8, జనవరి 2015, గురువారం

చిన్నప్పటి నుండి వాడు తేడాయే !

ఒక చక్కని దత్త పది ...




పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం.
ఈ చక్కని దత్తపది చూడండి ... 

  పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నేయిలను గల్గ దిట్టియహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !


భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)
వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.
ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.
వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.
ఇక భారత యుద్ధం తప్పదు !

వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :
రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను   కననే ? మూర్ఖత వానిని  ఊనెను

కనన్, ఏ + ఇలన్   =  ఏ లోకంలో నయినా ఉందా ?
వానిన్ + ఊనెన్.    =  వానిని మూర్ఖత్వం  పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
వాడసలు చన్నప్పటి నుండీ తేడాయే!
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి