27, మే 2012, ఆదివారం

కడుపు నింపిన కమ్మని పద్యం !








విద్యా లాభము నందగోరి యిటకున్ విచ్చేసి యున్నారమున్
విద్యా దేవి దయారసంబునన్జెప్పింపంగ నుప్పొంగుచున్
విద్యా బుద్ధియు నాయువున్ యశము సమ్యగ్వృద్ధి నారోగ్యమున్
విద్యా దేవతఁ గూడి మా కొసఁగు ముర్విన్ సింహశైలాథిపా !
ఈ పద్యం మా విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి ఉచిత విద్యార్ధి భోజన సత్రంలో రోజూ రెండు పూటలా భోజనాలకి ముందు విద్యార్ధులు పఠించే పద్యం. ఈ పద్యం గురించి తలచు కుంటేనే మాకు కడుపు నిండి పోయి నట్టనిపిస్తుంది.
ఎందుకో ఈ టపా కొంచెం ఓపికగా కడదాకా చదివితే మీకే తెలుస్తుంది.
వందేళ్ళ పైబడిన చరిత్ర కలిగిన ఈ భోజన సత్రంలో ఆ నాటి నుండి ఈ నాటి వరకూ వేల వేల విద్యార్ధులు రెండు పూటలా ఉచితంగా భోజనం చేసి, నగరం లోని వివిథ విద్యా సంస్థలలో చదువుకొని అభివృద్ధి లోకి వచ్చిన వారే. ఒక విధంగా ఈ భోజన శాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు. ఇదే లేక పోతే ఎంత మంది చదువులకి దూరమై పోయే వారో. విజయ నగర ప్రభువుల వితరణకీ, వారు చేసిన విద్యా సేవకీ నిదర్శనాలుగా శతజయంతులు చేసుకొన్న పలు విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ మహా రాజా సంగీత కలాశాల, మహారాజా వారి డిగ్రీ కలాశాల, మహారాజా ప్రభుత్వ సంస్కృత కలాశాల, వాటి అనుబంధ పాఠశాలలూ ... ఇలా వివిధ విద్యా సంస్థలతో మా విజయ నగరం నిజంగా విద్యల నగరమే.
ఈ విద్యా సంస్థలన్నీ ద్వారం నాయుడు గారూ, గురజాడ అప్పారావు గారూ, ఆది భట్ల నారాయణ దాసు గారూ, తాతా సుబ్బరాయ శాస్త్రులవారూ వంటి మహా మహులు పని చేసినవే కావడం గమనించాలి. ఇలాంటి గొప్ప విద్యా సంస్థలలో చదువు కోవాలని ఎక్కడెక్కడినుండో వచ్చే పేద విద్యార్థులకు ధనాభావం వారి చదువుకు ఆటంకం కలిగించ కుండా శతాబ్ది కాలం పైబడి ఈ భోజన సత్రం అమ్మ లాగా, అన్నపూర్ణలాగా ఆదుకుంటోంది. వారి కడుపు నింపుతోంది.
విజయ నగర ప్రభువులలో 1883 -1922ల మధ్య కాలంలో జీవించిన 4వ విజయరామ గజపతి మహా రాజులవారు దీని స్థాపనకు కారకులు. వీరు 3వ విజయరామ గజపతుల వారి సతీమణి అలక్ రాజేశ్వరీ దేవి గారి మేనల్లుడు. దత్తుడు. వీరి దత్తనామం పూసపాటి 4వ విజయరామ గజపతి. వీరి అర్ధాంగి లలితకుమారి గారు. ప్రసిద్ధి చెందిన కోరుకొండ సైనిక్ స్కూలు, ఇంకా, విజయ నగరం లోని సంస్కృత కలాశాలల భవన నిర్మాతలు 4వ విజయరామ గజపతులే. వీరి దత్తత చెల్లదంటూ దాయాదులు తెచ్చిన దావాయే పెద్ద దావాగా చాలా సంచలనాత్మకమైన దావాగా అందరకీ తెలిసినదే. ఈ పెద్ద దావా విషయం లోనే గురజాడ అప్పారావు గారు చాలా కృషి చేసి దావా గెలవడానికి పాటు పడ్డారు.
ఈ ముచ్చట్లన్నీ ప్రక్కన పెడితే, ఈ భోజన సత్రం ఏర్పాటుకి చెందిన ఒక ఆసక్తికరమైన కథ పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక రోజు సాయంకాలం 4వ విజయరామ గజపతి మహారాజుల వారు తమ కోట మేడ మీద చల్లగాలికి పచార్లు చేస్తూ ఉండగా బజారు వీధి గుండా నాటు బళ్ళు బారులు తీరి వెళ్తూ ఉండడం గమనించారుట. దివాన్ గారిని ఆ బళ్ళ గురించి ప్రభువులు ఆరాతీసారుట. సింహాచలం నుండి గజపతుల వారికి చెందిన భూముల పంటల నుండి వచ్చిన ఆదాయం రూపాయలలో ఆ బళ్ళ మీద రాజు గారి కోశాగారానికి తరలిస్తున్నారని దివాన్ చెప్పారుట. వెంటనే ప్రభువులు స్పందించి, సింహాచలం భూములనుండి సాలు సాలుకీ వచ్చే ఆ ఆదాయాన్ని తమ బొక్కసంలో కలిపేసు కోవడం సరికాదని, ఆ డబ్బుతో ఏదేని మంచి పని చేయాలని తలపెట్టారు. అలా వారి ఆలోచన నుండి ఆవిర్భవించినదే ఈ అన్నదాన సత్రం. తొలి రోజులలో విద్యార్ధులే కాక పేదలూ, యాత్రికులూ కూడా ఇక్కడి అన్నప్రసాదాన్ని స్వీకరించే వారుట. కాలక్రమంలో
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహం గా మారి నగరంలోని పలు విద్యా సంస్థలలో చదువుకోడానికి వచ్చే విద్యార్ధినీ విద్యార్ధులకు భోజన వసతి చేకూరుస్తోంది.ఈ అవిచ్ఛిన్న అన్నదాన క్రతువు , తంజావూరి అన్నదాన సత్రం కంటె భిన్నంగా అన్న దానంతో పాటు విద్యా దానం కూడా చేస్తోంది. అందుకే తంజావూరి అన్నదాన సత్రం సోమరులు అనే కథలు వ్యాప్తి చెందినట్టుగా ఇక్కడి భోజన సత్రం గురించి అలాంటి కథలేవీ లేవు. పైపెచ్చు ఇక్కడి సత్రంలో భోజనం చేసి, ఇక్కడి విద్యాలయాలలో చదువుకొన్న వారిలో దేశదేశాలలో కీర్తినందిన మహా మహుల జాబితా, నాకు తెలిసినంతవరకూ చెప్పాలంటే కూడా ఈ చోటు చాలదు.

నేను మా విజయనగరం సంస్కృత కలాశాలలో (కళాశాల కాదు, కలాశాల అనేదే సరైనదని మా గురువులు చెబుతారు) భాషాప్రవీణ చదివే రోజులలో ఇక్కడ 69 నుండీ 72 వరకూ భోజనం చేసి, చదువుకొన్నాను.
ఈ విద్యార్థి భోజన వసతి గ హాన్ని చౌల్ట్రీ అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఆ రోజులలో ఇక్కడ ప్రతి రోజూ రెండు పూటలా వివిధ విద్యా సంస్థలకు చెందిన 100 మంది విద్యార్ధినీ విద్యార్ధులం భోజనం చేసే వాళ్ళం ( ఇప్పుడీ సంఖ్య రెట్టింపయిందని తెలిసింది) ఆ నాటి ముచ్చట్లు కొన్ని మీతో పంచు కోవాలని ఇది రాస్తున్నాను.
భోజనం ప్రతి రోజూ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకీ, రాత్రి భోజనం 6 గంటలకీ పెట్టడం జరిగేది. ఈ వేళలు ఉదయం పూట పాఠశాలలకీ, కలాశాలలకీ వెళ్ళే వారికీ, రాత్రి చదువుకొనే వారికీ ఎంతో సదుపాయంగా ఉండేది. ఇక్కడి సమయ పాలన గురించి ఎంత చెప్పినా చాలదు. భోజనాలు వడ్డించే పెద్ద హాలులో విద్యార్ధలందరకీ సరిపడేలా పీటలు ఉండేవి. భోజనం అరిటాకులలో వడ్డించే వారు. ( ఇప్పుడు పీటలకు బదులు కూర్చోడానికి సిమెంటు బల్లలు కట్టారు. అరిటాకులకి బదులు స్టీలు కంచాలు వాడుతున్నారు. )
భోజనంలో అన్నం, పప్పు, నెయ్యి, ఒక కూర, పచ్చడీ, మజ్జిగా ఉండేవి. భోజనం ఏ విధంగానూ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంటుంది.
వేసవి శలవులు ముగిసి, నగరం లోని విద్యా సంస్థలలో అడ్మిషన్లు మొదలయ్యాక, అవసరం ఉన్న విద్యార్థులు ఈ సత్రంలో ఉచిత భోజనానికి కూడా అర్జీ పెట్టు కోవాలి. అలా వచ్చిన అప్లికేషన్ ల లో అర్హత గలవారికి, ఒక్కో విద్యా సంస్థకీ ఇన్ని సీట్లు చొప్పున సీట్లు కేటాయిస్తారు. మా రోజులలో ఈ చౌల్ట్రీ సీటు వచ్చే వరకూ చాలా మంది విద్యార్ధులకు మా గురువులే ఏదో ఒక త్రోవ చూపించే వారు. కొందరకి తమ ఇళ్ళ లోనే భోజనం ఏర్పాటు చేసే వారు. కొందరకి తామే స్వయంగా ఎవరింటి లోనో వారాలు కుదిర్చే వారు. ఇక సత్రం భోజనానికి సీటు వచ్చిందా, ఇక వాని చదువుకి ఏ అటంకమూ ఉండదు !
మా రోజుల సంగతి చెబుతాను ....
సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల వేళకీ, సాయంత్రం ఆరు గంటల వేళకీ మా భోజన సత్రం కళకళ లాడిపోతూ ఉండేది.
శ్లోకాలు వల్లిస్తూనో, కౌముది సూత్రాలు మననం చేసుకుంటూనో, చిన్న చిన్న సాహిత్య చర్చలు చేస్తూనో మా సంస్కృత కలాశాల విద్యార్థలం సందడి చేసే వాళ్ళం. కొత్తగా పద్యాలు అల్లడం అలవరచు కొంటున్న మా చింతా రామకృష్ణ ( ఆంధ్రామృతం బ్లాగరు) లాంటి వారు ఆశుపద్యాలు అలవోకగా చెబుతూ ఉండే వారు. ఊగరా !ఊగరా !! కథల ఫేమ్ స్వర్గీయ దాట్ల నారాయణ మూర్తిరాజు ( మాకు బాగా జూనియరు) ఖాకీ నిక్కరొకటి వేసుకుని, చేతిలో తాను తయారు చేసిన ఒక లిఖిత పత్రికతో తిరిగే వాడు. అప్పటి నుండీ పత్రికా సంపాదకుడు కావాలనే ఉబలాటం అతనిలో ఉండేది. అనంతర కాలంలో అయ్యేడు కూడానూ. ఇక, నేనూ, మా పీ.వీ.బీ శ్రీరామమూర్తీ అచ్చులో వచ్చిన మా కొత్త కథల గురించి మహా ఉత్సాహంగా కలబోసుకునే వాళ్ళం. ఓ ప్రక్క మా సంస్కృత కలాశాల విద్యార్ధుల సందడి ఇలా ఉంటే, మరో ప్రక్క సంగీత కళాశాల విద్యార్ధులు ఏవేవో రాగాలాపనలతో హోరెత్తించే వారు. డిగ్రీకాలేజీ విద్యార్ధులు మాకు తెలియని పాఠ్యాంశాల గురించి సీరియస్ గా మాట్లాడుకునే వారు. ఇదంతా మా నాని బాబు గారు విద్యార్ధుల అటెండెన్సు తీసుకోడం ముగించి, ఇక వడ్డనలు మొదలెట్టండి అంటూ హోలు లోకి వచ్చే వరకూ. పులి లాంటి ఆ మనిషి రాగానే అంతా గప్ చిప్. వడ్డన బేచ్ వడ్డన మొదలెట్టేది. సత్రం భోజనం చేసే విద్యార్ధులలోనే పదేసి మందిని వారానికో సారి మారుస్తూ వడ్డన బేచ్ గా నోటీసు బోర్డులో ఉంచే వారు. దాని ప్రకారం ఆ వారం రోజులూ రెడు పూటలా ఆ విద్యార్ధులు ముందు బేచ్ కి వడ్డనలు చేసాక, లేట్ బ్యాచ్ విద్యార్ధులతో కలసి అన్నాలు తిని తమ విద్యాసంస్థలకి వెళ్ళాలి.
ఒక విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యార్ధికీ ఈ వడ్డన బేచ్ లో వారం రోజుల పాటు వడ్డించాల్సిన పని రెండు మూడు పర్యాయాలు తగిలేది. కొంతమంది భోజన ప్రియులు ఐచ్ఛికంగా వడ్డన బేచ్ లో ఉండడానికి కుతూహలం చూపుతూ ఉండే వారు. అలాగయితే కావలసినతం తిన వచ్చునని వారి ఆలోచనగా ఉండేది. నిజానికి అక్కడ ఎవరికి కావలసినంత వారికి వడ్డన జరిగేది. వడ్డన బేచ్ కి ఉండే అవసరమే లేదు. కానయితే, కమ్మనయిన నెయ్యి కావలసినంత ముద్ద పప్పులో జారీతో ఒంపుకో వచ్చు ననే జిహ్వచాపల్యమే వారు
వడ్డన బేచ్ లో ఉండేందుకు ఇష్ట పడడానికి కారణమనుకుంటాను.
ఈ సత్రం భోజనాల నిర్వహణ చూసే మా నాని బాబు గారి గురించి చెప్పక తప్పదు !
కొంచెం మాసిన పంచె, తెల్లని పొట్టి చేతుల జుబ్బా, ‘సాదా సీదాగా కనిపిస్తూ,వృద్ధాప్యం మీద పడుతున్నట్టు కనిపించినా, కొంచెం బొంగురు గొంతుతో ఖణీమని మాట్లాడే పెద్ద గుమస్తా నాని బాబు గారంటే అందరకీ ఎంతో గౌరవం, భక్తీ ఉండేవి. అంతే ఇష్టం కూడా ఉండేది.
కర్తవ్య నిర్వహణలో నిబద్ధతా, గొప్ప మానవీయ దృక్పథమూ, కలిగిన నాని బాబు గారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలి.
మొత్తం వందమంది విద్యార్ధులనూ వారి వారి రోల్ నంబర్లతో పాటూ వారి పేర్లతోనూ గుర్తుంచుకొని పిలిచే వారు. సమయపాలన ఎంత ఖచ్చితంగా పాటించే వారంటే, ఏ రోజయినా భోజనాల వేళలో ఒక్క నిముషం అటూ ఇటూ అవనిచ్చే వారు కాదు. అర నిముషం ఆలస్యంగా వచ్చినా సరే ఆ పంక్తిలో కూర్చోడానికి వీలు లేదంతే. లేట్ బేచ్ కి వేచి ఉండాల్సిందే. వడ్డనల బేచ్, లేట్ బేచ్ వాళ్ళూ కూడా తినడాలు పూర్తయాక వచ్చే వాళ్ళు ఆ పూటకి వెనక్కి తిరిగి పోవలసినదే. అలాంటి వాళ్ళని ఒక్కోసారి రహస్యంగా వెనక్కి పిలిచి, ఓ పావలా చేతిలో ఉంచుతూ ఏ పకోడీలో కొనుక్కు తినరా నాయనా ! రేపటి నుండి లేటుగా రాకేం !’’ అని హెచ్చరించే వారు. విద్యార్ధుల అటెండెన్సు విషయంలో ఇంత కఠినంగా ఉండే నాని బాబు గారు ఒక్కడి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చే వారు. వాడే మా ఆచారి.
ఆ రోజుల్లో మా కలాశాల విద్యార్ధి ఒక ఆచారి ఉండే వాడు. ( పేరు కావాలనే చెప్పడం లేదు) వాడు అమిత భోజన ప్రియుడు. తిండి పుష్ఠి జాస్తి. అందు చేత పెద్ద గుమస్తా నాని బాబు గారు, వాడు సరైన వేళకే సత్రానికి వచ్చినా, ఎప్పుడూ కావాలనే లేట్ బేచ్ కి ఉంచేసే వారు ! ‘‘ నువ్వుండరా, లేటు బ్యాచ్ లో తిందువుగాని !’’ అంటూ ...
అలాగయితే వాడు కావలసినంత తింటాడని !
వాడు ఒక్కడూ ఒక మూలకి చేరి తనే స్వయంగా వడ్డించుకు తింటూ ఉంటే, ‘‘ ఒరే, ఆచారీ, ఆ నేతి జారీలో నెయ్యిని ఒక్క చుక్కయినా మిగిల్చేది ఉందా, లేదా !’’ అంటూ నవ్వుతూ, ఎంతో దయగా పలకరించే వారు !
వారి దయాస్వభావానికి మరో మంచి ఉదాహరణ చెబుతానఒక యేడాది సత్రం భోజనాలకి సెలక్టు చేసిన విద్యార్ధుల జాబితా సత్రం నోటీసు బోర్డులో ఉంచారు. అందులో పొరపాటున ఒక విద్యార్ధి పేరుకు బదులు ఇంకొక విద్యార్ధి పేరు టైపు చేయడం జరిగింది. ఇద్దరి పేర్లూ, ఇంటి పేర్లూ, తండ్రుల పేర్లూ ఒకలాగే ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగింది. అయితే, ఆ విద్యార్ధులిద్దరూ ఒకే పాఠశాలకి చెందిన వారు మాత్రం కారు. లిష్టులో తను చదివే పాఠశాల పేరు తప్పుగా ఉన్నా, తన పేరు చూసుకొని ఒక విద్యార్ధి రోజూ వచ్చి భోజనం చేయడం మొదలు పెట్టాడు. అసలు సీటు వచ్చిన విద్యార్ధి మాత్రం తనకు సీటు లభించ లేదనే నిరాశతో వాడి స్వతం గ్రామం వెళ్ళి పోయాడు. వారం రోజులకి జరిగిన ఈ పొరపాటు ఎవరో గుర్తించడం జరిగింది. అంతే. ఇంత వరకూ వస్తున్న విద్యార్ధిని సత్రం నుంచి తొలగిస్తూ ఇకపై రావద్దని నోటీసు ఉంచారు. అసలు విద్యార్ధికి సీటు ఇచ్చినట్టుగా వర్తమానం చేసారు. ఇదంతా పై అధికారుల స్థాయిలో జరిగింది. అంతే పెద్ద గుమస్తా నాని బాబు గారు అగ్రహోదగ్రులయ్యేరు ! ‘‘ వాడికి సీటు రాక పోవచ్చును. ఏదో పొరపాటు జరిగి ఉండ వచ్చును. వాడు ఈ వారం రోజులుగా శ్రీ సింహాచల స్వామి వారి అన్న ప్రసాదం తింటున్నాడు. ఇవాళ వాడి నోటి ముందు కూడు తీసేస్తామనడం సరి కాదు. కావాలంటే వాడికీ వీడికీ కూడా సీట్లు ఇవ్వండి. ’’ అంటూ అధికారులతో వాదులాడేరు. అధికారులు అది సాధ్యం కాదు పొమ్మన్నారు. ‘‘ స్వామి ప్రసాదం తింటున్న వాడిని కాదని పొమ్మనడం నా వల్ల కాదు. వాడిని సత్రం నుండి తొలిగిస్తే, నన్నూ ఈ ఉద్యోగం లోనుండి తొలగించండి. నేను రాజీనామా చేస్తున్నాను ’’ అని నాని బాబు గారు పెద్దలతోకుండ బ్రద్దలు కొట్టేలా చెప్పారు. ఆ మానవతా దృక్పథానికి, న్యాయ పోరాటానికీ అధికారులు దిగి వచ్చేరు. సత్రం చరిత్రలో ఏ యేడూ లేని విధంగా ఆ ఏడాది నూటొక్క మంది కి సీట్లు ఇవ్వడం జరిగింది !
ఒక పేద గుమస్తా మానవత్వంతో సాధించిన గొప్ప నైతిక విజయమిది !
మేము భాషాప్రవీణ నాలుగో సంవత్సరంలో ఉండగా నాని బాబు రిటైరయి పోయారు. మేమంతా చందాలు పోగు చేసుకొని నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. సత్రంలో మేం భోజనాలు చేసే పెద్ద హాలు ఒక్కటే ఉంది. అక్కడే నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం జరుపు కోవాలని తలపెట్టాం. కార్యక్రమం సాయంత్రం అయిదింటికి మొదలయింది. పావు తక్కువ ఆరు అవుతోందో , లేదో,, ‘‘ ఇహ చాలు ! భోజనాలకి లేవండి !’’ అంటూ, తటాలున కుర్చీ లోనుంచి లేచి పోయేరు పెద్ద గుమస్తా గారు. మేమంతా బిక్క చచ్చి పోయేం.
ఇంకా సభా కార్యక్రమం చాలా ఉంది.
వేయాల్సిన దండలు ఇంకా చాలా ఉన్నాయి.
మా సంస్కృత కలాశాల విద్యార్ధి కవులు రాసు కొచ్చిన కవితలు చదవడం ఇంకా పూర్తి కానే లేదు.
సంగీతం కలాశాల పిల్లలు ఆయన గురించి స్వర పరచుకొని వచ్చిన పాటలు పాడడమే కాలేదు.
పెద్దల ప్రసంగాలు సగమైనా కాలేదు.
చదవాల్సిన సన్మాన పత్రాలు చదవనే లేదు.
మా అందరకీ ఎంతో అసంతృప్తిగా ఉన్నా, ఆయన మాటలు కాదన లేని స్థితి. అసలు సమ్మానితుడే స్టేజి దిగి పోయేక, ఇంకా సన్మాన కార్యక్రమ మేమిటి !
భోజనాలు రాత్రి తొమ్మిది వరకూ. లేటు బ్యాచి వాళ్ళూ, వడ్డన బ్యాచి వాళ్ళూ తినడాలు పూర్తయి,
పని వాళ్ళు హాలంతా శుభ్రం చేసాక కార్య క్రమం మళ్ళీ మొదలెడదామని ఉబలాట పడ్డాం. ఎలాగయితేనేం వారిని మరో గంట సేపు కార్యక్రమం జరపడానికి బలవంతం మీద ఒప్పించాం. అయిష్టంగానే ఒప్పుకొన్నారు.
ఆ కాస్సేపూ ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నారు. ఆ గంటా కాగానే ‘‘ ఇక ఈ ఆటా పాటా చాల్లెండర్రా !
ఇళ్ళకు పోయి చదువుకోండి ’’ అనేసి మళ్ళీ వేదిక దిగి పోయారు మా నాని బాబు గారు.
దండలు వేస్తామంటే ఒంటెల్లా మెడలు చాచుకు కొని తయారయి పోయే వాళ్ళని చూస్తాం. ఇలాంటి నిరాడంబర మయిన మానవతా వాదులనీ, కర్తవ్య పరాయణులనీ ఎక్కడో కానీ చూడం ! కదూ !
.కడుపు చల్లని తల్లి మా విజయ నగరం. అక్కడ భోజనం చేసి చదువుకొన్న వారెవరయినా, ఆ ప్రాంతాలకు వెళ్ళి నప్పుడు ఏమాత్రం వీలున్నా మా శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహాన్ని కళ్ళారా ఒక్క సారయినా చూసు కోనిదే రారు.
రోజూ కాక పోయినా, ఎక్కడయినా పంక్తి భోజనాలు జరిగే టప్పుడు అక్కడ భోజనం చేసిన వారికి ఈ పద్యం గుర్తుకు రాక తీరదు.
ఎందు కంటే, ఎందరికో కడుపు నింపిన కమ్మని పద్యం కదా యిది !

17 కామెంట్‌లు:

kiran చెప్పారు...

Chala bagumdi sir. Chadivaka naa kadupu kuda nindi poyimdi.

kiran చెప్పారు...

Very nice sir. Chadavagane naa kadupu kuda nindi poyimdi. A rojulu aa apyatalu peddala yedala gourava bhavam ivanni neti taraniki teliyani padalu.

Thank you very much for this post.

www.apuroopam.blogspot.com చెప్పారు...

చదువుతుంటే కడుపు నిండి పోయే కబుర్లు చెప్పారు. ఆ అన్నసత్రం ఎంతమంది విద్యార్థుల క్షుదార్తిని తీర్చి వారి విజ్ఞాన సముపార్జనకు దోహద పడిందో ఆ విదంగా వారికి జీవనో పాధి కలిగించిఉంటుందో తెలియలేము.విజయనగర రాజుల ఔదార్యానికీ విద్యల పోషణయందు వారికి గల శ్రధ్ధకూ ఇది నిదర్శనం కాదా?

కథా మంజరి చెప్పారు...

కిరణ్ గారూ, గోపాల కృష్ణ గారూ మీ స్పందనలకి ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

అద్భుతమైన విషయాన్ని చక్కగా హత్తుకునేలా చెప్పారు, జోగారావు గారు. విజయనగరం రాజావారి వితరణ చిరస్మరణీయం.

raghav చెప్పారు...

Oka manchikaryakramam oka unnatha maina vyakthithvam gurinchi telusukoni kadupu nindi poindi.
Dr,Raghavendra rao.
Parvatipuram.

కథా మంజరి చెప్పారు...

SNKR గారూ ధన్యవాదాలండీ.
డా.రాఘవేంద్ర రావు గారూ, మీ నుండి నా టపాకి స్పందన రావడం నన్ను ఎంతగా ఆనంద పరచిందో చెప్ప లేనండీ. పార్వతీపురం వచ్చినంత ఆనందంగా ఉంది.
మీ వంటి పెద్దల ఆశీర్వాదాలు సదా ఉండాలని కోరుకుంటూ
ఉన్నాను.

కథా మంజరి చెప్పారు...

శ్రీ ఓలేటి శ్రీనివాస భానే ఇలా మెయిల్ చేసారు


ఎంత గొప్పగా రాసావన్నా! నువ్వు మాత్రమే రాగల, నీకు మాత్రమే సాధ్యమైన శైలి లో - సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ చేతి గోరుముద్దలు తిన్నంత తృప్తి
కలిగింది..కడుపు నిడటం తో పాటు తెలీకుండానే కన్ను తడిబారింది. శ్రీ శ్రీ గారూ నిర్వచించిన రసన అంటే ఇదే కాబోలు. శ్రీ వరాహ గిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని స్వీకరించే అవకాశం 1971 లో నాక్కూడా వచ్చి త్రుటి లో జారింది. విజయ నగరం రాజా వారి కాలేజ్ లో బి.ఏ (స్పెషల్ తెలుగు)
లో సీట్ వచ్చినా బొబ్బిలిలి లో కాం గా బీకాం చదవాల్సి రావడమే అందుకు కారణం. చౌట్రీ లో ప్రసాదం మీద నా పేరు రాసిపెట్టలేదు మరి.

కమనీయం చెప్పారు...

ప్రియమైన జోగారావు,నీ జీవితంలో నాకు తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి.ఘంటసాల వారు ఈ సత్రంలోనే భోజనం చేసే వారనుకొంటాను.ఇన్నాళ్ళు ఈ సత్రాన్ని ఆనందగజపతి మహారాజు కట్టించేరని అనుకొనే వాణ్ణి.అంత ప్రఖ్యాతి పొందిన ఆయన చేసిన ధర్మకార్యాలేమిటి ?తెలుసుకోవాలనిఉంది.అభినందనలతో -రమణారావు.

కమనీయం చెప్పారు...

ప్రియమైన జోగారావు,నీ జీవితంలో నాకు తెలియని విషయాలు ఇందులో ఉన్నాయి.ఘంటసాల వారు ఈ సత్రంలోనే భోజనం చేసే వారనుకొంటాను.ఇన్నాళ్ళు ఈ సత్రాన్ని ఆనందగజపతి మహారాజు కట్టించేరని అనుకొనే వాణ్ణి.అంత ప్రఖ్యాతి పొందిన ఆయన చేసిన ధర్మకార్యాలేమిటి ?తెలుసుకోవాలనిఉంది.అభినందనలతో -రమణారావు.

కథా మంజరి చెప్పారు...

రమణా రావు గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
ఆనంద గజపతి మహా రాజు గురించి నాకు లభ్యమానమైన సమాచారాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. చూడండి:


ఆనంద గజపతి ( 1850 -1897 ) అభినవ ఆంధ్ర భోజునిగా వాసి కెక్కారు. జగన్మోహనమైన సుందర రూపం వీరిది. దేశభక్త కొండా వెంకటప్పయ్య వీరి రూపం అఅత్యంత నిపుణుడైన శిల్పి చెక్కిన బంగారు ప్రతిమ వలె ఉంటుందనీ, ఎన్ని సార్లు చూసినా తనివి తీరదనీ తమ స్వీయ చరిత్రలో రాశారు ! అందంతో పాటూ వినయం, కావ్య శాష్త్ర పాండత్యం, వితరణ వీరి ఆభరణాలు. తర్క వ్యాకరణాలలో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి వీరికి అపారం అని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు చెప్పారు. వీరు పోషించని కళ లేదు. అభివృద్ధి చేయని విద్య లేదు అంటారు. వీరి ఆనంద సాహితీ విజయం భువన విజయాన్ని తలపింప చేసేదిట.దూర్వాసుల సూర్యనారాయణ శాష్త్రి, గురాచార్య వెంకట రమణ మొదలయిన వైణికులు, కొల్రు కామ శాస్త్రి, మండా లక్ష్మీ కామేశ్వర శాస్త్రి, ముడుంబై నరసింహాచార్య స్వామి వంటి గొప్ప పండితులు వీరి ఆస్థానంలో ఉండే వారు. ఇక హరికథా పితామహులు ఆది భట్ల నారాయణ దాసు, వీరి ఆస్థానానాకే వనెన తెచ్చిన మహా హరి కథకులు కదా. ఇక గురజాడ గురించి వేరే చెప్ప వలసిన పని లేదు.
వీరి సాహిత్య పోషణ గురించి చెప్పాలంటే, రుగ్వేదానికి మాక్సు ముల్లరు వ్రాసిన వ్యాక్యానం పునర్ముద్రణకు ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు ఇచ్చారుట. తమ పూర్వీకులు విద్యా వ్యాప్తికి ఎన్నో విద్యా సంస్థలను ప్రారంభిస్తే వీటిని మరింత ఘనంగా పోషించిన విద్యల రాజు ఈ విజయనగర రాజు ఆనంద గజపతి.
విజయ నగరం మహా రాజా కలాశాల వీరి కాలంలోనే First Grade college గా 1881లో రూపు దద్దుకుంది. ఈ నాటి మహిళా కలాశా ఆనాటి వీరి దర్బారు హాలు.
తిరుపతి కవులు ఆనంద గజపతి వారి గురించి చెప్పిన ఆశువు ప్రసిద్ధమే కదా.
వారి కవితా కన్యక ఎంత మందిని చూపించినా వరియించ లేదట. అయితే ఆనంద గజపతి మమా రాజులని చూపగానే తటాలున అంగీకరించిదట.
పద్యం చూడండి :
ఎందఱఁ జూపెనేని వరియింపదు మా కవితా కుమారి , క
న్నందుకుదేశముల్ తిరుగుటబ్బెను, సైఖ్యము లేక పోయె, నా
నంద నృపాల ! నీదు సుగుణమ్ములు చెప్పిన నాలకించి వెం
టం దలయూచెఁ గావున దటాలున దీని పరిగ్రహింపుమా !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అత్యద్భుతమైన దివ్యానుభూతిని మరువరాని మహనీయ అన్నప్రదాత ఐన అన్నపూర్ణను నీ బ్లాగు ద్వారా స్మరణకు తెచ్చావు! నీవు వ్రాసిన ప్రతీ అక్షరంలోనూ మన కదలికలు, అలనాడు మనలను కన్న బిడ్డలకంటే కూడా ఎక్కువగా చూచిన మన నానిబాబుగారినీ కంటి ముందు నిలబెట్టి ఆనంద భాష్పాలు నాచేత రాల్పించావు. నీలో అణువణువూ నిండియున్న కృతజ్ఞతా భావము దివ్య సంస్కృతి నీవు వ్రాసిన ఈ అంశంలో సుస్పష్టమౌతోంది.
మనం అన్నసత్రవులో ప్రతీ రోజూ భోజనాత్పూర్వం చేసే ప్రార్థన మొత్తం వ్రాస్తే మరీ ఆనందదాయకంగా ఉంటుంది.
ఏది యేమైనా మళ్ళీ అలనాటి దివ్యస్మృతులు శరీరంలో జవ జీవాలను పెంచేలాగ చేసిన నీకు బహుదా ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

మాస్టారూ.... మనసు నిండిందండీ...

vskrishna6 చెప్పారు...

EXCELLENT AND VERY WELL WRITTEN.

కథా మంజరి చెప్పారు...

ఫణిగారూ, కృష్ణ గారూ ధన్యవాదాలండీ ..

swathi చెప్పారు...

chala chala bagundi.

కథా మంజరి చెప్పారు...

స్వాతి గారూ ధన్యవాదాలు. ఈ టపా ఎంతో ఆర్తితో రాసేను. విజయ నగరంలోని ఆ అన్నదాన సత్రవు ఇప్పటికీ వందలాది మందికి ఉచిత భోజన సదుపాయాన్ని కలిగిస్తోంది.విద్యార్ధుల సంఖ్య కూడా మూడింతలయిందని తెలిసింది.

ఒక విషయం, ఈ సత్రంలో భోజనం చేసే విద్యార్థులకు ఎవరికయినా గవర్నమెంట్ స్కాలర్ షిప్ వస్తే మాత్రం అక్కడ భోజనం ఉచితం కాదు. మెస్ బిల్ కాలేజీలకి నంపిస్తారు. కాలేజీ వారు ఆ బిల్ మొత్తాన్ని సత్రం వారికి చెల్లించి, తక్కినది విద్యార్ధులకి ఇస్తారు. ఆ విధంగా నాకు మెరిట్ స్కాలర్ షిప్ వచ్చి ఉండడం వల్ల నాకు అక్కడ భోజనం ఉచితం కాదు. కానీ నాకు ఆ భావన ఎప్పుడూ కలగ లేదు. శ్రీవరాహ నృసింహ స్వామి వారి ఉచిత అన్న ప్రసాదంగానే దానిని భావిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి