మూసెయ్యాలి ! పేరయినా మార్చాలి !



బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి  ప్రావీణ్యం  అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! అది విషయాంతరం.

‘‘నువ్వెప్పు డొచ్చావు ? ’’ అన్నాను ఆశ్చర్యంగా,

‘‘నువ్వు రాయడం మొదలు పెట్టడం నేను రావడం ఒకే సారి జరిగేయి . అంతా చదివేసాను.’’

‘‘ఎలా ఉంది ? ’’ అడిగేను, మానవ సహజమయిన చాపల్యంతోనూ, కుతూహలంతోనూ, ఇంకా చెప్పాలంటే కుతి తోనూ.

చాక్లెట్ చప్పరించీసి నట్టు చప్పరించీసేడు.

గాలంతా తీసీసేడు. ఇంతకీ ఈ వచ్చిందెవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? గుర్తు లేదూ ?! మా తింగరి బుచ్చి గాడు. వాడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే ఇక్కడ నొక్కి చదవండి ,,,

సరే , ప్రస్తుతానికి వద్దాం. ..

‘‘ఐతే ఏమీ బాగు లేదంటావ్ ? ’’ అన్నాను నీరసంగా.

‘‘బాగుండడం, బావు లేక పోవడం నీ చేతిలో లేదు. అందుకే మార్చెయ్ ! వెంటనే మార్చెయ్ ! ’’ అన్నాడు.

‘‘ ఏమిటి మార్చేది ? నీ తలకాయ్ ’’

‘‘ మార్చ వలసి వస్తే అదీ మార్చాలి. ముందు నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు ధృఢంగా.

‘‘ ఎందుకూ ? ’’ అన్నాను కోపంగా.

‘‘ న్యూమరాలజీ ప్రకారం. కథా మంజరి పేరులో అక్షరాలు సరిగా లేవు. కొంచెం మార్చాలి. అందుకే సరైన టపాలు పెట్ట లేక పోతున్నావు. ఆ పెట్టిన వాటిని కూడా ఎవరూ చదవడం లేదు. కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ కామెంట్ లు పెట్టడం లేదు ... అవునా ? ’’అడిగాడు.

నా ఇగో మీద వాడలా దెబ్బ తీసాక, కొంచెం నీరసం వచ్చి, ‘‘ అయితే ఇప్పుడేం చేయాలంటావ్ ’’ అనడిగేను.

‘‘వెంఠనే మార్చెయ్ ! కథా మంజరి పేరు మార్చెయ్ ! ‘‘

‘‘ మార్చడం ఎందుకూ ? ’’

‘‘ ఎందుకంటే, న్యూమరాలజీ ప్రకారం నీ కథా మంజరి బ్లాగు పేరు ఏమీ బాగా లేదు. అందుకే నీ దశ అలా తగలడింది. అందుకే దాని పేరు నేను చెప్పి నట్టుగా మార్చి పారెయ్. అప్పుడు చూసుకో ! నీ బ్లాగు దశ వెలుగుతుందీ ... హిట్టులే హిట్టులు ! కామెంట్ లే కామెంటులు ! వాటిని ప్రచురించ లేక నీ చేతి వేళ్ళు నొప్పి పుడతాయనుకో ! ఒక్క రోజు కొత్త టపా వెయ్యక పోయినా మొత్తం తెలుగు బ్లాగు ప్రియులందరూ నీమీదకి దండెత్తి వచ్చే ప్రమాదమూ ఉంది ! అందు చేత వెంటనే నేను సూచించే విధంగా నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు.

‘‘ ... .. ...’

‘‘ అప్పుడిక తెలుగు బ్లాగర్లు నీ ధాటికి తట్టుకో లేక బ్లాగులు రాయడం మానుకుంటారు. బ్లాగు లోకంలో నువ్వొక్కడివే మహా రాజులా వెలిగి పోతావ్ ’’

‘‘ బ్లాగులే లేక పోతే ఇక సంకలిను లెందుకూ వాళ్ళూ మూసేస్తారు కాబోలు’’

‘‘ హ్హ ! హ్హ! హ్హ! ... అంచేత, నేను చెప్పినట్టు చెయ్. ముందో కాగితమూ పెన్నూ తీసుకుని కథా మంజరి అని ఇంగ్లీషులో రాయ్ ...’’

ప్రయత్నించి చూస్తే పోలా ? అనే బలహీనత ఆవరించి కలం కాగితం తెచ్చు కున్నాను. వాడు చెప్పి నట్టుగా రాసేను.

Katha manjari

‘‘ బావుంది. ఇప్పుడు ఆ పేరులో నేను చెప్పిన ఇంగ్లీషు అక్షరాలు చేర్చు. నేను తీసెయ్య మన్నవి తీసెయ్ ...‘‘ అంటూ నా బ్లాగు పేరుకి శస్త్ర చికిత్స మొదలెట్టాడు.

ఇంగ్లీషు పేరులో వాడు చెప్పిన చోటల్లా కొత్త అక్షరాలు ఉంచేను. పాత అక్షరాలు కొన్ని తొలగించేను.

‘‘ ఇప్పుడీ ఇంగ్లీషు పేరుని తెలుగులో ఎలా ఉచ్చరిస్తావో ఒక్క సారి చదువు ’’ అని ఆదేశించాడు

కూడ బలుక్కుని చదివాను తెలుగు పేరు.

‘‘ ఖ్ఖదా  లంఝలి ’’ ... అని తయారయింది.

‘‘ వెరీ గుడ్ ! ఇక నుండీ నీ బ్లాగు పేరు ఇదే ! ఇక చూస్తో ! నీకింక తిరుగు లేదు .. ... ...అన్నట్టు ...’’

‘‘ ఇంకా ఏఁవిటి ; ’’ అడిగేను నీళ్ళు నములుతూ ...

అబ్బే, చిన్న విషయమే ... ఈ కంప్యూటర్ ఉంచిన చోటు కూడా వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. అంచేత ఈ గోడ కొట్టించీసి, కంప్యూటర్ని ఆ మూలకి ఉండేలా  పెట్టుకో ! అప్పుడింక నీ ‘‘ ఖ్ఖదా లంఝలి ’’ వెలిగి పోతుందీ ...’’

నా కళ్ళు బైర్లు కమ్ము కొస్తున్నాయి. నేనేదో అనబోయే లోగా ...

‘‘ చెల్లెమ్మా ! పెసరట్టు రెడీయేనా ?!’’ అనరిచేడు వంట గది వేపు తొంగి చూస్తూ.

లోపలి నుంచి వాడి ప్రసంగ మంతా వింటున్నట్టే ఉంది ... ‘‘ఆఁ ! వచ్చె ... వచ్చె ... ఒక్క నిముషం అన్నయ్య గారూ ! ’’ అంటూ వినిపించింది మా ఆవిడ గొంతు.

అనతి కాలంలో తన భర్త ప్రపంచ ప్రఖ్యాత ఏకైక తెలుగు బ్లాగరు కాబోతున్నాడని ఏవేవో ఊహించు కుంటూ కలలు కంటోందేమో , ఖర్మ !నా  వెర్రి బాగుల శ్రీమతి

వాడు చెప్పిన తొక్కలోని న్యూమరాలజీ ప్రకారం నా కథా మంజరి బ్లాగు పేరు మారిస్తే వెలిగి పోవడం మాట ఎలా ఉన్నా, నన్ను అంతా తన్నడానానికి రావడం మట్టుకు ఖాయం . అంచేత బ్లాగుని మూసెయ్యడమే మేలు !


( సంఖ్యా శాస్త్రం పేరుతో మూఢనమ్మకాల విషాన్ని జన బాహుళ్యం లోకి వెద జల్లుతున్న ఓ తెలుగు ఛానెల్ వారికి స ‘ భక్తి ’ కంగా ఈ టపా అంకితమ్. )


26, జూన్ 2015, శుక్రవారం

కాకి గోల ! అను నామాంతరము గల కథా మంజరి బ్లాగు



అవి చేసుకున్న పాపం ఏమిటో కానీ, పక్షులలో కాకులనూ, జంతువులలో గాడిదలనూ మనుషులు తెగ ఈసడించు కుంటూ ఉంటారు. నిజానికి ఏదో రూపంలో వాటి అవసరాన్ని ఈ మనుషులు పొందుతూనే ఉంటారు. గాడిదల సంగతి మరో మారు చూదాం కానీ, ముందు కాకుల గురించి చూదాం.

నల్లని రూపం. కర్ణ కఠోరమైన గొంతు. ఉచ్చిష్ఠాలను తినే స్వభావం. వెధవ కాకి గోల ! అని విసుక్కుపోతూ ఉంటాం.

ముందుగా కాకి గల వేరే పేర్లు చూదాం.

అన్యభృత్తు, అరిష్టం, ఆత్మఘోషం, ఏకదృష్టి, ఏకాక్షం, కంటకం, కిరవం, గుమికాడు, పిశునం, యమదూత, బలిభృక్కు, మహానేమి, వాయసం, ద్వికం, దీర్ఘాయువు, చిరంజీవి , కృష్ణం, ప్రత్యలూకం,దివాటనం ...ఇలా చాలా పేర్లు ఉన్నాయి  లెండి !

కాకిని గురించిన కొన్ని ప్రస్తావనలు చూడండి:

వసంత కాలే సంప్రాప్తే కాక: కాక: పిక: పిక:

కాకులూ కోకిలలూ చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వసంతకాలం వస్తే మాత్రం ఏది కాకో, ఏది కోకిలో ఇట్టే తెలిసి పోతుంది.

కాటికి కట్టెలు చేరెను
యేటీవల పక్షులన్ని యేడువ సాగెన్
కూటికి కాకులు చేరెను
వేటవరపు పోతురాజు లేడా ? రాడా ?

(భీమకవి తిట్టు కవిత్వం )

వయం కాకం వయం కాక:
ఇతి జల్పంతి వాయస:
తిమిరారి తమోహంతి
అస్మాత్ హంతి యితి శంక:

సూర్యుడు ఉదయించేడు. చీకట్లను తరిమి కొడుతున్నాడు. కాకులు గోల చేస్తున్నాయి. మేం కాకులం. మేం కాకులం అంటూ. లేక పోతే, సూర్యుడు చీకట్లతో పాటూ తమను కూడా ఎక్కడ తరిమి కొడతాడో అని వాటి భయం !

కాకులు చీకట్ల లాగా అంత కారు నలుపన్న మాట.

రామాయణంలో కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడు మందాకినీ తీరంలో సీతా దేవి నిద్రిస్తూ ఉంటే, ఆమె పయ్యెద తొలగించాడు. ఆమె స్తనాలను గోళ్ళతో గీరాడు. అది చూసి రాముడు కోపించి బాణంతో దానిని కొట్టాడు. అప్పుడా కాకి రాముడిని తప్పు మన్నించమని శరణు కోరింది. రామ బాణం అమోఘం కనుక కనీసం ఒక్క అవయవమైనా ఇమ్మన్నాడు రాముడు. కాకి తన కన్ను ఒకటి ఇచ్చివేసింది. అప్పటి నుండీ కాకులకు ఒక కన్ను లేదు.
అందుకు కాకికి ఏకాక్షి అని కూడా పేరు వచ్చింది.
తద్దినాలలో కాకి పిడచ పెడతారు. కాకి పిండం అని దానినంటారు. పితృ దేవతలు కాకి రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారని విశ్వాసం. ఉచ్చిష్ఠాలు తినే కాకి పితరు డెట్లాయెరా ! అని కవి వెక్కి రించాడు. దాని జోలికి మనం పోవద్దు.

యాగంటి క్షేత్రంలో కాకులు కన బడవుట. పూర్వం అగస్త్యుడు   తన తపస్సునకు  విఘ్నం  కలిగించాయని  కోపించి యాగంటిలో కాకులు కనబడకుండా పోవు గాక ! అని శపించాడుట.

కాకి బంగారం బంగారం కాదు.

కాకీకలను సిరా బుడ్డిలో ముంచి మా చిన్నప్పుడు సరదాగా రాసుకునే వాళ్ళం.

కాకి అరిస్తే ఇంటికి చుట్టా లొస్తారని మన వాళ్ళ నమ్మకం.

కుండలో నీళ్ళు అడుగంటి పోతే, రాళ్ళు వేసి పైకి ఉబికి వచ్చిన నీళ్ళను త్రాగిన తెలివైన కాకి కథ చిన్నప్పుడు చదువు కున్నాం కదూ !

పంచ  తంత్రం కథల్లో కాకి కూడా వొక ముఖ్య పాత్రే. లఘు పతనకం గుర్తుందా ? !

కాకి గూట్లో కోకిల పిల్ల అనే సామెత ఎందుకు వచ్చిందంటే, కోకిల గ్రుడ్లను పెడతాయే కానీ వాటిని పొదగ లేవుట. అందు చేత అవి పిల్లలయే వరకూ వాటిని కాకి గూట్లో కాకి గ్రుడ్లతో పాటూ ఉంచుతాయిట.

కాకి గూడు పెడితే కడపటి వర్షం అనే సామెత కాకి గూడు కట్టడం మొదలెడితే ఇక వానలు కురియవు అనిచెబుతారు

కాకి పిల్ల కాకికి ముద్దు.

కాకిని తెచ్చి బంగారు పంజరంలో ఉంచినా చిలుకపలుకులు పలుకుతుందా ?

కాకి ముక్కుకు దొండపండు అనే సామెత ఒకరు నలుపూ, ఒకరు తెలుపూ అయిన మొగుడూ పెళ్ళాల గురించి.

కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు. బలహీనులను దోచి బలవంతులకు ఇచ్చినట్టుగా అన్నమాట.

పిల్ల కాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ.

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు .

లోకులు పలుగాకులు.

కాకులను ప్రస్తావిస్తూ గల కొన్ని సంస్కృత న్యాయాలు చూడండి:

కాక దంత పరీక్ష ... అనవసరమైన చర్చ అన్నమాట.

కాకతాళీయం ... కాకి తాటి చెట్టు మీద వాలడం, తాటి పండు రాలి తటాలున నేలన పడడం ఒకే సారి జరిగితే అది కేవలం కాకి వాలడం వల్లనే జరిగిందని అపోహ చెంద రాదు.

కాకరుత బీరు న్యాయం ... పగలు కాకి కూత విని భయపడి పోయి భర్తను ఆలింగనం చేసుకున్న ముద్దరాలు రాత్రి పూట నదిని దాటుకుంటూ విటుడి దగ్గరకి ఒక్కర్తీ వెళ్ళిందిట. అదీ ఎలాగూ, నదిలో ఉన్న మొసళ్ళకు ఆహారంగా మాంసం ముద్దలు వేసుకుంటూ , వాటి బారిన పడకుండా.

కాకాధికరణ న్యాయం ... పలానా వాడి ఇల్లు ఏదని అడిగితే, కాకి వాలి ఉంటుంది చూడూ అదే వాడి ఇల్లు ! అని తిక్క సమాధానం ఇవ్వడం.

కాకోలూకనిశాన్యాయం ... అంటే, కాకికి పగలయితే గూబకు రాత్రి. దానికి రాత్రయితే, దీనికి పగలు.

రావణుడికి భయపడి యముడు కాకి రూపం ధరించాడుట. జనం తమ పితృదేవతలకు తద్దినాలు పెట్టి కాకి పిడచను కాకులుకు పెట్టాలని, పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి ఆ పిండాలను తిని వెళ్తారుట. అప్పుడే వారికి తృప్తి కలుగుతుందిట. కాకులకు రావణుడు ఇచ్చిన వరంగా దీనిని చెబుతారు.

కాకులలో మాల కాకుల పరిస్థితి మరీ అధ్వాన్నం.

కవి యను నామంబు నీటి కాకికి లేదా ? అని అడిగే కవి ఒకడు.

పిండం తినే కాకి పితరుడెలా అవుతాడని తెగేసి చెప్పే కవి మరొకరు.



కాకేమి తన్ను తిట్టెనె?
కోకిల ధనమేమి తన్ను గో కొమ్మనెనే ?
లోకము పగయగు బరుసని
వాకున, చుట్టమగు మధుర వాక్యము కలిమిన్.

కాకి నిన్ను తిట్టిందా ఏమిటి ? కోకిల నీ కేమయినా డబ్బులిచ్చిందా? కాకిని అసహ్యిం కుంటావు. కోకిలను మెచ్చుకుంటావు. అంటే, లోకం కఠినంగా మాటలాడే వారికి దూరంగా ఉంటారు. సరుషంగా మాటలాడే వారు అందరకీ శత్రువులవుతారు. మధురంగా పలికితే మిత్రులవుతారు.

ఒక వృత్యనుప్రాసం సరదాగా చూడండి. ఇదీ కాకుల గురించే.

కాకీక కాకికి కోక. కుక్కీక కుక్కకి కోక. కాకీక కాకికి కాక, కుక్కకా ? కుక్కీక కుక్కకి కాక కాకికా ? కాకీక కాకికే కోక.
కుక్కీక కుక్కకే కోక...


ఇదీ కాకి గోల. గాడిదల గురించి మరోసారి.





23, జూన్ 2015, మంగళవారం

మా ఆవిడకి కోపం వొచ్చింది ...

మా ఆవిడకి కోపం వచ్చింది ! 

వచ్చిందంటే , రాదూ మరి ! అసలు మొగుళ్ళు చేసే తింగరి పనులకు ఆవిళ్ళకు కావిళ్ళ కొద్దీ కోపాలు వస్తాయంటే, పాపం, వారిదా  తప్పు ?

 భర్త అంటే, భరించే వాడని వ్యుత్పత్తి చెబుతారు కానీ, నిజానికి ఆ మాట భార్యలకు వర్తిస్తుంది. క్షమయా ధరిత్రీ అన్నారు కదా !

మన కోపాలను, చిరాకులను, పరాకులను, బలహీనతలను, వ్యసనాలను, అధిక ప్రసంగాలను, అవమానకర వ్యాఖ్యానాలను, పిలుపులను, తింగరి వలపులను, తలపులను, దుబారాలను, తెలివి తక్కువ  పనులను, తెచ్చే తగాదాలను, అలవిమాలిన అహంకారాలను, బద్దకాలను, అవసరాలను కూడా వాయిదా వెయ్యడాలను, అర్ధ నగ్నంగా ఇంట్లో తిరగడాలను, మాసిన బట్టలు రోజుల కొద్దీ మార్చుకోక పోవడాలను, చెప్పుకునే గొప్పలను, కప్పి పుచ్చుకునే తప్పులను, రాద్ధాంతాలను, వెర్రి మొర్రి సిద్ధాంతాలను, పిచ్చి కవిత్వాలను, వెర్రి బ్లాగులను, పువ్వులయినా కొనని పిసినారి తనాలను,ముభావాలను, ముఖం చాటేయడాలను, మన బట్ట తలలను, బాన పొట్టలను, పిట్ట కథలను, ... ఇది అనంతం. వీటిని ఆడాళ్ళు భరించడం లేదూ ? అన్నింటినీ భరిస్తూనే మొగుళ్ళను ప్రేమించ గలిగే, ఆడవారి ఓపికకి జోహార్లు !



ఆగాండాగండి. ధోరణి మరీ ఏక పక్షంగా ఉందంటారా ?

కొంపన్నాక, ఇన్నో, మరి కొన్నో ఇలాంటివి కొంచెం ఎక్కువ తక్కువలలో ఉంటాయి లెండి ...

ఇంతకీ ఏదో చెప్పాలని మొదలు పెట్టి , ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం కదూ !

అసలు విషయ మేమిటంటే, మా ఆవిడకి కోపం వచ్చిందని కదూ చెప్పాను ? !

అవును. మా ఆవిడకి కోపం వచ్చింది !

ఎప్పుడంటారా ? దాదాపు ఏభై ఆరేళ్ళ క్రిందట !

ఆగాగాగాగాగు. ఏఁవిటీ, ఏభై ఆరేళ్ళ కిందట మీ ఆవిడకి కోపం

వచ్చిందా ? నీ ప్రొఫైల్ చూసాం. నీ వయసెంతో తెలుసు. ఏభై ఆరేళ్ళ క్రితం ఆ చిట్టి తల్లి మీ ఆవిడెలా అయిందీ ? ! మీది బాల్య   వివాహమా ?! అని మీకు డౌటొచ్చింది కదూ ?

అదేం కాదు, ఆమెకి ఆరేడేళ్ళప్పటి సంగతే యిది. ఆ వయసులోనే ఆ పిల్ల కి నేనే మొగుడినని పెద్దలు తీర్మానించీసేరు.  (  నేనూ డిసైడయి పోయే ననుకోండి !)  మాది మేనరికం. అంచేత,

ఆ పాపే ( ఆవిడే ) మా ఆవిడ. .

మా ఆవిడకు కోపం వచ్చిన విధంబెట్టి దనిన ...

అప్పట్లో మేం మా తాతగారింట అనంత పురం జిల్లా ఉరవ కొండలో చాలా కాలం ఉండే వాళ్ళం. మా తాత గారక్కడ రిటైర్డ్ సివిల్ సర్జనుగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ ఉండే వారు.

తాత గారు మనవళ్ళకీ మనవరాళ్ళకీ వెళ్ళి నప్పుడల్లా కొత్త బట్టలు కుట్టించి యిచ్చే వారు. అందరికీ ఒకే రకం నిక్కరూ చొక్కాలూ, అమ్మాయిలకు ఒకే రకం గౌన్లూ అన్నమాట.

సరే, మా ఆవిడ కోపం గురించి చెబుతాను ...

ఆ రోజు అలాగే తాత గారిచ్చిన కొత్త బట్టలు నేనూ, ( తర్వాత ఎప్పుడో కానున్న ) మా ఆవిడా , మా చెల్లి కాంతీ
 ( పన్నెండో ఏటనే దానిని దేఁవుడు నిర్దాక్షిణ్యంగా మానుండి తీసుకు పోయేడు ) , మా ఆవిడ అన్న , అంటే , మా బావా వేసు కున్నాం.

మా ఆవిడ కోపానికి బీజం ఇక్కడే పడింది !

ఏం జరిగిందంటే, మా చెల్లి కాంతి కావాలనే పెంకె తనంతో మా ఆవిడకి కుట్టించిన గౌను వేసేసుకుంది ! దాని గౌను మా ఆవిడకి ఇరుకయి పోతుంది. ఎవరెంత చెప్పినా మా చెల్లి కాంతి ఆ గౌను తిరిగి ఇవ్వడానికి ఒప్పు కోలేదు. దాంతో పెద్దలు మా ఆవిడనే బతిమాలి , బామాలి మా చెల్లెలి గౌనునే ఫొటో కోసం వేసుకో మని ఒత్తిడి తెచ్చి బలవంతంగా అంగీకరింప చేసారుట. ఆ ఇరుకైన గౌను వేసు కోవాల్సి వచ్చి నందుకు మా ఆవిడకి కోపం వచ్చింది. రాదూ మరి ? ధుమ ధుమలాడి పోయింది. అందుకే ఫొటోలో బుంగ మూతితో కనిపిస్తోంది.

ఆ కోపంలోముద్దు ముద్దుగా లేదూ !

ఇంతటితో అయిందీ ? ! మా ఆవిడ ముచ్చట  పడి తెచ్చుకున్న గులాబి పువ్వును కూడా మా కాంతి లాక్కుంది . ఎంత అడిగినా ఛస్తే ఇవ్వనని భీఫ్మించుకు కూర్చుంది.

అందుకే ఫొటోలో చేతిలో గులాబీ పువ్వుతో నవ్వుతూ మా చెల్లాయి కాంతీ, కోపంతో చిటపట లాడి పోతూ బుంగ మూతితో, పొట్టి గౌనుతో మా ఆవిడా కనిపిస్తున్నారు చూడండి ... వాళ్ళకి చెరో వేపూ, అంటే, ఎడమ వేపు నేనూ, కుడి వేపు మా బావా ఉన్నాం. ఇది డబ్బా కెమేరాతో మా చిన్న మామయ్య  తీసిన ఫోటో.

ఇదండీ ఈ ఫొటో కథ ! ఈ చిన్నప్పటి ఫొటో అంటే నాకూ మా ఆవిడకీ ఎంతిష్టమో. చూసి నప్పుడల్లా నవ్వు కుంటూ ఉంటాం.

ఉరవ కొండ తీపి ఙ్ఞాపకాలతో కబుర్లు కలబోసు కుంటూ ఉంటాం.

ఇదీ ఆ ఫొటో   చూడండి ...
 

22, జూన్ 2015, సోమవారం

నీకంత సీన్ లేదులే ! అనబడు కుండ బ్రద్దలు కొట్టిన పద్యాల కథ !

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .



20, జూన్ 2015, శనివారం

మా తింగరి బుచ్చి గాడి తిరుగలి గూర్చిన తింగర్యోపన్యాసమ్



ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్రయించే వారు.

ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.

మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.

ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !

అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !

ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.

తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !

ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.

అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.

ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్

కొంచెం టచ్ లో ఉంటే చాలును

అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.

అతి పరిచయం వల్ల అలుసై పోతామట. తరుచు వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా అనాదరం కలుగుతూ ఉంటుంది. రోజూ చచ్చే వాడి కోసం ఎంతని ఏడుస్తాం అంటారు కదా, అలాగే, రోజూ కనిపించే వాడు వస్తే ఏమీ పట్టనట్టుగా ఊరుకుండి పోతాం. మలయ పర్వతం మీద మంచి గంధం చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. మనకవి అపూర్వం. చాలా విలువైనవి. కాని అక్కడ ఉండే భిల్ల వనితలు ఆ మంచి గంధం చెక్కలనే వంట చెఱకుగా ఉపయోగించడం చూడ లేదూ ? అంటున్నాడు కవి. అతి పరిచయం వలన అలుసై పోవడ మంటే ఇదే. పని కట్టుకుని పుణ్య క్షేత్రాలకో, దర్శనీయ స్థలాలకో వెళతాం. అక్కడి ప్రతి అణువునీ కళ్ళార్పకుండా చూస్తూ తన్మయులై పోతూ ఉంటాం. కెమేరాలలో ఆ అందమైన
దృశ్యాలను అపురూపంగా బంధిస్తూ ఉంటాం. అక్కడి స్థానికులు మాత్రం మనంతగా విచలితులు కావడం జరుగదు. రోజూ చూసేదా కదా, అనే భావనతో రవంత నిర్లిప్తంగా కనిపిస్తారు.

ఆలు మగలైనా సరే, అప్పుడప్పుడు ఏ పుట్టినింటికో ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి నాల్రోజులు ఉండి వస్తూ ఉండడం మంచిది. ఎడబాటు ఎప్పుడూ మరింత చేరువ చేస్తుంది. అందుకే కదా, మన ప్రబంధ కవులు విప్రలంభ శృంగారానికి అంత ప్రాముఖ్యమిచ్చి, పోషించారు?

అంచేత, మరీ అతుక్కు పోకుండా, తగు మోతాదులో కొంచెం టచ్ లో ఉంటే చాలు ... కదూ !