13, జూన్ 2010, ఆదివారం

మంచి మాట


( ఆంధ్ర మహా భారతం ఆది పర్వం. ద్వితీయాశ్వాసం నుండి ... నన్నయ రచన)

శమీక మహర్షి పరీక్షిన్మహా రాజునకు శాపమిచ్చిన తన కుమారుడు శృంగితో పలికినది ...


నాయనా ! కోపమే తపస్సును చెడ గొడుతుంది. అణిమాది అష్ట సిద్ధులను నాశనం చేస్తుంది. కోపం ధర్మ కార్యాలకు విఘాతం కలిగిస్తుంది. కనుక తపస్సు చేసుకునే మునికి కోపం తగదు సుమా !

పగిలిన కుండలో నీళ్ళు నిలుస్తాయా చెప్పు ? అలాగే , ఏమాత్రం ఓర్పు అనేది లేని ముని చేసే తపస్సు , అజాగ్రత్తగా ఉండే వాడి ధనం, ధర్మాన్ని విడనాడిన రాజు యొక్క రాజ్యం యివన్నీ నిలవవు.

( ద్వితీయాశ్వాసం నుండి ...)

కచ దేవయాని కథలో శుక్రాచార్యుడు మద్యపానాన్ని నిషేధిస్తూ చెప్పినది ...

మనం ముందు జన్మలలో చేసిన పుణ్యమంతా , పొందిన వివేకమంతా మద్యపానం చేయడం వల్ల యిట్టే పోతుంది. అందు చేత మద్యపానం చేయడం తగదు. నేటి నుండి బ్రాహ్మణులాదిగా గల జనులు మద్యాన్ని సేవిస్తే ఘోరమయిన నరకంలో పడతారు అని కట్టడి చేస్తున్నాను.

రాచబిడ్డ శర్మిష్ఠతో వైరం పొంది అలిగిన కుమార్తె దేవయానితో శుక్రుడు పలికినది ...

సాటి లేని గొప్ప నియమాలతో కూడిన వారై, భూరి దక్షిణలిచ్చి వేల కొద్దీ క్రతువుల చేసిన వారి కంటె కూడ ఎవడు కోపం లేకుండా ఉంటాడో, వాడే మిక్కిలి గొప్ప వాడని పరమార్ధం తెలిసిన వాళ్ళు చెబుతారు.

ఇతరులు కోపిస్తే కోపించ కుండా, ఇతరులు నిందలు పలికితే వాటిని విననట్లే మారు పలక కుండా, అవమానం పొంది ఉండి కూడ మనసులో పెట్టుకోకుండా ఉన్న వాడే లోకంలో ధర్మాన్ని తెలిసిన వాడు. కాబట్టి బుద్ధిమంతులకు కోపం తగదు.

శర్మిష్ఠ యయాతితో పలికినది :

ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడూ, సమస్త ధనమూ అపహరించబడుతున్నప్పుడూ, వధించబడుతున్న బ్రాహ్మణుడిని కాపాడేటప్పుడూ , స్త్రీలతో సమాగమం చేసే విషయం లోనూ, వివాహ సమయాలలోనూ అసత్యం చెప్ప వచ్చును.

భాగవతంలో వారిజాక్షులందు, వైవాహికములందు ... అనే పద్యంలో ఇలాంటి మాటలే చూస్తాం. అక్కడ స్త్రీల విషయం లోను, మాన భంగం జరిగే సమయంలోనూ, భీతిల్లిన గోవులను కాపాడే సందర్భంలోను అసత్యం చెప్పినా దోషం లేదని చెప్పగా, యిక్కడ వధూజన సంగమ విషయంలో కల్ల పలికితే తప్పు లేదనడం కనిపిస్తుంది. ( సందర్భం అది, మరి.)

శుక్రుడు యయాతికి శాపం యిచ్చే సందర్భంలో యయాతి పలికిన పలుకులు :

పుష్పవతియై , భర్త సమాగమాన్ని పుత్రార్ధం కోరిన భార్య ను వలదని తిరస్కరించి, ఆమె యెడ అననుకూలంగా ప్రవర్తించి, రుతుకాలాన్ని ఎవడైతే వ్యర్ధం చేస్తాడో, అట్టి వానికి గర్భస్థ శిశువును చంపిన పాపం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు.

యయాతి తన వార్ధక్యాన్ని గ్రహించి, తనకు యవ్వనం వచ్చేలా చేయమని కొడుకులను అడిగితే వారు నిరాకరించడమే కాక తండ్రితో యిలా అంటారు :

లోకంలో ముసలితనం, రోగం ఎవరికయినా విధివశాత్తు కలిగినా వాటిని వారే అనుభవిస్తారు. కాని, తెలిసి తెలిసి ఎవరూ కావాలని ఆ రెండింటినీ ఇతరుల నుండి తీసుకోరు. అలాంటి బుద్ధి హీనులెవరూ ఉండరు కదా ?
మన్మథుడే కావచ్చు , అతడు వెండ్రుకలు నెరిసి పోయి ఉంటే యౌవ్వన వతులు అతనిని సమీపించడానికి అసహ్యించుకుంటారు. మగ వాడు ఎంత కుబేరుడయినా, వృద్ధత్వం వల్ల కలిగిన రోత చేత యిష్ట భోగాలను పొంద లేడు.

తన జరాభారాన్ని గ్రహించి తనకి యవ్వనాన్ని యిచ్చిన కుమారుడు పూరునకు యయాతి రాజ్యభారాన్ని అప్పగించడంతో పాటు కొన్ని హిత వచనాలు చెప్పాడు. చూడండి ....

ఙ్ఞానం కలవారి చరిత్రలు తెలుసుకుంటూ, నిశ్చలంగా సజ్జన సల్లాపం చేస్తూ ధర్మాన్ని గ్రహిస్తూ తెలిసుకున్న దానిని మరిచి పోకుండా న్యాయ బుద్ధితో ఆచరించాలి.

ఎవడు తగిన వాడో , వానికి వాని అర్హతను గుర్తించి తగిన విధంగా ధనాన్ని యివ్వాలి. మనం యిచ్చాక అతడు మరి వేరొకరిని అడగనవసరం లేని విధంగా యివ్వాలి. మన ఎదుట యాచిస్తూ నిలిచిన యాచకులను నిరాశ పరచ కూడదు. సకల జీవులకూ తృప్తిని కలిగించాలి.

సభలలో మాటలాడేటప్పుడు మంచి మాటలే పలకాలి. మనసునకు ప్రీతిని కలిగించేదీ, మేలైనదీ, తగినదీ, సత్యమైనదీ, తీయనిదీ, అయిన మాటలు మాట్లాడాలి. ఆ మాటలు కూడా వీలయినంత క్లుప్తంగా ఉండాలి. ముఖ్యంగా సభలో పలికి పలుకులు ధర్మ బద్దంగా ఉండాలి.

కొంత మంది చాల దుర్మార్గంగా మాటలాడుతూ ఉంటారు. వారి చెంత నివసించ కూడదు.
ముఖం అనే వింటికి మాటలనే వాడి బాణాలను సంధించి, ఇతరుల మర్మాలనే లక్ష్యాలను చీలుస్తూ ఉండే దుష్ట యోధులకు దూరంగా ఉండాలి. దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, సత్యం, బహిరింద్రియ నిగ్రహం, శుచిత్వం, అనే వాటిని మనసులో నిలపాలి. పాటించాలి. నిర్మల మైన శాంత బుద్ధితో కామ క్రోధాదులను జయించాలి. ఈ అంత: శత్రువులను జయించ గల వాడే బహిశ్శత్రువులను కూడ ఏమాత్రం శ్రమ లేకుండా ఓడించ గలుగుతాడు.


మహా మునుల తపస్సులను తక్కువ చేసి మాట్లాడినందుకు కోపించి, ఇంద్రడు యయాతిని అథో లోక భ్రష్టునిగా చేసి, పిమ్మట అతడి అభ్యర్ధనను మన్నించి యయాతిని నక్షత్రగణాలు ఉండే చోటు పొందేలా అనుగ్రహిస్తాడు. అక్కడ అతని దౌహిత్రులయిన అష్టకాదులు అడిగిన దానికి పలికిన హిత వచనాలు చూడండి ...

సమస్త జీవులకి దయ కలిగి ఉండడం కంటె, సత్యం పలకడం కంటె, శ్రేష్ఠమయిన ధర్మం మరొకటి లేదు. సంకోచం లేకుండా యితరులను బాధించడం, వారికి సంతాపం కలిగించడం చాల అధర్మం అని పండితులు చెబుతారు.

వేద విహిత కార్యాలను ఆచరించడమే ఉన్నత గతికి మార్గం. వేద ధర్మాన్ని అతిక్రమించి నిషేధించబడిన వాటిని ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా చేయడం పాప హేతువు. అట్టి వారు దుర్గతి పాలవుతారు సుమా !

అంతే కాదు ...గర్భయోనిలో రుతు కాలం లోని స్త్రీ రజస్సుతో కూడినదై, పురుషుడి రేతస్సు గాలి చేత ప్రేరేపించబడినదై కలియగా ఆ గర్భ యోనిలో శబ్దస్పర్శాదులైన తన్మాత్రలు ఐదూ రూపొంది క్రమంగా జీవం పొంది, అవయవాలు ఏర్పడి, పుట్టడం జరుగుతుంది.

తరువాత చెవుల చేత శబ్దాన్నీ, నేత్రాల చేత రూపాన్నీ, ముక్కు చేత వాసననీ, నాలుక చేత రుచినీ చర్మం చేత స్పర్శనీ , మనస్సు చేత సమస్తాన్నీ తెలుసుకుంటారు. ఆ పిమ్మట పూర్వ జన్మ కృత పుణ్య పాప పరిపాక ఫలం చేత చెడ్డ పనులు చేస్తూ మతి మాలి పశుపక్ష్యాదులుగా పుడతారు. పుణ్య ఫలాధిక్యత చేత, పుణ్య కార్య నిర్వహణ చేత మానవ జన్మ ఎత్తుతారు. ఆచారవంతులై, నిర్మలఙ్ఞాన సంవద చేత మోక్షాన్ని పొందుతారు.

ఇక, మంచి ఆచారవంతులెవరయ్యా, అంటే....

గురువులను సేవించే వారు , నిత్యం వేదాధ్యయనం చేసే వారు, ఏమరక అగ్ని హోత్రాలను నిర్వర్తించే వారు, అంతర్ బహిరింద్రియ నిగ్రహాన్ని పాటించే వారు, శుచిగా బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించే వారు, పాపకార్యాలు చేయకుండా, పరులను పీడించకుండా ధర్మ మార్గాన సంపాదించిన ధనంతో అతిథి సేవ చేసే వారూ, ఆహారం నియమంగా తీసుకునే వారూ, శీతోష్ణ సుఖ దుఖాలను, సర్వ ద్వంద్వాలను జయించి అన్ని ఆసక్తులు విడిచి పెట్టి ఒంటరిగా తిరుగుతూ ఉండే యోగులు ... వీరు యుక్తాచారులు. వీరు తమ పుణ్యాచారాల చేత అటు వది వేల తరాల పూర్వులనూ, యిటు పది వేల తరాల వారినీ ఉద్ధరిస్తారు.

గర్వంతో అగ్ని కార్యం చేసినా, ఆడంబరం కోసం వేదాధ్యయనరం చేసినా మదంతో కూడిన మౌనాన్ని వహించినా, అఙ్ఞానంతో , ఆడంబరంగా యఙ్ఞం చేసినా ఫలితం ఉండదు.అట్టివి అయోగ్యాలు సుమా .



మరి కొన్ని ... తదుపరి హిత ‘వచనమ్ ’ . కామ్ లో చూదాం .......


ఇప్పటికి స్వస్తి.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి