30, జూన్ 2010, బుధవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 4









అఙ్ఞాతవాసం విరట మహా రాజు కొలువులో పూర్తి చేసుకోడానికి నిశ్చయించుకుని, పాండవులు ఒకరొకరూ అక్కడకి చేరుకుంటున్నారు. ముందు టపాలలో ధర్మ రాజు , భీముడు , అర్జునుడు ఎలా వచ్చి కొలువులో ప్రవేశించారో చూసాం ( వివరాలకు వరుసగా ఆయా పేర్ల వద్ద నొక్కండి)

ఇక, నకులుడు విరటుని కొలువులో ఎలా కుదురు కున్నాడో చూదాం ....నకులుడు అశ్వపాలకడిగా దామగ్రంథి పేరుతో వచ్చాడు.

అతడిని చూస్తూనే అక్కడి ప్రజల నేత్రాలు అప్పుడే సూర్యుడిని చూస్తూ వికసిస్తున్న పద్మాల్లా వికాసవంతాలయ్యాయి. నకులుడు విరటుని కొలువు దగ్గరకి వచ్చాడు. అక్కడున్న గుర్రాలను దీక్షగా పరికిస్తున్నాడు. విరటుడు అది చూసి తన పరివారానికి అతడిని చూపించి ఇలా అన్నాడు:

‘‘ ఇతడు గుర్రాలను పరిశీలించే తీరు చూడండి. ఇతనికి అశ్వ శాస్త్రంలో ఎంతో నైపుణ్యం ఉన్నట్టుగా ఉంది.కదూ? ఇతడు బహు సుందరాకారుడే కాదు, గొప్ప పరాక్రమం కలవాడుగా కూడా కనిపిస్తున్నాడు.

ఇతడి పేరు మీలో ఎవరికయినా తెలుసునా? తెలిస్తే చెప్పండి. తెలియక పోతే దగ్గరకి వెళ్ళి అడిగి తెలుసు కోవాలి. ’’

ఇలా రాజు అనుకుంటూ ఉండగా నకులుడు విరాటుని వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు.

నకులుడు:

‘‘ రాజా ! నేను రాజవాహనాలయిన గుర్రాలను చాల నేర్పుగా కనిపెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను. నా పేరు దాగ్రంథి. నాకు అశ్వ శాస్త్రం బాగా తెలుసును.

అశ్వాల లక్షణాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. చూడగానే ఆ గుర్రాలు ఎంత కాలం బతుకుతాయో చెప్ప గలను.( వాటి ఆయు:ప్రమాణం కనిపెట్టగలను.) అవి చూలుతో ఉన్నాయో కాదో చెప్ప గలను. ఆకారానక్ని బట్టి వాటి స్వభావాన్ని తెలుసుకో గలను. గుర్రాల మేతలు, పోషణ పద్ధతులు, వాటికి ఏమయినా రోగాలు వస్తే నయం చేసే చికిత్సా పద్ధతులు నాకు తెలుసు. ఆ విద్యలన్నీ కావాలంటే నీ ఎదుట ప్రదర్శించా చూపిస్తాను. ఒక వేళ యుద్ధమే కనుక వస్తే అది నా పని కాదని ఊరుకోను. యుద్దంలో నా బలాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తాను ’’

విరటుడు:

‘‘ నీకు తగిన పదవి యిస్తాను. నా సంపదని కాపాడుదువుగానిలే. నీవు కేవలం అశ్వ రక్షకుడివే కాదు. అలా అనడం నీకు తగదు ’’

నకులుడు:

‘‘రాజా! ఎవరయినా వారికి ఏ పనులు తెలుసునో అవి చేస్తూ జీవించాలి. అంతే కాని చేతకాని సేవలకు ఒప్పుకోవడం న్యాయం కాదు.

ఇంత వరకూ ధర్మ రాజు వద్ద పెరిగాను. అశ్వ శాస్త్రంలో నన్ను అతడు కడు నేర్పరిగా చేశాడు. గుర్రాలకు అధిపతిగా చేసాడు. నన్ను తన తమ్ముళ్ళలో ఒకడిగా ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకున్నాడు. అయితే, కపట ద్యూతంలో ఓడిపోయి, ఆ రాజు రాజ్యం మీది విముఖతతో వెళ్ళి పోయాడు. చుట్టాలను వదిలి పెట్టాడు. తనకు తోచిన చోట గడిపాడు. పిమ్మట అఙ్ఞాతం లోకి వెళ్ళి పోయాడు. ఇంక నేను ఎక్కడ పొట్ట పోసుకోవాలా అనుకుంటూ ఇక్కడికి వచ్చేను. నిన్ను చూసాను. నాకు తోచిన విధంగా విషయమంతా నీకు విన్నవించుకున్నాను. నాచేత పని చేయించ దల్చుకుంటే సరి. లదూ, నీకు సందేహంగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి పోతాను ’’

విరటుడు:

‘‘అశ్వ రక్షణమే నీకు ఇష్టమయితే మా అశ్వశాల లన్నింటికీ నీవే ప్రధానిగా ఉండు.నేను ఇంత వరకూ నా అశ్వ పాలకులను ఎలా చూసే వాడినో నువ్వూ వారిని అలాగే ప్రీతి చూడు. వారిచేత పనులు చేయించుకో ’’

ఇలా పలికి, విరాట మహా రాజు నకులుడిని గౌరవ పురస్సరంగా తన ఆస్థానంలో

అశ్వ రక్షకునిగా నియమించాడు.

ఇక, పాండవులలో చివరి వాడు సహదేవుడు విరటుని కొలువులో ఎలా ప్రవేశించాడో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి