11, జూన్ 2010, శుక్రవారం

అక్షరాస్యులు కూడ అడుక్కోవడం తప్పదా ?

ఇవాళ సాక్షి దిన పత్రికలో వచ్చిన ఈ ఫొటో చూసేరా ? మీకేమనిపిస్తోంది ? నాకుమాత్రం ఇది బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా తోస్తోంది.

ప్రజా సేవకు వినియోగ పడ వలసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూం నానా చెత్త ప్రకటనలతో దిక్కుమాలి పోయి ఉంది. ఇంత నిర్లిప్తత క్షంతవ్యమా ?

మన మహా నగరంలో మనం పడుతున్న ఒక ముఖ్యమైన యిబ్బందిని మీ దృష్టికి తెస్తున్నాను ...

మనం బస్సులోనో , లేదా , సొంత వాహనంలోనో , టూ వీలర్ మీదనో , కాదంటే కాలి నడకనో మన మహా నగరంలో వెళ్తున్నామనుకోండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఛస్తే తెలియదు. ఎవరినయినా అడగాల్సిందే. పాత వారికీ, ఆ ప్రాంతం పరిచయం ఉన్న వారికీ అయితే ఫరవా లేదు. ఈ మహా నగరం లోనే ఉంటున్నా, ఆ ప్రాంతం తెలియని వారి గతేమిటి ? ఇక, నగరానికి బొత్తిగా కొత్త వారయితే యిక చెప్పే పని లేదు. నగర పాలక సంస్థ వారు ప్రాంతాలని సూచిస్తూ పెట్టే బోర్డులు ఎక్కడో ఉంటాయి. కిక్కిరిసిన జన సమ్మర్ధంలో కనిపించవు.అంతా అయో మయం. గాభరా. అది ఏ ప్రాంతమో తెలుసు కోవాలంటే చచ్చినట్టు ఎవరినయినా అడగక తప్పదు. అక్షరాస్యులమై ఉండి కూడా ఈ అడుక్కోడం తప్పదంటారా ?

దయ గల ప్రభువులు, మనలను ఏలే మహానుభావులు ఒక చిన్న నిబంధనని ఖచ్చితంగా అమలు పరిస్తే ఈ బెడద తప్పి పోతుంది. దీనికి అదనంగా ఎర్ర ఏగానీ ఖర్చు కూడా ఏలిన వారికి ఉండదు.

కొద్దిపాటి నిబంధనలతో నగర వాసులకీ, నగరానికి వచ్చే కొత్త వారికీ కొండంత మేలు జరుగుతుంది ...

అదేమిటో వివరిస్తాను ...

నగరంలో బజార్లమ్మట ఏ ప్రాంతానికి వెళ్ళండి ... ఆకర్షణీయమయిన పెద్ద పెద్ద సైన్ బోర్డులూ, హోర్డింగులూ కనిపిస్తూనే ఉంటాయి. కూడళ్ళలో ట్రాఫిక్ ఐలెండులు ఎలానూ ఉంటాయి.

ఎక్కడో, మన పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలితం వల్ల కొద్ది పాటి సైన్ బోర్డుల మీద అది ఏ ప్రాంతమో రాసి ఉంటుంది. తక్కిన లక్షలాది పెద్దా చిన్నా బోర్డులన్నీ ఆయా షాపుల పేర్లతోనూ, తక్కిన వాణిజ్య ప్రకటనలతోనూ నిండి పోయి ఉంటాయి. ఎక్కడా అదే ప్రాంతమో మచ్చుకయినా కనిపించదు.

ఏలిన వారికి నా సూచన ఏమిటంటే .....

వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎన్ని బోర్డులు పెట్టు కోండి, ఎలాంటి రాతలు రాసుకోండి. కానీ ...

ఆ బోర్డుల మీద ఖచ్చితంగా ఆ ప్రాంతం పేరు ఇంగ్లీషులోనూ , తెలుగు లోనూ, వీలయితే జాతీయ భాష లోనూ రాసి తీరాలి. లేని వాటికి అనుమతి రద్దు చేస్తూ వాటిని తొలిగించాలి.

నిర్ణీత గడువు యిచ్చి, మన మహా నగరంలో గల్లీ గల్లీ లోనూ, ప్రధాన రహదార్ల మీదా, ఎక్కడవనీయండి ...ఆ ప్రాంతాన్ని సూచించని బోర్డులను ఎంత మాత్రం ఇక మీదట అనుమతించ కూడదు.

ప్రజోపయోగకరమయిన ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేయడానికి కూడా అంతగా ఆసక్తి కనబరచని ఏలిన వారికి ఓ దండం పెట్టి, ఆ పనేదో ప్రజా సంఘాలు చేపట్ట వచ్చును. ధరల పెరుగుదల మీద మండి పడుతూ ప్రదర్శనలు చేసే రాజ కీయ పక్షాల వారూ, యితర ప్రజా సంఘాల వారూ యిందుకు నడుం కట్టాలి.

నా సూచన నచ్చితే మీ కామెంట్లతో స్పందించండి. ఇది పరిగణించాల్సిన విషయంగా తోస్తే, మీరిచ్చే సలహాలు కూడ నలుగురితో పంచుకోండి.

లేదూ, యిలాగే ఉందాం, అనుకుంటే సరే.

ఎన్ని యిబ్బందులని, ఎన్ని నరకాలని, ఎన్ని అసౌకర్యాలని , ఎన్ని అవమానాలను , ఎన్ని అనుచితాలను నిత్యం భరిస్తూ నగర జీవితం గడిపేయడం లేదు కనుక ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి