21, జనవరి 2015, బుధవారం

సరసం విరసం కానంత వరకూ మానసోల్లాసమే కదా !


మొగుడూ పెళ్ళాలన్నాక, ఆ పాటి మాటా మాటా అనుకోరా యేమిటి ?
మీ వాళ్ళు ఇలాగంటే, మహ చెప్పొచ్చారు లెండి, మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ? అని ఒకరి నొకరు దెప్పి పొడుచు కోవడం, మూతులు ముడుచు కోవడం, అలకలు, ముక్కులు చీదు కోవడాలూ, మాటలు మానెయ్యడాలూ, కూరలు తగలెయ్యడాలూ, ఉపాహారం తిన కుండానే వీధిలోకో, ఆఫీసుకో వెళ్ళి పోవడాలూ. ఆ తరువాత అయ్యో అనుకోడాలూ, తప్పంతా నాదే, నేనే ఊరికే రెచ్చ గొట్టేను, పాపిష్ఠి దాన్ని ( లేదా ) మూర్ఖపు వెధవని అనుకోడాలూ, సాయంత్రానికి వేడి వేడి పకోడీలు చేయడాలూ, కమ్మని కాఫీలు పెట్టడాలూ, మూరల లెక్కన మల్లెలో, సన్నజాజులో బేరమాడడాలూ, క్షమాపణలూ వగైరాలయేక, కరిగి పోవడాలూ ... ఇదీ సాంసారిక మాధుర్యం.
ఆది దంపతుల సరస సల్లాపాలు గమనిస్తే, అమృతోపమానమైన సరస సంభాషణతో భార్యా భర్తలు తమ దాంపత్యాన్ని ఎంత ప్రఫుల్లంగా, మధుర కావ్యంలాగున, తేనె వాక లాగున, ఇంద్ర ధనుస్సుల్లాగ మలచు కో వచ్చునో అవగత మవుతుంది.
చూడండి మరి :
క్వతిష్ట తస్తే పితరౌ మమేతి
అపర్ణ యోక్తే పరిహాస పూర్వం
క్వవా మమేవ శ్వసురౌ తవేతి
తామీరయన్ సస్మిత మీశ్వరోవ్యాత్
( శ్రీ కృష్ణకర్ణామృతమ్ )

దీనికి తెలుగు సేత:
‘నాకున్న తల్లి దండ్రులు
మీ కేరీ ’ యని యపర్ణ మేలము లాడన్
‘నాకున్న యత్త మామలు
నీ కేరీ’ యనుచు నగు త్రి నేత్రుని గొలుతున్ !
‘‘నాథా, నాకున్న మాతాపితరుల వంటి వారు నీకు లేరు. మా తలిదండ్రులు అంత గొప్ప వారు’’ అంటూ పార్వతి శివుడిని మేలమాడింది.
‘‘ పోదూ, మీ వాళ్ళ గొప్పలు నువ్వే చెప్పాలి. చాలు. చాలు. నాకున్న అత్త మామలు నీకు లేరులే !’’ అని బదులు చెప్పాడుట పరమ శివుడు. శివ పార్వతుల సల్లాపం ఎంత మనోహరంగా ఉన్నదో చూసారా ?
అర్ధనారీశ్వరత్వానికి అర్ధం, పరమార్ధం అదే.

స్వస్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి