27, మే 2010, గురువారం

కదిలేదీ , కదిలించేదీ ....


జ్వలతి చలితేన్ధనోZగ్ని:
విప్రకృత: పన్నగ: ఫణం కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి జన:


ఇది మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో ఆరవ అంకం లోని శ్లోకం.
దూర్వాస మహా ముని శాపం వలన దుష్యంతుడు శకుంతలను మరచి పోతాడు. తిరిగి అభిఙ్ఞాన దర్శనంతో శకుంతల గుర్తుకు వచ్చి ఖిన్నుడై ఉంటాడు. నిస్తేజుడై ఉంటాడు. పరిపాలనా విముఖుడై ఉంటాడు. అట్టి మహా రాజుని రాక్షస సంహారార్ధం ఇంద్రుని పనుపున ఇంద్రలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఇంద్ర రథ సారధి మాతలి వచ్చి, రాజునకు ఆగ్రహం తెప్పించడం కోసం అతని నర్మ సచివుడు మాఢవ్యుని బాధిస్తాడు.
దానితో రాజునకు ఆగ్రహం కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....

చితుకులు కదిలిస్తే అగ్ని మరింతగా జ్వలిస్తుంది. అపకారం చేయబోతే పాము పడగ విప్పుతుంది. మనిషి కూడ క్షోభ కలిగినప్పుడే తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిస్తాడు.

ప్రతి మనిషిలోను అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా? శోకమే శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!




‘ కదిలేదీ కదలించేదీ కావాలోయ్ నవ కవనానికి ...’ అని శ్రీ.శ్రీ గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?






కాళి దాసు శ్లోకానికి కందుకూరి వీరేశ లింగం పంతులు గారు చేసిన పద్యానువాదం కూడ చూడండి మరి ....

చితుకులు కదల్చుటను చెలగి మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ విప్పు
మఱియు క్షోభంబు వలననె మానవుడును
దనదు మహిమంబు చూపును తథ్యముగను.

స్వస్తి.



1 కామెంట్‌:

కృష్ణశ్రీ చెప్పారు...

ప్రియమైన జోగారావు గారూ!

మీ సాహిత్య పరిచయం వున్నా, ఇన్నాళ్ళకు మీ పరిచయం కలగడం అదృష్టం!

మీ కృషి కొనసాగించండి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి