23, మే 2012, బుధవారం

కథా రచయితలు, కవులు కొలువుతీరిన ఈ అరుదైన ఫొటోకి ఇవాళకి అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !



బరంపురంలో 1979 జనవరి20, 21, 22 తేదీలలో అఖిల భారత రచయితల సమ్మేళనం వేడుకలు అపూర్వంగా జరిగేయి.
అప్పుడు తీసిన ఫొటో ఇది.
ఈ ఫొటోలో శ్రీ.శ్రీ, కాళీపట్నం రామారావు, వుప్పల లక్ష్మణ రావు, కె.వి.కృష్ణ కుమారి, చాగంటి తులసి, చాగంటి సోమయాజులు, బలివాడ కాంతారావు,  రామ మోహనరాయ్, శీలా వీర్రాజు, బలివాడ కాంతారావు, జ్వాలాముఖి, చలసాని ప్రసాద్. స్మైల్,  చెఱబండరాజు, వాకాటి పాండురంగారావు, కప్పగంతుల మల్లికార్జునరావు, భమిడిపాటి రామ గోపాలం, మంజుశ్రీ, అవసరాల రామ కృష్ణారావు, లత, వంటి ప్రముఖులతో పాటు వర్ధమాన రచయితలు దేవరాజు రవి, తాతా విశ్వనాథ శాస్త్రి,  మానేపల్లి సత్యనారాయణ, అరుణ్ కిరణ్, సస్యశ్రీ, ప్రసాద్, మల్లేశ్వరరావు, వంటి రచయితలు ఉన్నారు. విశాఖ నుండి రా.వి.శాస్త్రి ఈ సభలకు వచ్చినట్టే గుర్తు. వారు ఈ ఫోటోలో లేరేం చెప్మా ? 
ఈ సభలు జరిగేక, దాదాపు ఇరవై రెండేళ్ళ తర్వాత భ.రా.గో
 25 -4 -2002 తేదీ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో దీనిని ప్రచురించారు. ఫొటో లోని రచయితలను తాను గుర్తించి నంత వరకూ పేర్లు ప్రకటించారు.  దాదాపు 43 మంది రచయితల పేర్లు తెలిసిన వారు తెలియజేయమని కోరారు. ఎక్కువ మంది పేర్లు చెప్పిన వారికి
వంద రూపాయల విలువగల కథా సంపుటాలను బహుమతిగా ఇస్తానని కూడా
ప్రకటించేరు.  అప్పట్లో వారి ప్రకటనకి ఎలాంటి స్పందన వచ్చిందో నాకు గుర్తు లేదు. ఎంత మంది ఎందరి పేర్లు చెప్ప గలిగారోకూడా నాకు తెలియదు.
ఈ సభలు జరిగన తీరు గురించి కళ్ళకు కట్టే విధంగా భరాగో అప్పట్లో 28-1-1979 నాడు ఒక దిన పత్రికలో చక్కగా చాలా విపులంగా రిపోర్టు చేసారు కూడా !
ఇదిలా ఉంచితే,  ఈ ఫొటో ప్రచురిస్తూ భ.రా.గో గుర్తించిన రచయితలలో  మీది వరసలోని 11 వ వ్యక్తిగా వారు నన్ను పేర్కొన్నారు.  పంతుల జోగారావు ? అని
కొంచెం సందేహంగానే అన్నారు.
 వారు అనుకొన్నది సరి కాదు. ఆ వ్యక్తిని నేను కాదు. ఎవరో నాకూ తెలియదు.
ఆ సభలలో నేనూ పాల్గొన్నాను. కానీ, ఈ ఫొటోలో లేను. ఆ రోజు ఫోటో సెషన్లో మొదట తీసిన ఫొటో ఇది.
ఆ వెంటనే మరో ఫొటో కూడా ఇంత మంది రచయితల తోనూ తీయడం జరిగింది. ఆ ఫొటోలో నేను ఉన్నాను. నాతో పాటూ ఈ ఫొటోలో లేని  నేటి నవ్య సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ, ఆంధ్రభూమి ఉపసంపాదకులుగా చేసి ఇటీవల మరణించిన జ్యోత్స్న గారూ మొదలయిన మరికొంతమంది రచయితలం ఉన్నాం. మొదటి ఫొటోలో కనిపించని మరి కొంతమంది అందులో కనబడతారు. కొంత ఆలస్యంగా వచ్చి ఫొటోలో దిగిన ఆ రచయితలతో కూడిన ఫొటో ఎవరి దగ్గర దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు భ.రా.గో గారూ లేరు. ఈ ఫొటో లోని చాలా మంది రచయితలూ లేరు. తక్కిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో ?

ఏమయినా, ఈ అరుదైన ఫొటోకి ఇప్పుడు అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !


3 కామెంట్‌లు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

నిజంగానే ఇది చాలా అరుదైన ఛాయాచిత్రం. కానీ రచయితలు బడిపిల్లల్లా కింద కూర్చోవడమే కాస్త తమాషాగా ఉంది. ఈ రోజుల్లో ఒప్పుకోరేమో ?

తాడేపల్లి చెప్పారు...

ఏమీ అనుకోవద్దు. దీన్ని సరిగా శ్కాన్ చేసినట్లు లేదు. ఈ ఫోటోని పెద్దగా చేసుకు చూసినా అక్షరాల్లో స్పష్టత లేదు.

కథా మంజరి చెప్పారు...

తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు.
మీరన్నది నిజమే. ఫొటోని సరిగా శ్కాన్ చేయడం జరగ లేదు. న్యూస్ ప్రింట్ మరీ పాతది కావడం, శ్కాన్ చేయడంలో కొంత సాంకేతిక పరిణతి నాకు లేక పోవడం వల్ల ఈ ఇబ్బంది కలిగింది.
ఇక, రచయితలు బడి పిల్లల్లా కింద కూర్చోవడం గురించి ... అంత మంది రచయితలు ఒకే చోట కలవడం తటస్థిస్తే ఇప్పుడు కూడా చాలా మంది రచయితలు మరీ చిన్న పిల్లలయి పోవడం నాకు అనుభవైకవేద్యమే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి