14, ఆగస్టు 2010, శనివారం

బక్క రైతుల బతుకు గోస - దుక్కి



అచ్చమయిన రైతు కవి చింతా అప్పల నాయుడు. తన చుట్టూ విషాదంగా పరుచుకుని ఉన్న ఛిద్ర జీవితాన్ని రైతు భాషలో వినిపించేడు. శ్రీకాకుళపు బడుగు రైతుల బతుకు గోసని గుండెలు పిండేసే లాగున మనకి వినిపించేడు.
నాయుడు నేనెరిగిన వ్యక్తి. ఎప్పుడూ చిరు నవ్వు నవ్వుతూనే ఉంటాడు. కాని ఆ నవ్వులో ఏదో అనంత విషాద వీచిక కదలాడుతున్నట్టుగా నాకనిపిస్తూ ఉంటుంది.
మట్టి మనుషుల జీవితాలను వారి భాషలోనే చిత్రం కట్టి చూపించేడు. భద్ర జీవుల కలలోకి కూడా రాని బతుకులవి. అనుభవించి పలవరించిన కరకు వాస్తవాలు.
2008 సంవత్సరానికిగాను ఫ్రీవర్స్ ఫ్రంట్ వారి ఉత్తమ కవితా సంకలనానికి యిచ్చే అవార్డు చింతా అప్పల నాయుడు రాసిన దుక్కి కి వచ్చింది.
2009 సంవత్సరానికి గాను అవార్డు యాకూబ్ రాసిన ఎడతెగని ప్రయాణం కి లభించింది.

చింతా పుస్తకం గురించి ... ... ...

మా అయ్యకి వ్యవసాయం వొక వ్యసనం అంటాడు చింతా. అభివ్యక్తి లో కొత్తదనం, సూటిదనం , నిజాయితీ, నిబద్ధత, రవంత అమాయకత్వం, వంతెన కింద రహస్యంగా పారే నీటి పాయలా, అణచు కొంటున్న ఆర్తి కనిపిస్తుంది.

ఆవుకి కుడితెట్టినట్టు
పొలానికి గత్త మేసినట్టు
గడ్డి పరకలని గాలించి నట్టు
బతకడం నీకు బాగా పట్టుబడి పోయింది
బతుకే నీ యెనకాల బేపి కూనై తిరిగేది.

బతకడం భారమైనప్పుడు, బతక లేని దుర్భర వాతావరణం క్రూరంగా చుట్టూ వలయంలా, నీ కనబడని శత్రువులు కలిపించి నప్పుడు, బతకాలి కదా, జీవచ్ఛవంలాగానయినా ? అదే చేస్తున్నారు శ్రీకాకుళపు బక్క రైతులు. ఆ దౌర్భాగ్యాన్ని, ఆ పెను విషాదాన్ని అక్షర బద్ధం చేసి చూపించేడు చింతా.
అందుకే మిత్రుడు గంటేడ గౌరు నాయుడు అంటాడు: అప్పల నాయుడు రాసే ప్రతీ వాక్యమూ నాకు కవిత్వంలా కాక , జీవితంలా సాక్షాత్కరిస్తుంది. అని !

లోతుకు పోయిన కళ్ళతో మా అమ్మల ముఖాలు
మసిబారి పోయిన దివ్వ గూళ్ళలా ఉంటాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో ఇనుప గద్దలు వాళ్ళ గుడిసెల ముందు ఎగురుతూనే ఉంటాయి.
వాళ్ళ పశువులు గడ్డి పరకలని కలలు కంటూనే ఉంటాయి.
పండగ పూట కూడా వాళ్ళ నోటికి సీసమే పాయసమౌతుంది ...

అక్కడ కూలీలు కండలు తిరిగిన వస్తాదులా ఏమిటి?
వాళ్ళ చేతుల్లో గదలుంటాయా, గాండీవాలుంటాయా?
చూడండి, కూలీల భార్యల బతుకు గోస:

మా మొగోల్లు కండలు తిరిగిన వస్తాదులా !
ఆల్ల సేతుల్ల గదలున్నాయా? గాండీవాలున్నాయా?

వెదురు బద్దల్లాంటి ఎముకల గూళ్ళు, వాళ్ళ శరీరాలు. పిడికెడు కండ లేని నడయాడే అస్థి పంజరాలు వాళ్ళు.
శ్రీశ్రీ చెప్పిన అస్థి మూల సంజరాలు ... ఆర్తరావ మందిరాలు .. వాళ్ళు .

ఈ పుస్తకాన్ని చదివి ఆనందించడానికి ఏమీ లేదు.

ప్రత్యక్షర విషాదం తప్ప.

కాలి పోతున్న, రంగు వెలసిన ఛిద్ర జీవితాల చిత్రణ తప్ప.

రకరకాల కుట్రలకి కునారిల్లి పోతున్న బతుకు గోస తప్ప.

చింతా అప్పల నాయుడికి బరువెక్కిన గుండెతో అభినందనలు.


































2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

followingall your blogs.sanskrit verses andmeanings are instructive .Iam now reading a great book on History of fine arts in India and the West. My two books will be p ublished in October.

కమనీయం చెప్పారు...

followingall your blogs.sanskrit verses andmeanings are instructive .Iam now reading a great book on History of fine arts in India and the West. My two books will be p ublished in October.

కామెంట్‌ను పోస్ట్ చేయండి