17, మార్చి 2015, మంగళవారం

పోనిద్దురూ ...!!

ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా:
ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాం
గిరిశిఖరగతా2పి కాక పంక్తి:
పులినగతై ర్న సమత్వమేతి హంసై:

లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు.మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు.
కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి.
మరి హంసలో ? నేల మీద నదీ పులినతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !
ఇదీ ఈ శ్లోకార్ధం.
నిజమే కదా, ఉన్నతులు నిగర్వులై, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇడుములు పడుతూ ఉండడం, కుసంస్కారుల చేత నిదాదరణ. తిరస్కారాలు పొందుతూ ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాం.
అలాగే, అధములు ఆడంబర జీవనం గడపడమూ మనకి తెలిసినదే. నిజానికి ఈ పాడు లోకంలో అలాంటి వారికే మన్నన ఎక్కువగా ఉండడం బాధాకరం. కాని, అది లోక రీతి.
ఏం చేస్తాం చెప్పండి?
యస్యాస్తి విత్తం స నర: కులీన: స పండిత: స:శ్రుతవాన్ గుణఙ్ఞ:
స ఏవ వక్తా సచ దర్శనీయ: సర్వే గుణా: కాంచన మాశ్రయన్తి.
ఎవడు ధనవంతుడో వాడు కులీనుడు. పండితుడు. వివేకి. ధన్యుడు. నేర్పరి. ఆహా, అన్ని గుణాలూ బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా !
అయితే, కాలాంతరంలో నయినా ఎవరి విలువలు ఎలాంటివో విశదం కాక తప్పదు. కాకులు కొండ కొనన ఉన్నా, హంసలతో సరి కావు కదా !
పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొన కొమ్మలనుండగ గ్రింద గండభే
రుండ మదేభసింహ నికురంబములుండవె? చేరి భాస్కరా !
చెట్టు క్రింద గండ భేరుండాలు, మదించిన ఏనుగులు, సింహాలు ఉంటూ ఉండగా, ఒక కోతి మాత్రం చెట్టు కొమ్మల చివరన ఎక్కి కూర్చున్నదట. అంత మాత్రం చేత, ఆ మృగములకు వచ్చిన తక్కువతనం ఏమీ లేదు.
అలాగే, మహా పండితులందరూ నేల మీద సుఖాసీనులై ఉంటే, ఒక అల్పుడు ఉన్నతాసనం ఎక్కి కూర్చుంటే ఆ పండితుల గొప్పతనమేమీ తరిగి పోదు.
మణిలాగ కనిపించినంత మాత్రం చేత గాజు పూస మణి కాజాలదు. గాజు గాజే.మణి మణే
అలాగే, వసంత కాలం వచ్చినప్పుడు కదా, కాకి ఏదో, కోకిల ఏదో తెలియవచ్చేది ?!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి