1, జులై 2010, గురువారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 5


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువువలో గడపడానికి పాండవులు ఒక్కరొక్కరూ చేరు కున్నారు. ఇంతకు ముందు ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు విరటుని కొలువు లోనికి ఎలా ప్రవేశించారో చూసాం కదా ? ( ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కండి)

చివరి వాడు సహ దేవుడు. అతడు విరటుని కొలువులో ప్రవేశించిన విధం చూడండి ...సహ దేవుడు గోపవేషంలో పసుల కాపరిగా విరట రాజు కొలువులో చేరడానికి తంత్రీపాలునిగా ప్రవేశించాడు.

అతని రూపం ఎలా ఉందంటే, బయటకి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఆంతర్యంలో మాత్రం పరాక్రమం తేజస్సు ఉట్టి పడుతున్నాయి. ఆ చంద్రుడే మానవాకారంతో వచ్చాడా ? లేదా, అగ్ని దేవుడే ఈ మానవాకారం దాల్చాడా ? అన్నట్లగా ఉన్నాడు.

ఒక ప్రక్క పశువులను కట్టే పలపుల మోపు, మరో ప్రక్క పెయ్య దూడల త్రాళ్ళు ధరించి పసుల కాపరి వేషంలో ఉన్నాడు. ఆహార్యమూ, అభినయమూ కూడ అలాగే ఉన్నాయి. చేతిలో నునుపైన పసుల కాపరి కర్రనొకదానిని పట్టుకుని ఉన్నాడు. అతడి సుందరాకారం విరట రాజుని ఎంతగానో ఆకర్షించింది. చుట్టూ ఉన్న ప్రజల చూపూ అతడి మీదే . చూపు త్రిప్పుకో లేక పోతున్నారు. తామర రేకుల వంటి ఆ కళ్ళలో చలాకీతనం తొంగి చూస్తోంది. అతడి చూపులో ఏదో సంభ్రమం కనిపిస్తోంది. కొద్దిగా భయపడుతున్నట్టుగా కూడ ఉన్నాడు. తడబడే చూపులతో ప్రజలను చూస్తూ సహదేవుడు మెల్లగా అక్కడకి వచ్చాడు.

వచ్చి, విరాట దేశాధీశునకు వినయంగా నమస్కరించాడు , తర్వాత యిలా అన్నాడు.

సహదేవుడు:

‘‘ రాజా ! నీ ఆలమందను కాపాడడానికి నన్ను అధికారిగా నియమించు. నా పర్యవేక్షణలో పశువులకు ఏ రోగాలూ అంటవు. ఇతరులెవరూ నీ ఆలమందను వశపరచుకో లేరు. వాటికి అలసట అసలు ఉండదు. దాహంతో బాధ పడవు.

రాజా ! నన్ను నీ కొలువులో పసుల కాపరిగా కనుక నియమిస్తే నీ పశువులు ఎప్పుడూ తప్పి పోవడం జరుగదు. క్రూర జంతువుల బారిన పడవు. సమృద్ధిగా పాడి లభిస్తుంది. పాడి తగ్గి పోవడం జరుగదు. తోటి పసుల కాపరులు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకుంటావు. అంత బాగా ఆలమందను కాపాడుతాను. నన్ను ఏలుకో.’’

విరటుడు:

‘‘ఇవేం మాటలు? నీలో పశుల కాపరితనం మచ్చుకయినా కనబడడం లేదు. రాజసం ఉట్టిపడుతోంది. నీ శరీరం చక్కగా ఉంది. నీలో గాంభీర్యం ఉంది. కాంతివంతమయిన దేహంతో ఒప్పుతున్నావు. బాగా ఆలోచిస్తే నువ్వు సూర్య వంశపువాడివిగా తోస్తున్నది. లేదా, చంద్ర వంశస్థుడివయినా కావచ్చును. అంతే తప్ప కేవల పసుల కాపరివి అనిపించడం లేదు.

నీకిష్టమయిన పదవిలో కుదురుకో. నా రాజ్యాన్ని అంతా చక్కబెట్టు. నయ నీతి పరాక్రమాలు ప్రదర్శించగల సమర్ధత నీకు ఉంది. అయినా కూడా ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరు కోవడం ఎందుకు చెప్పు ?’’

హదేవుడు: ( రాజుకి మ్రొక్కి)

‘‘ రాజా ! నేను హీనకులజుడని. ముందెప్పుడూ నాగరికపు పనుల తీరు ఎరిగిన వాడను కాను. గతంలో మేము కౌరవులకు సేవకులం. పశు గణాన్ని కాపాడే వాడిని. పశువులను కాపాడడం తప్ప వేరే విధంగా బ్రతకడం నాకు తెలియదు. ఇంతకు ముందు ధర్మ రాజు యొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండే వాడిని. ఆ విధంగా ఆ మహారాజు మన్ననకు పాత్రుడనయ్యాను. నా పేరు తంత్రీ పాలుడు. నా హస్తవాసి మంచిది. అందు చేత దూడలు బాగా ఏపుగా పెరుగుతాయి. అతి తక్కువ కాలం లోనే నీ ఆలమందను రెట్టింపు అయ్యేలా చేస్తాను.ఆబోతు మూత్రం వాసన చూసినా, పైగాలి వీచినా సరే, గొడ్డుటావులకు సైతం చూలు నిలవడం ఖాయం. అలా పశువులను కాపాడుతాను. పశువులకు సాధారణంగా వచ్చే ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్తే దగ్గరకి రావు. పశువులలో రకాలన్నీ నాకు బాగా తెలుసును. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మాత్రం నీ మనసునకు నచ్చే విధంగా నడుచుకుంటాను. నా వలన నీకేమయినా ప్రయోజనం ఉందనుకుంటే మరోమాట లేకుండా నన్ను నీ కొలువులో పశుల కాపరిగా నియమించు’’

విరటుడు:

‘‘ సరే. నీకు అదే మంచిదనిపిస్తే అలాగే. నీకు ఇష్టమయితే వేరే పెద్ద పనులను చేయ వచ్చును. లేదంటే నా గోసంపదను శ్రద్ధతో తగిన విధంగా రక్షించు.’’ అని పలికి సహ దేవుడిని విరాటుడు తన కొలువులో పశుగణాలను సంరక్షించే అధికారిగా నియమించాడు.

ఈ విధంగా ధర్మ రాజు , భీముడు, అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా విరటుని కొలువులో కంకుభట్టు , వలలుడు , బృహన్నల , దామగ్రంథి , తంత్రీ పాలుడు గా అఙ్ఞాత వాసం ఒక ఏడాది పూర్తి చేసుకునే నిమిత్తం మారు వేషాలతో కుదురుకున్నారు.

అఙ్ఞాత వాస కాలంలో తమలో తమకు వ్యవహార నిమిత్తం రహస్యంగా పిలుచుకోడానికి తగిన విధంగా రహస్యనామధేయాలు పెట్టుకున్నారు. అవి: జయుడు (ధర్మ రాజు) జయంతుడు (భీముడు) , విజయుడు (అర్జునుడు) , జయత్సేనుడు ( నకులుడు) , జయద్బలుడు ( సహ దేవుడు )

ద్రౌపదికి మాత్రం సంకేత నామమంటూ ఏమీ లేదు.

ద్రౌపది సైరంధ్రీ వేషంలో విరటుని దేవేరి సుధేష్ణ ను మెప్పించి ఆమె వద్ద పనికి కుదురుకున్నది. ఆ వివరాలు - ద్రౌపది విరటుని కొలువులోకి ఎలా ప్రవేశించిందో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి

.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి