7, డిసెంబర్ 2019, శనివారం

నా వల్ల కాదు బాబూ..

                                                           


ఇలా ఉండడం మన వల్ల కాదు బాబూ !

ఎవరయినా తిడితే , వొళ్ళు మండి పోతుంది. వారిని మళ్ళీ తిట్టాలనిపిస్తుంది. చెడామడా దులిపేయాలనిపిస్తుంది.
తిడితే ఊరుకుంటామా చెప్పండి?

దూషణ భూషణ తిరస్కారములు దేహమునకే కాని, ఆత్మకు కావు అనుకునే మహానుభావులూ
ఉంటారు. తిట్ల దండకం తవ్వి పోస్తున్నా, చిద్విలాసంగా నవ్వుతూ, అయితే ఏమిటిటా ! అంటూ
నవ్వ గలగడం చాలా కష్టం సుమా ! అలా ఉండగలిగే వారు అయితే యోగులేనా కావాలి. లేదా మందబుద్ధులేనా కావాలి. కాదంటే బధిరులేనా కావాలి.

ఈ శ్లోకం చూడండి ...

మన్నిందయా యది జన: పరితోష మేతి
నన్వ ప్రయత్న జనితో2య మనుగ్రహో మే,
శ్రేయోర్ధినో హి పురుషా: పరతుష్ఠి హేతో:
దు:ఖార్జితాన్యపి ధనాని పరిత్యజంతి.

నన్ను తిట్టడం వలన జనాలకి ఆనందం కలుగుతోందా !? ఆహా ! ఎంత అదృష్టవంతుడిని !నా భాగ్యం ఎంత గొప్పది ! నా మీద అప్రయత్నమైన అనుగ్రహం చూపించడమే కదా, నన్ను నిందించడమంటే. ఈ విధంగానయినా నన్ను పట్టించుకుంటున్నారంటే నాకు అంత కన్నా ఇంకేం కావాలి? లోకంలో చాలా మంది ఎంతో డబ్బు తగలేసి, ఇతరులకు సంతృప్తిని కలిగించి మరీ వారి కి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.

మరి నాకో? ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఇతరులకు ఆనందాన్ని కలిగించే భాగ్యం దక్కుతోంది. నన్ను తిట్టడం వలన వారికి అట్టి ఆనందం కలుగుతూ ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి !

పాజటివ్ పబ్లిసిటీ కంటె నెటిటివ్ పబ్లిసిటీ వేగిరం వస్తుందని మనకి తెలిసిందే కదా. ( అయితే, అది ఉండడం, ఊడడం వేరే సంగతి)

మీది శ్లోకంలో చెప్పినట్టుగా సంబర పడి పోయే వారిని ఎవరు మట్టుకు ఏమనగలరు చెప్పండి?
ఇంత సహనమూ, సౌజన్యమూ ఉండాలంటే ఎంత చిత్త సంస్కారం కావాలో ఆలోచించండి.

ఎదుటి వారి భావ ప్రకటనను గౌరవించడానికి ఎంతో మానసిక ఔన్నత్యం కావాలి కదూ!

ఈ సందర్భంలో ఒక మంచి కొటేషన్ గుర్తుకొస్తోంది:

నీ అభిప్రాయంతో నేను వంద శాతం అంగీకరించడం లేదు. కాని , నువ్వు స్వేచ్ఛగా నీ అభిప్రాయాన్ని తెలియజేసుకునే నీ హక్కు కాపాడడం కోసం నీ తరఫున నేనూ పోరాడుతాను.



6, డిసెంబర్ 2019, శుక్రవారం

వద్దు మొర్రో...


                                           
వద్దు బాబోయ్ !


ఈ క్రింది శ్లోకంలో కవి దరిద్రం యొక్క విరాడ్రూపాన్ని ఎంత భయంకరంగా వర్ణిస్తున్నాడో చూడండి:

క్రోశంత శ్శిశవ: స్రవచ్చ సదనం ధూమాయమాన శ్శిఖీ,
క్షారం వారి మలీమసం చ వసనం దీపశ్చ దీస్త్యా జడ:
శయ్యా మత్కుణినీ హవిస్య మశనం పంథాశ్చ పంకావిల:
భార్యాచా2ప్రియవాదినీతి సుమహత్పాపస్య చైతత్ఫలమ్.

ఇంట్లో భరింత లేనంతగా పిల్లల ఏడుపులు. గోల. అల్లరి . ఆగం. పిల్లలు ఇల్లు తీసి పందిరి వేస్తున్నారు.

ఇల్లు కారి పోతోంది. అవును మరి. పై కప్పు చాలా ఏళ్ళయి రిపేరుకి నోచుకో లేదు మరి. కారకేం చేస్తంది? ఇంట్లో ఏ గది లోంచి చూసినా, సూర్య చంద్రులు కనబడుతూనే
ఉంటారాయె !

వంట కట్టెలు సరిగా మండక పోవడం వల్ల, పొయ్యి రాజడం లేదు. అంతా దట్టమన పొగ. కళ్ళు మండి పోయేలా ఇల్లంతా పొగ క్రమ్ముకుంటోంది.

ఇక, ఇంటి పెరటిలో ఉన్న బావి నీరు చెబుదామా, అంటే, ఆ నీరు ఒట్టి ఉప్పు కషాయం.

ఇంట్లో గుడ్డలన్నీ మురికి ఓడుతూ ఉన్నాయి. చాకలి మొగ మరుగని బట్టలాయె. కట్టుకీ, విడుపుకీ కూడా ఒకే బట్టలాయె.

నట్టింట దీపం చమురు లేక కొడిగట్టి పోతోంది. క్షణమో, గడియో దీపం కొండెక్కి పోతుంది. ఇక, అంతా అ:ధకారమే. చీకట్లో తడుములాట తప్పదు, మరి

పడకంతా నల్లుల మయం. యథేచ్ఛగా రక్తాలు పీల్చి వేస్తూ పండుగ చేసుకుంటున్నాయి, నల్లులు. ఈ నల్లుల బాధ పడ లేకనే కదా, శివుడు వెండి కొండ మీదా, రవి చంద్రులు ఆకాశంలో వ్రేలాడుతూ ఉండడం, శ్రీ హరి శేషుని మీద పవళించడం !

ఇక, తిండి మాట చెప్పే పని లేదు. తిండి యఙ్ఞప్రసాదం. ( కొండొకచో వట్టి పిండా కూడు కూడా)

వీధిలోకి వెళ్దామంటే, త్రోవంతా బురద. అంతా రొచ్చు.

ఇక, భార్య సంగతి చెప్పుకోడానికే ఒళ్ళు కంపరమెత్తి పోతుంది. ఆవిడ నోరు పెద్దది. అంతే కాదు, చెడ్డది. నిరంతరం శాపనార్ధాలు పెడుతూ ఉండడమే. గయ్యాళి గంప. వంద మంది సూర్యాకాంతాలూ, మరో వంద మంది ఛాయా దేవీలూనూ.

ఈ పైన చెప్పిన బాధలు ఉన్నాయే, అవి, మహా పాపం చేసుకున్న వారికే సంప్రాప్తిస్తాయి
కదా !

ఈ కష్టాలు పగ వాడికి కూడా వద్దయ్యా బాబూ !

శ్రీనాథుడి చాటువు కూడా ఇక్కడ చెప్పు కోవాలి మరి.

దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి, మంచము, దూడ రేణమున్
బాసిన వంటకంబు, పసి బాలుర శౌచము, విస్తరాకులున్
మాసిన గుడ్డలున్, తలకు మాసిన ముండలు, వంట కుండలున్
రాసెడు కట్టెలున్, తలపరాదు పురోహితునింటి కృత్యముల్.

ఇల్లు ఇరకటం, ఆలి మరకటం. అంటే ఇదే కాబోలు. ఇల్లా, ఇరుకు కొంప. కాళ్ళు చాపి పడుకోడానికి లేదు. పశువుల రొచ్చు. కుక్కి మంచం, దూడ పేడ. పాచి పోయిన వంటకాలు, పసి పిల్లల మల మూత్రాదులు. విస్తరాకులు, విధవా స్త్రీలు, మసిబారిన వంట కుండలు, మాసిన గుడ్డలు, మండని కట్టెలు ... పేద పురోహితుని కొంపలో కనిపించే దృశ్యాలు.

కష్టాల గురించి చెబుతున్నాను కనుక, శ్రీ శ్రీ గారి గేయ చరణాలు కూడా చూదాం మరి:

కూలి కోసం, కూటి కోసం
పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటను చెవిని పెట్టక
బయలు దేరిన బాటసారికి

మూడు రోజులు ఒక్క తీరుగ
నడుస్తున్నా, దిక్కు తెలియక
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం వస్తే, భయం వేస్తే
ప్రలాపిస్తే, ప్రకంపిస్తే,

మబ్బు పట్టీ, వాన కొట్టీ
వాన వస్తే, వరద వస్తే,
చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే,
దారి తప్పిన బాటసారికి
ఎంత కష్టం ! ఎంత కష్టం !




5, డిసెంబర్ 2019, గురువారం

అధికారం పోయాక చూడాలి ..అయ్య గారి వైభవం..




అధికారాంతమునందు చూడవలె..

ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే

ఈ శ్లోకంలో కవి అన్నింటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నావు కదా !

త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తువులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !

ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !

నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.

ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !


4, డిసెంబర్ 2019, బుధవారం

ఆరు ముఖాలూ , ఆరు ముద్దులూనూ...




ఆరు ముఖాలూ, ఆరు ముద్దులూనూ

బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖ శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచుకొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !అని దీని అర్ధం.

వెళ్ళి గంగలో దూకు అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు ముద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?




2, డిసెంబర్ 2019, సోమవారం

తిక్కలోడి సామాజిక స్పృహ

‘‘ ఎటు వేపేనా వెళ్ళు, కానీ, ఉత్తరం దిక్కు వేపు మాత్రం వెళ్ళకు ! ’’ అని ముసలి రాజు మరీ మరీ చెప్పి పంపిస్తాడా ? రాకుమారుడు అటు వేపే వెళ్తాడు.

ఇచ్చట నోటీసుల అంటించ రాదు అనే బోర్డు మీది అక్షరాలు రకరకాల వాల్ సోష్టర్ల నడుమ బిక్కు బిక్కుమంటూ కనిపిస్తూ ఉంటాయి.

ఇచ్చట మూత్రము చేయ రాదు ( మా హైదరాబాదులో అలాగే రాస్తారు మరి) అని ఉంటుందా ? అక్కడంతా ముక్కులు బద్దలయ్యేంత దుర్వాసన గుప్పు మంటూ ఉంటుంది.

నిశ్శబ్దమును పాటించుము అనే చోట నయాగరా జలపాత హోరు వినిపిస్తున్నా , లైబ్రేరియన్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసి నిస్సహాయంగా చేతులెత్తేస్తాడు.

వాహనములకు ప్రవేశము లేదు అని వ్రాసి ఉన్న హెచ్చరికను తుంగలో తొక్కి ఏ పోలీసో ఎదురయ్యే వరకూ ఆకతాయి వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి.

ప్లేట్లలో చేతులు కడగరాదు అని మా ఊళ్ళో చిన్న చిన్న హొటళ్ళలో బోర్డు రాసి పెట్టే వారు. అందు చేత జనాలు ఆ వినతిని  మన్నించి, టిఫిన్ తిన్నాక, చేతులు గ్లాసులలో ముంచి చక్కా పోయే వారు.

స్త్రీలకు మాత్రమే అని కనిపిస్తున్నా కొందరు జబర్దస్తీ రాయుళ్ళు బస్సులలో ఆ సీట్ల లోనే కూర్చోడం అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే.

మెడలు పక్కకి వాల్చి వాహనాలు నడిపే చోదకుల విన్యాసాలూ,పట్ట పగలు కూడా వెలిగే వీధి దీపాలూ, బస్సుల్లో వ్రేలాడుతూ ప్రయాణం చేసే ఫుట్ బోర్డు వీరుల సర్కస్  ఫీట్లూ  ...

ఇలా చెప్పు కుంటూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. మన సామాజిక  సామాజిక స్పృహ  అలాంటిది మరి !

ఈ మేడే నాడు సామాజిక స్పృహ  గుర్తుకు రావడం యాదృచ్ఛిక మేమీ కాదు.

దానితో పాటు మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్పృహ గురించి మీకు చెప్పాలనిపించడం కూడా సహజమైన విషయమే.

మా తింగరి బుచ్చిగాడు గుర్తున్నాడు కదూ ?  పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా తింగరి బుచ్చిగాడు ఆరేడేళ్ళ వయసు లోనే గొప్ప  సామాజిక స్పృహ సంతరించు కున్నాడు. అది విశేషమే కదా ?


ఆ ముచ్చట చెప్పాలనే ఈ టపా పెడుతున్నాను.

నేనూ , మా తింగరి బుచ్చిగాడూ ఎలిమెంటరీ బడిలో చదువుకునే రోజులవి. మా బడి పేరు జంగం బడి. మా బడి పోలీసు స్టేషను వీధికి దగ్గరలోనే ఉండేది. మా బడికి ఎదురుగా ఒక చేకు గోడౌను ఉండేది. అంటే తెలుసు కదా ? గోగు నారని అక్కడ మిషన్ల లో పెట్టి పెద్ద పెద్ద బేళ్ళగా కట్టి ఎక్కడికో ఎగుమతి చేసే వారు.

ఆరోజుల్లో అక్కడ తయారయే చేకు బేళ్ళు మాకంటికి ఆకాశమంత ఎత్తుగా కనిపించేవి. ఆ తయారీ కూడా మాకు చాలా వింతగా కనిపించేది. నార బేళ్ళు కట్టే మిషన్లు ఒకటో, రెండో ఉండేవి. వాటిలో నార వేసి మనుషులు తొక్కే వాళ్ళు.  తర్వాత పెద్ద పెద్ద చక్రాలను నలుగురైదుగురు మనుషులు బలంగా పట్టుకుని తిప్పే వారు. పెద్ద పెద్ద తాళ్ళతో ఆ మిషన్లోనే వాటిని పెద్ద బేళ్ళుగా కట్టే వారు. అలా కట్టిన బేళ్ళ నుండి ఒక్క చిన్న నార పీచు లాగి తియ్యడం కూడా మాకు చాతనయ్యేది కాదు. మా శలవు రోజులన్నీ ఆ గోడౌను లో ఉండే రావి చెట్టు కిందే గడిచి పోయేవి.

సరే, ఇదంతా అలా ఉంచితే, ఒక రోజు మా తింగరి బుచ్చి నన్ను రహస్యంగా ప్రక్కకి పిలిచి, ‘‘ నీకో రహస్యం చెబుతాను. మన చేకు గోడౌనులో దొంగతనం జరుగుతోంది. తెలుసా ! ’’ అనడిగేడు.

‘‘ దొంగతనమా !’’ అన్నాను భయంగా.

‘‘ అంటే, దొంగ వ్యాపార మన్న మాట.’’ అని వివరించేడు. కల్తీ , దొంగ వ్యాపారం, దోపిడీ లాంటి పదాలు వాళ్ళ అన్నయ్య తరుచుగా అంటూ ఉంటాడు. అవే వీడికీ వంట బట్టేయి.

‘‘ మనం ఈ విషయం పోలీసులకి చెప్పాలి. పోలీసు స్టేషన్ కి వెళదాం పద !‘‘ అన్నాడు.

నా నిక్కరు తడిసి పోయింది.

‘‘ అమ్మో ! నాకు భయం’’ అన్నాను.

‘‘ నీకు సామాజిక స్పృహ లేదు.’’ వెక్కిరించాడు వాడు. ఈ పదం కూడా వాడు వాళ్ళ విప్లవ అన్నయ్య నుండి నేర్చుకున్నదే. అసలీ విప్లవమనే పదం కూడా వాడికి అలాతెలిసిందే. ‘‘ అంటే ఏమిటి ’’ అనడిగేను. ‘‘ నాకూ సరిగా తెలియదు. తిరగ బడడంట.’’ అన్నాడు. మా అవ్వ ఆ మధ్య నీరసంతో కళ్ళుతిరిగి నేలకు తిరగ బడి పోయింది. ఇది సామాజిక స్పృహ  అవునో కాదో నాకు తెలియదు. నిజంగా. నిజం. సరస్వతి తోడు.

నాకు సామాజిక స్పృహ లేదని ఖాయమై పోయేక, వాడొక్కడూ పోలీసు స్టేషన్కి బయలు దేరాడు.



 అక్కడ జరిగిన బోగట్టా అంతా నా మనో నేత్రంతో ( అంటే ఏఁవిటో నాకు సరిగ్గా తెలియదు. మా కథా మంజరి బ్లాగరు అంకుల్ చెప్పాడు ) చూసాను కనుక మీకు చెబుతున్నాను.



మా తింగరి బుచ్చి గాడు వీరోచితంగా పోలీసు స్టేషను వరకూ వెళ్ళి , అక్క డ చాలా సేపు తటపటాయించి, ఎలాగయితేనేం, స్టేషను లోకి ప్రవేశించాడు.

అక్కడింకా పోలీసు బాబాయిలు మేలుకో లేదు. మేలుకునే ఉన్నా,  అంటే,  ఉత్త బాబాయిల్లా గానే ఉన్నారు.

కానీ, పోలీసు బాబాయిల్లా లేరన్న మాట.

అంచేత, ఏం కావాలి బాబూ ! అనడిగేరు లాలనగా.

‘‘ కంప్లయంటు ఇవ్వడానికి వచ్చానండీ’’ అన్నాడు వీడు.

‘‘ మీ నాన్న మీదా ?’’

‘‘ కాదండీ ...’’

‘‘ మీ అమ్మ మీదా ?‘‘

‘‘ కాదండీ ..’’

‘‘ పోనీ, ఇంకెవరయినా మీ ఇంట్లో వాళ్ళ మీదా ? లేక మీ పక్కింటి అంకుల్ గారి మీదా ’’

’’ఉహూఁ !  కాదండీ ...’’

‘‘ నీ జేబులో అయిదు పైసల బిళ్ళ పోయిందా ?’’ చివరి ప్రయత్నంగా కొంచెం లాలనగానే అడిగాడు పో.బా.

‘‘ కాదండీ ..’’ అంటూ, ఎందుకయినా మంచిదని నిక్కరు జేబు ఓసారి తడిమి చూసుకున్నాడు మా తింగరి బుచ్చి గాడు.

అప్పటికి పోలీసు  బాబాయిలో నిజమైన పోలీసు బద్ధకంగా నిద్ర లేచాడు.

‘‘ మరెవరి మీదరా నా కొడకా  ?’’ విసుగ్గా అడిగేడు. అయినా, ముద్దుగానే అడిగాడు. మన వాడికి  కాళ్ళలో సన్నని వణుకు మొదలయింది.

’’ మా బడి దగ్గర గోడౌన్ వాళ్ళ మీదండీ ....వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు ...’’అన్నాడు, ఎలాగో కొంచెం ధైర్యం చిక్కబట్టుకొని.


పో.బా కి ఓ క్షణం తను  ఏం విన్నాడో అర్ధం కాలేదు.

‘‘ సరేలే ... నువ్వు మీ ఇంటికి పోయి, మీ పెద్ద వాళ్ళు ఎవరి నయినా పంపించు. వాళ్ళొచ్చి రిపోర్టు ఇస్తారు ’’ అన్నాడు.

‘‘ వాళ్ళకంత సామాజిక స్పృహ  లేదండీ !’’ అన్నాడు టక్కున మా తింగరి బుచ్చిగాడు.



ఈ సారి పోలీసు బాబాయిలందరికీ నిజంగానే మతి పోయింది ! కాసేపు మాట పడి పోయింది.



‘‘ సరేలే, పద ...ఓయ్, 110 నువ్వు వీడి వెంట వెళ్ళి ఆ సంగతేమిటో చూడు ...’’ అన్నాడొక పెద్ద పో.బా.



తింగరి బుచ్చి గాడికి ఏనుగు నెక్కి నంత సంబర మనిపించింది.



110 పో.బా తనని తన సైకిలు వెనుక కూర్చుండ పెట్టుకొని తొక్కడం వాడికి మరింత గర్వ మనిపించింది.





సామాజిక స్పృహ ఉండడం వల్ల ఎంత గౌరవమో కదా అనుకున్నాడు.



పో.బా ని మన వాడు నేరుగా గోడౌను లోకి తీసుకు వెళ్ళి అక్కడ దొంతరలుగా ఉన్న చేకు బేళ్ళను చూపించాడు.

‘‘ ఇక్కడ ఎన్ని బేళ్ళు ఉన్నాయో చూసారు కదండీ ...’’

‘‘అయితే ? ...’’ బిక్క మొహంతో అడిగాడు పో.బా.

‘‘ రండి చెబుతాను.’’ అని పో.బా ను మా తింగరి బుచ్చి గాడు గోడౌను గేటు వెలుపలి గోడ దగ్గరకు తీసుకు వచ్చాడు. అక్కడ గోడ మీద రాసి ఉన్న అక్షరాలు చదవమన్నాడు.



పో.బా కూడ బలుక్కో కుండానే వీజీగానే చదివేసాడు :  ‘‘STICK NO BILLS  ... ’’

అప్పుడు మా తింగరి బుచ్చి గాడు విజయ గర్వంతో తల ఎగరేస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. ‘‘ చూసారా సారూ ? గోడౌన్ లోపల అంత స్టాకు ఉంచుకొని , ఇక్కడ చేకు బేళ్ళు స్టాకు లేవని బోర్డు పెట్టారు. ఇది దొంగ వ్యాపారమే కదా ? మీరు వీళ్ళని జైల్లో పెట్టాలి.’’ అన్నాడు .



పో.బా కి తల తిరిగి, మూర్ఛ వచ్చినంత పనయింది. పోలీసు ఉద్యోగం వదిలేసి ఎక్కడి కయినా పోవాలన్నంత విరక్తి  కలిగింది.



Stick no bills  అనే బోర్డుని మా తింగరి బుచ్చి గాడు తన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని ఉపయోగించి,కూడ బలుక్కొని,

 ‘‘ స్టాక్ నో బేల్స్   ’’ అని చదువు తున్నాడని అర్ధం కావడానికి  అతనికి  కొంత సేపు పట్టింది. అతనా షాకు నుండి తేరుకునే లోపల మా తింగరి బుచ్చిగాడు ‘‘ మీకు సామాజిక స్పృహ  కానీ ఉంటే వెంటనే ఈ దొంగ వ్యాపారులను జైల్లో పెట్టాలి ! ’’ అని   ఒకటే సతాయిస్తున్నాడు.



పోలీసు బాబాయి ‘‘ సరే ... సరే ..నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, వీళ్ళందరినీ నేను జైల్లో పెడతానుగా ! ’’ అన్నాడు.



విజయ గర్వంతో విజిలు వేస్తూ మా తింగరి బుచ్చి గాడు  జారి పోతున్న నిక్కరును మీదకి లాక్కుంటూ ఇంటి ముఖం పట్టాడు.



వాడు నాలుగడుగులు వేసాడో లేదో, వెనుక నుంచి ’’ మళ్ళీ మా పోలీసే స్టేషను వేపు వచ్చావంటే ముందు నిన్ను బొక్కలో పడేసి మక్కలు విరిచేస్తాను జాగ్రత్త ! ’’ అన్న పో.బా. మాటలు వినిపించి వాడి నిక్కరు తడిసి పోయింది.   అవి పో.బా. తనని గురించి అన్న మాటలేనని వాడు వెనక్కి తిరగ నక్కర లేకుండానే పోల్చుకున్నాడు.



 అంతే ! ... ఇల్లు చేరే వరకూ పరుగో ... పరుగు !  పరుగో, పరుగు !!



ఇదండీ మా తింగరి బుచ్చిగాడి సామాజిక స్పృహ అను ఇంగ్లీషు పాండిత్యం !

30, నవంబర్ 2019, శనివారం

పులి జూదం



అశ్వం నైవ గజం నైవ
వ్యాఘ్రం నైవచ నైవచ
అజా పుత్రం బలిం దద్యాత్
దైవో దుర్బల ఘాతక:

గుఱ్ఱాన్నీ, ఏనుగునీ బలి యివ్వరు. బలం లేని మేకనే బలి యిస్తారు. దేవుడు దుర్బలులనే శిక్షిస్తాడు కదా !
చరిత్ర గతిని పరిశీలిస్తే , యిది నిజమే అనిపిస్తుంది కదూ ! ఈ పర పీడన పరాయణత్వం అంతటా కనిపిస్తూనే ఉంటుంటుంది.
‘‘ బలవంతులు దుర్బల జాతిని
బలహీనుల కావించారు
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం ?
నర జాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం ... ’’ అని శ్రీ.శ్రీ అన లేదూ ?

భాస్కర శతకంలోని పద్యం అదే చెబుతోంది కదూ !

తగిలి మదంబుచే నెదిరిఁదన్ను నెఱుంగక దొడ్డ వారితోఁ
బగఁగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు ; టింతెఁగాక, తా
నెగడి జయింప నేరడిది నిక్కము ; తప్పదు ; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా !

తన బలమేమిటో గ్రమించుకో లేక, ఎదిరి బలాన్ని ( శత్రువు బలాన్ని) అంచనా వేసుకోకుండా, బలవంతుడితో ఢీకొట్టి పోరుకి సిద్ధ పడిన వాడు చెడి పోతాడనడంలో సందేహం లేదు...
లోకంలో కొండని మదంతో ఢీ కొట్టిన పొట్టేలు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా ! కొండ అలాగే ఉంటుంది. పొట్టేలు మాత్రం ఛస్తుంది.

ఈ చెప్పిన విషయాలు కొంత నిరాశా వాదాన్ని ప్రోది చేస్తున్న వేమో అనుకునే పని లేదు. వ్యష్టి శక్తి సమిష్టి శక్తిగా రూపు దాల్చడం జరుగని రోజులవి. అయినా, దోపిడీ వర్గ స్వభావాన్నీ, బలాన్నీ చక్కగానే అంచనా వేసాయనే చెప్పాలి.
చీమలు పెట్టిన పుట్టలు పాముల ఆక్రమణకి లోను కావడం ఈ దోపిడీనే తెలియ జేస్తుంది.

అయితే, మన బద్దెన కవి హెచ్చరిక చేయనే చేసాడు కదూ ! ...

బలవంతుఁడ నాకేమని
బలువురితో నిగ్రహించి పలుకుట మేలా ?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతఁజిక్కి చావదె సుమతీ !

29, నవంబర్ 2019, శుక్రవారం

అవును కదూ !

అవును కదూ

ఆరంభ గుర్వీక్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృధ్ది ముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా, ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం


మొదల చూసిన కడు గొప్ప పిదప కుఱుచ
ఆది కొంచెము తర్వాత నధిక మగుచు
తనరు దిన పూర్వ పర భాగ జనిత మైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి


కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తర్వాత తగ్గి పోతుంది .
మంచి వారితొ స్నేహం మొదట తక్కువగా ఉండి పిదప పెరుగుతుంది.

కుజనులతొ మైత్రి ఉదయకాలపు నీడ లాగున, సజ్జనులతొ మైత్రి సయంకాలపు నీడ లాగున ఉంటాయి .

28, నవంబర్ 2019, గురువారం

పదవి పోయేక...

అధికారాంతమునందు చూడవలె..

ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే

ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !
త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !

ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !

నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !