మంచి పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచి పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2010, సోమవారం

మన కోసం వెలువడింది, ఓ మంచి కథా సంకలనం !


ముఖ పత్రం చూస్తూనే తెలిసి పోతోంది కదూ , ఈ కథలన్నీ రైలు జీవితాలకి చెందిన కథలని.
నిజమే, రైలు నేపథ్యంలో మానవీయ కోణంలో అనేక అంశాలని తాకుతూ హృద్యంగా సాగిన 20 గొప్ప కథలున్న మంచి కథా సంకలనం యిది !

ఇందులో ప్రతీ కథా హృదయ సంబంధి. గుండె గూడు పట్లు కదిలించి వేసే కథలివి.
రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భాను దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ ట్రాఫిక్ ఇనస్పెక్టర్ గా పని చేసే రోజులలో దేశంలో చాలా ప్రాంతాలు ఉద్యోగ రీత్యా చుట్ట బెట్టి వచ్చేరు.

అలా సంపాదించిన అపూర్వానుభవంతో రైలు జీవితాల గురించి అద్భుతమైన కథలు మనకందించేరు.ఈ కథలన్నీ లోగడ నవ్య వార పత్రికలో ధారావాహికంగా వచ్చి విశేషంగా పాఠకులని అలరించాయి.

ఈ రచయిత వివిధ సాహితీ ప్రక్రియల మీద ఎనలేని మమకారం పెంచుకున్న వ్యక్తి. కథారచయితగా దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలోను కథలు వెలువరించారు. ఆంధ్ర జ్యోతి ఆదివారం, ఈనాడు ఆదివారం, సితార సంచికలకు ఫ్రీ లాన్సర్ గా అనేక రచనలు చేసారు ; చేస్తున్నారు.

ఈనాడు ఆదివారంలో ప్రాచుర్యం పొందిన ‘ఇది కథ కాదు’ శీర్షికను ‘తేజస్వి’ కలం పేరుతో నిర్వహించారు.
అనేక నృత్య రూపకాలను టీ.వీ ల కోసం రచించారు. ఆకాశ వాణిలో చాలా గేయ రూపకాలు ప్రసారమయ్యాయి. హిందీ, కన్నడ భాషల ధారావాహికలకు తెలుగులో డబ్బింగ్ రచన కూడా చేసారు. నవ్య వీక్లీలో వీరి ‘కలకండ పలుకులు’ శీర్షిక బహుళ జనాదరణ పొందింది. ప్రస్తుతం అదే పత్రికలో ‘వెండి తెర వర ప్రసాదం’ పేరుతో ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్ర మనకి అందిస్తున్నారు ...


ఈ ‘ పొగబండి కథలు ’ చదవడం ఒక అపూర్వమైన అనుభవం కాగలదు.

ఈ కథలకి ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి గారు మనసుకుంచెతో గీసిన చిత్రాలు ఈ కథల పుస్తకంలో మరో అదనపు ఆకర్షణ !


ఈ పుస్తకం గురించి ఎవరేం అంటున్నారో చూడండి ....

శ్రీ శ్రీనివాస భానుగారు రాసిన ‘ పొగబండి కథలు’ రైలు నేపథ్యంగా మానవీయ కోణంలోని అనేక అంశాలని స్పృశిస్తూ హృద్యంగా సాగాయి, జున్ను కోరిన భార్య కోరిక తీర్చడానికి భర్త పడే ఆరాటం, బ్యూరోక్రసీతో వచ్చిన హిపోక్రసీతో గతంలోకి వెళ్ళడం, ఇలా అనేక అంశాలని, అనుభూతులని ఈ పొగబండి మృదువుగా, నిశ్శబ్దంగా మన ముందుకి తెచ్చి, మన లోని అనుభూతులని కూడా తట్టి లేపుతుంది.
పూర్వం కృష్ణాతీరం నేపథ్యంలో వచ్చిన ‘అమరావతి కథలు’ ఒరవడిలో ఎలాంటి బ్రేకులు లేకుండా సాగే ‘పొగబండి కథలు’ మనకందించిన ఓలేటి వారికి అభినందనలు.

- మల్లాది వెంకటకృష్ణమూర్తి

జీవితాన్నీ, జీవిక కోసం చేపట్టిన వృత్తినీ మనసారా ఆస్వాదించ గలిగే వ్యక్తికి మాత్రమే ఆసక్తికరమైన కథనాలతో నలుగురినీ మెప్పించ గలిగే తలపోతలుంటాయి. ఇక, ఆ వ్యక్తి సమర్ధుడైన రచయిత అయితే చెప్పే పని లేదు. తన స్మృతి పేటికలో భద్రపరచిన ఒక్కో ఙ్ఞెపకాన్నీ చక్కని చిక్కని కథగా అక్షర బద్ధం చేయగలుగుతాడు. ఓలేటి శ్రీనివాసభాను ‘పొగబండి కథలు’ అందుకు నిలువెత్తు నిదర్శనం. రైల్వేలకు చెందిన సాంకేతిక విషయాల జోలికి అంతగా పోకుండానే ఆ జీవిత పార్శ్వాలనీ , అపురూప కోణాలనీ ఆర్ద్రంగా చిత్రీకరించిన కథలివి. నిత్య జీవితంలో ఇతర సామాజిక వర్గాలతో కలగలిసి పోతూనే, కాస్త ఎడంగా ఉన్నట్టు తోచే రైలు బతుకుల్లో విస్మయ పరిచే బతుకులెన్నో ఉన్నాయి. వాటిని ఒడుపుగా పట్టుకుని పదే పదే చదివించే కథలుగా మలచడంలో రచయిత సఫలీకృతుడయ్యాడని నా నమ్మకం. ఈ కథలు చదివితే మీరూ ఆ మాట కాదన లేరు .


- పంతుల జోగారావు


‘ పొగబండి కథలు’ పుస్తక రూపంలో వస్తున్నాయంటే నాకు మించిన ఆనందం ఇంకెవరికీ ఉండదేమో ! జీవితంలోంచి వచ్చిన కథలివి. కథే బొమ్మ వేయించు కొంటుంది. అందు వల్ల బొమ్మలూ బాగానే కుదిరాయి. ‘నవ్య’ వీక్లీలో ఇవి వచ్చినన్నాళ్ళూ పాఠకులు అబ్బుర పడ్డారు. తిరిగి ఈ కథలతో పాటు నా బొమ్మలు ఈ రూపంలో పాఠకుల చేతికందడం సంతోషదాయకం.


- శ్రీబాలి.


క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ వారు ప్రచురించి ఇటీవల విడుదల చేసిన ఈ కథల సంపుటి కథా ప్రియులని ఎంతగానో అలరిస్తుందని చెప్పడానికి ఇందులోనుండి మచ్చుకి ఒక కథ ....















ఈ కథల పుస్తకం మీద నవ్య వార పత్రిక తే 19-5-2010 దీ సంచికలో బుక్ చాట్ శీర్షిక క్రింద వచ్చిన సమీక్ష
చూడండి .....





2, జనవరి 2010, శనివారం

పాల పిట్ట కథలు - మన చిన్నారుల కోసం ఓ మంచి పుస్తకం !

Posted by Picasa మన చిన్నారులకి మనం యిచ్చే మంచి బహుమానం ఓ కొత్త బొమ్మ, ఓ బొమ్మల చొక్కా, ఓ పువ్వుల గౌను, ఓ రంగు రంగుల బెలూను, ఓ మంచి పెన్ను, కలర్ పెన్సిల్స్ ... ... ఇలాంటివే కదా?

కాదు ... కాదు ... వీటితో పాటు ... ఓ మంచి రంగు రంగుల పిల్లల పుస్తకం ! పెద్దక్షరాల పిల్లల పుస్తకం ! ... అందులో రాక్షసులూ , మాంత్రికులూ, మాట్లాడే చెట్లూ, పలకరించే గాలులూ, తమతో పాటు ఆడుకునే పక్షులూ, పిట్టలూ. జంతువులూ, ఎగిరి పోవడాలూ , మాయమైపోవడాలూ, ప్రత్యక్షమవడాలూ ... యింకా చాలా చాలా ... ఉండాలి ... ఉంటాయి కూడానూ ...
అప్పుడు చూడాలి వాళ్ళ కళ్ళలో మెరుపు !
అప్పుడు చూడాలి వాళ్ళ ముఖంలో ఆనందతాండవం !
అప్పుడు చూడాలి వాళ్ళ పెదాల మీద వెన్నెల విరజిమ్మినట్టు చిరు నవ్వు ...

చిన్నారి చేతులతో వాటిని అందుకుంటూ, థాంక్యూ మమ్మీ, థాంక్యూ డాడీ ... అంటూ పలికే ఆ చిన్నారుల చిలుక పలుకులని విని పరవశించి పోవాలని మనకుండదూ?

ఈ కొత్త సంవత్సరం మొదలవుతూనే, మన పిల్లలకి అపురూప బహుమతిగా యివ్వ తగిన ఒక చక్కని పుస్తకం పాల పిట్ట ప్రపంచ జానపద కథలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కొత్తగా వెలువరించారు!

కొత్త సంవత్సరం ( 1 - 1 - 2010 ) రోజున విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి ఈ పాల పిట్ట పిల్లల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఎ.ఎన్.జగన్నాధ శర్మ 27 ప్రపంచ ప్రసిద్ధ జానపద కథలను అందమైన , సరళమైన శైలిలో, పిల్లను అమితంగా ఆకట్టుకునే రీతిలో, చక్కని బొమ్మలతో వెలువరించిన పిల్లల పుస్తకం - పాల పిట్ట.

పత్రికా రచయిత, నవ్య వార పత్రిక సంపాదకులు, నవలా కథా రచయిత, టి.వి, సినిమా రచయితగా ప్రసిద్ధులైన శ్రీ జగన్నాధ శర్మ బాల సాహిత్యం మీద ఎనలేని మక్కువతో ప్రపంచ ప్రఖ్యాత జానపద కథలను పాఠకులకు అందించారు.
ప్రముఖ కవి శివారెడ్డి ఆవిష్కరించిన ఈ పాల పిట్ట పిల్ల పుస్తకం రూ. 90 లకే లభ్యమైతోంది.
‘‘ ఈ పాల పిట్టలోకి అడుగు పెట్టడమంటే, మనం మరిచి పోయిన దేశంలోకి, కొత్తగా అడుగు పెట్టడమే ! కొత్త రుతువులకి రెప రెపలాడే కిటికీలను తెరవడమే!’’ ... అంటున్నారు రమణ జీవి.

‘‘ ఈ కథల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళి పోతారు. అమ్మమ్మలూ, నాన్నమ్మలూ చెప్పిన జానపద కథల్లోని మాయాప్రపంచంలో విహరిస్తారు పరుగుల ప్రపంచపు బాధలనుంచి కాస్త ఉపశమనం పొందుతారు ...’’ అంటున్నారు సుంకోజి దేవేంద్రాచారి.

‘‘ నా బాల్యంలో పెద్దలెవరయినా నాకు మంచి మంచి పిల్లల కథలు చెప్తే బావుండునని అనుకునే వాడిని.... కాని, మా కుటుంబ నేపథ్యం కారణంగా ఆ కోరిక సాంతం నెరవేర లేదు ... ఆ కోరిక యిప్పుడిలా తీర్చుకుంటున్నాను! ...
మా చిన్నారి మనవరాలు చిరంజీవి లాహిరికి ఎన్నో మంచి మంచి , గొప్ప గొప్ప పిల్లలల అద్భత కథలు చెప్పాలి. నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి ... అందుకే ఈ పాల పిట్ట కథలు రాసాను ...’’ అని రచయిత ఆవిష్కరణ సభలో ఒకింత ఉద్వేగానికి లోనవుతూ చెప్పారు ...


మరి, యింత మంచి పుస్తకాన్ని మనమూ మన పిల్లలకి బహుమతిగా కొని యిద్దామా?