20, మార్చి 2015, శుక్రవారం

నటనాలయమ్


జీవితమే ఒక నాటక రంగం అనే విషయాన్ని భర్తృహరి తన వైరాగ్య శతక విభాగంలో ఇలా వివరించాడు:

క్షణం బాలో భూత్వా క్షణ మపి యువా కామరసిక:
క్షణం విత్తైర్హీన: క్షణమపి చ సంపూర్ణ విభవ:
జరాజీర్ణై రంగై: నట ఇవ వలీమండితతను:
నర స్సంసారాంతే విశతి యమధానీయవనికామ్.

మానవులు నటుల వలె రకరకాల పాత్రలు కొంత సేపు ధరిస్తారు. ఆ తర్వాత, ఆ వేషం కాస్త తీసివేసి, చివరకి రంగస్థలం నుండి నిష్క్రమిస్తారు. మీది శ్లోకం ఆ విషయమే చెబుతోంది:

కొంత కాలం పసి వారుగా , కొంత కాలం రసికులయిన యువకులుగాను, కొంత కాలం పరమ దరిద్రులుగానూ, మరి కొంత కాలం గొప్ప సంసన్నులుగానూ నటిస్తారు. చివరకు అవయవాలన్నీ అశక్తాలయిపోయాక, శక్తులన్నీ ఉడిగి పోయాక, ఒళ్ళంతా ముడుతలు వారి, వణుకుతూ దీనులుగా నటిస్తారు. లోకంలో తమ పాత్ర పూర్తయేక,యమపురికి చేరుకుంటారు.

ఈ శ్లోకంలో కవి మానవుల జీవిత కాలంలో వచ్చే వివిధ దశలను గురించి ప్రస్తావించేడు. ఆయా దశలలో సంభవించే పరిణామాలను విశదీకరించేడు. జీవన గమనంలో ఎదురయ్యే పతనాభ్యుదయాలను ఎత్తి చూపాడు. కడకు మానవ జీవిత నాటకానికి మరణమనే యవనిక ఎలా పడుతుందో నిరూపించేడు.

వార్ధక్యం అనివార్యం అనీ తెలుసును. మరణం అవశ్యం అనీ తెలుసును. కానీ, విషయ వాంఛలకు మాత్రం దూరంగా జరగడం మానవులకు రుచించదు.

దానికి సంబంధించిన శ్లోకం చూసే ముందు సరదాగా ఈ బాపు గారి కార్ట్యూన్ చూసి. పడి పడి నవ్వుకోండి:



చూడండి:

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయు: పరిశ్రవతి భిన్నఘటా దివాంభో,
లోక స్తథా ప్యహిత మాచరతీతి చిత్రమ్ !

ముసలితనం ఆడుపులిలా బెదిరిస్తూ మీద పడుతోంది.
వ్యాధులు శత్రువులాగున శరీరాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఆయువు పగిలిన కుండ లోని నీటిలాగా తరిగి పోతోంది.
అయినా, లోకం తనకు ఏది హితం కాదో దానిని విడిచి పెట్టకుండా చేస్తూ ఉంది.
ఏమి చిత్రం !

మానవుల విషయ వాంఛల తీవ్రత ఎలాంటిదో మరొక శ్లోకంలో కూడా ఇలా వివరించాడు:

వలిభి ర్ముఖ మాక్రాంతం, పలితై రంకితం శిర:
గాత్రాణి శిధిలాయంతే, తృష్ణైకా తరుణాయతే.

ముఖం ముడుతలు పడిపోయింది. జుట్టు నెపి పోయింది. ముగ్గు బుట్టలా తయారయింది. అవయవాల బిగి సడలి పోయింది. అన్నింటా ముసలితనం దాపురించింది.

ఇక, పరువంలో నవనవలాడుతూ ఉన్నదేమిటయ్యా, అంటే, కోరిక ఒక్కటే.


స్వస్తి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి