4, మార్చి 2015, బుధవారం

చింకి లెక్చరు ... అను ... ఈ కథా మంజరి బ్లాగును మీరింక చదవొద్దు !


ఉదయాన్నే ఫోనొచ్చింది. పానకాల రావు చేసాడు. బుధవారం మధ్యాహ్నం రెండింటికి కుటుంబంతో పాటు వస్తాడుట. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. భోజనం చేసే వస్తాం కనుక ఆ ఏర్పాట్లేవీ చేయ నవసరం లేదని , కావాలంటే సాయంత్రం ఏ నాలుగింటికో చెల్లెమ్మ ఓపిక ఉంటే కరకరలాడేలా ఏ పకోడీలో, ఘుఘుమలాడే బజ్జీలో చేస్తే సరిపోతుందని భరోసా యిచ్చేడు. వాడు మాఇంటికి వచ్చేటప్పుడు మెనూ వాడే నిర్ణయిస్తాడు. నా గుండెలో రాయి పడింది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి ఇండియా పాకిస్తాన్ లు ఆడే కీలకమైన వన్ డే క్రికెట్ మేచ్ ఉంది. పానకాల రావుకీ, వాడి పెళ్ళానికీ కూడా క్రికెట్ మోజు లేదు. అసలు వాళ్ళకి క్రికెట్ గురించి తెలుసో లేదో కూడా అనుమానమే. వాడి పిల్లలకి మాత్రం క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం, ఈ కాలపు పిల్లలు కదా. అయితే వాళ్ళు ఇల్లు తీసి పందిరేస్తారు. టీ.వీలో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడయితే మరీనూ. వాళ్ళ అల్లరీ ఆగమూ అంతా యింతా కాదు. సచిన్ అవుటయితే ఆ కోపం సోఫా కవర్ల మీదో, పుస్తకాల షెల్ఫు మీదో చూపిస్తారు. లేదా టీ కప్పులు, కాఫీ కప్పులు నేల కేసి కొడతారు. తర్వాత తీరిగ్గా సారీ ఆంటీ, సారీ అంకుల్ అంటూ పళ్ళు యికిలిస్తారు. అసలు ఇలాంటి ఉపద్రవాలేవీ వాళ్ళ ఇంట్లో జరుగకుండా తప్పించు కోవడం కోసమే బుధవారం నాడు పానకాల రావు మా యింటికి వచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కాబోలు. ద్రోహి. ఎంత కపటి ? ఎంత దురాలోచన ?

‘‘ లేదురా, ఈ బుధ వారం మేం ఇంట్లో ఉండడం లేదు. జరూరు పని మీద మా సొంతూరు వెళుతున్నాం ...’’ అంటూ ఓ అబద్ధం చెప్పి తప్పించు కోవాలని పానకాలుకి ఫోను చేద్దామని వాడి నంబరుకి రింగ్ చేసాను. వాడి సెల్ ఆఫ్ చేసి ఉంది. వాళ్ళావిడ నెంబరు కూడా కలవడం లేదు. నానుంచి ఈ రిప్లయ్ ఊహించేడో యేమో, ముందుగానే జాగ్రత్త పడుతున్నారల్లే ఉంది.

జావకారిపోయేం, నేనూ, మా ఆవిడానూ. ఇహ మా బుధ వారం ప్రోగ్రాం సర్వ నాశనమైపోయినట్టే.

ఇలా పనిమాలి పోసుకోలు కబర్ల కోసం వచ్చే వాళ్ళని ఎలా అదపు చేయాలో తెలియక సతమతమై పోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ రాకని ఎలా కట్టడి చేయాలో సరైన సలహా చెబుతాడు కదా అని కథా మంజరి బ్లాగు నిర్వాహకుడికి ఓ మెయిలు పెట్టాను. విషయం అంతా వివరిస్తూ నా గోడు వెళ్ళ బోసుకున్నాను.

ఆ చాదస్తపు బ్రామ్మడు సలహా యివ్వక పోగా, అలా ఇంటి కొచ్చే వారిని అడ్డుకో కూడదనీ, అతిథి సేవాతత్పరత, దిబ్బా దిశిగుండం అంటూ నాకే ఓ చింకి లెక్చరు యిచ్చేడు.పైగా తన మాటలకు ఉపబలకంగా ఏవో సంస్కృత శ్లోకాలూ గట్రా కోట్ చేయడమొకటీనూ. నాకు ఎక్కడో మండింది.

ఆ చింకి లెక్చరు మీరూ వినండి మరి:

నా2భ్యత్థానక్రియా యత్ర, నా22లాసా మధురాక్షరా:
న చా2పి కుశల ప్రశ్న:, తత్ర్త హర్మ్యే న గమ్యతే.

ఎవడి గృహానికి వెళ్తే ఆ యింటి యజమాని లేచి, ఎదురేగి మంచి మాటలతో పలుకరించి, కుశలాదికాలు అడిగి ఆదరించడో అలాంటి వాడి ఇంటికి వెళ్ళ కూడదు.

ఇదీ శ్లోక భావంట. గాడిద గుడ్డేం కాదూ?

చింకి లెక్చర్లో మరి కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడండోయ్

ఉత్తమస్యా2పి వర్ణస్య, నీచో2పి గృహమాగత:
పూజనీయో యథాయోగ్యం, సర్వదేవమయో2తిథి:

పెద్దింటి వాడింటికి చిన్నింటి వాడు వచ్చి నప్పటికీ వానిని యథోచితంగా సత్కరించి, భోజనాదులు సమకూర్చాలి. అతిథి సర్వ దేవమయుడని గుర్తుంచు కోవాలి.

గ్రాసాదపి తదర్ధేన, కస్మాన్నో దీయతే2ర్ధినే,
ఇచ్ఛానురూపో విభవ: కదా కస్య భవిష్యతి.

ఇంటికి వచ్చిన వాడికి ఆ పూట శ్రద్ధతో భోజనం పెట్టాలి. లేదా, తగినంత ధనమైనా యిచ్చి పంపించాలి. వాడే మరో చోట తింటాడు. ఎప్పుడో తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాననడం వట్టి మాట.
తనకు కావలసినంత ధనం ఎప్పుడూ ఎవడి దగ్గరా ఉండడం చూడం కదా. అంచేత, ఎంతుంటే అంతా యిచ్చి పంపాలి.

న్యాయార్జిత ధనసత్త్వ, ఙ్ఞాననిష్ఠో2తిథి ప్రియ:
శాస్త్రవిత్ సత్యవాదీ వా, గృహస్థత్వే2పి ముచ్యతే.

న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించే వాడూ, తత్వ్త ఙ్ఞానం నందు శ్రద్ధ కలవాడూ, అతిథి అభ్యాగతులను ఆదరించి సేవించే వాడున్నూ, శాస్త్రఙ్ఞుడు, సత్యవ్రతుడు అయిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ముక్తిని పొందుతాడు అని ధర్మ శాప్త్రాలు చెబుతున్నాయి.

దాతవ్య మన్నం విధివత్, సత్కృత్య నతు లీలయా
సర్వే వర్ణా యథా పూజాం, ప్రాప్నువంతి సుసత్కృతా:

ఆయా వర్ణముల వారికి యథోచితముగా సత్కరించి, విధివిహితంగా పూజించి అన్నం పెట్టాలి కాని, ఏదోలే అని, తేలిక భావంతో అన్నం పడవేయ కూడదు సుమా !

తృణాని భూమి రుదకం, వాక్చతుర్ధీ చ సూనృతా,
ఏతాన్యపి సతాం గేహే, నోచ్చిద్యంతే కదాచన

అతిథికి అన్నం పెట్టే శక్తి లేక పోయినప్పటికీ, ధార్మికుడైన గృహస్థుని యింట విశ్రమించే చోటు, దాహానికి మంచి తీర్ధం,నాలుగు మంచి మాటలు ... వీటికి లోటు చేయ కూడదు సుమీ.

అరాప్యుచితం కార్యం ఆతిథ్యం గృహ మాగతే
ఛేత్తు: పార్శ్వగతాం ఛాయాం, నోపసంహరతే ద్రుమ:

ఇంటికి వచ్చిన అతిథి, తన శత్రువయినా సరే, ఆతిథ్యం యిచ్చి గౌరవించాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనే ఇస్తోంది కదా.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంస భక్షణమ్.

అతిథి వాకిటిలో ఉండగా వాడిని విడిచి తాను మాత్రమే అన్నం తినడం మహా దోషం. అలాంటి వాడు పట్టిన ఆపోశనం మద్యపానం చేయడంతో సమానం. వాడు తినే అన్నం గోమాంసంతో సమానం.

బాలో వా యది వా వృద్ధో, యువా వా గృహమాగత:
తస్య పూజా విధాతవ్యా, సర్వస్యా2భ్యాగతో గురు:

ఇంటికి అతిథి, అభ్యాగతునిగా వచ్చిన వాడు బాలుడు కానీ, వృద్ధుడు కానీ - అలా వచ్చిన వాడు పూజనీయుడు. వాడిని పూజించ వలసినదే. అభ్యాగతులు గురువుల వలె అందరకీ ఆదరణీయులు.
అల్లసాని పెద్దన మను చరిత్రలో ప్రవరుని అతిధి సేవాతత్పరత గురించి చాలా విలువైన పద్యాలు రాసేడు.
ప్రవరుడు నిత్యం అతిధులూ, తీర్ధ సంవాసులూ వస్తున్నారని వింటే, ఎదురు వెళ్ళి ఇంటికి తీసుకుని వస్తాడుట. తెచ్చి, ఆతిధ్య మిస్తాడుట. ఇచ్చి వారిని సంతృప్తులుగా చేస్తాడుట. చేసి వారి చెంతనే కూర్చుని కుశలాలూ, వారి యాత్రా విశేషాలూ అడిగి మరీ తెలుసు కుంటాడుట. ఆ పిమ్మట, అయ్యో అవేవీ నేను చూడ లేక పోయానే అని విచారిస్తాడు !
‘‘ తీర్ధ సంవాసులేతెంచి నారని విన్న నెదురుగా నేగు దవ్వెంత యైన ’’ అనే పద్యం లో ఈ భోగట్టాలన్నీ పెద్దన చెప్పేడు.
వాళ్ళావిడ కూడా అంతేనుట ! ‘‘ వండ నలయదు వేవురు వచ్చి నేని ...’’
( ఏడిసినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. ఇలాగయితే మూణ్ణాళ్ళలో మన కొంప కొల్లేరు కాదూ ?! )

ఈ విధంగా కథా మంజరి వాడు అతిథి సేవను గురించి చాలా సేపు నాకు ఓ చింకి లెక్చరు యిచ్చి నా బుర్ర తినీసేడు.

చుట్టాల బాధని ఎలా వదిలించు కోవాలో చెప్పరా నాయనా అంటే చింకి లెక్చర్లతో మెదడు తినేసే
( మధ్యలో సంస్కృత శ్లోకాలూ, వాడి పిండాకూడూనూ) ఈ చాదస్తపు బ్లాగరెక్కడ దొరికాడురా బాబూ. ఇహ మీద వాడి కథా మంజరి బ్లాగు నేను చదవను గాక చదవను.

మీరు కూడా చదవొద్దు. ఏం ?!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి