15, జూన్ 2010, మంగళవారం

మంచి మాట


(మహా భారతం ఆది పర్వం పంచమాశ్వాసం నుండి )

కిందముడు భార్యతో మృగ రూపంలో క్రీడిస్తూ ఉండగా పాండు రాజు వధించాడు. పాండు రాజునకు శాపమిచ్చి మృగ రూపంలోని ఆ ముని దంపతులు మరణించాక పాండు రాజు చింతిస్తూ ఆత్మగతంలో ...
మానవులు ఎంతటి ఉత్తమ వంశంలో పుట్టినా, మంచి చెడ్డలను గురించిన ఙ్ఞానం కలిగి ఉన్నప్పటికీ పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు.

శరీరం నశించిన వెంటనే అన్ని ఋణాలూ తీరి పోతాయి. కాని పితరుల ఋణం మాత్రం శరీరం నశించినా తీరదు.

దానాలు చేసినా, తపస్సులు చేసినా, భూరి దక్షిణలతో యఙ్ఞాలు చేసినా, సంతానం లేని వారికి పుణ్య లోకాలు లభించవు. సంతానం కల వారే పుణ్యాత్ములు.

సత్యవతితో వ్యాసమహర్షి :

ఆలోచించి చూస్తే ఎండ మావి లాగా ఈ సంసారం అతి చంచలం. సంపదలు అశాశ్వతాలు. రాబోయే రోజుల కంటె గడచి పోయిన రోజులే మేలు.

( షష్ఠాశ్వాసము నుండి కొన్ని హిత వచనాలు,)

కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం సందర్భంగా కర్ణుని కుల గోత్రాలు అడిగిన కృపునితో
దుర్యోధనుడు :

లోకంలో రాజు అనే పేరు ఎవరికి ఉంటుంది? కులం గల వాడికి , శౌర్యం కల వాడికి , అధిక సేవా బలం ఉన్న వాడికి.

ఇదే సందర్భంలో దుర్యోధనుడు భీమునితో పలికిన మాటలు :

శూరుల పుట్టుక , దేవతల పుట్టుక , నదుల పుట్టుక తెలిసి కొనడం సాధ్యం కాదు. దేవేంద్రుని వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి పుట్ట లేదా ? గంగ కుమారునిగా, కృత్తికల కొడుకులగా, అగ్ని కుమారునిగా, రెల్లు పొదలలో కుమార స్వామి పుట్ట లేదా? ధర్మం తెలిసిన కృపుడు రెల్లు గడ్డి వాములో పుట్ట లేదా ? ద్రోణుడు కుంభ సంభవుడు కాదా ? ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణుల వలన పుట్ట లేదా ? మీ ( పాండవుల ) పుట్టుకలు కూడ యిలాంటివే కదా ?

పాండు పుత్రుల పరాక్రమాన్ని ఓర్వ లేక ఖిన్నుడై ఉన్న దుర్యోధనునితో శకుని మంత్రి కణికుడు పలికిన మాటలు. భారతంలో ఇవి కణిక నీతులుగా ప్రసిద్దాలు.

ప్రభువు గొప్ప అధికారం కలవాడై, తగిన విధంగా దండ నీతిని అవలంబిస్తూ, ప్రజలను ధర్మ మార్గాన నడిపించాలి. మంచి ప్రవర్తన కలవాడై ఉండాలి. దండనీతిలో స్వపర భేదాలు చూపించ కూడదు. సమ బుద్ధితో ప్రవర్తించాలి. అలా ఉంటే ప్రజలు కూడ తమ జాతి ధర్మాలు ఉల్లంఘించ కుండా మెలుగుతారు.

ఇవి చేయ దగిన పనులు , ఇవి చేయ కూడని పనుల అని తెలుసుకోవాలి. అలా కాక, చెడు నడవడికతో, ప్రజల మేలు కోరకుండా, ఉంటే అతడు తండ్రయేది, గురువయేది రాజు విడిచి పెట్టకుండా వానిని శిక్షించాలి. ఆ శిక్ష ప్రజలందరికీ తెలిసేలా అమలు చేయాలి.

ఏ పని చేసినా, ముందుగా బుద్ధిమంతులతో ఆలోచించి చేయాలి. ముందుగా విచారించి చేసిన పని ఎప్పుడూ చెడి పోదు.

రాజు నేర్పుతో మెత్తని పని చేత కాని, భయంకరమయిన పని చేత కాని మొదట తనని తాను కాపాడు కోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని పిమ్మట రాజ ధర్మాలు నడపాలి.

స్వచ్ఛమయిన బుద్ధితో తన లోపాలు ఇతరులు తెలిసికోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ , దేశ కాల పరిస్థితులను గమనిస్తూ మిత్ర బలాన్ని సమకూర్చుకుంటూ రాజు తన రాజ ధర్మాలు నిర్వర్తించాలి.


శత్రువు బలహీనమయినప్పుడే చంపడం రాజ నీతి. వాళ్ళు అధిక బలురై. మిత్ర బలం కూడ కూర్చుకున్నాక వారిని చంపడం సాధ్యం కాదు సుమా !

రాజు ఎప్పుడూ దూతల వలన అన్ని విసయాలూ తెలుసుకుంటూ ఉండాలి. విసుక్కో కూడదు. తన పనుల గురించే కాక, శత్రువుల పనులను గురించి కూడ తెలుసుకుంటూ ఉండాలి. శత్రు దేశ విషయాలు తెలుసుకుని రావడం కోసం వీలయినంతమంది ఎక్కువ సంఖ్యలో పాషండులను
( వేద బాహ్యులను) పంపాలి.

రాజు చాలా చోట్లకు వెళ్తూ ఉంటాడు. అందుకని రాజు ఎక్కడికి వెళ్ళబోతున్నా, ముందుగా ఆ ప్రదేశాలని క్షుణ్ణంగా పరిశీలించేలా చేయాలి. ఆయా ప్రదేశాలు పరిశీలించి, రాజుకి ఆపద కలిగించే వ్యక్తులు కానీ , ఆయుధాలు కానీ ఉంటే ముందుగానే తొలిగించేలా చర్యలు తీసుకోవాలి.

రాజైన వాడు ‘ వీడు నమ్మ దగిన వాడు ’ , ‘ వీడు నమ్మ రాని వాడు ’ అని అనకూడదు. నిశ్చయ బుద్ధితో తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ఎవరినీ అంతగా నమ్మెయ్య కూడదు.

మరో విషయం. రాజు తనని తాను కాపాడు కోవడమే కాదు - తన రహస్యపుటాలోచనలనీ కూడ జాగ్రత్తగా కాపాడు కోవాలి.రహస్యపుటాలోచనలు రాజు ఎంతాగా కాపాడు కుంటాడో అంతగా అతని పనులు విజయవంతాలవుతాయి. రహప్యాలను కాపాడు కోలేక పోతే ఆ బృహస్పతి పనులు కూడ ఫలవంతాలు కావు సుమా !

ఇక మనుషుల నైజం గురించి చెబుతాను. చెడ్డ వాళ్ళు మాటి మాటికీ ఒట్లు పెడుతూ ఉంటారు. చేతులు జోడించి దండాలు పెడుతూ ఉంటారు. తియ్యగా మాటలాడుతూ ఉంటారు. నక్క వినయాలు చూపిస్తూ ఉంటారు.

దుర్మార్గుడు తనకు అనుకూలమయే వరకూ మిత్రుడి వలె నటిస్తాడు. అనుకూలత ఏర్పడిన వెంటనే పాము లాగా తనక్రూరమయిన పనులనే కోరలతో కాటు వేస్తాడు.

పిడుగు పడడం , గాలి వీచడం - ఇవి ప్రజలకు ఎప్పుడు తెలుస్తాయి ? అవి జరిగి నప్పుడే
కదా ? అలాగే మిక్కిలి కోపం కాని, స్నేహం కాని ఇతరులకు వాటి అనుభవ కాలానికే తెలియాలి. రాజు అలా మసలుకోవాలి.

రాజు, తనకు ఇంతకు ముందు అపకారం చేసిన వాడిని, తక్కువ వాడే కదా అని ఆదరించ కూడదు. ముల్లు చిన్నదే కావచ్చు. అది పాదంలో గుచ్చుకుని ఉండగా నడవ గలమా ?

శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్య కూడదు. బాలుడని చులకన భావంతో అతనితో కలిసి ఉండ కూడదు. భయంకరమయిన పర్వతాలను, అరణ్యాలను కాల్చిపారెయ్య డానికి ఒక చిన్న నిప్పు కణికె చాలదూ ?


తనకి అపకారం చేసిన వాడిని చేర దీసి, దగ్గర ఉంచుకునే వాడు బుద్ధి హీనుడు. వాడెలాంటి వాడంటే, ఎత్తయిన చెట్టు కొమ్మ మీద ఏమరుపాటుతో నిద్రించే వాడితో సమానం !

మరో ముఖ్య విషయం ... రాజా, అపకారాలు చేసే వాళ్ళని, సామ దానభేద దండోపాయాల చేత కాని , దయ చూపడం చేత కాని, వారికి నమ్మకం కలిగేలా చేయి. అలా మాటలాడి వారిని నమ్మించు. కావాలంటే ఒట్టు పెట్టు. వారికి నమ్మకం కలిగించి, తర్వాత ఏమాత్రం ఆలస్యం చేకుండా చంపెయ్యి. శుక్రుడు కూడ ఇదే చెప్పాడు. అందు చేత ఏ విధంగానయినా రాజ నీతితో శత్రువులను హతమార్చాలి.

అందు చేత అపకారాలు చేసే వాళ్ళు శత్రువులయినా, బంధువులయినా సరే, అశ్రద్ధ చేయ కూడదు. ఆత్మ రక్షణ కోసం వాళ్ళని హతమార్చాల్సిందే సుమా !

ఇది కణిక నీతి.

ఇక, ఏకచక్రపురంలో పాండవులు భిక్షాటనం చేస్తూ ఉండిన సందర్భంలో, ఆ యింటి గృహస్థుకి వచ్చిన ఆపదను విని కుండి బాధ పడుతూ ఆత్మగతంలో ....

బుద్ధిమంతులు తమకి ఎదుటి వాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించాలి. అదే ఉత్తమమయిన పుణ్య కార్యం. మంచి బుద్ధితో దానికి సమానమయిన ప్రత్యుపకారం చేయడం మధ్యమ మార్గం,
అలా కాకుండా పొందిన మేలు కంటె ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమ పద్ధతి.

ఆ బ్రాహ్మణుడు తన వారితో పలికినది:

ఈ సంసారం గడ్డిలాగా చాల నిస్సారమయినది. దు:ఖాన్ని కలిగించేది. భయానికి నెలవయినది. కడు చంచలమయినది. ఇతరులకు లొంగేది. పండితు ఈ సంసార జీవనం సత్యమయినదని ముమ్మాటికీ నమ్మరు

ఇదే ఘట్టంలో కుంతి:

ధైర్యం కొలు పోయి వేడుకునే వాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయ వడే వాడిని, శరణే వేడిన వాడిని చంప కూడదు. అలా చేసే వాడికి ఇహపర లోక సుఖం ఉండదు.

ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దు:ఖాలను తొలతగించడానికి పుట్టిన ధర్మ శీలుడు. మృత్యుభయం కలిగిన బ్రాహ్మణుడిని కాపాడితే పుణ్య లోకాలు కలుగుతాయి. దయతో క్షత్రియుడుని కాపాడితే కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను కాపాడితే ప్రజలందరి మన్ననలు పొందుతాడు. ఈ విషయం వేదవ్యాసుడు చెప్పాడు.

మరి కొన్ని తదుపరి ‘ హిత వచనమ్ ’ డాట్ కామ్ లో చూదామా ?


ఇప్పటికి స్వస్తి.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి