26, జులై 2013, శుక్రవారం

తెలుగు పద్యం చిరంజీవి



కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అంటూ లోగడ ఓ బ్లాగు టపా రాసేను. దానిని  ఇక్కడ నొక్కి చదవొచ్చును. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ పద్యం మీద ఓ రెండు పద్యాలు చూడండి ...

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెదనంచు
నున్మాదియై ప్రేలుచున్నవాడు ?

పద్యమ్ము నెవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగు వాడు ?

పద్యమ్ము ఫలమురా ! పాతిబెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసఁగు !

పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితి మేము
లోకుల హృదయాల లోతులందు !

ఇప్పుడద్దానిఁబెకలింప నెవరి తరము ?
వెలికి తీసి పాతుట యెంతటి వెఱ్ఱితనము ?
నిన్నటికి మున్ను మొన్ననే కన్నుఁదెఱచు
బాల్య చాపల్యమున కెంత వదఱుతనము !?


( కడిమెళ్ళ వర ప్రసాద్ )

పద్యం మీద మరో పద్యం చూడండి ...

పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ సం
హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.

( వద్దిపర్తి పద్మాకర్ )

                                              తెలుగు పద్యం చిరంజీవి..







5 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

తెలుగు పద్యం చిరంజీవియే అని గర్జించటం వల్ల నాకు పెద్దగా ఉపయోగం కనిపించటం లేదు. ఇలా అన్నందుకు మన్నించాలి.

తెలుగుపద్యానికి పెద్దగా పాఠకులు కనిపించటం లేదు. ఇది నా స్వాభిప్రాయం.

ప్రస్తుతం శ్యామలీయం బ్లాగులో నేను 'పాహి రామప్రభో' శీర్షికన చాలా నెలలుగా పద్యాలు వ్రాస్తున్నాను. చదివే వాళ్ళ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్ట వచ్చు. ప్రస్తుతం కొద్ది రోజులనుండి శ్రీరామచంద్రులవారి మానసిక పూజావిధానం మీద వ్రాస్తున్నాను. వీటిలో ఒక్కో‌పద్యానికి మహా అయితే అరడజను మంది చొప్పున చదువరులు కనిపించారు నాకు. ఇదీ తెలుగు పద్యం పరిస్థితి!

ఒకవేళ నా అంచనా తప్పు కావచ్చును. ఎందుకంటే, (౧) నేనేమంత పేరున్న పద్యకవిని కాకపోవటం (౨) ఎంత తేట తెలుగులో వ్రాసినా, చదువరులకి నా పద్యాలు అంత అందంగా కనిపించక పోవటం (నా పద్యాలు నాకు బాగుందటానికేం‌ లెండి, కాకిపిల్ల కాకికి ముద్దు!!) (౩) నిత్యం పద్యాలూ - సమస్యాపూరణాలూ అంటూ‌ హడావిడి చేసే బ్లాగర్లు సైతం ఈ‌ పద్యాల ముఖం చూడటానికి ఆసక్తి చూపనప్పుడు, కాస్త చదవగల వారి దృష్టిలో కూడా పడని ఈ‌ పద్యాలేవీ ఇతర పాఠకుల దృష్టికే రాకపోవటం. (౪) నేనింకా రాముడూ భక్తీ అంటూ‌పాతచింతకాయ ధోరణిలో వ్రాస్తూ ఉండటం.... ఏమో‌ఇంకా ఎన్నెన్ని కారణాలున్నాయో.

నా ఊహలు అన్నీ తప్పై, తెలుగుపద్యాల పట్ల ప్రజలకు ఆసక్తి ఉండాలనీ, అది ఇంకా బాగా పెరగాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కథా మంజరి చెప్పారు...

శ్యామలీయం గారూ, స్పందించి నందుకు ముందుగా ధన్యవాదాలు.
మీ ఆవేదన అర్ధం చేసికో తగినదే. కాని నేను చెప్పేది ఏమిటంటే, ఈ బ్లాగు టపాల కు అంతగా చదువరులు ఉండడం లేదనీ, చదివిన వాళ్ళు కూడా కామెంట్లు పెట్టడం లేదనీ బాధపడి లాభం లేదు.
కాని తెలుగు పద్యం చిరంజీవి. మీ పద్యాలు నేను చాలా చదివేను. ఒకటి రెండు సార్లు మెచ్చుకుంటూ కామెంట్లు కూడా ఉంచాను. మీది మంచి ధార
మీ కవితా సేద్యం వృథా కాబోదు. కాలాంతరంలో విరగపండుతుంది. మీ కవిత్వం బ్లాగు టపాల రూంలో పడి ఉండకుండా పుస్తక రూపంలో వచ్చేలా చూడండి.
ఇక, సమస్యాపూరణల హడావిడి గురించి నాకు ఏమంత ఆసక్తి లేదు. అలాగే, తెలుగు పద్యం ఇప్పుడిప్పుడే తిరిగి జనాలకి చేరువ అవుతుంని తలస్తున్న రోజులలో కొంత మంది గర్భ కవిత్వాలూ, చిత్ర కవిత్వాలూ అంటూ సర్కస్ ఫీట్ల కవిత్వ రచనలు చేయడం కూడా నేను హర్షించను.

ఒక జాషువా, ఒక కరణశ్రీ, ఒక మధునా పంతుల, ఒక దువ్వూరి రామి రెడ్డి లాంటి కవి ప్రభంజనం వచ్చి చక్కని పద్య రచనలు చేస్తే చిరంజీవి తెలుగు పద్యం బలపడడం మరింత వేగవంత మైతుంది.
మీలాంటి పెద్దలు రాముడూ, భక్తీ అంటూ నేనింకా పాత చింతకాయ పచ్చడి ధోరణిలో ఉన్నానేమో అని శంకించడం ఎంత మాత్రం తగదు. అయితే, వాటితో పాటు మీద పేరకరొన్న కవుల మాదిరి మీరు కూడా చక్కని ఖండ కావ్యాలు వెలువరించండి. మీరందుకు సమర్ధులని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను.
సక్రమ మార్గంలో తెలుగు పద్యం రుచిని పాఠక శ్రేణికి పరిచయం చేస్తే తెలుగు పద్యం మరింత పాఠకులకు చేరువ అవుతుంది.
నాకున్న అల్ప ప్రఙ్ఞతో నేను చేస్తున్న పని అదే. లోడ నవ్య వార పత్రికలో ఒక ఏడాది పాటు తెలుగు పద్యం వెలుగు జిలుగులు అని శీర్్షికన నిర్వహించాను. ప్రస్తుతం ఆంధ్ర భూమి మాస పత్రికలో అదే శీర్షికను తేనెలూరే తెలుగు పద్యం పేరుతో ఆరేడు నెలలుగా నిర్వహిస్తున్నాను. నా ధ్యేయం ఒక్కటే. తెలుగు పద్యం రుచిని ఈ తరానికి తెలియ చేయాలి. అందుకు నా సాహిత్య ఙ్ఞానం చాలక పోయినా, నాకంత సమర్ధత లేక పోయినా పెద్దల వ్యాఖ్యానాలను చదివి వాటిని జోడిస్తూ సాహసించి ముందుకు పోతున్నాను.

అందు చేత మీరు మీ మార్గంలో పయనిస్తూనే, చక్కని కవితా ఖండికలు వ్రాయమని కోరుతున్నాను. తెలుగు పద్యం చిరంజీవి అనే నాటపా మిమ్ములను చాలా
డి స్ట్రబ్ చేసిందని భావిస్తూ మన్నించమని కోరుతున్నాను

చివరిగా ఒక మాట. బ్లాగు టపాలకు కామెంట్లూ, ఫేస్ బుక్లో లైక్ లు కొట్టడాలూ ఎలాంటివంే, నా వీపు నువ్వు గోకితే, నీ వీపు నేను గోకుతా లాంటివి.
ఇది అందరికీ వర్తించదు. మంచి అవగాహనతో కవ్చిత్తుగా అప్పుడప్పుడూ తెలియని వారు సైతం కామెంట్ల పెడుతూ ఉంటారు. వారి కోసమయినా రాయాలి కదా.

శ్యామలీయం చెప్పారు...

జోగారావుగారూ
మీ‌టపా నన్నేమీ disturb చేయలేదండీ.
కామెంట్లు రాలటం లెదనీ నేనేమీ విచారించటమూ లేదు.
అయ్యో పద్యం చదివించలేకపోతున్నానే అని విచారం అంతే.
ఖండకావ్యాలు తప్పక వ్రాస్తాను. అదీ‌ త్వరలోనే!

కమనీయం చెప్పారు...



నేను పద్యాలు,మాత్రాబద్ధ గేయాలు,వచనకవితలూ,మూడింట్లో కవిత్వం వ్రాసి ప్రచురించాను.కొంత స్పందన,మెప్పుకోలు లభించింది.అసలు ఏ రకం కవిత్వానికైనా మనదేశం లోనేకాదు,ఇతరదేశాల్లో కూడా అంతగా ఆదరణ లేదు.ప్రాచీన కళారూపాలు చాలా మరుగున పడిపొతున్నాయికదా!మనప్రయత్నం మనం చెయ్యడమే కర్తవ్యం.ఆపైన ఎలా జరుగుతే అలా జరుగుతుంది.కాని ప్రయత్నం మానకూడదు.

అజ్ఞాత చెప్పారు...

పద్యమనంత సుశ్రవణ బంభర సుస్వర మేదురంబునై
హృద్యమునై, హృదాబ్జమున శ్రేయ సుధా పరికల్పనార్హమై,
అధ్యయనీయమై, కవికి హారతి పట్టు విధంబు నొప్ప, నై
వేద్యము బంధ చిత్రములు విశ్వ విభాసిని వాణికెప్పుడున్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి